ఫెడరల్ స్ఫూర్తిని చాటిన రేవంత్!

గత కొన్నేళ్లుగా తెలంగాణలో  మోడీ పర్యటన వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. అదే విధంగా మోడీ తాజా పర్యటన కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే గతంలో మోడీ పర్యటన చుట్టూ వివాదాలు, వివాదాస్పద చర్చలూ ముసురుకుని ఉండేవి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయాలే ప్రభుత్వాల మధ్యా కూడా ప్రతిఫలించేవి. రాజకీయ విభేదాలు పాలనలోనూ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలలోనూ కనిపించకూడదన్న ఫెడరల్ స్ఫూర్తికి ఇసుమంతైనా విలువ ఉండేది కాదు. ప్రధాని హోదాలో మోడీ రాష్ట్రంలో అధికారిక పర్యటనకు వచ్చిన సందర్భాలలో ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకాలన్న విషయాన్ని కేసీఆర్ పట్టించుకోకపోయేవారు. అలాగే అధికారిక కార్యక్రమాలలో ప్రధానితో వేదిక పంచుకోవాలన్న సంప్రదాయాన్ని కూడా ఆయన ఖాతరు చేసే వారు కాదు. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, విలువలకు పెద్ద పీట వేస్తూ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యపూర్వక సంబంధాలు అభివృద్ధికి దోహదపడతాయని చెప్పడమే కాదు.. స్వయంగా ఆచరించి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘర్షణ వల్ల ప్రజలకు నష్టమని విస్పష్టంగా చెప్పారు. రాజకీయాలనేవి ఎన్నికల సమయంలోనేననీ, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడుస్తామని విస్పష్టంగా చాటారు. హైదరాబాద్ లోని మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మోడీని రేవంత్ కోరారు.    సోమవారం (మార్చి 4) రాష్ట్ర పర్యటనకు వచ్చిన  ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించిన సంగతిని గుర్తుచేస్తూ, తాము ప్రస్తావించిన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.  డిఫెన్స్ భూములను స్కై వేల నిర్మాణానికి ఇచ్చినందుకు మోడీకి ఈ సభ వేదికగా కృతజ్ణతలు చెప్పారు.  అంతే కాదు తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ పెద్దన్నలా సహకరించాలని కోరారు.      ఇప్పుడే కాదు రేవంత్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అసెంబ్లీ సమావేశాల తీరు తెన్నులలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. సస్పెన్షన్లు లేవు, ఏకపక్ష ప్రసంగాలు లేవు. విపక్షానికి తగిన సమయం ఇవ్వడమే కాకుండా సభలో అరుపులు, గోలల సంస్కృతికి, సభాకార్యక్రమాలను స్తంభింప చేసే కార్యక్రమానికి చుక్కపడింది. సభ ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్నదన్న భావన రాజకీయ వర్గాలలోనే కాదు, సామాన్య జనంలోనూ కూడా కలిగింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. ఇప్పుడు మోడీతో సభా వేదికను పంచుకుని కేంద్రం, రాష్ట్రాల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు ఆకాంక్షిస్తూ చేసిన ప్రసంగం ప్రజా స్వామ్య వాదుల మన్ననలు పొందింది. 

వైసీపీ ఒక దొంగల ముఠా..ఇదిగో నిదర్శనం!

వైసీపీ ఎమ్మెల్సీ భరత్ వ్యవహారశైలిపై ఆ పార్టీలోనే ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు.. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడిని డోర్ డెలివరీ చేసిన వ్యవహరంలో పార్టీ పరువు కాస్తా గోదాట్లో కలిసి పోయిందని.. తాజాగా మరో ఎమ్మెల్సీ భరత్..  తన వ్యవహార శైలితో.. పార్టీ పరువును కొండెక్కించేశారి వైసీపీలోని ఒక వర్గం మండిపడుతోంది.   ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో అబకలదొడ్డి పంచాయతీ పరిధిలోని కాకర్లవంకలో స్థానికులు కొందరు గంధపు స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని నిర్మించారు. వీరప్పన్ ఫోటోతో పాటు జెండా ఏర్పాటు చేశారు. తాజాగా ఆ గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ భరత్ ఆ స్తూపాన్ని ఆవిష్కరించడమే కాకుండా.. నవ్వుతూ.. ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ చిత్ర రాజం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వ్యవహరం పట్ల ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం... కారాలు మిరియాలు నూరుతోంది.  ఎందుకంటే.. ఇప్పటికే వైయస్ వివేకా హత్య కేసు.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ఆయన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాంటి వేళ ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్   ప్రతిపక్ష పార్టీలకు ఓ ఆయుధంలా దొరికింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ భరత్.. గంధపు చక్కల స్మగర్ల వీరప్పున్‌ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించడం అంటే చేజేతులా పార్టీ జుట్టును విపక్షానికి అందజేయడమేనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.   ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అదీ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఎమ్మెల్పీ, అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబుకు ప్రత్యర్థిగా జగన్ నిర్ణయించిన అభ్యర్థి కూడా అయిన భరత్ హత్యలు, అరాచకాలతో నరరూపరాక్షసుడిగా ముద్రపడిన స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్ఫూపాన్ని ఆవిష్కరించి పార్టీ ప్రతిష్టను పాతాళానికి దిగజార్చేశారని వైసీపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.   ఎమ్మెల్సీ భరత్‌ను రానున్న ఎన్నికల్లో కుప్పం ప్యాన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు కుప్పంలో  నారా చంద్రబాబు నాయుడిని ఓడించి... భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకొని మంత్రి పదవి కట్టబెడతానంటూ జగన్ ప్రకటించారు. అలాంటిది అదే భరత్ ఇలా.. స్మగ్లర్ల వీరప్పన్ స్మారక చిహ్నం ఆవిష్కరించడం ద్వారా సమాజానికి ఏ  సందేశం ఇచ్చినట్లు అన్న ప్రశ్న వైసీపీ నుంచే ఎదురౌతోంది.     తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఫ్యాన్ పార్టీ అభ్యర్థి భరత్ బరిలో దిగనున్న సంగతి అందరికీ తెలిసిందేనని.. అలాంటి ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న భరత్ ఇంత అడ్డగోలుగా, అరాచకంగా వ్యవహరిస్తే ఎలా అంటున్నారు.    ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పాలకుల తప్పులను ప్రజల మధ్యకు వెళ్లి ప్రశ్నించడమే ప్రతిపక్షాల ప్రధాన కర్తవ్యమనే విషయాన్ని సైతం మరచి.. పార్టీ ప్రజా ప్రతినిధులు ఇలా వ్యవహరించడం.. ఏ మాత్రం పద్దతిగా లేదని అంటున్నారు.   గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించాడని.. అలాగే అతడిని తొలి సారి అరెస్ట్ చేసిన వ్యక్తి పందిళ్లపల్లి శ్రీనివాస్ అని.. ఆయన రాజమండ్రి వాస్తవ్యుడని.. ఐఎఫ్ఎస్ అదికారిగా ఆయన కర్ణాటక కేడర్‌లో పని చేస్తుండే వారని..  అయితే తాను లొంగిపోతానని.. అయితే ఆయుధాలు లేకుండా అడవిలోకి రావాలంటూ.. శ్రీనివాస్‌కు స్మగ్లర్ వీరప్పున్ సమాచారం ఇవ్వడంతో   అది నిజమని నమ్మి... ఆయన ఓంటరిగా అడివిలోకి వెళ్లి.. వీరప్పన్ చేతిలో అత్యంత దారుణంగా హత్య కావింపబడ్డారని.. ఇక శ్రీనివాస్ ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం.. శ్రీనివాస్ మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి నీతి నీజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఉన్నతాధికారి... అందునా తెలుగు వ్యక్తిని ఇంత అత్యంత పాశవికంగా స్మగ్లర్ వీరప్పన్ హత్య చేశారని.. అలాంటి నరహంతుకుడి స్మారక చిహ్నం ఆవిష్కరించడానికి ఎమ్మెల్సీ భరత్‌కు చేతులు ఎలా వచ్చాయని వైసీపీ నేతలే అంటున్నారు. ఏదీ ఏమైనా అవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? అన్నట్లాగా వీరి వ్యవహారం ఉందని వైసీపీలోని ఒక వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది.  

నాట్య మయూరీ నితా.. మిసెస్ ముఖేష్ అబానీపై ప్రశంసల వర్షం

ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి.. దేశం మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. ఆ కుటుంబం ఈ వేడుకలను నభూతో అన్నట్లుగా నిర్వహిస్తోంది. సంప్రదాయం, ఆధునికతల మేలు కలయికగా అంబానీల ఇంట పెళ్లి వేడుక అందరినీ ఆకర్షిస్తోంది. అలరిస్తోంది.  ఇక ఆ ఇంట పెళ్లి సందడి సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ధరించిన పచ్చల హారంపై అయితే విస్తృత చర్చ ఎడతెగకుండా సాగుతూనే ఉంది. ఆ హారం విలువ రూ500 కోట్లకు పైమాటే అంటున్నారు. అదలా ఉంటే తన కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ షూట్ సందర్భంగా జామ్ నగర్ లో జరిగిన వేడుకలో నీతా అంబానీ చేసిన నాట్యం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.   ముఖేష్ భార్యగా..ముంబై ఐపిల్ క్రికెట్ టీం యజమానురాలిగా, ఒక మహిళా వ్యాపారావేత్తగా  మాత్రమే ఇప్పటి వరకూ అందరికీ పరిచితురాలైన నీతా అంబానీ అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ గా ఈ నాట్యంతో తనలోని మరో కళాకోణాన్ని ఆవిష్కరించారు.   సాంప్రదాయ దుస్తులు ధరించి లయబద్ధంగా ఆమె చేసిన క్లాసికల్ డాన్స్ ఆ కార్యక్రమానికి హాజరైన అతిధులనే కాకుండా, సామాజిక మాధ్యమంద్వారా ఈ నృత్యాన్ని తిలకించిన అందరినీ మంత్రముగ్ధులను చేశారు.  

