మరి కొద్ది సేపటిలో నిర్భయ కేసులో తుది తీర్పు

  సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో దోషులుగా గుర్తించబడిన నలుగురు వ్యక్తులు-పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ టాకూర్ మరియు ముకేష్ లకు డిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు మధ్యాహ్నం రెండున్నర గంటలకు శిక్షలు ఖరారు చేస్తూ తుది తీర్పు ప్రకటించనుంది. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుండి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తుండటంతో కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. దోషులకు ఉరిశిక్ష విధించవలసిందేనంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. అయితే, దోషుల కుటుంబీకులు మాత్రం వారికి యవజీవ కారాగార శిక్ష విధించాలని లాయర్ల ద్వారా కోర్టుకి విన్నవించుకొన్నారు.   కోర్టు ఒకవేళ వారికి ఉరిశిక్ష విధించినప్పటికీ, వారు హైకోర్టు ఆ తరువాత సుప్రీంకోర్టులలో అప్పీలు చేసుకోవచ్చును. ఈ రెండు కోర్టులలో ఎంత లేదన్నా కనీసం మరో ఏడాది సమయం కేసు సాగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా క్రింద కోర్టు తీర్పునే ఖాయం చేసినట్లయితే ఆ నలుగురు రాష్ట్రపతి క్షమాభిక్షకి దరఖాస్తు చేసుకోవచ్చును. దేశ రాజకీయ పరిణామాలను బట్టి ఆయన ఎటువంటి నిర్ణయమయినా తీసుకొనే అవకాశం ఉంది.

టీ-నోట్ సిద్దం, విభజన ఖాయం, హైదరాబాద్ అయోమయం

  తెలంగాణా నోట్ దాదాపు సిద్దం అయిపోయిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల తమను కలిసిన సీమాంధ్ర నేతలు శైలజానాద్ తదితరులకు తెలియజేసారు. ప్రభుత్వోద్యోగుల నియమాకాలు, పదోన్నతులు తదితర అంశాలతో ముడిపడిఉన్నఆర్టికల్ 371 (డీ)ని రాష్ట్ర విభజన చేస్తున్నసందర్భంగా కొనసాగించాలా లేక రద్దు చేయవచ్చా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ సంగతి కూడా తేలిపోతే టీ-నోట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపేందుకు తాము సిద్దంగా ఉన్నామని వారు తెలియజేసారు.   అయితే హైదరాబాదు అంశంపై వారు ఎటువంటి సంకేతం కూడా ఇచ్చేందుకు నిరాకరించారు. దానిపై కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొంటుందని మాత్రమే చెప్పారు. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను కూడా తమ శాఖ పరిగణనలోనికి తీసుకొన్నట్లు వారు తెలిపారు.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై సోనియా గాంధీ చాలా పట్టుదలతో ఉన్నందున, సమైక్య ఉద్యమాలు ఎంత తీవ్ర తరం అవుతున్నపటికీ, రాష్ట్ర విభజనపై ఇక కేంద్రం వెనకడుగు వేసే అవకాశం ఎంత మాత్రం లేదని, అందువల్ల వీలయినంత వేగంగా విభజన ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. మరి దీనికి ఏపీయన్జీవోలు, ప్రజలు, రాజకీయ పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.

టిడిపికి 30 లోక్ సభ స్థానాలు..!

      వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 30 లోక్ సభ స్థానాలు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన బస్ యాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ,రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీనే సరైన పార్టీ అన్న భావన ప్రజలలో ఏర్పడుతోందని ఆయన అన్నారు.   తెలంగాణ – సీమాంధ్ర ప్రజలను శత్రువులుగా మార్చి తన పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో ఆ పార్టీ గారడీ చేయిస్తుందని అన్నారు. అయితే విభజనకు తాను వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలు నాకు సమానం అని, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీమాంధ్రలో గత 40 రోజులుగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే కేంద్రం చోద్యం చూస్తుందని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను చర్చలకు పిలవాలని లేదా రెండు ప్రాంతాల జేఏసీలను పిలిచి చర్చలు జరపాలన్న డిమాండ్ తో చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేయనున్నారు.

