ఏపీ కరోనా బలహీనమైందే! భయం వదన్న కేంద్రం 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉండటంతో వేగంగా విస్తరిస్తోంది. రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా భారీగా ఉంటున్నారు. అధికారికంగా సర్కార్ చెబుతున్న లెక్కలకంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కరోనా రోగుల మరణాలు ఉంటున్నాయని చెబుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏపీలో గుర్తించిన  వైరస్ అత్యంత బలమైనదనే భయాందోళన వ్యక్తమవుతోంది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనే ప్రచారంతో ఏపీ జనాలు హడలిపోతున్నారు.  అయితే ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పింది కేంద్ర బయోటెక్నాలజీ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా రకంపై  స్పష్టతనిచ్చింది. ఏపీలో వెలుగు చూసిన రకం అంత బలమైనదేమీ కాదని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు. వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్.440కె రకం బయటపడిందని, అయితే అంతే వేగంగా అది మాయమైందని అన్నారు. దాని విస్తరణ కనిపించలేదని స్పష్టం చేశారు. దాని క్లినికల్ ప్రభావం కూడా ఏమీ కనిపించలేదన్నారు.  ప్రస్తుతం దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా కొత్త వైరస్ రకాలేమీ లేవని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ పేర్కొన్నారు. ఇది వ్యాప్తి పరంగా, తీవ్రత పరంగా ప్రభావం చూపుతోందన్నారు. బి.618 రకాన్ని కనుగొన్నప్పటికీ అది త్వరగానే అంతర్థానమైందని రేణు స్వరూప్ తెలిపారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు.. దేశంలో కల్లోలమేనా! 

దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారిపై మరో షాకింగ్ న్యూస్. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ పంజా విసురుతుండగా... కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి థర్డ్‌ వేవ్‌ తప్పదనిదంటూ బాంబు పేల్చారు. థర్డ్ వేవ్‌ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదన్నారు విజయరాఘవన్. అంతేకాదు థర్డ్‌ వేవ్‌ నాటికి వైరస్‌ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు  కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని విజయరాఘవన్‌ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని తెలిపారు. దేశంలో మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా విజృంభణ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.ఒక్క రోజుకు చనిపోతున్న సంఖ్య రోజు  రికార్డు స్థాయిలో 3,780కి పెరిగింది. ప్రపంచ కేసులలో 46 శాతం భారత్ వాటా ఉందని, గత వారంలో ప్రపంచ మరణాలలో నాలుగింట ఒక వంతుగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వీక్లీ నివేదికలో వెల్లడించింది.  మరోవైపు దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై  హెచ్చరికలపై బీజేపీ ఎంపీ  సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి కేంద్ర మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం సూచించారు స్వామి. తాజాగా ఇదే విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తూ  ‘‘కోవిడ్ థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్నారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని నేను రెండు రోజుల క్రితమే హెచ్చరించాను. ఈరోజు నీతి అయోగ్ సభ్యుడు కూడా కోవిడ్ థర్డ్ వేవ్‌ను నిర్ధారించారు. కోవిడ్‌ను అరికట్టడానికి సరైన వ్యూహరచన వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పీఎంవో సైకోలు కాకుండా ప్రత్యేకమైన టీం కావాలి’’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.   

ప్రాణాలు పోతున్నా పట్టదా! ఏపీ ప్రభుత్వంపై బాబు ఫైర్ 

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. అతి తీవ్రమైన కరోనా సమస్యకు మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యత కల్పించలేదని చంద్రబాబు విమర్శించారు. కేబినెట్ మీటింగ్ లో 33వ అజెండాగా కరోనాను చేర్చారని మండిపడ్డారు. రూ.వేలకోట్లు దుబారాకు ఖర్చు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువేంటని ప్రశ్నించారు.  కొవిడ్‌ రెండో దశ చాలా ఉద్ధృతంగా ఉందని.. ఏపీ నుంచి వెళ్లేవారికి పొరుగు రాష్ట్రాలు నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నాయన్నారు చంద్రబాబు. తమ ప్రజలకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఏపీ పట్ల ఆంక్షలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కొత్త స్ట్రెయిన్‌ ఎన్‌440కె కర్నూలులో ప్రారంభమై దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతుంటే.. దీనిపై అప్రమత్తంగా లేకుండా ఎన్‌440కె అసలు లేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పడకల కొరత లేదంటూ అసత్యాలు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాదని, ఏకంగా ముఖ్యమంత్రే సమీక్ష చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు.  పార్టీ పరంగా కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్నామని.. ఆన్‌లైన్‌ ద్వారా వైద్య సూచనలు అందజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం ఇచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.తమ ఆఫీసులో కొందరికి కరోనా వచ్చిందని, అయితే అమెరికా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించామని చెప్పారు.ప్రభుత్వానికి ఎన్నో వనరులున్నాయని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని చంద్రబాబు అన్నారు.  

మోదీకి మూడిన‌ట్టేనా? కాషాయం క‌నుమ‌రుగేనా?