ఆ ఆశ కూడా పాయె.. దొడ్దిదారిన‌ విమ‌లారెడ్డి ప‌రార్!

నూరు త‌ప్పులు చేసిన శిశుపాలుడి త‌ల‌ను సుద‌ర్శ‌న చ‌క్రంతో శ్రీ‌కృష్ణుడు ఎలా ఖండించాడో.. ఐదేళ్ల‌ పాల‌న‌లో వెయ్యికిపైగా త‌ప్పులు చేసిన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓటు ద్వారా త‌రిమికొట్టేందుకు ఏపీ ప్ర‌జ‌లు అలాగే స‌న్న‌ద్ధమ‌వుతున్నారు. ఐదేళ్ల‌ కాలంలో జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. త‌ప్పు మీద త‌ప్పుచేస్తూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పాలుచేయ‌డం రివాజుగా మారిపోయింది. ఆ తప్పుల ఫలితం ఎన్నికలలో అనుభవించక తప్పదని ఖరారైపోయింది. ఎన్నిక‌ల ముంగిట  జ‌గ‌న్ ప‌త‌నం   ప్రారంభ‌మైంది. తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు ఏకం కావ‌డం, ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్ పై పోరాటం చేసేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డంతో తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ణికిపోతోంది. ప్ర‌జాక్షేత్రంలో వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్ల‌ తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో జ‌గ‌న్ ప్ర‌లోభాల ప‌ర్వానికి తెర‌లేపారు. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప్ర‌జ‌ల‌కు తాయిళాలు అందించేందుకు జ‌గ‌న్ అండ్ కో స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కులాలు, మ‌తాల వారిగా విభ‌జించి తాయిళాలు అందించేందుకు ఓ యాక్ష‌న్ ప్లాన్ ను జ‌గ‌న్ కోట‌రీ సిద్ధం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో విమ‌లారెడ్డి వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన భూమిక పోషించిన వారిలో క్రిస్టియన్లు కూడా ఉన్నారు. ఏపీలో దాదాపు అన్ని గ్రామాల్లో వీరి ఓటు బ్యాంకు ఉంది. స్వ‌త‌హాగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న కుటుంబం  క్రిస్టియన్లు కావ‌డంతో ఆ మ‌తానికి చెందిన ఓట్ల‌లో మెజార్టీ ఓట్లు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి బ‌దిలీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గంప‌గుత్త‌గా  క్రిస్టియన్లు వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. దీనికి కార‌ణం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌. ఆయన ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌టించి క్రిస్టియ‌న్ల‌ను వైసీపీవైపు మ‌ళ్లించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. క్రిస్టియ‌న్లు అంటే కేవ‌లం ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాలే కాదు.. బీసీలు, ఓసీల్లోని క‌మ్మ‌, కాపు, రెడ్డి కుల‌స్థులు కూడా అధికంగానే ఉన్నారు. కులంతో సంబంధం లేకుండా కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ అనేకార‌ణంతో మెజార్టీ శాతం క్రిస్టియ‌న్లు చంద్ర‌బాబును దూరంపెట్టి జ‌గ‌న్ వైపుకు వెళ్లిపోయారు. అయితే, ఇదంతా 2019 ఎన్నిక‌ల సంగతి. ఇప్పుడు రాబోయే ఎన్నిక‌ల్లో క్రిస్టియ‌న్లు గ‌తంలోలా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ప‌లికే ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన క్రిస్టియ‌న్ల‌ను వారు ఆశించిన స్థాయిలో ద‌గ్గ‌ర‌కు తీయ‌లేద‌ని గుర్రుగా ఉన్నారు. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల, ఆమె భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ దూర‌మ‌య్యారు.  వైఎస్ కుటుంబంలో జ‌రిగిన అంత‌ర్గ‌త యుద్ధంలో భాగంగా వైఎస్‌ ష‌ర్మిల, ఆమె భ‌ర్త అనిల్ కుమార్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పూర్తిగా వ్య‌తిరేకించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల ష‌ర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాలుగేళ్ల పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికితోడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ త‌న ప‌రిధిలో క్రిస్టియ‌న్ల‌ను కాంగ్రెస్ వైపు మ‌ళ్లించి జ‌గ‌న్ ను దెబ్బ‌తీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. క్రిస్టియ‌న్ ఓట్లు వైసీపీకి దూర‌మైతే ఓట‌మి ఖాయ‌మ‌ని భావించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా త‌న అత్త విమ‌లారెడ్డిని రంగంలోకి దింపారు. విమ‌లారెడ్డి దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రి. జ‌గ‌న్ సూచ‌న‌తో వైసీపీ క్రిస్టియ‌న్ సెల్ ఆధ్వ‌ర్యంలో ఆమె బైబిల్ ప‌ట్టుకొని జిల్లాల్లో చ‌ర్చి ఫాద‌ర్ల మీటింగ్ ల‌లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో కాకినాడ ప‌ట్ట‌ణంలో ఓ ఫంక్ష‌న్ హాల్ లో సేవ‌కుల స‌ద‌స్సు పేరుతో కాకినాడ, చుట్టుప‌క్క‌ల   ప్రాంతాల్లో చ‌ర్చిల‌ ఫాద‌ర్లు హాజ‌రు కావాల‌ని ఆహ్వానం పంపించారు. విమ‌లారెడ్డి అంటే వ‌చ్చేందుకు చాలామంది ఫాద‌ర్లు ఆస‌క్తి చూప‌క‌పోవ‌టంతో.. వారికి డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్పి పిలిపించారు.  కాకినాడ‌లో నిర్వ‌హించిన సేవ‌కుల స‌ద‌స్సులో దాదాపు రెండువేల మంది ఫాద‌ర్లు పాల్గొన్నారు. హాల్‌లోకి వెళ్లేముందు వారికి ట్యాగ్ లు ఇచ్చి లోప‌లికి పంపించారు. స‌ద‌స్సు అయిన‌పోయిన త‌రువాత వెళ్లేట‌ప్పుడు ఆ ట్యాగ్ తీసుకొని రూ. వెయ్యి ఇచ్చేందుకు నిర్వాహ‌కులు ప్లాన్ చేశారు. అయితే, వైసీపీ క్రైస్త‌వ సెల్  విభాగం ఊహించినదానికంటే అధిక సంఖ్య‌లో ఫాస్ట‌ర్లు, క్రైస్త‌వుల్లో ప‌లు విభాగాల‌కు చెందిన వారు స‌ద‌స్సుకు వ‌చ్చారు. స‌ద‌స్సు పూర్త‌యిన త‌రువాత నిర్వాహ‌కులు ఇచ్చిన‌ ట్యాగ్ లు తీసుకొని అప్ప‌టికే క‌వ‌ర్ల‌లో సిద్ధంగా ఉంచిన న‌గ‌దును వారికి అంద‌జేశారు. ముందుగా వెయ్యి రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పి క‌వ‌ర్ లో కేవ‌లం రూ.500 మాత్ర‌మే ఇవ్వ‌డంతో ప‌లువురు ఫాద‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం త‌లెత్తింది. ఈ విష‌యం గ‌మ‌నించిన విమ‌లారెడ్డి ఫంక్ష‌న్ హాల్ వెనుక‌భాగంలో సిద్ధంగా ఉంచిన కారులో వెళ్లిపోయారు. దీంతో ప‌లువురు ఫాస్ట‌ర్లు ఆమె తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సేవ‌కుల స‌ద‌స్సు పేరుతో ప్రార్థ‌న‌లు చేసి మ‌ళ్లీ జ‌గ‌న్ పార్టీకే ఓటు వేయాల‌ని కొంద‌రిచేత విమ‌లారెడ్డి బైబిల్ పై ప్రమాణం సైతం చేయించుకున్న‌ట్లు ప‌లువురు పాద‌ర్లు పేర్కొన్నారు. కాకినాడ‌లో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారాన్ని ప‌లువురు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంలో అవి వెంటనే వైర‌ల్ అయ్యాయి. మొత్తానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు వేస్తున్న ఒక్కో అడుగు విఫ‌లం అవుతుండ‌టంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం  కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లే బాహాటంగా చెబుతున్నారు. 

మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు

రానున్న ఎన్నికల నేపథ్యంలో టిడిపి నేతల టార్గెట్ గా ఎపి రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీ పార్టీ అధికార దాహంతో వ్యవహరిస్తున్నాయి.  టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులో మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజితారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసాల్లో తనిఖీలు చేశారు. విజితారెడ్డి ఇంటికి 20 మంది పోలీసులు వచ్చారు. ఇంట్లోని బీరువాలను, వస్తువులను తనిఖీ చేశారు. ఇంట్లో కేవలం రూ. 25 వేల నగదు మాత్రమే దొరకడంతో వెనుదిరిగారు. తనిఖీల నేపథ్యంలో విజితారెడ్డి ఇంటికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల సోదాలపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటంతో, జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని కోటంరెడ్డి అన్నారు. పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై కక్షసాధింపు చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ మహిళా నేత విజితారెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేసి, ఇంటిని చుట్టుముట్టి హంగామా చేశారని అన్నారు. ఎన్నికలకు డబ్బులు దాచారంటూ, ఇంట్లోని బీరువా, వస్తువులను చిందరవందర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెన్ని చేసినా, ఎన్నికల లోపే, ఒక్కో జిల్లాలో నిన్ను ఖాళీ చేస్తామనీ, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని... అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు.