ఈ రోజు చాలా ఇంపార్టెంట్ గురూ

  ఈ రోజు దేశంలో కొన్నికీలక సంఘటనలు జరుగబోతున్నాయి. ఈ రోజు జరుగబోయే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణా నోట్ పై చర్చించి పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాల నేపధ్యంలో అంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆగడం మేలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అయితే తెలంగాణా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే ఆలోచన కూడా లేదని సమాచారం.   ఇక ఈ రోజే నరేంద్ర మోడీని బీజీపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు ఆ పార్టీ అగ్రనేతల పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. మోడీ అభ్యర్ధిత్వాన్ని అద్వానీ, సుష్మాస్వరాజ్ తదితరులు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, బీజేపీ మోడీ పేరును ఈ రోజే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే భారత రాజకీయాలు, పార్టీలలో అనేక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ నిలువునా చీలినా ఆశ్చర్యం లేదు. అదేవిధంగా రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తెస్తున్న కాంగ్రెస్ పార్టీపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఆ పార్టీ మళ్ళీ సరికొత్తగా వ్యూహకల్పన చేసుకోవలసి ఉంటుంది. యావత్ భారత దేశ రాజకీయాలను, వివిధ వర్గాలను కూడా బీజేపీ నిర్ణయం ప్రభావితం చేయబోతోంది.   ఇక, నిర్భయ కేసులో దోషులుగా గుర్తింపబడిన నలుగురు నేరస్తులకు ఈ రోజే ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్షలు ఖరారు చేయబోతోంది. వారికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందని హోంమంత్రి షిండే ముందుగానే చెప్పడం వివాదాస్పదమయ్యింది.   ఇక జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు బెయిలు పిటిషను ఈ రోజే విచారణకు రాబోతోంది. గత 15నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యకారణాలతో బెయిలు కోరుతున్నారు. ఇటీవల తరచూ ఆయన అనారోగ్యం పాలవుతున్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో 22 గ్రామాలలో అంధకారం

  బుధవారం అర్ధరాత్రి నుండి సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మొదలుపెట్టిన 72గంటల సమ్మె ప్రభావం విజయనగరం జిల్లా యస్.కోట పరిధిలో ఉన్న 22గ్రామాలపై పడింది. ఆ గ్రామాలలో నిన్నటి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఉద్యోగులు లేకపోవడంతో సంబందిత అధికారులే దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, కొన్ని చోట్ల పంపిణీ వ్యవస్థలోలోపాలు ఏర్పడటం వలన వారు కూడా చేయగలిగిందేమీ లేదని తెలుస్తోంది. ఇంతవరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అడపా దడపా విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నా వాటిని అధికారులే ఎలాగో సరిచేస్తూ నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 22గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏమీ చేయాలో తెలియక తలలు పట్టుకొన్నారు. వీలయినంత త్వరలో విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

