ఎట్టకేలకు ముంబైకి ఒక గెలుపు!

ఐదు సార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ కు 2024 ఐపీఎల్ సీజన్ లో ఏవీ కలిసి రాలేదు. జట్టు కెప్టెన్సీ మార్పును ఆ జట్లు సభ్యులే కాదు, అభిమానులు సైతం హర్షించలేదు. దానికి తోడు కొత్త కెప్టెట్ ఆటిట్యూడ్ జట్లులోని సీనియర్ సభ్యులను చికాకు పెడుతూ వచ్చింది. దీంతో కొత్త కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు సర్వత్రా విమర్శలు తప్పలేదు. అయితే నెమ్మదిగా ఆ ఇబ్బందుల నుంచి కెప్టెన్, జట్టు బయటపడుతున్నాయి.  ఢిల్లీ కెపిటల్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో   అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించి ప్రత్యర్థి ఢిల్లీ కెపిటల్స్ కు భారీ లక్ష్యిన్ని నిర్దేశించింది. ముఖ్యంగా 20వ ఓవర్ లో  ముంబై బ్యాటర్‌ రొమారియో  షెఫర్డ్‌ ఏకంగా 32 పరుగులు రాబట్టడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.   235 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ నిర్ణీత   20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే సాధించి పరాజయం పాలైంది.  తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం ఇచ్చారు. దీంతో పవర్‌ప్లే ముగిసే ముంబై  వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసింది.  అ27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసిన రోహిత్‌ శర్మను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో  ముంబై  80 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌  కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్  యాదవ్‌ రెండో బంతికే డక్  అవుటై నిరాశ పరిచాడు.  ఆ తరువాత ఇచ్చి 42 పరుగులు చేసిన ఇషాన్ ఔటయ్యాడు.  ఆ వెంటనే తిలక్‌ వర్మ కూడా ఔటవ్వడంతో ముంబై కష్టాల్లో పడింది. కేప్టెన్ హార్ధిక్ పాండ్యా   39 పరుగులు చేసి అవుటయ్యాడు. టిమ్‌ డేవిడ్‌ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45, షెపర్డ్‌ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 39 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.    235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ  పృథ్వీ షా, అభిషేక్‌ పోరెల్‌.. స్టబ్స్‌ పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా 40 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.   

అవినాష్ సమక్షంలోనే వివేకా హత్య కేసులో సాక్ష్యాల నాశనం!

ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకా దారుణ హత్యకు గురై ఐదేళ్లు దాటి పోయింది. ఆ హత్య గత ఎన్నికలలో అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పట్ల జనంలో సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైంది. ఆ హత్య వెనుక ఉన్నది తెలుగుదేశమేననీ, నారాసుర రక్త చరిత్ర అనీ పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం చేసుకుని జగన్ అధికార పగ్గాలు అందుకున్నారు. అయితే జగన్ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో వివేకా హత్య కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా, దర్యాప్తులో భాగంగా నిందితులుగా తెరపైకి వచ్చిన వాళ్లను కాపాడేందుకు జగన్ ఎంత కష్టపడ్డారో, తన అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు. తన తండ్రి హత్య కేసులో దోషులకు శిక్ష పడాలంటూ డాక్టర్ సునీత చేస్తున్న న్యాయపోరాటమూ అందరికీ తెలిసిందే.    గత ఏడాది జూలై నెలాఖరులోగా వివేకా హత్య  కేసు విచారణను పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గడువు విధించినా.. ఇంకా కేసు దర్యాప్తు సాగుతూనే ఉంది.   వివేకా హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారుల విషయంలో ఇప్పటికే జనం ఒక అంచనాకు వచ్చేశారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని  సీబీఐ ఛేజ్ చేసి కూడా అరెైస్టు చేయలేకపోయింది. ఇప్పటి వరకూ వైఎస్ వివేకా హత్య కేసులో దోషులెవరన్నది కోర్టులు తేల్చలేదు. కేసు విచారణ జరుగుతూనే ఉ:ది. అయితే  తాజాగా ఏపీ సీఎం జగన్ సొంత మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి  బహిరంగంగా అవినాష్ ను పక్కన పెట్టుకునే... పలు వాస్తవాలు వెల్లడించేశారు.  ఐదేళ్ళుగా విచారణ జరుపుతున్నా సీబీఐ పరిష్కరించలేకపోయిన ఈ కేసులో నిజాలను రవీద్రనాథ్ రెడ్డి పూసగుచ్చినట్లు చెప్పేశారు.  వైఎస్ వివేకా హత్య విషయంలో ఇప్పటి వరకూ జగన్ చెల్లెళ్లు  వైఎస్ షర్మిల, సునీతారెడ్డి  అవినాష్ రెడ్డినే వేలెత్తిచూపుతూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వారి ఆరోపణలపై వైసీపీ నేతలు స్పందించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. జగన్ సహా ఆ పార్టీ నేతలంతా కూడా వైఎస్ వివేకా హత్య..  అవినాష్ రెడ్డిపై ఆరోపణలపై స్పందిస్తూనే ఉన్నారు. అయితే వారి స్పందనలు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అన్నట్లు ఉన్నాయి. జగన్ అయితే వైఎస్ వివేకా హత్య ఎవరు చేశారో జిల్లా ప్రజలకు, దేవుడికి తెలుసునని ముక్తాయించారు.  సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు అయితే షర్మిల, సునీతలపై ఎదురు దాడికి దిగారు.   కానీ జగన్ సొంత మేనమామ, కమలాపురం వైసీపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డిని పక్కన  వివేకా హత్య తరువాత జరిగిన సంఘటనలను  పూసగుచ్చినట్లు చెప్పారు.   కడప జిల్లా, మొయిళ్ళకాల్వ వద్ద ఎన్నికల ప్రచారంలో  రవీద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆరోజు వివేకా హత్య జరిగిన తర్వాత సమాచారం తెలిసి అక్కడకు అవినాష్ వెళ్లాడు, అయితే అప్పటికే గంగిరెడ్డి వైఎస్ వివేకా మృతదేహానికి కుట్లు వేయిస్తూ ఏదో చేస్తున్నాడు అని రవీంధ్రనాథ్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక అవినాష్ రెడ్డి అలా చూస్తూ ఉండిపోయాడని చెప్పారు.  అలా ఉండిపోవడానికి కారణం గంగిరెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరూ ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకునేంత మంచి స్నేహితులు.  దీంతో అవినాష్ రెడ్డి గంగిరెడ్డి వివేకా హత్య సాక్ష్యాలను తుడిచేస్తున్నా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయాడని, అవినాష్ చాలా అమాయకుడని చెప్పుకొచ్చారు రవీంద్రనాథ్ రెడ్డి.   రవీంద్రనాథ్ రెడ్డి ఈ మాటలు చెబుతున్నప్పుడు వేదికపై అవినాష్ రెడ్డి కూడా ఉణ్నారు.  తన మాటల ద్వారా రవీంద్రనాథ్ రెడ్డి అవినాష్ ను ఎంతగా వెనకేసుకు వచ్చారో తెలియదు కానీ, సీబీఐ చార్జ్ షీట్ లో ఏం చెప్పిందో అదే జరిగిందని అంగీకరించేశారు.  సీబీఐ చార్జ్ షీటులో పేర్కొన్నట్లే గంగిరెడ్డి సాక్ష్యాధారాలు నాశనం చేశాడని రవీంద్రనాధ్ రెడ్డి ఒప్పేసుకున్నారు. అంతే కాదు గంగిరెడ్డి సాక్ష్యాలను నాశనం చేస్తుంటే అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారని చెప్పారు.   వివేకా హత్య కేసులో  సీబీఐ కూడా   అవినాష్ సమక్షంలోనే హత్య సాక్ష్యాల నాశనం జరిగిందని చార్జ్ షీట్ లో పేర్కొంది.  అదే విధంగా  వివేకా హత్య కేసులో వివేకా కుమార్తె సునీత, జగన్ సొంత చెల్లెలు షర్మిల చేస్తున్న ఆరోపణలను రవీంద్రనాథ్ రెడ్డి థృవీకరించేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది.  