సచివాలయం తాకట్టు కట్టు కథ.. సీఆర్డీయే.. ఔను తాకట్టు పెట్టేశాం తప్పేమిటి?.. కొడాలి నాని

తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారత దేశం అనే పుస్తకం రాశారు. ఇండియా మార్టిగేజ్ డ్ అని ఆయన ఆంగ్లంలో రాసిన పుస్తకం, తాకట్టులో భారత దేశం పేరిట తెలుగులో అనువాదమైంద. ఆర్థిక నిపుణులు సైతం ఆయన ఆ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలన్నీ అక్షర సత్యాలని అంగీకరిస్తారు. అయితే ఆయన పుస్తకంలో ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల పేరిట, అభివృద్ధి పేరిట దేశంలోని కంపెనీలను ఎలా బంధిత పరిశ్రమలుగా మార్చేస్తున్నాయో, మార్చేశాయే కళ్లకు కట్టినట్లు వివరిస్తారు. ఆయన చెప్పిన దేశం  ఎలా తాకట్టులో ఉందో అర్ధమౌతుంది. ఆ తాకట్టు సాంకేతిక పరమైనది. ఉదాహరణకు ఒక అల్యూమినియం కంపెనీ, అదీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటై, ఆ సంస్థ ఏర్పాటుకు అవసరమైన యంత్ర సామగ్రి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మొత్తం అప్పుగా తీసుకుంటుంది. అదీ అంతర్జాతీయ బ్యాంకు (వరల్డ్ బ్యాంకు) నుంచి, అందుకు ప్రతిగా, ఏటా కిస్తీ చెల్లించడంతో పాటు, ఆ కంపెనీ ఉత్పత్తి చేసే మొత్తం అల్యూమినియంను వరల్డ్ బ్యాంక్ చెప్పిన ధరకు, చెప్పిన దేశానికి అమ్మాల్సి ఉంటుంది. ఇదే తాకట్టు అని ఆయన అన్నారు. ఆ పరిశ్రమను క్యాప్టివ్ ఇండస్ట్రీ (బంధిత పరిశ్రమ)గా అభివర్ణించారు. అంటే అప్పు పేరుతో కంపెనీ మనుగడ, అస్థిత్వం ఇలా అన్నీ ప్రపంచబ్యాంకు గుప్పెట్లో ఉంటాయి. కానీ వర్చువల్ గా మార్టిగేజ్, తాకట్టు అన్న పదం మాత్రం ఈ పరిస్థితికి సరిపోదు. కానీ జగన్ సర్కార్ మాత్రం వర్చువల్ గా ప్రభుత్వ ఆస్తులను, భవనాలను, ప్రజలు మద్యం తాగడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసి పబ్బం గడుపుకుంటున్నారు. అదెంత వరకూ వచ్చిందంటూ  ఏకంగా ఆయన తన ప్రభుత్వాన్నే ఒక బ్యాంకుకు తాకట్టు పెట్టేశారు. ఆ మేరకు ఆ బ్యాంకుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టడమేమిటంటారా?  ప్రభుత్వ పాలన జరిగే సచివాలయాన్నే ఆయన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు తాకట్టు పెట్టారు. ఈ మేరకు రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకుని మరీ రూ. కోట్లు రుణంగా తీసుకున్నారు. ఈ విషయం మీడియాలో వచ్చిన వెంటనే.. అదంతా అవాస్తవ ప్రచారం అంటూ సీఆర్ డీఏ రంగంలోకి దిగిపోయింది. అటువంటి సమాచారం ఏదీ సీఆర్డీఏ పేర్కొంది. సచివాలయం తాకట్టు వార్త ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి ఉద్దేశించి కల్పిత కథనం అనీ, ఈ ప్రచారానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఓ ప్రకటన  జారీ చేసింది.  అయితే అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటి అంటూ మీడియా ఎదుటకు వచ్చేశారు. తాకట్టు పెట్టకుండా డబ్బులెక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించేశారు.  అయినా సచివాలయం అంటూ ప్రజాస్వామ్య దేవాలయం ఏమీ కాదు కేవలం పది ఎకరాల ఆస్తి మాత్రమే అంటూ తన పరిజ్ణానాన్నంతా ఒలకబోశారు.  అవసరానికి ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం సాధారణ విషయమేనని జగన్ సర్కార్ సచివాలయాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవమేనని కుండ బద్దలు కొట్టేశారు. ప్రభుత్వమే ఎలాంటి దాపరికం లేకుండా తాకట్టు విషయం చెప్పేస్తుంటే సీఆర్డీయే మాత్రం ఎందుకు అదంతా అవాస్తవ ప్రచారం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందో అర్ధం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టేసిన సీఎంగా జగన్ అనితర సాధ్యమైన రికార్డు సృష్టించేశారు.   

బాబూ మోహన్, పాల్.. నవ్వులు పూయించడంలో ఇద్దరూ ఇద్దరే!

రెండు వినోద సింహాలు ఒకే గూటికి చేరాయి. వారి వారి రంగాలలో ఇద్దరూ నిష్ణాతులే. వారిలో ఒకరు కేఏ పాల్ . క్రైస్తవ మతబోధకుడిగా గుర్తింపు పొంది ఆ తరువాత రాజకీయాలలోకి వచ్చిన పాల్. తన వాగ్ధాటితో ప్రజలకు చాలా తొందరగా చేరువైపోయారు. ఆగండి, చేరువైపోవడమంటే ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందేశారని అనుకోవద్దు. ఆయన ప్రసంగాలు ప్రజలకు వినోదం కలిగిస్తాయి. చెవులు రిక్కించుకుని మరీ ఆయన ప్రసంగాలు వినడానికి, విని నవ్వుకోవడానికి జనం తహతహలాడుతుంటారు. దేశ విదేశాల అధినేతలంతా తనకు బాగా తెలుసునని చెప్పుకుంటుంటారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ అధికారం తనదేనని చాటుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకూ ఆయన స్వయంగా కూడా ఎక్కడా గెలవలేదు. అయినా ఆయన జనాలకు బాగా ఇష్టుడిగా మారిపోయారు. ఆయన ప్రసంగాలూ, వివిధ పార్టీల నేతలను ఉద్దేశించి ఆయన చేసే విమర్శలూ, వాళ్లకు ఇచ్చే సలహాలు నవ్వులు పూయిస్తుంటాయి. ప్రజలకు మాంచి వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే మీడియా, సోషల్ మీడియా కూడా ఆయన ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా మిస్ కాకుండా మంచి కవరేజ్ ఇస్తుంది. ఎందుకంటే ఆ కవరేజ్ తమ వ్యూయర్ షిప్ ను, టీఆర్పీ రేటింగ్ ను పెంచుతుందన్న నమ్మం. ఇక రెండో వ్యక్తి బాబూ మోహన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. విలక్షణ కమేడియన్ గా వందల సినిమాలలో ప్రేక్షకులను అలరించిన బాబూ మోహన్  పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆ ఇమేజ్ తోనే,  ఆ గుర్తింపుతోనే   రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే అదంతా గతం. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వీరాభిమాని అయిన బూబూ మోహన్ తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) పార్టీలోకి జంప్ కొట్టారు. 2014 నుంచి 2018 వరకూ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ తరువాత బీజేపీలోకి మారారు. 2108 ఎన్నికలలో బీజేపీ తరఫున అందోల్ నుంచి బరిలోకి దిగారు. పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీకీ దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకుని వరంగల్ నుంచి లోక్ సభ కు పోటీ చేయనున్నారు. ప్రజాశాతి పార్టీ వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా బాబూమోహన్ పేరును కేఏ పాల్ అధికారికంగా ప్రకటిచారు.  దీంతో ఇద్దరు కమేడియన్లు ఓకే గూటిలో ( పార్టీలో) ఉన్నారంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. గెలుపు ఓటములతో పని లేకుండా వరంగల్ లోక్ సభ స్థానం రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిపోతుందంటూ పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. వరంగల్ లోక్ సభ  స్థానంలో తమ ప్రచార కార్యక్రమాలకు జనాలను తరలించాల్సిన పని లేదనీ, స్వచ్ఛందంగా ప్రజలే పెద్ద సంఖ్యలో సభలకు వచ్చేస్తారనీ ప్రజాశాంతి వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.  మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికల హీట్ ఏ రేంజ్ లో ఉన్నా.. వరంగల్ లో మాత్రం ఓటర్లకు పాల్, బాబూ మోహన్ ల ప్రసంగాలు మండు వేసవిలో వినోదాల పన్నీటి జల్లుతో స్నానం చేయిస్తాయనడంలో మాత్రం సందేహం లేదు. 

మళ్లీ తెగిన ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కవరింగ్ ల నిగ్గు తేలిపోయిందిగా!