చంద్రబాబుకి డిల్లీలో ఏమి పనో

  ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను సీబీఐ కోర్టులో ఉంది. తెలంగాణా నోట్ హోంమంత్రి షిండే వద్ద తయారుగా ఉంది. నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు డిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను వెంటపెట్టుకొని నేడో రేపో డిల్లీ వెళ్లేందుకు నిశ్చయించుకొన్నారు. ఆయన ఆకస్మిక డిల్లీ పర్యటనకు ఇంతవరకు పార్టీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రాష్ట్ర విభజన సందర్భంగా సమన్యాయం చేయమని కేంద్రాన్ని డిమాండ్ చేసేందుకే వెళుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.   ఇక తెదేపా నేతలు వైకాపా గౌరవాధ్యక్షురాలు డిల్లీ వెళ్లి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి బెయిలు కోసం కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకొని వచ్చారని, అందువల్ల త్వరలో అతను బెయిలుపై విడుదలవడం ఖాయమని గట్టిగా చెపుతున్నారు. అందుకు ప్రతిగా ఒకప్పటి చంద్రబాబు సన్నిహిత మిత్రుడు, ప్రస్తుత వైకాపా నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా చక్రం తిప్పెందుకే హడావుడిగా డిల్లీ పరుగులు తీస్తున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు ఇంత హడావుడిగా ఇప్పుడు డిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.   ఇక, తెలంగాణా వాదులు వారి కోణంలో చూస్తూ ఆయన తెలంగాణాను అడ్డుకోవడానికే డిల్లీ వెళుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆయన అటువంటి ప్రయత్నలేవయినా చేసినట్లయితే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.   ఇక, నరేంద్ర మోడీకి బీజేపీ పట్టాభిషేకం చేయబోతున్నశుభ సందర్భంగా, చంద్రబాబు వేరే ఏదో మిషతో డిల్లీకి వెళ్లి అక్కడ ఆయనను పలకరించే అవకాశం కూడా ఉంది. మోడీ ఇటీవల తన హైదరాబాదు పర్యటన సందర్భంగా తెదేపాతో ఎన్నికల పొత్తులకు సంకేతాలు పంపారు. ఒకవేళ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, వైకాపా, తెరాసలు చేతులు కలిపినట్లయితే, బలమయిన ఆ కూటమిని ఎదుర్కొనేందుకు తెదేపా తప్పనిసరిగా బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉంది.   సాధారణ ఎన్నికలకు కేవలం మరో 7నెలలు మాత్రమే ఉన్నందున, ఒకవేళ మోడీని బీజేపీ తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించగలిగితే, చంద్రబాబు తన డిల్లీ పర్యటనలోఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనను కలిసి బీజేపీకి సానుకూలమయిన సంకేతాలు ఇచ్చివచ్చే అవకాశం కూడా ఉంది.

హైదరాబాద్ మీద అనుమానం

      కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు హైదరాబాద్ మీద అనుమానమొచ్చింది. అసలు ఇది హైదరాబాదా ? లేక పాకిస్తానా ? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జగన్ సోదరి షర్మిల కూడా పలుమార్లు ఇలాగే హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చారు. ఇప్పుడు మల్లాది విష్ణు కూడా అదే మాట అంటున్నారు. ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ లో సభ నిర్వహించడంతో టీఆర్ఎస్ పార్టీ కలవర పడుతుందని, హైదరాబాద్ లో సభ అడ్డుకోవడం చూస్తుంటే పాకిస్తాన్ లో ఉన్న అనుమానం కలిగిందని ఆయన అన్నారు.   తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని చెప్పకుండా సీమాంధ్రలో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అయితే నేతలు హైదరాబాద్ ను పాకిస్తాన్ పోల్చడం నిజంగా తప్పుపట్టాల్సిన అంశమే. ప్రజలను రెచ్చగొట్టేందుకో .. ఆకట్టుకునేందుకో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి  