బెంగాల్‌లో బేజార్‌. కేర‌ళ‌లో ఖ‌తం. త‌మిళ‌నాడులో తుస్. ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన మూడు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీని బండ‌కేసి కొట్టారు ఓట‌ర్లు. ఉప ఎన్నిక‌లు జ‌రిగిన ఏపీ, తెలంగాణ‌లోనూ క‌మ‌లం పార్టీ ఖ‌ల్లాస్‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే కాదు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని స్థానిక సంగ్రామంలోనూ బీజేపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది.  యూపీలో బీజేపీ అధికార పార్టీ. ఆ యూపీ ద‌య వ‌ల్లే మోదీ రెండుసార్లు ప్ర‌ధాని కాగ‌లిగారు. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు ఓడిపోవ‌డం క‌మ‌ల‌నాథుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ప్ర‌ధాన మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో.. 40 జిల్లా పంచాయ‌తీ స్థానాలుంటే అందుకే కేవ‌లం 8 సీట్ల‌కే బీజేపీ మ‌ద్ద‌తుదారులు ప‌రిమిత‌మ‌వ‌డం ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం. ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలోనూ సేమ్ సీన్‌. 40 సీట్ల‌లో బీజేపీ కేవ‌లం 6 చోట్ల మాత్ర‌మే గెలువ గ‌లిగింది. అంటే, హిందుత్వ నినాదం నుంచి ప్ర‌జ‌లు దూరం జ‌రుగుతున్న‌ట్టేనా? రాజకీయంగా కీల‌క‌మైన వారణాసి, అయోధ్యలో బీజేపీ ఓడిపోవ‌డం దేనికి సంకేతం?  ప్ర‌ధాని మోదీ ప్రాభ‌వం అధఃపాతాళానికి ప‌డిపోతోందా?  దేశ వ్యాప్తంగా క‌మ‌ల వికాసం మ‌స‌క‌బారుతోందా?  అటు.. కర్ణాటకలోనూ అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఒకే ఒక్క స్థానానికి ప‌రిమిత‌మై ప‌రువు పోగొట్టుకుంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే బళ్లారి కార్పొరేషన్ సైతం కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. బళ్లారిలో గాలి సోదరులకు గ‌ట్టి షాక్ తగిలింది.  ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌లోనే ఎంతోకొంత బ‌ల‌మున్న బీజేపీ ఇప్పుడు అక్క‌డ కూడా చ‌తికిల ప‌డుతోంది. మోదీ ఇమేజ్ డ్యామేజ్ అవ‌డ‌మే ఇందుకు కార‌ణం అంటున్నారు. ద‌క్షిణాదిన ఇప్ప‌ట్లో పువ్వు గుర్తు అధికారంలోకి రాలేద‌ని.. తాజా ఎన్నిక‌ల‌తో తేలిపోయింది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫ‌లితాల‌తో.. ఇక సౌత్‌పై కాషాయం ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే.  అటు, ఉత్త‌రాదిలోనూ బీజేపీ ప‌రిస్థితి ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. గెలుస్తామ‌నుకున్న బెంగాల్‌లో.. బెంబేలెత్తిపోయింది బీజేపీ. మోదీ, అమిత్‌షా, జేపీ న‌డ్డాలు.. ముగ్గురూ క‌లిసి దాదాపు 100 వ‌ర‌కూ ఎన్నిక‌ల ర్యాలీలు నిర్వ‌హించగా.. జ‌స్ట్‌, వీల్ ఛైయిర్‌లో కూర్చొని, త‌న‌పై దండెత్తి వ‌చ్చిన క‌మ‌ల‌దండును దంచికొట్టింది దీదీ. బెంగాల్ టైగ‌ర్ పంజా దెబ్బ‌కు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. మ‌మ‌త బ‌ల‌మెంతో క‌మ‌ల‌నాథుల‌కు తెలిసొచ్చేలా చేసింది.   యూపీలోనూ కాషాయం వెల‌వెల‌పోతోంది. హిందుత్వ నినాదం పాత చింత‌కాయ ప‌చ్చ‌డిగా మారింది. మోదీ మాట‌ల‌ను, యోగి చేష్ట‌ల‌ను.. ఎల్ల‌ప్పుడూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. యూపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో ప‌రాభ‌వ బారంతో కుమిలిపోతున్నారు కాషాయ శ్రేణులు. ఇక‌, ఢిల్లీలో కేజ్రీవాల్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. పంజాబ్‌లో కెప్టెన్ సాబ్ క‌ర్చీఫ్ వేసుకున్నారు. రాజ‌స్థాన్, గుజ‌రాత్‌లో 50-50. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన పాగా. ఇలా లెక్కేస్తూ పోతే.. చిన్నా చిత‌కా రాష్ట్రాలే క‌మ‌లం ఖాతాలో క‌నిపిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాల‌న్నీ ప్రాంతీయ పార్టీలో జాబితాలో చేరిపోయాయి. మరో ఏడెనిమిది నెలల్లో జరగాల్సిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నిక‌లు.. వచ్చే ఏడాది ఆఖర్లో జరగాల్సిన హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మోదీ, అమిత్ షా నాయకత్వానికి మరింత అగ్నిపరీక్షగా మారతాయనడంలో సందేహం లేదు.  మాట‌లు త‌ప్ప మోదీ చేసేదేమీ లేద‌నే అభిప్రాయానికి ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన‌ విభ‌జ‌న హామీలేవీ నెర‌వేర్చ‌న‌ప్పుడే మోదీ మాట మీద నిల‌బ‌డే మనిషి కాద‌ని తేలిపోయింది. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేస్తున్నా మౌనంగా ఉంటుండ‌టం ఆయ‌న హోదాకే మ‌చ్చ తెస్తోంది. ఇక‌, ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో మోదీ అవ‌లంభిస్తున్న‌ ఉదాసీన వైఖ‌రి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. దేశ ప్ర‌జల ప్రాణాలు బ‌లిపెట్టి.. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం.. విదేశాల‌కు వ్యాక్సిన్ ఎగుమ‌తి చేశార‌నే అప‌వాదు ఆయ‌న్ను వెంటాడుతూనే ఉంది. వీడియో ప్ర‌సంగాలు మిన‌హా.. కొవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌ధాని చేసిందేమీ లేద‌నే అభిప్రాయం దేశ ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుపోయింది. అందుకే, ఎక్క‌డ‌, ఎలాంటి ఎన్నిక‌లు జ‌రిగినా.. వాటిలో బీజేపీకి ప‌రాభ‌వ‌మే ఎదుర‌వుతోంది. యావ‌త్ దేశాన్ని కాషాయమ‌యం చేయాల‌నే క‌మ‌ల‌నాథుల క‌ల‌.. క‌ల్లే కానుంది. యావ‌త్ దేశం నుంచి కాషాయ పార్టీ తుడుచుకుపెట్టుకు పోయే ప‌రిస్థితి వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు మోదీ.. ఒట్టి మాట‌లు క‌ట్టిపెట్టి.. గ‌ట్టి మేలు త‌ల‌పెట్ట‌వోయ్‌...

పీఎంవో వేస్ట్.. గడ్కరీ బెస్ట్! బీజేపీ నేత సంచలనం

దేశంలో కరోనా మహ్మమారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ లో దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందుక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లోని హాస్పిటల్స్ లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం వల్లే దేశంలో కరోనా విజృంభిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని అంతర్జాతీయ మీడియా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది. మన దేశంలోని విపక్షాలు మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. తాజాగా మోడీపై సొంత పక్షం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర సర్కార్ తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రధాని కార్యాలయంపై ఆధారపడటం అనవసరమని.. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలని చెప్పారు. పీఎంఓపై ఆధారపడటం దండగని అన్నారు సుబ్రహ్మణ్యస్వామి.  అయితే తాను కేవలం ప్రధాని కార్యాలయాన్నే విమర్శిస్తున్నానని... ప్రధాని మోదీని కాదని వివరణ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. హర్షవర్ధన్ తన అధికారాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఉందని చెప్పారు. గడ్కరీతో కలిస్తే హర్షవర్ధన్ విజయవంతమవుతారని అన్నారు. మన దేశం మరో కరోనా వేవ్ ను ఎదుర్కోబోతోందని స్వామి హెచ్చరించారు. ఈ వేవ్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోందని... ప్రతి ఒక్కరు కట్టుదిట్టమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు సుబ్రహ్మణ్యస్వామి. 

నర్సు పై.. డాక్టర్..  

అది తెలంగాణ. జగిత్యాల జిల్లా. అది ఓ ప్రైవేటు అసుపత్రి. ఆ డాక్టర్ పేరు రాజేష్. మూడు నెలల క్రితం జగిత్యాల పట్టణంలో ఓ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ మధ్యనే కోవిడ్ ఆసుపత్రిగా అనుమతులు లభించాయి. సదువుకున్నోడి కంటే ఆడు ఎవడో మేలు అన్నట్లు..  గీ.. డాక్టర్ చదువైతే సదివిండు గానీ..  వాడి ముద్ది మాత్రం గడ్డి తినింది. మెదడు మోకాళ్ళలో ఉంది. అందుకే వాడికి ఆడోళ్ళ వాసనా కావాల్సి వచ్చింది ఆ దరిద్రపు గొట్టు డాక్టర్ కు. అందుకోసం అక్కడ ఇక్కడ ఎందుకని ఆసుపత్రిలో పని చేస్తున్న సాటి నర్సు పైనే  ఆ డాక్టర్ పాపపు కండ్లు పడ్డాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి.​ నర్సు కొవిడ్ పేషంట్లకు సంబంధించిన పరీక్షల రిపోర్టులను వైద్యుడు రాజేష్‌కు చూపించేందుకు గదిలోకి వెళ్ళింది. అంతటితో ఇదే అదును అని పసిగట్టిన ఆ కామాందుడు. నర్సుతో నీకు జీతం ఎంత ఇస్తున్నారని, ఇంతకంటే ఎక్కువ జీతం ఇప్పిస్తానని చెప్పి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.  కట్ చేస్తే.. ఆ  వైద్యుడి పై, నర్సు కోరుట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలిసులు డాక్టర్ ఆణిముత్యం పై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రోజున సినాఫ్ ఎఫెన్స్ క్రింద డిఎస్పీ ఆసుపత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో పనిచేసే నర్సు పైనే వైద్యుడు ఇలా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది, రోగులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఏమున్నది గర్వకారణం.. నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు, అక్రమాలు తప్పా.. సవుడుకున్నోడికి సదువుకోనోడికి తేడాలేకుండా పోయింది. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే అన్ని మర్చిపోతారు పోరికిగాళ్ళు.. పోరంబోకులు. తమ అక్క తమ చెల్లి ఒక ఆడదే కదా అని మరిచిపోతారు. మృగంలా పై బడుతారు.   

