కవిత అరెస్టుతో తెలంగాణకు ఏం సంబంధం!?

బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ముఖ్యంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత వారి బలహీనతలే కాదు, తప్పిదాలూ జనంలో బాగా ఎక్స్ పోజ్ అయిపోయాయి. అధికారంలో ఉండగా వెటకారం పాళ్లు ఎక్కువగా కలిపి వారు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వారికే బూమరాంగ్ అవుతూ జనంలో వారిని నవ్వుల పాలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రగతిలోని ప్రతి అడుగులోనూ తన ముద్ర వేసిన చంద్రబాబును జగన్ సర్కార్ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో సహజంగానే హైదరాబాద్ ప్రగతికి చంద్రబాబు వేసిన బాటల వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది ఆవేదనతో ఆగ్రహంతో బయటకు వచ్చి ఆందోళన బాట పట్టారు.  అయితే రాజకీయ కారణాలతో నో, లేక చంద్రబాబు అభివృద్ధి ముద్రలను చెరిపివేసి తన పేరు లిఖించుకోవాలన్న తాపత్రేయం లేదా దురాశతోనో నాడు ఆ ఆందోళనలను అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఎగతాళి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగితే హైదరాబాద్ లో ఆందోళనలేంటని చిరాకు పడ్డారు. కావాలంటే ఏపీ వెళ్లి ఆందోళనలు చేసుకోండి, ఇక్కడ మాత్రం అంగీకరించం అంటూ రుసరుసలాడారు.  సరే అప్పట్లో కేసీఆర్ అతికి ఆ ఎన్నికలలోనే ప్రజలు తమ ఆగ్రహశక్తి ఎంతటిదో చూపించారు. అది వేరే సంగతి. కానీ నాడు ఆయన అహంకారంతోనో, అతిశయంతోనే చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే గట్టిగా.. ఇంకా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయ్యే విధంగా తగిలాయి.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన సొంత సోదరి,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. కవితను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిపైనే ఇప్పుడు కాంగ్రెస్ సెటైర్లు గుప్పిస్తోంది. నెటిజన్లు ఓ రేంజ్ లో కేటీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి తెలంగాణతో సంబంధం ఏమిటి? ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా కావాలంటే ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేసుకోండి, తెలంగాణలో మాత్రం వద్దు అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబును ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఉటంకించారు.  ఇక నెటిజనులు కూడా ఓ రేంజ్ లో కేటీఆర్ ను తమ కామెంట్లతో ఓ ఆటాడుకుంటున్నారు. కవిత అరెస్టును నిరసిస్తు ఆయన ఈడీ ఆధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో క్లిప్పింగ్ ను వైరల్ చేస్తూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేసినప్పుడూ, ధర్నాలూ, ఆందోళనలను అణచివేసినప్పుడూ మీకు కోర్టులు గుర్తురాలేదా సార్!.. అంటూ ఫన్నీ ఎమోజీలతో అంతర్జాలాన్ని షేక్ చేసేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగిన ఐటీ ఉద్యోగులపై ప్రదర్శించిన జులుంను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 

బిజెపి ప్రచార గీతం విడుదల

లోక సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపే భారతీయ జనతా పార్టీ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ప్రచారగీతాన్ని విడుదల చేయకపోవడం గమనార్హం  లోక్ సభ ఎన్నికలకు మరికాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే బీజేపీ తన ప్రచారాస్త్రాన్ని బయటకు తీసింది. ఎన్నికల ప్రచార గీతాన్ని శనివారం ఉదయం విడుదల చేసింది. ప్రతిపక్ష నేతల విమర్శలనే ఆయుధంగా చేసుకుని సాగే ఈ పాటలో అన్ని రాష్ట్రాల ప్రజలను చూపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సింబాలిక్ గా చూపిస్తూ.. మేమంతా మోదీ కుటుంబమే అంటూ వారు పాడడం వీడియోలో కనిపిస్తుంది. ఇటీవల ఇండియా కూటమి బీహార్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. మోదీకి కుటుంబమే లేదు, ఇక కుటుంబ సమస్యలు ఏం తెలుస్తాయంటూ విమర్శించారు.  దీనిపై మోదీ ఘాటుగా స్పందిస్తూ.. దేశంలోని 150 కోట్ల మంది జనం తన కుటుంబమేనని చెప్పారు. ఈ విమర్శను అనుకూలంగా మార్చుకున్న బీజేపీ.. ‘మోదీ కా పరివార్’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు అంతా తమ సోషల్ మీడియా ఖాతాలలో మే మోదీ కా పరివార్ అంటూ డీపీలు పెట్టుకున్నారు. తాజాగా ఇదే విమర్శను బీజేపీ తన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు తామంతా మోదీ కుటుంబమేనని చెబుతున్నట్లు ప్రచార గీతాన్ని సిద్ధం చేసి విడుదల చేసింది.

పార్టీ పేరు మార్పుతోనే పతనం ప్రారంభమైందా?

