మేనత్త హఠాత్ ఎంట్రీ కారణమేంటి?

సెంటిమెంట్.. ఇది ఎంత ప్రభావమంతమో.. గత ఎన్నికలలో ఆ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచిన జగన్ కంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. అందుకే పులివెందుల గడ్డపై సొంత చెల్లెలు షర్మిల, చిన్నాన్న కూతురు సునీత  ప్రచారం, సంధిస్తున్న విమర్శలు, వివేకా హత్యను ప్రస్తావిస్తూ ప్రజలకు చేస్తున్న వేడికోలు జగన్ ను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పులివెందులలో షర్మిల, సునీతల ప్రచారం జగన్ కు ఓటమిని ముందే చూపించేస్తోందా అన్న అనుమానం కలిగిస్తున్నాయి ఆయన పార్టీ నేతలూ, క్యాడర్ చేస్తున్న హడావుడీ, పడుతున్న కంగారూ చూస్తుంటే. షర్మిల ప్రచారం సమయంలో  విద్యుత్ కట్ అవ్వడం, షర్మిలను అడ్డుకోవడానికి వైసీపీ మూకలు చేసిన విశ్వయత్నం జగన్ లో నెలకొన్న భయాన్నే ఎత్తి చూపాయి. ఇక వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాడికి తెగబడేంత హడావుడి చేసినా షర్మిల ఎక్కడా తగ్గలే.   షర్మిల ప్రచారంతో పులివెందులలో జగన్ కు ముచ్చెమటలు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. రోజు రోజుకూ పదునెక్కుతున్న షర్మిల మాటలకు సెంటిమెంట్  కూడా జోడించి షర్మిల పులివెందుల ప్రజల మనస్సులను గెలుచుకుంటున్నారన్న భయం జగన్ లో ఏర్పడింది.  మీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బిడ్డ‌… మీ వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డ‌తో క‌లిసి వ‌చ్చి  అర్ధిస్తోంది. ఆడ‌బిడ్డ‌గా కొంగుచాపి అడుగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో హంత‌కుల‌ను ఓడించి, ష‌ర్మిల‌కు ఓటేయ్యండి అంటూ ఆమె చేసిన అప్పీల్ జగన్ లో గుండె గాభరా కలిగించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ లో భయం పెచ్చరిల్లడంతోనే హడావుడిగా మేనత్త విమల్మను రంగంలోకి దింపారంటున్నారు. ఆమె మేనత్తగా  పెద్ద రికాన్ని ప్రదర్శిస్తూ.. తాను వైఎస్ కుటుంబ ఆడపడుచుగా చెబుతున్నాను అంటూ షర్మిల, సునీతలకు సుద్దులు చెప్పారు. కుటుంబాన్ని పలుచన చేయవద్దని మందలించారు.  ప్ర‌త్య‌ర్థుల చేతుల్లోకి వెళ్లి చేస్తున్నవిమర్శలు కట్టిపెట్టి నోరు మూసుకోండంటూ హెచ్చరించారు.   జ‌గ‌న్, అవినాష్ కు అండ‌గా ఉండాల‌ని పులివెందుల, కడప ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవానికి షర్మిల కుటుంబ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని భావిస్తే ఆ విషయం తల్లి విజయమ్మ చెప్పాలి. అలాగే సునీతను మందలిస్తే ఆమె  తల్లి సౌభాగ్యమ్మ మందలించాలి. కానీ వారిద్దరూ కూడా తమ కూతుళ్లకే మద్దతుగా ఉన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే నిన్నటి వరకూ షర్మిలతోనే ఉన్న విజయమ్మ.. ఇప్పుడు హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయారంటే.. అది జగన్ ఒత్తిడి వల్లేనని ఆ కుటుంబ సన్నిహితులే చెబుతున్నారు. జగన్ తరఫున ప్రచారం చేయడానికి ఇష్టపడక, షర్మిలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి మనస్కరించక ఆమె రాష్ట్రానికి దూరంగా విదేశాలకు వెళ్లారు. ఆ వెళ్లడం కూడా షర్మిల కుమారుడి వద్దకే వెళ్లారు. దీనిని బట్టే విజయమ్మ మద్దతు ఎవరికో అర్ధం అవుతుంది. ఇక సౌభాగ్యమ్మ అయితే షర్మిల, సునీతలకు అండగా ఉన్నారు. తన భర్త హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని ఆమె మీడియా ఎదుటే కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విమలమ్మ మేనకోడళ్లకు సుద్దులు చెప్పడం విషయానికి వస్తే..  విమలమ్మ తొలి నుంచీ జగన్ కు మద్దతుగానే నిలిచారు.  క్రైస్తవ మత బోధకురాలిగా ఆమె ఏపీలో విస్తృతంగా పర్యటించి పాస్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి జగన్ కు మద్దతు కూడగట్టడానికి శతధా ప్రయత్నించారు.  ఆ క్రమంలో ఆమె విఫలమయ్యారు. కాకినాడలో అయితే పలువురు ఫాదర్లు ఆమెకు ఎదురుతిరగడంతో దొడ్డి దారిన వెళ్లిపోయారు.  ఆ తరువాత ఆమె పెద్దగా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్లీ మేనగోడళ్లను జగన్ తరఫున మందలించడానికి వచ్చారు.  వైఎస్ కుటుంబం అంతా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నా విమలమ్మ మాత్రం జగన్ తో జగన్ కు మద్దతుగా నిలవడానికి కారణమేమిటో షర్మిల బయటపెట్టారు.  జగన్మాయలో పడి వైఎస్ వివేకా తన సొంత అన్న అన్న విషయాన్ని మేనత్త విమలమ్మ మరచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. సొంత అన్న వైఎస్ వివేకానందరెడ్డిని  కిరాతకంగా హత్య చేసిన వారి పక్షాన విమలమ్మ నిలవడానికి కారణం ఆమె కుమారుడికి జగన్ వర్క్స్ ఇవ్వడమేనని షర్మిల కుండబద్దలు కొట్టారు. వివేకా హత్య విషయంలో తామేమీ ఆధారాలు లేకుండా మాట్లాడడంలేదని, తాము ఆరోపణలు చేయడం లేదనీ చెప్పిన షర్మిల  సీబీఐ చూపిన ఆధారాలనే తాము చెబుతున్నామన్నారు. హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నామని చెప్పారు.   ఇకనైనా విమలమ్మ వాస్తవాలు తెలుసుకుని మసలుకోవాలన్నారు. సొంత అన్నను కిరాతకంగా హత్య చేసిన వాళ్ల తరఫున మాట్లాడటం మానుకోవాలని హితవు చెప్పారు.  మేనత్తను రంగంలోకి దించి షర్మిల, సునీతలను నిలువరించాలన్న జగన్ యత్నం షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ తో విఫలమైందని పరిశీలకులు అంటున్నారు.   

తెలంగాణ మంత్రి పొంగులేటి వాహనం తనిఖీ  

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు ఎన్నికల కమిషన్ ఆధీనంలో పని చేయాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నేత గత అసెంబ్లీ ఎన్నికలముందు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరి ఆ పార్టీని విజయతీరాలకు చేర్చిన ముఖ్యుల్లో ఒకరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మొదటి కేబినెట్ లో పొంగులేటికి మంత్రి పదవి లభించింది. లోకసభ ఎన్నికలు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఎన్నికల కమిషన్ తెలంగాణ మంత్రుల మీద దృష్టి కేంద్రీకరించింది.  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సరిహద్దుల్లో ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. శనివారం ఆయన తిరుమలాయంపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం నుంచి వెళుతున్న సమయంలో మాదిరిపురం వద్ద మంత్రి వాహనాన్ని పోలీసులు చెక్ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనాలను చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పొంగులేటి వాహనాన్ని చెక్ చేశారు. ఆయన తనిఖీలకు పూర్తిగా సహకరించారు.