పీకే పంచాంగం.. జ‌గ‌న్ జాత‌కం!

ఉగాది ప‌ర్వ‌దినాన్ని ఘ‌నంగా జ‌రుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం. ఇదే స‌మ‌యంలో ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల హీట్ తారాస్థాయికి చేరింది. రాజ‌కీయ నాయ‌కులు క్రోధి నామ సంవ‌త్స‌రంలో త‌మ జాత‌కం ఎలా ఉంటుందో ముంద‌స్తుగానే తెలుసుకుంటున్నారు. అయితే, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ కావ‌డంతో ఉగాది పండుగ‌పై పెద్ద‌గా ఆసక్తి ఉండ‌క‌పోవ‌చ్చు. అయినా, క్రోధి నామ సంవ‌త్స‌రంలో ఆయ‌న జాత‌కం ఎలా ఉంటుందో స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. జ‌గ‌న్ జాత‌కం చెప్పింది పంచాగ పండితులు కాదు.. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌. ఆయ‌న ఆషామాషీ వ్య‌క్తికాదు.. దేశ రాజ‌కీయాల్లో ఆయ‌న స‌ర్వే చేశాడంటే.. ఆ ఫ‌లితాలు ప‌క్కాగా దిగిపోవాల్సిందే.. అంతెందుకు, 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న రాజ‌కీయ‌ వ్యూహాల‌తోనే గ‌ద్దెనెక్కాడు. ఆయ‌న ఎవ‌రో కాదు.. ప్ర‌శాంత్ కిషోర్‌. ఇప్ప‌టికే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓడిపోతాడ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన పీకే.. తాజాగా మ‌రోసారి అదే విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేదంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. దీంతో ఎన్నిక‌ల వేళ వైసీపీ అభ్య‌ర్థులు ఓట‌మి భ‌యంతో వ‌ణికిపోతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ వ్యూహాల‌తోనే వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌నే విష‌యం ఏపీ ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కోడిక‌త్తి డ్రామాతోపాటు.. వివేకా హ‌త్య ఘ‌ట‌న త‌రువాత జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉప్పొంగేలా చేయ‌డం వెనుక పీకే వ్యూహాలే కార‌ణ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ ఉంది. కులం‌, మ‌తం‌, ప్రాంతం ఇలా అన్ని అంశాల్లోనూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారా సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌శాంత్ కిశోర్ అధికారాన్ని క‌ట్ట‌బెట్టాడు. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి రాద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. మ‌రోసారి అదే విష‌యాన్ని ప్ర‌శాంత్ కిశోర్ చెప్పాడు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని, వైయస్ జగన్ ఓటమి తధ్యమని అన్నారు. ఓ వార్త సంస్థకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనకు తాను రాజాగా భావిస్తున్నారన్నారు. గతంలో రాజుల వలే.. తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఆయ‌న ఏమీ చేయలేదు.. ప్రజలకు నగదు బదిలీ చేశారు తప్పితే.. ఉద్యోగాలు కల్పన, రాష్ట్రాభివృద్ధిపై ఆయన శ్రద్ద పెట్టలేదని పీకే వివరించాడు. ఎన్నిక‌ల వేళ పీకే వ్యాఖ్య‌ల‌తో వైసీపీ అభ్య‌ర్థులు ఓట‌మి భ‌యంతో వ‌ణికిపోతున్నార‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌లేదు. కేవ‌లం అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు మాత్ర‌మే జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చాడు. చిన్న‌చిన్న ప‌నులు చేసుకుందుకుసైతం  ఏపీలో అవ‌కాశంలేక అక్క‌డి ప్ర‌జ‌లు హైద‌రాబాద్, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌కు వెళ్లిపోతున్నారంటే ఏపీలో ప‌రిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మూడు రాజ‌ధానుల పేరుతో డ్రామాలు.. అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంను పూర్తిగా నిలిపివేయ‌డం వంటి రాష్ట్ర అభివృద్ధికి అవ‌రోధంగా మారే ప‌నులు చేయ‌డం మిన‌హా జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఒక్క‌ప‌నిని కూడా చేయ‌లేద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సంశ‌యం అవ‌స‌రం లేదు. దీంతో, జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్రమంలో ప్ర‌చారానికి వెళ్లిన ప‌లువురు వైసీపీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌ముఖ  సంస్థ‌ల సర్వేలు తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నాయి. తాజాగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీ అధికారంలోకి రావ‌డం అసాధ్య‌మ‌ని తేల్చిచెప్ప‌డంతో వైసీపీ అభ్య‌ర్థులు ఓట‌మి భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ు‌. ప్ర‌శాంత్ కిషోర్ వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నేత‌లు పైకి కొట్టిపారేస్తున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న గురించి తెలిసిన వైసీపీ నేత‌ల్లో మాత్రం ఆందోళ‌న క‌నిపిస్తోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర నుంచి కిందిస్థాయి నాయ‌కుల వ‌ర‌కు ప్ర‌తిఒక్క‌రి గురించి పీకేకు బాగా తెలుసు. అంతేకాదు జ‌గ‌న్ వ్యూహాల‌నుసైతం పీకే తేలిగ్గా ప‌సిగ‌ట్ట‌గ‌ల‌డు. ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని పీకే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. ఇప్ప‌టికే ఒక‌ ప‌క్క ఓట‌మి భ‌యంతోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న వైసీపీ అభ్య‌ర్థుల‌కు పీకే తాజా వ్యాఖ్య‌లు పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లుగా మారాయ‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

బీఆర్ఎస్ పేరు మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు.. ఎన్నికల్లోగా సాధ్యమేనా?