డివైడ్ అండ్ రూల్ ఇష్టోరీ పార్ట్-1

  బ్రిటిష్ వాళ్ళని దేశం నుండి తరిమి కొట్టిన కాంగ్రెస్ పార్టీ, వారి విభజించి పాలించు సిద్దాంతాన్ని మాత్రం పదిలంగా తన దగ్గిరే అట్టేబెట్టుకొని అవసరమయినప్పుడల్లా తీసి ఉపయోగించుకొంటోంది. రాష్ట్ర విభజనతో ముందు తెలుగు ప్రజలను విభజిస్తున్నకాంగ్రెస్ పార్టీ, తెరాసను దెబ్బ తీసేందుకు టీ-జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను ఎగద్రోసి చూసింది.   జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు రాయలసీమను విభజించాలని కూడా ఆలోచన చేసింది గానీ అంత సాహసం చేయలేకపోయింది. అయితే రాష్ట్ర విభజనతో వైకాపాను తెలంగాణా నుండి విభజించి దెబ్బ తీయగలిగింది. తెదేపాలో కూడా విభజన చిచ్చుబాగానే పెట్టగలిగింది.   ఇక స్వయంగా తన స్వంత పార్టీ నేతలను కూడా ప్రాంతాల వారిగా విభజించి, పక్కా ప్రణాళికతో పావులు కదుపుతోంది. ఇరు ప్రాంతాల నేతల చేత సమర్ధంగా డ్రామా నడిపిస్తూ రెండు ప్రాంతాలలో కూడా పాగా వేయాలని ఎత్తులు వేస్తోంది. విభజన పుణ్యమాని తెదేపా, వైకాపాలు సీమాంధ్రపై ఆధిపత్యం కోసం కత్తులు దూసుకొని పోరాడుతుంటే, తన సీమాంధ్ర నేతలకి కిరణ్ కుమార్ రెడ్డిని నాయకుడిగా మలిచి ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఈ సందిగ్ధంలో ప్రజలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు కల్పించి, ఇంతవరకు కాంగ్రెస్ పాలనలో నరకం చూసిన, చూస్తున్నప్రజల చేతనే కిరణ్ కుమార్ రెడ్డి అందరి కంటే యోగ్యుడని అనిపించగలిగింది.   ఇక నేడోరేపో ఆయన చేత సమైక్యాంధ్ర కోరుతూ పాదయాత్రలు కాకపోయినా ఏవో ఒక రకమయిన యాత్రలు చేయించే అవకాశం ఉంది. ఈ దెబ్బకి వైకాపా, తెదేపాలకి సమైక్య ఆయుధం చేజారిపోతుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తుంటే ఇక ప్రజలు షర్మిలను, చంద్రబాబును పట్టించుకొంటారో లేదో త్వరలోనే తేలిపోతుంది.   అయితే తరువాత ఇస్టోరీ ఏమిటాంటారా ? సస్పెన్స్? దీని క్రింద వచ్చేఇస్టోరీ చదివి అందులోంచి మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకొనే అవకాశం మీకే ఉంది.

డివైడ్ అండ్ రూల్ ఇష్టోరీ పార్ట్-2

  కాంగ్రెస్ పార్టీ (తెరాస కాదు) తెలంగాణా రాష్ట్రం ఇస్తోంది గనుక రానున్న ఎన్నికలలో అక్కడ కొంచెం వీజీగానే విజయం సాధించవచ్చును. అవసరమయితే తెరాసను కలిపేసుకోవచ్చును, ఇంకా మొండికేస్తే వాళ్ళని కూడా విభజించి తెరాసను నామరూపాలు లేకుండా చేయవచ్చును. ఏదారి లేకపోతే చివరికి పొత్తులు కూడా పెట్టుకోవచ్చును.   కానీ, సమైక్యాంధ్ర అని ఘర్జిస్తున్న సీమాంధ్రలో ప్రజలని ఎలా పడేయాలి? 25మంది యంపీలు, 150మంది శాసన సభ్యులు ఉన్న సీమాంధ్రలో గెలవాలంటే ఉపాయలేమిటి? బహుశః ఈ రాష్ట్ర విభజన సీరియల్లో, కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగులు చివరికి ప్రమోషన్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం ముందే సిద్దం చేసుకొందనే విషయం త్వరలోని క్రమక్రమంగా బయటపడుతుంది.   ఆ ప్రకారమయితే, కాంగ్రెస్ ముందు మూడు ఆప్షన్స్ సిద్దంగా ఉన్నాయి. వాటిలో ఆ పార్టీకి కావలసింది అది ఎంచుకొంటే, మీకు నచ్చింది మీరు ఎంచుకోవచ్చును. లేకుంటే మన్ది ఇంతా చెడ్డా ప్రజాస్వామ్యం గాబట్టి సింపుల్ గా ‘రిజక్ట్ బటన్’ నొక్కేయవచ్చును.   ఆప్షన్ 1:ముఖ్యమంత్రి ధిక్కార స్వరం, పదవికి, పార్టీకి రాజీనామా, సీమాంద్రా కాంగ్రెస్ నేతలు కొందరు కొత్త పార్టీ స్థాపన, దానికి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం, ఆయన నాయకత్వంలో ఎన్నికల వరకు కాంగ్రెస్ అధిష్టానంపై సమైక్యాంధ్ర పోరాటం, సీమాంధ్రలో తెదేపా, వైకాపాలకు చెక్ పెడుతూ ప్రజల ఓట్లను నొల్లుకోవడం, ఆనక షరా మామూలుగా కాంగ్రెస్ పార్టీలోవిలీనం చేసేయడం.   ఆప్షన్ 2: ఇది కొంచెం నష్టదాయకమయినది, పైగా రిస్క్ తో కూడుకొన్నది. జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు, వీలయితే వైకాపా విలీనం లేకుంటే షరా మామూలుగా ఆ పార్టీ నేతలని కూడా డివైడ్ అండ్ రూల్ తో లాగేసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలలో పొత్తులు. ఒకవేళ వ్యవహారం పొత్తుల వరకు వెళితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు.   ఆప్షన్ 3: సీమాంధ్రలో మరో రెండు మూడు కొత్త డమ్మీ సమైక్య రాజకీయ పార్టీలను పుట్టించి తెదేపా, వైకాపాల ఓట్లు చీల్చి, ఎన్నికల తరువాత ఆ కొత్త పార్టీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసుకోవడం.

