పారని జానారెడ్డి పాచిక.. సాగర్ లో టీఆర్ఎస్ ఘనవిజయం

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలు కంటే మిన్నగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేలకు పైగా  ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ భగత్ కు లీడ్ వచ్చింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకుపోయారు భగత్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నాగార్జున సాగర్ లో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ గల్లంతైంది.  మొదటి తొమ్మిది రౌండ్లలో భగత్ కు లీడ్ రాగా.. పదో రౌండ్ లో మాత్రం జానా రెడ్డికి స్వల్ప ఆధిక్యం వచ్చింది. 11,12,13 రౌండ్లలో మళ్లీ కారుకు లీడ్ రాగా.. 14వ రౌండ్ లో హ్యాండ్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. తర్వాత అన్ని రౌండ్లలోనూ గులాబీనే గుబాళించింది. మండలాల వారీగా చూస్తే మొదట లెక్కించిన గుర్రంపోడులో టీఆర్ఎస్ కు 2008 ఓట్ల ఆధిక్యత వచ్చింది. పెద్దవూర మండలంలో టీఆర్ఎస్ కు 4 వేల 640 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. తిరుమలగిరి సాగర్ లో   2 వేల 713 ఓట్ల లీడ్  కారుకు వచ్చింది. ఇక కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుమలలో.. టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. అనుమల మండలంలో జానారెడ్డికి 447 ఓట్ల స్వల్ప ఆధిక్యత వచ్చింది. హాలియా పట్టణంలోనే జానారెడ్డికి వెయ్యి ఓట్లకు పైగా ఎక్కువ ఓట్లు రాగా.. అనుమల రూరర్ లో మాత్రం భగత్ లీడ్ సాధించారు. నిజానికి అనుమల మండలంలో భారీగా లీడ్ తమకు వస్తుందని పోలింగ్ తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకున్నారు.  ఇక  నిడమనూర్ మండలంలో వార్ వన్ సైడ్ గానే జరిగింది. అనుమల మండలానికి సంబంధించి నాలుగు రౌండ్లలో లెక్కింపు జరగగా.. అన్ని రౌండ్లలోనూ భగత్ కు తిరుగులేని మెజార్టీ వచ్చింది. నిడమనూర్ మండలంలో నోముల భగత్ కు ఏకంగా 5 వేల 642 ఓట్ల మెజార్టీ వచ్చింది. తక్కువ ఓటర్లున్న మాడ్గులపల్లి మండలంలోనూ టీఆర్ఎస్ లీడ్ సాధించింది.  త్రిపురారం మండలంలో కాంగ్రెస్ కు లీడ్ వస్తుందని భావించినా... అక్కడ కూడా కారు పార్టీ దుసూకుపోయింది.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 7 వేల 640 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు భగత్.. అంతకంటే డబుల్ మెజార్టీ సాధించడం విశేషం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంచార్జీగా ఉన్న పెద్దవూర మండలంలో టీఆర్ఎస్ కు 4 వేల 640 ఓట్ల లీడ్ వచ్చింది. బీజేపీ గిరిజన అభ్యర్థిని బరిలోకి దింపినా.. వాళ్ల ఓట్లలోనూ 10 శాతం ఓట్లు కూడా సాధించలేకపోయారు రవి నాయక్. చలకుర్తి, నాగార్జున సాగర్ తో కలిసి 12వ సారి పోటీ చేసిన జానారెడ్డి.. నాలుగోసారి ఓడిపోయారు. వరుసగా రెండో సారి పరాజయం పాలయ్యారు. 

ధూళిపాళ్ల కస్టడికి బ్రేక్..  సంగం కేసులో సర్కార్ కు షాక్ 

సంగం డెయిరీ కేసులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు షాక్ తగిలింది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడికి బ్రేక్ పడింది. సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంను ఏసీబీ అరెస్ట్ చేసింది. వారిని ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే   ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిం ఏపీ హైకోర్టు... ధూళిపాళ్ల నరేంద్ర సహా మిగితా నిందితుల ఏసీబీ కస్టడీని నిలిపేసింది. అలాగే, వారిని రాజమహేంద్రవరం సెంట్ర‌ల్ జైలుకి తరలించాలని చెప్పింది. ఈ కేసులో త‌దుప‌రి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం  ముగ్గురిని జైలు నుంచి విజయవాడకు తరలించి ఏసీబీ కార్యాలయంలో విచారించారు.  ఈ నేప‌థ్యంలో నరేంద్ర భార్య‌ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. త‌న భర్తను అక్రమంగా కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోప‌ణ‌లు చేశారు. ఏ అంశంపై కేసు నమోదు చేశారో కూడా స్పష్టత లేదని తెలిపారు. నరేంద్రను రాజమహేంద్రవరం జైలు నుంచి విచార‌ణ నిమిత్తం విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నార‌న్నసమాచారంతో ఆయన కుమార్తె వైదీప్తి.. ఉదయమే అక్కడికి చేరుకుని తన తండ్రితో మాట్లాడ‌నివ్వాల‌ని కోరారు. కారులో ఉన్న‌ తండ్రిని అద్దంలో నుంచి చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఆయ‌న‌తో మాట్లాడ‌తాన‌ని కోరిన‌ప్ప‌టికీ అధికారులు అందుకు అంగీకరించలేదు.

ఓటమి దశగా మమతా! బెంగాల్ లో సంచలనం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమవుతున్నాయి. మెజార్టీ ఎగ్టిట్ పోల్స్ సంస్థలు చెప్పినట్లే బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం దిశగా తృణామూల్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. తొలి ట్రెండ్స్ లో హోరాహోరీగా పోరు సాగినట్లు కనిపించినా.. రౌండ్లు సాగే కొద్ది టీఎంసీకి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్ లో టీఎంసీ 190కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉండగా.. బీజేపీ 90 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148.  అయితే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ మూడోసారి అధికారం దిశగా దూసుకుపోతున్నా.. సీఎం మమతా బెనర్జీకి మాత్రం షాక్ తప్పేలా లేదు. నందిగ్రామ్ మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. టీఎంసీలో కీలక నేతగా ఉండి... బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్ లో విజయం దిశగా పయనిస్తున్నారు. నాలుగు రౌండ్లు ముగిసేసరికి సువేందు అధికారి.. మమతపై దాదాపు 8 వేలకు పైగా ఓట్ల లీడ్ లో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మమత వెనుకంజలోనే ఉన్నారు. దీంతో నందిగ్రామ్ ఫలితం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. నందిగ్రామ్ లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం మమతా బెనర్జీ గెలవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటేసి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 118 మేజిక్ ఫిగర్ కాగా, డీఎంకే 160 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలను ప్రారంభించాయి. అన్ని జిల్లాల కార్యాలయాలతో పాటు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద హడావుడి మొదలైంది.అసోంలో రెండోసారి అధికారం దిశగా బీజేపీ కనిపిస్తోంది. అసోంలో కమలదళానికి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. కేరళలో గత సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండోసారి లెఫ్ట్ కూటమి అధికారం కైవసం చేసుకోబోతోంది. పుదుచ్చేరిలో మాత్రం అన్నాడీఎంకే, బీజేపీ కూటమి గెలుపు దిశగా పయనిస్తోంది. 

టీకాల కోసం పెద్దల వార్నింగ్స్.. బ్రిటన్ కు సీరం సీఈవో జంప్! 

దేశంలో కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకూ 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు రోజుకు దాదాు 4 వేల వరకు వస్తున్నాయి. మే రెండో వారానికి దేశంలో కరోనా విజృంభణ పీక్ స్టేజీకి వెళుతుందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. దీంతో దేశంలో కొవిడ్ టీకాలక డిమాండ్ పెరిగింది. ఆ సమయంలోనూ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దేశానికి ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్ అందిస్తున్న పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా సడెన్ గా దేశం విడిచి వెళ్లారు. ఆయన బ్రిటన్ లో మకాం పెట్టారు. సీరం  ఇన్‌స్టిట్యూట్‌ లో కోవిషీల్డ్ టీకా తయారవుతోంది.  సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో ఇండియా నుంచి జంప్ కావడంతో కోవిషీల్డ్ టీకాల పంపిణిపై సస్పెన్ష్ నెలకొంది. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని  అదర్‌ పూనావాలా తెలిపారు. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం డిమాండ్‌ చేస్తూ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఒత్తిడిని అధిగమించడానికే లండన్‌లోని తన భార్యా పిల్లల దగ్గరకు వచ్చానని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ది టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.మరోసారి అలాంటి ఒత్తిడిలోకి వెళ్లదలచుకోలేదని.. అందుకే లండన్‌లో మరింత కాలం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీకాలను అందించే బాధ్యత మొత్తం తనపైనే పడిందని.. కానీ, తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని తెలిపారు.  భారత్‌లో టీకాల కోసం కొంతమంది అంచనాలు, ఆవేశాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని అదర్‌ పూనావాలా తెలిపారు. ప్రతిఒక్కరూ తమకే వ్యాక్సిన్‌ కావాలని కోరుకుంటున్నారని.. ఇతరులకు దాని అవసరం ఎంతో గుర్తించడం లేదని అభిప్రాయపడ్డారు. యూకేకి వెళ్లడంలో వ్యాపారపరమైన కారణాలు కూడా ఉన్నాయని  సీరం సీఈవో చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీని భారత్‌ వెలుపల కూడా చేపట్టేందుకు యోచిస్తున్నామని వెల్లడించారు. దీనిపై రానున్న కొన్ని రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. పరిస్థితులు ఈ స్థాయికి దిగజారుతాయని చివరకు దేవుడు కూడా అంచనా వేసి ఉండరన్నారు.  కొవిషీల్డ్‌ టీకా ధరలపై మాట్లాడుతూ.. ప్రపంచంలో కొవిషీల్డ్‌ కంటే చౌకైన వ్యాక్సిన్‌ మరొకటి లేదని అభిప్రాయపడ్డారు.

