కేసీఆర్ రంగంలోకి.. లోక్ సభ ఎన్నకలలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత డీలా పడిన బీఆర్ఎస్ క్యాడర్ లో ఉత్సాహం నింపి లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా చైతన్య పరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగారు. తన ఫామ్ హౌస్ లో  కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు.  ఈ భేటీలో వచ్చే ఆరు వారాలూ అత్యంత కీలకమని, నేతలు ప్రజలలోనే ఉండేలా వరుస కార్యక్రమాలు నిర్వహించాలనీ కేసీఆర్ కేటీఆర్, హరీష్ లను ఆదేశించారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నేతలు పలువురు ఆ పార్టీలో చేరడం, మరి కొందరు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లడం తదితర పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తున్నది. నేతలు, క్యాడర్ పక్క చూపులు చూడకుండా వరుస కార్యక్రమాలతో వారిని బిజీగా ఉంచాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలలో ఇప్పటి వరకూ అమలు చేయని వాటిపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ, అలాగే  నిరుద్యోగ భృతి, రూ. రెండు లక్షల రుణమాఫీ, జాబ్ నోటిఫికేషన్ తదితర అంశాలపై రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించాలని కేసీఆర్ ఆదేశించారని చెబుతున్నారు. జిల్లాల వారీగా కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు, క్యడర్ ను నేతలను లోక్ సభ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొనేలా వరుస కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.  పార్టీలోని సీనియర్, కీలక నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.   పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు జగదీశ్ రెడ్డి, మధుసూధనాచారి, కడియం శ్రీహరి, పల్లారాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, నామా నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ కవిత, కె.కేశవరావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆ తరువాత కేసీఆర్ తన కుమార్తె కల్వకుట్ల కవితతో భఏటీ అయ్యారు. ఆమెను లిక్కర్ స్కాంలో  నిందితురాలిగా పేర్కొంటూ జారీ చేసిన నోటీసులపై చర్చించారు. కవిత పిటిషన్ పై బుధవారం (ఫిబ్రవరి 28)న తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కవిత, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  

టిడిపి నేత సోమిరెడ్డిపై గునపంతో దాడియత్నం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డిపై వైసీపీ కార్యకర్త ఒకరు దాడికి ప్రయత్నించాడు. గునపంతో వచ్చి పొడిచేస్తానంటూ వీరంగం వేశాడు. తనను అడ్డుకున్న టీడీపీ నాయకులను అసభ్యపదజాలంతో తిట్టాడు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి, స్థానిక నాయకుడి ఇంటిపై దాడి చేశాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టుపల్లిలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. దీనిపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ’ ప్రచారంలో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం కట్టుపల్లికి వెళ్లారు. సోమిరెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ నేతలు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వైసీపీ కార్యకర్తలు బల్లి వెంకటయ్య, సాయి, అంకయ్య, అయ్యప్ప వాటిని చించేశారు. దీంతో టీడీపీ నేతలు సోమవారం మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని కూడా చింపేసి, కర్రలను చెరువులో పడేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని దుర్భాషలాడారు. ఇంతలో సోమిరెడ్డి గ్రామానికి రావడంతో టపాసులు కాలుస్తూ స్వాగతించిన టీడీపీ స్థానిక నాయకులతో వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు. స్థానిక నేతలు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంకటయ్య.. కాసేపటికి గునపంతో వచ్చి సోమిరెడ్డిపై దాడికి యత్నించాడు. గొడవ పెరుగుతుండడంతో సోమిరెడ్డితో పాటు ఇతర నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా స్థానిక టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి వెంకటయ్య బృందం దాడి చేసింది. ఇంటి కిటికీలు పగలకొట్టి, కారును ధ్వంసం చేశారు. చుట్టుపక్కల మహిళలు అడ్డుకోవడంతో వెంకటయ్య మిగతా వారితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపైనా వెంకటయ్య బృందం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో వైసీపీ ఫౌల్ గేమ్.. క్రికెటర్ హనుమ విహారి ఔట్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల దాష్టికానికి నిర్వీర్యం కాని వ్యవస్థ లేదు. వేధింపులకు గురి కాని రంగం లేదు. రాష్ట్రంలో ఉండాలంటే వైసీపీ నేతల పెత్తనాన్ని అంగీకరించి తల వంచుకు బతకాల్సిందే అన్నట్లుగా ఆ పార్టీ నాయకుల తీరు ఉంది.  పరిశ్రమలను తరిమేశారు. ఉద్యోగాలివ్వకుండా యువతను వలస బాట పట్టించేశారు. రైతులను వ్యవసాయానికి దూరం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే  రాష్ట్రంలో వైసీపీ దాష్టికానికి గురి కాని రంగం అంటూ ఉండదు. తాజాగా క్రీడా రంగంపై కూడా వైసీపీ తన పంజా విసిరింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ నాయకగణం.. తాజాగా దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన టాలెంటెడ్ క్రికెటర్ హనుమ విహారిని ఏపీ నుంచి తరిమేసింది.   అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతోంది. ఇంటర్నేషనల్ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్పెన్సీ నుంచి అవమానకరంగా తొలగించారు. ఆయనే రాజీనామా చేశారంటూ ప్రచారం చేశారు. వాస్తవమేమిటన్నది హనుమ విహారి స్వయంగా తన సామాజిక మాధ్యమం ఖాతాలో పోస్టు చేసే వరకూ వెలుగులోకి రాలేదు. తాజాగా హనుమ విహారి తాను ఇక ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడేది లేదంటూ చేసిన పోస్టుతో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ను వైసీపీ నేతల ఆటలు ఎలా సాగుతున్నాయో బయటపడింది.   ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టులో   17వ ప్లేయర్ ను కెప్టెన్ హోదాలో మందలించిన హనుమ విహారిని  అత్యంత అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించేశారు. ఎందుకంటే ఆ 17వ ప్లేయర్ వైసీపీకి చెందిన ఓ చిన్న నాయకుడి పుత్రరత్నం.  ఆ వైసీపీ చోటా నేత తిరుమతి కార్పొరేటర్ నరసింహ. తన కుమారుడిని మందలిస్తాడా అన్న ఆగ్రహంతో సదరు కార్పొరేటర్ తన పలుకుబడిని ఉపయోగించి హనుమ విహారిని అత్యంత అవమానకరరీతిలో కెప్టెన్సీ పదవి నుంచి తొలగించేశారు. అంత పలుకుబడి ఓ కార్పొరేటర్ కు ఎక్కడిదంటే.. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమనకు సన్నిహితుడు. తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా భూమన తనయుడు రంగంలో ఉన్నారు. ఇది చాలదూ  వైసీపీలో ఓ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి మాట చెల్లుబాటు కావడానికి. భూమన ద్వారా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీ నుంచి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ను రాష్ట్రం నుంచి తరిమేశారు. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తొలగించడంతో మనస్తాపానికి గురైన హనుమ విహారి ఇక ఏపీకి ఆడేది లేదని ప్రకటించారు.   ఈ రంజీ సీజన్ లో ఏపీ జట్టు  బెంగాల్ తో  తొలి మ్యాచ్ సందర్బంగా  కెప్టెన్ హనుమ విహారి తన జట్టులో 17వ ప్లేయర్ అయిన కేఎన్ పృధ్వీరాజ్ ప్రవర్తన సరిగా లేదంటూ మందలించారు.  ఇది జరిగిన వెంటనే.. అంటే ఆ మ్యాచ్ పూర్తి కాగానే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారిని కెప్టెన్ గా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా హనుమ విహారే కెప్టెన్సీకి రాజీనామా చేశారంటూ ఏకపక్షంగా ప్రకటన కూడా విడుదల చేసేసింది.  అయితే క్రీడా స్ఫూర్తి తెలిసిన క్రీడాకారుడిగా రంజీ సీజన్ మ్యాచ్ లు అయిపోయే వరకూ ఆగిన హనుమ విహారి ఆ తరువాత జరిగిన విషయాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు.   తెగించేసిన వారిని ఎవరు మాత్రం ఏం చేయగలరు. అసలు క్రీడా రంగంపై వైసీపీ పెత్తనాన్ని ప్రశ్నించాలి. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి అల్లుడు. మిగిలిన సభ్యులంతా ఆయన కనుసన్ననలలోనే మెలుగుతారు. పెత్తనం అంతా మనదేనన్న బరితెగింపుతోనే  వైసీపీ ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడి కెరీర్ తో ఆటాడేసుకుంది. ఇంతకీ ఆ కార్పొరేటర్ పుత్ర రత్నం కేఎన్ పృధ్వీరాజ్ ఏకంగా ఏపీ రంజీ జట్టులోకి ఎలా వచ్చేశాడన్న అనుమానం ఎవరికీ రావడం లేదు. ఎందుకంటే అడ్డగొలు సిఫార్సులతో జట్టులో స్థానం సంపాదించిన అతడు ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినందుకు కెప్టెన్ మందలించారు. ఆ మందలింపే హనుమ విహారి ఏపీ జట్టుకు ఆడేదే లేదన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఇంత జరిగిన తరువాత కూడా పృధ్వీ హనుమ విహారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఏం పీకలేవు అంటూ అనుచిత భాషను ఉపయోగిస్తూ పోస్టు పెట్టి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు.   దీంతో హనుమ విహారి ఓపెన్ అయ్యారు. జట్టు  మొత్తం తననే కెప్టెన్ గా కొనసాగించాలన్న డిమాండ్ చేసిందనీ, వారంతా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు లేఖ కూడా రాశారని పేర్కొంటూ ఆ లేఖను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే కాదు.. ఆ తరువాత   అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారుల నుంచి ఆంధ్ర జట్టు సపోర్ట్ స్టాఫ్‌కు ఫోన్స్ వచ్చాయని, వారందర్నీ తనకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఒత్తిడి చేస్తున్నారని మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడు హనుమ విహారి వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హనుమ విహారికి మద్దతుగా టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్  ఈ విషయమై తన యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడమని ఆహ్వానించాడు. అందుకు హనుమ విహారి అంగీకరించాడు. టీమ్ ఇండియా క్రికెటర్లందరూ కూడా హనుమ విహారికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ వివరణ కోరుతుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఇక వైసీపీ దాష్టికానికి అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తొలగింపునకు గురైన హనుమ విహారికి మద్దతుగా చంద్రబాబు కూడా స్పందించారు.  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ లో రాజకీయ కుట్రలకు బాధితుడైన  టీమిండియా క్రికెటర్ హనుమ విహారికి  అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.  మొత్తం మీద హనుమ విహారి విషయంలో వైసీపీ ఆడిన వికృత క్రీడకు వ్యతిరేకంగా క్రీడా రంగం నుంచి, రాజకీయ రంగం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బీసీసీఐ రంగంలోకి దిగితే   ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ లో వైసీపీ పెత్తనానికి తెర పడటం ఖాయమని అంటున్నారు.   ఇంతకీ హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు స్కోర్ చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్ట్ లో హనుమ విహారి ఆడిన తీరు అద్భుతం. ఆ మ్యాచ్ లో హను మ విహారి ఆటతీరును ఎప్పటికీ మరచిపోలేం. గత ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా హనుమ విహారి ఐదు సార్లు జట్టును రంజీల్లో నాకౌట్ దశకు తీసుకువచ్చారు. అటువంటి గొప్ప క్రికెటర్ ను కేవలం ఒక కార్పొరేటర్ కుమారుడు చెప్పాడని అత్యంత అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించేసిందీ జగన్ రెడ్డి సర్కార్. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. క్రీడాకారులతో అత్యంత అవమానకర రీతిలో వ్యవహరిస్తూ.. రాష్ట్రాంలో ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలను నిర్వహించి ఉపయోగమేమిటి జగన్ అని ప్రశ్రించారు.  ఆంధ్రా క్రికెట్ ను, జాతీయ క్రికెట్ ను మీరు అందించిన సేవలకు క్రికెట్ ను ప్రేమించే వారంతా హనుమ విహారికి అండగా ఉంటారని పవన్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. హనుమ విహారి మళ్లీ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడతారనీ, రాష్ట్రంలో క్రీడాకారులను గౌరవించడం తోలిసిన ప్రభుత్వం రాబోతోందనీ పేర్కొన్నారు. 