ఆ ఆడబిడ్డల గుండెఘోష - వైసీపీకి సెగ

ఏపీ రాజ‌కీయాల్లో  షర్మిల -సునీత వ్యాఖ్యలు కలకలంగా మారుతున్నాయి. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల తన చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిపైనా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన అన్న జగన్ పైన విరుచుకుపడుతున్నారు. మనిషి పుట్టుక పుట్టి, కడుపుకు అన్నంతినే ఎవరికైనా ఆ మాటలు వింటే హృదయం ద్రవించక మానదు. ఆ వీడియో  చూస్తే ఎవ‌రికైనా గుండె బరువెక్కుతుంది. ఒక ఆడబిడ్డ మండుటెండలో నడిరోడ్డుపైన నిలబడి "నేనూ నాసోదరి ఇద్దరమూ కొంగుచాపి/కొంగుపట్టి మిమ్మల్ని ప్రాధేయపడి మాకు న్యాయంచేయమని అడుగుతున్నాము" అనే మాట సామాన్యమైనదికాదు. రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా, మానవత్వం సంస్కారం ఉన్నటువంటి ఏమతస్తులకైనా ఏకులస్తులకైనా ఏప్రాంతంవాళ్లకైనా సరే ఆ ఆడబిడ్డల దృశ్యంచూసి ఆమాటలు వింటే కళ్ళల్లో నీళ్లు రాకమానవు. ఆ ఆడబిడ్డల కన్నీటి చుక్కలు అవతలివాళ్లను దహించకమనవు, ఆ ఆడబిడ్డల గుండెఘోష వాళ్లకు రాజకీయ సామాజిక సజీవసమాధి అవకతప్పదు. ఒక భారతీయ ఆడబిడ్డ జీవితంలో ఎంతగా మనోవేదనకు మోసానికి అణచివేతకు దురహంకారానికి గురైతేగానీ ఇంతగా బయటకొచ్చి, రక్తసంబంధాలను కూడా పక్కకునెట్టి మాట్లాడుతున్నారో మనం అర్థంచేసుకోవచ్చు. ఇక షర్మిల - సునీత చేస్తున్న వ్యాఖ్యలపైన వైఎస్సార్ సోదరి విమల స్పందించారు. కుటుంబ ఆడ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని విమల  రాజ‌కీయం చేస్తున్నారు.  తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తానూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నట్లు ఆమె చెబుతున్నారు.  అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారని చెప్పుకొచ్చారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకని వ్యాఖ్యానించారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే తనకే ఎక్కువ ఇష్టమని ఆమె చెబుతున్నారు.  మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండిని ఓ స‌ల‌హా కూడా ఆమె ఇచ్చారు. నిజానికి అటు సునీత‌, ఇటు ష‌ర్మిల‌లు వైసీపీకి సెగ పుట్టిస్తున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. జ‌గ‌న్‌ను ఉతికి ఆరేస్తున్నారు. వివేకా హ‌త్య‌ను ప్ర‌ధాన వ‌స్తువుగా తీసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవి ఎంత‌గా ఉన్నాయంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు.. టీడీపీ, జ‌న‌సేన‌లు కూడా చేయ‌నంత‌గా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ నేరుగా వారిని ఏమీ అన‌లేక‌.. అలాగ‌ని ఉండ‌లేక స‌త‌మ‌తం అవుతున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల కీల‌క‌ద‌శ‌లో జ‌గ‌న్ ఇప్ప‌టికే క‌డ‌ప‌లో ప‌ర్య‌ట‌న‌లు పూర్తి చేసుకున్నారు. మ‌ళ్లీ క‌డ‌ప‌కు వెళ్లే అవ‌కాశం లేదు. కానీ, ఇప్పుడు ష‌ర్మిల‌, సునీత‌లు క‌డ‌ప‌లో ప్ర‌చారం ప్రారంభించారు. అంటే.. వారు లైవ్‌లో ఉండ‌నున్నారు. పైగా ఎన్నిక‌ల‌కు మూడు వారాల ముందు వ‌ర‌కు ష‌ర్మిల క‌డ‌ప‌లోనే ఉండి.. సునీత పూర్తిగా అక్క‌డే తిష్ఠ‌వేసి చేసే ప్ర‌చారం ఎన్నిక‌ల వేళ తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంది.

అంబానీ ఇంట్లో పుట్టాలనుకుంటున్నారా?

సాధారణంగా ఇండియాలో చాలామంది ‘అంబానీ ఇంట్లో  పుట్టినా బాగుండేది... సర్లే, ఈ జన్మలో ఎలాగూ పుట్టలేకపోయాం.. వచ్చే జన్మలో అయినా అంబానీ ఇంట్లో  పుట్టేలా అనుగ్రహించు దేవుడా’ అనుకుంటారు. ఇలాంటి  కోరిక కోరుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే, మీరు  పొరపాటుగా ఇలా కోరుకున్నారంటే, వచ్చే జన్మలో చాలా  ఇబ్బందులలో పడిపోతారు. దేవుణ్ణి కోరుకునే కోరికలో క్లారిటీ  లేకపోతే, వచ్చే జన్మలో మీ పని మటాష్  అయిపోతుంది.  అంబానీ ఇంట్లో పుట్టించాలన్న మీ కోరిక దేవుడి చెవిలో పడి  ఆయన పొరపాటుగా ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ  ఇంట్లో కాకుండా అప్పుల కుప్పలా మారిన అనిల్ అంబానీ  ఇంట్లో పుట్టించారంటే చచ్చారే! వచ్చే జన్మలో డబ్బుల సంగతి  దేవుడెరుగు... అప్పుల ఊబిలో కూరుకుపోతారు. కాబట్టి...  దేవుణ్ణి ‘అంబానీ ఇంట్లో పుట్టించు దేవుడా’ అని కాకుండా,  కాస్తంత క్లారిటీగా ‘ముఖేష్ అంబానీ ఇంట్లో పుట్టించు  దేవుడా’ కోరుకోవడం బెటర్.  ఇంతకీ ప్రస్తుతం అనిల్ అంబానీ పరిస్థితి ఏంటంటే, తన  రియలన్స్ ఇన్‌ఫ్రా సంస్థకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ నుంచి 8  వేల కోట్ల రూపాయలు వస్తాయని అనిల్ అంబానీ గత  కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ డబ్బు వస్తే తన ఆర్థిక  కష్టాలు కొంతయినా తగ్గుతాయని భావించారు. గతంలో అనిల్  అంబానీకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ 8 వేల కోట్లు ఇవ్వాలని  తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు తన తీర్పుని సమీక్షించకుంది..  అనిల్ అబానీకి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని  లేటెస్ట్ గా తీర్పు చెప్పింది. దాంతో అంబానీ ఆశల సౌధం  కూలిపోయింది. రావాల్సిన ఎనిమిది వేల కోట్లు  రాకపోగా, ఆ  ఎనిమిది వేలు రాలేదనే కారణంతో అనిల్ అంబానీ షేరు స్టాక్  మార్కెట్లో 20 శాతానికి పైగా పడిపోయి అంబానికీ డబుల్ షాక్  తగిలింది. అందువల్ల దేవుణ్ణి కోరుకునే కోరికను క్లారిటీగా  కోరుకుందాం.

కేటీఆర్ హీరోగా ‘పొలిటికల్ పిచ్చోడు’

