వాలంటీర్ల‌కు జ‌గ‌న్‌ షాక్.. బాబు భరోసా!

వాలంటీర్ల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షాకిస్తే.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు భరోసా ఇచ్చారు.  ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ వేళ ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ.. వారి సేవ‌ల‌ను త‌ప్పుడు ప‌ద్ద‌తుల్లో వినియోగించుకుంటున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. వాలంటీర్ల స‌హాయంతో ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటా సేక‌రిచ‌డంతోపాటు, వారిని వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా జ‌గ‌న్‌ మార్చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వారిని పార్టీ ప్ర‌చారానికి ఉప‌యోగించుకొని ల‌బ్ధిపొందాల‌ని జ‌గ‌న్ కుట్ర‌ చేశారు. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వైసీపీ కుట్ర‌ల‌కు చెక్‌ పెట్టింది. వాలంటీర్ల సేవ‌ల‌ను ఎన్నిక‌ల కోడ్ పూర్త‌య్యే వ‌ర‌కు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్ణ‌యంతో షాక్ కు గురైన వైసీపీ అధిష్టానం.. కొత్త కుట్ర‌కు తెర‌లేపింది. వాలంటీర్లంద‌రినీ రాజీనామా చేయించి పార్టీ ప్ర‌చారంలో వాడుకోవాల‌ని వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేశారు. కొంద‌రు వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేయ‌గా.. మెజార్టీ వాలంటీర్లు ఇదంతా వైసీపీ కుట్ర‌లో భాగ‌మ‌ని గుర్తించి రాజీనామాకు స‌సేమిరా అన్నారు. అయితే  రాజీనామా చేయ‌ని వారిని మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చాక తొల‌గిస్తామ‌న్న బెదిరింపుల‌కు  వైసీపీ నేత‌లు దిగారు. దీంతో ఆందోళ‌న‌లో ఉన్న వాలంటీర్ల‌కు చంద్ర‌బాబు నాయుడు అండ‌గా నిలిచారు. దీంతో వాలంటీర్ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఏపీలో వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై పెద్దచ‌ర్చే జ‌రుగుతుంది. ఇటీవ‌ల‌ ఎన్నిక‌ల సంఘం వాలంటీర్ల‌ను  పెన్షన్ల పంపిణీ కి దూరంగా ఉంచాలని ఆదేశించింది. వారికి ప్ర‌భుత్వం ఇచ్చిన ట్యాబ్ లు, సెల్ ఫోన్లు వెన‌క్కు తీసుకుంది. ఇత‌ర మార్గాల ద్వారా వృద్ధుల‌కు ఇంటివ‌ద్ద‌కే వెళ్లి పెన్ష‌న్ ఇవ్వాల‌ని  ఆదేశించింది. దీంతో వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారంతో ల‌బ్ధిపొందాల‌ని చూసింది. వృద్ధుల‌కు పెన్ష‌న్లు ఇవ్వ‌కుండా తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీల కూట‌మి పెన్షన్ల పంపిణీని అడ్డుకుంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. వృద్ధుల‌కు, న‌డ‌వ‌లేని వారికి ఇళ్ల‌కు వెళ్లి పెన్ష‌న్ అందించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించినా.. ఆ ఆదేశాల‌ను అధికారులు ప‌క్క‌న పెట్టారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెన్ష‌న్లు ఇవ్వ‌కుండా అడ్డుకున్నారంటూ వైసీపీ నేత‌లు అస‌త్య ప్ర‌చారాన్నిచేశారు. దీనికితోడు.. చంద్ర‌బాబు ఫిర్యాదుతోనే స‌చివాల‌యం వ‌ద్ద‌నే పెన్ష‌న్లు ఇవ్వాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించిందంటూ వృద్ధుల‌ను మండుటెండ‌లో మంచాల‌పై పెన్ష‌న్ కోసం తీసుకెళ్లి, ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా, వైసీపీ అనుకూల మీడియాలో విస్తృత ప్ర‌చారం చేశారు. త‌ద్వారా కూట‌మి అధికారంలోకి వ‌స్తే వృద్ధులు, పెన్ష‌న్ దారుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. వైసీపీ నేత‌ల త‌ప్పుడు ప్ర‌చారం వ‌ల్ల పెన్ష‌న్ కోసం మండుటెండ్ల‌లో వెళ్లి ప‌దుల సంఖ్య‌లో వృద్ధులు మ‌ర‌ణించారు. ఒక‌ప‌క్క ఎన్నికల సంఘం వృద్ధుల‌కు, న‌డ‌వ‌లేని వారికి ఇంటింటికి వెళ్లి పెన్ష‌న్ ఇవ్వాల‌ని ఆదేశిలిచ్చినా, త‌ప్పుడు ప్ర‌చారంలో వైసీపీ ల‌బ్ధిపొందాల‌ని చూసింది. వైసీపీ కుట్ర‌లు ప్ర‌జ‌ల‌కు అర్ధంకావ‌టంతో మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భావించి వైసీపీ ఆ  డ్రామాకు స్వ‌స్తి చెప్పింది. వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను వైసీపీ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి త‌ప్పుడు ప‌నుల‌కుకూడా ఉప‌యోగించుకుంది. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటాను సేక‌రించ‌డంతోపాటు, పెన్ష‌న్ దారులుపై వైసీపీకే ఓటు వేయాల‌ని ఒత్తిడి తెచ్చారు. దీంతో  వైసీపీ సానుభూతి ప‌రుల‌కు మాత్ర‌మే పెన్ష‌న్లు ఇస్తూ  తెలుగుదేశం, జ‌న‌సేన సానుభూతి ప‌రుల‌కు పెన్ష‌న్లు రాకుండా ఇబ్బందులు పాలుచేశారు. ఆది నుంచి వాలంటీర్లు అంటే వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా ముద్ర‌ప‌డిపోయారు. దీంతో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుబ‌డుతూ వ‌చ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యంతో వాలంటీర్లు రాజీనామా చేయాలంటూ వైసీపీ నేత‌లు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామా చేయ‌ని వాలంటీర్ల‌ను మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తామంటూ బెదిరింపుల‌కు  దిగుతున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు వాలంటీర్ల‌కు భ‌రోసా ఇచ్చారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు నెల‌కు రూ. 10వేలు వేత‌నం ఇస్తామ‌ని ఉగాది రోజున శుభ‌వార్త చెప్పారు. వాలంటీర్ల‌ను మంచి ప‌నులకు ఉప‌యోగిస్తామ‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా చూడ‌బోమ‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసే వాలంటీర్ల‌కు తాము ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.  కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తొల‌గిస్తార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీని మ‌రోసారి గెలిపించుకుంటేనే వాలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు జీతం రూ.10వేలకు పెంచుతామ‌ని చెప్ప‌డం ప‌ట్ల వాలంటీర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తామ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజంలేద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు హామీతో మెజార్టీ శాతం వాలంటీర్లు ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు వైసీపీ నేత‌ల పెత్త‌నంతో తాము అనేక ఇబ్బందులు ప‌డ్డామ‌ని, చంద్ర‌బాబు హామీతో కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యానికి తాము కృషిచేస్తామ‌ని ప‌లువురు వాలంటీర్లు బ‌హిరంగాంగా చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ వాలంటీర్ల‌ను అడ్డుపెట్టుకొని మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని భావించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో గ‌ట్టి షాకిచ్చిన‌ట్లయింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. చంద్ర‌బాబు వాలంటీర్ల‌కు ఇచ్చిన హామీతో వైసీపీ అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక విజయంపై తమలో దింపుడు కళ్లెం ఆశ కూడా మిగలలేదని పలువురు వైసీపీ అభ్యర్థులు ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బెడిసి కొట్టిన వ్యూహం.. జగన్ ‘చిరు’ ఆశలు గల్లంతు!