ఔను నిజమే.. టీఆర్ఎస్ గా మొదలై రాష్ట్ర రాజకీయాలను శాసించిన పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. పేరుకే జాతీయ పార్టీ అయినా.. తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీకి గుర్తింపు లేదని కేంద్ర ఎన్నికల సంఘం కుండ బద్దలు కొట్టేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయిన తరువాత ఇంత కాలం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీకి దూరమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ కాదు. అదో జాతీయ పార్టీ. రాష్ట్రంతో ఆ పార్టీ  బీజేపీ, కాంగ్రెస్ లలాగే ఒక రాజకీయ పార్టీ. అంతే అంతకు మించిన అనుబంధమేదీ ఆ పార్టీకి రాష్ట్రంలో లేకుండా పోయింది. బీఆర్ఎస్ గా మారనంత కాలం.. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నా తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలలో ఆ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్( ఇప్పుడు బీఆర్ఎస్) తెలంగాణ జనం గుండెలకు హత్తుకున్నారు. అయితే ఎప్పుడైతే పార్టీలో తెలంగాణను తీసేశారో.. జనం కూడా ఒక ఆ పార్టీకి తమ హృదయాలలో ఉన్న ప్రత్యేకత ను తొలగించుకున్నారు.ఫలితం అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ప్రతిపక్షానికి పరిమితమైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారం కోల్పోయిన క్షణం నుంచీ ఆ పార్టీ ప్రతిష్ఠ వేగంగా దిగజారుతోంది. అవినీతి కేసులు, అక్రమాల పుట్టలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ నుంచి మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27  పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పేరుతో పోటీ చేస్తే మెరుగైన  ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నాయి.  ఏదేమైనప్పటికీ, పార్టీ పేరును మార్చడానికి సంబంధించిన ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు.   కేసీఆర్ సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు వివిధ కోణాలను,   పరిశీలిస్తారని పార్టీ కీలక నేత ఒకరు పేర్కొన్నారు.    ప్రస్తుతం పార్టీ పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతను ఏదో మేరకు తగ్గించడానికి, పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను కట్టడి చేయడానికి  వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చనున్నట్లు ప్రచారంలోకి తీసుకువచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలలోపు  ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలైతే లేవని అంటున్నారు. 

క్రీ. శ. 12వ శతాబ్ది ఘట్టుప్పల్ నంది విగ్రహాన్ని కాపాడుకోవాలి!

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి నల్గొండ జిల్లా  ఘట్టుప్పల్ శివారులోని వినాయక బావి దగ్గరున్న కందూరు చోళుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానిక పురాణమఠం విద్యాసాగర్, మార్కండేశ్వరాలయ కమిటీ ఛైర్మన్  అవ్వారి శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం(ఏప్రిల్ 7) నంది విగ్రహాన్ని, అక్కడే ఉన్న శిథిల శివాలయాన్ని ఆయన పరిశీలించారు.  పునాదుల వరకు ఉన్న శిథిల శివాలయం, భిన్నమైన నంది విగ్రహం క్రీ.శ. 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పానగల్లు నుంచి పాలించిన కందూరు చోళుల కాలం నాటివని, అద్భుత శిల్పకళకు అద్దం పడుతుందన్న 800 ఏళ్ల నాటి విగ్రహాన్ని, గ్రామంలోని మార్కండేశ్వరాలయానికి తరలించి భద్రపరచి, భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ విగ్రహం చారిత్రక, ప్రాధాన్యత దృష్ట్యా తరలించి కాపాడుకుంటామని వారు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జల్లా షణ్ముఖ, నామని జగన్నాథం, చెరుపల్లి భాస్కర్, దోర్నాల నరేందర్, కర్నాటి శ్రీనివాస్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి చెప్పారు. 