సినిమావాళ్ళు ఎవరైనా ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే పేరుతో  సినిమా తీయాలని అనుకుంటే, ఆ సినిమాలో హీరోగా యాక్ట్  చేయడానికి ఒక రాజకీయ నాయకుడు అన్నివిధాలా అర్హుడు.  అతనెవరో ఈపాటికి మీకు అర్థమైపోయిందిగా.. ఎస్... అతనే  కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు. కేటీర్  వ్యక్తిగతంగా పిచ్చోడు కాదు.. బాగా చదువుకున్నవాడు..  మాటకారి, సబ్జెక్ట్ వున్నవాడు. వ్యక్తిగతంగా కొంచెం కూడా  మెంటల్ లేదు. పొలిటికల్‌గా మాత్రం కేటీఆర్ పెద్ద పిచ్చోడు.  అందుకే ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే మాటకి కరెక్ట్.గా  సూటవుతాడు. కేటీఆర్ పొలిటికల్ పిచ్చితనం గురించి  పదేళ్ళకు పైగానే అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారం  పోయిన తర్వాత ఆ పిచ్చితనం మరింతగా ప్రకోపించి పీక్స్.కి  చేరుకుంది. శుక్రవారం (ఏప్రిల్ 12)  ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కి  ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ విషయంలో  మరింత క్లారిటీ వచ్చింది.  ఇంటర్వ్యూ మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు కేటీఆర్  చెప్పిందే చెప్పి తన రాజకీయ వాచాలత్వాన్ని ప్రదర్శించారు.  ఫోన్ ట్యాపింగ్ వెనుక మీరు వున్నారా? అని అడిగితే నాకు  సంబంధం లేదు అని సమాధానం చెప్పి, అక్కడితో ఆగకుండా  పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రస్తావించి, వాళ్ళకి కూడా  సంబంధం వున్నట్టే కదా అంటారు. ఇదేం డొక్కులో లాజిక్కో  అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను లై డిలెక్టర్  పరీక్షకి రెడీ.. కానీ, నాతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ  అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా లై డిలెక్టర్ పరీక్షకి కూర్చోవాలి  అంటారు. అది కాదయ్యా, నువ్వొక్కడివే లై డిటెక్టర్ పరీక్ష  చేయించుకుని సుద్దపూసలా బయటపడొచ్చు కదా.. మధ్యలో  వాళ్ళనెందుకు లాగుతావు?   ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇంకా చాలా సెకలు ప్రదర్శించారు. ఫలానా సమయంలో ఫలానా వాళ్ళు ఫోన్  ట్యాపింగ్ చేశారు.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా  ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తెలంగాణ ఉద్యమ సమయంలో  కాంగ్రెస్ నాయకులే చేశారు అంటూ సోది చెప్పుకొచ్చారు. మీ  ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా అంటే మాత్రం చేసింది  లేదా చేయలేదు అని తేల్చకుండా, నాకు మాత్రం సంబంధం  లేదు అని అంటారు. అక్కడితో ఆగకుండా రేవంత్ రెడ్డి  ప్రభుత్వం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లను ట్యాప్ చేస్తోందని మాటమాటకీ  అన్నారు. ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడుతూ కేటీఆర్ చాలా  తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటూ వుండవచ్చు. కానీ  ఆయన మాట్లాడుతున్న తీరు ఆయన రాజకీయ అజ్ఞానాన్ని,  రాజకీయ అహంకారాన్ని స్పష్టంగా బయటపెట్టింది.   యాంకర్ ఏదైనా కీలకమైన ప్రశ్న అడిగితేచాలు... ఓ పేపర్ని కెమెరాకి చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు నెరవేర్చలేదని  రాగం అందుకున్నారు. మీకు అహంకారం ఎక్కువైపోయిందని  అందరూ అనుకుంటున్నారని అంటే, నేను అస్సలు  అహంకారినే కాదు అంటూ అహంకారంగా సమాధానం  చెప్పారు. అంచేత, ఎవరికైనా ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే  సినిమా తీయాలన్న ఇంట్రస్ట్ వుంటే కేటీఆర్ని  సంప్రదించవచ్చు.

కన్నీరు... కొంగుచాచడం.. ఏంటిది?

కడప పార్లమెంట్ స్థానానికి పోటీకి దిగి, జగనన్నతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన షర్మిల ప్రచారపర్వంలో వున్నారు. ఈ ప్రచారంలో భాగంగా షర్మిల తనను గెలిపించాలని ప్రజలను పావలా శాతం కోరుతూ, మిగతా ముప్పావలా శాతాన్ని జగనన్నని తిట్టడానికి వినియోగిస్తున్నారు. షర్మిలమ్మ పక్కనే వివేకా కుమార్త సునీత కూడా వుంటున్నారు. ఇద్దరూ కలసి జగనన్నని డబుల్ డోస్‌లో తిడుతున్నారు. తాజాగా పులివెందులలో ప్రచారానికి వెళ్ళిన షర్మిలమ్మ జగన్నని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. వివేకా హంతకుడికి మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు... పరిపాలన విషయంలో జగనన్న  పూర్తిగా ఫెయిలయ్యారని విమర్శించారు. అధికారం ఇస్తే తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని చెప్పిన జగన్, అధికారం వచ్చాక తండ్రి ఆశయాలను అటక ఎక్కించారని షర్మిల విమర్శించారు.. అంతేనా, పెండింగ్ ప్రాజెక్టుల మీద, మూడు రాజధానుల మీద, ఉద్యోగాల కల్పన మీద, తప్పిన హామీల మీద.. ఇలా చాలా పాయింట్ల మీద జగనన్న దుమ్ము దులిపి వదిలిపెట్టారు. టోటల్‌గా జగనన్న ‘పులివెందుల పిల్లి’ అని తేల్చేశారు. ఇంతవరకు బాగానే వుందిగానీ, ఆ తర్వాతే సిట్యుయేషన్లో మార్పు వచ్చింది. అప్పటి వరకు పులివెందుల సివంగిలా గర్జించిన షర్మిల సడెన్‌గా బేలగా మారిపోయారు. కన్నీరు పెట్టేసుకున్నారు.. దీనంగా మాట్లాడ్డం ప్రారంభించారు. కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను గెలిపించండి అని ప్రాధేయపడ్డారు. అసలు షర్మిల నుంచి ఇలాంటి బేలతనాన్ని ఊహించని పులివెందుల జనాలు బిత్తరపోయారు. అన్నని పులివెందుల పిల్లి అంటూ గర్జించిన షర్మిల ఇంతలోనే తానే  మ్యావ్ అనడమేంటా అని ఆశ్చర్యపోయారు. చూడమ్మా షర్మిలమ్మా... మొన్నటి వరకూ నేను తెలంగాణ కోడల్ని అని అక్కడ రాజకీయాల్లో హడావిడి చేసి, ఎన్నికల సమయంలో సైడైపోయావు. ఇప్పుడు ఏపీ కూతుర్ని అని అక్కడకి ఎంటరయ్యావు. అడ్రస్పే లేని కాంగ్రెస్ పార్టీకి చీఫ్ అయ్యావు. కడప పార్లమెంటు సీటుకి పోటీ చేయడం ద్వారా అన్నమీద పగ తీర్చుకునే అవకాశాన్ని పొందావు. నువ్వు గెలుస్తావా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, జగనన్నకి కంట్లో నలుసులా మారావనే పాయింట్ నిన్ను చాలామంది అభిమానించడానికి కారణమైంది. అలాంటి ఇప్పుడు నువ్విలా సడెన్‌గా బేలతనంలోకి జారిపోతే ఎలాగమ్మా? నీ దృష్టిలో జగనన్న పులివెందుల పిల్లే కానీ, మీ నాన్న మాత్రం పులివెందుల పులే కదా.. ఆ పులిబిడ్డలాగా పోరాటం చేసి, జగనన్నని ఓటమిపాలు చేయడంలో నీవంతు పాత్ర పోషించాలిగానీ, ఇలా బేలతనంతో బతిమాలుకోవడం ఏంటమ్మా?

తెలంగాణలో త్రిముఖ పోరు.. పై ‘చేయి’ ఎవరిది?

