బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం.. అసోంలో దుమారం
posted on Apr 2, 2021 @ 4:20PM
ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఉపయోగిస్తున్న ఈవీఎంలపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకా ఈవీఎంలపై ఆరోపణలు పెరిగిపోయాయి. అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. అక్కడ వెలుగుచూసిన ఘటన సంచలనంగా మారింది. పోలింగ్ అయిపోయాక ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్లడం కలకలం రేపుతోంది.
పోలింగ్ అయిపోయాక ఈవీఎంలను అధికారిక వాహనంలో తీసుకెళ్లాలి. కానీ అసోంలో ఓ బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్లారు. ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ లోని రాతాబరీ నియోజకవర్గంలో జరిగింది. ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేతలు.. వెంటనే కారును ఆపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య పేరిట ఉన్న ఆ కారును అడ్డుకున్న ప్రతిపక్ష సభ్యులు.. ఆందోళనలకు దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎన్నికల్లో అధికార బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈవీఎం తరలింపుపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించింది.
కరీంగంజ్ ఘటనపై నిజనిర్ధారణ నివేదికను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తీసుకెళ్లే క్రమంలో.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో నీలం బజార్ కు దగ్గర్లోనే వాహనం బ్రేక్ డౌన్ అయిందని పేర్కొంది. అప్పటికే వాతావరణం బాగాలేకపోవడం, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడంతో అటుగా వచ్చిన వాహనాన్ని లిఫ్ట్ అడిగి తీసుకున్నామని చెప్పింది. ఆ వాహనంలోని ఎన్నికల సిబ్బంది వెంటనే సెక్టార్ ఆఫీసర్ అజయ్ సూత్రధార్ కు ఫోన్ చేశారని, ఆయన వాహనం ఏర్పాటు చేసే లోపే అటుగా వస్తున్న వాహనాన్ని అధికారులు లిఫ్ట్ అడిగారని చెప్పింది. ఆ వాహనం ఎవరిదో తెలియకుండానే అధికారులు ఆపారని, స్ట్రాంగ్ రూం వద్ద ప్రతిపక్ష కార్యకర్తలు ముట్టడించి దాడి చేసినప్పుడే ఆ కారు బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమిత పాల్ దిగా తెలిసిందని వెల్లడించింది.
రాత్రి 10 గంటలకు కనైశిల్ కు చేరుకున్న తర్వాత.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనం ట్రాఫిక్ లో ఆగిందని, అప్పుడే 50 మంది దాకా గుంపుగా వచ్చి కారుపై రాళ్లతో దాడి చేశారని చెప్పింది. ఆ వాహనం బీజేపీ నేతదని ఆ గుంపుకు నాయకుడు చెప్పాడని తెలిపింది. అప్పుడే అది బీజేపీ అభ్యర్థి కారని తెలిసిందని చెప్పింది. వారు హింసకు పాల్పడి దాడి చేయడంతో కరీంగంజ్ ఎస్పీకి గాయాలయ్యాయని తెలిపింది. పోలింగ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించినందుకు పోలింగ్ అధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశామని ఎన్నికల సంఘం తెలిపింది.