జూన్ లో ఈటల కొత్త పార్టీ! టీఆర్ఎస్ సీనియర్ల సపోర్ట్? 

భూకబ్జా ఆరోపణలతో మంత్రి ఈటల రాజేందర్ ను వైద్యశాఖ నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. ఆయనపై విచారణ జరుగుతుండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ నివేదిక వచ్చాకా ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తనపై జరుగుతున్న తతంగాన్ని గమనిస్తున్న ఈటల రాజేందర్.. నివేదికను చూశాకే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తనకు మద్దతుగా వచ్చిన అనుచురలతో ఆయన చర్చలు కూడా జరిపారు. తనపై ప్లాన్ ప్రకారమే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్న ఈటల... భవిష్యత్ కార్యాచరణపై దాదాపు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఈటల  సన్నిహితులు చెబుతున్నారు.  జూన్ లో ఈటల రాజేందర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తోంది. తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చివరి ఏడాదంతా ఎన్నికలతో సరిపోతోంది. అందుకే జూన్ లో పార్టీ ప్రక్రియ మొదలు పెడితే.. రెండు,మూడు నెలలు అంతా సెట్ కావడానికి పోతోంది. దీంతో ఏడాది పాటు జనంలోకి వెళ్లేందుకు, ప్రజా పోరాటాలకు అవకాశం ఉంటుందని ఈటల భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా... ఈ జూన్ లోనే పార్టీ పెట్టాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈటల పార్టీ పెడితే మద్దతు ఇచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న నేతలంతా ఈటలతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని కొందరు నేతలు కూడా రాజేందర్ తో కలిసి నవడవచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ నేతగా రాజకీయంగా ఎదిగిన ఈటలకు మద్దతుగా బీసీ నేతలు, సంఘాలు కలిసివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   నిజానికి  భూకబ్జాలు చేశానంటూ కేసీఆర్ అనుకూల మీడియాలో తనపై వార్తలు రావడంతోనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈటల డిసైడయ్యారట. రాజీనామా లేఖను సిద్దం చేసుకుని మీడియా సమావేశానికి సిద్దమయ్యారట. అయితే ఆయన సన్నిహితులతో పాటు కొందరు టీఆర్ఎస్ నేతలు రాజీనామా వద్దని ఆయనను వారించారని చెబుతున్నారు. కొందరు మంత్రులు కూడా ఈటలతో మాట్లాడారని.. రాజీనామా చేస్తే తప్పు అంగీకరించినట్లు అవుతుందని, ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూశాక నిర్ణయం తీసుకోవాలని సూచించారట. అలా చేస్తే జనాల్లో సింపతి మరింత వస్తుందని చెప్పారట. అందుకే శుక్రవారం రాత్రి రాజేందర్ ప్రెస్ మీట్ ఆలస్యం అయిందంటున్నారు. అయితే వైద్యశాఖను తప్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో.. తన భవిష్యత్ కార్యాచరణపై ఈటల నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. అదే సమయంలో విపక్షాలపై కూడా జనాల్లో నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ అవసరమనే అభిప్రాయం ఉంది. పొలిటికల్ స్పేస్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు నేతలు కొత్త పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి కూడా కొత్త పార్టీ యోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే పక్కా బ్యూరోక్రాట్ అయిన కొండా.. పార్టీని నడపలేరనే అభిప్రాయం బయటికి వచ్చింది. అందుకే అతనితో ఎవరూ టచ్ లోకి వెళ్లలేదంటున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు సమస్యగా ఉంది. రేవంత్ పార్టీ పెడితే... ఆ కేసుతో సర్కార్ ఇబ్బంది పెడుతుందనే చర్చ జరిగింది. తాజాగా ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సత్తుప్లలి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని లీకులు వస్తున్నాయి. అదే జరిగితే సండ్రతో కలిసి రేవంత్ ను మరింత ఇబ్బంది పెట్టే అవకాశం సీఎంకు ఉంటుంది. అందుకే రేవంత్ పార్టీ వైపు లీడర్లు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.  ఈటల రాజేందర్ విషయానికి వస్తే.. రాజకీయాల్లో ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా ఉద్యమాన్ని నడిపించారు. టీఆర్ఎసిఎల్పీ నేతగా, మంత్రిగా ఆయనకు సుదీర్ఘ అనుభవంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఉంది. అంతేకాదు బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమకారుల మద్దతు ఉంది. ముఖ్యంగా ప్రజలతో మమేకం అవుతారనే పేరు ఉంది. ఇవన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే.. కొత్త పార్టీతో ఈటల సక్సెస్ అవుతారనే టాక్ వస్తోంది. కోదండరామ్ లాంటి ఉద్యమ నేతలంతా ఈటలతో కలిసి నడిచే అవకాశం ఉంది.  భూకబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి ఈటల రాజేందర్‌కు టీజేఎస్ అధినేత, ప్రొఫెసర్ కోదండరాం ఓపెన్ గానే మద్దతు తెలిపారు.  కేసీఆర్‌ను గద్దె దింపటానికి ఉద్యమకారులు ఏకం కావాల్సిన సమయయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు విడి విడిగా ఉండటం వలనే కేసీఆర్ రెచ్చిపోతున్నాడని విమర్శించారు.  మరోవైపు  పక్కా స్కెచ్‌తోనే త‌న‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నార‌ని ఈటల ఆరోపిస్తున్నారు. కట్టు కథలతో త‌న క్యారెక్టర్‌ని పాడుచేసే ప్రయత్నం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఎవ‌రి చ‌రిత్ర ఏమిటో త‌న‌కు తెలుసు అని.. కానీ వాటిని విప్పాల‌నుకోవ‌డం లేద‌ని అన్నారు. సమయం వచ్చినప్పుడు అందరి బండారం బయటపెడతానని చెప్పారు. దీంతో ఈటల ఎవరి చరిత్ర బయటికి తీస్తారోనన్న ఆందోళన గులాబీ లీడర్లలో కనిపిస్తోంది. 2004 నుంచి ఉద్యమంలో, 2014 నుంటి ప్రభుత్వంలో ఉన్న ఈటలకు...టీఆర్ఎస్  పార్టీ నేతల చరిత్ర అంతా తెలుసంటున్నారు. అందుకే ఈటల ఏం చేయబోతున్నారని, ఎవరిపై బాంబ్ పేల్చబోతున్నారనే టెన్షన్ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయని, ఈటల కొత్త పార్టీ పెట్టడం ఖాయమని చెబుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ కూడా జనాల్లో జరుగుతోంది.

టీడీపీ ఎంపీ కంపెనీకి కరెంట్ కట్.. జగన్ సర్కార్ మరో అరాచకం 

దేశమంతా కరోనాతో అల్లాడుతోంది. మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి. అధికారులంతా నిరంతరం శ్రమిస్తున్నారు. కోవి్డ టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ పై అంతా ఫోకస్ చేశారు. కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. కోవిడ్ ను గాలికొదిలేసిన జగన్ రెడ్డి సర్కార్.. కక్ష రాజకీయాలపైనే దృష్టి సారించింది. టీడీపీ నేతలపై ఎలాంటి కేసులు పెట్టాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, టీడీపీ నేతల వ్యాపారాలను ఎలా దెబ్బతీయాలనే అంశాలపైనే వైసీపీ సర్కార్  కసరత్తు చేస్తోంది. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా... విపక్షాలు ఆందోళన చేస్తున్నా... జనాలు ఛీదరించుకుంటున్నా వైసీపీ తీరు మాత్రం మారడం లేదు.  టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వరుసుగా అరెస్టులు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగానే.. తాజాగా మరో కిరాతక చర్యకు దిగారు. చిత్తూరు జిల్లాలో  గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీ కంపెనీలు రెండు యూనిట్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసింది ఏపీఎస్పీ డీసీఎల్. తిరుపతి సమీపంలోని కరకంబాడి అమరరాజా కంపెనీ, చిత్తూరు సమీపంలోని బంగారుపాళ్యం యూనిట్ లకు విద్యుత్ సరఫరా మధ్యాహ్నం నుంచి నిలిపివేసిన విద్యుత్ శాఖాధికారులుపొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆదేశాలతో ఏపీఎస్పీ డీసీఎల్    పవర్ కట్ చేయడంతో టీడీపీ ఎంపీకి చెందిన అమరరాజా బ్యాటరీ కంపెనీల  రెండు యూనిట్లలో ఆపరేషన్స్ పూర్తిగా నిలిచిపోయాయి. వైసీపీ నేతల ఆదేశాలతోనే  ఏపీఎస్పీ డీసీఎల్ అధికారులు పవర్ కట్ చేశారనే విమర్శలు వస్తున్నాయి. 

భార‌త్‌కు లాక్‌డౌనే బెట‌ర్‌.. మోదీ త‌ప్పు చేశారు.. 

