శానిటైజర్ చావులు కావు.. జగన్ సర్కారు హత్యలు!
posted on Mar 23, 2021 @ 12:03PM
వాళ్లంతా నిరు పేదలు.. రోజువారీ కూలీ చేసుకుని జీవితం గడిపేవారు. రోజంతా కష్టపడి పని చేసే ఆ కూలీలకు సాయంత్రం మద్యం తాగడం అలవాటు. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ మద్యం ధరలను భారీగా పెంచింది. దీంతో మద్యానికి అలవాటు పడిన పేదలు.. ఎక్కువ ధరకు మద్యం కొనలేక అవస్థలు పడ్డారు. మత్తుకు బానిసలుగా మారడంతో మర్చిపోలేకపోయారు. లిక్కర్ కు బదులుగా శానిటైజర్ తాగారు. మత్తు కోసం నీళ్లలో శానిటైజర్ కలుపుకుని తాగారు. శానిటైజర్ డోస్ ఎక్కువ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరూ ప్రాణాలు కూడా కోల్పోయారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగడం వల్లే విజయవాడ వన్టౌన్కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు.
శానిటైజర్ తాగి ఇద్దరు చనిపోయిన ఘటనకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యపాన నిషేదం పేరుతో మహిళల ఓట్లు దండుకున్న సీఎం జగన్.. మద్యం అమ్మకాలు, రేట్లు పెంచి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. సీఎం మద్యం ధరలు పెంచి పేదల రక్తం తాగుతున్నారన్నారు. మద్యం రేట్లు పెరగడంతో సామాన్యులు తన రోజు కూలీ మొత్తం మద్యానికే ఖర్చు చేస్తూ వారి కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మద్యానికి అలవాటుపడిన వారు మద్యలో మానలేక, పెరిగిన ధరలకు మద్యం కొనలేక డబ్బుల కోసం ఇంట్లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని, మరికొంత మంది శానిటైజర్ తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం రేట్లు పెరిగాక రాష్ట్రంలో శానిటైజర్, నాటుసారా తాగి సుమారు 50 మంది చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు జవహర్. పక్కనున్న తెలంగాణలో దేశంలో లభించే బ్రాండ్లన్నీ లభిస్తుంటే ఏపీలో మాత్రం జగన్ సొంత బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, వాలంటీర్లే మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని, మద్యం రేట్లు పెంచి, అమ్మకాలు పెంచి ప్రభుత్వానికి ఖజానా నింపుకోవాలన్న ధ్యాస తప్ప మద్యపాన నిషేధం అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలకు అర్ధమైందని జవహర్ మండిపడ్డారు.