వోటేయడానికి ఆధార్ కంపల్సరీ కాదు 

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికల్లో ప్రజలు  తమ ఓటు హక్కును సద్వినియోగం కంపల్సరీ. అయితే   ఆధార్ కార్డు లేకుంటే ఓటు హక్కు లేదనే  అపోహ ను కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డుకట్టవేసింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్‌కార్డు ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వివరణ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని, ఆధార్ లేకున్నా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఓటరు కార్డు కానీ, లేదంటే, చెల్లుబాటు అయ్యే మరేదన్నా గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో వేలాది ఆధార్‌కార్డులను పనికిరాకుండా చేస్తున్నారంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ప్రకటన చేసింది. ఆధార్ కార్డు లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని టీఎంసీ బృందానికి ఈసీ తెలిపింది.

ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ కష్టమే!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి ఘోర ప‌రాభవం త‌ప్ప‌ద‌ని ప‌లు స‌ర్వేలు తేట‌తెల్లం చేస్తున్నాయి. ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను గుర్తించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా మిగిలిన అన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్‌ల‌ను మార్చారు. వీరిలో కొంద‌రికి వేరే నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌కాశం క‌ల్పించ‌గా.. మ‌రికొంద‌రిని ప‌క్క‌న పెట్టారు. ఈ జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే టీడీపీ విజ‌యం సాధించింది. ఈసారి అత్య‌ధిక స్థానాల్లో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేల ఫ‌లితాలు ప్ర‌కాశం ఉమ్మ‌డి జిల్లాలో తెలుగుదేశం, జ‌న‌సేన హ‌వా  ఖాయమని పేర్కొన్నాయి. ఈ జిల్లాలో తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు.  ఇక నియోజకవర్గాల వారీగా పరిస్ధితులను పరిశీలిస్తే.. గిద్ద‌లూరు..  గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక పెల్లుబుకుతుండ‌టంతో వైసీపీ అధిష్టానం అన్నారాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి మార్చేసింది.  అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే  కందూరు నాగార్జున రెడ్డిని గిద్ద‌లూరుకు పంపింది. కందూరుకు రాంబాబు వ‌ర్గీయులు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త కందూరు ఓట‌మికి కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విడుదల చేసిన తొలి జాబితాలో  ఈ నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థిని కేటాయించ‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నుంచి ఎవ‌రు బ‌రిలో నిలిచినా విజ‌యం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతుంది.  మార్కాపురం..  మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గానికి గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే  అన్నా రాంబాబును వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది..  గత ఎన్నికలలో గిద్దలూరు   రాంబాబు విజ‌యం సాధించారు. వైసీపీ అధిష్టానం నిర్వ‌హించిన స‌ర్వేల్లో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డికి మ‌రోసారి  అవ‌కాశం ఇస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని తేలడంతో కందూరు నాగార్జున‌ను గిద్ద‌లూరు పంపించి.. రాంబాబును మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధిష్టానం బ‌రిలో నిలిపింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఉంది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీలో దిగేది ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే    అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలో నిలిపిన విజ‌యం ఖాయ‌మ‌న్న వాద‌న స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఎర్ర‌గొండ‌పాలెం..  ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా ఆదిమూల‌పు సురేశ్ విజ‌యం సాధించారు. జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రిగానూ ప‌నిచేశారు. అయితే, ఆయనపై నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఉందంటూ ఆదిమూల‌పు సురేష్ ను త‌ప్పించి తాటిప‌త్రి చంద్ర‌శేఖ‌ర్ ను  వైసీపీ అదిష్టానం ఇక్కడ బరిలోకి దింపింది. ఈ ప‌రిణామాల‌తో సురేశ్ వ‌ర్గం  సంతృప్తితో ఉంది. బ‌హిరంగంగా బయటపడకపోయినా  చంద్ర‌శేఖ‌ర్ కు స‌హ‌క‌రించేది లేద‌ని సురేశ్ వ‌ర్గం అంతర్గత సంభాషణల్లో స్పష్టంగా చెబుతోందని  స‌మాచారం. దీనికితోడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వైసీపీ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా గూడూరి ఎల‌క్ష‌న్ బాబు మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకుతోపాటు, టీడీపీ, జ‌న‌సేన  శ్రేణుల అండతో  ఎలక్షన్ బాబు విజయం నల్లేరు మీద బండినడకేనని అంటున్నారు.   క‌నిగిరి.. క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా బుర్రా మ‌ధుసుద‌న్ యాద‌వ్ విజ‌యం సాధించారు. ఈసారి ఆయన్ని జగన్ పక్కన పెట్టేశారు.  యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రో నేత‌ డి. నారాయ‌ణ యాద‌వ్ ను వైసీపీ అధిష్టానం బరిలోకి దింపింది. అయితే, నారాయ‌ణ యాద‌వ్ ను నియ‌మించ‌డంపై మ‌ధుసూద‌న్ యాద‌వ్ వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో  ప్రజా వ్యతిరేకత వ్య‌తిరేక‌త నారాయ‌ణ యాద‌వ్  విజయానికి పెద్ద అవరోధం అని పరిశీలకులు చెబుతున్నారు.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి బ‌రిలోకి దిగుతున్నారు. ఆయ‌న విజ‌యం సునాయాసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒంగోలు..  ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి విజ‌యం సాధించారు. మ‌రోసారి వైసీపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే బ‌రిలోకి దిగ‌నున్నారు. బాలినేనిపై భూక‌బ్జాల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి కొంత వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం  కూట‌మి అభ్య‌ర్థిగా మ‌రోసారి దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ రావు బ‌రిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాలోనే దామచర్ల పేరు ప్రకటించారు. దీనిని బట్టే ఒంగోలులో దామచర్ల విజయంపై తెలుగుదేశం ఎంత ధీమాతో ఉందో అర్ధమౌతోంది. ప్ర‌భుత్వంపై ప్రజా వ్యతిరేక‌త‌, స్థానికంగా బాలినేనికి ఉన్న ప్రతికూలతలే దామచర్ల విజయానికి సోపానాలుగా పరిశీలకులు చెబుతున్నారు.   కొండ‌పి..  కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. గ‌త రెండు ద‌ఫాలుగా అక్క‌డ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తోంది.  గ‌త ఎన్నిక‌ల్లో డోల బాల‌వీరాంజ‌నేయ స్వామి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. ఈ సారి కూడా తెలుగుదేశం కూట‌మి అభ్యర్థిగా కొండ‌పి నుంచి బాల వీరాంజ‌నేయ స్వామి పోటీ చేయనున్నారు. 