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో త్రిముఖ పోరు తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి ముందు వరకూ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో ఏ మేరకు పోటీ ఇస్తుందన్న అనుమానాలు రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవుతున్నాయి.  అసలే ఓటమి భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ పార్టీ భారీ వలసలతో  చిక్కి శల్యమైన పరిస్థితి ఉంది.   గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 39 శాతం ఓట్లు సంపాదించుకోగా, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బి.ఆర్‌.ఎస్‌ పార్టీ 37 శాతం ఓట్లతో ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ తన ఓటు శాతాన్ని ఏకంగా 14 శాతం పెంచుకోగలిగింది.  ఆ ఎన్నికల్లో 47 శాతం ఓట్లు సంపాదించుకున్న బి.ఆర్‌.ఎస్‌ పార్టీ దాదాపు 10 శాతం ఓట్లు కోల్పోయింది. అయితే  బి.ఆర్‌.ఎస్‌ ఓట్లలో అత్యధిక భాగం బీజేపీ, కాంగ్రెస్‌లకు వెళ్లిపోయినట్టు అర్థమవుతోంది. ఆదివాసీ ప్రాంతాల్లో చాలా భాగం ఓట్లను బీజేపీ చేజిక్కించుకోగా, ముస్లిం ఓట్లలో ఎక్కువ భాగాన్ని కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకుంది. బీఆర్ఎస్ ఓటమి తరువాత కె.సి.ఆర్‌ కు అత్యంత సన్నిహితులు, సలహాదార్లుగా గుర్తింపు పొందిన కడియం శ్రీహరి, కె. కేశవరావు వంటి  నాయకులు   పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం సహజంగానే బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో 9 సీట్లను, 42 శాతం ఓట్ల వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలన్న బి.ఆర్‌.ఎస్‌ లక్ష్యం నెరవేరే అవకాశాలు అంతగా కనిపించడం లేదు.  2018 ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన  బీజేపీ గత శాసనసభ ఎన్నికల్లో 14 శాతం ఓట్లను సాధించింది.  అంటే, ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బి.ఆర్‌.ఎస్‌ పార్టీలకు బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఎదురౌకావడం ఖాయం అని చెప్పవచ్చు.  దీనిని బట్టే తెలంగాణలో లోక్‌ సభ ఎన్ని కల్లో త్రిముఖ పోటీ  అనివార్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌  ఒవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మినహా రాష్ట్రంలోని ఇతర స్థానాల్లో ఆయన మద్దతుదార్లు ఎవరికి ఓటు వేస్తారన్నది కూడా కీలకమైన అంశమే. బీఆర్ఎస్ అధకారంలో ఉన్నంత కాలం ఎంఐఎం ఆ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరించింది. అయితే బీఆర్ఎస్ అధికారానికి దూరమైన తరువాత ఎంఐఎం కాంగ్రెస్ కు చేరువ అయినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద హైదరాబాద్ లోక్  సభ స్థానంలో ఎంఐఎం పట్టు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అన్నదానితో సంబంధం లేకుండా నిలుపుకోలదు. దీంతో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గాన్ని పక్కన పెట్టి మిగిలిన 17 లోక్ సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగే ముక్కోణపు పోటీలో ఎవరు పై ‘చేయి’ సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల మేరకు బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

అంతరిక్షంలో తోటకూర!

అంతరిక్షానికి వెళ్ళడం అంటే ఆషామాషీ విషయం కాదు.  అంతరిక్షానికి వెళ్ళాక తిరిగి వచ్చినా, రాకపోయినా కీర్తి మాత్రం  చరిత్రలో నిలిచిపోతుంది. అయితే అంతరిక్షానికి వెళ్ళే అవకాశం  మాత్రం చాలా చాలా చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది.  భారతీయులకైతే ఆ అవకాశం చాలా తక్కువ. గతంలో  కొంతమంది భారత మూలాలున్న అమెరికా పౌరులు  అంతరిక్షానికి వెళ్ళారు. అయితే, ఇప్పుడు నూటికి నూరు శాతం  భారతీయుడు.. అందులోనూ మన తెలుగు కుర్రాడు.. ఇంకా  చెప్పాలంటే విజయవాడ కుర్రాడు అంతరిక్షంలోకి  వెళ్ళబోతున్నాడు. అతని పేరు గోపీచంద్ తోటకూర. గోపీచంద్  వయసు మూడు పదులు. అట్లాంటాలో వున్న ప్రిజెర్వ్ లైఫ్  కార్న్ అనే ఒక వెల్‌నెస్ సంస్థకి గోపీచంద్ సహ  వ్యవస్థాపకుడిగా వున్నారు. ఇప్పుడు ఆయనకి అమెజాన్  వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కి చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ  అంతరిక్షానికి వెళ్ళే అవకాశాన్ని కల్పించింది. ఈ సంస్థ చేపట్టిన  ఎస్.ఎస్.25 మిషన్ అనే పేరుతో చేపట్టిన అంతరిక్ష యాత్రకు  ఆరుగురిని ఎంపిక చేసింది. వారిలో మన తెలుగు కుర్రాడు గోపీచంద్ తోటకూర ఒకడు. విజయవాడలో పుట్టి పెరిగిన గోపీచంద్ అమెరికాలో ఏరోనాటికల్ సైన్స్ లో బ్యాచ్‌లర్ డిగ్రీ  కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కమర్షియల్ జెట్ పైలెట్‌గా  పనిచేశాడు. ఫ్లైట్లు మాత్రమేనా... బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు,  సీ ప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా గోపీచంద్  పైలట్‌గా వ్యవహరించాడు. ఇంత టాలెంటెడ్ కాబట్టే గోపీచంద్‌కి  ఇప్పుడు అంతరిక్షానికి వెళ్ళే ఛాన్స్ దక్కింది. గోపీచంద్ అండ్  టీమ్ అంతరిక్షానికి ఎప్పుడు వెళ్తారనే తేదీ మాత్రం ఇంకా  కన్ఫమ్ కాలేదు. మొత్తానికి శభాషోయ్ తోటకూర!

అచ్చు తెలంగాణలోలాగే.. ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్!?

ఇప్పటి వరకూ తెలంగాణకే పరిమితం అనుకున్న ఫోన్ ట్యాపింగ్ ఏపీలో కూడా జరిగిందనీ, జరుగుతోందనీ తేలిపోయింది. స్వయంగా యాపిల్ సంస్థే లోకేష్ ఫోన్ కు పంపిన మెసేజ్ తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లోకేష్ ఉపయోగించే యాపిల్ ఐ ఫోన్ కు అయ్యా మీ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కు గురి అవుతోంది. అప్రమత్తం కండి అంటూ యాపిల్ సంస్థ నుంచే మెసేజ్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన  తెలుగుదేశం ఈ విషయాన్ని వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం ఎంపీ కనకమేడల ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో అందరి దృష్టీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై పడింది. ఒక్క లోకేష్ ఫోన్ మాత్రమే కాదు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరుల ఫోన్ లను జగన్ సర్కార్ ట్యాపింగ్ చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఎన్డీయే తరఫున తెలుగుదేశం ఎంపీ కనకమేడల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  కేసీఆర్ హయాంలో  తెలంగాణలో  విపక్ష నేతలు, సొంత పార్టీ నేతలు, సినిమా తారల ఫోన్లు ట్యాపింగ్ కు గురైయ్యాయన్న ఆరోపణల రచ్చ పలువురు పోలీసు అధికారుల అరెస్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే.  కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన  అధికారులనే ఫోన్ ట్యాపింగ్‌ చేసే పని కోసం ఎంపిక చేసుకున్న తీరు కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.  తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బీఆర్ఎస్ అగ్రనేతలు సహా పలువురికి   నోటీసులు   పంపే అవకాశాలున్నట్లు పోలీసువర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాధాకిషన్‌రావు సహా.. డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, కానిస్టేబుల్ అరెస్టయ్యారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో కూడా కలకలం సృష్టిస్తోంది.   తమ ఫోన్లను ఇన్చార్జి డీజీపీ, ఏడీజీతోపాటు అడిషనల్ ఎస్పీలు ట్యాపింగ్ చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఇటీవల బదిలీ అయిన ఐజీ కొల్లి రఘురామిరెడ్డి కూడా ఉన్నారంటూ ఎన్డీఏ కూటమి   ఈసీకి ఫిర్యాదు చేసింది.  ఈసీ ఆ ఫిర్యాదుపై ఇంకా దృష్టిసారించిందో లేదో కానీ తాజాగా లోకేష్ కు యాపిల్ సంస్థ స్వయంగా మీ ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ లకు గురౌతోందంటూ వచ్చిన సందేశం ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ధృవీకరించేసింది.   డీజీపీ, ఇంటలిజన్స్ చీఫ్, ఈ ట్యాపింగ్‌కు సహకరిస్తున్న అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలను తప్పించాలని  ఈసీపై తెలుగుదేశం కూటమి ఒత్తిడి తీసుకువస్తోంది.  అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్‌కుమార్ మీనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న భావనలో ఉన్న తెలుగుదేశం కూటమి.. ఎంపి కనకమేడల ద్వారా  ఢిల్లీ లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.  తాము వివిధ జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఐ, డీఎస్పీ, జాయింట్ కలెక్టర్లపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, మీనా స్పందించడం లేదని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అన్నిటికంటే, అందరి కంటే ముఖ్యంగా  బీజేపీ కూడా మీనా  తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే యాపిల్ సంస్థ నుంచి లోకేష్ పోన్ కు వచ్చిన ట్యాపింగ్, హ్యాకింగ్ సందేశం తెలుగు దేశం కూటమికిబలమైన అస్త్రంగా మారింది.  ఇప్పుడు కనకమేడల ఫిర్యాదుతో  కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా రంగంలోకి దిగే అవకాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల ఐఏఎస్-ఐపిఎస్‌లపై తీసుకున్న చర్యలు కూడా నేరుగా  కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతోనే జరిగాయని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి నేతల ఆరోపనలు, ఫిర్యాదులను బట్టి   తెలంగాణలో కేసీఆర్ సర్కారు  ఏవిధంగా ఫోన్ ట్యాపింగ్  కోసం  వెలమ సామాజికవర్గ అధికారులను ఉపయోగించుకుందో.. సరిగ్గా అలాగే ఏపీలో సీఎం జగన్ సర్కార్ కూడా   రెడ్డి సామాజికవర్గ అధికారులను ఫోన్ ట్యాపింగ్‌కు వాడుతోందని అర్ధమౌతుంది.   సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి, ఏడీజీ సీతారామాంజనేయులు, డీఎస్పీలయిన నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రవీంద్రారెడ్డి సహకారంతోనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్డీఏ కూటమి ఈసీకి ఫిర్యాదు చేసింది. వీరిలో సీతారామాంజనేయులు మినహా మిగిలినవారంతా రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం ఇందుకు నిదర్శనం. నిజానికి తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని మొట్టమొదట బయటపెట్టింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కావడం విశేషం.  మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగితే  తెలంగాణలోలాగే.. ఏపీలో కూడా కీలక అధికారులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. 