ఇండియాలో వెంట‌నే లాక్‌డౌన్ విధించాలి. అత్య‌వ‌స‌ర చికిత్సాకేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి.  క‌రోనా ఉధృతి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కేంద్రీకృత వ్య‌వ‌స్థ ఉండాలి. ఇలా.. భార‌త్‌కు మూడు కీల‌క సూచ‌న‌లు చేశారు అమెరికాకు చెందిన అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అధ్యక్షుడు జో బైడెన్‌ వైద్య సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ. ఈ మేరకు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.    కొవిడ్‌పై విజయం సాధించామని భారత్‌ ముందే ప్రకటించి త‌ప్పు చేసింద‌ని ఫౌచీ గుర్తుచేశారు. ప్రస్తుతం భారత్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. దేశాన్ని తాత్కాలికంగా షట్‌డౌన్‌ చేయడం అత్య‌వ‌స‌రం అన్నారు. లాక్‌డౌన్‌ విధించడానికి ఏ దేశమూ ఇష్టపడదని.. కానీ, కొన్ని వారాల పాటు లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్ల పెద్ద సమస్యలేమీ తలెత్తవని తెలిపారు. నెలల తరబడి షట్‌డౌన్‌ విధించాల్సిన అవసరం లేదని.. కొన్ని వారాల పాటు అమలు చేస్తే వైర‌స్‌ వ్యాప్తి ఆగిపోతుందని వివరించారు.  వెంటనే ఆక్సిజన్‌, మెడిసిన్‌, పీపీఈ కిట్లు సమకూర్చుకోవాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఫౌచీ సూచించారు. ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. భారత్‌ రకం వైరస్‌పై ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్‌ ప్రాముఖ్యతను ఆంటోనీ ఫౌచీ ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఇప్పటి వరకు కేవ‌లం 2 శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయి టీకా అందించార‌ని తెలిపారు. ఈ లెక్కన వ్యాక్సినేషన్‌ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలతో వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు.     ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలవాలని ఫౌచీ పిలుపునిచ్చారు. కీలక వైద్య సరఫరాలను సమకూర్చుకునేందుకు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని దానికోసం ఓ కమిషన్‌ లేదా అత్యవసర గ్రూప్ వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా సహా ఇతర దేశాలు భారత్‌కు దన్నుగా నిలవాలని ఫౌచీ పిలుపునిచ్చారు. గతంలో భారత్‌ ఇతర దేశాలకు సాయం చేయడంలో చాలా ఉదారంగా వ్యవహరించిందన్నారు. అదే తరహాలో ఇప్పుడు భారత్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ఆంటోనీ ఫౌచీ.

ఈట‌ల మొన‌గాడేనా? కేసీఆర్‌ను ఢీకొట్టి నెగ్గుతారా? చ‌రిత్ర ఏం చెబుతోంది?

శుక్ర‌వారం వ‌ర‌కూ టాప్ లీడ‌ర్‌. ప‌వ‌ర్‌ఫుల్ మినిస్ట‌ర్‌. క‌రోనా స‌మ‌యంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కీల‌క విధులు నిర్వ‌హిస్తున్నారు. ఉద్య‌మ‌కారుడిగా, కేసీఆర్ అనుచ‌రుడిగా.. పార్టీలో మంచి ప్ర‌యారిటీ ఉంది. క‌ట్ చేస్తే.. కేలండ‌ర్‌లో డేట్ మారినంత ఈజీగా ఈట‌ల రాజ‌కీయ భ‌విత‌వ్యం మారిపోయింది. రాత్రికి రాత్రే.. ఆయ‌న‌పై భూక‌బ్జాల నెపం మోప‌బ‌డింది. వెంట‌నే విచార‌ణా మొద‌లైపోయింది. ఆ వెంట‌నే ప్రాథ‌మిక నివేదికా వ‌చ్చేసింది. ఆ వెనువెంట‌నే ఆరోగ్య‌శాఖ ఆయ‌న నుంచి లాక్కోబ‌డింది. ఇలా ఈట‌ల రాజేంద‌ర్ అనే నేత‌... ఒక్క‌రోజులోనే రాజ‌కీయంగా అథఃపాతాళానికి తోసేయ‌బ‌డ్డారు. కేసీఆర్  ఎంత ఖ‌త‌ర్నాక్ పొలిటీషియ‌నో ఈట‌ల ఎపిసోడ్‌తో మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌స్తోంది.  బాంచ్చెన్ దొర‌ అన్నంత కాల‌మే.. కేసీఆర్ కనుస‌న్న‌ల్లో పని చేసినంత కాల‌మే.. టీఆర్ఎస్‌లో మ‌నుగ‌డ‌. కాద‌ని.. గులాబీ జెండాకు ఓన‌ర్లం మేమేన‌ని.. త‌ల ఎగ‌రేసే వారి ప‌రిస్థితి.. ఇలానే త‌ల‌కిందులు అయిపోతుంద‌నేది కేసీఆర్ గురించి బాగా తెలిసిన వారు చెబుతున్న మాట‌. ఇవాళ ఈట‌ల రాజేంద‌ర్‌కు ఆ ప‌రిస్థితి వ‌చ్చింది. అంత‌కుముందు అనేక మంది హేమాహేమీలాంటి నేత‌లు సైతం ఇలానే కేసీఆర్ రాజ‌కీయ క్రీడ‌కు బ‌లి ప‌శువులు అయ్యార‌ని గుర్తు చేస్తున్నారు.  ఎక‌రి వ‌ర‌కో ఎందుకు.. ప్రొఫెస‌ర్ కోదండ‌రాంనే తీసుకోండి. ఉద్య‌మంలో దాదాపు కేసీఆర్‌కు స‌మాన స్థాయి ఉన్న నేత ఆయ‌న‌. కేసీఆర్ ఇంట్లో కూర్చొని రాజ‌కీయ చ‌ద‌రంగం ఆడుతుంటే.. తెలంగాణ జేఏసీ త‌ర‌ఫున ప్ర‌జాక్షేత్రంలో ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌ను అమ‌లు చేసింది కోదండ‌రాం సారే. ఆ స‌మ‌యంలో ప్రొఫెస‌ర్‌ను ఉద్యమంలో ఎంత‌గా వాడుకోవాలో అంత‌కు మించే వాడేసుకున్నారు కేసీఆర్‌. ఆ త‌ర్వాత‌.. కూర‌లో క‌రివేపాకులా తీసి పారేశారు. తెలంగాణ వ‌చ్చాక.. కోదండ‌రాం ప‌రిస్థితి ఎలా మారిందో అంతా చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ దెబ్బ కొడితే.. ఎంత దారుణంగా ఉంటుందో చెప్ప‌డానికి కోదండ‌రామే క‌ళ్ల ముందు క‌నిపించే సాక్షం. అంత‌కుముందు ఆలె న‌రేంద్ర‌. విజ‌య‌శాంతిల విష‌యంలోనూ ఇలానే జరిగింది. ఆలె న‌రేంద్ర‌.. టైగ‌ర్ న‌రేంద్ర‌గా బీజేపీలో ఓ వెలుగు వెలిగారు. తెలంగాణ కోసం క‌మ‌లం పార్టీని కాద‌ని.. సొంతంగా పార్టీ పెట్టారు. కేసీఆర్ ఆహ్వానం మేర‌కు త‌న పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎంపీగా గెలిచి.. కేంద్రమంత్రి అయ్యారు. పార్టీలో నెంబ‌ర్ 2 గా ఎదిగారు. త‌న‌కు స‌మ స్థాయిగా ఎదిగాడ‌నే అక్క‌స్సో.. ఆలె తో అవ‌స‌రం తీరిపోయింద‌నో.. కార‌ణం తెలీదుగానీ.. ఆ త‌ర్వాత కేసీఆర్ నరేంద్ర‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. పార్టీ నుంచి పంపించేశారు. ఆ త‌ర్వాత ఆలె న‌రేంద్ర పేరు చ‌రిత్ర‌లో క‌లిసిపోయింది.  విజ‌య‌శాంతి విష‌యంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. సినీ కెరీర్‌లో లేడీ అమితాబ్‌గా, రాముల‌మ్మ‌గా  రాణించిన విజ‌య‌శాంతి.. త‌ల్లి తెలంగాణ పార్టీతో రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలోకి వ‌చ్చారు. కేసీఆర్ విసిరిన పాచికకు ప‌డిపోయారు. పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయించి.. కేసీఆర్‌కు దేవుడిచ్చిన‌ చెల్లిగా పార్టీలో అంద‌ల‌మెక్కించి.. అవ‌స‌రం తీరాక‌.. అక్క‌డి నుంచి పాతాళంలోకి ప‌డేశారు. గులాబీ బాస్ రాజ‌కీయ క్రీడ‌కు బ‌ల‌య్యారు లేడీ ఫైర్‌బ్రాండ్.. విజ‌య‌శాంతి.     ఇలా.. టీఆర్ఎస్‌లో క‌ల్వ‌కుంట్ల కుటుంబం మిన‌హా.. బ‌య‌టి వారెవ్వ‌రినీ నెంబ‌ర్ టూ గా ఎద‌గ‌నివ్వ‌రు కేసీఆర్‌. కాంగ్రెస్‌లో కాక‌లు తీరిన నేత‌లుగా ఏలిన‌.. కేకే, డీఎస్ లాంటి వాళ్లు సైతం కారు ఎక్కాక.. కిమ్మ‌న‌కుండా ఓ మూల‌న కూర్చున్నారు. ఈట‌ల లాంటి వాళ్లు స్వ‌త‌హాగా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో పార్టీలో కీల‌క నేత‌గా రాణించినా.. ఇలా స‌మ‌యం చూసి.. ఛాన్స్ చిక్కిన‌ప్పుడు సైడ్ చేయ‌డంలో కేసీఆర్‌ది మాస్ట‌ర్ మైండ్ అంటారు. అందుకే, టీఆర్ఎస్‌లో ఎవ‌రికైనా నెంబ‌ర్ 2 అనే ప‌ట్టం క‌ట్టారో.. ఇక వారి రాజ‌కీయ ఎదుగుద‌ల‌కి స‌మాధి త‌ప్ప‌ద‌న్న‌ట్టే.  కేవ‌లం టీఆర్ఎస్ అనే కాదు.. నెంబ‌ర్ 2 పొజిష‌న్ ఏ పార్టీలోనూ, ఎవ‌రికీ క‌లిసొచ్చేలా లేదు. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌ప్పుడు.. టీడీపీలో దేవేంద‌ర్‌గౌడ్ నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లో ఉండేవారు. సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చేవారు. హోంమంత్రిగా ఓ వెలుగువెలిగారు. రాజ‌కీయంగా ఉచ్చ‌స్థితిలో ఉన్న స‌మ‌యంలో స‌డెన్‌గా టీడీపీకి రాజీనామా చేసి అంద‌రికీ షాకిచ్చారు దేవేంద‌ర్‌గౌడ్‌. ప్ర‌త్యేక తెలంగాణ కోస‌మంటూ చంద్ర‌బాబును, తెలుగుదేశాన్ని వీడి.. న‌వ తెలంగాణ పార్టీ స్థాపించారు. కొత్త పార్టీలో ఆయ‌నే కింగ్ మేక‌ర్‌. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్‌తో పోటీ ప‌డ్డారు. కొన్ని రోజులు బాగా హ‌డావుడి చేశారు. ఆ త‌ర్వాత సొంతంగా రాజ‌కీయాలు ఎంత క‌ష్ట‌మో తెలిసొచ్చాయి. పార్టీని పీఆర్పీలో క‌లిపేసి.. మ‌ళ్లీ పార్టీ మారి.. క్ర‌మంగా కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు.  ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ వైసీపీలో విజ‌య‌సాయిరెడ్డి నెంబ‌ర్ 2గా ఉన్నారు. జ‌గ‌న్‌రెడ్డితో పాటు కేసుల్లో ఇరుక్కొని.. జైల్లో ఊచ‌లు లెక్క‌బెట్టి.. ఎంపీగా వెలిగిపోతున్నారు. అయితే, ఆయ‌న ఈ మ‌ధ్య జ‌గ‌న్‌కు తెలీకుండా ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీతో బాగా అంట‌కాగుతున్నార‌ని.. అది జ‌గ‌న్‌కి ఏమాత్రం ఇష్టం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకే, త్వ‌ర‌లోనే ఏపీ రాజ‌కీయాల్లోనూ ఉలిక్కిపాటు త‌ప్ప‌దంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. బీజేపీ డైరెక్ష‌న్‌లో జ‌గ‌న్ సీటుకు విజ‌య‌సాయి ఎస‌రు పెట్టే అవ‌కాశం లేక‌పోలేదంటున్నారు. లేదంటే, స‌రైన స‌మ‌యంలో విజ‌య‌సాయికి జ‌గ‌న్‌రెడ్డి చెక్ పెట్ట‌డం ఖాయమ‌ని భావిస్తున్నారు.  ఇలా.. ఈట‌ల ఎపిసోడ్‌తో తెలుగురాష్ట్రాల్లో జ‌రిగిన అనేక రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు మ‌రోసారి చ‌ర్చ‌కొస్తున్నాయి. వాటిని చూసి కేసీఆర్ ఎంత ఖ‌త‌ర్నాకో గుర్తు చేస్తున్నారు. మ‌రి, రాజ‌కీయ చాణ‌క్యుడితో విభేదించి ఈట‌ల నెగ్గుకొస్తారా? సొంత కుంప‌టి పెట్టుకొని రాణిస్తారా? బీసీల‌కు రాజ్యాధికార స్వ‌ప్నం నెర‌వేరుస్తారా? లేక‌, కోదండ‌రాం, ఆలె న‌రేంద్ర‌, విజ‌య‌శాంతిలా రాజ‌కీయంగా క‌నుమ‌రుగు అవుతారా? చూడాలి...

