ప్రాణాలు పోతున్నా పట్టదా! ఏపీ ప్రభుత్వంపై బాబు ఫైర్
posted on May 5, 2021 @ 5:51PM
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. అతి తీవ్రమైన కరోనా సమస్యకు మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యత కల్పించలేదని చంద్రబాబు విమర్శించారు. కేబినెట్ మీటింగ్ లో 33వ అజెండాగా కరోనాను చేర్చారని మండిపడ్డారు. రూ.వేలకోట్లు దుబారాకు ఖర్చు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువేంటని ప్రశ్నించారు.
కొవిడ్ రెండో దశ చాలా ఉద్ధృతంగా ఉందని.. ఏపీ నుంచి వెళ్లేవారికి పొరుగు రాష్ట్రాలు నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నాయన్నారు చంద్రబాబు. తమ ప్రజలకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఏపీ పట్ల ఆంక్షలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కొత్త స్ట్రెయిన్ ఎన్440కె కర్నూలులో ప్రారంభమై దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతుంటే.. దీనిపై అప్రమత్తంగా లేకుండా ఎన్440కె అసలు లేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకల కొరత లేదంటూ అసత్యాలు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాదని, ఏకంగా ముఖ్యమంత్రే సమీక్ష చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు.
పార్టీ పరంగా కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నామని.. ఆన్లైన్ ద్వారా వైద్య సూచనలు అందజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం ఇచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.తమ ఆఫీసులో కొందరికి కరోనా వచ్చిందని, అయితే అమెరికా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించామని చెప్పారు.ప్రభుత్వానికి ఎన్నో వనరులున్నాయని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని చంద్రబాబు అన్నారు.