2024 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థిగా కొండపి నుంచి   ఆదిమూల‌పు సురేశ్ బ‌రిలోకి దిగ‌బోతున్నారు. వైసీపీ అధిష్టానం ఇప్ప‌టికే సురేశ్ ను కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా నియ‌మించింది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట కావ‌డంతో పాటు జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా తోడ‌వుతుండ‌టం, జ‌గ‌న్ పాల‌న‌పై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఇలా అన్ని అంశాలు మ‌రోసారి తెలుగుదేశం అభ్య‌ర్థి విజ‌యానికి దోహదం అవుతాయిని అంటున్నారు.  ద‌ర్శి ..  ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌ద్దిశెట్టి వేణుగోపాల్  విజ‌యం సాధించారు. అయితే జగన్ ఆయన్న తప్పించి  బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా  నిలబెట్టింది. 2014లో బూచేపల్లి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీకి ఈసారి ఓట‌మి త‌ప్ప‌ద‌న్న వాద‌న గట్టిగా వినిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా జ‌న‌సేన నేత‌ గ‌రిక‌పాటి వెంక‌ట‌రావు బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉందని అంటున్నారు.  అదే జ‌రిగితే రెండు సామాజిక వ‌ర్గాల ఓట్ల‌తోపాటు, వైసీపీపై  ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త వైసీపీ అభ్య‌ర్థి ఓట‌మిలో కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ఉన్న‌ాయని  ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. సంతనూత‌ల‌పాడు.. సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి సుధాక‌ర్ బాబు విజ‌యం సాధించారు. అయితే  వైసీపీ అధిష్టానం అత‌న్ని ప‌క్క‌నపెట్టి మంత్రి మేరుగ నాగార్జునను సంత‌నూత‌ల‌పాడు వైసీపీ ఇంచార్జిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగేళ్ల పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు పార్టీలో  వ‌ర్గ‌విబేధాలు కొన‌సాగుతున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా బి. విజ‌య్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. గ‌త రెండుసార్లు విజ‌య్ కుమార్ ఓడిపోవ‌టంతో నియోజ‌క‌వ‌ర్గంలో  ఆయన పట్ల సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని ప్రాంతాల్లో క‌మ్మ‌సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువే. ఈ రెండు అంశాల‌కు తోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఈద‌ఫా విజ‌య్ కుమార్ విజ‌యానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.    కందుకూరు..  కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి మ‌హిద‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. అయితే  వైసీపీ అధిష్టానం ఆయనను పక్కన పెట్టి  అర‌వింద యాద‌వ్ ను రంగంలోకి దింపింది. విద్యాసంస్థ‌ల అధినేత పెంచ‌ల‌య్య కుమార్తె అర‌వింద‌ యాద‌వ్‌  భ‌ర్త వెంక‌ట‌రంగ‌య్య బెంగ‌ళూరులో వ్యాపార‌వేత్త‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువే. అందుకే అర‌వింద‌ యాద‌వ్ ను వైసీపీ ఇంచార్జిగా నియ‌మించిన‌ట్లు స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా ఇంటూరు నాగేశ్వ‌ర‌రావుకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందంని అంటున్నప్పటికీ,   వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి  తెలుగుదేశంలో గూటికి చేరితే.. ఆయనకు సన్నిహితుడైన  మ‌హిద‌ర్ రెడ్డిని తెలుగుదేశం బరిలోకి దించే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.  బ‌రిలోకి దిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువే. గ‌తంలో మ‌హిద‌ర్ రెడ్డికే క‌మ్మ స‌మాజిక‌వ‌ర్గం మ‌ద్ద‌తుగా నిలిచింది. ఈసారి ఆ సామాజిక వ‌ర్గం ఓట్లు తెలుగుదేశం కూట‌మివైపు మ‌ళ్లే అవ‌కావం ఉంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వం పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈనేప‌థ్యంలో ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం  కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం సునాయాసం అని అంటున్నారు. అద్దంకి..  అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం అంటే గొట్టిపాటి ర‌వికుమార్ గుర్తుకొస్తారు. 2019లో  తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఆయ‌న విజ‌యం సాధించారు. మ‌రోసారి తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా ఆయనే  బ‌రిలోకి దిగుతున్నారు. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో అన్నివ‌ర్గాల నుంచి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంది. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జిగా హ‌నిమిరెడ్డిని పార్టీ అధిష్టానం నియ‌మించింది.  అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి గొట్టిపాటి ర‌వికుమార్ విజ‌యం సాధిస్తార‌న్న వాద‌న స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. చీరాల..  చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న వైసీపీలో చేర‌డంతో చీరాల నుంచి వైసీపీ ఇంచార్జిగా క‌ర‌ణం బ‌ల‌రాం కుమారుడు క‌రణం వెంక‌టేశ్ ను పార్టీ అధిష్టానం నియ‌మించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. తెలుగుదేశం కూట‌మి నుంచి చీరాల అభ్య‌ర్థిని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి తెలుగుదేశం బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థే విజ‌యం సాధిస్తార‌ని స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. క‌ర‌ణం బ‌ల‌రాంపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌పై కొంత వ్య‌రేకత‌ వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు వైసీపీ ప్ర‌భుత్వంపైనా ప్ర‌జ‌ల్లో వ్య‌రేక‌త ఉంది. మ‌రోవైపు తెలుగుదేశం ఓటు బ్యాంకుతో పాటు జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా క‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో చీరాల‌లో  తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.  ప‌రుచూరు..  ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏలూరి సాంబ‌శివ‌రావు గ‌త రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. మ‌రోసారి ఇక్కడ నుంచి ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. చ ఇక్క‌డ ఏలూరి హ్యాట్రిక్ విజ‌యం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంనుంచి వైసీపీ అభ్యర్థిగా య‌డం బాలాజీని జగన్ ఎంపిక చేశారు. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా క‌మ్మ‌ సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ఆ త‌రువాత కాపు సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం ఎక్కువ‌.  తెలుగుదేశం జనసేన క‌లిసి పోటీచేస్తున్న నేప‌థ్యంలో క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తుతోపాటు.. మిగిలిన సామాజిక వ‌ర్గాల్లోనూ ఏలూరి సాంబ‌శివ‌రావు అంటే అభిమానం ఉంది. ఈ క్ర‌మంలో ఏలూరి విజ‌యం లాంఛనమేనంటున్నారు.   