ఏపీలో ఘోరం.. ఆక్సిజన్ అందక 12 మంది మృతి..

కరోనా ఆ పేరు వింటే పసిపిల్లతో పాటు. పండు ముసలి కూడా పరేషాన్ పడుతున్నారు. ఎవరి ప్రాణాలు వాళ్ళు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో ఓ మూలాన నక్కి కూర్చుంటున్నారు. కరోనా కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక వైపు వ్యాక్సిన్ అందడం లేదు. మరో వైపు ఆక్సిజన్ అందడం లేదు. తాజాగా ఆక్సిజన్ అందక ఒకే రోజు నలుగురు మృతి చెందారు. ఆసుపత్రి యాజమాన్యం అది తప్ప్పుడు ప్రచారం అని వాదిస్తుంది. భాదితులు మాత్రం ఆక్సిజన్ అందుకనే మృతి చెందారని అంటున్నారు.   కర్నూలు జిల్లాలో  కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న కేఎస్ కేర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో నలుగురు కొవిడ్ బాధితులు మృతిచెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ఆస్పత్రులకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న నాలుగో పట్ణణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి తనిఖీలు చేయగా.. ఐసీయూలో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆక్సిజన్‌ అందక ఏ ఒక్కరూ మృతి చెందలేదని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది.    విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్ ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేక రోగులు మృతి చెందారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి ఎండీపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తాం. అనుమతి లేకుండానే ఇక్కడ కొవిడ్ చికిత్సలు చేస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించాం’’ అని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో గిడ్డయ్య ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు.   దేశ రాజధానిలోని 8 మంది మృతి..  దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో ఓ వైద్యుడు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని బత్రా ఆసుపత్రిలో శనివారం ఉదయం మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. ప్రాణవాయువు ట్యాంకర్లు ఆసుపత్రికి చేరేలోపే.. ఐసీయూలో ఉన్న ఆరుగురు కరోనా రోగులు.. వార్డులో ఉన్న ఇద్దరు మృతిచెందారు. ఇదే ఆసుపత్రికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ యూనిట్‌ హెడ్‌ డాక్టర్‌ ఆర్కే హింథనీ కూడా ఆక్సిజన్‌ లేక ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.   

క‌రోనా కాలంలో చ‌ర్చిల నిర్మాణం! జగన్ రెడ్డి సర్కార్ నిర్వాకం 

ఏపీలో కొవిడ్ క‌ల్లోలం. ప్ర‌తీరోజూ సుమారు 17 వేల కేసులు. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు. మందుల కోసం ఇక్క‌ట్లు. హాస్పిట‌ల్ బెడ్స్ కోసం క‌ష్టాలు. ఆక్సిజ‌న్ కోసం ఆరాటం. ప్రాణాల‌తో రోగుల‌ పోరాటం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుత క‌ల్లోల ప‌రిస్థితుల‌కు జ‌గ‌న్ స‌ర్కారే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌. ఓవైపు కొవిడ్ కుమ్మేస్తుంటే.. మ‌రోవైపు ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లంటూ ప్ర‌భుత్వం పంతానికి పోతోంది. విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతోంది. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. పాల‌కుల వైఫ‌ల్యం నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు.. ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌, సంగం డెయిరీ స్వాధీనంతో క‌క్ష సాధింపు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇదంతా ఓవైపు. ఇవ‌న్నీ పైకి క‌నిపిస్తున్న విష‌యాలు. మ‌రి, లోలోన‌.. మ‌రింత ఘోరం జ‌రుగుతోంది. గుట్టు చ‌ప్పుడు కాకుండా య‌వ్వారం చ‌క్క‌బెడుతోంది. అదే, ఏపీలో చ‌ర్చిల నిర్మాణం.  అవును, నిజ‌మే. ప్రస్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో సైలెంట్‌గా, అండ‌ర్ క‌రెంట్‌గా.. చ‌ర్చిల నిర్మాణం, మ‌ర‌మ్మ‌త్తుల‌కు టెండ‌ర్లు పిలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ 4 కోట్ల విలువైన ప‌నుల‌కు టెండ‌ర్లు ఆహ్వానించింది. ఈ విష‌యం ఎవ‌రికైనా తెలుసా? ఎక్క‌డైనా ఈ న్యూస్ వ‌చ్చిందా? ఎవ‌రికీ తెలీదు. ఎక్క‌డా ఈ వార్త క‌నిపించ‌దు. అంత గుట్టుచ‌ప్పుడు కాకుండా ఏపీలో చ‌ర్చిల కోసం స‌ర్కారు త‌నవంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. టెండ‌ర్ కాపీల‌తో స‌హా.. లీగ‌ల్ రైట్స్ ప్రొటెక్ష‌న్ ఫోరం.. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేయ‌గా ఈ విష‌యం వెలుగు చూసింది. న‌వ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు అన్న‌ట్టు ఉంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరు. క‌రోనా చికిత్స కోసం ఏపీ ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు నిండిపోయాయి. డ‌బ్బులు లేక, ప్రైవేట్‌లో చికిత్స పొంద‌లేక ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఆక్సిజ‌న్ కొర‌త‌, మందుల కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. ఈ స‌మ‌యంలో ఒక్క రూపాయి ఉన్నా.. దాన్ని కొవిడ్ క‌ట్ట‌డికి, చికిత్స‌కు ఉప‌యోగించాలి కానీ.. ఏదో అత్య‌వ‌స‌రం అన్న‌ట్టు చ‌ర్చిల నిర్మాణానికి టెండ‌ర్లు పిల‌వ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. చ‌ర్చిల కాంపౌండ్ వాల్స్ క‌ట్ట‌డానికి సైతం టెండ‌ర్లు పిలవాల్సినంత అవ‌స‌రం ఏమొచ్చిందో స‌ర్కారుకే తెలియాలి.  ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాలతో ఖాళీ ఖ‌జానా వెక్కిరిస్తోంది. ప్ర‌స్తుతం అప్పులు, భూముల అమ్మ‌కంతోనే ప్ర‌భుత్వం న‌డుస్తోంది. ఇలాంది దుర్భ‌ర ఆర్థిక దుస్థితిలో క‌రోనా కాటు మ‌రింత కూరుకుపోయేలా చేసింది. ఈ స‌మ‌యంలో ప్ర‌తీ రూపాయీ ప్ర‌జాప్రయోజ‌నం కేసం జాగ్ర‌త్త‌గా వాడాల్సి ఉంటుంది. క‌రోనా టెస్టులు, కిట్‌లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, రెమ్‌డెసివిర్ మందులు, వ్యాక్సిన్ల కొనుగోళ్ల‌కు ఎంత డ‌బ్బు ఖ‌ర్చు చేసినా స‌రిపోదు. ఇంకా ఎంతో బ‌డ్జెట్ అవ‌స‌రం ఉంటుంది. మ‌రోవైపు, ఇప్ప‌టికే గుదిబండ‌లా మారిన సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగించాల్సి ఉంటుంది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో 4 కోట్లు పెట్టి.. చ‌ర్చిలు, చ‌ర్చి కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి టెండ‌ర్లు పిల‌వ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఎందుకిలా చేస్తోంది?   ఓవైపు జ‌గ‌న్‌రెడ్డి సీఎం అయిన‌ప్ప‌టి నుంచీ ఏపీ... మ‌త ప‌రంగా సెన్సిటివ్ స్టేట్‌గా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌త మార్పిడులు భారీగా జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు. చ‌ర్చిల ప్రాధాన్యం పెరుగుతోంద‌ని.. ఫాస్ట‌ర్‌ల పెత్త‌నం ఎక్కువ అవుతోంద‌నే విమ‌ర్శ‌లు. అందుకు త‌గ్గ‌ట్టుగానే.. వ‌రుస‌గా జ‌రుగుతున్న ఆల‌యాల‌పై దాడుల ఘ‌ట‌న ఆ అనుమానాల‌ను మ‌రింత పెంచుతోంది. అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం.. రామ‌తీర్థం విగ్ర‌హాల ధ్వంసం.. తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం.. వేరే మ‌త‌స్తుల‌కు టీటీడీలో ఉద్యోగాలంటూ ఆరోప‌ణలు.. ఎస్‌వీబీసీ ఘ‌ట‌న‌.. బెజ‌వాడ దుర్గ‌మ్మ ర‌థ వెండి సింహాల మాయం.. ఇలా అనేక వివాదాల‌తో ఏపీ ప్ర‌భుత్వం ఓ మతానికి వ్య‌తిరేకం, మ‌రో మ‌తానికి అనుకూలం అనే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సైతం అందుకు త‌గ్గ‌ట్టే ఉంది. ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో చ‌ర్చిల నిర్మాణం, మ‌ర‌మ్మ‌త్తుల కోసం 4 కోట్ల విలువైన‌ ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వ‌డం.. జ‌గ‌న్‌రెడ్డికే చెల్లింది. టెండ‌ర్ కాపీల‌తో స‌హా.. లీగ‌ల్ రైట్స్ ప్రొటెక్ష‌న్ ఫోరం.. చేసిన ట్విట్ట‌ర్‌ పోస్ట్ క‌ల‌క‌లంగా మారింది. జ‌గ‌న్‌రెడ్డి.. ఇది మీకు త‌గునా? క‌రోనా కాలంలో చ‌ర్చిల‌కు కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేయ‌డం స‌మంజ‌స‌మా? అని నెటిజ‌న్లు ట్వీట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. 