కేసీఆర్ కుమార్తె అరెస్టు బీఆర్ఎస్ ను ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. కవిత అరెస్టునకు వ్యతిరేకంగా జనంలో ఎటువంటి స్పందనా కనిపించకపోవడం, ఆ పార్టీ నాయకత్వాన్నే కాదు, పార్టీ శ్రేణులను కూడా కలవరపరుస్తోంది. అన్నిటికీ మించి  తెలంగాణ సమాజం కవిత అరెస్టును ఒక సాధారణ విషయంగానే పరిగణించడం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇప్పటికే ఆమె అరెస్టు ఆలస్యమైందన్న భావన వ్యక్తం కావడంతో ఆమె అవినీతికి పాల్పడిందన్న విషయాన్ని జనం నమ్ముతున్నారా అన్న అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం, ధరణి.. ఇలా బీఆర్ఎస్ సర్కార్ పై వెల్లువెత్తిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు ఔట్ కమ్ ఆ పార్టీ అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా వచ్చినా జనం ఇలానే ఔను అవినీతి జరిగే ఉంటుందంటూ లైట్ గా తీసుకుంటారా? అన్న భయం బీఆర్ఎస్ నాయకత్వంలో బలంగా వ్యక్తం అవుతోంది.   ఈ పరిస్థితి అసలే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ అండ్ కోను మరింత ఒత్తిడికి లోను చేస్తుందనడంలో సందేహం లేదు.  అన్నిటికీ మించి క్యాడర్ లో పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని తగ్గిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీల్లోకి సర్దుకుంటున్న పరిస్థితుల్లో  పార్టీ క్యాడర్ లో పార్టీ అధినాయకత్వం ఇప్పటి వరకూ చేసిన తప్పిదాలంటూ పలు అంశాలపై విస్తృత చర్చ మెదలైంది.  ఇప్పటికే రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదని సర్వేలన్నీ ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. దీంతో పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువు అన్న పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నది. గతంలో పార్టీ అధినాయకత్వం దర్శనం కోసం ప్రగతి భవన్ గేట్ల ముందు పడిగాపులు కాసిన నాయకులు.. ఇప్పుడు అధినాయకత్వం ఒకసారి కలవండి అని బతిమలాడుతున్నా రావడానికి సుముఖత చూపడం లేదు. ఇటువంటి తరుణంలో కవిత అరెస్టు ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని మరింతగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల కోసం గెలుపు వ్యూహాలు రచించడం కంటే.. తన కుమార్తె కవితను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేయడమే కేసీఆర్ కు ప్రథమ ప్రాధాన్యతగా మారనుందనడంలో సందేహం లేదు.   దీంతో బీఆర్ఎస్ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటన్న చర్చ మొదలైంది. ఆ చర్చలో   కేసీఆర్ చేసిన తప్పులు ఇవీ అంటూ కొన్ని ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. వాటిలో మరీ ప్రధానంగా పార్టీ పేరు మార్పు అంశంపై పార్టీ క్యాడర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచీ పార్టీకి ప్రజలతో సంబంధం తెగిపోయిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తన సొంత రాజకీయ ఆకాంక్షల కోసం పార్టీ భవిష్యత్ ను ఫణంగా పెట్టారన్న ఆగ్రహం క్యాడర్ లో వ్యక్తం అవుతోంది . జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు కేసీఆర్ కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా ప్రజలలో తనకు గుర్తింపు తెచ్చిన, కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన అమ్మలాంటి పార్టీ పేరును మార్చేశారనీ, ఆ నిర్ణయమే కేసీఆర్ ను అధికారం నుంచి కింద పడేసిందని అంటున్నారు.  కేసీఆర్‌  పార్టీ పేరును మార్చడమే ఆయన పతనానికీ, పార్టీ ఇబ్బందులకూ కారణమైందని చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన తరువాత పార్టీ పరాజయం పాలు కావడం ఎంత మాత్రం యాధృచ్ఛికం కాదని జనం అంటున్నారు. తెరాస పేరు మారగానే అప్పటి వరకూ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న అభిమానం, పార్టీకీ, ప్రజలకు ఉన్న అనుబంధం తెగిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే అభిప్రాయంతో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి తరువాత ఒకరిగా కారు దిగిపోతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోగలుగుతుందా? మనుగడ సాగించ గలుగుతుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా  మార్చాలన్న డిమాండ్ పార్టీ క్యాడర్ నుంచి బలంగా వస్తోంది.   మొత్తం మీద కనుసైగతో  పార్టీని శాసించిన కేసీఆర్ ఇప్పుుడు క్యాడర్ కన్నెర్రకు గురి కావలసిన పరిస్థితికి వచ్చారంటే అది స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బిఆర్ఎస్ కు మరో షాక్ ... కెటీఆర్ పై కేసు నమోదు 

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు... ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి, ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని రౌస్ అరెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత వెంట కెటీఆర్ , హరీష్ రావు ఉన్నారు. కుటుంబసభ్యులంతా నిన్నటి నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ్ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై పోలీస్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసేందుకు తాము ఆమె నివాసానికి వెళ్లిన సమయంలో కేటీఆర్ దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు కంప్లైట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈడీ అధికారులు. మరోవైపు కవిత అరెస్ట్ చేసిన సమయంలో ఈడీ అధికారిణి భానుప్రియ మీనా తో పాటు మరికొందరు అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ విధులకు అడ్డుతగిలారనే ఈడీ అధికారులు కేటీఆర్ పై కేసు పెట్టమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. బీజేపీనే కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించిందని బీఆర్ఎస్ శ్రేణుల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. మరోవైపు కవిత అరెస్ట్ ని నిరసిస్తూ బీఆర్ఎస్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది

ఎన్నిక‌ల వేళ క‌విత అరెస్ట్.. లాభం ఎవరికి?

దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత అరెస్టు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శ‌నివారం (మార్చి 16) మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు ఈసీ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌నుంది.  తెలంగాణ‌లోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌రంలోకి ఇప్ప‌టికే దూకేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌నుసైతం ప్ర‌క‌టించాయి. తెలంగాణ స‌మాజం మొత్తం ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లిపోయింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్ లోని క‌విత నివాసంలో జాయింట్ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఎనిమిది మంది అధికారులు సోదాలు నిర్వ‌హించారు. సోదాల అనంత‌రం ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి త‌ర‌లించారు. అరెస్టుకు గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ 14పేజీల మెమో ఇచ్చారు. ఈడీ అధికారులు అరెస్టుచేసి తీసుకెళ్తున్న స‌మ‌యంలో  క‌విత బీఆర్ఎస్ శ్రేణుల‌కు అభివాదం చేస్తూ, ఉత్సాహంగా క‌నిపించారు. అయితే, ఎన్నిక‌ల వేళ క‌విత అరెస్టు ఏ పార్టీకి లాభం మేలుచేస్తుంద‌న్న ప్ర‌శ్న‌ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.  తెలంగాణ రాజ‌కీయాల్లో క‌విత అరెస్టు సంచ‌ల‌నంగా మారింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఆమె అరెస్టు అధికార‌ కాంగ్రెస్ పార్టీకి  ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో  2022 ఫిబ్ర‌వ‌రి 21న క‌విత‌కు నోటీసులు ఇవ్వ‌గా.. అదే నెల 26న వ్య‌క్తిగ‌తంగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని క‌విత‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ నోటీసులు ఇచ్చిన నాలుగు వారాల‌కు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ప‌లు ద‌ఫాలుగా క‌విత‌ను అధికారులు విచారించి కీల‌క స‌మాచారాన్ని సేక‌రించారు. అయితే, గ‌తంలోనే క‌వితను అరెస్టు చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తెలంగాణ‌లోని బీజేపీ నేత‌లు సైతం క‌విత అరెస్టు ఖాయ‌మ‌ని గ‌త ఎన్నిక‌ల ముందు విస్తృత ప్ర‌చారం చేశారు. కానీ, క‌విత అరెస్టు జ‌ర‌గ‌లేదు. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఎన్నిక‌ల‌కు ముందు క‌విత అరెస్టు ఖాయ‌మ‌ని బండి సంజ‌య్‌, కిష‌న్ రెడ్డి లాంటి నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. కానీ, క‌విత అరెస్టు కాక‌పోవ‌టంతో బీఆర్ ఎస్‌, బీజేపీ ఒక్క‌టేన‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లోకి బలంగా వెళ్లి  బీజేపీ నష్టపోయింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్క‌టే అని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో కాంగ్రెస్ పార్టీ విజ‌యవంతం అయింది. కాంగ్రెస్ నేత‌ల మాట‌లను ప్ర‌జ‌లు న‌మ్మ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఉంది. బీజేపీ నేత‌లు అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు క‌విత‌ అరెస్టు ఖాయ‌మ‌ని ప‌దేప‌దే చెప్పారు. కానీ, ఎన్నిక‌ల నాటికి క‌విత‌ అరెస్టు కాక‌పోవ‌టంతో బీఆర్ఎస్ వ్య‌తిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు సిఫ్ట్ అయింద‌ని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే క‌విత‌ను అరెస్టు చేసి ఉంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక  ఓటు బీజేపీవైపు మ‌ళ్లీ ఆ పార్టీ  లబ్ధి పొంది ఉండేద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు ఫ‌లితాల అనంత‌రం విశ్లేషించారు. అయితే  లోక్‌స‌భ ఎన్నికల ప్ర‌చారంలోనూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్క‌టేన‌ని కాంగ్రెస్ విస్తృత ప్ర‌చారం చేస్తోంది. ప్ర‌జ‌లు సైతం కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధిక పార్ల‌మెంట్ స్థానాల‌ను క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి.  మ‌రోవైపు బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూక‌డుతున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు క‌లిసి క‌విత అరెస్టును తెర‌పైకి తెచ్చాయ‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.  కవిత అరెస్టు కూడా బీజేపీ, బీఆర్ఎస్ లు ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో భాగమని విమర్శిస్తున్నారు.  కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత‌ జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముందు లిక్క‌ర్ స్కాంలో క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేస్తార‌ని, ఫ‌లితంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్ర‌జ‌ల్లో ల‌బ్ధిపొందాల‌ని చూస్తున్నాయ‌ని  ఆరోపించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఆయన ఆరోపించినట్లుగానే  ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌కు ముందురోజు క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసింది.  క‌విత అరెస్టు ద్వారా.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ల‌బ్ధిపొందాలని చూస్తోందని అంటున్నారు.  ఇన్నాళ్లు బీఆర్ఎస్, బీజేపీ ఒక‌టేన‌ని కాంగ్రెస్ ప్ర‌చారం చేసుకుంటూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌విత అరెస్టుతో.. గ‌తంలో కాంగ్రెస్‌వైపు వెళ్లిన‌ బీఆర్ఎస్ వ్య‌తిరేక ఓటు బ్యాంకు ప్ర‌స్తుతం బీజేపీవైపు మళ్లుతుందన్నది కమలనాథుల భావనగా చెబుతున్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ ను దెబ్బకొట్టి బీఆర్ఎస్ కు సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఇచ్చేందుకు కూడా కవిత అరెస్టు అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించిందనీ అంటున్నారు.   క‌విత అరెస్టు అయిన కొద్దిసేప‌టికే ఆ పార్టీనేత‌ హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో క‌విత అరెస్టుకు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని బీఆర్ఎస్ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల వేళ సానుభూతి పొంద‌డం ద్వారా  మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించాల‌ని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నది. ఇలా కాంగ్రెస్ ను దెబ్బకొట్టడం కోసం ఇరు పార్టీలూ అంటే బీజేపీ, బీఆర్ఎస్ లు కవిత అరెస్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. మరి  బీఆర్ ఎస్‌, బీజేపీ వ్యూహానికి కాంగ్రెస్ ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే.