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. పోలింగ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ వైసీపీ గ్రాఫ్ ప‌డిపోతున్నది. దీంతో వైసీపీ అధిష్టానం ఎన్నిక‌ల‌ వ్యూహం మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కులాల మ‌ధ్య విద్వేషాలు రేపి రాజ‌కీయ ల‌బ్ధిపొందుతున్న వైసీపీ నేత‌లు.. వాటికి మ‌రింత ఆజ్యం పోసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణాల‌కు, బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు మ‌ధ్య విద్వేషాలు సృష్టిస్తే బడుగు, బలహీన వర్గాల ఓట్లు గంపగుత్త‌గా  తమ పార్టీ ఖాతాలో ప‌డ‌తాయ‌ని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మ‌రోవైపు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ టార్గెట్ గా జగన్ మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారట. పిఠాపురం నియోజకవర్గంలో జగన్ ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ ను ఒక కులానికి పరిమితం చేసే  ప్రయత్నాలు మొదలయ్యాయన్నచర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై కుల ముద్ర వేయ‌డం ద్వారా  రాజ‌కీయంగా వారి ఎదుగుద‌ల‌ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడుపై క‌ కులం ముద్ర వేయ‌డం ద్వారా తెలుగుదేశం పార్టీకి బీసీల‌ను దూరం చేయ‌డంలో  ఓ మేరకు స‌ఫ‌ల‌మ‌య్యారు. అస‌లు విష‌యానికి వస్తే తెలుగుదేశం పార్టీకి  బ‌ల‌మైన ఓటు బ్యాంకు బీసీలు. చంద్ర‌బాబు నాయుడు సైతం పార్టీ పదవుల్లో బీసీల‌కే అధిక ప్రాధాన్య‌త ఇస్తుంటారు. అయితే గత  ఎన్నికల సమయంలో జగన్మాయా ప్రచారంలో పడి పొరపాటుపడిన బీసీలు ఎన్నికల తరువాత జగన్ కుట్రలను తెలుసుకున్నారు. ఇప్పుడు బీసీ వర్గాల్లో మెజార్టీ ప్రజలు చంద్రబాబు వైపు నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబుపై కుల ముద్ర వేసిన తరహాలోనే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పైనా కుల ముద్ర వేసేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ప‌వ‌న్  జ‌గ‌న్ కుట్ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ వ‌స్తున్నారు. పవన్  రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాటి నుంచి తాను ఒక కులానికి నాయుడిని కాదు.. కులాల‌కు అతీత‌మైన వ్య‌క్తిని.. అన్ని కులాల ప్ర‌జ‌లు తన కుటుంబ స‌భ్యులేన‌ని చెబుతూ వ‌చ్చారు. అయినా, కేవ‌లం కాపు సామాజిక వర్గానికే ప‌వ‌న్ క‌ల్యాణ్ నాయ‌కుడు అని వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు.  విజ‌య‌వాడ ప‌శ్చిమ సీటును త‌న‌కు కేటాయించ‌లేద‌ని జ‌న‌సేన పార్టీకి ఆ పార్టీ కీల‌క నేత పోతిన మ‌హేశ్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన త‌రువాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కాపు నాయకుడిగా ముద్ర‌వేసే ప్ర‌య‌త్నం చేశారు. పొత్తులో భాగంగా పవన్ 21 సీట్లు తీసుకోవడం మహా పాపమని.. కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని పోతిన‌ మ‌హేశ్  విమ‌ర్శ‌లు చేశాడు. ఇక్క‌డ అర్ధంకాని విష‌యం ఏమిటంటే.. 21సీట్లకు  కాపుల ఆత్మగౌరవానికి సంబంధం ఏమిటి?  జ‌న‌సేన అంటే కాపుల పార్టీ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డైనా చెప్పారా?  ప‌దేప‌దే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కాపు సామాజికవర్గానికే పరిమితమైన నాయ‌కుడుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేస్తున్నారు. ప‌వ‌న్ కల్యాణ్ పై కాపు  ముద్రవేస్తే త‌న‌కు బ‌లంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును వైసీపీ వైపునకు మ‌ళ్లించుకోవ‌చ్చ‌ని జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహంలో భాగంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌క్క‌న అంద‌రూ రెడ్డి కులానికి చెందిన నాయ‌కులు, అధికారులే ఉంటారు. కానీ  జ‌గ‌న్ మాత్రం.. తాను బీసీ, ఎస్సీ, ఎస్టీల మ‌నిషి అంటూ ప్ర‌సంగాల్లో   దంచేస్తుంటారు. అంటే.. సొంత సామాజిక వ‌ర్గానికి ల‌బ్ధిచేకూర్చే జ‌గ‌న్ అన్నివ‌ర్గాల మ‌నిషి కావాలి, అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు నా వాళ్లే అనుకునే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌పై మాత్రం కులం ముద్ర వేయాలి. ఇదే జగన్, ఆయన వర్గీయుల కుట్రగా పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు.  వైసీపీ నీచరాజకీయాలకు కేరాఫ్ అని గుర్తించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వారి కుట్రలను ఎప్పటికప్పుడు చేధిస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.  మరోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నంలో భాగంగా.. చిరంజీవి విషయంలోనూ వైసీపీ మైండ్ గేమ్స్ ఆడింది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశం లేదని చెప్పినా.. వైసీపీకి చిరు మద్దతు ఉన్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు.  సొంత త‌మ్ముడు పెట్టిన పార్టీ గురించి చిరంజీవి కూడా ఎక్క‌డా మాట్లాడ‌క‌పోవ‌టంతో జ‌న‌సేన క్యాడ‌ర్ లో  అది నిజమేనా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి.  మెగా ఫ్యాన్స్ లో  కూడా ఇదే రకమైన సందేహాలు నెలకొన్నాయి.  ఎన్నిక‌ల స‌మ‌యంలో చిరు, ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు   వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  అయితే అందుకు అవకాశం లేకుండా చిరంజీవి తాను ఎటువైపో తేటతెల్లం చేసేశారు.  జ‌న‌సేన పార్టీకోసం ఐదు కోట్ల చెక్కును ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అందివ్వ‌డం ద్వారా తన మ‌ద్ద‌తు కూట‌మికే అని చిరంజీవి విస్పష్టంగా చెప్పేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో జోష్ పెరిగింది. మెగా ఫ్యాన్స్ లో అయోమయం పోయింది. జగన్ వ్యూహాలు బెడిసికొట్టడమే కాకుండా, ఆయన కుట్రపూరిత ఎత్తుగడలు ఏమిటన్నది జనానికి స్పష్టంగా అర్ధమైంది. 

బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్‌.. జ‌గ‌న్ ప‌రువు తీసిన ష‌ర్మిల

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ నేత‌ల‌ ప్ర‌చారం పీక్ కు చేరింది. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అధికార వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు ప‌డిపోతోంది. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లు కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యంకోసం విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వారి స‌భ‌ల‌కు ప్ర‌జాద‌ర‌ణ భారీగా ల‌భిస్తోంది. మ‌రో వైపు పలు స‌ర్వేలు కూట‌మిదే అధికార‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నాయి. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల‌ను స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. దీంతో వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యం గూడుకట్టుకుంది. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే  వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సొంత చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్‌ ష‌ర్మిల రూపంలో భ‌యం వెంటాడుతోంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో బాహాటంగానే చర్చ జరుగుతోంది. వివేకా హ‌త్య‌ కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అని వైఎస్ ష‌ర్మిల‌, సునీతా రెడ్డిలు చెబుతున్నారు. సీబీఐ విచార‌ణలోనూ అవినాశ్ రెడ్డి ప్ర‌ధాన నిందితుడ‌ని తేలింది. అయినా అవినాశ్ అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారాన్ని ఉప‌యోగిస్తున్నాకని ష‌ర్మిల, సునీత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు అవినాశ్ కు మ‌రోసారి క‌డ‌ప ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై జ‌గ‌న్ చెల్లెళ్లు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే అవినాశ్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా వైఎస్ ష‌ర్మిల బ‌రిలోకి దిగారు.  వైఎస్ ష‌ర్మిల ఈనెల 5  నుంచి క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలో విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. ష‌ర్మిల‌కు మద్దతుగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిద్ద‌రూ వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌ స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా వివేకా హ‌త్య వ్య‌హారాన్ని ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌, అవినాశ్ రెడ్డిల‌ను ఏకిపారేస్తున్నారు. ష‌ర్మిల దూకుడుతో క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలోని  వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది.  ష‌ర్మిల ప‌దునైన మాట‌ల‌తో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంతో ష‌ర్మిల‌ను నిలువ‌రించ‌డం ఎలా అనే ఆలోచ‌న‌లో వైసీపీ నేత‌లు నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ ష‌ర్మిల పాల్గొనే స‌భ‌ల‌ను అడ్డుకొనే ప్ర‌య‌త్నాలను వైసీపీ ఆరంభించింది.  ఇప్ప‌టికే వివేకా హ‌త్య‌కేసు విష‌యంలో క‌డ‌ప‌లో వైసీపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డ‌గా,  ఇప్పుడు ష‌ర్మిల స‌భ‌ల‌ను అడ్డుకుంటే ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగి మరింత ఇబ్బంది ఎదురవుతుందని వైసీపీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే, ష‌ర్మిల దూకుడుకు క‌ళ్లెం వేయ‌డం ఎలా అనే చ‌ర్చ వైసీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే జగన్ వ్యూహాత్మకంగా ష‌ర్మిల స‌భ‌ల‌కు కొంద‌రు వైసీపీ ద్వితీయ స్థాయి నేత‌లను పంపిస్తున్నారు. వారు ష‌ర్మిల మాట్లాడే స‌మ‌యంలో జై జ‌గ‌న్,  జైజై జ‌గ‌న్‌ అనే నినాదాలు చేస్తూ స‌భ‌లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌లెత్తేలా చేస్తున్నారు. దానిని తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ష‌ర్మిల స‌భ‌ల్లో  జై జ‌గ‌న్   నినాదాలు వినిపిస్తున్నాయి, ష‌ర్మిల‌కు క‌డ‌ప ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నదంటూ ప్ర‌చారం చేసుకోవాలని ప్లాన్ చేశారు.  అయితే జగన్, వైసీపీ నేత‌ల చిల్ల‌ర చేష్ట‌ల‌ను ప‌సిగ‌ట్టిన వైఎస్ ష‌ర్మిల వారికి త‌గిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. సోమ‌వారం(ఏప్రిల్ 8) క‌డ‌ప జిల్లా దువ్వూరులో ష‌ర్మిల ప్ర‌చారం నిర్వ‌హించారు. అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ష‌ర్మిల మాట్లాడుతుండ‌గా  జై జ‌గ‌న్ అంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు నినాదాలు చేశారు. వైసీపీ నేత‌ల కుట్ర‌ల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టిన ష‌ర్మిల‌   వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను మాట్లాడేందుకు ఆహ్వానించారు. ద‌మ్ముంటే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడండి.. మీ జ‌గ‌న‌న్న ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్పండి చూద్దాం అంటూ సూచించారు. వైసీపీ నేత‌ ష‌ర్మిల వ‌ద్ద‌కు వ‌చ్చి మైక్ అందుకొని జ‌గ‌న్ గురించి మాట్లాడాడు. ఆయ‌న ప్ర‌సంగంలో జ‌గ‌న్ ఏం అభివృద్ధి చేశాడో చెప్ప‌కుండా.. కేవ‌లం జ‌గ‌న‌న్న అంటేమాకు అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు. అనంత‌రం ష‌ర్మిల మైక్ అందుకొని.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఒకప్పుడు నేను జై జ‌గ‌న్ అన్నా.. ఆయ‌న జైలుకెళ్తే 3,200 కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసి పార్టీని నిల‌బెట్టా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా పాల‌న చేస్తారని అనుకున్నా.. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారు. సొంత బాబాయ్ హ‌త్య‌కు కారుకుల‌ను ప‌క్క‌న పెట్టుకొని ఎంపీ టికెట్ ఇచ్చాడు.. అస‌లు జ‌గ‌న్ వైఎస్ వార‌సుడే కాదు,  అస‌లైన వైఎస్ వార‌సురాలిని నేనే అంటూ వైసీపీ నేత‌ల‌కు  దిమ్మ‌తిరిగే షాకిచ్చారు ష‌ర్మిల.  రాయ‌ల‌సీమ జిల్లాల్లో వైసీపీకి బ‌లం ఎక్కువ‌. ఆ ప్రాంతంలో 52 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.  2014, 2019 ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ ప్రాంతంలో వైసీపీ హ‌వా కొన‌సాగింది. కానీ, ఈసారి ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కూట‌మి బ‌ల‌ప‌డ‌టంతోపాటు వైఎస్ ష‌ర్మిల రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గ‌ట్టి షాక్ త‌గిలే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో నిందితుడుగా ద‌ర్యాప్తు సంస్థ‌లు పేర్కొన్న అవినాశ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై ష‌ర్మిల‌తో పాటు ఉమ్మ‌డి క‌డ‌ప  జిల్లాలోని అధిక శాతం మంది ప్ర‌జ‌ల నుంచి  వ్య‌తిరేక‌త వ్య‌క్తవుతుంది. ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తుండ‌టంతో పాటు, అస‌లైన వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి వార‌సురాలు తానేనని ఆమె ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌గ‌లుగుతున్నారు. ఒక ప‌క్క కూట‌మి దెబ్బ‌తోపాటు ష‌ర్మిల ఎఫెక్ట్ కూడా రాయ‌ల‌సీమ ప్రాంతంలో వైసీపీ అభ్య‌ర్థుల‌ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసే పరిస్థితి ఉంద‌ని జ‌గ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం.  దీంతో వైఎస్ ష‌ర్మిల దూకుడుకు ఎలా అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఆలోచ‌న‌లో వైసీపీ పెద్ద‌లు త‌ల‌మున‌క‌ల‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ ష‌ర్మిల దూకుడుతో ఉమ్మ‌డి క‌డ‌ప  జిల్లాలోని వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యం మొద‌లైంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది.