దొంగ పొలీసు..

ఓపెన్ చేస్తే.. అది నాగర్ కర్నూల్ జిల్లా. కల్వకుర్తి మండలం ఘటన స్థలం . ఆమె పేరు శాంతమ్మా . ఊరు కుప్పగండ్ల. ఆమె ఉరుకొండ వెళ్ళడానికి కల్వకుర్తి కి వచ్చింది. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం లో ఆటో కోసం వెళ్తుంది. ఆ చుట్టూ పక్కల జనం కూడా రద్దీగా ఉన్నారు. అంతలో బస్టాండ్ నుంచి ఆటో వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఆమెను . అమ్మా.. అంటూ శాంతంమ్మ పలకరించాడు. దగ్గరికి వచ్చాడు. తోటి ప్రయాణికుడే కదా అని ముసలవ్వ నమ్మితే.. నేను పోలీసని చెప్పాడు. కరోనా కాలంలో దోంగల భయం ఉందంటూ.. మంచిమాటలు చెప్పాడు.  అమ్మ నేను పోలీసు నని చెప్పి నమ్మించాడు. మెడలో బంగారం ఉంచుకుంటే ఎలాగమ్మా, అసలే కరోనా నేపథ్యంలో చోరీలు పెరిగాయి కష్టకాలం ఉంది, కాబట్టి దొంగలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు బంగారం ఏ దొంగ కంటికో కనబడితే ఎవరైనా ఎత్తుకుని వెళ్తే ఎలాగని భయాన్ని పురిగొల్పాడు..నగలు తీసి భద్రంగా దాచుకో మని జాగ్రత్తలు చెప్పాడు. అయితే వాడే ఓ దోంగ అన్న సంగతి కనిపెట్టలేక పోయిన అవ్వ కరోనా కాలంలో కష్టాలు అంటూ చెప్పిన మాటలనే నమ్మింది..ఆ వెంటనే ఆమె మెడలో నుంచి పుస్తెలతాడు తీసింది. అయితే ఎక్కడ పెట్టాలో తెలియక తికమక పడుతున్న అవ్వకు, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఓ పేపర్ కవర్‌ ఉందని చెప్పాడు. దీంతో దోంగను నమ్మిన ముసలవ్వ అందులో పుస్తెలతాడు పెట్టమని ఇచ్చింది. అయితే పెస్తెలతాడును తన జేబులో వేసుకుని మరో కాగితం మలిచి ఆమె సంచిలో పెట్టాడు. అనంతరం అక్కడి నుండి జారుకున్నాడు. అయితే కాసేపటికి తేరుకున్న శాంతవ్వ కోంతదూరం వెళ్లాక అనుమానం వచ్చి దోంగ ఇచ్చిన పేపరు కవర్‌ను చూసింది..దీంతో గుండే అగినంత పనైంది. కాగితంలో రాళ్లు తప్ప బంగారం లేదు.. అక్కడే లబోదిబోమని మొత్తుకుంది. మాటల గారడీలో పెట్టి బంగారం దోచుకువెళ్లాడని అర్థమయింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాధు చేసింది శాంతమ్మ . పోలీసులు కేసు నమోదు చేసుకొని. దర్యాప్తు చేస్తున్నారు.   

పెళ్లి పేరుతో..  పెద్ద మోసమే.. 

అది హైద్రాబాద్ బేగంపేట్. ఆ ప్రాంతానికి చెందిన ఓ యువతి. ఆమె  సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ అప్‌లోడ్ చేసింది. ఆమె ప్రొఫైల్ చూశాడు మొహల్‌కుమార్ . ఆ తర్వాత ఫోన్ చేశాడు.  నెక్స్ట్ ఇద్దరు పరిచయం చేసుకున్నారు. అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కొంతకాలం గడిచింది.  కట్ చేస్తే.. గుజరాత్ లో ఉన్న తన ఇంటి రిపేర్ కోసం డబ్బులు అసరమున్నాయని.. మేస్త్రి ఖాతాలో కొన్నీ డబ్బులు జామా చేయమన్నాడు. అందుకు ఆమె కూడా ఇళ్లు మా కోసమే కదా అనుకుంది. అతడు చెప్పిన ఖాతాలో డబ్బులు పంపించింది. పెళ్లి అయ్యాక తనను అమెరికా తీసుకెళ్తాను అని. అందుకు కావాల్సిన ప్రాసెస్ అక్కడి అక్కడి నుండే స్టార్ట్ చేస్తాను అన్నాడు. నాకు కాబోయే వాడు చాలా మంది వాడు అనుకుంది. వీసా కు సంబందించిన ఓ నెంబర్ ఇచ్చి వారిని సంప్రదించాలని అన్నాడు. మళ్ళీ ఆ యువతి తను చెప్పినట్టలా గంగిరెద్దులా తలాడించింది. వీసా ప్రాసెస్ కోసం వారు అడిగిన 4 లక్షల రూపాయలు వారు చెప్పిన ఖాతాలోకి ట్రాన్సఫర్ చేసింది.      ఇక, ఇది జరిగిన వారానికి తాను ఇండియా వస్తున్నట్టు సైబర్ నేరగాడు యువతికి చెప్పాడు. నేరుగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు నమ్మించాడు. ఇక, ఎయిర్‌పోర్ట్ నుంచి ఆమెకు ఫోన్ చేసి.. కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తన వద్ద 50 వేల డాలర్లు ఉన్నందున.. జరిమానా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా చెప్పారు. ఇలా చెప్పి ఆ యువతి దగ్గర నుంచి రూ. 6 లక్షలు దోచేశాడు. ఆ తర్వాత కూడా డబ్బులు అడగటంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెను మాయ మాటలతో బురిడీ కొట్టించాడు మొత్తం 10 లక్షల టోకరా వేశాడు. ఆ సైబర్ నేరగాడు మీరు గూడా జెర్ర జాగ్రత్త మరి అమెరికా సంబంధాన్ని అని చెప్పగానే ఆగం ఆగం కాకండి. ఆలోచించండి. 