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూల్చ‌డాలే త‌ప్ప క‌ట్ట‌డాలు తెలియ‌ద‌న్న అభిప్రాయానికి ఏపీ ప్ర‌జ‌లు వ‌చ్చేశారు. నాలుగున్నారేళ్ల కాలంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పుకోద‌గ్గ ఒక్క కంపెనీని ఏపీకి తీసుకురాలేక పోయారు.. ఒక్కటంటే ఒక్క నిర్మాణం చేపట్టలేదు. రుషికొండ అక్రమ నిర్మాణాలు వేరే సంగతి. ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క నిర్మాణం చేపట్టలేదు. ఒక్క రోడ్డు బాగు చేయించలేదు.. కానీ, చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టి, ఏపీ యువ‌త‌కు ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల‌ను మాత్రం వెళ్ల‌గొట్టేశారు.  ప్రజా వేదికను కూల్చేశారు. వైసీపీ హ‌యాంలో ఏదైనా చిన్నాచిత‌క ప‌నిచేసినా అందులోనూ నాసిర‌క‌మే. ఇప్ప‌టికే రాజ‌ధానిలేని రాష్ట్రంగా దేశ‌వ్యాప్తంగా ఏపీని చిన్న‌చూపు చూస్తున్న ప‌రిస్థితి.  తాజాగా మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వం ప‌రువు గంగలో కలిసింది. విశాఖ ఆర్‌కే బీచ్ లో అధికారులు ప్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దేశం మొత్తంలో ఎవరూ ఇంత గొప్ప పని చేయలేదని స్వోత్కర్షలు చేసేసుకుంటూ   దేశంలో ఎక్క‌డ ఇలాంటిది లేదు అన్న‌ట్లుగా తమ భుజాలను తామే చరిచేసుకుని, ఏపీ ప్రజలకు ఒక మహత్తర కానుక ఇచ్చేశాం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేశారు. అయితే ఇంత ఘనంగా చెప్పుకుని ఆర్బాటంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి కనీసం ఒక్కటంటే ఒక్క రోజుకూడా నిలవలేదు. ప్రారంభించిన మరునాడే ఆ నిర్మాణంలోని డొల్లతనం బయటపడేలా తెగిపోయింది.  ప్లోటింగ్ బ్రిడ్జి అంచునఉన్న భాగం విడిపోయి వంద మీటర్ల దూరం స‌ముద్రంలోకి వెళ్లిపోయింది.  దీంతో కంగుతిన్న నిర్వాహ‌కులు ప‌ర్యాట‌కులను ప్లోటింగ్ బ్రిడ్జిపైకి వెళ్ల‌కుండా అప్ర‌మ‌త్తం చేశారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. వైసీపీ ప్ర‌భుత్వానికి డ్యామేజ్ గా ప్లోటింగ్ బ్రిడ్జి వ్య‌వహారం మార‌డంతో.. ప్ర‌భుత్వ పెద్ద‌లు, అధికారులు రంగంలోకి దిగి త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప్లోటింగ్ బ్రిడ్జి తెగ‌లేదు. మాక్ డ్రిల్ లో భాగంగా మేమే  విడ‌దీశాం అంటూ ప్ర‌చారం చేసుకున్నారు. దీనికితోడు ప్లోటింగ్ బ్రిడ్జి తెగింద‌న్నవారిని రాష్ట్ర దోషులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జ‌ల క‌ళ్ల‌ముందే త‌ప్పుజ‌రిగినా అది త‌ప్పుకాదని ప్ర‌జ‌ల చెవుల్లో మోత‌గించ‌డంలో వైసీపీ సోష‌ల్ మీడియా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడూ ముందే ఉంది.   ప్ర‌జ‌లంతా చూస్తుండ‌గానే ప్లోటింగ్ బ్రిడ్జి చివ‌రిభాగం తెగిపోయి స‌ముద్ర‌లోకి వెళ్లిపోయినా..  అబ్బెబ్బే తెగిపోలేదు.. కావాల‌నే మాక్ డ్రిల్ నిర్వ‌హించారని బుకాయించేసింది. ఆ బుకాయింపును ఎవరూ నమ్మలేదనుకోండి అది వేరే విషయం. ఏదైనా చిన్న యంత్రాన్ని ప్రారంభించాల‌న్నా దానిని ప్రారంభించే ముందు ప‌లుసార్లు ట్ర‌య‌ల్ ర‌న్ వేస్తారు.. ఒక‌టికిప‌దిసార్లు చెక్ చేసుకొని ప్రారంభించిస్తారు.. కానీ, అధికారులు మాత్రం ప్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించిన త‌రువాత.. సంద‌ర్శ‌కుల‌ను అనుమతించేసిన   త‌రువాత ప‌రిశీల‌న నిమిత్తం  తెగ్గొట్టామంటూ చెప్పుకుని జనాలను నమ్మించడానికి విశ్వప్రయత్నం చేశారు.  సరే జనం నమ్మారని అనుకున్నా.. తాజాగా శ‌నివారం మ‌రోసారి ప్లోటింగ్ బ్రిడ్జి చివ‌రి భాగం తెగిపోయింది. ఇది కూడా మాక్ డ్రిల్లే అంటారా? అనగలరా?  జనం మాత్రం జగన్ సర్కార్ కు కూల్చివేతలు తప్ప నిర్మాణాలు చాతకాదు అని బాహాటంగానే చెబుతున్నారు.  స‌ద‌ర్శ‌నీయ స్థ‌లం, ఆట‌విడుపు ప‌రిక‌రాలు, సాహ‌స క్రీడ.. ఇలా ఏదైనా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాలంటే స‌మ‌గ్ర స‌న్న‌ద్ద‌త అవ‌స‌రం. ఎన్నో ప‌రిశీల‌న‌లు, ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌రువాత అనుమ‌తించాలి. అలాంటిదేమీ పూర్తిగా చేయ‌కుండానే వైసీపీ నేత‌లు, మంత్రులు త‌మ గొప్ప త‌నం చాటుకునేందుకు ఆర్కే బీచ్ లో  గ‌త‌నెల 25న ప్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారు. సంద‌ర్శ‌కుల అనుమ‌తికి టికెట్ కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. పెద్ద‌ల‌కు రూ.100, ప‌న్నెడేళ్ల లోపు పిల్ల‌ల‌కు రూ. 70 వ‌సూలు చేసేలా ధ‌ర‌లు నిర్ణ‌యించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూల‌త ఆధారంగా సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తిస్తామ‌ని బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు, అధికారులు అనాలోచిత నిర్ణ‌యాల కార‌ణంగా విశాఖ ప్ర‌జ‌లు ప్లోటింగ్ బ్రిడ్జి అంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ప్లోటింగ్ బ్రిడ్జి విశాఖ తీరంలో ఎంత‌వ‌ర‌కు సుర‌క్షిత‌మ‌నే అనుమానాలు తొలి నుంచీ ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ తీరంలో  ఇలాంటి  ఏర్పాటు ఎవరూ ఎప్పుడూ చేయలేదు.   ఆరేబియా స‌ముద్రంతో పోల్చితే బంగాళాఖాతం అత్యంత ప్ర‌మాక‌ర‌మైంది. ఇక్క‌డ అల‌ల తాకిడి ఎచాలా ఎక్కువ‌. ముఖ్యంగా సముద్ర అలల తీవ్రత ఎప్పుడు ఎలా ఉంటుందో అంచ‌నా వేయ‌లేమ‌ని జాతీయ స‌ముద్ర ప‌రిశోధ‌న సంస్థ నిపుణులు పేర్కొంటున్నారు. గోవా, ముంబ‌యి, కేర‌ళ రాష్ట్రాల్లో అరేబియా స‌ముద్రం మే, జూన్, జులై, ఆగ‌స్టు నెల‌ల్లో ప్ర‌మాద‌క‌రంగా.. మిగిలిన కాలం ప్ర‌శాంతంగా ఉంటుంది. తూర్పుతీరం మాత్రం భీక‌ర వాతావ‌ర‌ణాన్ని క‌లిగి ఉంటుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. సువిశాల‌మైన ఈ తీరం ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే గాలుల‌తో నిత్యం అల‌జ‌డిగా ఉంటుంది. ఎప్పుడు త‌క్కువ తీవ్ర‌త ఉంటుందో అంచ‌నా వేయ‌డం సాధ్యం కాదు. అవేవి పట్టించుకోకుండా ఏపీ ప్ర‌భుత్వం హ‌డావుడిగా ఆర్కే బీచ్ లో ప్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి అంత కంటే ఆర్భాటంగా ప్రారంభోత్సవం కూడా చేసేసింది. ఇప్పుడు అది స్వల్ప వ్యవధిలో రెండు సార్లు తెగిపోవడంతో ఇక ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కథ ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కవరింగులు ఇచ్చుకుని, మరమ్మతులు అంటే ఏదో ఒకటి చేసేసి సందర్శకులను అనుమతించినా జనం మాత్రం ఆ బ్రిడ్జి మీదకు రావడానికి ఏ మాత్రం ఇష్టపడే పరిస్థితి లేదని అంటున్నారు.  

కడప లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ సునీత పోటీ ఫిక్స్.. పార్టీ ఏదంటే?

దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వచ్చే లోక్ సభ ఎన్నికల పోటీ చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టడం ఖాయమని తేలిపోయింది. తన తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేసి, గుండెపోటు అతి తొలుత నమ్మించడానికి ప్రయత్నించి, అది ఫలించకపోయే సరికి నారాసుర రక్త చరిత్ర అంటూ నెపాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు.   అది కూడా అవాస్తవమని తేలిపోయేసరికి.. తన తండ్రి హత్య సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టి వారికి శిక్షపడేలా చేయడమే లక్ష్యంగా డాక్టర్ సునీత అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమె డిమాండ్ మేరకే వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టింది. ఆమె డిమాండ్ మేరకే ఈ హత్య కేసు విచారణను కోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటన్నది దాదాపుగా అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది. వివేకా హత్య వెనుక సొంత బంధువులే ఉన్నారని ద్యాప్తు సాగుతున్న క్రమంలో డాక్టర్ సునీతకు కూడా స్పష్టత వచ్చింది. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ కు స్వయానా తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల తన చిన్నాన్న వివేక హత్యకు మోటివ్ కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశమేనని కుండ బద్దలు కొట్టేశారు.  వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టినా, కేసు ను ఏపీ నుంచి తెలంగాణకు మార్చినా విచారణను  అడుగడుగునా అడ్డుకునే విషయంలో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.  అదలా ఉంచితే..  వైఎస్ వివేకా హత్య కేసు 2019 ఎన్నికల సమయంలో కీలక అంశంగా ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికలలో కూడా వివేకా హత్య అంశం కీలకం కానుంది. అయితే అప్పుడు జగన్ కు సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన ఈ అంశం ఇప్పుడు రివర్స్ లో కీలకంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకూ సీబీఐ దర్యాప్తు కూడా హంతకులు ఎవరన్నది, హత్య వెనుక కుట్ర ఏమిటన్నది తేల్చలేకపోవడం, అప్పట్లో వివేకా హత్యను తనకు సానుభూతిగా మార్చుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి అండగా నిలవడంతో నాడు సానుభూతి కురిపించిన ఈ అంశం ఇప్పుడు జగన్ కు వ్యతిరేకత పెల్లుబకేలా చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.  సరిగా ఈ తరుణంగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకపోవడాన్ని ఆక్షేపిస్తూ... ప్రజామద్దతు, ప్రజా తీర్పు కోరుతూ జనం ముందుకు రావాలని డిసైడైపోయారు. రాజకీయ మద్దతు, అండతో తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకుండా నిందితులు రక్షణ పొందుతున్నారని ఆరోపించిన ఆమె ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి ప్రజామద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నారు.  ఇటీవల హస్తిన వేదికగా ఆయన మీడియా సమావేశంలో తన తండ్రి హత్య కేసును ముందుకు జరగకుండా ఆపడంలో తన పెదనాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ ప్రమేయం ఉందని నేరుగా ఆరోపించారు. అటువంటి వ్యక్తికి, ఆయన పార్టీకీ ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపుచర్చారు. ఈ మీడియా సమావేశం ద్వారా తాను ప్రత్యక్ష  రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. తమ కుటుంబంలో వైఎస్ సునీత ఒక్కరే తనకు అండగా నిలిచారని డాక్టర్ సునీత చెప్పారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే డాక్టర్ సునీత ఏ రాజకీయ పార్టీలో చేరతారన్న విషయంలో ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆమె హస్తిన వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడిన దానిని  బట్టి చూస్తే వచ్చే ఎన్నికలలో ఆమె కడప్ ఎంపీ అభ్యర్థిగా నిలబడటం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో  కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందని వినిపిస్తున్నా, ఒక పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అంశాన్నీ తోసిపుచ్చలేమని చెబుతున్నారు. ఎందుకంటే వివేకా హత్య కేసు విషయంలో పార్టీలకు అతీతంగా జగన్ పై ఆగ్రహం, సునీతపై సానుభూతి వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

ధరణి సమస్యల పరిష్కారంపై రేవంత్ సర్కార్ నజర్!

బీఆర్ఎస్ హయాంలో ధరణి అవకతవకలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ధరణిని రద్దు చేసి దాని స్థానంలో మరో పోర్టల్ ను తీసుకువచ్చే కసరత్తు చేస్తున్నప్పటికీ, దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, అలాగే చట్ట సవరణ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ముందుగా ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేశారు. ఈ నెల 9లోగా వీలైనంత వరకూ ప్రతి సమస్యనూ పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ఈ నేపథ్యంలోనే  అధికారులు 2020  నుంచి పెండింగ్​లో ఉన్న ఫైళ్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు. జిల్లాల్లో  మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రోది చేసి  క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇందు కోసం 86 బృందాలను కూడా  మొత్తం పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు అధికారులు వచ్చారని చెబుతున్నారు.   భూమి రిజిస్ట్రేషన్​ ముగిసి ధరణి రాకతో ముటేషన్లు ఆగిపోయిన అర్జీలను ముందుగా పరిష్కరించాలని నిర్ణయించారు. అలాగే  గ్రీవెన్స్​ ఆఫ్​ ల్యాండ్​ మేటర్ సమస్యలు,  ఫొటో కరెక్షన్​, జెండర్​, ఆధార్, క్యాస్ట్​, డిజిటల్​ సైన్​, మిస్సింగ్​ సర్వే నంబర్​ వంటి సమస్యలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇటువంటి సమస్యలను త్వరగానే పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు.  ఇవిగాక సక్సెషన్, ఎల్ఏజీ, ఖాతా మెర్జింగ్, టీఎం ధరఖాస్తులను కూడా పెద్దగా సమస్యలేవీ లేకుండానే పరిష్కారం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.  నిషేధిత సర్వే భూములకు సంబంధించిన దరఖాస్తులను మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టేయాలనీ, అలాగే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని కూడా అధికారులు ప్రస్తుతానికి పక్కన పెట్టేయాలని నిర్ణయించారు.    ధరణి పోర్టల్ అమలులోకి తీసుకువచ్చిన తరువాతనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ, వాటిని సత్వరమే పరిష్కరించాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది.  కోర్టు వివాదాలు లేని ప్రతి దరఖాస్తునూ పరిశీలించి పరిష్కరించాలని ఇప్పటికే రేవంత్ సర్కార్ జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో చాలా వరకూ సమస్యలు ఈ నెల 9నాటికి పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. 

తండ్రీ కొడుకులు చేతులెత్తేశారా? బీఆర్ఎస్ వలసలకు ఇక అడ్డేలేదా?

గండి పడి వరద నీరు ఊళ్లకు ఊళ్లను ముంచేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల వరద కొనసాగుతోంది. పార్టీ అస్థిత్వానికే గండి పడిందా అంటూ  బీఆర్ఎస్ శ్రేణులే చర్చించుకునేలా పరిస్థితి మారిపోయింది. గండి పూడ్చడానికి బదులు వలసల ప్రవాహాన్ని పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలా చూస్తూ ఊరుకోవడాన్ని చూస్తుంటే తండ్రీ కొడుకులిద్దరూ చేతులెత్తేశారా అని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ రెండు సందర్భాలలోనూ కూడా బీఆర్ఎస్ లోకి వలసలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఏకంగా శాసనసభా పక్షాలనే విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీది. కానీ 2023 ఎన్నికల తరువాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. అధినేత, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తోంది. అసలు కేసీఆర్ నాయకత్వంపై ధిక్కారం పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చిన నాడే మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక 2023 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత పార్టీపై కేసీఆర్, కేటీఆర్ పూర్తిగా పట్టు కోల్పోయారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కళకళలాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతున్నది. నిన్న మొన్నటి వరకూ చేరికలతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ ఇప్పుడు వలసన కారణంగా బోసిపోయి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు పార్టీ రెండవ శ్రేణి నాయకత్వం కూడా ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి జంప్ కొట్టేయడానికి రెడీగా ఉన్నారు. ఈ విషయంలో వారేమీ దాపరికం ప్రదర్శించడం లేదు.. బాహాటంగానే పార్టీ పట్ల తమ విముఖతను చాటుతున్నారు. క్యాడర్ పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. మొదట్లో వలసలను ఆపడానికి ఏదో ఒక మేరకు ప్రయత్నించిన కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పడు తమ ప్రయత్నాలు,  బుజ్జగింపులు ఫలించే పరిస్థితి లేదని అర్ధం చేసుకుని మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోతున్నారు.  ఓటమి తరువాత కూడా నెపం సిట్టింగుల మీదే నెట్టేసి.. వారి పట్ల ప్రజలలో ఉన్న అసంతృప్తే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి కారణమంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్, కేటీఆర్ లకు ఇప్పుడు తత్వం బోధపడి బొమ్మ కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అసంతృప్తి కేవలం సిట్టింగుల మీదే కాదనీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, అహకర పూరిత వైఖరి పైన కూడానని వారికి అర్థమైనట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీకి టికెట్ ఇస్తామన్నా పోటీ చేయలేం బాబోయ్ అని పారిపోయే వారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తున్నదని అంటున్నారు.  లీడర్లు పోయినా క్యాడర్ ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు గంభీరంగా చెబుతున్నప్పటికీ, క్యాడర్ లో పార్టీ పట్ల అసంతృప్తిని గమనించే లీడర్లు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. ఇందుకు ఉదాహరణ పార్టీ నుంచి వలసలలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ అధికంగా ఉండడాన్ని చూపుతున్నారు. ఇక  బీఆర్ఎస్ ను వీడి వచ్చిన నేతలకు  బీజేపీ లోక్ సభ టికెట్లు ఇవ్వడం చూస్తుంటే ప్రజల అసంతృప్తి బీఆర్ఎస్ అధినాయకత్వం మీదా, సిట్టింగుల మీదా అన్నది స్పష్టంగా అవగతమౌతోందని అంటున్నారు. 