మరాఠీలకు నో రిజర్వేషన్..  

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరాఠి సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ వార్త తో మహారాష్ట్రలోని మరాఠి ప్రజలు ఒక్కసరిగా కలత చెందారు. గతంలో రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఇది అధిగమించిందని హై కోర్టు తెలిపింది. 2018లో మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్‌ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే, కోటాను 16 శాతం నుంచి విద్యాసంస్థల ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగ నియామకాల్లో 13 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తుది తీర్పును వెలువరించింది. ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా మారాఠాలకు రిజర్వేషన్‌ కల్పించారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. గతంలో పార్లమెంటు చేసిన ఓ సవరణ ప్రకారం.. ఒక వర్గాన్ని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన జాబితా(ఎస్‌ఈబీసీ)లో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. రాష్ట్రాలు కేవలం ఆయా వర్గాలను గుర్తించి కేంద్రానికి సిఫార్సు మాత్రమే చేయాలని.. అనంతరం రాష్ట్రపతి వాటిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేరుస్తారని వివరించింది. ఈ కోటా కింద ఇప్పటికే చేపట్టిన నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాలపై తాజా తీర్పు ప్రభావం ఉండబోదని.. వాటిని అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. మండల్‌ తీర్పుగా పేరొందిన ఇందిరా సాహ్నీ తీర్పు (1992)ను  పునఃసమీక్షించాల్సిన అసవరం కూడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది. కోర్టు నిర్ణయం పై మరాఠీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపలంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తాము అభివృద్ధికి మరింత దూరం అవుతామని ఆవేదన చెందుతున్నారు.   

తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్‌! పోలీసుల‌కు ఫుల్ ప‌వ‌ర్స్‌.. హైకోర్టు సీరియ‌స్‌..

తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్ పెట్టండి. నైట్ క‌ర్ఫ్యూ వేళ‌లు పొడిగించండి. ఈ నెల 8వ లోగా నిర్ణ‌యం తీసుకోండి. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌న్నింటినీ ప‌రిశీలించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ప్ర‌భుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ఇక‌పై రోజుకు లక్ష కొవిడ్ టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స, మందుల‌ ధరలు ప్రభుత్వమే నిర్ణయించాలని.. వాటిపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణుల కమిటీ సమావేశాల వివరాలు కోర్టుకు సమర్పించాలి. శ్మశాన వాటికలు, సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో జీవో ఇవ్వాలి. ఆస్పత్రుల ద‌గ్గ‌ర‌ పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాస్కులు ధరించనివారి వాహనాల జప్తు అంశాన్ని పరిశీలించాలి. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే. ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలి. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఆర్టీపీసీఆర్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.   మరోవైపు కరోనా నిబంధనల అమలు పర్యవేక్షణకు 859 పెట్రోలింగ్‌, 1,523 ద్విచక్రవాహనాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. భౌతికదూరం పాటించని సంస్థలపై కేసులు పెడుతున్నామని.. భౌతికదూరం పాటించని వ్యక్తులపై కాదన్నారు. ఇప్పటి వరకు ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు డీజీపీ.  పేరంబుదురు నుంచి ఆక్సిజన్‌ రాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటోందని విచారణ సందర్భంగా డీహెచ్‌ శ్రీనివాస్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం కోరింది. చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలని కేంద్రానికి సూచించింది. క‌రోనా క‌ట్ట‌డికి హైకోర్టే రంగంలోకి దిగ‌డం.. ప‌లు ఆదేశాలు ఇవ్వ‌డంతో.. స‌ర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 

ఈటల రాజేందర్ బ్యాక్ స్టెప్! 

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో రగిలిపోతున్న ఈటల... కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈటల మద్దతుదారులు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈటల సీఎం సీఎం అంటూ నినదిస్తున్నారు. రాజేందర్ కూడా హుజురాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో .. ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కారు సింబల్ తో గెలిచిన పదవి తనకు అక్కర లేదని ఈటల చెప్పడంతో.. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం ఖాయమని అంతా భావించారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన తర్వాత సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈటలను కలిసిన మద్దతుదారులు.. రాజీనామాపై భిన్నాభిప్రాయాలు చెప్పారని తెలుస్తోంది. రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు కోరితే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని మరికొందరు సూచించారట. ప్రభుత్వం ఏం చేయబోతోంది, కేసీఆర్ వ్యూహం ఏంటన్నదాని కోసం మరికొన్ని రోజులు ఎదురుచూస్తే బెటరని మరికొందరు నేతలు సూచించారని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంలో ఈటల రాజేందర్ కూడా పునరాలోచన చేస్తున్నారని  తెలుస్తోంది. హైదరాబాద్ కు వెళ్లి మరికొందరు నేతలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయబోవడం లేదనే ఎక్కువ మంది ఈటల మద్దతుదారులు చెబుతున్నారు.  తన నియోజకవర్గ నేతలతో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ కూడా ఇదే రకమైన సంకేతం ఇచ్చారు. తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని ఈటల రాజేందర్ చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు.  రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారన్నారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 జిల్లాల నుంచీ కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుతానని.. వాళ్ళతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయ్యిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయమని.. అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సమస్య వస్తే మీ దగ్గరికే వస్తానని ఈటల వెల్లడించారు. 