కూట‌మికి కోటగా మారిన కర్నూలు!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మిదే అధికారం అంటూ పలు సంస్థల సర్వేలు తేల్చేశాయి. కొన్ని స‌ర్వే సంస్థ‌లైతే వైసీపీకి ముప్పైకి మించి అసెంబ్లీ స్థానాలు రావ‌ని పేర్కొన్నాయి. దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. వైసీపీపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉండ‌డానికి బోలెడు కారణాలు ఉన్నాయి.  ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభివృద్ధిని మ‌రిచి పాలన అంటే కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాలే అన్నట్లుగా వ్యవహరించారు. యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. రాష్ట్రంలో ప‌నులు చేసుకునేందుకు అవ‌కాశాలు లేక‌పోవ‌టంతో య‌వ‌త పెద్ద సంఖ్య‌లో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి ప్రాంతాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఏ విష‌యంలోనూ జ‌గ‌న్ హ‌యాంలో రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గ‌లేదు.  ఫ‌లితంగా ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదింపేందుకు సిద్ధ‌మ‌య్యారు. రాయ‌ల‌సీమ జిల్లాల్లో వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. అయితే జగన్ తీరు కారణంగా  ఈసారి రాయ‌ల‌సీమ జిల్లాల్లోనూ వైసీపీకి గ‌ట్టి షాకిచ్చేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని  తాజా సర్వే పేర్కొంది 2019 ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ ప్రాంతంలో వైసీపీ హ‌వా సాగింది. ఆ ప్రాంతంలో మొత్తం 52 సీట్ల‌లో కేవ‌లం మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆ హ‌త్య వెన‌క ఉన్నది తెలుగుదేశం  నేత‌లేన‌ని జ‌గ‌న్‌, ఆయ‌న వ‌ర్గీయులు విస్తృత ప్ర‌చారం చేశారు. దీంతో ప్ర‌జ‌లుసైతం వైసీపీ నేత‌ల ప్ర‌చారాన్నిన‌మ్మి వైసీపీకి ఓట్లేసి అత్య‌ధిక మెజార్టీతో గెలిపించారు. జ‌గ‌న్ ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయ‌క‌పోగా.. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌డంతోపాటు.. వివేకా హత్య వెనుక ఉన్నది వైసీపీ నేతలేనని దర్యాప్తు సంస్థలు దాదాపు తేల్చేశాయి. ఫలితంగా రాయ‌ల‌సీమ ప్రాంత  ప్ర‌జ‌ల నుంనీ వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీంతో ఈసారి రాయ‌ల‌సీమ ప్రాంతంలోని 52నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధిక స్థానాల్లో తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధించే అవ‌కాశాలే  పుష్క‌లంగా ఉన్నాయి. ప్రముఖ సర్వేలుసైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాయ‌ల‌సీమ‌లో ముఖ్యంగా ఉమ్మ‌డి క‌ర్నూల్ జిల్లా రాజ‌కీయాలు అన్ని పార్టీల‌కు కీల‌కం. గ‌త ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకుగాను 14 స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కానీ, ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అయింది. క‌ర్నూల్ జిల్లాలో వైసీపీకి బిగ్‌షాక్ ఇచ్చేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని తాజా సర్వే పేర్కొంది. స్ట్రా పోల్ తాజాగా నిర్వహించిన స‌ర్వేలో  క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో  వైసీపీ గ్రాఫ్ భారీగా ప‌డిపోయిందని తేలింది. ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో క‌ర్నూలు, కొడుమూరు, ప‌త్తికొండ‌, అదోని, మంత్రాల‌యం, ఎమ్మిగ‌నూరు, ఆలూరు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరిక‌ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. క‌ర్నూల్‌, ఆదోని నియోజ‌క‌వ‌ర్గాల్లో స్ట్రా పోల్ ఆయా పార్టీల నేత‌ల‌పై స‌ర్వే నిర్వ‌హించింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఓట‌ర్ల మొబైల్ ఫోన్ల‌కు స్ట్రా పోల్ లింకులు పంపి వాటి ద్వారా ఓటింగ్ నిర్వ‌హించింది. త‌ద్వారా న‌మోదైన  ఓటింగ్ ఆధారంగా పోలింగ్ శాతాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఆ సర్వేలో క‌ర్నూల్‌, ఆధోని నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం, కూట‌మి అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తార‌ని తేలింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ప‌నులు చేయ‌క‌పోవ‌డం ఒక కార‌ణం అయితే.. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు పెన్ష‌న్ ఇవ్వ‌కుండా ఆ నెపాన్ని తెలుగుదేశంపై నెట్ట‌డం వంటి వాటి గురించి ప్ర‌జ‌లు పూర్తి అవ‌గాహ‌న‌కు రావ‌డంతో వైసీపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం మ‌రింత‌గా పెరిగడం కూడా ఒక కారణంగా సర్వే పేర్కొంది.   క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్థిగా టీజీ భ‌ర‌త్ బ‌రిలో ఉన్నారు. వైసీపీ అభ్య‌ర్థిగా ఏఎండీ ఇంతియాజ్‌, కాంగ్రెస్ కూట‌మి త‌ర‌పున గౌస్ దేశాయ్ బ‌రిలో నిలిచారు.   వీరిపై స‌ర్వే నిర్వ‌హించ‌గా.. టీడీపీ అభ్య‌ర్థి టీజీ భ‌ర‌త్ భారీ మెజార్టీతో విజ‌యం సాధిస్తార‌ని స్ట్రా పోల్ స‌ర్వేలో తేలింది. భ‌ర‌త్ కు 50శాతం, వైసీపీకి 37.5శాతం ఓట్లు వ‌చ్చాయి. అదేవిధంగా ఆధోని నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ పార్థ‌సారథి పోటీ చేస్తున్నారు. వైసీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే వై. సాయిప్ర‌సాద్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. ఇక్క‌డ నిర్వ‌హించిన‌ స్ట్రా పోల్ స‌ర్వేలో కూట‌మి అభ్య‌ర్థి పార్ధ‌సార‌థి విజ‌యం సాధిస్తారని తేలింది.  పార్థ‌సార‌ధికి 55.85 శాతం, వైసీపీకి అభ్య‌ర్థికి 44.35శాతం ఓట్లు వ‌చ్చాయి. క‌ర్నూల్‌, ఆదోనితో పాటు మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోకూడా కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యానికే ఎక్క‌వ అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్ట్రా పోల్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. దీనికితోడు ఉమ్మ‌డి క‌ర్నూల్ జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈసారి వైసీపీ అభ్య‌ర్థులు ఓట‌మి ఖాయ‌మ‌ని ప‌లు స‌ర్వే సంస్థ‌లు తేల్చ‌డంతో మొత్తంగా రాయలసీమలోనే వైసీపీ గాలాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