సజ్జలా... ఇక నోరు మూసెయ్!

ఏపీలో వున్నదే ఒక పనికిమాలిన, మంచి పనులు చేయడం చేతగాని చచ్చుపుచ్చు  ప్రభుత్వం. ఆ దిక్కుమాలిన ప్రభుత్వానికి పనీపాటా లేని సలహాదారులు 40 మంది.  వాళ్ళలో 9 మందికి క్యాబినెట్ హోదా.. వీళ్ళకి జీతాలు, భత్యాలు, బొంగు, భోషాణం. ఈ సలహాదారుల పదవుల్లో చేరిన రాజకీయ పరాన్నభుక్తులు జనం సొమ్ము భోంచేస్తున్నారు.  జనం సొమ్ము మింగటంతో ఆగకుండా జగన్‌కి ఏవోవో దిక్కుమాలిన సలహాలు ఇస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపారేశారు. ఆలిబాబా 40 దొంగలు అని ఎప్పుడో సినిమా చూశాం.. ఇప్పుడు ఏపీలో ఆలీబాబా 40 దొంగలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ దొంగల ముఠాకి నాయకుడిగా చెప్పుకోదగ్గ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి హద్దు, అదుపు వుండదు. టీడీపీ మీద విషం కక్కడానికి ఆయన రెడీగా వుంటారు. ప్రతిరోజూ జగన్ అందించిన విషాన్ని కడుపునిండా తాగడం.. ఆ విషయాన్ని మీడియా ముందుకు వచ్చికక్కడం ఆయన దినచర్య.  ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ, సలహాదారులు అనే పదం వింటేనే జనం చిరాకుపడిపోయే పరిస్థితి తీసుకొచ్చిన వారిలో సజ్జలవారు అగ్రగణ్యులు. సరే, జగన్ తిట్టమంటారు.. సజ్జలవారు తిడతారు. గతంలో ఈ  తంతు జనం భరించారు.. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో  వున్నప్పుడు కూడా సజ్జల వైసీపీ కార్యకర్తలా వ్యవహరించడమేంటి?  ప్రతిపక్షాలను తిట్టడమేంటి? తినేది  జనం సొమ్ము... ఊడిగం చేసేది వైసీపీ పార్టీకా? ఇదే ప్రశ్న  జనంలో ఎప్పటినుంచో వుంది.. శంఖంలో పోస్తేనే తీర్థం  అవుతుందన్నట్టుగా ఇప్పుడు ఇదే ప్రశ్న ఎన్నికల కమిషనర్  మీనా నుంచి సజ్జలకు ఎదురైంది. ఏవయ్యా పెద్దమనిషీ,  ప్రభుత్వం సొమ్ముతింటూ వైసీపీ తరఫున   మాట్లాడుతున్నావేంటి అని ఎన్నికల కమిషన్ ప్రశ్నించేసరికి  సజ్జల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ప్రభుత్వ  సలహాదారు హోదాలో గీత దాటిన సజ్జలతోపాటు మొత్తం 40  దొంగల మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్  భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి మిస్టర్ సజ్జలా.. ఇకనైనా  నోరు మూసెయ్... ఎన్నికల కమిషన్ అక్షింతలు వేసినప్పటికీ  నోరు మూసుకోవడం కష్టంగా అనిపిస్తే, అర్జెంటుగా తమరి  సలహాదారు పదవికి రాజీనామా సమర్పించెయ్. ఆ తర్వాత  వైపీసీ కూలీ హోదాలో తమరి ఇష్టమొచ్చినట్టు  మాట్లాడుకోవచ్చు.