హెరిటేజ్‌ ని టార్గెట్ చేసిన కోదండరాం

      హెరిటేజ్‌తో తమ పాల వ్యాపారుల పొట్టకొట్టారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. నగరంలో 10 శాతం ఉన్న వారే హైదరాబాద్ తమది అంటే, 90 శాతం ఉన్న తాము ఏమనాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే గుప్పెడు మంది దోపిడీదార్లకే నష్టమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రతీ బస్తీ బంజారా హిల్స్ కావాలని ఆకాంక్షించారు. కేవలం సినిమాలు, మీడియానే కాకుండా వ్యవస్థలన్నీ సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. చివరకు పాఠ్యపుస్తకాన్ని కూడా ఎవరు రాయాలో సీమాంధ్రులే నిర్ణయిస్తారన్నారు. అన్ని రంగాలలో సీమాంధ్రులే ఉంటే తెలంగాణ ప్రాంత సమస్యలు ఎలా అర్థమవుతాయి, ఎలా తీరుతాయని ప్రశ్నించారు.

టార్గెట్ సీయం కిరణ్ కుమార్ రెడ్డి

  ఇటీవల హైదరాబాదులో జరిగిన ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ తెరాసపై ఏవిధంగా ప్రభావం చూపిందో అదేవిధంగా వైకాపాపై కూడా బాగా ప్రభావం చూపింది. దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు అంతకు మూడు రెట్లు ఉండే వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించిన ఈ సభలో ఒక్కరు కూడా వైకాపా చేస్తున్న సమైక్యాంధ్ర పోరాటాన్ని మెచ్చుకోలేదు, కనీసం గుర్తించను కూడా లేదు. పైగా ఈ రధ యాత్రలు, పాదయాత్రల భాగోతాలు కట్టిబెట్టి ప్రజల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించమని హెచ్చరికలు కూడా జారీ చేసారు.   ఇక అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం సమైక్యాంధ్ర రధసారధిగా గుర్తించి పొగడ్తలు కురిపించారు. ఇది సహజంగానే వైకాపాకు జీర్ణం కావడం చాలా కష్టం. సమైక్యాంధ్ర కోసం అందరి కంటే ముందుగా రాజీనామాలు చేసి, ఆ తరువాత తెలంగాణాను త్యాగం చేసి, ఆమరణ దీక్షలు, బస్సుయాత్రలు చేస్తుంటే, దానిని ఏపీఎన్జీవోల సభ మెచ్చుకొనకపోగా, తీవ్రంగా తప్పుపట్టడం సహించలేకపోయింది. దాదాపు ఏడాదిగా ఎండనకా వాననకా రోడ్లపై తిరిగి కష్టపడినప్పటికీ తమకి దక్కని ఫలితం, ఏసీ గదిలో కూర్చొని కేవలం రెండంటే రెండే రెండు మీడియా సమావేశాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఖ్యాతిని అమాంతం స్వంతం చేసుకోవడం వైకాపాకు బాధ కలిగించడం సహజమే.   ఇక, ఏపీఎన్జీవోల దన్నుతో ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగినట్లయితే, తాము ఇంతకాలంగా పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వైకాపా భయపడుతోంది. సీమాంధ్రలో పట్టు సాధించడానికి తెలంగాణాను బలిపెట్టడం వలన ఇప్పుడు అక్కడ కాలుమోపలేని పరిస్థితి. కానీ తెదేపా మాత్రం ఇప్పటికీ తెలంగాణాను చేజారకుండా జాగ్రత్త పడుటం చూసి, ఈ విషయంలో తొందర పడ్డామా? అని ఆలోచనలో పడింది. కానీ ఇప్పటికే అక్కడ జరుగవలసిన నష్టం జరిగిపోయింది.   సీమాంధ్రపై ఆధిపత్యం సంపాదించేందుకు తెదేపాతో పోటీ పడుతుంటే, ఇప్పుడు అకస్మాత్తుగా సమైక్యాంధ్ర హీరోగా ముద్రతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేసులో ప్రవేశిస్తే సీమాంధ్ర కూడా చేయి జారితే, అప్పుడు తమ పరిస్థితి ఏమిటనేది వైకాపా ఆందోళన చెందుతోంది. బహుశః అందుకే షర్మిల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై తన దాడి తీవ్ర తరం చేసారని భావించవచ్చును.