ప్రజా భాగస్వామ్యంతో తెలుగుదేశం కూటమి ఎన్నికల మేనిఫెస్టో

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ  కూటమి  ఉమ్మడిగా  ప్రజల మేనిఫెస్టో ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. మేనిఫెస్టో రూపకల్పనలో కూటమి ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సంకల్పించింది.   ఇందు కోసం కూటమి భాగస్వామ్య పక్షాలు మూడూ ప్రజల నుంచి సూచనలను, సలహాలను ఆహ్వానిస్తున్నాయి.  ప్రజలు కూటమి మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వాములు కావాలని కోరుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ప్రజలు తమ సూచనలూ, సలహాలూ తెలియజేసేందుకు  వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్  ఇంకా   పీడీఎఫ్ రూపంలో పంపించాలని కోరుతోంది. ఇందు కోసం కూటమి ఒక ఫోన్ నంబర్ ను ఇచ్చింది.  8341130393 నంబర్ కు వాట్సాప్ ద్వారా ప్రజల ఉమ్మడి మేనిఫెస్టో కోసం తమ సూచనలూ, సలహాలూ పంపాలని ఆహ్వానించింది.   ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకే కూటమి మేనిఫెస్టో ఉంటుందని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి, పురోగతి, అభివృద్ధే తెలుగుదేవం కూటమి లక్ష్యమని కూటమి నాయకత్వం చెబుతోంది. ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని రంగాలలోనూ అధమ స్థానానికి దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా కూటమి పని చేస్తోందని పేర్కొంది. ఇలా ఉండగా కూటమి మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న యోచనను నెటిజన్లు స్వాగతిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ఆహ్వానానికి ప్రజల నుంచి కూడా అనూహ్య మద్దతు, స్పందన లభిస్తోంది. వివిధ వర్గాల ప్రజలు కూటమిలో పొందుపరచాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు, సలహలూ, సూచనలను పెద్ద ఎత్తున పంపుతున్నారు. 

ఓ వైపు మండే ఎండలు.. మరో వైపు చిరు జల్లులు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం!

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. ఓ వైపు భానుడి ప్రతాపంతో ఎండ నిప్పులు చెరుగుతుంటే.. మరో వైపు చిరు జల్లులతో చిరు ఉపశమనం కలిగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో   ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.   దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో   మరో రెండ్రోజులపాటు నిప్పుల కొలిమిలా వాతావరణం ఉంటుందని పేర్కొంది.  ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.   రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో అత్యధికంగా 42.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, అనంతపురం, తాడిపత్రి, పొద్దుటూరు, పాణ్యంలో 42.70, ఒంటిమిట్ట, సూళ్లూరుపేట, గుంతకల్‌లో 42, కర్నూలు, మంత్రాలయం, నెల్లూరు, నంది కొట్కూరులో 41, ఎన్టీఆర్‌, పల్నాడు, సత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, ఏలూరు, ప.గోదావరి జిల్లాల్లో 37, శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  ఇక తెలంగాణ విషయానికి వస్తే  రాష్ట్రంలో  విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో సోమవారం(ఏప్రిల్ 8) వడగాల్పులు వీచాయి. మంగళవారం (ఏప్రిల్ 9) ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో  ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలుతో తేలికపాటి  వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. 