కరోనా.. మరణాలకు వారే కారణం..హై కోర్టు  

దేశం లో కరోనా మరణాలు చూసి ఆ యముడి హృదయం అయినా కరిగిపోతాడేమో గానీ, మన పాలకులు హృదయాలు మాత్రం కదలడం లేదు. ఈ విషయంలో లో దేశ నాయకులు కసాయి వారైతే. మన తెలుగు రాష్ట్ర నాయకులు ఆ కసాయి వారి బాబులు అని చెప్పాలి. ఆక్సిజన్ లేక, కళ్ళల్లో జీవకల లేక ఏమిచేయలేక కరోనా బాధితులు పిట్టలా రాలిపోతున్నారు. ఈ నేపథ్యం లో మొన్నటికి మొన్న చైన్నై హై కోర్టు కలగా చేసుకుని. కరోనా కేసులు పెరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం పై సంచల కామెంట్స్ చేసింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సంచలన వ్యాఖ్యానాలు చేసింది.    కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక చనిపోతున్నారన్న విషయం నిజంగా మారణహోమం వంటిదేనని, ఆ పాపం పాలకులడే అని.. ఆ మరణాలకు బాధ్యతని పాలకులడే అని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ ను సరఫరా చేయలేకపోవడం నేరపూరిత చర్య అని. ప్రజా ఆరోగ్యం మీద పాలకులకు చిత్త శుద్ధి లేకపోవడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. సప్లయ్ చైన్ ను నిర్వహించలేని అధికారులు, నేతలు అసమర్థులేనని తేల్చిచెప్పింది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆక్సిజన్ లేకుండా కరోనా బాధితులు మరణిస్తున్నారని వచ్చిన వార్తలు, ప్రచారంపై స్పందించిన జస్టిస్ సిద్ధార్ద్ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్ ల ధర్మాసనం, కరోనా పరిస్థితులపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించింది.లక్నో, మీరట్ జిల్లాల్లో ప్రాణ వాయువు సరఫరా అందక పలువురు మరణించగా, అన్ని కేసుల్లోనూ విచారణకు ఆదేశిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితిని వెంటనే సమీక్షించాలని, అవసరార్థులకు ఆసుపత్రుల్లో బెడ్లను, ఆక్సిజన్, వెంటిలేటర్లను అందించాలని ఆదేశించింది. ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నారని విని మేము చాలా బాధపడుతున్నాం. ఇది మా మనసును కలచి వేస్తోంది. కరోనా మరణాల పట్ల మేము కలత చెందుతున్నాం అని. ఇది నిజంగా మారణహోమం కన్నా తక్కువేమీ కాదు. కసాయి తనమే అని చెప్పింది. మెడికల్ ఆక్సిజన్ ను నిర్వహించాల్సిన వారు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు.. ఈ సమయంలో ప్రజలు ముఖ్యంగా మహమ్మారి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలో గుండె మార్పిడి చికిత్సలు, మెదడు ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్న వేళ, సాధారణ జబ్బుతో రోగులు మరణించడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సాధారణ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కోర్టులు కల్పించుకోబోవని, కానీ వార్తలు చూస్తూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు చూస్తూ, దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఎలా తోసి పుచ్చగలమని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లక్నో, మీరట్ కలెక్టర్లు వెంటనే స్పందించి, తమ నివేదికలను 48 గంటల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.           

ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా?

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈటలకు మద్దతుగా విపక్ష నేతలు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తన అవినీతికి సహకరించడం లేదనే తొలగించారని ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర మంత్రులనుతొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజేందర్ కు మద్దతుగా బీసీ సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఈటలను పదవి నుంచి అవమానకరంగా తొలగించారంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై సీరియస్ గానే స్పందిస్తున్నారు ఈటల రాజేందర్. మూడు రోజులుగా హుజురాబాద్ లో ఉన్న ఈటన తన అనుచరులు, బీసీ సంఘాలు, కలిసి వచ్చే నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు రాజేందర్. కేసీఆర్ ను టార్గెట్ పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదన్న ఈటల.. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  అయితే తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారిన మాజీ మంత్రి ఈటల వివాదంలో మరో కొత్త నినాదం తెరపైకి వచ్చింది. గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ కూడా రాజీనామా చేయాలని ఈటల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు హుజురాబాద్‌‌లో ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. ఇద్దరూ కలిసి పోటీ చేస్తే అసలు ఓనర్ ఎవరో తెలుస్తుందని... ఎవరు గెలిస్తే వారే నిజమైన ఓనర్లని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్, ఈటల ఇద్దరిదీ ఒకే స్థాయి అని చెప్పుకొచ్చారు. కాగా తమ నేతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఈటలకు లేదని మద్దతుదారులు స్పష్టం చేశారు. దీంతో ఈటల అనుచరుల డిమాండ్  ప్రకారం గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.  ఉద్యమ సమయంలో చాలా సార్లు కేసీఆర్ రాజీనామా చేశారు. విపక్షాల సవాల్ చేసిన వెంటనే స్పందించి తన పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, ఈటల అనుచరుల డిమాండ్ మేరకు కేసీఆర్ .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

దేశంలో కంప్లీట్‌ లాక్‌డౌన్‌.. కండీష‌న్స్ అప్లై..

అవును. దేశంలో లాక్‌డౌన్ అమ‌లు అవుతోంది. ఇందులో డౌటేమీ అవ‌స‌రం లేదు. ప్ర‌ధాని మోదీ అధికారికంగా ప్ర‌క‌టించ లేదు అంతే. అన‌ధికారికంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌ల‌ను ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్నాయి. అందుకే, దేశంలో ప్ర‌స్తుతం సంపూర్ణ లాక్‌డౌన్ ఉందంటున్నారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాల‌నే డిమాండ్‌లు పెరుగుతున్న వేళ‌.. ఈ ఆంక్ష‌ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దాదాపు అన్ని స్టేట్స్‌లో నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రింత క‌ఠిన ఆంక్ష‌ల దిశ‌గా అడుగులు వేసింది. ఏపీలో హాఫ్ డే లాక్‌డౌన్‌ను బుధ‌వారం నుంచి అమ‌లు చేస్తున్నారు. మ‌ధ్యాహ్నం 12 త‌ర్వాత స‌క‌లం బంద్‌. తెలంగాణ‌లోనూ లాక్‌డౌన్ విధించాల‌నే డిమాండ్ పెరుగుతోంది. అటు, దేశ రాజ‌ధాని ఢిల్లీ ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్లో ఉంది. ప్ర‌స్తుతానికి మే 10 వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. అవ‌స‌ర‌మైతే అది మ‌రింత కాలం పొడిగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అటు, కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారిన మ‌హారాష్ట్రలోనూ ఈ నెల 15 వరకు లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.  కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్‌ 27 రాత్రి నుంచి మే 12వ తేదీ వరకు కర్ణాటకలో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. అయితే ఈ పాక్షిక లాక్‌డౌన్‌ వల్ల కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. దీంతో ఈ పాక్షిక లాక్‌డౌన్‌ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్నట్లు సమాచారం.  హరియాణాలో మే మూడు నుంచి ఏడు రోజుల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది.  ఒడిశా.. మే 5 నుంచి 19 వరకు 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. రాజస్థాన్‌లో ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు.   ఝార్ఖండ్‌లో గత నెల 22 నుంచి మే 6 వరకు.. లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పంజాబ్‌లో వారాంతపు లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ లాంటివి ఈ నెల 15 వరకు అమల్లో ఉండనున్నాయి. మధ్యప్రదేశ్‌ ఈ నెల 7 వరకు కరోనా కర్ఫ్యూ.. గుజరాత్‌లోని 29 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. తమిళనాడులో మే 20వరకు కఠిన ఆంక్షలు.. కేరళలో ఈ నెల 9 వరకు కఠిన ఆంక్షలు.. అస్సాం, ఉత్త‌రాఖండ్‌లో రాత్రిక‌ర్ఫ్యూ అమ‌ల‌వుతోంది. ఇలా.. అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక ర‌క‌మైన ఆంక్ష‌లు విధించ‌డంతో.. దేశంలో లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. అయినా, క‌రోనా ఏమాత్రం కంట్రోల్‌కి రాక‌పోవ‌డం క‌ల‌వ‌ర పాటుకు గురి చేస్తోంది. అంత‌రాష్ట్ర రాక‌పోక‌ల‌పై నిషేధం లేక‌పోవ‌డం.. క‌ల్లోల స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంతో.. వైర‌స్ మ‌రింత‌గా విజృంభిస్తోంది. ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోలానికి ప్ర‌భుత్వాలు, పాల‌కుల ఉదాసీన వైఖ‌రే కార‌ణంగా క‌నిపిస్తోంది. 