సోనియమ్మ ఆజ్ఞ లేనిదే...

  శివుడాజ్ఞ లేనిదే చీమయినా కదలదని నాటి మాట. సోనియమ్మా ఆదేశం లేనిదే మన్మోహనయినా కదలరనేది నేటి మాట. సోనియమ్మ విదేశాలకు వెళ్ళవలసి రావడంతో, దేశంలో, రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వాలు ఉన్నపటికీ, రాష్ట్రంలో నానాటికి దిగజారుతున్నపరిస్థితులనూ ‘నిశితంగా గమనించడం’ తప్ప మరేమీ చేయలేకపోతున్నాయి.   అసలు ప్రధాన మంత్రి అయితే రాష్ట్ర విభజన విషయంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదనే రీతిలో వ్యవహరించడం చాల విచిత్రమయితే, రాష్ట్రంలో అదుపుతప్పుతున్న పరిస్థితులను కళ్ళారా చూస్తూ కూడా, కేంద్ర హోంమంత్రి షిండే రాష్ట్రం చాల బేషుగ్గా ఉందని శలవీయడం, ‘తెలంగాణా నోట్’ పై ఆమోద ముద్ర వేయించుకోవడానికి సోనియమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకోవడం గమనిస్తే, ప్రభుత్వాన్నిసోనియమ్మ ఏవిధంగా రిమోట్ కంట్రోల్ చేస్తున్నారో అర్ధం అవుతుంది. ఆమె రాక కోసం ఇంత కాలం కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వము చకోరపక్షుల్లా ఎదురు చూసారు.   ఇక, కిరణ్ కుమార్ రెడ్డి కొద్దో గొప్పో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ మాట్లాడినప్పటికీ, ఆయన కూడా రాష్ట్ర పరిస్థితులను చక్క దిద్దే ప్రయత్నం చేయడం లేదు. బహుశః ఆయనకు సోనియా గాంధీ అనుమతి లేకపోవడం వలననే నీరో చక్రవర్తి పాత్ర బహు చక్కగా పోషిస్తున్నారేమో మరి తెలియదు. ఇప్పుడు సోనియమ్మ డిల్లీకి తిరివచ్చారు గనుక ఇప్పటికయినా ఆమె అనుమతితో ప్రభుత్వాలు పనిచేయడం మొదలుపెడితే వారిని ఎన్నుకొన్నప్రజలు వారికి కృతజ్ఞతలు అర్పించుకొంటారు.