పత్రాలు తగలెట్టేసి తప్పించుకుందామనే.. బెడిసి కొట్టిన సీఐడీ చీఫ్ బిగ్ ప్లాన్!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ తాడేప‌ల్లి సిట్ కార్యాల‌యం వ‌ద్ద సీఐడీ సిబ్బంది కీల‌క ప‌త్రాల‌ను ద‌గ్దం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. సిట్ కార్యాల‌యం కాంపౌండ్ లో పెద్ద‌ మొత్తంలో ప‌త్రాల‌ను ద‌గ్దం చేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. సీఐడీ చీఫ్ ర‌ఘురామ్‌రెడ్డి ఆదేశాల మేర‌కు వాటిని ద‌గ్దం చేసిన‌ట్లు కార్యాల‌య సిబ్బంది తెలిపారు. సిబ్బంది ద‌గ్దం చేసిన కాగితాల్లో హెరిటేజ్ సంస్థకు చెందిన‌ కీల‌క ప‌త్రాలు. చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.   ఈ ప‌త్రాల‌ను ద‌గ్దం చేసే స‌మ‌యంలో ఫొటోలు, వీడియోలు తీసిన కొంద‌రిని వాటిని త‌మ‌కు ఇవ్వాల‌ని సీఐడీ అధికారులు ఒత్తిడి తేవ‌డం ప‌త్రాల ద‌గ్దం వెనుక పెద్ద మ‌త‌ల‌బే ఉంద‌న్నఅనుమానాలకు తావిచ్చింది. గ‌తంలో మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై సీఐడీ అధికారులు పలు అక్ర‌మ కేసులు నమోదు చేశారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వాంగ్మూలం కోసం సీఐడీ అధికారులు అనేక మందిపై ఒత్తిడి  తెచ్చారన్న  విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అంతేకాదు.. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ చట్టవిరుద్ధంగా అధికారులు పొందార‌ని అప్ప‌ట్లో  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున  ప‌త్రాల‌ దగ్ధంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   తాడేప‌ల్లి సీఐడీ కార్యాల‌యంలో కీల‌క పాత్రాలను  దగ్ధం చేసిన సంగతి వెలుగులోకి రావడంతో  ఉన్న‌తాధికారులు ఆఘ‌మేఘాల మీద‌ స్పందించారు. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అంటూ.. నమ్మించేందుకు  ప్ర‌య‌త్నించారు. తాము ఐదు కేసుల్లో చార్జిషీటు వేశామని, ఒక్కో చార్జిషీట్‌లో ఎనిమిది వేల నుంచి పదివేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని,  చాలా జిరాక్సులు తీయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.. అయితే, జిరాక్సులు తీసే సమయంలో మిషన్ వేడెక్కడం వల్ల పేపర్ స్టక్ అవుతుందని, ఇంక్ లెవల్ కూడా తగ్గిపోతుందని, దీనివలన కొన్ని కాపీలు సరిగ్గా రావని.. వీటన్నింటిని కూడా వేస్టు పేపర్లుగా గుర్తించి దగ్ధం చేస్తామని తెలిపారు. తాజాగా సిట్ కార్యాల‌యం సిబ్బంది ద‌గ్దం చేసిన కాగితాలు కూడా అవేనంటూ అధికారులు చెప్పుకొచ్చారు. అధికారుల వివరణ తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అస‌లు స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు సీఐడీ ఉన్న‌తాధికారులు క‌ట్టుక‌థ‌లు చెబుతున్నరని విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. సీఐడీ అధికారులు జిరాక్సులు తీసింది కేవ‌లం హెరిటేజ్ సంస్థ‌కు చెందిన కాగితాలేనా?  హెరిటేజ్ సంస్థ‌కు చెందిన ప‌త్రాల‌ను జిరాక్స్ తీసేట‌ప్పుడే మిష‌న్లో ఇంక్ అయిపోయిందా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యాన్నితెలుగుదేశం నేత‌లు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు.  తెలుగుదేశం అధికారంలోకి వ‌స్తే   సేక‌రించిన ఆధారాలు త‌ప్పుడ‌వ‌ని తేలి ఎక్క‌డ జైలుకెళ్లాల్సి వ‌స్తుందోన‌న్న భ‌యంతోనే సీఐడీ తాధికారులు కీల‌క ప‌త్రాల‌ను ద్వంసం చేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.  సీఐడీ అధికారులు చంద్ర‌బాబుపై పెట్టిన కేసుల్లో కీల‌క ప‌త్రాల‌ను కూడా ద‌గ్దం చేశారని తెలుగుదేశం నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. పత్రాల దగ్ధంపై లోతైన విచారణకు డిమాండ్ చేశారు.   ఏపీలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటమి ఖాయమని  స‌ర్వేలు స్పష్టం చేస్తున్నాయి.  తెలుగుదేశం,  జ‌న‌సేన, బీజేపీ కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో కొంద‌రు పోలీసులు, అధికారులు వైసీపీ నేత‌ల‌కు తొత్తులుగా ప‌నిచేశారు. వైసీపీ నేతల ఆదేశాల మేరకు పలువురిపై అక్ర‌మంగా కేసులు పెట్టి చిత్ర‌హింస‌లకు గురిచేసిన ఘటనలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచనాలతో  వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులు కొత్త ప్రభుత్వం వస్తే తమకు జైలు తప్పదన్న వణుకు మొదలైంది. ముఖ్యంగా జగన్ ప్రాపకం కోసం అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు, వేధింపులకు పాల్పడిన సిట్ అధికారులు ఇక సర్దుకునే పనిలో పడ్డారు.   గత ఐదేళ్లుగా తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, ట్యాపింగ్‌లు  ఇలా ఒక్కటేమిటి.. లెక్క లేనన్ని అక్రమాలతో నిలువెల్లా  బురద పూసుకున్న సిట్ ఇప్పుడు ఆ బురదను కడిగేసుకుని చేతులు దులిపేసుకోవడానికి నుడీ అయిపోయింది. అందులో భాగంగానే సిట్ ఆఫీసులో ఉన్న పత్రాలను ముఖ్యంగా తెలుగుదేశం  నేతలపై ఉన్న కేసులకు సంబంధించి అక్రమంగా సంపాదించిన పత్రాలన్నింటికీ నిప్పు పెట్టేశారు. ఇది ఎలా బయటపడిందంటారా.. ఆ కార్యాలయంలోని వ్యక్తులే  దీనికి సంబంధించి వీడియో తీసి మీడియాకు పంపారు.  మీడియాలో ఈ అంశం సంచలనంగా మారింది. చిత్తు కాగితాల్ని తగల బెట్టామని వారు కవర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం నవ్వుల పాలైంది.   అవి హెరిటేజ్ కు సంబంధించిన పత్రాలని తగలబడకుండా మిగిలిపోయిన పత్రాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి.  తెలుగుదేశం నేతలు సైతం సిట్ తప్పులు తగలెట్టేస్తే కనిపించకుండా పోయేవి కావని అంటున్నారు.  ప్రభుత్వం మారిన తర్వాత తప్పక అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.  అసలు ఈ ఐదేళ్ల కాలంలో సీఐడీ అధికారులు  తాము బాధ్య‌త క‌లిగిన అధికారుల‌మ‌న్న‌ విష‌యాన్ని పూర్తిగా విస్మరించి   జగ‌న్ ఏది చెబితే అది చేయ‌డ‌మే తమ ఉద్యోగ ధర్మం అన్నట్లుగా ఆయన సేవలో తరించిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ క్ర‌మంలో నే చంద్ర‌బాబుపై అక్ర‌మ కేసులు పెట్టి జైలు పంపించ‌డం, లోకేశ్ ను విచారించ‌డం, తెలుగుదేశం ముఖ్య‌నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం వంటివి చేశారని తెలుగుదేశం గత కొన్నేళ్లుగా విమర్శలు చేస్తున్నది.  వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమన్న నిర్ధారణకు వచ్చేసిన సీఐడీ ఉన్న‌తాధికారులు.. చంద్ర‌బాబు కేసులో, లోకేశ్ ను విచారించిన స‌మ‌యంలో అక్ర‌మంగా సేక‌రించిన ఆధారాలు క‌నిపించ‌కుండా చేసే ఉద్దేశంతోనే కీల‌క ప‌త్రాల‌ను ద‌గ్దం చేశార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.     మొత్తానికి సిట్ కార్యాల‌యం ఆవ‌ర‌ణంలో ద‌గ్దం చేసిన ప‌త్రాల అంశంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.  