ఒక్క ఫోన్ కాల్ తో 22 మందికి ప్రాణం.. సోను సూద్ కు వందనం 

కరోనా కల్లోలం కష్టాల్లో ఉన్న జనాలకు ఆపద్భాదంవుడిగా నిలుస్తున్నారు నటుడు సోనూ సూద్. గత సంవత్సరం కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆయన  సాయం చేస్తూనే ఉన్నారు.ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. పేదలకు ప్రాణం పోశారు. ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల తరలింపు నుంచి కష్టకాలంలో ఉన్న ఎంతో మందిని ఆయన తన సొంత డబ్బుతో ఆదుకున్నారు. ప్రత్యేక రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేసి బాధితులకు సాయపడ్డారు సోనూ సూద్. పేదల పేలిట పేన్నిధిగా మారిన సోను సూద్ కు ఇటీవలే కరోనా సోకింది. అయినా క్వారంటైన్ లో ఉంటూనే సేవా కార్యక్రమాలు కొనసాగించారు. తన ఆస్తులను తాకట్టు పెట్టీ మరీ పేదలకు ఖర్చు చేశారు. తాజాగా బెంగళూరులో తనకు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ కు వేగంగా స్పందించి 22 మంది ప్రాణాలు కాపాడారు రియల్ హీరో. రాత్రంతా తన్ టీమ్ ను అలర్ట్ చేసి.. , 22 ప్రాణాలను కాపాడి, తానేంటో మరోసారి నిరూపించుకున్నారు సోనుసూద్.  బెంగళూర్ ఆర్క్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అయిపోయింది. పదుల సంఖ్యలో రోగులు ఆక్సిజన్ పై ఉన్నారు.ఈ విషయాన్ని యహలంక పాత బస్తీ ఇనస్పెక్టర్ సత్యనారాయణ సోనూ సూద్ దృష్టికి తీసుకుని వెళ్లారు. విషయాన్ని సోనూ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ కు ఆయన చెప్పగానే, పరిస్థితిని అర్థం చేసుకున్న వెంటనే ఆయన టీమ్ ను అలర్ట్ చేశారు. అప్పటికే ఆక్సిజన్ కారణంగా ఆసుపత్రిలో ఇద్దరు బాధితులు కన్నుమూయగా, మిగతావారిని కాపాడాలన్న ఆదేశాలు అందాయి. దీంతో గంటల వ్యవధిలోనే సోనూ టీమ్ 15 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది. "ఇది నా కృషి కాదు. నా టీమ్ చేసిన అద్భుతం. కేవలం కొద్దిమంది మాత్రమే సమష్టిగా పనిచేశారు. సత్యనారాయణ నుంచి కాల్ రాగానే, మేము దాన్ని వెరిఫై చేశాము. నిజమని తెలియగానే నిమిషాల వ్యవధిలో పని మొదలైంది. రాత్రంతా ఆసుపత్రికి ఆక్సిజన్ ను అందించేందుకు శ్రమించాం. మేము ఆలస్యం చేసుంటే ఎన్ని ప్రాణాలు పోయుండేవో తెలియదు. ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా హష్ మత్ అనుక్షణం నాతో మాట్లాడుతూ, మిగతా వారిని సమన్వయపరుస్తూ ఆసుపత్రికి సాయం చేశారు. ఇందుకు నాకెంతోగర్వంగా ఉంది" అని ఈ సందర్భంగా సోనూ సూద్ వ్యాఖ్యానించారు. సకాలంలో హాస్పిటల్ కు ఆక్సిజన్ అందించి 22 మంది ప్రాణాలు కాపాడిన సోనుసూద్ కు అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుతున్నాయి. నెటిజన్లు సోనుకు సెల్యూట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పని చేస్తూ రియల్ హీరోగా నిలుస్తున్నారని కొనియాడారు. అధికారులు కూడా ప్రభుత్వంతో కాదని.. సోనుసూద్ ను ఆశ్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. 

7 కోట్ల ఖ‌రీదైన వైన్ బాటిల్‌.. అంత ధ‌ర ఎందుకంటే...

వైన్ అంటేనే సంథింగ్ స్పెష‌ల్‌. బ్రాంది, విస్కీల‌కంటే డిఫ‌రెంట్‌. విదేశాల్లో వైన్‌కు ఫుల్ క్రేజ్‌. ఇక ఫ్రెంచ్ వైన్ అన్నిటికంటే బెస్ట్‌. ఎంత పాత వైన్ అయితే అంత టేస్ట్‌. వైన్‌ ఎంత‌గా మాల్ట్ అయితే అంత కాస్ట్‌. వైన్‌కు ప్ర‌త్యేక రుచి తీసుకొచ్చేందుకు.. భూగ‌ర్భంలో నేల‌మాలిగ‌ల్లో వైన్‌ను ఏళ్ల త‌ర‌బ‌డి పులియ‌బెడ‌తారు. బాగా పులిశాక‌.. అంద‌మైన బాటిల్స్‌లో అమ్ముతుంటారు. అంత క‌ష్టం, అంత రుచి, అంత ప్ర‌త్యేక వాస‌న ఉంటుంది కాబ‌ట్టి.. ధ‌ర కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఒక్కో బాటిల్ ల‌క్ష‌ల్లో ధ‌ర ప‌లుకుతుంది. కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే వైన్ బాటిల్ వీట‌న్నిటికంటే చాలా చాలా స్పెష‌ల్‌. అందుకే ఆ బాటిల్‌కు ఏకంగా 7 కోట్ల‌కు పైగా చెల్లించేందుకు వైన్ ల‌వ‌ర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇంత‌కీ, ఆ వైన్ స్పెషాలిటీ ఏంటంటే... అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్‌. అందుకే దాని ధర కూడా ఆకాశ‌మంత ఎత్తులో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ISSలో ఏడాదికిపైగా ఆ వైన్‌ను మాల్ట్ చేశారు. ఆ ఫ్రెంచ్ వైన్‌ బాటిల్‌ను ఇప్పుడు క్రిస్టీస్‌ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు 7.37 కోట్లు) పలకొచ్చని భావిస్తోంది.  2019 నవంబరులో అంతరిక్షంలోకి 12 వైన్‌ సీసాల‌ను పంపించారు. అందులోని ఒక బాటిల్‌నే ఇప్పుడు వేలం వేస్తున్నారు. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్‌ కార్గో అన్‌లిమిటెడ్‌’ వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత ఆ బాటిల్స్‌ను తిరిగి భూమికి తీసుకొచ్చారు. వీటికి ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైన్‌ అండ్‌ వైన్‌ రీసెర్చ్‌లో పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూశారు. రుచిలో రెండింటి మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. అంత‌రిక్షంలో మాల్ట్ చేసిన వైన్‌.. స్మూత్‌గా, సువాసన భరితంగా ఉందని తేల్చారు. గురుత్వాకర్షణ లేని చోట ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్‌ ‘పరిపక్వానికి’ వచ్చింది కాబ‌ట్టి ఆ వైన్ టేస్ట్ అదుర్స్ అంటున్నారు. అందుకే, ఆ వైన్ బాటిల్‌ వేలంలో  7 కోట్ల‌కు పైగా ధ‌ర ప‌ల‌కొచ్చ‌ని చెబుతున్నారు. ఆ వైన్ బాటిల్‌కు ఓ పేరు కూడా ఉంది. ‘పెట్రస్‌ 2000’. 