 లిక్కర్ స్కాం కేసులో  కేజ్రీవాల్ కు ఊరట 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గొప్ప ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన ఎనిమిది సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో, ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కోర్టులో కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేల వ్యక్తిగత పూచీకత్తు, రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఆయన కోర్టు నుంచి నేరుగా నివాసానికి బయల్దేరారు. కోర్టు బెయిల్ ఇవ్వడం కేజ్రీవాల్ కు పెద్ద ఉపశమనంగా చెప్పుకోవచ్చు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు ఇది పెద్ద ఊరటగా భావించవచ్చు. అయితే, ఆ సమన్లను దాటవేస్తున్న కేజ్రీవాల్.. రాజకీయ ప్రేరేపిత కుట్ర అని ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. తమను వేధించేందుకే ఈ కేసులు పెట్టించిందని ఆరోపణలు చేస్తున్నారు. కాగా, ఢిల్లీ మధ్యం కేసులో ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ అరవింద్‌ కేజ్రీవాల్‌ పెట్టుకున్న అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేశ్‌ సియాల్ సూచించారు. అంతేకాదు, కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి కోర్టు.. ఢిల్లీ ముఖ్యమంత్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మాజీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా అరెస్టైన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ సి ఎం కెసీఆర్ కుమార్తె కవితను నిన్ననే ఈ కేసులో అరెస్ట్ చేశారు. 

కనీస సానుభూతి కూడా దక్కించుకోలేకపోయిన వర్మ

పిఠాపురం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆ తరువాత చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా పార్టీ శ్రేణులలోనే కాదు, సామాన్య ప్రజానీకంగా  కూడా కనీస సానుభూతికి నోచుకోక ఒంటరిగా మిగిలిపోయారు.  పిఠాపురం నియోజకవర్గం నుంచి  తాను పోటీ చేస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్  ఇలా ప్రకటించారో లేదో.. వర్మ అలా తెలుగుదేశం అధిష్ఠానంపై తిరుగుబాటు ప్రకటించారు. ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. పార్టీ జెండాలు దగ్ధం చేశారు. జనసేన అధినేతపైనా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై అనుచిత విమర్శలకు తెగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. దీంతో అప్పటి వరకూ వర్మ మీద ఉన్న అంతో ఇంతో సానుభూతి కానరాకుండా పోయింది.   టికెట్ దక్కలేదన్న ఆగ్రహంతో ఆయన, ఆయన అనుచరులు సృష్టించిన విధ్వంసంపై స్థానికులలోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే.. వర్మపై పాపం ఇంత కాలం పార్టీ కోసం కష్టపడినా పోత్తులో భాగంగా టికెట్ దక్కకుండా పోయిందే అన్న సానుభూతి వ్యక్తమైంది. అయితే వర్మ ఆయన అనుచరులు నియోజకవర్గంలో సృష్టించిన విధ్వంసం, పవన్ కల్యాణ్, చంద్రబాబులను ఉద్దేశించి ప్రయోగించిన అనుచిత భాషతో ఆ సానుభూతి ఒక్కసారిగా ఆవిరైపోయింది. దీంతో ఆయన అంత కాలం నియోజకవర్గంలో కష్టించి సంపాదించుకున్న సానుకూతల, సదభిప్రాయం ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ఇప్పుడు పార్టీ శ్రేణులే కాదు, ఆయన వెంట నడిచేందుకు అనుచరులు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఒక వేళ ఇండిపెండెంట్ గా పిఠాపురం నుంచి పోటీకి దిగినా ఆయన తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లుకానీ, కాపుల ఓట్లు కానీ పడే అవకాశం ఇసుమంతైనా లేవంటున్నారు. అయితే గియితే ఆయనకు వైసీపీ సానుభూతి పరుల ఓట్లు పడే అవకాశం మాత్రమే మిగిలిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని పోటీ చేయనున్నారన్న ప్రకటన వెలువడిన వెంటనే చంద్రబాబు వర్మకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా కోరారు. అయితే అందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇలా ఉండగా ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ తహతహలాడుతోంది. వర్మను పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానాలు పంపుతోంది. మొత్తం మీద వర్మ చేజేతులా నియోజకవర్గంలో తన పట్ల ప్రజలలో ఉన్న సదభిప్రాయాన్ని పోగొట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కవిత అరెస్టు.. మీడియాకు ముఖం చాటేసిన కేసీఆర్, కేటీఆర్

బీఆర్ఎస్ అస్థిత్వమే ప్రమాదంలో పడిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు.. కీలక సమయాల్లో మౌనం వహించడం పార్టీ క్యాడర్ లోనూ, నాయకుల్లోనూ కూడా వారిపై నమ్మకాన్నే కాదు, పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న విశ్వాసాన్నీ కూడా దెబ్బతీస్తున్నాయి. తాజాగా కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శుక్రవారం (మార్చి 15)అరెస్టు చేసి హస్తిన తరలించింది. ఆ సందర్భంగా కవిత నివాసం వద్ద ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగి హడావుడి చేసిన కేటీఆర్.. ఆ తరువాత మాత్రం మీడియాకు ముఖం చాటేశారు. కవిత నివాసంలో ఈడీ సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ఆరంభమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. అక్కడ నుంచి నేరుగా కవిత నివాసానికి వెళ్లారు. అక్కడ కేటీఆర్ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. తరువాత చిక్కుల్లో పడతారంటూ హెచ్చరించారు. అయితే అవి ఉడుత ఊపులుగానే ఉన్నాయి. ఈడీ అధికారులు వాటిని ఖాతరు చేయలేదు. వారు అనుకున్నది అనుకున్నట్లు చేసేశారు. కవితను అదుపులోనికి తీసుకుని హస్తినకు తరలించారు. ఆ సందర్భంగా పంచనామా రిపోర్టులో కేటీఆర్ తీరుపై కూడా వ్యాఖ్యలు చేశారు. సరే కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆమె నివాసం ముందు కొంత హడావుడి చేశాయి.  ఈ తతంగం అంతా అయిపోయిన తరవాత శనివారం(మార్చి 16) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని హరీష్ రావు మీడియా ఎదుట వెల్లడించారు. ఆ మీడియా సమావేశంలో కేటీఆర్ కనిపించలేదు. అంతే కాదు.. కవిత అరెస్టును ఖండిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారే తప్ప బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే ఆయన కూడా మీడియాకు ముఖం చాటేశారు. తన కుమార్తె అరెస్టును ఖండిస్తూ మీడియా ఎదుటకు రావడానికి ఆయన సుముఖత చూపలేదు. దీంతో కేసీఆర్, కేటీఆర్ కాడె వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. అన్నిటికీ మించి కవిత అరెస్టునకు నిరసనగా ఆమె నివాసం ఎదుట బీఆర్ఎస్ నేతల ఆందోళన వినా రాష్ట్రంలో మరెక్కడా నిరసనలు కనిపించలేదు. జనం ఈ అరెస్టుపై పెద్దగా స్పందించినట్లు కనిపించదు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులను ముందుండి నడిపించాల్సిన కేసీఆర్, కేటీఆర్ కనీసం మీడియాకు కూడా ముఖం చూపించకపోవడంపై పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేడే

18వ లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం(మార్చి 16) మధ్యాహ్నం విడుదల చేయనుంది. ఈ మేరకు ఈసీ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా షెడ్యూల్ విడుదల కానుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం ఈసీ స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే నిర్వహించాలని ఈసీ నిర్ణయిస్తే ఈ రోజు సార్వత్రిక ఎన్నికల తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకూ షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా జమ్మూ కాశ్మీర్  అసెంబ్లీ ఎన్నికలు వేరుగా నిర్వహించాలని నిర్ణయిస్తే మాత్రం సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన క్షణం నుంచీ దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ప్రస్తుత లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికలు మే లోగా పూర్తి కావాల్సి ఉంది. గత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  2019 మార్చి 10న విడుదలైన సంగతి తెలిసిందే.  అలాగే 2019 సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి. అయితే 2024 ఎన్నికలకు  కేంద్ర ఎన్నికల సంఘం గత ఎన్నికల కంటే పది రోజులు ఆలస్యంగా షెడ్యూల్ పూర్తి చేసింది. దీంతో ఈ సారి ఎన్నిదశలలో ఎన్నికలు నిర్వహిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.     

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన  తిరుమలలో   శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని  మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం,   వీఐపీ బ్రేక్‌ దర్శనం ఇలా పలు మార్గాల్లో వెంకన్నను దర్శనం చేసుకుంటారు. అయితే తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ బ్రేక్‌ వేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. దానిలో భాగంగా.. ప్రతి రోజు సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు ఉంటాయి. ముఖ్యంగా  రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వారి పరివారంతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. అందులోనూ.. ప్రజాప్రతినిధులు వారి అనుచరవర్గానికి, నియోజకవర్గాల ప్రజలకు సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతి రోజు ఉదయం సమయంలో ఉంటాయి. ప్రముఖుల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖలను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీటీడీ అధికారులు భక్తుల రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్‌లు కేటాయిస్తారు. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, కేంద్రమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు స్లాట్స్ జారీ చేస్తుంటారు. ఇటు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా వీఐపీ దర్శనాల కోటా ఉంటుంది. అయితే త్వరలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం (మార్చి 16) సాయంత్రం 3 గంటలకు వెలువడుతుంది.  ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి  వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది. ఆ మేరకు ప్రజాప్రతినిధులుకు ఇప్పటికే సమాచారం అందించింది.  సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే   బ్రేక్ దర్శనం కల్పిస్తారు

మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్రపై చాలా కాలంగా ఆరోపణలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐలు పలుమార్లు కవితను విచారించాయి. అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈడీ, సీబీఐలు తమ దూకుడును తగ్గించేశాయి. అయితే కవిత మాత్రం ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఆ కేసు శుక్రవారం (మార్చి 15న) స్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని బెంచ్  ఎదుట విచారణకు వచ్చింది. అనంతరం కేసు విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది.  ఆ పిటిషన్ విచారణ వాయిదా పడిన అనంతరం హైదరాబాద్ నందినగర్ లోని కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సందర్భంగా కవిత నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కవిత తరఫు న్యాయవాదులను కూడా అనుమతించని ఈడీ అధికారులు, కవిత సెల్ ఫోన్ లను సైతం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు కవితను విచారించిన ఈడీ అధికారులు అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు.  స రిగ్గా  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా కవిత నివాసంలో ఈడీ సోదాలు, అరెస్టు సమాచారంతో మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన కేసీఆర్ నివాసానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