పవన్ కళ్యాణ్ కు  చిరు ఆర్థిక సాయం  

ఎపిలో ఎన్డీఏ కూటమికి మెగా స్టార్ చిరంజీవి పూర్తి మద్దతునిస్తూ హార్థిక మద్దత్తే కాకుండా ఆర్థిక మద్దత్తు ఇచ్చారు. జనసేనానికి 5 కోట్ల విరాళం ఇచ్చి తమ్ముడిపట్ల ఉన్న ప్రేమను మరోమారు చాటుకున్నారు. ఈ సందర్బంగా  అస్వస్థతకు గురైన జనసేనాని  ఆరోగ్యం వాకబు చేశారు. ముగ్గురు మెగా సోదరులు చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా సెట్స్ లో కలుసుకున్నారు. చిరంజీవి తమ్ముడిని సాధారంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి ఇష్ట దైవం ఆంజనేయస్వామి విగ్రహం ముందు తమ్ముడిని ఆశీర్వదించి చిరంజీవి జన సేన పార్టీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చారు. . 'జనసేనకు విజయోస్తు, విజయీభవ' అని చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు.

వైసీపీకి మాజీ మంత్రి శమంతక మణి గుడ్ బై 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలో వై ఎస్ఆర్ సిపి  పరాజయం తప్పదని వెల్లడించడంతో నేతలు కప్పదాటు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్ ఆర్ సిపి నేతలు కొందరు  ఉన్న ఫలంగా రాజీనామాలకు ఎగబడ్డారు.    ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీని వీడారు.  శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1989-91 మధ్య కాలంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో శమంతకమణి కూతురు యామినీబాలకు శింగనమల నియోజకవర్గం నుంచి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో యామినీబాల గెలుపొందారు. అయితే, 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో శమంతకమణి, యామినీబాల, అశోక్ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వీరు... వైసీపీకి  గుడ్ బై చెప్పారు. 

సిట్ కార్యాలయంలో పత్రాలు దహనం

భారతీయ న్యాయ వ్యవస్థ ముఖ్యంగా మూడు రకాల చట్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఐపిసి, రెండోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, మూడోది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ . ఇందులో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్   అత్యంత కీలకమైంది. ఒక వ్యక్తి నేరం చేస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం శిక్షలు పడతాయి. ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని శిక్షలు వేస్తాయి కోర్టులు. . మే 13న ఎపిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ వెలిబుచ్చిన అభిప్రాయం  ప్రకారం వైఎస్ఆర్ సిపి మళ్లీ గెలుపొందడం కష్టమే.. ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని పక్కాగా తేలడంతో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల ప్రకారం అధికారులు  వివిధ అక్రమ కేసుల్లో సాక్ష్యం లేకుండా చేసే కుట్రకు తెరలేపారు. జూన్ నాలుగు తర్వాత జగన్ ప్రభుత్వం కూలిపోతే అధికారంలో వచ్చే తెలుగుదేశం ప్రభుత్వానికి  సాక్ష్యాలు దొర కకుండా తప్పించుకునే ఉపాయమే పత్రాల దహనం కుట్ర అనేది   ప్రస్తుతం  చర్చనీయాంశమైంది.    తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు డాక్యుమెంట్లను అక్కడి సిబ్బంది దహనం చేయడం కలకలంరేపుతోంది. ఈ ఘటనపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ డాక్యుమెంట్లను వీటిని తగలబెట్టడాన్ని పలువురు స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారని చెబుతున్నారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. సిట్‌ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. హెరిటేజ్‌ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర పత్రాలు అందులో ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సిట్‌ కార్యాలయంలో పత్రాల దహనంపై సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. బ్రాహ్మణి, భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌లు ఎలా వచ్చాయో చెప్పాలని.. లోకేశ్‌ను విచారణ సమయంలో ప్రశ్నించిన పత్రాలపై ఆనాడే అడిగామన్నారు. ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. ఎవరి ఉత్తర్వులతో పత్రాలు తగలబెట్టారో డీజీపీ చెప్పాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పత్రాల దహనం చేశారని.. తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలేది లేదన్నారు. ఃఅమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హెరిటేజ్ సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనలో సిట్ ఆఫీస్ దగ్గర కాల్చేసిన డాక్యుమెంట్లు హెరిటేజ్‌ సంస్థవని అనుమానాలు వ్యక్తం కావడంతో.. ఈ డాక్యుమెంట్లకు ఆ కేసుతో లింక్ ఉందని టీడీపీ చెబుతోంది. ఈ కేసులో నారా లోకేష్‌ను కూడా సీఐడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా హెరిటేజ్‌కు సంబంధించిన పత్రాలు తగులబెట్టే సమయంలో వీడియోలు తీయడంతో ఈ ఘటన బయటపడింది. అయితే ఈ అంశంపై సిట్ అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి.. ఆగని వలసల ప్రవాహం!

లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔనేమో అనిపించక మానదు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. గతంలో  బీఆర్ఎస్ కష్టపడి అతి ప్రయత్నం మీద ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి చేసిన పని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎవరి ప్రమేయం లేకుండా చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విపక్షం అయిన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు ఇతర పార్టీలలోకి దూకేస్తున్నారంటే పార్టీ నాయకత్వంపై వారి విశ్వాసం ఎంత సన్నిగిల్లిందో అర్ధం చేసుకోవచ్చు.  అధికారం ఉన్న పార్టీలో ఉంటేనే మనుగడ అన్న అభిప్రాయాన్ని తెలంగాణ రాజకీయాలలో కలిగించిన పార్టీ బీఆర్ఎస్. ఇప్పుడు ఆ పార్టీ అధికారం మారగానే ఆ పార్టీ నేతలూ జంపింగ్ ల బాట పట్టారు. ఈ వలసలు ఇప్పటిలో అగేలా కనిపించడం లేదు.   తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  కాంగ్రెస్‌ గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఖాళీ అయిపోయినట్లే.  ఎందుకంటే భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే వెంకట్రావు. భద్రాచలం వినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు.   ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్‌మోహన్‌, పట్నం సునీతా మహేందర్‌రెడ్డి వంటి పలువురు నేతలు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన సంగతి తెలిసిందే. ఇలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి మరో పాతిక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  అంటే రానున్న రోజులలో అసెంబ్లీలో బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ అనే మాటే వినిపించే అవకాశం ఉండదు. బీఆర్ఎస్ఎల్పీ నేతను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో విఫలమైనందునే కేసీఆర్ గత్యంతరం లేక ఆ పదవిని స్వీకరించారని పార్టీ శ్రేణులే అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి వలసలు ఇలాగే కొనసాగితే.. రానున్న రోజులలో కేసీఆర్ బీఆర్ఎస్పీ నేతగా కూడా మిగిలే అవకాశం ఉండదని అంటున్నారు. 

బీఆర్ఎస్ నేతల మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు?!

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఎన్నికలకు మించిన హీట్ పుట్టిస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రమే. ఈ కేసు దర్యాప్తు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. రోజు కొకరు చొప్పున తామూ ఫోన్ ట్యాపింగ్ బాధితులమే అంటూ తెరమీదకు వస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని ఆరోపించగా, తాజాగా బీజేపీ మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో మొదటి వాడిని తానేనని చెప్పారు. ఇక ఈ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచడంతో రోజు రోజుకూ ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇద్దరు పోలీసులు అరెస్టయ్యారు. ఇక ఈ కేసులో అరెస్టయిన వారి నుంచి రాబట్టిన సమాచారంతో కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు తీగలాగుతుంటే డొంక కదులుతోంది. తాజాగా పోలీసులు సోమవారం ( ఏప్రిల్ 8) జూబ్లీ హిల్స్ లోని ఓ గెస్టు హౌస్ లో సోదాలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.  పోలీసులు సోదాలు చేపట్టిన గెస్ట్ హౌస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ నివాసానికి సమీపంలో ఉంది. అప్పట్లో అంటే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ఈ గెస్ట్ హౌస్ లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు.  కాగా విశ్వసనీయ సమాచారం మేరకు ఈ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేదని తెలుస్తోంది.  త్వరలోనే ఆ ఎమ్మెల్సీని కూడా పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  

పవన్ కళ్యాణ్ మరో మారు అస్వస్థత 

ఎపిలో ఎండలు మండిపోతున్నాయి. మే 13న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో త్రికూటమి అభ్యర్థులు దూకుడు పెంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వారాహి  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఎండ వేడి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. నిన్న రెండోసారి వారాహి యాత్ర ప్రారంభమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మరో మారు అస్వస్థతకు గురయ్యారు.  జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మరోమారు రద్దయింది. నిన్న అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో నేటి యలమంచిలి పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతుండడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన అనంతరం పవన్ మళ్లీ జ్వరం బారినపడ్డారు. దీంతో నేటి పర్యటనను రద్దుచేసుకున్నారు. కాగా, ఈ నెల తొలివారంలో పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది.

ఒడ్డున పడ్డ చేపలా చెవిరెడ్డి విలవిల?!

ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని పరిశీలకులు అంటున్నారు. వరుసగా రెండు సార్లు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన చెవిరెడ్డి సామర్థ్యాన్ని, బలాన్ని అతిగా అంచనా వేసిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆయనను ఈ సారి నియోజకవర్గం మార్చి ఒంగోలు లోక్ సభ స్థానంలో పోటీకి దింపారు. ఇందుకు ప్రతిగా ఆయనకు ఫ్యామిలీ ప్యాకేజీ కింద ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చారు. చెవిరెడ్డిని ఒంగోలు లోక్ సభ నియోజకవర్గానికి పంపడానికి కారణం అక్కడ మాగుంట ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న లక్ష్యమే అనడంలో సందేహం లేదు.  అయితే ఒంగోలులో  చెవిరెడ్డికి పరిస్థితులు ఇసుమంతైనా సానుకూలంగా లేవు. ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం అభ్యర్థులు బలంగా దూసుకుపోతున్నారు. అక్కడ ప్రచారం సాగుతున్న తీరు చూస్తుంటే చెవిరెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ నియోజవర్గంలో లభించిన వరుస విజయాలకు స్థాన బలిమి తప్ప మరో కారణం లేదని విస్పష్టంగా తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో ఉంటంది. చంద్రగిరిలో విజయం కోసం చెవిరెడ్డి తమిళరాజకీయ సంస్కృతిని అక్కడకు దిగుమతి చేసుకున్నారు. తమిళనాడులో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పెద్ద ఎత్తున బహుమతులు గుప్పించే విధంగానే చెవిరెడ్డి కూడా గత రెండు ఎన్నికలలో చంద్రగిరి ఓటర్లను బహుమతులతో ముంచెత్తి విజయం సాధించారు. అయితే ఆ పాచిక ఒంగోలు లోక్ సభ నియోజకవర్గంలో అంతగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. దీనికి తోడు ఆయన ఓటర్లకు పందేరం చేయడానికి పెద్ద ఎత్తున డంప్ చేసి పెట్టుకున్న సామగ్రిని ఇటీవల పోలీసులు సీజ్ చేశారు. దీంతో చెవిరెడ్డి కాళ్లూ చేతులూ కట్టేసినట్లైందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క దర్శి నియోజకవర్గంలో మాత్రమే వైసీపీకి కొద్దో గొప్పో సానుకూల వాతావరణం ఉందని అంటున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాన్ లోకల్ అంటే స్థానికేతరుడిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం తమకు కలిసి వస్తుందని వైసీపీ ఆశాభావంతో ఉంది. ఆ నియోజకవర్గం వినా మిగిలిన ఆరు నియోజకవర్గాలలోనూ వైసీపీ అభ్యర్థులు ప్రచారం సహా అన్నిటిలోనూ వెనుకబడి ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇక దర్శిలో తెలుగుదేశం అభ్యర్థి స్థానికేతరుడు కావడం తమకు కలిసి వస్తుందని నమ్ముతున్న వైసీపీ ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి కూడా స్థానికేతరుడే అన్న విషయాన్ని ఎలా విస్మరించిందో అర్ధం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఒంగోలులో సొంత బలం ఇసుమంతైనా లేని చెవిరెడ్డి తన విజయానికి పూర్తిగా పార్టీకి ఉన్న బలంపైనే ఆధారపడి ఉన్నారు. ఒంగోలు వైసీపీలో గ్రూపు తగాదాల కారణంగా చెవిరెడ్డికి గడ్డు పరిస్ధితులే ఎదురౌతున్నాయంటున్నారు. దీంతో స్థాన బలిమిని వదులుకుని ఒంగోలుకు వలస వచ్చిన చెవిరెడ్డి చెరువులోంచి గట్టున పడ్డ చేపలా గిలగిలలాడుతున్నారని అంటున్నారు.  