హుజూరాబాద్ లో కేసీఆర్ స్కెచ్! ఈటలకు అగ్ని పరీక్షే? 

భూకబ్జా ఆరోపణలతో సీనియర్ నేత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. ఈటలను పదవి నుంచి అవమానకరంగా తొలగించారనే ఆరోపణలు వస్తున్నాయి. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై సీరియస్ గానే స్పందించారు ఈటల రాజేందర్. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదన్న ఈటల.. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆయన సొంతంగానే పోటీ చేస్తారా లేక కొత్త పార్టీ పెట్టి .. ఆ పార్టీ తరపున బరిలో ఉంటారా లేక ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారా అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  ఈటల రాజీనామాతో జరిగే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపనుంది. అయితే ఈటలను తొలగించాలని ముందే డిసైడ్ అయిన కేసీఆర్... తర్వాత జరగబోయే పరిణామాలపైనే క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల ఏం చేస్తారు.. ఎలా చేస్తారన్న దానిపై గులాబీ బాస్ అంచనాతో పక్కా వ్యూహాలు సిద్ధం చేశారని అంటున్నారు. ఈటల రాజీనామాతో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా కేసీఆర్ అప్పుడే ఫోకస్ చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని సమాచారం.  హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడ్డారని కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. ఈటల ఆస్తులకు సంబంధించిన సమాచారమంతా కౌశిక్ రెడ్డి దగ్గర ఉందంటున్నారు. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి గెలుస్తారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఈటలకు బలమైన ప్రత్యర్థిగా కౌశిక్ రెడ్డి ఉంటారని భావిస్తున్న కేసీఆర్.. అతన్ని పార్టీలోకి తీసుకురావాలని  స్థానిక నేతలను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లాకు చెందిన ఒక మంత్రి కౌశిక్ రెడ్డి తో మంతనాలు జరిపినట్లు సమాచారం.  నియోజక వర్గంలో ఈటెలను డీ కొట్టాలంటే కౌశిక్ రెడ్డి తప్ప మరో మార్గం లేదని కెసిఆర్ కు సదరు మంత్రి తెలిపినట్లు సమాచారం. దీంతో కౌశిక్ రెడ్డి ని పార్టీ లోకి చేర్చుకునేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈటెల తేరుకుని పార్టీ కి నష్టం చేసే లోపే ఇంఛార్జి ని నియమించి క్యాడర్ ను కాపాడుకోవాలని భావిస్తూ పావులు కదుపుతున్నారు.నియోజకవర్గంలో  ఈటెలకు సన్నిహితంగా ఉన్న నేతలతోనూ టీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతున్నారని అంటున్నారు.  బీసీ నేతలు రాజేందర్ తో వెళ్లకుండా చూసేందుకు బీసీ సంఘం నాయకుడు వకుళాభరణం కృష్ణ మోహనరావు ను రంగం లోకి దించారని చెబుతున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే  ఈటెల కు వ్యతిరేకంగా టీవీ డిబేట్లలో వకుళాభరం మాట్లాడుతున్నారని అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అధిష్టానం ఈటల విషయంలో తీసు కుంటున్న చర్యలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఇతర పార్టీల నేతలు ఆయనతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది . కాంగ్రెస్ నుండి బట్టి, రేవంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్, బీజేపీ నుండి ఎంపీ అరవింద్, ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఈటల సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి . తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి తన తో కలిసి వచ్చేవారెవరు ? టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని పక్కకు తప్పుకునే వారెవరు ? అనే అంశంపై ఈటల సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. కెసిఆర్ వ్యూ హం ఫలించి కౌశిక్ తెరాస తీర్థం పుచ్చుకుంటే నియోజక వర్గ రాజకీయాలు రసవత్తరం అవుతాయని భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం తమ నాయకుడు కౌశిక్ పార్టీ వీడడని చెబుతున్నారు

భారీగా క‌రోనా.. ఆర్బీఐ ఆందోళ‌న‌..

రెండు రోజులుగా నిల‌క‌డ‌గా ఉన్న క‌రోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా మూడున్న‌ర ల‌క్ష‌ల పైనే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టం కల‌వ‌రం సృష్టిస్తోంది. తాజాగా, మ‌రో 3,82,315 మందికి క‌రోనా సోక‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో 3,780 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.   దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. మొత్తం 2,06,65,148 కేసులు,  2,26,188 మ‌ర‌ణాల‌తో దేశంలో మ‌ర‌ణ మృదంగం మోగుతోంది.  కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటమే కాస్త‌ ఊరటనిచ్చే అంశం. మంగ‌ళ‌వారం ఒక్క రోజే 3,38,439 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య  1,69,51,731కి చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 34,87,229కి పెరిగింది.  ఇక‌, తెలంగాణలోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మంగ‌ళ‌వారం 77,435 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా.. అందులో 6,361 మందికి పాజిటివ్ వ‌చ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,225 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మంగ‌ళ‌వారం 8,126 మంది కోలుకున్నారు.    కరోనా సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేస్తోందని ఆర్బీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారని.. కంటైన్‌మెంట్ ప్రాంతాలు, భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలపై రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.   

కరోనా పై యముడి కన్నీరు.. 

యముడు ఆ పేరు వింటే చాలు. తప్పు చేసినోడి గుండెల్లో గుబులు పుడుతుంది. తప్పు చేస్తే ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ, యముడి నుండి ఎప్పటి తప్పించుకోలేరు అని, ఎప్పటికైనా యముడి ద్వారా భారీ మూల్యం చెల్లించాల్సిందే అని అంటుంటారు దైవత్వం ఉన్నారు. యముడు  అదేపనిగా ఎప్పటికప్పుడు తప్పు చేసిన వాళ్ళ చిట్టా పద్దులు తెలుస్తుంటాడని  అంటుంటారు.  కానీ కరోనా వాళ్ళ ఇప్పుడు యముడికి ఆ అవసరం లేకుండా పోయింది. పని కట్టుకుని తప్పుచేసినోడి తాట తీసేపని ఆయనకు లేకుండా పోయింది.    భారత దేశం లో సంచారం చేస్తున్నాడు. కరోనా రావడం తో ఆయనకు పని తప్పింది. పని కట్టుకుని ప్రాణాలు తీసే పని యముడికి లేకుండా పోయింది. తప్పు చేసిన వారికీ భూమి మీద నూకలు చెల్లితే యమా ధర్మ రాజు ఎకాఎకిన వచ్చి తన పాశం సంధించి గదా వచ్చి కోడి పిల్లలను ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయే యముడు కూడా భారత దేశం పరిస్థితి చూసి యముడు కూడా కన్నీటి పర్వం చెందుతున్నాడు. దేశంలో కొనసాగుతున్న కరోనా మరణాలపై, కరోనా వైరస్ పై అవగాహనా కాలిస్తున్నాడు.. ఆ యముడు.. యముడు ఏంటి? కరోనా మీద కన్నీరు పెట్టడం ఏంటి? కరోనా పై అవగాహనా కల్పించడం ఏంటని అనుకుంటున్నారా..? మీరే చూడండి తెలుస్తుంది.   కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలంతా మాస్కు ధరించాలంటూ హిందూపురం పోలీసులు వినూత్న అవగాహన కల్పించారు. యోగి నారాయణ సేవాసమితి సహకారంతో యముడు, యమ భటుల వేషధారణతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్కు ధరించకపోతే ఎదురయ్యే అనర్థాలను వివరించారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. లేదంటే కరోనా మహమ్మారి బారిన పడతారని హెచ్చరించేలా ఈ కార్యక్రమం సాగింది. ‘నేను యముడిని. మాస్కు పెట్టుకోకుంటే వస్తా.. మీరు ఇంట్లో ఉంటే నేను బయట ఉంటా. బయటకు వస్తే మీ వెంటే ఉంటా..’ అంటూ  యముడి వేషధారణలో ఉన్న వ్యక్తి హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, రేపటి నుంచి కర్ఫ్యూ అమలు కానుండటంతో అనవసరంగా బయట తిరిగితే కేసులు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.  