ఏపీకి రేవంత్ రెడ్డి!.. కాంగ్రెస్ ఆశలన్నీ ఆయనపైనే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఆ పార్టీ ఏపీ అధినేత్రిగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తరువాత గత పదేళ్లుగా రాష్ట్రంలో కనిపించని కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి చాటుకుంటున్న పరిస్థితి. వరుస సభలు, సమావేశాలతో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ పుట్టించే ప్రయత్నాలు పెరిగాయి. షర్మిల రాకతో పార్టీలో  జోష్ అయితే కనిపించింది కానీ, ఆ జోష్ రాష్ట్రంలో ఏవో కొన్ని స్థానాలలోనైనా పార్టీని విజయం దిశగా నిడిపించేంతగా లేదని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎన్నికలలోనైనా సరే అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉండి తీరాలన్న పట్టుదల ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు తోడుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రచార బాధ్యతలు అప్పగించే యోచనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే నిర్ణయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హై కమాండ్ తీసేసుకుంది.  రాష్ట్ర విభజన ముందు వరకూ రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి విభజన తరువాత ఉనికి మాత్రంగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో సీనియర్లు, క్రియాశీలంగా వ్యవహరించే నేతలూ అందరూ వేరే వేరే పార్టీల్లో సర్దుకున్నారు. అలా సర్దుకోలేనివారు రాజకీయంగా క్రీయాశీలంగా వ్యవహరించడం మానేశారు. కేవీపీ, పల్లంరాజు, రఘువీరారెడ్డి ఇలా పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తారన్న పేరున్న నేతలే కాకుండా, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి లగడపాటి, ఉండవల్లి వంటి అంతో ఇంతో ప్రజా సంబంధాలు ఉన్న వారు రాజకీయాలకు దూరమయ్యారు. దీంతో గత పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. పార్టీ కార్యక్రమాలు లేవు. ఒక వేళ ఏమైన కార్యక్రమం తలపెట్టినా చురుకుగా పాల్గొనే నేతలు లేరు, క్యాడర్ లేదు. దీంతో ఆ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. ఎన్నికలలో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరవైన పరిస్థితి. ఈ తరుణంలో 2024 ఎన్నికలలో ఎలాగైనా అసెంబ్లీలో ప్రవేశించాలన్న సంకల్పంతో రాష్ట్ర కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స చేస్తున్నది పార్టీ అధిష్ఠానం. ఇందు కోసం తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు నుంచే వ్యూహరచన ప్రారంభించింది. తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినప్పటికీ, హై కమాండ్ ఆమెతో పలు మార్లు చర్చించి.. విలీనం లేకుండా ఆ పార్టీ పోటీ నుంచి దూరంగా ఉండేలా వ్యూహాత్యకంగా వ్యవహరించింది. వైఎస్పార్టీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ లబ్ధి పొందిందనడంలో సందేహం లేదు. ఆ తరువాత ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగానే  వ్యవహరించింది. పార్టీని విలీనం చేసిన షర్మిలను ఆమె కోరినట్లుగా రాజ్యసభకు పంపడం కాకుండా రాష్ట్ర ఎన్నికల బరిలోనే దింపాలని నిర్ణయించింది. దీని వల్ల వైఎస్ తనయగా షర్మిల వైఎస్ జగన్ ను గట్టిగా దెబ్బతీయగలుగుతారని భావించింది. అందుకు అనుగుణంగానే వైఎస్ షర్మిల ఎంట్రీతో జగన్ పార్టీలో కలకలం రేగింది. షర్మిల జగన్ పై నేరుగా చేస్తున్న విమర్శలు వైసీపీలో భూకంపం పుట్టిస్తున్నాయి. అయితే షర్మిల ఎంట్రీ జగన్ పార్టీని అయితే బలహీనం చేయగలిగింది కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కోరుకున్నట్లుగా రాష్ట్రంలో కొన్ని స్థానాలలోనైనా పార్టీని గెలుపు వైపు నడిపించగలదా అంటే అనుమానమే అన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నది. దీంతో పార్టీలో మరింత జోష్ నింపాలంటే.. ఏపీలో కూడా మంది ఫాలోయింగ్ ఉన్న రేవంత్ ను రంగంలోకి దింపడమే మార్గమని హైకమాండ్ భావిస్తోంది. అందుకే రేవంత్ ను ఏపీలో విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో తెలంగాణ కాంగ్రెస్ లోని షర్మిల ఎంట్రీ అన్న వార్తలు విస్తృతంగా వినిపిస్తున్న సమయంలోనే రేవంత్ ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం పని లేదనీ, ఆమె ఏపీకి వెడితే అన్ని విధాలుగా తాను సహాయ సహకారాలు అందిస్తాననీ చెప్పిన విషయాన్ని వారిక్కడ ప్రస్తావిస్తున్నారు.  ఇప్పుడు హైకమాండ్ రేవంత్ ను అదే పని చేయమంటోందంటున్నారు. అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే.. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహ రచన చేసి ఉంటుందని చెబుతున్నారు.  తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 11న విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 11న ఏపీ కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఆ కార్యక్రమానికి  రేవంత్ హాజరు అవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న రేవంత్ కు ఏపీలో కూడా మంచి పరిచయాలున్నాయి. పార్టీలకు అతీతంగా పలువురు నేతలతో ఆయనకు పరిచయాలు, స్నేహం ఉంది. ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఆ పరిచయాలు, స్నేహంతో  ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం ఆయన పని చేస్తారని అంటున్నారు.    

ఈ నెల 12 తర్వాత ఈడీ విచారణకు నేను సిద్దమే: కేజ్రీవాల్ 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే అయినా విచారణకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అయితే, మార్చ్ 12 తరువాత విచారణ తేదీని ఖరారు చేయాలని సూచించారు.  మద్యం పాలసీలో అవకతవకలకు సంబంధించి ఈడీ ఇప్పటివరకూ ఎనిమిది సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవ్వాలని కోరింది. కానీ, ఈ నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమైనవి అంటూ కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. ఈడీ తాజాగా ఫిబ్రవరి 27న మళ్లీ నోటీసులు జారీ చేసింది. మార్చి 4న తమముందు హాజరు రావాలని పేర్కొంది.  దీనిపై స్పందించిన ఆప్ మార్చి 12 తరువాత కేజ్రీవాల్ విచారణకు వస్తారని తెలిపింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరవుతారని చెప్పింది. అయితే, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఈడీ పట్టుబడుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు నిబంధనలు అనుమతించవని చెబుతోంది.  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. లంచాలు చేతులుమారడం, మద్యం పాలసీలో తప్పులు తదితర అంశాలపై కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్ సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేయగా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఈడీ అక్టోబర్‌‌లో అరెస్టు చేసింది.  

సచివాలయాన్నీ తాకట్టు పెట్టేశారు.. ఇక మిగిలింది ప్రజల ఆస్తులే జగన్!