వాలంటీర్లందరూ వైపీపీ కార్యకర్తలే.. ఒప్పేసుకున్న ధర్మాన

ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పినా అది నిజం అయ్యే అవకాశం లేదు. వాలంటీర్ల విషయంలో వైసీపీ ఎంత మొత్తుకున్నా.. ఎవరూ వారు ప్రభుత్వోద్యోగులని నమ్మడం లేదు. వాళ్లు వైసీపీ కార్యకర్తలేనని చెబుతున్నారు. అంతెందుకు వైసీపీ నేతలు, మంత్రులు కూడా వాలంటీర్లంతా మనవాళ్లేనని బహిరంగ సభల్లో చెబుతున్నారు. మనం చెప్పినట్లు వినే వాళ్లే ఉంటారు. లేని వాళ్లను తొలగించి వేరొకరిని నియమించుకుందామని గతంలో ఒక సారి మంత్రి అంబటిరాంబాబు వైసీపీ శ్రేణుల సదస్సులో బాహాటంగానే చెప్పేశారు. అలాంటి వాలంటీర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటే మాత్రం అధికార పార్టీ నేతలకు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. అవ్వా తాతలకు ఇంటి వద్దకు పెన్షన్ అందడం విపక్ష తెలుగుదేశం జీర్ణించుకోలేకపోతోందనీ, అందుకే వాలంటీర్లపై ఫిర్యాదులు చేసి వారిని పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టేలా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చిందనీ గగ్గోలు పెట్టేసింది. ప్రభుత్వ సిబ్బంది చేత పెన్షన్లను పంపిణీ చేయించాలనీ, వృద్ధులకు ఇళ్లవద్దే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కోర్టులు చెప్పినప్పటికీ వృద్ధుల ఉసురు పోయేలా పెన్షన్ల పంపిణీని అస్తవ్యస్తం చేసి... శవరాజకీయం చేయడానికి కూడా వైసీపీ నేతలు వెనుకాడలేదు. చివరికి జనాలకు వాస్తవం తెలిసిపోయిందని గ్రహించి వైసీపీ చేసేదేం లేక మౌనం వహించాల్సి వచ్చింది. అయినా వాలంటీర్ల విషయంలో ఆ పార్టీ ఆశలు ఇంకా చావ లేదు. వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి.. వారి సేవలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని ఎత్తులు వేసింది. తమ ప్రభుత్వం రాగానే మళ్లీ వాలంటీర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామనీ ఊదరగొట్టింది. అయినా అతి తక్కువ మంది వాలంటీర్లు మాత్రమే రాజీనామాలు చేయడంతో ఇక ఎన్నికల ప్రచార సభా వేదికలపై నుంచి వారికి రాజీనామాలు చేసి వైసీపీకి పని చేయాలని పిలుపునివ్వడం మొదలెట్టింది.  అయితే అబద్ధాలు చెప్పే వాళ్లకి జ్ణాపకశక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ అబద్ధం చెప్పారో గుర్తు లేకపోతే మంత్రి ధర్మాన ప్రసాదరావులా నవ్వుల పాలు కావలసి ఉంటింది. ఎన్నికల సంఘానికీ, కోర్టులకూ వాలంటీర్లు వైసీపీకి చెందిన వారు కారనీ, వారు ఉద్యోగులనీ, పెన్షన్ల పంపిణీ కోసం వారిని వినియోగించుకుంటున్నామనీ పదే పదే చెప్పిన సంగతి మరచిపోయి ఆయన తాజాగా శ్రీకాకుళంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని చెప్పుకొచ్చారు. అలా చెప్పి వారిని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించారు. వాలంటీర్లంతా రాజీనామా చేసి ఎన్నికలలో వైసీపీ విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.   అంతే కాదు వైసీపీ మోడ్ ఆఫ్ అపరెండీ ఎలా ఉంటుందో కూడా ధర్మాన ఆ సమావేశంలో పూసగుచ్చినట్లు చెప్పేశారు. ఎన్నికలలోనే కదా మనం ఓటర్లకు కనిపించేది. మళ్లీ ఐదేళ్ల వరకూ వారి వద్దకు వెళ్లం. మన వాలంటీర్లు అలా కాదు ప్రతి 50 గృహాలకూ ఒకరిని కేటాయించాం కనుక వారి సేవలు ఇప్పుడు మనకు అవసరం. అందుకే వాలంటీర్లందరినీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకోవాలని ధర్మాన చెప్పారు. ఒక వేళ అలా చేయడానికి నిబంధనలు అడ్డు వస్తాయంటే వారందరి చేతా రాజీనామాలు చేయించేయండి. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాకా వారిని ఏం చేయాలో ఆలోచిద్దాం అని బాహాటంగానే చెప్పేశారు.   అయినా ఇంత కాలంగా వైసీపీ హయాంలో వాలంటీర్లుగా పని చేస్తున్న వారందరికీ జగన్ పార్టీ తీరు తెన్నూ బాగానే అర్ధమైంది. అందుకే పార్టీ అధినేత సహా కీలక నేతలంతా వాలంటీర్లను రాజీనామా చేయమని హుకుంల మీద హుకుంలు జారీ చేస్తున్నా అతి తక్కువ మంది తప్ప ఎవరూ రాజీనామా చేయడానికి ముందుకు రావడం లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం తాము వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటామని తెగేసి చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే ప్రశ్నే లేదనీ, వారి సేవలను తమ ప్రభుత్వంలో మంచి పనుల కోసం వినియోగించుకుంటామనీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన తరువాత వారికి తత్వం బోధపడింది. ఇంత కాలం తమను జగన్ సర్కార్ వెట్టి చాకిరీ కోసం ఎలా వాడుకుందో అర్ధమైంది. అందుకే రాజీనామాలు చేయం, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించం అని తెగేసి చెబుతున్నారు. కొందరైతే అధికార పార్టీ  ఒత్తిడులకు తట్టుకోలేక రాజీనామాలు చేసినా వెంటనే తెలుగుదేశం గూటికి చేరు తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక పార్టీ  శ్రేణులను వాలంటీర్లపైకి రెచ్చగొట్టి వారిని వేధించే కార్యక్రమానికి వైసీపీ నేతలు రెడీ అయిపోయారని తాజాగా మంత్రి ధర్మాన మాటలను బట్టి అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 12) శ్రీవారిని మొత్తం 63వేల 163 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31 వేల 287 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2కోట్ల 99 లక్షల రూపాయలు వచ్చింది. ఇక శనివారం శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండపోయి క్యూలైన్ బయటి వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్స్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. 

బాబును కలిసిన కోడికత్తి శ్రీను.. కూటమి విజయం కోసం పాటుపడతానని వెల్లడి

జగన్ బాధితులంతా బయటకు వస్తున్నారు. జగన్ అరాచకాలను, ఆయన హయాంలో తమకు ఎదురైన వైధింపులను బహిర్గతం చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య విషయంలో జగన్ తీరును, నిందితులకు మద్దతుగా ఆయన చేసిన అధికార దుర్వినియోగాన్ని ఇప్పటికే వివేకా కుమార్తె సునీత, జగన్ స్వంత చెల్లెలు షర్మిల ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు. ఇప్పుడు ఇక కోడి కత్తి శ్రీను కూడా బయటకు వచ్చారు. గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాలలో సంభవించిన అతి పెద్ద ట్విస్టులలో కోడికత్తి కేసు కూడా ఒకటి. కోడికత్తి జగన్ మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందన్నది పక్కన పెడితే.. ఈ దాడిని సానుభూతిగా మలచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో  సక్సెస్ అయ్యారు. ఈ కేసు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మెడకి చుట్టాలని యత్నించి అప్పటి సీఎం చంద్రబాబు, తెలుగుదేశం నేతలు కలిసి కుట్ర పన్ని జగన్ పై హత్యాయత్నం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ దాడి వెనక ఎవరున్నారో తేల్చాలని వైసీపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ఆ తర్వాత వైసీపీ గెలిచినా ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు.ఈ కేసులో నిందితుడు కోడి కత్తి శీను దోషా.. లేక అసలు కుట్ర దారులు ఎవరైనా ఉన్నారా అన్నది కూడా తేల్చలేదు.  ఈ కేసులో   ఐదేళ్లు  శీను జైల్లోనే మగ్గాడు. కోర్టు ఈ కేసు విచారణకి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే జైల్లోనే శ్రీను నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆ మధ్య  అతని లాయర్ ప్రకటించారు. దీంతో ఈ కేసు విచారణ క్లైమ్యాక్స్ కు చేరుకుంటుందని, అసలు దోషులు ఎవరో తేలిపోతారనీ అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా కేసు విచారణను  విశాఖకు మార్చారు.  దాదాపు అదే సమయంలో ఈ కేసులో  జగన్‌  రెండు పిటిషన్లను దాఖలు చేశారు. కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్‌ కమిషన్‌ను నియమించడం గానీ, వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా విచారించాలని రెండో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌తో పాటు నిందితుడు శ్రీనుకి బెయిల్‌ ఇవ్వకూడదని ఎన్ఐఏ మరో పిటిషన్ దాఖలు చేసింది.   దాడి జరిగి ఐదేళ్లయినా కేసు విచారణ ఇంకా నత్తకి మేనత్తలానే సాగింది.  కేసు విచారణను పూర్తిచేసి ఆధారాలుంటే నిందితుడికి శిక్ష వేయాలి.. లేదా సరైన ఆధారాలు లేవని అనుకుంటే నిర్దోషిగా విడుదలైనా చేయాలి. ఒకవేళ రెండూ కూడా బాగా ఆలస్యమవుతుందని అనుకుంటే కనీసం నిందితుడికి బెయిల్ అయినా ఇచ్చి విచారణ కొనసాగించాలి. కానీ, ఈ కేసులో అవేమీ లేవు. వైఎస్ జగన్ కేసు విచారణకి హాజరు కావడం లేదు. ఈ కేసు విచారణ పూర్తి కాకూడదన్న ఉద్దేశంతో  తెర వెనక శక్తులు పనిచేస్తున్నాయని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఒకవైపు  వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపిన కేసులో నిందితులుగా, కుట్ర దారులగా సీబీఐ పేర్కొన్న వారు బెయిల్ మీద దర్జాగా బయట తిరుగుతుంటే.. కత్తి చేతి మీద గీసిన కోడి కత్తి  కేసులో నిందితుడిని ఐదేళ్లు   మగ్గడం విశేషం. కోడికత్తి నిందితుడు బయటకొస్తే సమాజానికి మంచిది కాదని భావిస్తే.. ఇక వివేకా హత్యకేసు నిందితులకు బయట తిరిగే హక్కు ఎక్కడ ఉంది?అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. సరే ఎలాగైతేనేం కోడి కత్తి శీనుకు విశాఖ ఎన్ఐఏ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే కేసు విచారణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అది పక్కన పెడితే.. ఇప్పుడు ఎన్నికల వేళ జగన్ బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను బాహాటంగా చెబుతున్నారు. వివేకా హత్య కేసు విషయంలో ఇప్పటికే డాక్టర్ సునీత, షర్మిలలు నేరుగా అవినాష్ రెడ్డిని వేలెత్తి చూపుతూ.. అటువంటి వ్యక్తికి మద్దతుగా నిలిచిన జగన్ ను ఓడించాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. కోడికత్తి శీను కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అంబాజీపేట ప్రజా గళం సభలో న్యాయవాది గుణ్ణం వీర వెంకట సత్య నారాయణ సహకారంతో శ్రీను బాబును కలిశారు. సభా వేదిక హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన బస్సులో చంద్రబాబుతో కోడి కత్తి శ్రీను భేటీ అయ్యారు. కోడి కత్తి కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ తరువాత శ్రీను తల్లి సావిత్రి తెలిపారు. కాగా, కోనసీమ ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కూడా బాబుకు వివరించినట్లు శ్రీను తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం  కూటమి విజయానికి  తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని కోడికత్తి శ్రీను మీడియాతో చెప్పారు. జగన్ విజయం కోసం, ఆయనకు సానుభూతి వస్తుందన్న ఉద్దేశంతోనే తాను ఆ నాడు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై ఉత్తుత్తి దాడి చేశానని విచారణ సందర్భంగా కోడికత్తి శ్రీను చెప్పిన సంగతి తెలిసిందే. 