ఏపీలో మద్య దర్శనం.. తెల్లవారుజామునే ఛీర్స్

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్పెషల్. రివర్స్ పాలన సాగుతుందనే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచింది. ఏపీ ప్రజలకు మద్య దర్శనం కల్పించింది. ప్రజలు నిద్ర లేవకముందే రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. టీ తాగే సమయానికి ముందే మందు అందుబాటులోకి వచ్చింది. . గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారి ఉదయం 6గంటలకే లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. కరోనా పంజా విసురుతుండటంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలు చేయనుంది ఏపీ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వాణిజ్య కార్యకాలాపాలు కొనసాగించాలని ఆదేశించింది. అందులో భాగంగానే సర్కార్ కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం షాపులను ఉదయమే తెరవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపులు తెరవాలని ఆదేశించింది. దీంతో బుధవారం తెల్లవారుజామునే ఏపీలో మద్యం దుకాణాలన్ని తెరుచుకున్నాయి. మందు బాబులు లిక్కర్ కోసం క్యూలు కట్టారు. మద్యం షాపులతో పాటు మద్యం సరఫరా చేసే డిపోలు కూడా ఇవే నిబంధనలు పాటిస్తున్నాయి.  గతేడాది కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 43 రోజుల పాటు మద్యం అమ్మకాలను పూర్తిగా ఆపేశారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రభుత్వం అమ్మకాలకే మొగ్గు చూపింది. ఇదంతా ఆదాయం కోసమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ఫ్యూ అమలుచేస్తే ఒకచోట నలుగురు కంటే గుమికూడకూడదు. అలాంటప్పుడు బార్లకు అనుమతి ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకోవైపు ఎప్పటిలాగే మద్యం షాపుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. అలా క్యూలు ఉంటే కరోనా వ్యాప్తి పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాల కంటే ఆదాయమే లక్ష్యంగా మద్యం అమ్మకాలను కొనసాగిస్తోంది.

న్యాయమా రెడ్డీ? రాజ‌కీయం 'క‌మ్మ‌'గుంది!