అజ్ఞానాంధకారంలో భారత ప్రజానీకం

    ..... సాయి లక్ష్మీ మద్దాల     నేడు దేశాన్ని ఎన్నో సమస్యలు తీవ్రంగా పట్టి పీడిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది దేశ భద్రత. దేశ భద్రతను గాలికి వొదిలేసి ఆహార భద్రత అనే సంక్షేమ పధకం  ద్వారా తమ అధికారానికి భద్రత కల్పించుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకపక్క నుండి పాకిస్తాన్ స్వయంగా దేశంలోనే చొరబడి దేశ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తుంటే,ప్రజల ప్రాణాలకు ఎలాంటి భద్రత కల్పిస్తారో భరోసా ఇవ్వలేని నాయకులు నేడు దేశాన్ని ఏలుతున్నారు. మరో ప్రక్కనుండి చైనా రోజుకు కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ముందుకొస్తున్నా ఎటువంటి ధిక్కార చర్యలు చేపడుతున్నారో చెప్పలేరు. పైగా భూసేకరణ బిల్లు ద్వారా దేశ ప్రజలకు ఏదో ఒరగదోస్తామని మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నారు.     ఇవన్ని దేశ సరిహద్దు సమస్యలు. కానీ  నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మరో పెద్ద సమస్య ఆర్ధిక సంక్షోభం. దీనికి ఎవరు భాద్యులు?పనికి మాలిన ప్రజాకర్షక పదకాలన్ని ప్రవేసపెట్టి,ముందుచూపు లేని ఆర్ధిక నిర్ణయాల పర్యవసానమే నేటి ఆర్ధిక సంక్షోభానికి ముఖ్య కారణం. 2014 ఎన్నికలలో తిరిగి అధికారాన్ని దక్కించు కోవటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యు.పి. ఎ సర్కారుకు దేశ ప్రగతి పట్టటం లేదు. ఫలితంగానే 45లక్షల కోట్లు ప్రపంచ దేశాలకు రుణపడేలా భారత దేశాన్ని ఉంచింది. ఈ చర్యల తాలూకు పర్యవసానాన్ని దేశ ప్రజలు భరిస్తున్నారు. ఏది కొందామన్న,తిందామన్న అందుబాటులో లేని ధరలు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి,తగురీతిలో భవిష్యత్తులో ఆర్ధిక కార్యాచరణ చేపట్టగలమని చెప్పే ధైర్యం అటు అధికార పక్షానికి లేదు. ఆ అధికార పక్షం నైజాన్ని ఎండగట్టి ప్రజలకు భరోసా ఇవ్వగలిగిన సత్తా ఇటు దేశ ప్రధాన ప్రతిపక్ష మైన బి.జె. పి  కి లేదు. మరి దేశం ఎలా బాగుపడేది?                     ప్రజలందరికి అందుబాటులో నాణ్యమైన విద్య,వైద్యం మౌలిక సదుపాయాలు ఉంచగలిగే పరిపాలన సామర్ధ్యం నేటి నేతలలో కొరవడిన ఫలితంగానే ఈనాడు ప్రజల మధ్య పనికిమాలిన విద్వేషాలసృష్టికి అంకురార్పణ జరుగుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల మధ్యకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నారు. దానిలో భాగంగానే ఆహారభద్రత పేరుతో 1,80,000కోట్ల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. రాష్ట్రాల విభజనను తెరమీదికి తెస్తున్నారు. ప్రజలంతా ఆర్దికభారంతో,ప్రాంతీయ విద్వేషాలతో తన్నుకు చస్తుంటే సందట్లో సడేమియా లాగ తమ పదవికి అధికారానికి ఏ డోకా లేదని వారు మాత్రం వికటాట్టహాసం చేస్తున్నారంటే యావత్ భారత ప్రజానీకం అజ్ఞానాంధకారంలో ఉన్నారనే కదా!

జగన్ బెయిల్ డీల్..!!