కల చెదిరింది.. వంశీ కథ మారింది!

రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గన్నవరం, గుడివాడలో మాత్రం రాజకీయం రంజుగా మారుతోంది. గుడివాడలో వైసీపీ అభ్యర్థిగా మళ్లీ కొడాలి నానినే పోటీ చేస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా తెలుగుదేశం నుంచి వెనిగండ్ల రాము బరిలో దిగుతున్నారు. అయితే కొడాలి నాని వరుసగా గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి  వైసీపీ అభ్యర్థిగానే   బరిలో దిగుతుండగా, తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అంత వరకు ఓకే.  కానీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం చిత్రం.. విచిత్రంగా ఉంది ఎందుకంటే ఈసారి ఫ్యాన్ వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ,  టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ ఇక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో..అంటే.. 2019 ఎన్నికలలో వీరిద్దరే ప్రత్యర్థులైనప్పటికీ, ఇప్పుడు వారు పోటీ చేస్తున్న పార్టీలు రివర్స్ అయ్యాయి. అంటే గత ఎన్నికలలో వల్లభనేని వంశీ తెలుగుదేశం అభ్యర్థిగా  పోటీలో ఉంటే, వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ బరిలోకి దిగారు.  విజయం మాత్రం తెలుగుదేశం అభ్యర్థి వంశీనే వరించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ  151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని జగన్ ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి.. జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.  ఆ తర్వాత.. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీలోనే అటు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గం, ఇటు వల్లభనేని వంశీ వర్గం ఏర్పడి.. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అందులో నుంచి అసమ్మతి రాగం పుట్టుకొచ్చింది. అది మిన్నంటింది. దాంతో యార్లగడ్డ వెంకట్రావ్ వైసీపీకి గుడ్ బై చెప్పి.. తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అలా పార్టీలోకి వచ్చిన కొద్ది రోజులకే.. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా యార్లగడ్డను  తెలుగుదేశంఅధినేత చంద్రబాబు  నియమించారు. దీంతో నాడే గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ పేరు ఖరారు అయింది.   అయితే గన్నవరం నియోజకవర్గం అంటే.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం జెండానే రెపరెపలాడుతుందనీ, ఆ పార్టీ  ఆవిర్భావం నుంచి నియోజకవర్గ ప్రజలు.. దాదాపుగా ఆ పార్టీకే పట్టం కడుతూ వస్తున్నారని.. అలా పట్టం కట్టితేనే.. వరుసగా రెండు సార్లు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలుపొందారని.. కానీ గత ఎన్నికల తరువాత అధికారం మారడంతో.. ఆయన మనస్సు కూడా మారిందని.. కానీ నియోజకవర్గ ప్రజల మనస్సులు మాత్రం చెక్కు చెదరకుండా.. తెలుగుదేశం  వైపే ఉందని,  దీంతో గన్నవరంలో వరుసగా సైకిల్ పార్టీ జెండా రెపరెలాడుతోందని... అందుకే ఈ సారి గెలిచేది.. ఎమ్మెల్యే పదవి చేపట్టేది మాత్రం యార్లగడ్డ వెంకట్రావేనన్న  స్థానికుల్లో హల్‌చల్ చేస్తోంది.  మరోవైపు వల్లభనేని వంశీ పార్టీ మారితే మారాడు.. తనతో పాటు పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు నోరు మూసుకోని ఉన్నట్లు ఉండకుండా.. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  దీంతో ఆ రోజే.. వంశీ పోలిటికల్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పడిందని,  దీంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అయిందని స్థానికులు ఈ సందర్బంగా    గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలుపు.. అంటే యార్లగడ్డ వెంకట్రావ్ గెలుపు ఖాయమైందనే ఓ ప్రచారం సైతం స్థానికంగా జోరుగా సాగుతోంది. 