జ‌గ‌న్‌ది రెడ్డి సైన్యం. చంద్ర‌బాబుకు క‌మ్మ ధైర్యం. ఇలా ఏపీలో రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలు.. ఇద్ద‌రు నాయ‌కుల‌ను వెన‌కుండి న‌డిపిస్తున్నాయి. ఈ రెండు వ‌ర్గాల్లో ఎవరిది అప్ప‌ర్ హ్యాండ్ అయితే.. వారిదే అధికారం. ఏళ్లుగా ఇదే జ‌రుగుతోంది. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక త‌ర్వాత ఏపీలో టీడీపీ మ‌ళ్లీ బ‌లం పుంజుకుంటోంద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఓడినా టీడీపీ బ‌లంగా ప్ర‌తిఘ‌టించింది. తెలుగు త‌మ్ముళ్లు క‌సితో ప‌ని చేశారు. క‌లిసిక‌ట్టుగా పోరాడారు. ప్ర‌తిప‌క్ష పార్టీని 3 ల‌క్ష‌ల మెజారిటీలోపే నిలువరించారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం ఏపీలో రెట్టించిన ఉత్సాహంతో ఉంటే.. జ‌గ‌న్‌రెడ్డి వ‌ర్గం మాత్రం తీవ్ర నిరుత్సాహం, నిర్లిప్త‌త‌తో ఉంది. ఈ తీరే.. భ‌విష్య‌త్తులో అధికారాన్ని మ‌ళ్లీ తారుమారు చేసే అవ‌కాశం ఉందంటున్నారు సామాజిక రాజ‌కీయ‌ విశ్లేష‌కులు. ముందు రెడ్ల విష‌యానికి వ‌ద్దాం. రాయ‌ల‌సీమ వ్యాప్తంగా రెడ్డి వర్గానిదే ఆధిప‌త్యం. మిగ‌తా జిల్లాల్లోనూ చెప్పుకోద‌గ్గ ప్ర‌భావం. వీళ్లే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అండా-దండా. అంగ బ‌లం, అర్థ బ‌లంతో జ‌గ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించారు. 2019 ఎన్నిక‌ల నాటికి ఐదేళ్లుగా అధికారానికి దూర‌మై.. ఆవురావుర‌మంటూ ఉన్న ఆ సామాజిక వ‌ర్గం.. ఆనాటి ఎల‌క్ష‌న్ల‌లో జ‌గ‌న్‌రెడ్డి గెలుపు కోసం శాయ‌శ‌క్తులా కృషి చేశారు. మ‌ళ్లీ ప‌వ‌ర్‌లోకి రావాల‌నే ధృడ సంక‌ల్పంతో గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. త‌మ ఆర్థిక వ‌న‌రుల‌న్నీ పోగేసి.. ఎన్నిక‌ల్లో భారీగా ఫండింగ్ చేసి.. స్వ‌చ్ఛందంగా ప‌ని చేసి.. జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించుకున్నారు. త‌మ వాడు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోవ‌డం చూసి తెగ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక‌, ఎన్నిక‌ల్లో పెట్టిన ఖ‌ర్చుకు ప‌దింత‌లు తిరిగి రాబ‌ట్టుకోవ‌చ్చు అనుకున్నారు. కానీ, ఆదిలోనే వారి ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. అక్క‌డున్న‌ది జ‌గ‌న్‌రెడ్డి క‌దా. వీళ్ల దోపిడీ సాగ‌లేదు. దొరికిన‌దంతా తిమింగ‌ళంలా ఆయ‌నే దోచుకుంటున్నారంటూ.. పిల్ల చేప‌లు ఆహారం లేక అల‌మ‌టిస్తున్నాయి. మ‌నోడే అనుకుంటే న‌ట్టేట ముంచేస్తున్నాడుగా అంటూ తెగ వ‌ర్రీ అవుతున్నాయి.  ఏపీలో లిక్క‌ర్, ఇసుక రీచ్‌లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ప్ర‌ధానంగా రెడ్ల చేతిలో ఉంటాయి. ఆ మూడింటిలో ఇప్పుడు రెడ్ల‌కు అవ‌కాశం లేకుండా చేశాడు జ‌గ‌న్‌రెడ్డి. కాసులు పిండుకునే ఛాన్స్ ఉండే.. మ‌ద్యం వ్యాపారాన్ని ప్రభుత్వప‌రం చేసి లిక్క‌ర్ డాన్‌ల గ‌ల్లాపెట్టె ప‌గ‌ల‌గొట్టాడు. చంద్ర‌బాబు హ‌యాంలోనూ వైన్లు, బార్ల‌తో బాగా సంపాదించుకున్న ఆ వ‌ర్గ‌మంతా.. ఇప్పుడు నోరు మూసుకొని చూస్తూ ఉండాల్సిన దుస్థితి. భారీగా ముడుపులు స్వీక‌రించి.. ఊరూపేరు లేని బ్రాండ్ల‌ను తీసుకొచ్చి, అడ్డ‌గోలుగా ధ‌ర‌లు పెంచి.. లిక్క‌ర్ ఆదాయాన్నంతా జ‌గ‌న్‌రెడ్డి ఒక్క‌డే గంప గుత్త‌గా దోచేసుకుంటున్నాడ‌నే ఆగ్ర‌హం ఆ వ‌ర్గంలో వెల్లువెత్తుతోంది. అధికారంలో ఉన్న జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఒక‌ప్ప‌టి మ‌ద్యం వ్యాపారులంతా.  అటు, రెడ్డి వ‌ర్గాల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న ఇసుక త‌వ్వ‌కాల‌నూ ఏక మొత్తంగా ర‌ద్దు చేసేశారు జ‌గ‌న్‌రెడ్డి. కొత్త ఇసుక పాల‌సీ అంటూ.. రాష్ట్రంలోని శాండ్ మైనింగ్ కాంట్రాక్ట్‌ మొత్తాన్ని వేలం వేసి అంగ‌ట్లో అమ్ముకున్నారు. త‌న‌కు అత్యంత స‌న్నిహితమైన రాంకీ గ్రూపున‌కే ఏపీలోని ఇసుకంతా దార‌ద‌త్తం చేశారు. ప‌రోక్షంగా జ‌గ‌న్ ఒక్క‌డే ఇసుక నుంచి కాసుల తైలంబు పిండుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి.  ఇక‌ ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. గ‌డిచిన రెండేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రియ‌ల్ రంగం అధఃపాతాలానికి ప‌డిపోయింది. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేయ‌డంతో భూముల ధ‌ర‌లు కుప్ప‌కూలిపోయాయి. క‌నీసం ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్‌గా ప్ర‌క‌టించిన విశాఖ‌లోనైనా రియ‌ల్ వ్యాపారం చేసుకుందామన్నా అదీ కుద‌ర‌డం లేదు. విశాఖ‌లో భూమంతా వైసీపీ నేత‌ల పర‌మైందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ ఆగ‌డాల‌తో భూమిపై పెట్టుబ‌డి పెట్టేందుకు వ్యాపారులు భ‌య‌ప‌డుతున్నారని అంటున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌తీ జిల్లాలో ఏదో ఒక ప్రాజెక్టు గానీ, సెజ్ గానీ ఉండేది. దీంతో, ఏపీ వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ జోరుగా సాగింది. ఆ రంగంలో ముందున్న రెడ్లు అప్ప‌ట్లో బాగా లాభ‌ప‌డ్డారు. ఇప్పుడు జ‌గ‌న్ రాక‌తో.. అంతా త‌ల‌కిందులైంది. రియ‌ల్ రంగం కుదేలైంది. ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నం. తెలంగాణ‌లో రెండు ఎక‌రాల భూమి అమ్మితే.. ఏపీలో 3 ఎక‌రాలు కొనుక్కోవ‌చ్చంటూ కేసీఆర్ చేసిన కామెంట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితికి స‌రిగ్గా స‌రిపోతున్నాయి.  అన్ని రంగాల్లోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తిరోగ‌మ‌నంలో ఉండ‌టంతో.. అన్ని ర‌కాల వ్యాపారాలు చేసే రెడ్డి సామాజిక వ‌ర్గం ఆర్థికంగా బాగా చితికిపోయింది. మ‌నోడ‌ని గెలిపిస్తే.. మ‌న‌ల్నే ముంచేస్తున్నాడ‌ని ఆ వ‌ర్గ‌మంతా అక్క‌స్సుతో ఉందని చెబుతున్నారు.  గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు క‌మ్మ వ‌ర్గానికి వ్యాపారాల్లో ప్రాధాన్యత ల‌భించిందనే టాక్ ఉంది.  ఆ స‌మ‌యంలో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేతలు బాగా సంపాదించుకున్నార‌ని చెబుతారు. దీంతో.. సంపాదించింది చాల్లే అన్న సంతృప్తి.. మ‌న‌మే ఎలాగూ గెలుస్తామ‌నే ఉదాసీన‌త‌.. రెండూ క‌లిసి 2019 ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు వ‌ర్గంలో నిర్లిప్త‌త ఆవ‌హించింది. అందుకే, ఆ ఎల‌క్ష‌న్ల‌లో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. అదే స‌మ‌యంలో ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న రెడ్లు క‌సితో క‌ష్ట‌ప‌డ్డారు. ఫ‌లితం.. 2019లో అధికారం క‌మ్మ‌ నుంచి రెడ్డి చేతికి చిక్కింది.  రెండేళ్లైనా గ‌డిచిందో లేదో.. మ‌ళ్లీ మార్పు మొద‌లైంద‌ని అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డిని అంద‌ల‌మెక్కించినా ద‌మ్మిడి ఆదాయం లేక‌, పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేక‌.. ఆయ‌న సామాజిక వ‌ర్గ‌మంతా ఆగ్ర‌హంతో ఉందంటున్నారు. అదే స‌మ‌యంలో.. అధికారం లేక‌పోతే త‌మ ప‌రిస్థితి ఎంత అధ్వాహ్నంగా ఉంటుందో క‌మ్మ వ్యాపారుల‌కు, తెలుగు త‌మ్ముళ్ల‌కూ బాగా తెలిసొచ్చింది. అందుకే, టీడీపీ శ్రేణులంతా మ‌ళ్లీ ఏక‌మై చంద్ర‌బాబు గెలుపు కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. తొలి ప్ర‌భావం, ఫ‌లితం తిరుప‌తి ఉప ఎన్నిక‌లో క‌నిపించింది. ప్ర‌చారంలో టీడీపీ వ‌ర్గాలు చ‌మ‌టోడ్చాయి. త‌మ పార్టీ అభ్య‌ర్థిని ఎలాగైనా గెలిపించుకోవాల‌నే తాప‌త్ర‌యం, ప‌ట్టుద‌ల వారిని క‌ష్ట‌ప‌డేలా చేసింది. అందుకే,, తిరుప‌తిలో చంద్రబాబు, నారా లోకేశ్ ర్యాలీలు, స‌భ‌లో జ‌నంతో కిక్కిరిసిపోయాయి. బైపోల్‌లో టీడీపీకి జేజేలు హోరెత్తాయి. వైసీపీ మెజార్టీకి భారీగా కోత ప‌డింది. ఇదే ప‌ట్టుద‌ల‌తో, ఇదే క‌సితో.. ముందుముందు మ‌రింత గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం మ‌ళ్లీ టీడీపీనే వ‌రించ‌డం ఖాయం. మ‌ళ్లీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవ‌డం త‌థ్యం. ఎనీ డౌట్స్‌?