వల్లభనేని వంశీకి చావో రేవో!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడకు ఆనుకుని ఉండే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై అత్యంత కీలకమైనది. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచీ ఇక్కడ నుంచి పలువురు ప్రభావమంతమైన  నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం వంటి దిగ్గజాలను చట్ట సభకు పంపిన నియోజకవర్గం ఇది. గన్నవరం నియోజకవర్గం నుంచి పుచ్చల పల్లి సుందరయ్య మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికైనా 2009 నుంచి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేం పార్టీకి కంచుకోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు  తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే రెండో సారి విజయం సాధించిన తరువాత వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు.  దీంతో కొద్ది కాలం పాటు తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో   నాయకత్వ శూన్యత ఏర్పడింది. అయితే గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన  యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం గూటికి చేరి రానున్న ఎన్నికలలో వంశీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో యార్లగడ్డకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడిన తరువాత వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో ప్రతికూలత పెరిగింది. ముఖ్యంగా వైసీపీ గూటికి చేరిన వంశీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయనకు స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు వైసీపీలో కూడా వంశీకి వ్యతిరేకంగా పలువురు గ్రూపు కట్టడంతో ఆ పార్టీలో కూడా ఆయన మాటకు చెల్లుబాటు లేకుండా పోయింది.  ఒక దశలో రాజకీయ సన్యాసం అంటూ సెంటిమెంట్ రగల్చడానికి ప్రయత్నించిన వంశీ చివరకు గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయినా ఆయనకు వైసీపీ శ్రేణుల నుంచి సంపూర్ణ మద్దతు అయితే లభించడం లేదు. ఇందుకు విరుద్ధంగా  గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు వెంట తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఏకతాటిపై నిలబడింది.  తెలుగుదేశం నుంచి విజయం సాధించి వైసీపీలోకి జంప్ చేసిన వంశీని నియోజకవర్గంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గం ఆయనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. తాను చంద్రబాబు, ఆయన కుటుంబీకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వంశీ బహిరంగంగా క్షమాపణలు చెప్పినా ఫలితం లేకపోయింది.  మరోవైపు యార్లగడ్డకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచీ మద్దతు కనిపిస్తోంది. మొత్తం మీద వల్లభనేని వంశీకి ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

ఐపీఎల్2024లో భాగంగా ఆదివారం లక్నో, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ ను 33 పరుగుల ఆధిక్యతతో చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.   164 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ 18.5 ఓవర్లలో కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్నో జట్టులో మార్కస్ స్టొయినిస్ అర్ధ సెంచరీ చేశాడు.  లక్నో బౌలర్లలో  యశ్ ఠాకూర్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లు పడగొట్టి గుజరాత్ పతనాన్ని శాశించాడు.  లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు శుభారంభం దక్కినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలపడింది. ఓపెనర్లు శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ 6 ఓవర్లలో 54 పరుగుల భాగస్వామ్యం సాధించారు.  కానీ కృనాల్ పాండ్యా సాయి సుదర్శన్‌ను ఔట్ చేయడంతో వికెట్ల పరంపర మొదలైంది. శుభమన్ గిల్ 19, కేన్ విలియమ్సన్ 1, శరత్ బీఆర్ 2, విజయ్ శంకర్ 17, దర్శన్ నల్కండే 12, రషీద్ ఖాన్ 0 పరుగులకు పెవిలియన్ చేరారు. 

కవితకు నో మధ్యంతర బెయిల్!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కుమారుడి పరీక్షల కారణంగా మధ్యంతర బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కుమారుడి పరీక్షలు ఉన్నందున తనకు ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు తోపి పుచ్చింది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై వాదనలు విన్న ఈ నెల 4 తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.  మ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై గురువారం (ఏప్రిల్ 4) విచారణ ముగిసింది. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.   తల్లిగా తన కుమారుడికి పరీక్షలు ఉన్నపుడు దగ్గర ఉండటం కవితకు అత్యవసరమని, పరీక్షల సందర్భంగా తల్లిగా నైతిక మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని మనుసింఘ్వీ తన వాదన వినిపించారు.  ఆ వాదనలను తిరస్కరిస్తూ కోర్టు సోమవారం కవిత బెయిలు పిటిషన్ ను తోసిపుచ్చింది. 

దూకుడు పెంచిన  జనసేన, టిడిపి ఉమ్మడి ప్రచారం

 తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగే మూడో విడత ప్రజాగళంలో చంద్రబాబు- పవన్‌ కలిసి పాల్గొననున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11వ తేదీన పి. గన్నవరం, అమలాపురంలో చంద్రబాబు, పవన్‌ కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నట్లు ఇరు పార్టీల వర్గాల వెల్లడించాయి. ఈ నిర్ణయంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్తేజం కలుగుతోందని వారు అభిప్రాయం పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ సమీపించడంతో ఎన్నికల గడువు దాటకమునుపే త్రి కూటమిలో భాగస్వామి అయిన జనసేనాని, చంద్రబాబు ఉమ్మడి ప్రచారం చేయాలని నిర్ణయించారు. పిఠాపురం నుంచి జనసేన పార్టీ  ఎన్నికల ప్రచారం ప్రారంభింది. అనారోగ్య కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ ఈ ఒక్క నియోజకవర్గం తప్పితే మరెక్కడా ప్రచారం చేయలేదు. కోలుకున్న తర్వాత అనకాపల్లి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.