జ‌గ‌న్నాట‌కం గుట్టువిప్పిన చంద్ర‌బాబు

రాజ‌కీయ చద‌రంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తుండాలి.  ప్ర‌త్య‌ర్థుల వ్యూహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతూ ఆ మేర‌కు పావులు క‌ద‌పాలి.  ఏమాత్రం తేడా వ‌చ్చినా రాజ‌కీయ జూదంలో అడుగున ప‌డిపోయిన‌ట్లే.. ఒక్కోసారి పార్టీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మారే ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. ప్ర‌స్తుతం, ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సమయం దగ్గరపడింది.  అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం అధినేత‌లు గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన త‌ప్పులు రిపీట్ కాకుండా చంద్ర‌బాబు, తెలుగుదేశం నేత‌లు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాల‌ను ప‌సిగ‌ట్ట‌డంలో చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన చంద్ర‌బాబును ఎదుర్కోవాలంటే నేరుగా ప్ర‌జ‌ల‌ వ‌ద్ద‌కు వెళ్తే సాధ్యం కాద‌ని గుర్తించిన జ‌గ‌న్  సానుభూతి   అస్త్రాన్ని ఏపీ ప్ర‌జ‌ల‌పై ప్ర‌యోగించి అధికారంలోకి వ‌చ్చారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలోనే వివేకానంద రెడ్డి హ‌త్య‌ను రాజ‌కీయంగా వాడుకొని జ‌గ‌న్ ల‌బ్ధిపొందారు. వివేకాను హ‌త్య‌చేసింది చంద్ర‌బాబు వ‌ర్గీయులేన‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు స‌ఫ‌ల‌మ‌య్యారు. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వివేకా హ‌త్యకు కార‌ణం వైసీపీ నేత‌లేన‌ని తేలింది. మోస‌పోయామ‌ని ప్ర‌జ‌లు తెలుసుకున్న‌ప్ప‌టికీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ఐదేళ్ల కాలంలో ఏపీ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏ వ‌ర్గం ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌తో సంతోషంగా లేరు.   ప్ర‌జ‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌లు సంస్థ‌ల స‌ర్వేలు  కూడా వైసీపీని ఓడించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశాయి. తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని, అందులో ఎలాంటి ఢోకాలేద‌ని స‌ర్వేల ఫ‌లితాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అయితే  క్రిమిన‌ల్ మైండ్ క‌లిగిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లాంటి వ్య‌క్తికి  పోలింగ్ రోజు వ‌ర‌కు ఏ చిన్న అవ‌కాశం దొరికినా సానుభూతితో ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను మార్చేయ‌గ‌ల స‌త్తా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటి అవ‌కాశాలు వైసీపీకి ఇవ్వ‌కుండా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అరాచ‌కాలు, వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసు వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు ఫోక‌స్ పెట్టి బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌స్తావిస్తున్నారు. అయితే  గ‌తంలో ఎదురైన అనుభ‌వాన్ని గుర్తుచేసుకుంటున్న చంద్ర‌బాబు.. జ‌గన్మోహ‌న్ రెడ్డి శ‌వ రాజ‌కీయాల‌తో సానుభూతి ఏ విధంగా పొందాల‌ని చూస్తారో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. త‌ద్వారా, గ‌త ఎన్నిక‌ల్లోలా జ‌గ‌న్ సానుభూతి మాయలో ప్ర‌జ‌లు ప‌డిపోకుండా చంద్ర‌బాబు ముంద‌స్తుగానే వారిని స‌న్న‌ద్ధం చేస్తున్నారు.   తాజాగా ప‌ల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం స‌భ‌లో చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆడుతున్న నాట‌కం గుట్టును ర‌ట్టు చేశారు.  వివేకా హ‌త్య‌కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన నిందితుడు అని ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అవినాశ్ రెడ్డి వివేకా హ‌త్య‌కేసులో హంత‌కుడుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నా.. అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారాన్ని ఉప‌యోగిస్తున్నారని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మా జ‌గ‌న‌న్న పార్టీకి ఎవ‌రూ ఓటు వేయొద్ద‌ని ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. అంతేకాక  ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా అవినాశ్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు తాజా ఎన్నిక‌ల్లో కూట‌మికి క‌లిసొస్తాయ‌ని అందరూ భావిస్తున్నారు. కానీ, కూట‌మి అభ్య‌ర్థుల‌కు వ‌చ్చే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకును దెబ్బ‌తీసేందుకు జ‌గ‌న్‌, ష‌ర్మిల నాట‌కం ఆడుతున్నార‌ని చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. వారి మాయ‌లో ప‌డి మ‌రోసారి మోస‌పోవ‌ద్ద‌ని, కూట‌మి అభ్య‌ర్థుల‌కు ఓటు వేయ‌డం ద్వారా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు స‌క్ర‌మంగా స‌ద్వినియోగం అయ్యి ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు వివ‌రించారు.  ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం కోసం జ‌గ‌న్‌, ష‌ర్మిలు ఆడుతున్న నాట‌కాన్ని, అందుకు దివంగ‌త వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌ స‌హ‌క‌రిస్తున్న తీరును చంద్ర‌బాబు విమ‌ర్శించారు. త‌ల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్ క‌లిసి కొత్త నాట‌కం ఆడుతున్నాయ‌ని, కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చాన‌ని ఒక త‌ల్లి చెప్పారు.  ఆ త‌ల్లి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌కే న్యాయం చేయ‌లేదు. రాష్ట్రానికి ఏం చేస్తార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. పిల్ల కాంగ్రెస్ వ్య‌తిరేక ఓట్లు చీల్చాల‌ని త‌ల్లి కాంగ్రెస్ నాట‌కం ఆడుతోంది.. ఆడ పిల్ల‌కు అన్యాయం జ‌రిగితే ఇంట్లో తేల్చుకోవాలి.. ఎన్డీయేకు ప‌డే ఓట్లు చీల్చాల‌ని వాళ్లు నాట‌కం ఆడుతున్నారంటూ అన్నాచెల్లెళ్ల గ‌ట్టును చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. కూటమి పార్టీల శ్రేణులు ఈ విష‌యంపై పోలింగ్ సమయం నాటికి ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా  ప్ర‌భుత్వ‌ ప్ర‌జా వ్య‌తిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకివెళ్తే ఆ ప్ర‌భావం కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యావ‌కాశాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ పురావస్తు శాస్త్ర సమ్మేళనం వారసత్వ విభాగం అధ్యక్షునిగా శివనాగిరెడ్డి

పాట్నాలోని బీహార్ మ్యూజియంలో జరుగుతున్న దక్షిణాసియా పురావస్తు సంఘం 8వ అంతర్జాతీయ సదస్సులో  ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి 'ప్రదర్శనశాలలు, వారసత్వ యాజమాన్యం' విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరించినట్లు ఆ సంఘం ప్రతినిధి డాక్టర్ శ్రీకాంత్ గన్వీర్ శనివారం (ఏప్రిల్ 6) తెలిపారు.   సమ్మేళనంలో ఒక విభాగానికి అధ్యక్షునిగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శివనాగిరెడ్డి ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సదస్సులో శివనాగిరెడ్డి ప్రసంగిస్తూ, పురావస్తు ప్రదర్శనశాలలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని, అలాగే వారసత్వ కట్టడాలను ప్రపంచ వారసత్వ కేంద్ర నియమాల ప్రకారం నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఆఫ్ సౌత్ ఏషియన్ ఆర్కియాలజీ అధ్యక్షులు, ప్రపంచ ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త, డా.వసంత్ షిండే శివనాగిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలతకు వై ప్లస్ సెక్యురిటీ 

బీజేపీ తరపున హైదరాబాద్ అభ్యర్థిగా.. అనూహ్యంగా సీటు దక్కించుకున్నారు మాధవీలత. హైదరాబాద్ అనేది ఎంత సెన్సిటీవ్ నియోజకవర్గమో అందరికీ తెలిసిన విషయమే. అందుకే అక్కడి నుంచి పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలతకు హై సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆమెకు వై ప్లస్  సెక్యూరిటీ కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. హైదరాబాద్‌లో మజ్లిస్  అధినేత అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విఐపి  సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది పోలీసు సిబ్బంది సెక్యూరిటీగా ఉంటారు. ఆరుగురు సిఆర్పిఎఫ్  పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమెకు ఎల్లప్పుడూ భద్రతగా ఉంటారు. మరో ఐదుగురు సాయుధులైన గార్డులు మాధవీలత ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. పొలిటికల్ లీడర్స్, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వై ప్లస్  సెక్యూరిటీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే

 తెలంగాణలో రేపట్నుంచి మూడు రోజుల పాటు జల్లులు 

భానుడి ప్రతాపంతో తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. శుక్రవారం రాష్ట్రంలో రికార్టు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో 43.5, మరో తొమ్మిది జిల్లాల్లో 43.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్‌, హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు.అయితే మండు వేసవిలో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షం ఏప్రిల్ 9 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పింది.ఏప్రిల్ 8న నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లె, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేసవిని ఎదుర్కొంటున్న రాష్ట్ర వాసులకు తెలంగాణలో వర్షాలు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ శ్రేగణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నకలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఖరారయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ్ శ్రీగణేష్ ను ఖరారు చేసినట్లు ఆ పార్టీ  కార్యదర్శి కేసీవేణుగోపాల్ శనివారం ( ఏప్రిల్ 6) ప్రకటించారు. నారాయణ్ శ్రీగణేష్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి  కాంగ్రెస్  గూటికి చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నారాయణ్ శ్రీగణేష్ ను కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిఫారసు చేసింది. ఆ సిఫారసును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు.   కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంతో మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.  తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో శ్రీగణేష్ 41,888 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇదే స్థానం నుంచి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన  గద్దర్ కూతురు వెన్నెల  20,825 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.  