అభివృద్ధి అంటే తెలియ‌ని సీఎం జగన్ రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురాలేని అస‌మ‌ర్ధ సీఎంగా ఇప్పటికే తనతు తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకు ప్రతిఫలంగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజలలో జగన్ ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో.. వరుసగా వెలువడుతున్న సర్వేలన్నీ సందేహాలకు అతీతంగా రుజువు చేస్తూనే ఉన్నాయి. అది చాలదన్నట్లు గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో వ‌చ్చిన కంపెనీల‌ను వెళ్ల‌గొట్టేసిన సీఎం జగన్ ఇప్పుడు  ఏకంగా  ప్ర‌భుత్వ భూముల‌ను తాక‌ట్టు పెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా  ఏకంగా రాష్ట్ర ప్ర‌జ‌లు దేవాల‌యంగా భావించే స‌చివాల‌యాన్నిసైతం బ్యాంకులో తాకట్టు పెట్టేశారు.  జగన్ వంటి ముఖ్యమంత్రి  దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఉంటాడా?  అని జనం విస్తుపోతున్నారు.  ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి కొత్త‌ నిర్మాణాలు  లేవు.. కొత్త‌గా వ‌చ్చిన కంపెనీలు లేవు.. కొత్త‌గా వ‌చ్చిన ఉద్యోగాలూ లేవు.. క‌ బ్జాలు  ఉన్నాయి.. ప్ర‌భుత్వ ఆస్తులు తాక‌ట్టు పెట్ట‌డాలు మాత్రం ఉన్నాయి. ఇలా ప్ర‌పంచంలో ఏక్క‌డా క‌నిపించ‌ని అరుదైన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటూ ఏపీ ప్ర‌జ‌లు త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు దేవాల‌యంగా  ప్ర‌భుత్వ పాల‌న‌కు కేంద్రంగా ఉండే స‌చివాల‌యాన్నిసైతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్యాంకులో తాక‌ట్టు పెట్టారంటే.. ఇలాంటి సీఎంను ఎన్నుకున్నందుకు ఏపీ ప్ర‌జ‌లు సిగ్గుతో త‌ల‌దించుకుంటున్న ప‌రిస్థితి నెల‌కొంది.  జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి న నాటి నుంచి రాష్ట్రంలో కంటికి క‌న‌ప‌డిన ప్ర‌భుత్వ ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టుకుంటూ వ‌స్తున్నారు. గ‌తేడాది మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం 48వేల కోట్లు అప్పు తెచ్చింది..  విశాఖ‌లో 13 ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, కాలేజీలు తాక‌ట్టు పెట్టి రూ. 25వేల కోట్లు.. రోడ్లు భ‌వ‌నాల శాఖ‌లో కొన్ని ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి ఏడు వేల కోట్లను వైసీపీ ప్ర‌భుత్వం అప్పుగా తెచ్చింది. ఇన్నాళ్లూ తాక‌ట్టు పెట్ట‌కుండా ఏపీలో మిగిలింది ఏదైనా ఉందంటే అది స‌చివాల‌యం మాత్ర‌మే అని ఏపీ ప్ర‌జ‌లు చెప్పుకుంటూ వ‌చ్చారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ స‌చివాల‌యాన్ని కూడా వ‌ద‌ల్లేదు. గుట్టు చ‌ప్పుడు కాకుండా హెచ్‌డీఎప్‌సీ బ్యాంకుకు రూ. 370 కోట్ల‌కు స‌చివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టేశారు. సచివాలయంలో ఐదు భ‌వ‌నాలు ఉన్నాయి. శాసన సభ, శాసనమండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని ఐదు బ్లాకులను ప్ర‌భుత్వం తాకట్టు పెట్టింది. ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ మొత్తం దాదాపు 3ల‌క్ష‌ల కోట్లు.. అందులో రాష్ట్ర స‌చివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టి అంత‌ డ‌బ్బు ఎందుకు తేవాల్సి వ‌చ్చిందో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మాధానం చెప్పాల్సి ఉంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ ఆస్తుల‌న్నీ బ్యాంకుల్లో తాక‌ట్టు పెట్టి వ‌చ్చిన డ‌బ్బును ఏం చేస్తున్నారన్న విషయం ఆర్థిక అంశాల‌పై ప‌ట్టున్న వారికికూడా అర్థంకాని ప‌రిస్థితి నెలకొంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక్క‌ చాన్స్ ఇవ్వండి   ప్లీజ్ అంటూ ఏపీ ప్ర‌జ‌లను వేడుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి,  అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఆస్తుల‌ను బ్యాంకుల్లో తాక‌ట్టుపెడుతూ వ‌స్తున్నారు. అందుకే ఒక్క చాన్స్ అడిగారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తాకట్టు పెట్టడం తప్ప ఆయన ప్రభుత్వ పరంగా ఈ ఐదేళ్లలో ఏం చేసింది లేదని అంటున్నారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌రువాత ఏపీకి రాజ‌ధాని లేకుండా పోయింది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి కేంద్రంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌ను త‌ల‌ద‌న్నేలా ఏపీ రాజ‌ధానిని నిర్మించాల‌ని భావించారు. అమ‌రావ‌తి ప్రాంత రైతులుసైతం చంద్ర‌బాబు అడిగిందే త‌డ‌వుగా భూములిచ్చేశారు. భావిత‌రాల‌కు అద్భుత రాజ‌ధానిని అందించాల‌ని భావించిన చంద్ర‌బాబు ఒక్కో అడుగు ముందుకేస్తూ భ‌వ‌నాల నిర్మాణాలు చేప‌ట్టారు. అసెంబ్లీ, స‌చివాల‌యం, హైకోర్టు ఇలా  రూ.700 కోట్ల వ్యయంతో భ‌వ‌నాల‌ను నిర్మించారు. ఆ భ‌వ‌నాలు కొన్ని 80శాతం, కొన్ని 90శాతం, కొన్ని భ‌వ‌నాలు పూర్తిస్థాయిలో నిర్మాణం జ‌రిగాయి. అయితే  అవ‌న్నీ గ్రాఫిక్స్ మాత్ర‌మే అంటూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ప్ర‌చారం చేశారు. దీనికితోడు ఒక్క‌ చాన్స్ ప్లీజ్  అంటూ ప్ర‌జ‌ల‌ను వేడుకున్నాడు. దీంతో ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గుడ్డిగా న‌మ్మి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌రావ‌తి రాజ‌ధానికాదు అంటూ జ‌గ‌న్ బాంబు పేల్చాడు. ఒక్క‌ రాజ‌ధానితో ఏపీలో అభివృద్ధి జ‌ర‌గ‌దు.. నేను మూడు రాజ‌ధానులు క‌డ‌తా అంటూ జ‌గ‌న్ ఐదేళ్లుగా ప్ర‌జ‌ల చెవుల్లో పువ్వులు పెడుతూనే వ‌స్తున్నారు. అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు క‌ట్టిన భ‌వ‌నాలు ఏమీలేవంటూ ప్ర‌చారం చేసిన జ‌గ‌న్.. ఇప్పుడు ఆ భ‌వ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి కోట్ల రూపాయ‌లు అప్పులు తీసుకున్నారు.  జ‌గ‌న్ అమ‌రావ‌తిని నిర్వీర్యం చేయ‌కుండా చంద్ర‌బాబు క‌ట్ట‌గా మిగిలిన భ‌వ‌నాల‌ను పూర్తిచేసినా ఏపీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మంచి రాజ‌ధాని అయ్యి ఉండేది. ప్ర‌జ‌ల సొమ్మును దోచుకోవ‌టానికి అలవాటు ప‌డిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు అమ‌రావ‌తి రాజ‌ధాని కాదు స్మ‌శాన వాటిక.. అక్క‌డ ఉంది బూడిదే అంటూ ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. అమ‌రావ‌తిలో భ‌వ‌నాల నిర్మాణానికి 100 కోట్లు కూడా కాదు.. చంద్ర‌బాబు వెయ్యి కోట్లు పెడుతున్నారు.. ప్ర‌జల సొమ్మును చంద్ర‌బాబు దోచుకున్నారని జ‌గ‌న్ అండ్ కో గ‌తంలో ప్ర‌చారం చేసింది.. జ‌గ‌న్ చెప్పిందే నిజ‌మైతే.. మ‌రి ఇప్పుడు స‌చివాల‌యం తాక‌ట్టుకు బ్యాంకు రూ.370కోట్లు ఎలా అప్పు ఇచ్చిందంటూ ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. త‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేయించ‌డం.. త‌న‌కు అనుకూల ఛాన‌ల్స్ ద్వారా  త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం.. ఇలా ఏపీ ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలువునా మోసం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌చివాల‌యాన్ని  తాక‌ట్టుపెట్ట‌డాన్ని చూసి ఆర్థిక‌ వేత్త‌లు సైతం నివ్వెర పోతున్నారు. ఇలాంటి వ్య‌క్తినా ఏపీ ప్ర‌జ‌లు సీఎంగా ఎన్నుకుంది అంటూ జాలిప‌డుతున్నారు. స‌చివాల‌యం తాక‌ట్టు పెట్టిన విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబు నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి... చివరికి అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు.. ఇంత‌కంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటూ  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా ఏపీ ప్ర‌జ‌లు మేల్కొని ఓటు ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బుద్దిచెప్ప‌కుంటే రాబోయే కాలంలో రాష్ట్రంలోని ప్ర‌తీఒక్క‌రి ఆస్తుల‌ను ప్ర‌భుత్వ ఆస్తులుగా చూపించి బ్యాంకుల్లో తాక‌ట్టు పెట్టి అప్పులు తెచ్చినా ఆశ్చ‌ర్యం పోవాల్సిన ప‌నిలేదని ఆర్థిక వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగివా.. వైసీపీ కార్య‌క‌ర్త‌వా..?

వైసీపీ ప్ర‌భుత్వంలో కొంద‌రు అధికారుల తీరు హ‌ద్దులు దాటిపోతోంది.  అలాగే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి హార్డ్ కోర్ కార్య‌క‌ర్త‌ల్లా వ్యవహరిస్తున్నారు. త‌మ స్వ‌లాభం కోసం  ప్ర‌భుత్వ పెద్ద‌ల ప్ర‌స‌న్నంకోసం కొంద‌రు ఉద్యోగ సంఘాల నేత‌లు ఎంతకైనా  తెగించేస్తున్నారు. పాతాళానికి సైతం దిగజారడానికి వెనుకాడటం లేదు.    ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా వారికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పొగిడేందుకే మ‌నం ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్నాం అన్న‌ట్లుగా కొంద‌రు ఉద్యోగం సంఘాల నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఉద్యోగులు,  ప్ర‌జ‌లలు విస్తుపోవడమే కాదు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో,  ప్ర‌భుత్వంలో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌తో అధికారులు స‌త్సంబంధాలు క‌లిగి ఉండ‌టంలో ఏమాత్రం త‌ప్పులేదు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల విష‌యంలో సీఎం ఆదేశాల‌ను, మంత్రుల ఆదేశాలను పాటించ‌డా్నీ తప్పుపట్టలేం. ప్ర‌భుత్వం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌డం ఉద్యోగుల విధి. కానీ, ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉన్నామ‌న్న సోయి  మ‌రిచి ప్ర‌భుత్వంలోఉన్న పార్టీకి కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తుండటం  ఉద్యోగ సంఘాల ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారే ప‌రిస్థితికి దారి తీస్తోంది.  సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తీరు అలానే ఉంది.  వెంక‌ట్రామిరెడ్డి తీరుప‌ట్ల ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి  2022 డిసెంబ‌ర్ నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీరు వివాదాస్ప‌దంగానే ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగిలా కాకుండా వైసీపీ కార్య‌క‌ర్త‌లా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. సీఎం వ‌ద్ద‌కు, ప్ర‌భుత్వ పెద్ద‌ల వద్దకు  ఉద్యోగుల సమ‌స్య‌ల‌ను తీసుకెళ్లి వాటి ప‌రిష్కారంకోసం కృషిచేయాల్సిన   ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి స్వలాభంకోసం వైసీపీ కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో వెంక‌ట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.  2023లో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వెంక‌ట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రాణాపాయం ఉంటే చంపడానికైనా హక్కు ఉంది.. రాజ్యాంగంలో ఆ విషయాన్ని పొందుపరిచారంటూ వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సచివాలయ ఉద్యోగులుసైతం ఆయ‌న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి. వెంక‌ట్రామిరెడ్డి త‌న‌ను తాను ప‌లు సంద‌ర్భాల్లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బంటున‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వ ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగ నిబంధ‌న‌లకు లోబ‌డి ప‌నిచేయాల్సి ఉంటుంది. సీఎంపై, ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీపై ప్రేముంటే ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని వ‌దిలి కార్య‌క‌ర్త‌గా చేరితే బాగుంటుంది. కానీ, ఉద్యోగ సంఘం నేత ముసుగులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద స‌చివాల‌య ఉద్యోగులను తాక‌ట్టుపెట్టిన వ్య‌క్తిగా వెంక‌ట్రామిరెడ్డి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కీల‌క భూమిక పోషించాల్సింది పోయి వైసీపీ కార్య‌క‌ర్త‌లా మారిపోవ‌టం ప‌ట్ల పలువురు ఉద్యోగులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల‌ వెంక‌ట్రామిరెడ్డి ఉద్యోగులతో జ‌రిగిన‌ స‌మావేశంలో పాల్గొని మాట్లాడిన మాట‌లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. గ్రామ సచివాలయాల్లో మంచి జరిగిందా లేదా అన్నది వ‌చ్చే ఎన్నికలే ఉదాహరణ.. ఒక‌వేళ వైసీపీ ఓడిపోతే మనం బాగా పని చేయనట్టే అని వెంక‌ట్రామిరెడ్డి ఉద్యోగుల‌తో  అన్నారు. అంత‌ వ‌ర‌కు బాగానేఉన్నా.. ప‌లు ప‌త్రిక‌లు, చాన‌ల్స్ పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు పుంఖాను పుంఖాలుగా రాస్తూ టీవీ చానల్స్ లో డిబేట్ లు పెడుతున్నాయ‌ని వెంక‌ట్రామిరెడ్డి వ్యాఖ్యానించ‌డం ప‌ట్ల ఉద్యోగుల నుంచే  కాకుండా రాజకీయ వర్గాల నుంచీ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగిగా మాట్లాడేట‌ప్పుడు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, వైసీపీ కార్య‌క‌ర్త‌లా మాట్లాడితే రాబోయే కాలంలో ఉద్యోగుల‌ను ప్ర‌జ‌లు చీదరించుకునే పరిస్థితి వస్తుందని  ప‌లువురు ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికలు, చానల్స్  హైలెట్ చేస్తూ ఉద్యోగులకు మేలు జరిగేలా చేస్తుంటే.. వెంకట్రామిరెడ్డి పత్రికలు, ఛానల్స్ పై వైసీపీ కార్యకర్తలా ఆరోపణలు చేయడం ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇప్ప‌టికైనా ఉద్యోగ సంఘంలో కీల‌క హోదాల్లో ఉన్న‌వారు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి మాట్లాడితే బాగుంటుంద‌ని, లేకుంటే రానున్న కాలంలో ప్ర‌భుత్వ‌ ఉద్యోగులంటేనే ప్ర‌జ‌లు పార్టీల కార్యకర్తలుగా భావించే ప్రమాదం పొంచిఉందని ప‌లువురు ఉద్యోగ సంఘం నేత‌లు, ఉద్యోగులు వాపోతున్నారు.