ఈటల తర్వాత హరీషే టార్గెటా? టీఆర్ఎస్ చీలిపోనుందా?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా  ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద స్పందించి విచారణకు ఆదేశించడం అంతా సంచలనమే. అంతేకాదు 'రాజు తలుచుకోవాలే గానీ' .. అన్నట్టుగా ఈటల భూ కబ్జా ఆరోపణలపై జెట్ స్పీడ్‌లో అధికార యంత్రాంగం కదిలింది. తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. గంటల్లోనే ప్రాథమిక విచారణ తొలి నివేదిక సీఎస్‌కు చేరిందని సమాచారం. మూడెకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ చేస్కుని బ్యాంకులో తాకట్టు  పెట్టి ఋణం పొందినట్లు జిల్లా కలెక్టర్ హరీష్ నిర్దారించారని తెలుస్తోంది. పూర్ణచందర్ రావు రిపోర్ట్ కూడా రాత్రి లోపు సమర్పించే అవకాశం ఉందంటున్నారు. రాత్రి వరకు ఈటలను రాజీనామా చేయమని కేసీఆర్ ఆదేశించవచ్చనే చర్చ జరుగుతోంది.  కేసీఆర్ అనుకూల మీడియాలోనే ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ సొంత ఛానెల్ టీన్యూస్ లోనే గంటల కొద్ది ఈటలపై వార్తలు నడపడంతో.. ఆయనపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. ఈటలకు చెక్ పెట్టేందుకే నాలుగేండ్ల క్రితం జరిగినట్లుగా చెబుతున్న భూబాగోతాన్ని బయటికి తీశారంటున్నారు. భూవ్యవహారంలో ఈటలను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈటల ఎపిసోడ్ తో తెలంగాణలో ఇప్పుడు మరో చర్చ జరుగుతోంది. ఈటల తర్వాత కేసీఆర్ టార్గెట్ ఎవరుంటారనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈటల తర్వాత మంత్రి హరీష్ రావే.. గులాబీ బాస్ టార్గెట్ అనే ప్రచారం జరుగుతోంది.  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు హరీష్ రావు, రాజేందర్. ఉద్యమంలో కీలక పాత్ర వీరిదే. ముఖ్యమైన కార్యక్రమాలన్ని ఈ ఇద్దరు చేతులమీదుగానే సాగేవి. 2004 నుంచి 09 వరకు అసెంబ్లీ టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించారు ఈటల రాజేందర్. ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్ లో ఈ ఇద్దరికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. ఈటలకు కీలకమైన ఆర్థిక శాఖ, హరీష్ రావు ఇరిగేషన్ శాఖ అప్పగించారు. అయితే 2018 వచ్చే సరికి సీన్ మారిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హరీష్ , ఈటలను దూరం పెట్టారు కేసీఆర్. మంత్రివర్గంలోనూ చోటు కల్పించలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ వీరిద్దరి పాత్ర తగ్గిపోయింది. దీంతో నియోజకవర్గానికే పరిమితమయ్యారు హరీష్ రావు, ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలను దూరం పెట్టడంపై ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో హరీష్, ఈటలకు చోటు దక్కింది. కేబినెట్ విస్తరణలో చోటు కల్పించిన కేసీఆర్ .. హరీష్ కు ఆర్థికశాఖ, ఈటలకు వైద్య శాఖ కట్టబెట్టారు. ప్రజల్లో తిరిగే హరీష్ కు ఆర్థికశాఖ ఇచ్చి అతని కాళ్లకు బంధం వేశారనే ప్రచారం జరిగింది. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నా హరీష్ రావు.. కేవలం సిద్ధిపేట జిల్లా వరకే పరిమితమయ్యారు. కేసీఆర్ ఆదేశాల వల్లే అతను ఇతర జిల్లాలకు వెళ్లలేదని చెబుతారు. మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ హరీష్ సిద్దిపేట వరకే పరిమితమయ్యారు. దీంతో పార్టీలో హరీష్ కు అవమానం జరుగుతుందని, ఆయనకు పొమ్మనలేక పొగ బెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. హరీష్ రావు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారనే వార్తలు కూడా చక్చర్లు కొట్టాయి. దీని వెనుక కూడా కేసీఆర్ వర్గం హస్తం ఉందనే చర్చ జరిగింది. ఈటల, హరీష్ ను కావాలనే పార్టీలో అవమానిస్తున్నారని తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. హరీష్, ఈటల కలిసి పొత్త పార్టీ పెట్టబోతున్నారని, బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారాలు కూడా జరిగాయి.   తాజాగా ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లే ఈటల రాజేందర్ ను సాగనంపే ప్రయత్నాలు టీఆర్ఎస్ లో జరుగుతున్నాయని అంటున్నారు. భూకబ్జా ఆరోపణలతో ఈటలను తప్పించడం ఖాయమంటున్నారు. ఈటలను సాగనంపాకా .. హరీష్ రావు టార్గెట్ గా గులాబీ ఆపరేషన్ మొదలవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలను ఒక్కొక్కరిగా తప్పిస్తున్నారని , అందులో భాగంగానే మొదట ఈటలను టార్గెట్ చేశారంటున్నారు. ఈటల తర్వాత హరీష్ రావుకు చెక్ పెట్టేలా ఇప్పటికే వ్యూహం సిద్ధమైందని అంటున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ లో ఊహించని పరిణామాలు జరుగుతాయని, గులాబీ పార్టీ చీలిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

కేటీఆర్ కు తగ్గని ఫీవర్! యశోద హాస్పిటల్ లో అడ్మిట్

కరోనా సోకిన తెలంగాణ ఐటీ, పురపాల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  యశోద హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత నెల 23న కేటీఆర్ కు  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కేటీఆర్.. అప్పటినుంచి హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. అయితే  రెండ్రోజులుగా అధిక జ్వరంతో బాధపడుతుండడంతో కేటీఆర్ ను హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేటీఆర్ ఆక్సిజన్ లెవల్స్ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుండడంతో డాక్టర్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోగ్యంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

పొడుస్తున్న కొత్త పొద్దు? ఆ న‌లుగురితో పోరు తెలంగాణ‌మా?

రేపే, మాపో టీఆర్ఎస్ నుంచి ఈట‌ల అవుట్‌. ఇది ప‌క్కా. మ‌రి, వాట్ నెక్ట్స్‌? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ పొద్దుపై కొత్త పార్టీ పొడుస్తోంది. పోరుబిడ్డ ఈట‌ల‌.. కొత్త పార్టీ స‌న్నాహాల్లో ఉన్నార‌ట‌. పార్టీ ఏర్పాటుకు ఎప్ప‌టి నుంచో స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. అందుకే, గులాబీ బాస్ కేసీఆర్ నియంతృత్వంపై తిరుగుబాటు జెండా ఎగ‌రేస్తున్నార‌ని చెబుతున్నారు. గులాబీ జెండాకు గులాంలు కాదు.. ఓన‌ర్లం అనేంత సాహ‌సం ఆయ‌న అందుకే చేశార‌ని అంటున్నారు. ఈట‌ల కొత్త పార్టీ ఏర్పాట్ల‌పై వివిధ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారంతోనే ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించే కార్య‌క్ర‌మం మొద‌లైంద‌ని తెలుస్తోంది. ఆప‌రేష‌న్ ఈట‌ల‌లో భాగంగానే.. ఈట‌ల‌పై మీడియాలో భూక‌బ్జా ఆరోప‌ణ‌లు.. విచార‌ణ‌.. ఆ త‌ర్వాత దోషిగా నిర్ధార‌ణ జ‌రిగిపోతుంద‌ని అంటున్నారు.  కేసీఆర్ అటాక్ ఇలానే ఉంటుంద‌ని తెలియ‌నంత అమాయ‌కుడేమీ కాదు ఈట‌ల రాజేంద‌ర్‌. పార్టీ ఏర్పాటు నుంచి గులాబీ బాస్‌తో క‌లిసి ప‌ని చేసిన నేత‌. టీఆర్ఎస్ ఉనికే లేని రోజుల్లో కూడా పార్టీ వాయిస్‌ను బ‌లంగా వినిపించిన లీడ‌ర్‌. కేసీఆర్ కుటుంబం హ‌వాలో ఈట‌ల ప్రాధాన్యం క‌నుమ‌రుగైంది కానీ.. ఈట‌ల చాలా గ‌ట్టి పిండ‌మేన‌ని తెలంగాణ‌వాదులంద‌రికీ తెలుసు. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా కేసీఆర్ ముందు తాను మినుగురు పురుగులా ప‌డి ఉండ‌టం ఈట‌ల‌కు అస్స‌లు ఇష్టం లేద‌ట‌. కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక‌ నిర్ణ‌యాలు, పాల‌నా తీరుపై ఆయ‌న ఎప్ప‌టి నుంచో అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నార‌నేది ఆయ‌న స‌న్నిహితుల మాట‌. దొర‌ల‌ పాల‌న‌లో బీసీల‌కు ఎన్న‌డూ న్యాయం జ‌ర‌గ‌ద‌ని.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అధికారం ద‌క్కాల‌ని ఈట‌ల బ‌లంగా కోరుకుంటున్నారు. అందుకే, బీసీ ఎజెండాతో త్వ‌ర‌లోనే ఆయ‌న కొత్త పార్టీ పెట్ట‌బోతున్నార‌ని అంటున్నారు. కొత్త పార్టీపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌తో ఆయ‌న ప‌లుమార్లు మంత‌నాలు జ‌రిపార‌ని.. వారంతా క‌లిసి.. తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌చారంలో ఉన్న ప్ర‌ముఖుల పేర్లు ఆస‌క్తిగా ఉన్నాయి.  ఈట‌ల రాజేంద‌ర్‌.. కోదండ‌రాం.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. న‌లుగురూ హేమాహేమీలు. ఆ న‌లుగురు కలిసి ఇప్పుడు కొత్త పార్టీ స‌న్నాహాల్లో ఉన్నార‌ని స‌మాచారం. కొంత కాలంగా వీరి మ‌ధ్య ర‌హ‌స్య స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈట‌ల వీరికి స‌హ‌క‌రించార‌ని చెబుతున్నారు. సరిగ్గా.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ముందు.. కీల‌క స‌మ‌యంలో.. ఈట‌ల రాజేంద‌ర్ త‌న గ‌న్‌మెన్ల‌కు మ‌స్కా కొట్టి ఇంట్లో నుంచి ర‌హ‌స్య ప్ర‌దేశానికి వెళ్లారంటూ అప్ప‌ట్లో వార్త‌లు రావ‌డం వెనుక కార‌ణం ఇదేన‌ని అంటున్నారు. అందుకే, ఈట‌ల భూక‌బ్జాల‌పై ఆరోప‌ణ‌లు రాగానే.. కోదండ‌రాం, తీన్మార్ మ‌ల్ల‌న్న‌లు వెంట‌నే స్పందించారు. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి తాము సిద్ధ‌మ‌ని కోదండ‌రాం ప్ర‌క‌టించారు. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న వారంద‌రితో క‌లిసి ఉద్య‌మాన్ని ప్రారంభించాల్సి ఉంద‌న్నారు. ఈ వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా పార్టీ ఏర్పాటుపై లీకుల‌ని అంటున్నారు. ఉద్య‌మ కాలం నుంచి కోదండ‌రాం సార్‌కు, ఈట‌ల‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. సార్‌ను కేసీఆర్ తొక్కేయ‌డంపై ఈట‌ల ప‌లుమార్లు అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని అంటారు. కోదండ‌రాం.. ఏ ఒక్క వ‌ర్గానికో ప‌రిమిత‌మైన నాయ‌కుడు కాదు. తెలంగాణ‌వాదులంద‌రికీ ఇప్ప‌టికీ ఆయ‌న సారు.  కోదండ‌రాంతో పాటు అటు తీన్మార్ మ‌ల్ల‌న్న సైతం ఈట‌ల‌తో మొదటి నుంచి ట‌చ్‌లో ఉన్నార‌ని చాలా మంది అంటుంటారు. తీన్మార్ మ‌ల్ల‌న్న యూట్యూబ్ ఛానెల్‌లో వ‌చ్చే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌ ఇన్‌సైడ్ న్యూస్‌కు మేట‌ర్‌ అంతా ఈట‌ల నుంచే వ‌స్తుంటుంద‌నేది కొంద‌రి మాట‌. మ‌ల్ల‌న్న సైతం చాలాసార్లు ఈట‌ల ఆధ్వ‌ర్యంలో బీసీల పార్టీ అంటూ లీకులు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టైమ్‌లో మ‌ల్ల‌న్న‌కు ప‌రోక్షంగా ఈట‌ల చాలా సాయం చేశార‌ని కూడా అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌, తీన్మార్ మ‌ల్ల‌న్నల‌ను బీసీ ఎజెండా ఏకం చేసింద‌ని చెబుతారు. పార్టీ ఏర్పాటు, జెండా, ఎజెండాల‌పై ఈ ఇద్ద‌రి మ‌ధ్య అనేక ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని స‌మాచారం.  ఇక‌, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో నిఖార్సైన నాయ‌కుడిగా పేరున్న కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి సైతం ఈట‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో త్వ‌ర‌లో కొత్త పార్టీ ఏర్పాటు దిశ‌గా ఆలోచిస్తున్న‌ట్టు బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ కొత్త పార్టీ వెనుకున్న‌ది ఈట‌లేన‌ని అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రింత క్లారిటీ వ‌స్తోంది. అటు టీఆర్ఎస్‌, ఇటు కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేక ప్ర‌స్తుతానికి త‌ట‌స్థంగా ఉన్న కొండా.. ఈట‌ల పార్టీతో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌నేది టాక్‌.  ఇలా.. ఈట‌ల‌, కోదండ‌రాం, తీన్మార్ మ‌ల్ల‌న్న‌, కొండా.. న‌లుగురు భావ‌సారూప్య నేత‌లంతా క‌లిసి కొత్త పార్టీతో తెలంగాణ రాజ‌కీయాల‌ను మార్చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈట‌ల‌, మ‌ల్ల‌న్న బీసీ కార్డుతో.. కోదండ‌రాం ఉద్య‌మ‌కారుల కార్డు,.. కొండా- రెడ్డి కార్డుతో.. తెలంగాణ‌లో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ చేస్తున్నార‌ని అంటున్నారు. కొత్త పార్టీకి ఆర్‌.క్రిష్ణ‌య్య‌, గ‌ద్ద‌ర్‌లాంటి వాళ్ల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ట‌. ఇలా, తెలంగాణ‌లో అన్ని వ‌ర్గాల‌ను కూడ‌గ‌ట్టి.. త్వ‌ర‌లోనే కొత్త పార్టీతో.. కేసీఆర్ స‌ర్కారుపై దండ‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారట ఆ న‌లుగురు... ఏమో.. గుర్రం ఎగ‌రావ‌చ్చు....