ఈ సారి సర్వేపల్లి సోమిరెడ్డిదేనా?

సర్వేపల్లి నియోజకవర్గం.. ఈ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రంగంలో ఉన్నారు. అయితే సోమిరెడ్డికి సర్వేపల్లి పెద్దగా కలిసి వచ్చే నియోజకవర్గం కాదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉండేది. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు పరాజయం పాలయ్యారు. అయినా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయనకు మరో సారి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం సోమిరెడ్డిని గెలుపు పట్టించేలా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అయితే సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ బలమైన నాయకుడే. అయితే ఐదేళ్ల జగన్ పాలనా వైఫల్యాలకు తోడు స్వయంగా కాకాణిపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రజలలో ఆయన ప్రతిష్ఠను పలుచన చేశాయంటున్నారు.  నిజానికి నెల్లూరు జిల్లా అంటే పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా వైసీపీకి కంచుకోటలా ఉంది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీదే ఆధిపత్యం.ఆ ఎన్నికలలో జిల్లాలో తెలుగుదేశం మూడు నియోజకవర్గాలలో విజయం సాధించింది. వైసీపీ ఏడు నియోజకవర్గాలలో విజయభేరి మోగించింది. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే ఆ ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాలలోనూ వైసీపీయే గెలిచింది. ఆ ఎన్నికలలో జిల్లాలో తెలుగుదేశం ఖాతాయే తెరవలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మాత్రం వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయాయి.  ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు   కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామ్‌నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు దాదాపు ఏడాది కిందటే వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు. తాజాగా   వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం తెలుగుదేశం కండువా కప్పుకుని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ చేరికలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వడమే కాకుండా పార్టీ బలోపేతం అవ్వడానికి దోహదపడ్డాయి. తెలుగుదేశం జిల్లాలో ఎంతగా పుంజుకున్నా సర్వేపల్లి నియోజకవర్గం మాత్రం వైసీపీకి పెట్టని కోటే అన్న భావన ఇటీవలి కాలం వరకూ ఉండేది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత   పరిస్థితిలో ఒక్క సారిగా మార్పు వచ్చింది. నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు,  కార్యకర్తలు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రచారానికి జనం నుంచి భారీ స్పందన వస్తోంది. నియోజకవర్గంలో  పొదలకూరు మండలం కాకాణి గోవర్ధన్ రెడ్డికి కంచుకోట అనడంలో సందేహం లేదు. ఆ మండలంలోనే సోమిరెడ్డికి అపూర్వ ఆదరణ లభిస్తుండటంతో ఈ సారి సోమిరెడ్డి చంద్రమేహన్ రెడ్డి విజయం నల్లేరు మీద బండినడకే అనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్కసారిగా సర్వేపల్లిలో వైసీపీకి ఎదురుగాలి వీచడానికి  కాకాణిపై   ఉన్న అవినీతి ఆరోపణలే కారణమంటున్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి బయటకు వచ్చే లారీలు, వాహనాల నుంచి కాకాణి  పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారన్న  ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన వసూళ్ల దెబ్బకు తట్టుకోలేక   పోర్టు ద్వారా కంటైనర్ల  రాకపోకలు నిలిచిపోయాయని నియోజకవర్గంలో  గట్టిగా వినిపిస్తోంది.  ఆ కారణంగా కనీసం 10,000 మంది ఉద్యోగాలు కోల్పోయారనీ, అంతే కాకుండా రొయ్యల గుమతులకు సైతం ఇబ్బందులు ఎదురౌతున్నాయనీ అంటున్నారు. ఈ కారణంగా కాకాణిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. ఆ వ్యతిరేకతకు తోడు మూడు సార్లు నియోజకవర్గం నుంచి మూడు సార్లు పరాజయం పాలైన సోమిరెడ్డిపై సానుభూతి కూడా ఉందనీ చెబుతున్నారు. ఆ సానుభూతికి నియోజకవర్గంలో కాకాణిపై వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీకి సానుకూలత తోడై సొమిరెడ్డి విజయానికి దోహదపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అంతా బాగున్నప్పటికీ విజయం కోసం సోమిరెడ్డి చెమటోడ్చక తప్పదని అంటున్నారు.  

వైసీపీకి డొక్కా షాక్ ? ...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇన్‌ఛార్జీల నియామకం వ్యవహారం.. సీనియర్ నేతల్లో అసమ్మతికి దారి తీస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలో మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేరారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమేనని అంటూనే తన అసమ్మతిని బయట పెట్టుకున్నారు. ఇన్‌ఛార్జీల మార్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను నియమించడంపై ఆయన స్పందించారు. తాజాగా ఈ జాబితాలో మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేరారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమేనని అంటూనే తన అసమ్మతిని బయట పెట్టుకున్నారు. ఇన్‌ఛార్జీల మార్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను నియమించడంపై ఆయన స్పందించారు.  గత కొంతకాలంగా వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు నిన్న సాయంత్రం డొక్కా ఇంటికి వెళ్లి చర్చించారు. పార్టీని వీడొద్దని, పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే, పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డొక్కా అలక వీడలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన డొక్కాకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ పార్టీలో తనకు ప్రాధాన్యం కరవైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. తనను సంప్రదించకుండానే తాడికొండ ఇన్‌చార్జిగా నియమించడం డొక్కాను తీవ్రంగా నిరాశపరిచింది. తరువాత తనను ఆ బాధ్యతల నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  

సీమలోనూ వైసీపీ సీటు చిరిగిపోతుందా?