జగన్ ఫేట్ ఇదీ.. తేల్చిచెప్పిన ప్ర‌శాంత్ కిషోర్‌

ప్ర‌శాంత్ కిషోర్.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యూహ‌క‌ర్త‌..  వైసీపీ విజ‌యం సాధించ‌డంతోపాటు అత్య‌ధిక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగ‌ర‌డంలో  కీల‌క భూమిక పోషించిన వారిలో ఒక‌రు. ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే అంటే అందులో తిరుగుండ‌ద‌ని దేశ రాజ‌కీయాల్లో పేరుంది. ప్ర‌జ‌ల నాడిని ప్ర‌శాంత్ కిషోర్ తేలిగ్గా ప‌ట్టేయ‌గ‌లరు. అలాంటి ప్ర‌శాంత్ కిషోర్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేది ఏ పార్టీనో  క్లియర్ కట్ గా తేల్చేశారు.   2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని, అందులో ఎలాంటి అనుమానం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.  అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదనీ, ఘోరమైన పరాజయం తప్పదనీ తేల్చేశారు. వైసీపీ ఓట‌మికి కార‌ణాల‌ను కూడా ప్ర‌శాంత్ కిషోర్ వివ‌రించాడు. వైసీపీ ఓడిపోతుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన వెంట‌నే ఆ పార్టీ సోష‌ల్ మీడియా రెచ్చిపోయింది.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేల‌తో విజ‌యం సాధించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఇప్పుడు ఆయ‌న స‌ర్వేలు తూచ్‌.. అంతా అబ‌ద్దం అని వైసీపీ  పార్టీ సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేయ‌డం మొద‌లైపోయింది. అంతేకాదు.. జగన్ త‌న మంత్రుల‌తో ప్రశాంత్ కిషోర్ ను ఇష్టారీతిగా తిట్టించేశారు.   బీహార్ లో చెల్ల‌ని రూపాయి అయిన ప్రశాంత్ కిషోర్   స‌ర్వేలు ఇక్కడ ప‌నిచేయ‌వంటూ ఎదురుదాడి  మొద‌లు పెట్టారు.  ప్ర‌శాంత్ కిషోర్ ఒక్క‌రేకాదు.. ప్ర‌ముఖ స‌ర్వేల ఫ‌లితాల‌న్నీ వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వ‌స్తుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నాయి. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్నది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కేవ‌లం ప‌థ‌కాల పేరుతో అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ చేయ‌డం త‌ప్ప,  వైసీపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లరు  చెప్పుకోవ‌డానికి క‌నీసం ఒక్క రోడ్డునుకూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేయ‌లేక పోయారు. 2014 నుంచి 2019 వరకూ ఏపీ సీఎంగా చంద్ర‌బాబు చేసిన అభివృద్ధిని కొన‌సాగించ‌క పోవ‌టంతోపాటు.. చంద్ర‌బాబు హ‌యాంలో నిర్మించిన భ‌వ‌నాల‌ను కూల్చేశారు. అంతేకాదు.. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టిన పెద్ద‌పెద్ద కంపెనీల‌ను సైతం రాష్ట్రం నుంచి త‌రిమేసిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిది. మ‌ద్యం, ఇసుక పేరుతో జ‌గ‌న్ హ‌యాంలో భారీ దోపిడీ జ‌రిగింది. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడిచేయ‌డం, అరెస్టులు చేయించి జైళ్ల‌కు పంప‌డం తప్ప జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో జ‌రిగింది ఏమీ లేదు. చంద్ర‌బాబు హ‌యాంలో అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా అసెంబ్లీలో తీర్మానంచేసి.. అక్క‌డ స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టుల‌తో పాటు ప‌లు కార్యాల‌యాల‌కు భ‌వ‌నాల‌ను కూడా నిర్మించారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చే నాటికి అమ‌రావ‌తిలో కొన్ని భ‌వ‌నాలు పూర్తికాగా.. మ‌రికొన్ని చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. వాటిని కొన‌సాగించాల్సిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో అమ‌రావ‌తిని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. మూడు రాజ‌ధానుల పేరుతో ఏపీ ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగింది కేవ‌లం విధ్వంసం మాత్ర‌మే..  అభివృద్ధి ఆన‌వాళ్లు భూత‌ద్దం పెట్టి వెతికినా క‌నిపించ‌వు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్పులు చేశారు. అయినా, స‌ర్వే ఫ‌లితాల‌న్నీ వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేస్తున్నాయి. జ‌గ‌న్ సొంత‌గా నిర్వ‌హించిన స‌ర్వేలోనూ 75శాతం వైసీపీ అభ్య‌ర్థులు ఓడిపోతార‌ని తేలింద‌న్న ప్ర‌చారం వైసీపీ వ‌ర్గాల్లోనే జ‌రుగుతున్నది.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో జ‌గ‌న్ ఘ‌న విజ‌యం సాధిస్తారని ప‌లు జాతీయ మీడియా సంస్థ‌ల   స‌ర్వేల్లో తేలింది.. అవే జాతీయ మీడియా సంస్థ‌లు ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వేల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేశాయి. తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ కూడా వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేశాడు. హైదరాబాద్‌లో ఓ పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయ‌న ఏపీ రాజకీయాలపై స్పందించారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు.. జగన్ ఇలా చేయడం వల్లే రాజకీయంగా నష్టపోబోతున్నారని ప్ర‌శాంత్ కిషోర్‌ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.  తెలంగాణలో కేసీఆర్‌కికూడా అదే జరిగిందని అన్నారు. విద్య, ఉపాధి, అభివృద్ధి ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపుతాయని, ప్యాలెస్‌లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడబోవని ప్ర‌శాంత్ కిషోర్‌ అన్నారు. ప్రజల మధ్యలోకి రాకపోవడం కూడా జగన్ ఓట‌మికి కార‌ణంగా మారుతుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసేందుకు ఈసీ క‌స‌ర‌త్తు చేస్తున్న క్ర‌మంలో .. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌ల ఫ‌లితాల‌న్నీ వైసీపీ ఓడిపోతుంద‌ని తేల్చేశాయి. దీంతో తాడేప‌ల్లి క్యాంప్ తోపాటు వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది. తాజాగా.. రాజ‌కీయ‌ వ్యూహ‌క‌ర్త  ప్ర‌శాంత్ కిషోర్ సైతం వైసీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని తేల్చిచెప్పాడు. వెంట‌నే ప్ర‌శాంత్ కిషోర్‌ పై వైసీపీ సోష‌ల్ మీడియాలో ఆ పార్టీ మూక‌లు అస‌భ్య‌  ప‌ద‌జాలంతో దూష‌ణ‌లు మొద‌లు ప‌ట్టేశారు. ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీ ఓడిపోతుంద‌ని చెప్పిన కొద్ది సేప‌టికే మంత్రి అమ‌ర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి తిట్ల‌ దండ‌కం అందుకున్నారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఏమార్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తన గట్ ఫీలింగ్ అంటూ ఏవేవో మాట్లాడారు. తెలుగుదేశం, జన సేన కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఏపీ ప్ర‌జ‌లే అంటున్నారంటూ మంత్రి చెప్పుకొచ్చాడు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ చిత్తుగా ఓడిపోతారు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ లానే చంద్రబాబు కూడా ఆంధ్రా లో చెల్లని రూపాయి అంటూ మంత్రి మాట్లాడారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం పైకి గంభీరంగా క‌నిపిస్తున్నా,  ఓట‌మి ఖాయ‌మ‌ని ఆ పార్టీ శ్రేణులే చెప్పేస్తున్నా, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తన భుజాలను తానే చరుచుకుంటూ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా పీకే సైతం జ‌గ‌న్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని చెప్ప‌డంతో  వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న  స్పష్టంగా కనిపిస్తోంది.  

టిడిపి లో చేరిన నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా  కార్యక్రమం నెల్లూరు విజయవంతం అయ్యింది.  జగన్ ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే వారు క్రమంగా టిడిపిలో జాయిన్ అవుతున్నారు. వైసీపీ నేతలు సైతం చంద్రబాబును సమర్ధిస్తున్నారు. సమర్థించడమే కాదు వాళ్లు టిడిపిలో చేరుతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం బాగు కోసం కలిసి పనిచేద్దాం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి కుటుంబం చంద్రబాబును సత్కరించి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించింది. కాగా, వేమిరెడ్డి కుటుంబంతో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు స్పందిస్తూ... రాజకీయాల్లో అజాతశత్రువు వంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజాసేవకు మారు పేరు వేమిరెడ్డి... ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిపారు. ఆయన రాకతో నెల్లూరులో సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిపోతుందని అన్నారు. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు టీడీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు ఉద్ఘాటించారు.