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుసుమకుమార్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  హల్‌చల్ చేసింది. అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సైతం   పార్టీ గాలి బలంగా వీచేందుకు ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఆ క్రమంలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం చేపట్టింది.  అందులోభాగంగా ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా జెట్టి కుసుమ కుమార్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలో లోక్‌సభ సీట్లకు కాంగ్రెస్ లో ఎంత డిమాండ్ ఉన్నా.. వాటిలో ఖమ్మం లోక్‌సభ స్థానం సెపరేట్. అది  చాలా హాట్ సీట్ అన్న సంగతి   తెలిసిందే. ఈ స్థానం కోసం జిల్లాలోని కీలక నేతలు ఎవరికి వారు పోటీ పడి మరీ తమ వంతు  ప్రయత్నాలు చేసుకొంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినిని ఇక్కడ నుంచి ఎంపీగా బరిలో దింపేందుకు హస్తిన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇదే ఎంపీ టికెట్ ఇప్పించి.. గెలిపించుకోనేందుకు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని సమాచారం.  అలాంటి వేళ.. అదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జెట్టి కుసుమ కుమార్ పేరును పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకుంటే... ఒక కుటుంబానికి ఒకే పదవి అనే ఓ చర్చ పార్టీలో సీరియస్‌గా నడుస్తోండగా.. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు.. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో  మంత్రులగా కొనసాగుతున్నారు. అదీకాక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఖమ్మం జిల్లాలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో తమ అనుకూలురుకే  టికెట్ కేటాయించేందుకు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అధిష్టానం వద్ద చక్రం తిప్పారని.. దీంతో ఈ సారి ఖమ్మం ఎంపీ టికెట్ మరోకరికి కేటాయించాలని.. అందులోభాగంగా జెట్టి కుసుమ కుమార్ పేరును పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం.  ఇక జెట్టి కుసుమ కుమార్ విషయానికి గత 38 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్  పార్టీనే అంటిపెట్టుకొని ఉండడమే కాదు.. పార్టీలో వివిధ స్థాయిలో కీలకంగా పని చేశారు. ఇంకా చెప్పాలంటే.. పార్టీ ఒకానొక సమయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా కాంగ్రెస్ ను వీడకుండా ఆ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. అలాగే ఖమ్మం లోక్‌సభ పరిధిలోని 7 స్థానాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేయడంలో   జెట్టి కుసుమ కుమార్ హస్తం ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆయనకు ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీకి దింపాలని నిర్ణయించిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    అదీకాక.. ఖమ్మం జిల్లాకు చెందిన జెట్టి కుసుమ కుమార్‌ది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసానికి నేరుగా వెళ్లి.. వారిని కలిసి మాట్లాడగల చొరవ ఆయన సొంతం. ఇక గతంలో ఇదే ఖమ్మం ఎంపీగా గెలిచిన రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావుల సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్ బరిలో దిగితే.. ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ లో  ఓ చర్చ  ఊపందుకొంది.   ఇంకోవైపు పార్టీలో ఖమ్మం ఎంపీ సీటుకు తీవ్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు రేణుకా చౌదరికే ఆ  టికెట్ కేటాయిస్తారనే ఓ ప్రచారం రాజకీయ వర్గాలలో  వాడి వేడిగా నడిచింది. అయితే పార్టీ అధిష్ఠానం ఆమెను రాజ్యసభకు పంపిచడంతో తమకు లైన్ క్లియర్ అయిందంటూ అటు మల్లు భట్టి విక్రమార్క, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబరాలు చేసుకొంటూ. ఎవరికి వారు.. తమకే ఖమ్మం ఎంపీ టికెట్ అంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం జెట్టి కుసుమ కుమార్ వైపు మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటన రద్దు 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మొత్తం ఆరు గ్యారెంటీల అమలు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి సిద్దమైంది.  మహలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా  200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రెండు గ్యారెంటీలను ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగా గాంధీ రానున్నారు. అయితే  ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభ వేదికగా రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని కాంగ్రెస్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కానీ అనివార్య కారణాలతో రేపటి ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్‌గా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను ప్రారంభించనున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రెండు గ్యారంటీలను పాక్షికంగా అమలు చేశారు. రేపు మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నారు.

ఒకరి వెంట ఒకరు.. వైసీపీ నుంచి వలసల జోరు!

అధికార పార్టీ నుంచి వలసల జోరు చూస్తుంటే 1977లో మోరార్జీ సర్కార్ పతనానికి ముందు జనతా పార్టీ నుంచి ఎంపీలు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చిన నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. చివరికి మొరార్జీ సర్కార్ పతనమైంది. సరిగ్గా ఇప్పుడు వైసీపీలో అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నది. వీరు కాక పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ వైసీపీకి గుడ్ బై చెబుతోంది. ఈ పరిస్థితి  ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదన్నట్లు తయారైంది. తాజాగా  పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ సోమవారం( ఫిబ్రవరి 26) వైసీపీకి రాంరాం చెప్పేశారు. వీరంతా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. వీరికి . లోకేష్ పార్టీ  కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు వల్లే  సాధ్యమన్న నమ్మకంతో తాము  తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్  రాష్ట్ర భవిష్యత్  కోసం టిడిపితో కలసి పనిచేసేందుకు వచ్చిన పార్థసారధి, భవకుమార్, చంద్రశేఖర్ తో  చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలుగుదేశంపార్టీలో అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ఉంటాయన్నారు. వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన వారిలో పెనమలూరు నియోజకవర్గం నుండి వల్లభనేని సత్యనారాయణ(ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్), నెరుసు రాజ్యలక్ష్మీ(కంకిపాడు ఎంపీపీ) ధూళిపూడి కృష్ణకిషోర్(కంకిపాడు వైస్ ఎంపీపీ), రొండి కృష్ణా యాదవ్(జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్), మాడలి రామచంద్రారావు(మండల వైసీపీఅధ్యక్షుడు), లోయ ప్రసాద్(బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), లింగమనేని సత్యవేణి(సీతారామపురం సర్పంచ్), పోలవరపు బొబ్బి(తాడిగడప మాజీ ఎంపీటీసీ), పార్టీ నేతలు కొలుసు పోతురాజు, నిడుమోలు పూర్ణచంద్రరావు, కొడాలి రవి, మండవ ప్రగతి, నలి మాధవ్, దుద్దుకూరి వెంకటకృష్ణారావు, బోడపాడు శంకర్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి తుపాకుల మహేష్ (వైసిపి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి), పుప్పాల వెంకటసుబ్బారావు (సీనియర్ నాయకులు), మేకల విజయలక్ష్మి (గొల్లపూడి మార్కెట్ యార్డు డైరక్టర్), చెన్ను సురేష్ (విజయవాడ నగర వైసిపి యూత్ జనరల్ సెక్రటరీ), ఇజ్జడ ప్రదీప్ (సిటీ వైసిపి పబ్లిసిటీ విభాగం కార్యదర్శి),ఉప్పులేటి అనిత (నగర వైసిపి లీగల్ సెల్ విభాగం కార్యదర్శి), పొలిమెట్ల డానియేల్ (అఖిలభారత క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్), నర్రా అరుణ్ బాబు (వైసిపి సిటీ యువజనవిభాగం కార్యదర్శి), సోనా సునీత, సోనా జయకుమార్, సోనా రాజేశ్వరి, కురుముల రాజా, షేక్ నాగూర్ తదితరులు ఉన్నారు. 

రమణ దీక్షితులుపై టీటీడీ వేటు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ గౌరవ అర్చకుడు రమణ దీక్షితులుపై వేటు వేసింది. జగన్ హయంలో తిరుమల పవిత్రత దెబ్బ తిందన్న అర్ధం వచ్చేలా రమణ దీక్షితులు ఇటీవల చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆయన  ఆలయ గౌరవ అర్చకత్వంపై తిరుమల తిరుపతి దేవస్థానం వేటు వేసింది. ఆలయ ఈవో ధర్మారెడ్డి మతం పై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం అభిప్రాయపడింది. దీంతో ఆయనను ఆలయ గౌరవ అర్చక పదవి నుంచి తొలగించింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ భూమన వెల్లడించారు.  

కాంగ్రెస్ పార్టీలో చేరిన తీగల కృష్ణారెడ్డి 

గత అసెంబ్లీ ఎన్నికల్లో  తెలంగాణలో బిఆర్ఎస్ పరాజయం కాంగ్రెస్ పార్టీకి జీవం నింపుతోంది.  బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. టిడిపి ప్రభుత్వ హాయంలో హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తీగలకృష్ణారెడ్డి ఇటీవలె బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే . సోమవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కోడలు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అనితా రెడ్డి కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. దీపాదాస్ మున్షీ వారికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారు రాజీనామా లేఖలను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లే వారు బీఆర్ఎస్‌ను వీడినట్లుగా చెబుతున్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ మేయర్‌గా పని చేశారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.