100 రోజుల్లో బిఆర్ఎస్ మ‌డ‌త‌పెట్టేశాడు....రేవంత్ పాల‌న‌లో సంచ‌ల‌నాలు  

గతేడాది డిసెంబరు 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, పాలనా పగ్గాలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి… ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ద‌విని చేప‌ట్టిన రోజు నుంచి చారిత్ర‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే.   మాజీ సి.ఎం.ను కంటి మీద నిద్దుల లేకుండా చేశారు. అన్ని వైపుల నుంచి బీ ఆర్ ఎస్‌ను కుమ్మేస్తున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు ఓపిక ప‌ట్టి ఆ త‌రువాతే మాజీ సిఎంను జైలుకు పంపాల‌ని డిసైడ్ చేసుకున్నార‌ట‌. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి లైన్ క‌డుతున్నార‌ట‌. ఆ ఇద్ద‌రు త‌ప్పా మిగ‌తా వారంతా లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌రువాత గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటార‌నే ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది.  పాల‌న‌ప‌రంగా చూస్తే ఈ వంద రోజుల్లో సి.ఎం. రేవంత్ ఏం చేశారంటే.... 1. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,  2. ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు పథకాలను అమల్లోకి తెచ్చింది.  3. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌,  4. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ సౌకర్యాలకు శ్రీకారం చుట్టింది.  5. ఇందిరమ్మ ఇండ్లకు అంకురార్పణ చేసింది.  ఆరు గ్యారెంటీల పరిధిలో ఉన్న 13 అంశాలకు సంబంధించి ఐదింటిని పూర్తి చేశామని ప్రకటించింది. మిగతా 8 అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, నిధులు కేటాయించాల్సి ఉంది.  వంద రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది.  6. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెతచ్చింది.  ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పథకాల లబ్దిదారుల ఎంపిక చేపట్టింది.  అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే  7. 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం.  నిజానికి గతంలోనే వీరి ఎంపిక ప్రక్రియ పూర్తయింది.  నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు.  8. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్‌ విచారణను ప్రారంభించారు.  9. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించటంలో గట్టి ప్రయత్నమే చేశారు. అనేక నిర్ణయాలు శరవేగంగా తీసుకున్నారు.  10. అవుటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ.  11. గొర్రెల పంపిణీ పథకం,  12. చేప పిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశం.  13. ధరణి పోర్టల్‌ ఏజెన్సీపై విచారణ.  14. మిషన్‌ భగీరథ విలేజ్‌ లెవల్‌ ఇంట్రా పైపులైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ.  15. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ అధికారుల పాత్రపై విచారణ.  16. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో రూ. వందల కోట్లకుపైగా వ్యాట్‌ ఎగవేత. వంటి వాటిపై విచారణలు చేయిస్తున్నారు.  17. నంది అవార్డుల పేరును గ‌ద్ద‌ర్ అవార్డులుగా మార్చారు.  గ‌ద్ద‌ర్‌కు విగ్ర‌హం ఏర్పాటు చేసేందుకు అనుమ‌తి ఇచ్చారు.  18. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్లుసంచ‌ల‌న‌ ప్రకటన చేశారు.  తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయుల ఆనవాళ్ల వంటి రాచరిక పోకడలు ఉన్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.  అందుకే చిహ్నం మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  19. ‘టీఎస్’ ను ‘టీజీ’గా మారుస్తూ.. నిర్ణ‌యం తీసుకున్నారు.  దీనిపైనా రేవంత్ వివ‌ర‌ణ ఇచ్చారు.  “తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం.  వాహనాలు, బోర్డులపై అంతా టీజీ అని రాసుకున్నారు.  కొందరు యువకులు తమ గుండెలపై పచ్చబొట్టు కూడా వేసుకున్నారు.  కేంద్రం సైతం తమ నోటిఫికేషన్ లో టీజీ అనే పేర్కొంది.  అందుకే టీజీగా మార్చాలని నిర్ణయించాం” అని రేవంత్ వెల్ల‌డించారు. 20. రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ‌’ గీతం ఎంపిక చేస్తున్న‌ట్టు చెప్పారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ స్ఫూర్తి ఇచ్చిందన్నారు.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ పాట రాష్ట్ర గీతం అవుతుందని అంతా భావించినా..  ఆ పాటను నిషేధించినంత పని చేశారని బీఆర్ ఎస్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.  ఆ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించామ‌న్నారు. 21. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంలో కూడా మార్పులు చేర్పులు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపైనా రేవంత్ వివ‌ర‌ణ ఇచ్చారు.  “తెలంగాణ తల్లి అంటే మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి.  తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు.  తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి.  అందుకే.. ఆ విగ్ర‌హంలో కూడా మార్పులు చేస్తున్నాం” అని సీఎం రేవంత్ చెబుతున్నారు. 12కు పైగా ఎంపి సీట్లు గెలిచి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం వ‌ద్ద మార్కులు కొట్టేసి తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నేత‌గా దూసుకుపోతున్నారు సి.ఎం. రేవంత్‌రెడ్డి

ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సరే.. తెలంగాణ మాటేమిటి?

రాష్ట్ర విభజన తరువాత నుంచీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి?  అన్న ప్రశ్న ఉత్పన్నమౌతూనే వస్తోంది. రాష్ట్ర విభజన కు ముందు ఒకసారి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తరువాత అంటే రాష్ట్ర విభజన తరువాత 2018 అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని పోటీలో నిలిచింది. రెండు సార్లూ నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. అంత మాత్రాన తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైపోయిందని భావించొచ్చా అంటే.. ఆ రాష్ట్రంలో క్యాడర్ మాత్రం లేదు గాక లేదని ముక్తకంఠంతో చెబుతోంది. మరి లోపం ఏమిటి? ఎక్కడ ఉంది?  అన్న ప్రశ్నకు మళ్లీ తెలుగుదేశం క్యాడరే.. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా అలా ఉండటమే కాదు, మరింత బలపడింది కూడా అని చెబుతోంది. అయితే రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించి, క్యాడర్ లో సమరోత్సాహాన్ని రగిల్చి ఎన్నికల కదనరంగంలోకి దూకేలా చేయడంలో మాత్రం పార్టీ అగ్రనాయకత్వం విఫలమైందంటోంది. తెలంగాణలో  తెలుగుదేశం పార్టీకి ప్రాణం పెట్టి బతికించుకునే కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేరన్నది నిష్ఠుర సత్యం.  ఆ విషయం ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సందేహాలకు అతీతంగా రుజువైంది.  తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగుదేశం నిలవకపోయినా, అన్ని పార్టీలూ తెలంగాణ జెండాను మోయడానికి తహతహలాడాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం క్యాడర్ చాలా వరకూ గత ఎన్నికలలో కాంగ్రెస్ జెండా మోసి ఆ పార్టీ విజయంలో అత్యంత కీలక భూమిక పోషించింది. ఈ విషయాన్ని అందరూ అంగీకరించి తీరాల్సిందే. సరే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏమిటి? ఇక్కడి క్యాడర్ కు పార్టీ నాయకత్వం చేసే దిశా నిర్దేశం ఏమిటి? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొకరడం లేదు. అయితే తెలంగాణలోని తెలుగుదేశం క్యాడర్ మాత్రం.. ఏపీలో బీజేపీతో కలిసి నడుస్తున్న తెలుగుదేశం ఇక్కడ మాత్రం ఎందుకు దూరంగా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఆ పొత్తు పొడుపును తెలంగాణలో కూడా కొనసాగించి, ఇక్కడా తెలుగుదేశం ఒకటి రెండు స్థానాల్లో పోటీకి నిలబడాలని డిమాండ్ చేస్తున్నారు. అలా పార్టీ నిలబెట్టే అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రతిజ్ణ చేస్తున్నారు.    