ఈటల రాజేందర్ భర్తరఫ్? వైద్య శాఖను తొలగించిన సీఎం 

తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శాఖపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి తనకు అటాచ్ చేసుకున్నారు. ఈ మేరకు సీఎం చేసిన సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమెదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదముద్రతో శాఖ లేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.  వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా  ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద స్పందించి విచారణకు ఆదేశించడం అంతా సంచలనమే. ఈటల భూ కబ్జా ఆరోపణలపై జెట్ స్పీడ్‌లో అధికార యంత్రాంగం కదిలింది. తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. గంటల్లోనే ప్రాథమిక విచారణ తొలి నివేదిక సీఎస్‌కు చేరిందని సమాచారం. మూడెకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ చేస్కుని బ్యాంకులో తాకట్టు  పెట్టి ఋణం పొందినట్లు జిల్లా కలెక్టర్ హరీష్ నిర్దారించారని తెలుస్తోంది. పూర్ణచందర్ రావు రిపోర్ట్ కూడా రాత్రి లోపు సమర్పించే అవకాశం ఉందంటున్నారు. రాత్రి వరకు ఈటలను రాజీనామా చేయమని కేసీఆర్ ఆదేశించవచ్చనే చర్చ జరుగుతోంది. 

తిరుగుబాటా? సరెండరా? ఈటల దారెటు..

మంత్రిపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు. అదీ ప్ర‌తిప‌క్షం నుంచి కాకుండా సొంత మీడియా నుంచే. టీ న్యూస్ షురూ చేసింది. మిగితా పింక్ మీడియాలో హోరెత్తింది. ఇక అంతే. గంట‌ల వ్య‌వ‌ధిలోనే తెలంగాణలో అధికార పార్టీ రాజ‌కీయ ముఖ‌చిత్రం అమాంతం మారిపోయింది. ఇలా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయో లేదో.. అలా విచార‌ణ మొద‌లైపోయింది. అంతా వింత‌గా లేదూ. ఇది బ్రేకింగ్ న్యూసే అయినా.. షాకింగ్ న్యూస్ మాత్రం అస‌లు కానేకాదు. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల‌.. కొంత కాలంగా వారి మ‌ధ్య కోల్డ్‌వార్ అంద‌రికీ తెలిసిందే. అదిప్పుడు.. ఇలా బ్లాస్ట్ అయింది అంతే. వాళ్ల పార్టీ వాళ్ల ఇష్టం అనుకున్నా.. ప్ర‌స్తుత స‌మ‌యం, సంద‌ర్భం స‌రిగాలేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  క‌రోనాతో తెలంగాణ అల్ల‌క‌ల్లోలంగా మారింది. రోజుకు 10వేల వ‌ర‌కూ కేసులు వ‌స్తున్నాయి. మ‌ర‌ణాలు భారీగా పెరుగుతున్నాయి. వ్యాక్సినేష‌న్ నిదానంగా సాగుతోంది. ఆసుపత్రిలో బెడ్స్‌, ఆక్సిజ‌న్ కొర‌తలాంటి స‌మ‌స్య‌ల‌తో తెలంగాణ అల్లాడిపోతోంది. ఆరోగ్య శాఖ మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఊపిరి స‌ల‌ప‌ని ప‌నుల‌తో ఒత్తిడిలో ఉన్నారు. క‌రోనా సోకి కొంత కాలంగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఆరామ్‌సే ఉన్నారు. కొవిడ్ భార‌మంతా ఈట‌ల‌పైనే ఉంది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో.. ప్ర‌భుత్వం త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మంత్రి ఈట‌ల‌ను టార్గెట్ చేసింది. ఆయ‌న్ను పొమ్మ‌న‌డానికి పొగ పెట్టింది. పార్టీ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌బెట్టి రాజేంద‌ర్ ఇష్యూపై ర‌చ్చ మొద‌లుపెట్టింది. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ షురూ చేసింది. మీడియాలో కొవిడ్ వార్త‌లకంటే.. ఈట‌ల బ్రేకింగ్ న్యూస్‌తో మారుమోగిపోయింది. ఆ వెంట‌నే అన్ని ప‌నులు మానుకొని రాజేంద‌ర్ ప్రెస్‌మీట్ పెట్ట‌డం.. అప్ప‌టి నుంచి అంతా రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్ట‌డంతో.. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు అట‌కెక్కాయి. ఈట‌ల‌కు చెక్ పెట్ట‌డం కోసం ఇలాంటి కొవిడ్‌ విపత్కర సమయాన్ని ఎంచుకోవటానికి.. ప్ర‌భుత్వ బాధ్యతా రాహిత్యానికి, పచ్చి స్వార్థానికి నిదర్శనం.      ప్ర‌భుత్వం ప‌క్కా ప్లానింగ్‌తో ఈట‌ల‌పై ఆరోప‌ణ‌లు సంధించింది. శుక్ర‌వారం సాయంత్రం వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్స్‌తో స‌హా ప‌లు మున్సిపాలిటీల‌కు పోలింగ్ ముగిసింది. ఇలా ఆఖ‌రి గంట మోగిందో లేదో.. అలా టీవీల్లో ఈటల రాజేంద‌ర్ బ్రేకింగ్ న్యూస్ మొద‌లైపోయింది. అంటే, అంతా ప‌క్కా టైమింగ్‌తో ముందే షెడ్యూల్ చేసిన న్యూస్‌తో ఈట‌ల‌ను కార్న‌ర్ చేసిన‌ట్టు తెలిసిపోతోంది. ఇప్ప‌టికే జీహెచ్ఎమ్‌సీ, ఎమ్మెల్సీ, నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌లు ముగిశాయి. పెండింగ్ కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీ ఎన్నిక‌లూ శుక్ర‌వారంతో స‌మాప్తం అయ్యాయి. ఇక ఇప్ప‌ట్లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు లేవు. మ‌రో మూడేళ్ల వ‌ర‌కూ ఎలాంటి రాజ‌కీయ హ‌డావుడి ఉండ‌దు. అందుకే, రెండేళ్లుగా భ‌రిస్తూ వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్‌ను ఇక వ‌దిలించుకోవాల‌ని గులాబీ బాస్ భావించి ఉంటారు. 2019 ఎన్నిక‌ల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం.. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్‌పై రెబెల్ జెండా ఎగ‌రేస్తూ ఉండ‌టంతో.. ఈ ద‌ఫా అస‌లు ఈట‌ల‌కు మంత్రి ప‌ద‌వే రాద‌నుకున్నారు. కానీ, ఆఖ‌రు నిమిషంలో ఆర్థికం కాకుండా ఆరోగ్యం ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయినా.. ఈట‌ల అసంతృప్తి ప‌లుమార్లు పైకి త‌న్నుకొస్తూనే ఉంది. తాము గులాబీ జెండాకు బానిస‌లం కాదు.. అస‌లైన‌ ఓన‌ర్ల‌మంటూ.. కాంట్ర‌వ‌ర్సీ స్టేట్‌మెంట్స్‌తో కాక రేపారు. అదే స‌మ‌యంలో పార్టీ, ప్ర‌భుత్వ అంత‌ర్గ‌త స‌మావేశ విష‌యాలు మీడియాకు, ప్ర‌త్య‌ర్థుల‌కు లీక్ చేస్తున్నారంటూ ఈట‌ల‌పై అనుమాన‌పు చూపులు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశానికి రాజేంద‌ర్‌ను దూరం చేశాయి.  కొత్త పార్టీ పెట్ట‌డం పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదంటూ అప్ప‌ట్లో కేసీఆర్ చేసిన కామెంట్లు ఈట‌ల‌ను ఉద్దేశించేన‌ని ఇప్పుడే ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఈట‌ల అవుట్ అనే ప్ర‌చారం స్టార్ట్ అయింది. పోలింగ్ ముగిసిన కొన్ని నిమిషాల‌కే.. ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. ఆప‌రేష‌న్ ఈట‌ల మొద‌లైపోయింది. ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారంపై ఓ వార‌మో.. ఓ నెలో.. హ‌డావుడి జ‌రిగి ఆ త‌ర్వాత అంతా సైలెంట్ అయిపోతుంది. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే మూడేళ్ల‌లో రాజేంద‌ర్‌ను అంతా మ‌ర్చిపోయేలా చేయాల‌నేది కేసీఆర్ స్కెచ్‌లా క‌నిపిస్తోంది. అయితే.. గ‌ట్టి పిండ‌మైన ఈట‌ల‌.. ఈ మేట‌ర్‌ను ఇక్క‌డితో వ‌దిలేస్తారా? గ‌తంలో న‌క్స‌లిజం చ‌రిత్ర ఉండ‌టం.. వంద‌ల కోట్లకు అధిప‌తి అవ‌డం.. ఆయ‌న్ను ఊరికే ఉండ‌నిస్తాయా?  త్వ‌ర‌లోనే ఈట‌ల నేతృత్వంలో.. బీసీ ఎజెండాతో.. తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త పార్టీ పొద్దు పొడ‌వ‌బోతుంద‌నేది ఆఫ్ ది రికార్డ్ మాట. మ‌రి, ఇలాంటి నాయ‌కుల కోస‌మే ఎదురుచూసే క‌మ‌ల‌నాథులు.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లుపెడ‌తారా? మరోవైపు మేడే సందర్బంగా సీఎం కేసీఆర్ ఫోటోతో కార్మికులకు విషెస్ చెబుతూ సందేశం విడుదల చేశారు ఈటల రాజేందర్. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు... కాని ఎక్కడా కేసీఆర్ ను విమర్శించలేదు. ఆయనకు గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో ఈటల తిరుగుబాటు చేస్తారా లేక సరెండర్ అవుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది.  ఏమో.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే...