బీఆర్ఎస్ పై కేసీఆర్ పట్టు కోల్పోయారా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు దఫాలు బీఆర్ఎస్ పార్టీని విజయం దిశగా నడిపిన కేసీఆర్..  ఒక్క ఓటమితో పార్టీపై పట్టు కోల్పోయారా అంటే పరిస్థితులను చూస్తుంటే ఔననక తప్పదు. నిజమే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పై మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పట్టు కోల్పోయారని చెప్పక తప్పని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓటమి నుంచి తేరుకుని త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవ్వాల్సిన తరుణంలో  కేసీఆర్ ను పార్టీ నేతలు లెక్కచేడయంలేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.    బీఆర్ఎస్ నుంచి పెరుగుతున్న వలసలను చూస్తుంటే కేసీఆర్ ను పార్టీ నేతలు లెక్క చేయడం లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేని పరిస్థితి కనిపిస్తోంది. పెద్దపల్లి సిట్గింగ్ ఎంపీ వెంకటేశం నేత కాంగ్రెస్ గూటికి చేరారు.  మరింత మంది కూడా అదే దారిలో ఉన్నట్లు చెబుతున్నారు.  ఏకంగా సిట్టింగ్ ఎంపీలే పార్టీ నుంచి బయటకు రావడానికి తహతహలాడుతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, క్యాడర్ సంగతి అయితే చెప్పనవసరంలేదు. లోక్‌సభ ఎన్నికల వేళ  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను నిస్తేజంలోకి నెట్టేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఈ వలసలు జోరందుకుంటాయని చెబుతున్నారు. కనీసం పార్టీ అధినేతకు సమాచారమైనా ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలవడం, అడిగితే అందులో తప్పేముంది.. గతంలో కేసీఆర్ సీఎంగా ఉండగా కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ అయిన సందర్బాలు లేవా అని ప్రశ్నిస్తున్నారు.  ఇక సిట్టింగ్ ఎంపీలైతే ఏకంగా గడప దాటేసి చేయి అందుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని పక్కన పెట్టి   లోక్‌సభ ఎన్నికల్లోనైనా కొంత బలపడదామని భావిస్తున్న పార్టీ అధిష్టానానికి ఈ పరిణామం మింగుడు పడటం లేదు. పార్టీ నుంచి వలసలను ఎలా నిలువరించాలో అర్ధం కాక తల పట్టుకునే పరిస్థితిలో పార్టీ అగ్రనాయకత్వం ఉంది. పార్టీ మారిన వారిపై గట్టిగా విమర్శిద్దామంటూ గతంలో తాము చేసినదేమిటన్న ప్రశ్న ఎదురౌతుందన్న భయం, బెంగ అడ్డు వస్తున్నాయి.   అన్నిటికీ మించి వ్యూహాలు పన్నడంలో దిట్ట అని గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు అచేతనంగా మిగిలిపోవడంతో ఆయన నాయకత్వ సమర్థతపైనే పార్టీలో అనుమానాలు పొడసూపుతున్న పరిస్థితి. పార్టీ నుంచి వలసనలను నివారించడంలో కేసీఆర్ వైఫల్యం పార్టీలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పాలి.  ఇంత జరుగుతున్నా కేసీఆర్ కిమ్మనకపోవడంతో ఆయన రాజకీయంగా సైడైపోయారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి.   గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం అన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతుంటే.. బీఆర్ఎస్ అధినేత తీరు ఆయన అందుకు రెడీ అయిపోయారా అన్న అనుమానాలకు తావిస్తోంది.  బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్,   శ్రీలత,   పట్నం సునీతారెడ్డి, అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇలా చాలా మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.  మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు సైతం పదుల సంఖ్యలో హస్తం పార్టీ గూటికి చేరారు. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి  నేతలను లాక్కున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లి పోతున్న నేతలను చూసి గతంలో మనం ఇలాగే చేశాం కదా అని అనుకోవడమే మిగిలిందని పరిశీలకులు అంటున్నారు.    పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్‌లో చేరడం, నాగర్‌కర్నూల్ ఎంపీ సైతం అదే దారిలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో జహీరాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం ఎంపీలు సైతం పార్టీ మారతారన్న ప్రజారం జోరందుకుంది. అలాగే పలువురు ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనీ, లోక్ సభ ఎన్నికల నాటికి వీరంతా కాంగ్రెస్ పంచన చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.   

ఐదేళ్లు.. జస్ట్ ఐదేళ్లు.. పవన్ పురోగమనం.. జగన్ తిరోగమనం?

ఐదేళ్లు.. జస్ట్ ఐదేళ్లు.. అవును 2019 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకూ ఈ ఐదేళ్ల కాలంలో ఇద్దరు నాయకుల పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఒకరు రాజకీయ పరిణితితో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. మరో నాయకుడు తన పట్ల జనం చూపిన ఆదరణ, అభిమానాలను పూర్తిగా పోగొట్టుకుని వారి ఆగ్రహానికి గురై విఫల నేతగా మిగలడమే తరువాయి అన్న పరిస్థితికి చేరుకున్నారు.  ఇంతకీ వారిరువురూ ఎవరంటే ఒకరు అధికార వై సీపీ అధినేత జగన్.. మరొకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2019 ఎన్నికలలో  జగన్ అశేష ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే.. పవన్ కల్యాణ్  జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించి చతికిల పడింది. పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయాన్ని మూటగట్టుకుని విఫల నేతగా మిగిలారు. అది పక్కన పెడితే ఈ ఐదేళ్ల కాలంలో జగన్ తన పట్ల ప్రజలు చూపిన అభిమానం, ఆదరణను ప్రజాగ్రహంగా మార్చుకుంటే.. అదే ఐదేళ్ల కాలంలో పవన్ కల్యాణ్ తన రాజకీయ పరిణితిని చాటుకుని ప్రజాభిమానాన్ని ప్రోది చేసుకున్నారు. వాస్తవ బలం, రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అవసరాలు, భివిష్యత్, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, వారి నాడి అన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని తమ పార్టీ ఈ ఎన్నికలలో ఎన్ని స్థానాలలో పోటీలో ఉండాలి, పొత్తులో భాగంగా ఏ మేరకు త్యాగాలకు సిద్ధపడాలి అన్న విషయంలో  గ్రౌండ్ రియాలటీ మేరకు ఆచరణాత్మకంగా ఆలోచించి అడుగులు వేస్తుంటే.. జగన్ మాత్రం ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా సిద్ధం అంటూ చొక్కాలు మడతపెట్టేయాలంటూ పార్టీ క్యాడర్ ను రెచ్చగొడుతున్నారు.  2019 ఎన్నికల సమయంలో పొత్తులకు నో చెప్పి పవన్ కల్యాణ్ తాను ఓడటమే కాకుండా, అప్పటి అధికార పార్టీ పరాజయానికి కూడా పరోక్షంగా కారకుడయ్యారు. కానీ ఆ తరువాత పొరపాటు గ్రహించి సరిదిద్దుకోవడానికి ఇసుమంతైనా వెనుకంజ వేయలేదు. అదే సమయంలో గత ఎన్నికలలో తనకు లభించిన ప్రజాదరణతో అహంకారం తలకెక్కిన జగన్, హామీలను విస్మరించి, అధికారమంటే రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే అన్నట్లుగా వ్యవహరించి ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నారు.   పవన్ కల్యాణ్ 2019 ఎన్నికలలో పరాజయం తరువాత ప్రజలలోనే ఉంటూ, ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారు.  పొరపాట్లను సవరించుకుంటూ వేగంగా వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని అర్ధం చేసుకున్నారు. అధికారమంటే ప్రజలను పీల్చి పిప్పి చేయడం, తనను వ్యతిరేకించే వారిపై కక్ష సాధింపులకు పాల్పడటం, ప్రజాగళం వినిపించకుండా నిర్బంధ కాండను ప్రయోగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ ను గద్దె దింపడమే ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు మేలు అన్నది గ్రహించి ఆయన గత ఎన్నికలలో ససేమిరా అన్న పొత్తుకు  ఇప్పుడు స్వయంగా పవన్ కల్యాణే స్వాగతం పలికారు. అదే విధంగా సీట్ల పంపకాల విషయంలోనూ ఎక్కడా తూకం చెడకుండా, అలాగే తన గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించారు. అంతే కాకుండా పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేతతో కలిసి ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటనకు అంగీకరించారు. వాస్తవ బలం మేరకే సీట్లు కోరుతానని చెప్పిన ప్రకారమే ఆయనే స్వయంగా తమ పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు. తన నిర్ణయంతో విభేదించే ఎవరైనా సరే నిరభ్యంతరంగా జనసేనను వీడి వెళ్లిపోవచ్చని పార్టీ శ్రేణులకు ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.   టిడిపి, జనసేనల పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు తీసుకోవడంపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో స్వయం ప్రకటిత కాపు నేత హరిరామ జోగయ్య ప్రస్తావించిన ప్రతి అంశానికీ జగన్ గతంలో ఎప్పుడో, అంటే చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించకముందే, పొత్తులో భాగంగా తాను కోరబోయే సీట్ల సంఖ్య గురించి ప్రస్తావిస్తూన్న సందర్భంగానే బదులిచ్చేశారు. రెండుమూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు వాటిలో పెద్ద పార్టీకి ఎక్కువ సీట్లు లభించడం సహజం. కనుక సీట్ల సర్దుబాట్లు అనివార్యం. ఆ విషయం గుర్తించిన జనసేనాని వాస్తవ అంచనాలకు లోబడే సీట్ల పంపకంతా తమ పార్టీ వాటా తీసుకున్నారు. దీనిని గుర్తించకుండా హరిరామ జోగయ్య చేస్తున్న విమర్శలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని పవన్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం కూడా పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. హరిరామ జోగయ్య వంటి నేతలు పొత్తు విచ్ఛిన్నం చేయడం కోసం వైసీపీ తరఫున పని చేస్తున్న కోవర్టులా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ దశలో వాస్తవాన్ని గుర్తించి కాపు సామాజికవర్గం పవన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నదని అంటున్నారు.  