దానం నాగేందర్ చూపు కాంగ్రెస్ వైపు 

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కంటే బిఆర్ఎస్ ఎక్కువస్థానాల్లో గెలుపొందింది. మూడునెలలు పూర్తికాకమునుపు ఈ నగరం నుంచి బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ బాట  పడుతున్నారు. కెటీఆర్ ప్రధాన అనుచరుడైన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో పార్టీలో చేరి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ చక్రం తిప్పారు. అధికారం మారడంతో ఆయన కూడా మారిపోయారు.రామ్మోహన్ మేయర్ గా ఉన్నప్పుడు రాజధానిలో విలువైన భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కబ్జాల భాగోతం బయటపడకుండా కాంగ్రెస్ లో గప్ చుప్ గా చేరిపోయినట్లు తెలుస్తోంది.  తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అధికారికంగా శనివారం చేరవచ్చని సమాచారం. నాగేందర్ పై కూడా కబ్జా ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ హాయంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్ బిఆర్ఎస్ అధికారంలో రాగానే కాంగ్రెస్ కు రాజీనామా చేసి కారు పార్టీలో చేరారు. ఇప్పుడు కారుపార్టీకి రాజీనామా చేసి మళ్లీ హస్తం పార్టీలో చేరే అవకాశం ఉంది. తన నియోజకవర్గంలో ఇస్కాన్ టెంపుల్ ను నాగేందర్ కబ్జా చేసినట్లు కెసీఆర్ ప్రభుత్వానికి ఆధారాలు లభించడంతో అప్పట్లో నాగేందర్ బిఆర్ఎస్ లో చేరారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుంది. దీంతో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. గత ఎన్నికలలో తన రాజకీయ గురువైన పిజెఆర్ తనయ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ  పోటీ చేసినప్పటికీ బిఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయినప్పటికీ దానం మనసు కాంగ్రెస్ వైపే ఉంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలని అనుకున్నారేమో తిరిగి  ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నాగేందర్ పై కూడా భూ కబ్జా ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి బిఆర్ ఎస్ నేతలు, అధికారులపై సీరియస్ గానే ఉన్నారు . కాబట్టి దానం అడుగులు కాంగ్రెస్ వైపే పడుతున్నాయి. మరో బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డికి తొడగట్టి సవాల్ చేశారు.  అరేయ్ రేవంత్ దమ్మనదారా అంటూ సవాల్ చేశాడు . నిన్న కర్ణాటక డిప్యూటి సీఎం డి. శివకుమార్ ను కలిసారు.ఒకటి రెండు రోజుల్లో అతను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని రానీయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి విద్యాసంస్థలు ఆక్రమంగా భూ కబ్జాలు చేసి చర్యలకు రేవంత్ సర్కారు ఉపక్రమించింది

కవిత నివాసంలో ఈడీ సోదాలు.. ఏం జరుగుతోంది?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కులు మరింత చిక్కబడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. నందినగర్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు శుక్రవారం (మార్చి 15)న సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. తొలుత కవిత నివాసంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు అంతా భావించారు. అయితే ఆ తరువాత ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. అలాగే కేవలం మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మాత్రమే కాకుండా కవిత భర్త వ్యాపార లావీదావీలపై కూడా కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం నాలుగు బృందాలు ఈ సోదాలలో పాల్గొన్నాయని చెబుతున్నారు.  ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీం కోర్టు ముందకు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ విచారణ ఇలా వాయిదా పడిందో లేదా అలా కవిత నివాసంపై ఈడీ సోదాలు మొదలవ్వడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది.  కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో     జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం (మార్చి 15)న విచారణకు వచ్చింది.  వాదనల అనంతరం ఈ నెల 19కు వాయిదా పడింది. ఇటువంటి తరుణంలో  ఈడీ   ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి కవిత నివాసంలో తనిఖీలు చేపట్టడం, అదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు ఈ సోదాలు జరగడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