అమ్మా.. విజయమ్మా.. బతికిపోయావమ్మా!

నమస్తే విజయమ్మా... అమెరికా ప్రయాణం బాగా జరిగిందా?  ఏంటోనమ్మా ఈ అనుకోని ప్రయాణం. మీతోపాటు ఆంధ్రప్రదేశ్  ప్రజలెవరూ ఈ త్రిప్పటని ఊహించలేకపోయారు. సాధారణంగా ఉగాది రోజున రాశి ఫలాలు చదువుతున్నప్పుడు  ఊహించని ప్రయాణాలను త్రిప్పట అనే పదంతో  పేర్కొనడం కనిపిస్తూ వుంటుంది. అదేంటో, నీకు ఉగాది రోజనే  ఈ  త్రిప్పట  ఏర్పడింది. ఇవాళో రేపో షర్మిలమ్మ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటావని అందరూ అనుకుంటున్న సమయంలో ఇది ఊహించని పరిణామమేనమ్మా. నీ మద్దతు  మొదటి నుంచి షర్మిలమ్మకి వుంది. నీ ఆశీస్సులతోనే షర్మిలమ్మ జగనన్నకి వ్యతిరేకంగా ముందడుగు వేసింది.  ఇప్పుడు జగనన్న మీద పూర్తి స్థాయి పోరాటానికి పాపం  ఆడపిల్ల సిద్ధమైన వేళ కన్నతల్లివైన నువ్వు తోడుగా  లేకపోవడం ఎంత లోటో నీకూ తెలుసు. అయినా ఏం చేస్తాంలేమ్మా.. ఇటు అమాయకపు కూతురు.. అటు  ఆరితేరిపోయిన కొడుకు. నీ మనసులో ఇటు వెళ్ళాలని  వున్నా, అటు వున్న వ్యక్తి ఊరుకోని పరిస్థితి. అమ్మ ఎవరికైనా  అమ్మ అంటారు. నువ్వు మాత్రం ఇప్పుడు అమెరికా  ప్రయాణానికి ఒప్పుకోవడం ద్వారా జగన్‌కి మాత్రమే అమ్మ అని  అందరూ అనుకునే అవకాశం ఇచ్చావు కదమ్మా.  విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, కడపలో పోటీ  చేస్తున్న మన షర్మిలమ్మకి అనుకూలంగా ప్రచారం చేయాలని  నువ్వు అనుకున్నావంటగా? దానికి జగనన్న నీ మీద  సీరియస్ అయ్యాడంటగా? నువ్వు వైసీపీకి ప్రచారం  చేయాల్సిందేనని పట్టు పట్టాడంటగా? నువ్వు ఏం చేయాలో  అర్థం కాని పరిస్థితిలో వుండగా, నువ్వు నాకు ప్రచారం  చేయొద్దు, షర్మిలకు ప్రచారం చేయొద్దు మధ్యే మార్గంగా  అమెరికా వెళ్ళిపో అనే ఆఫర్ జగనన్న తేవడంతో ఇక చేసేదేమీ  లేక అమెరికా బాట పట్టావంటగా? అంతేలేమ్మ... నువ్వు మాత్రం ఏం చేయగలవ్? కొడుకు, కూతురు మధ్య  నలిగిపోకుండా అమెరికా వెళ్ళి బతికిపోయావ్. ఇక్కడే వుంటే ఇద్దరి మధ్య పోరాటం చూసి ఇంకా బాధపడాల్సి వచ్చేది.   సరేలే, ఎలాగూ ఎండాకాలం.. చక్కగా ఎలక్షన్లు అయ్యే వరకు  అమెరికాలోనే చల్లగా వుండమ్మా. ఎలక్షన్లు పూర్తయిన తర్వాత  ఇక్కడ ఎలాగూ ప్రభుత్వం మారిపోతుంది. వర్షాలు కూడా  మొదలవుతాయి. అప్పుడు చల్లటి ఆంధ్రప్రదేశ్‌లోకి హాయిగా  రావమ్మా విజయమ్మా!

ముస్లిమ్స్ చేతిలో వైసీపీ మటాష్!

ఒక్కసారి గూగుల్ తల్లి దగ్గరకి వెళ్ళి మోస్ట్ కరప్ట్ చీఫ్ మినిస్టర్ (most corrupt chief minister) అని టైప్ చేసి చూడండి.. ఆ తల్లి అందరికంటే ఫస్ట్ ప్లస్‌లో ఏ తండ్రిని చూపిస్తుందో చూడండి.  అదలా వుంచితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింలను దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు అని రాష్ట్రంలో ఏ ముస్లింని అడిగినా వినిపించే ఒకే ఒక పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల ప్రచార సందర్భంగా, అలాగే ఈ ఐదేళ్ళ పదవీ కాలంలో ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు కోటలు దాటిపోయాయి. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.  జగన్ ప్రతిపక్షంలో వుండగా ముస్లింలకు తమ ఉత్తుత్తి హామీలతో 70 ఎం.ఎం. సినిమా చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ముస్లిం యువతుల వివాహానికి ‘షాదీ తోఫా’ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రికి ఆ పథకం గుర్తొచ్చింది. ఇంకా ఈ పథకం అమలు విషయంలో కూడా అంతా అయోమయమే. మనవాళ్ళు.. పరాయివాళ్ళు అనే భేదం షరా మామూలే. ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు చెప్పిన మాటలు,  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ గాల్లో కలిసిపోయాయి. పాత హామీలు నెరవేర్చలేదు... కొత్తగా ఏ పథకమూ ప్రవేశపెట్టలేదు.ముస్లింల విషయంలో జగన్ చెప్పిన ఒక పెద్ద అబద్ధం ‘రంజాన్ తోఫా’. తెలుగుదేశం ప్రభుత్వం ఏటా నాలుగు లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించేది. జగన్ వచ్చాక తోఫా ఇవ్వకుండా ధోకా ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో ముస్లిం, మైనారిటీ విద్యార్థులకు ఏటా ఐదు వేల వరకు స్కాలర్‌షిప్ అందేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ షిప్పు మునిగిపోయింది. ఉర్దూకు ద్వితీయ భాష హోదా ఇస్తానని జగన్ చేసిన బాస నీటిమీద రాత అయిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం ఉర్దూ పాఠశాలలను అభివృద్ధి చేసింది లేదు. ఉర్దూ టీచర్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసిందీ లేదు. టీడీపీ ప్రభుత్వం ఉర్దూ అకాడమీ ద్వారా ప్రతి ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులకు 5 వేల నుంచి 10 వేల వరకు ప్రోత్సాహక నగదు ఇచ్చేది. మన జగనన్న వచ్చాక ఆ ప్రోత్సాహక పథకం నిరుత్సాహంలో పడిపోయింది. ఇక వక్ఫ్ భూములను వైసీపీ  నాయకులు గుటకాయస్వాహా చేయడం అనే సంగతి సరేసరి. ఇలా ఏరకంగా చూసి  జగన్ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు తీరని అన్యాయమే జరిగింది. అందుకే ఈసారి వైసీపీని మటాష్ చేయడానికి, జగన్ అండ్ కంపెనీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ముస్లింలు రెడీగా వున్నారు.