 హైదరాబాద్ లో పట్టుబడిన  భారీ డ్రగ్స్ ముఠా 

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుకున్నారు. ఒక రాజకీయ నేత కుమారుడితోపాటు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్ లోని పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో ఆదివారం రాత్రి ఓ బీజేపీ నేత కుమారుడు కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి.. హోటల్ లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సదరు బీజేపీ నేత కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో పట్టుబడిన వారిలో మాజీ సీఎం రోశయ్య మనవడు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.హోటల్ లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాలు కొకైన్ స్వీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ నేత కుమారుడితో పాటు మరో పాటు స్నేహితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మత్తు పదార్థాలు  కొకైన్ స్వీకరించినట్టు అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

మళ్లీ గెలిపిస్తే ఆర్నెళ్లలో అద్దం లాంటి రోడ్లు.. జగన్ హామీ జనం నమ్మేస్తారనే?

జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఇవ్వడానికి వేరే హామీలేవీ లేవు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్దానాలలో  పూర్తిగా నెరవేర్చిన హామీ ఒక్కటీ లేకపోవడమే. ఇప్పుడు ఆయన మరో చాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయన గత ఐదేళ్లలో హామీల అమలులో విఫలమయ్యాను.. ఈ సారి ఎన్నుకుంటే ఆ హామీలన్నిటినీ ఆరంటే ఆరు నెలల్లో నెరవేర్చి చూపుతాను అంటూ కొత్త పాట మొదలు పెట్టడానికి రెడీ అయిపోయారు.  సరే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించడం కంటే ముందు.. ఈ ఐదేళ్లలో ఆయన హయాంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల వారు సైతం సెటైర్లు వేసేంత దుస్థితిలో  ఏపీలో రోడ్ల పరిస్థితి ఉంది. గుంతలలో పడి ఎన్ని ఆర్టీసీ బస్సుల చక్రాలు ఊడి రోడ్ల పక్కకు దౌడు తీశాయో లెక్క లేదు. ఎన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బంది బస్సులను నడపలేం అంటూ చేతులెత్తేశారో చెప్పడం కూడా సాధ్యం కాదు. రోడ్ల దుస్థితి కారణంగా జరిగిన ప్రమాదాలలో మరణించిన వారు, క్షతగాత్రులైన వారి సంఖ్య లెక్కపెట్టడమే సాధ్యం కాదు.  రోడ్లు బ్రహాండంగా ఉన్నాయని ప్రభుత్వం ఎంతగా సొంత బాకా ఊదుకుందామని ప్రయత్నించినా ఫలితం లేని విధంగా సామాజిక మాధ్యమంలో రోడ్ల దుస్థితిపై వీడియోలు ప్రత్యక్ష సాక్షాలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రతి ఐదారు నెలలకూ రాష్ట్రంలో రోడ్లపై సమీక్ష చేసే జగన్ ప్రతి సమీక్షలోనూ,  ఆరు నెలల్లో రాష్ట్రం అంతటా గుంతలు లేని రోడ్లే ఉండాలంటూ ఆదేశాలు ఇవ్వడం, అంతే మళ్లీ ఆరు నెలల వరకూ ఆ ఊసే ఎత్తక పోవడం రివాజుగా మారిపోయింది. ఇక ఇప్పుడు రోడ్ల దుస్థితిపై ఎవరినీ మభ్య పెట్టడానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది. వచ్చే ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే సమయం ఆసన్నమైపోయింది. ఆ తరువాత సమీక్షలు చేయడానికి వీలుండదు. ఇప్పటికిప్పుడు సమీక్షలు పెట్టుకుని రోడ్లు బాగు చేసేశామనో, చేసేస్తామనో చెప్పినా జనం నమ్మేందుకు సిద్ధంగా లేరు. దీంతో జగన్ వాస్తవాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సారి విఫలమయ్యాను, కానీ మరో చాన్స్ ఇచ్చి చూడండి ఆరు నెలల్లో గుంతలు లేని నున్నటి రోడ్లు నిర్మించి చూపిస్తానని జనాన్ని నమ్మించేయడానికి రెడీ అయిపోయారు. అలా చెబితే నమ్ముతారన్న వెర్రినమ్మకం ఆయనలో ఎక్కడ నుంచి వచ్చిందా అని పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సారి నున్నటి రోడ్లు అంశాన్ని మేనిఫెస్టోలో పెడతానని చెబుతున్నారు. అసలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకే ఈ ఐదునెలల్లో దిక్కూ దివాణం లేదనీ, అటువంటిది వచ్చే ఎన్నికలలో రోడ్ల ను అద్దంలా చేస్తాను అంటే మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రన జనం ఎలా నమ్ముతారని పరిశీలకులు అంటున్నారు. గత ఐదేళ్లలో రోడ్ల లీటర్ పెట్టోల్, డిజిల్ పై అదనంగా రోడ్ల నిర్వహణ కోసం అని రూపాయి చొప్పున అదనంగా వసూలు చేసి చేసిందేమిటన్న ప్రశ్నకే సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్న జగన్, అలా అదనంగా రోడ్ల కోసం అంటూ వసూలు చేసిన సొమ్ములను కూడా అరకొర పందేరాల పేరిట వాడేశారు. అలాగే నిబంధనలను తుంగలోకి తొక్కి తీసుకువచ్చిన కోట్లకు కోట్ల రుణాలు, చెత్త నుంచి మొదలు పెట్టి అయిన దానికీ కాని దానికీ కూడా వసూలు చేసిన పన్నులు ఇలా అసలు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సోమ్ముకూ, తీసుకువచ్చిన అప్పులకూ లెక్కాపత్రం లేకుండా చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో గెలిస్తే రోడ్లను మరమ్మతు చేయిస్తానంటూ చెప్పడంపై నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. మళ్లీ జనాలను మోసం చేయగలరా అని సవాల్ సైతం చేస్తున్నారు. రోడ్ల పేరు చెప్పి  బ్యాంకులు.. అంతర్జాతీయ. సంస్థల నుంచి దొరికినంత అప్పు చేసి ఆ సోమ్ములనూ దారి మళ్లించేశారు. దీంతో మరో సారి రోడ్ల పేరు చెబితే పైసా అప్పు కూడా పుట్టే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా ఎన్నికలకు సిద్ధం అన్న నోటితోనే ఆరు నెలల్లో రోడ్లను అద్దంగా మారుస్తామంటూ చెప్పడానికి సిద్ధం అయిపోతున్నారు జగన్.   అసలు మౌలిక సదుపాయాల గురించి ఐదేళ్లలో ఏ మాత్రం పట్టించుకోని జగన్  సర్కార్ అదేమని అడిగిన వారికి మీకు ఉత్తినే డబ్బులు పంచుతున్నాం కదా అని ఎదురు ప్రశ్నించింది. వైసీపీ నేతలు అయితే జనం రోడ్ల కోసం నిలదీస్తే.. పధకాలు కావాలంటే మీకు సొమ్ములివ్వం జాగ్రత్త అంటూ బెదరించడానికి కూడా వెనుకాడలేదంటే వైసీపీ ఎంతగా బరితెగించేసిందో అర్ధమౌతోంది.  ఈ బరితెగింపును పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలోగా జగన్ ఆరునెలల్లో రోడ్లు వంటి ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మేందుకు సిద్ధంగా లేరు. వైసీపీ బరితెగింపుపై తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపేందుకు రెడీగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత సర్వేలతో సహా అన్ని సర్వేలూ అదే విషయాన్ని చెబుతున్నాయి. 