ప్రణీత్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

మాజీ డిఎస్పీ ప్రణీత్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు వెల్లడి చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్న సమాచారంతో ప్రణీత్ కుమార్ సడెన్ గా తన డిసీషన్ మార్చుకున్నాడు. తను ఉప యోగించిన హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసే పనిలో పడ్డాడని తెలంగాణ ప్రభుత్వం     గుర్తించింది. మొత్తం మూడు రకాల నేరాలకు  ప్రణీత్ కుమార్ పాల్నడినట్లు   తెలుస్తోంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ రెండు సాక్ష్యాలను చెరిపి వేయడం, మూడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం వంటి నేరాలకు ప్రణీత్ కుమార్ పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. 17 సిస్టమ్ ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నేరాలకు పాల్పడ్డాడు.  ఈ కేసును    జూబ్లిహిల్స్ ఎసిపి వెంకటగిరి దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది.                         ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతి రోజున అంటే డిసెంబర్ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్‌డిస్క్‌లో ఉన్న డేటా మొత్తాన్ని చెరిపేసి వాటిని ధ్వంసం చేశాడు. ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటాను ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రాగానే చెరిపేశాడు. ధ్వంసం చేసిన పాత హార్డ్‌డిస్క్‌ల స్థానంలో కొత్త వాటిని అమర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అరెస్ట్ సందర్భంగా ప్రణీత్‌రావు నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ట్యాంపరింగ్ వంటి నేరాలకు పాల్పడినట్టు తేలింది. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడని, అందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్‌ కూడా ప్రణీత్‌కు కేటాయించారని తెలిసింది. ప్రముఖ కాల్స్‌ను రహస్యంగా రికార్డు చేసి దానిని తన పర్సనల్ పెన్ డ్రైవ్‌లోకి కాపీచేసుకునే వాడని తేలింది. ఆయనతోపాటు మరికొందరు కూడా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తేలింది. ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ వివరాలు తమకు చిక్కినట్టు పేర్కొన్న ఒక టీవీ చానెల్  మరెన్నో సంచలన విషయాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్‌ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, ఆయన ఇచ్చిన వంద నంబర్లపై ప్రణీత్ కన్నేశారని పేర్కొంది. రేవంత్‌రెడ్డి ఎవరెవరిని కలుస్తున్నారు? అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపింది. రేవంత్‌రెడ్డిని ఎవరు? ఎక్కడ కలుస్తున్నారు? అన్న సమాచారాన్ని ప్రణీత్‌రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది. రేవంత్‌రెడ్డి అనుచరులతోపాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రేవంత్‌రెడ్డి సోదరుల ఫోన్ నంబర్లను కూడా ప్రణీత్ ట్యాప్ చేశారు. అక్కడితో ఆగకుండా కొందరు మీడియా పెద్దల ఫోన్లను సైతం ఆయన ట్యాప్ చేసిన విషయం చాటింగ్ ద్వారా బయటపడిందని, దీని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారని ఒ  కథనంలో పేర్కొంది.

మార్చి 16 నుంచి అమలులోకి ఎన్నికల కోడ్.. షెడ్యూల్ ప్రకటించనున్నఈసీ

2024  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం (మార్చి 16) విడుదల కానున్నది. కేంద్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల భర్తీ పూర్తి కావడంతో ఇక ఎన్నికల నిర్వహణపై సీఈసీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిసింది. కాగా విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిథి ఎక్స్ వేదికగా తెలిపారు. శనివరాం (మార్చి 15) సాయంత్రం 3 గంటలకు హస్తినలోని జ్ణాన్ భవన్ లో   మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నిల ప్రకటనతోనే  ఎన్నికల నియమావళి అమలులోనికి వస్తుందని వివరించారు. కోడ్ అమలులోకి రావడం అంటే కేంద్రంలో , రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎటువటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకునే అవకాశం ఉండదు.  ఇక విషయానికి వస్తే ప్రస్తుత లోక్ సభ పదవీ కాలం జూన్ 16తో ముగుస్తుంది.ఆ గడువుకు ముందే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తు 2019 ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సారి ఆరు రోజుల ఆలస్యంగా ప్రకటించనుంది.  

రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ ప్రశంసల వర్షం

బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారౌతోంది. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలన భేషుగ్గా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం (మార్చి 15) మీడియాతో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి, తన కుమారుడు అమిత్ కు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతల నుంచి ఆహ్వానం వచ్చిందని చెప్పారు. అంత వరకూ వాస్తవమే కానీ.. ఆ దిశగా ఎటువంటి చర్చలూ జరగలేదని ముక్తాయించారు. అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి అమిత్ సుముఖంగా లేరని గుత్తా చెప్పారు. ఇప్పుడు కాదు రెండు నెలల ముందు అమిత్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇక తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని చెప్పిన ఆయన రాజకీయ పార్టీలకు సంబంధం లేని రాజ్యాంగ పదవిలో ఉన్న తనకు ఏ పార్టీ కండువా కప్పుకోవలసిన అవసరం లేదని చెప్పారు.  తెలంగాణ ప్రజలు రేవంత్ ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంటున్నారనీ, ఆయన పాలన బేషుగ్గా ఉందనీ కితాబిచ్చారు. రేవంత్ తనకు బంధువని చెప్పుకున్నారు. అయినా అసెంబ్లీ సమావేశాల్లో తప్ప మరెక్కడా, ఎన్నడూ రేవంత్ తో భేటీ అయిన సందర్భం లేదని స్పష్టం చేశారు.  మొత్తం మీద సుఖేందర్ రెడ్డి మాటలను బట్టి చూస్తే ఆయన బీఆర్ఎస్ కు దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ కు ఇంత కాలం కీలకంగా ఉన్న నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ బుజ్జగించినా ఎవరూ ఆగడం లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. తాజాగా దానం నాగేందర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ అయ్యారు. ఆయన కూడా నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.  ఒకప్పుడు మాటే శాసనంగా, కనుసైగతో పార్టీని నియంత్రించిన కేసీఆర్ ఇప్పుడు కాళ్లా వేళ్లాపడి బతిమలాడుతున్నా బీఆర్ఎస్ లో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని పరిశీలకులు అంటున్నారు. ఆరూరి ఉదంతాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.