క్రోధులకు బుద్ధి చెప్పే శ్రీ క్రోధి

ఇది శ్రీ కోధి నామ సంవత్సరం. క్రోధి అని పేరు వుండేసరికి జనానికి క్రోధం గుర్తొస్తుంది. ఈ సంవత్సరం జనం మీద క్రోధంగా వ్యవహరిస్తుందా అనే సందేహాలు చాలామందికి కలగడం సహజం. అయితే పండితులు చెప్పేది ఏమిటంటే, శ్రీ క్రోధి నామ సంవత్సరం అందరి మీదా క్రోధాన్ని ప్రదర్శించదు.. క్రోధంతో వ్యవహరించేవారి మీద మాత్రం క్రోధంగా వ్యవహరిస్తుంది.. అంటే, కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ వివరణ ఏపీ ప్రజలకు  ఆనందం కలిగించే విషయం. ఐదేళ్ళ నుంచి ప్రజలు వైసీపీ క్రోధుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే వున్నారు. గత ఎన్నికల సందర్భంగా పెచ్చుమీరిపోయిన వైసీపీ వర్గాల క్రోధపు పనులు అధికారంలోకి వచ్చాక మరింత పెరిగిపోయాయి. ప్రతిపక్షాలకు చెందిన వారి విషయంలో క్రోధంగా వ్యవహరించడం, ఇంతవరకు రాజకీయ రంగంలో ఎప్పుడూ లేని విధంగా అకారణ కోపాన్ని ప్రదర్శించడం చూశాం. వీరి క్రోధం రాజకీయాల వరకు ఆగిపోకుండా ఇళ్ళలో వుండే మహిళల వరకూ వెళ్ళడం గమనించాం. శ్రీ క్రోధి నామ  సంవత్సరం పుణ్యమా అని ఈ క్రోధపు బ్యాచ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి విముక్తి కలిగితే అంతకంటే కావల్సింది ఏముంటుంది?

25న పులివెందులలో జగన్ నామినేషన్ 

21 రోజుల పాటు బస్సు యాత్రను నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇంకో వారం రోజుల్లో బస్సు యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగింపు సభలో ప్రసంగించేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది వైఎస్ఆర్సీపీ. అనంతరం వైఎస్ జగన్ కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21, 22 తేదీల్లో తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. 25వ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని చెబుతున్నారు. ఈ మేరకు కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పర్యటనలను నిర్వహిస్తారు. మే 11వ తేదీన ఎన్నికల ప్రచారానికి తెర పడేంత వరకూ కూడా 175 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళికను జగన్ రూపొందించుకున్నారు. పులివెందుల నియోజకవర్గం ప్రచార బాధ్యతలను ఆయన భార్య వైఎస్ భారతి తీసుకుంటారు. కడప లోక్‌సభ పరిధిలోని పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతి విస్తృతంగా పర్యటిస్తారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తారు.  

గెలుపు ఆశలు ఆవిరి.. అభ్యర్థుల మార్పుపై వైసీపీ మళ్లీ మల్లగుల్లాలు!

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరిగిపోతున్నది. విజయావకాశాలపై నమ్మకం కోల్పోవడంతో దింపుడు కళ్లెం ఆశగా ఆ పార్టీ మరోసారి అభ్యర్థుల మార్పుపై దృష్టి సారించింది. వైసీపీ గెలుపు అవకాశాలు రోజురోజుకూ దిగజారిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా వెలువడుతున్న సర్వేలలో కూడా ఆ పరిస్థితి కనిపిస్తున్నది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని తాజాగా జన్మత్ సర్వే పేర్కొంది. దీంతో విజయంపై ఇంత కాలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్న వైసీపీ   ఇప్పుడు పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చి అయినా సరే వ్యతిరేకతను తగ్గించుకోవాలన్న భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది.   ప్రధానంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని మార్చాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీలో ఉండటంతో వైసీపీకి భారీ నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో అవినాష్ పోటీలో ఉంటే వైసీపీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమన్న విశ్లేషణల నేపథ్యంలో  ఆయనను మార్చేసే విషయాన్ని జగన్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా  జగన్  పోటీ చేసే పులివెందుల నియోజకవర్గం కడప లోక్ సభ పరిధిలో ఉండటంతో అవినాష్ కడప నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం పులివెందులపై కూడా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆందోళనతో జగన్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి  ఆయన స్థానంలో అభిషేక్ రెడ్డిని నిలిపే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు నేడో రేపో అధికారికంగా ప్రకటించే  ఛాన్సస్ ఉన్నాయని చెబుతున్నారు.   అదే విధంగా  ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో అభ్యర్థుల మార్పుపై కూడా వైసీపీ హైకమాండ్ అంటే జగన్ ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.  మైలవరంలో సర్నాల తిరుపతిరావు స్థానంలో ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని  పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  మైలవరం తెలుగుదేశం అభ్యర్థి  వసంతకృష్ణ ప్రసాద్‌కు గట్టి పోటీ అయినా ఇవ్వాలంటే ఈ మార్పు తప్పదని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే  విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి షేక్ ఆసిఫ్ స్థానంలో ఇటీవలే జనసేన నుండి వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన పోతిన మహేష్‌ను భర్తీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక గుంటూరు పశ్చిమ  అభ్యర్థి కిలారి రోశయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపి, ఆ స్థానానికి మరో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.  మొత్తం మీద పలు నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పుపై వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరో వైపు తెలుగుదేశం కూటమిలో సీట్ల సర్దుబాటు సజావుగా పూర్తి అయ్యి, ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. అధికార వైసీపీలో కీలక నియోజకవర్గాలలో ఇంకా అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి రాలేక మల్లగుల్లాలు పడుతుండటం, ప్రకటించిన అభ్యర్థుల స్థానంలో మరొకరిని పోటీకి దించే అవకాశాలపై పార్టీలోనే చర్చ జరుగుతుండటంతో  పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. దీంతో ఆ పార్టీ ప్రచారం నత్తనడకన సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వేదాలు వల్లిస్తున్న బీఆర్ఎస్ దెయ్యాలు!

‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ అనే సామెత అందరికీ  తెలిసిందే. ఇప్పుడు ఆ సామెత బీఆర్ఎస్ దెయ్యాలకు... సారీ  బిఆర్ఎస్ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఈమధ్యకాలంలో చాలామంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కారాలూ మిరియాలు నూరుతున్నారు. ఇలా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం నీతి బాహ్యమైన చర్య అని ఆక్రోశిస్తున్నారు. ఇలా పార్టీలు మారడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అని, ప్రజాస్వామ్యానికే గొడ్డలివేటు అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ ప్రెస్ మీట్లు ఎవరైనా అమాయకులు చూశారంటే అయ్యోపాపం అని జాలిపడతారు. కాంగ్రెస్ పార్టీ దారుణం చేస్తోందని కోపగిస్తారు. అయితే ఇక్కడ వెరైటీ ఏమిటంటే, పార్టీ ఫిరాయింపుల విషయంలో నీతులు వల్లిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరెవరో కాదు.. గతంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీదో, టీడీపీ టిక్కెట్ మీదో గెలిచి ఎమ్మెల్యేలు అయి, ఆ తర్వాత అప్పటి టిఆర్‌ఎస్‌లో  చేరిపోయిన ప్రబుద్ధులే. అప్పట్లో నిర్దాక్షిణ్యంగా పార్టీ మారిపోయిన ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇలా సంప్రదాయినీ, సుప్పినీ, సుద్దపూసనీ అన్నట్టుగా నీతులు చెబుతూ వుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఎర్రబెల్లి దయాకర్, కె.పి.వివేకానంద... ఇలా గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. రాజకీయాల్లో ఇంకా వెరైటీ ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా చేరిపోతారు. ఇలాంటి కప్పల తక్కెడ రాజకీయాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోవడం మానేసి చాలాకాలం అయింది.