ఆదోని, కర్నూలులో కూటమి అభ్యర్థుల వైపే జనం ముస్లిం మైనారిటీల మద్దతూ తెలుగుదేశం కూటమికే కర్నూలులో పని చేయని వైసీపీ ముస్లిం కార్డ్  ఆంధ్రప్రదేశ్ లో కూటమి బలం రోజు రోజుకూ పెరుగుతోంది. వైసీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గాలలో కూడా కూటమి బలపడుతోంది. తొలి నుంచీ కూడా వైసీపీకి రాయలసీమలో వైసీపీకి తిరుగులేని బలం ఉంది. అయితే ఈ సారి మాత్రం ఆ పార్టీకి అక్కడ కూడా ఎదురుగాలే వీస్తోందని సర్వేలు నిర్ద్వంద్వంగా చెబుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ  సంస్థ నిర్వహించిన సర్వేలో సీమలో  ఈ సారి కూటమి మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయమని తేల్చింది.  ప్రభుత్వ వైఫల్యాలు,   వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా ప్రజలు తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే పేర్కొంది.  ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో కూటమిదే అధికారమని తేల్చాయి. తాజాగా స్ట్రా పోల్ సంస్థ కర్నూలు జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోందని ఆ సర్వే ఫలితం పేర్కొంది.   ముఖ్యంగా  కర్నూలు, ఆదోనిలలో తెలుగుదేశం కూటమికి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోందని సర్వే తేల్చింది.  కర్నూలులో తెలుగుదేశం పుంజుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న కర్నూలులో, అదీ కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా బీజేపీకి అభ్యర్థి పోటీ చేస్తున్న ఆదోనిలో కూడా కూటమిదే అధిపత్యం అని తేలడంతో ప్రాంతాలు, కులాలు, మతాలు, సామాజిక సమీకరణాలకు అతీతంగా రాష్ట్రంలో కూటమి జోరు కొనసాగుతోందని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆదోనిలో బీజేపీకి చెప్పుకోదగ్గ బలమైన నేతలు లేరు. క్యాడర్ లేదు. అయినా ఆ నియోజకవర్గంలో వైసీపీ కంటే బీజేపీ ముందంజలో ఉందంటే.. జనాలలో వైసీపీ సర్కార్ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  ఆదోని నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థ సారథి బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా వై. సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా తాజా సర్వేలో డాక్టర్ పార్థ సారథికి   55.85% మంది మద్దతు పలుకుతుంటే.. వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి కేవలం 44.15% మంది మాత్రమే మద్దతుగా ఉన్నారని స్ట్రా సర్వే పేర్కొంది. అదోని అసెంబ్లీ నియోజకవర్గంలో  మైనారిటీ ఓటర్లు గణనీయంగా ఉన్నప్పటికీ బీజేపీకే మొగ్గు ఉందని తేలడమంటే.. ముస్లిం మైనారిటీల్లో కూడా జగన్ పాలన పట్ల వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు.   ఇక కర్నూలు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్న టీజీ భరత్ కు 50 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. వైసీపీ మైనారిటీ కార్డ్ ఉపయోగించినప్పటికీ  ఇంతియాజ్ అహ్మద్ కు క ేవలం 37.5శాతం మంది ఓటర్లు మాత్రమే మద్దతుగా నిలిచారని సర్వే పేర్కొంది.   మొత్తానికి ఆదోని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాలలో  కూటమి అభ్యర్థులకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది.  

జగన్ నుంచి వైఎస్ బ్రాండ్ ను లాగేసుకున్న షర్మిల

కడప ఎంపీ ఎన్నిక అజెండాగా వివేకా హత్య కేసు వైఎస్ బిడ్డ వైపా.. వివేకా హంతకుడివైపా అంటూ షర్మిల ప్రచారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జనం వైఎస్ కుమారుడు అన్న సానుభూతితో ఒక సారి అధికారాన్ని అప్పగించారు. వైఎస్ కుమారుడు అన్న ఒక్క కారణమే కాకుండా మొత్తం వైఎస్ కుటుంబం అంతా జగన్ వెనుక నిలబడటం కూడా జగన్ ను జనం నమ్మడానికి ఒక కారణంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అలా మొత్తం కుటుంబం జగన్ వెంట నిలబడటంతో వైఎస్ బ్రాండ్ గంపగుత్తగా జగన్ కు సొంతమైపోయింది. దీంతో  వైఎస్ జీవితమంతా పని చేసిన కాంగ్రెస్ కు గత రెండు ఎన్నికలలోనూ కూడా భారీ నష్టం వాటిల్లింది. మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా జగన్ వెంట నిలిచింది. దీంతో 2019 ఎన్నికలలో జగన్ కు విజయం సునాయాసమైంది. అన్నిటికంటే జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల ప్రజలలో సెంటిమెంట్ రగల్చడంలో సక్సెస్ అయ్యారు. ఆ తరువాత వైఎస్ సీఎంగా ఉన్నంత కాలం ఎన్నడూ బహిరంగంగా కనిపించని ఆయన సతీమణి విజయమ్మ కుమారుడి కోసం బయటకు వచ్చి ప్రచారం చేయడం కూడా కలిసి వచ్చింది. ఇక సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య, విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిందని చెబుతున్న కోడికత్తి దాడి సంఘటనలు కూడా జగన్ పై ప్రజల సానుభూతి వెల్లువెత్తడానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు అంటే 2024 ఎన్నికల ముంగిట నాడు జగన్ విజయానికి దోహదం చేసిన ప్రతి అంశమూ ఇప్పుడు ప్రతికూలంగా మారింది. ముఖ్యంగా జగన్ సొంత చెల్లి షర్మిల అన్నకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, వివేకా హత్య విషయంలో ఆమె నేరుగా జగన్ పై సంధిస్తున్న ఆరోపణాస్త్రాలూ ప్రజలలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి.   కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షర్మిల  ప్రచారం ప్రారంభించారు. తొలి రోజునే ఆమె సూటిగా సుత్తి లేకుండా నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ బిడ్డగా తాను జనం ముందుకు నిలబడ్డాననీ, జగనన్న మాత్రం వివేకా హంతకుల వైపు ఉన్నారనీ వ్యాఖ్యానించారు.    అంతే కాకుండా కడప బరిలో వైఎస్ విడ్డ వివేకా హంతకుడితో తలపడుతోందని చెప్పారు. ఈ మాటలతో షర్మిల వైఎస్ బ్రాండ్ ను జగన్ కు దూరం చేసి తన సొంతం చేసుకున్నారు. షర్మిల ప్రచారం తొలి రోజునే ఆమె ప్రసంగం, ఆమె వ్యాఖ్యలు ఒక్క కడప నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.  స్వయంగా షర్మిలే అవినాష్ ను వివేకా హంతకుడిగా అభివర్ణించడం, ఆమె మాటలు అక్షర సత్యాలని వివేకా కుమార్తె సునీత చెప్పడంతో కడపలో అవినాష్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా షర్మిలకు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను దూరంపెట్టారన్న సానుభూతీ ఉంది.  వివేకా హంతకుడికా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డకా ఓటు అన్న ఒక్క ప్రశ్నతో  కడప ఎంపీ ఎన్నికల ఎజెండాగా వివేకా హత్య కేసును మార్చడంలో షర్మిల సక్సెస్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ , ముగ్గురు మావోయిస్టులు హతం 