చేవెళ్ల  బరిలో నుంచి  రంజిత్ రెడ్డి  దూరం 

బీఆర్ఎస్ కు రోజుకో ఇబ్బంది వ‌చ్చిప‌డుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఆ పార్టీ అధినాయ‌క‌త్వాన్నే కాదు నేత‌ల‌ను కూడా వ‌ణికిస్తోంది. బీఆర్ఎస్ నుండి పోటీ అంటే నేత‌లంతా గ‌తంలో సంతోష‌ప‌డేవారు. టికెట్ కోసం పైర‌వీలు చేసుకునే వారు. కానీ ఇప్పుడు పిలిచి టికెట్ ఇస్తామ‌న్నా ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కేటీఆర్ లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు రివ్యూలు చేశారు. అందులో ఫ‌స్ట్ రివ్యూ చేసిన స్థానం చేవేళ్ల.  సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మ‌ళ్లీ పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు కూడా. ఆయ‌న కూడా గ్రౌండ్ రెడీ చేసుకున్నారు.  కానీ చేవేళ్ల‌లో ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. బ‌ల‌మైన నేత‌గా ఉన్న ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి దంప‌తులు కాంగ్రెస్ కు జైకొట్టారు. మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి, ఆయ‌న కోడ‌లు జెడ్పీ చైర్మ‌న్ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న గ్రూప్ గొడ‌వ‌ల‌కు తోడు, బీజేపీ నుండి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. చేవేళ్ల ఇంచార్జ్ గా సీఎం రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ తరపున ఉండ‌టంతో ఆ పార్టీ  ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.  దీంతో, పోటీపై ఎంపీ రంజిత్ రెడ్డి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. త్రిముఖ పోటీ జ‌రిగితే బీఆర్ఎస్ కు ఇబ్బంది  అన్న ఉద్దేశంతో రంజిత్ రెడ్డి  పోటీ నుంచి త‌ప్పుకుంటున్నారు.  అధిష్టానానికి  ఇప్పటికే స‌మాచారం ఇచ్చార‌ని సమాచారం. దీంతో పార్టీ మాజీమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి అవ‌కాశం ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది.  స‌బితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీ క‌న్నా పెద్ద లీడ‌ర్ ఎవ‌రూ ఇప్ప‌టికిప్పుడు ఎంపీగా నిల్చుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో... పార్టీ కూడా కార్తీక్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి.  ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధిష్టానం ప‌ని చేసుకోవాల‌ని సూచించిన‌ట్లు తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల క‌థ‌నం. మొన్న‌టి  వ‌ర‌కు సికింద్రాబాద్ సీటు కోసం ప్ర‌య‌త్నించిన కార్తీక్ రెడ్డి చేవేళ్ల బ‌రిలో ఉంటారో లేదో  వేచి చూడాలి.

డ్రైవర్ లేకుండా  పరుగులు తీసిన గూడ్స్ రైలు

లోకో పైలట్‌ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు  జమ్ములోని కథువా రైల్వేస్టేషన్లో ఆగింది. అయితే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలి గంటకు 100 కిలో మీటర్ల వేగం అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది.చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది.ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2020లో జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బర్సువా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు నిలబడి ఉంది. ఈ సమయంలో రైలు ఒక్కసారిగా బోల్తా పడింది. దీని తరువాత, రైలు బిమల్‌ఘర్ రైల్వే స్టేషన్ వైపు వెనుకకు కదలడం ప్రారంభించింది. గంటకు 100 కి.మీ వేగంతో పరుగెత్తడం ప్రారంభించింది.

శ్రీరెడ్డి పై  షర్మిల కేసు నమోదు 

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నట్లు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేశారు.  ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతూ, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నటి శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్ సహా ఎనిమిదిమందిపై వైఎస్ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో ప్రజలను కలిసేందుకు ప్రచారం ప్రారంభించానని.. అయితే ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో తనపైనా, తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని షర్మిల పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. నిరాధారమైన పోస్టులతో తనను అవమానిస్తున్నారని అన్నారు. అలాగే తన గురించి కొన్ని పీడీఎఫ్ పోస్టులను సోషల్ మీడియాలో సర్క్కులేట్ చేస్తున్నారని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుతున్నారని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌క్రైమ్ పోలీసులను కోరారు.మరోవైపు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేసిన వారిలో సినీ నటి శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్, మేదరమెట్ల కిరణ్‌కుమార్‌, రమేశ్‌ బులగాకుల, ఆదిత్య, సత్యకుమార్‌ దాసరి, సేనాని, మహ్మద్‌ రెహ్మత్‌ పాషా ఉన్నారు. షర్మిల ఫిర్యాదును ఆమె భర్త అనిల్ కుమార్ పోలీసులకు అందజేశారు. షర్మిల ఫిర్యాదుతో ఎనిమిది మందిపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.