ఈటలకు పోటీగా కొత్త నేత! ఏడాదిగా గులాబీ స్కెచ్

తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకజ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా ఈటల చుట్టే సాగుతోంది. ఈటలను మంత్రివర్గం నుంచి కేసీఆర్ సస్పెండ్ చేస్తారా? రాజేందరే మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తారా? ఈటల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? వీటిపైనే రాజకీయ వర్గాలతో పాటు జనాల్లోనూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ అనుకూల మీడియాలోనే ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ సొంత ఛానెల్ టీన్యూస్ లోనే గంటల కొద్ది ఈటలపై వార్తలు నడపడంతో.. ఆయనపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. ఈట‌ల రాజేంద‌ర్‌ను ప్ర‌భుత్వం నుంచే కాదు.. పార్టీ నుంచి కూడా బ‌య‌ట‌కు పంపించేందుకు సీఎం కేసీఆర్ ప‌కడ్బందీ ప్లాన్ వేసిన‌ట్టుగా తెలుస్తోంది.  ఈటల రాజేందర్ సొంత  నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ హుజురాబాద్‌లో ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ స్థానిక‌ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వారం క్రిత‌మే పెద్దిరెడ్డి కేసీఆర్‌ను క‌లిసిన‌ట్టుగా స‌మాచారం. దీన్ని బ‌ట్టి ఈటల‌ను బయటకు పంపించాలని కేసీఆర్ ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది.ఈటలను వెళ్లిన వెంటనే పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు. ఈటలను బయటకు పంపించి పెద్దిరెడ్డికి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ బాధ్యతలు  అప్పజెప్పాలనే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఉన్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో పెద్దిరెడ్డి.. మంత్రిగానే కాకుండా టీడీపీ ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత దేవేంద‌ర్ గౌడ్‌తో క‌లిసి న‌వ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ త‌ర్వాత ఆ పార్టీని ప్ర‌జారాజ్యంలో విలీనం చేశారు. కొన్నాళ్లు మ‌ళ్లీ టీడీపీలోకి తిరిగివ‌చ్చారు. తెలంగాణ వ‌చ్చాక టీడీపీ బ‌లం త‌గ్గిపోవ‌డంతో.. ఇటీవ‌లే ఆయ‌న బీజేపీలో చేరారు. నిజానికి ఈట‌ల రాజేంద‌ర్ ను చాలా రోజులుగానే దూరం పెడుతున్నారు కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఏర్పాటు చేసిన కేబినెట్ లో ఈటలకు మొదట చోటు దక్కలేదు. ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో ఈటలకు అవకాశం కల్పించారు కేసీఆర్. ఈటలకు మంత్రి పదవి ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని, ఉద్యమకారులను దూరం పెట్టారనే ఆరోపణలు ఎక్కువ కావడంతో బలవంతంగానే ఆయన్ను తీసుకున్నారని చెబుతున్నారు. మంత్రిపదవి ఇచ్చినా ఈటలతో కేసీఆర్ గ్యాప్ కొనసాగిందని తెలుస్తోంది. చాలాకాలం పాటు ఈటలకు కేసీఆర్ .. అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అసెంబ్లీ జరిగిన సమయంలో ప్రగతి భవన్‌కు వెళ్లి రెండు గంటలు వెయిట్ చేసినా.. ఈట‌ల‌కు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేద‌ని తెలుస్తోంది.  2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈటలకు హుజురాబాద్ అసెంబ్లీ టికెట్ రాదనే ప్రచారం జరిగింది. తన భార్యకు అసెంబ్లీ టికెట్ ఇచ్చి... తాను కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని ఈటల అడిగినా కేసీఆర్ పట్టించుకోలేదంటారు. అయితే చివరి నిమిషంలో ఈటలకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికలో కొందరు టీఆర్ఎస్ నేతలు ఈటలకు వ్యతిరేకంగా పని చేశారని చెబుతారు. పార్టీ పెద్దల ఆశిస్సులు ఉన్న నేతలే ఇలా చేశారని ఈటల బహిరంగానే చెప్పారు. ఆ కోపంతోనే పలు సార్లు రాజేందర్.. టీఆర్ఎస్ , కేసీఆర్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లమని ఏడాది క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడే ఈటలను సాగనంపాలని కేసీఆర్ డిసైడయ్యారని, సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. కొవిడ్ కల్లోలం లేకుంటే ఏడాది క్రితమే ఈటలను సాగనంపే వారంటున్నారు. 

కర్ణాటకలో కమలానికి షాక్.. బళ్లారిలో గాలికి భంగపాటు 

కర్ణాటకలో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ ఏడు చోట, రెండు చోట్ల జేడీఎస్ గెలవగా.. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఒకే ఒక్క స్థానంలో గెలిచి పరువు పోగొట్టుకుంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 120 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆశ్చర్యకరంగా బీజేపీ కంటే జేడీఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ 57 స్థానాలకే పరిమితం కాగా, జేడీఎస్ 66 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే బళ్లారి కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం  చేసుకుంది. బళ్లారిలో గాలి సోదరులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. బళ్లారి మహానగర పాలికె (కార్పొరేషన్‌)లో మొత్తం 39 వార్డులు ఉండగా.. 20 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఐదుగురు కాంగ్రెస్ రెబెల్స్ గెలవగా బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది.  18వ వార్డులో బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కుమారుడు శ్రవణ్ కుమార్ ఓడిపోయారు. బీదర్‌లో హంగ్ ఏర్పడింది. అయితే 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ ఒక స్థానంలో విజయం సాధించింది. రామనగరలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. ఇక్కడ 31 స్థానాలకు గాను కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. బీజేపీ ఇక్కడ ఖాతా కూడా తెరవలేదు. రామనగర జిల్లా చెన్నపట్టణ నగర సభ ఎన్నికల్లో 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడు, బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. హసన్ జిల్లాలోని బేలూరు పురసభలోనూ బీజేపీ భారీ షాక్ తగిలింది. ఇక్కడ మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ 17, జేడీఎస్ 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బీజేపీకి ఒక్క స్థానం దక్కింది. ఇక ముఖ్యమంత్రి యడియూరప్ప సొంత జిల్లాలోనూ బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఇక్కడ మొత్తం 35 స్థానాలుండగా కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించగా, చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. 11 స్థానాలకు గాను కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. బెంగళూరు రూరల్ జిల్లా విజయపురలోనూ బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ 23 వార్డులకు గాను జేడీఎస్ 14, కాంగ్రెస్ 6, ఇతరులు 2 చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. మడికెరె నగరసభను మాత్రం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 16, ఎస్‌డీపీఐ 5, కాంగ్రెస్, జేడీఎస్‌లు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.