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే 47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గత సోమవారం చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో ఈనెల 19న ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంట‌ర్‌లో తెలంగాణలోని మంగి, ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్.. సిర్పూర్ చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ.. ప్లాటూన్ మెంబర్లు కుర్సంగి రాజు, కుడిమెట్ట వెంకటేష్ మృతి చెందారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఒక కార్బైన్, ఒక కంట్రీమేడ్ పిస్టల్, మావోయిస్టుల సాహిత్యం, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌ బూటకం అంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో  గత నెల 19న ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంట‌ర్‌లో తెలంగాణలోని మంగి, ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్.. సిర్పూర్ చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ.. ప్లాటూన్ మెంబర్లు కుర్సంగి రాజు, కుడిమెట్ట వెంకటేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే.   

పెమ్మ‌సాని జోరు.. వైసీపీ బేజారు!

గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీకి కిలారు రోశయ్య వెనుకంజ మళ్లీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్ అళ్లను బరిలోకి దింపే యోచన ఓడినా సరే పోటీ చేయాలని ఆర్కేకు జగన్ హుకుం? ఏపీలో ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు.. ఆ పార్టీని గ‌ద్దెదింపేందుకు సిద్ధమైపోయారు. మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన బ‌స్సు దాదాపు తుస్సుయాత్రగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు నానా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని స‌ర్వేలు చెబుతున్నాయి.  దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో వివేకానంద రెడ్డి హ‌త్య కేసు, కోడి కొత్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతితో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. కానీ, ఈసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం చెప్పేందుకు అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఏకమైనట్లు కనిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు ముందుగానే ఓట‌మిని ఒప్పుకొని పోటీనుంచి వైదొలిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసేందుకు వైసీపీ అభ్య‌ర్థులు వ‌ణికిపోతున్నారని చెబుతున్నారు. ఓడిపోయే సీటులో పోటీచేసేకంటే.. ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండ‌ట‌మే బెట‌ర్ అనే నిర్ణ‌యానికి వైసీపీ అభ్య‌ర్థులు వ‌స్తున్నారు. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త రెండు ద‌ఫాలుగా తెలుగుదేశం అభ్య‌ర్థిగా గల్లా జ‌య‌దేవ్ విజ‌యం సాధించారు. ఈసారి ఆయ‌న రాజ‌కీయాల‌కు విరామం ఇవ్వ‌డంతో  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. చంద్ర‌శేఖ‌ర్ గ‌త కొన్నేళ్లుగా గుంటూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వ‌స్తున్నారు. పేద వ‌ర్గాల ప్ర‌జ‌లకు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వారికి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. పెమ్మ‌సానికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచిపేరు ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని విజ‌యం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.   దీంతో పెమ్మ‌సానిపై పోటీ చేసేందుకు వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు పోటీ నుంచి త‌ప్పుకున్నారు. చివరకు జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు కిలారు కోశ‌య్య‌ గుంటూరు పార్ల‌మెంట్  నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయ‌నకూడా పోటీ నుంచి త‌ప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ క్యాడ‌ర్ సైతం పెమ్మ‌సానికే జై కొడుతున్నారనీ,  దీంతో పోటీలో నిలిచి ఓడిపోవ‌డం కంటే పోటీ నుంచి త‌ప్పుకోవ‌టం మేల‌న్న భావ‌న‌కు కిలారు రోశ‌య్య వ‌చ్చారనీ గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలుత క్రికెటర్ అంబటి రాయుడును బ‌రిలోకి దింపాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావించారు. అయితే, ఆయన పార్టీలో చేరిన కొద్దికాలంకే వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో గుంటూరు పార్ల‌మెంట్‌ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా న‌ర్స‌రావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులును పోటీ చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఆయ‌న అందుకు స‌సేమిరా అన‌డంతో న‌ర్స‌రావుపేట నుంచి మ‌రోసారి టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ నిరాక‌రించాడు. దీంతో శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు తెలుగుదేశంలో చేరి మ‌రోసారి న‌ర్స‌రావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు.  గుంటూరు పార్ల‌మెంట్ కు పోటీచేసేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌టంతో  వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయ‌న‌కూడా పోటీ చేసేందుకు నిరాస‌క్త‌త‌ను వ్య‌క్తం చేయడంతోపాటు.. రెండు వారాలైనా నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. దీంతో ఉమ్మారెడ్డి అల్లుడు అయిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యను గుంటూరు అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దించారు.  ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే  ఇప్పుడు ఆయ‌న‌సైతం పోటీనుంచి త‌ప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పెమ్మ‌సాని రాజ‌కీయ‌ వ్యూహాల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు సైతం ఫిదా అవుతున్నార‌ట‌. దీంతో ప‌లువురు వైసీపీ నేత‌లు సైతం లోపాయికారికంగా పెమ్మ‌సాని విజ‌యంకోసం ప‌నిచేస్తున్నార‌న్న ప్ర‌చారం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్నది. దీంతో ఎంత ప్ర‌య‌త్నించినా నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజ‌యం అసాధ్య‌మ‌ని కిలారు రోశ‌య్య పార్టీ నేత‌ల వ‌ద్ద పేర్కొన్నార‌ని సమాచారం. పెమ్మ‌సాని విజ‌యాన్ని ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డంకంటే త‌ప్పుకోవ‌టం మేల‌న్న భావ‌న‌ను పార్టీ నేత‌ల వ‌ద్ద కిలారు రోశ‌య్య ప్ర‌స్తావించిన‌ట్లు గుంటూరు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి ఆయ‌న‌పై పోటీకి వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ అభ్య‌ర్థిగాఉన్న కిలారు రోశ‌య్య కూడా పోటీనుంచి త‌ప్పుకుంటాన‌ని వైసీపీ అధిష్టానం వ‌ద్ద వెల్ల‌డించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కిలారు రోశ‌య్య స్థానంలో గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఓడిపోయినా స‌రే.. పోటీలో మాత్రం ఉండ‌డాల‌ని వైసీపీ అధిష్టానం ఆళ్ల‌కు సూచించిన‌ట్లు సమాచారం. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి కోసం  ప్ర‌చారం చేస్తున్నారు.  మొత్తానికి గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ దెబ్బ‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే వైసీపీ ఓట‌మిని ఒప్పుకున్న‌ట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.