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి బెయిలుకు తెరవెనుక రంగం సిద్ధమవుతోందనే అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. మంగళవారం జగన్ కేసులో సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం...మరుసటి రోజు జగన్ బెయిల్ కోసం పిటిషన్ వేయడంతో ఒక్కసారిగా జగన్ మళ్ళీ వార్తల్లోకెక్కారు.     తాజాగా జగన్ బెయిల్ పై కాంగ్రెస్‌తో 'డీల్' కుదిరిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వంతో విజయమ్మ, భారతిలు చేసిన లాబియింగ్ అనంతర పరిణామాలే.... జగన్ బయటకు వస్తారనే ప్రచారం రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.     ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి ఎదురవుతున్న సవాళ్ళు...కాంగ్రెస్ తో వార్ ఫలితాలు నేర్పిన పాటాలు ఆయన్నీ ఒక పక్క ఉక్కిరిబిక్కిరి చేస్తూంటే మరోవైపు సిబిఐని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు ప్రయోగిస్తోందంటూ వైకాపా అధికార ప్రతినిధులు, జగన్ కుటుంబ సభ్యులు ఊరూవాడ ప్రచారం చేస్తున్నారు..అయినా ఫలితం లేకపోవటంతో...చివరికి రాజకీయ లక్ష్యం ఎలా వున్నా, కేసులా నుంచి బయటపడితే చాలు అనే స్థితికి జగన్& పార్టీ వచ్చాయి. మారిన వైకాపా వైఖరిని గమనించి కాంగ్రెస్ అధిష్టానం కూడా భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం లౌక్యాన్ని ప్రదర్శిస్తోంది.     అయితే మొన్నటిదాకా జగన్‌కు సీబీఐ కేసుల్లో బెయిల్ వచ్చినట్లయితే, వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుందని... జగన్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తరలిస్తుందని భావించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదని చెప్పవచ్చు. జగన్ ఆస్తులను స్తంభింపచేస్తూ వచ్చిన ఈడీ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. మొత్తం మీద జగన్ 15 నెలలు గడపిన జైలు జీవితం ముగింపుకు వచ్చినట్లే నని అంటున్నారు విశ్లేషకులు.

త్వరలో మరో కోర్ కమిటీ సమావేశం

  రాష్ట్ర విభజన చేసి ఒక గొప్ప సమస్యను పరిష్కరించిన ఘనత, దానితో బాటే ఎన్నికలలో రాజకీయ లబ్దిపొందాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని ప్రకటించింది. అయితే అది ఊహించని విధంగా సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయ్యి, అది నానాటికి ఉద్రుతమవుతోందే తప్పతగ్గే సూచనలు కనబడటం లేదు. అయితే కధ ఇంతవరకు వచ్చిన తరువాత అటు కేంద్రం, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్న ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. అయినప్పటికీ ఇంత కాలం సోనియా గాంధీ విదేశాలకి వెళ్ళిన కారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి చొరవ చూపకుండా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. పైగా హోంమంత్రి షిండే సోనియా గాంధీ రాగానే ‘తెలంగాణా నోట్’పై తదుపరి చర్యలు మొదలవుతాయని చెప్పడం సీమాంధ్ర ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లు మండిపడ్డారు. తత్ఫలితంగా ఉద్యమాలు మరింత తీవ్ర తరం చేసారు. చివరికి నిన్న రాత్రి నుండి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకి దిగారు.   నిన్న సోనియా గాంధీ స్వదేశం తిరిగి రావడంతో ఈ రోజు సాయంత్రం లేదా రేపు కోర్ కమిటీ అత్యవసర సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముందుగా రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించి, దానిని బట్టి రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళాలా లేక తాత్కాలికంగా కొంచెం స్పీడు తగ్గించాలా? అనేది నిర్ణయించుకోవచ్చును. ముందుగా రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో తీసుకువచ్చేందుకు తగిన చర్యలు చేప్పట్టి, ఆ తరువాత తెలంగాణా నోట్ పై ముందుకు సాగే అవకాశం ఉంది.

జగన్ బెయిలు పిటిషను విచారణ వాయిదా

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్నసీబీఐ కోర్టులో పెట్టుకొన్నబెయిల్ పిటిషన్ పై కౌంటర్ వేయడానికి 5రోజులు గడువు కావాలని సిబిఐ న్యాయవాది కోరడంతో, ఈ కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. ఇక జగన్మోహన్ రెడ్డి సరిగ్గా బెయిలు పిటిషను వేసే సమయానికి ఇంతవరకు అతని కేసులు చూస్తున్న సీబీఐ ఎస్.పి.వెంకటేష్ కేరళకు బదిలీ కావడం అతని స్థానంలోకి చంద్రశేఖర్ అనే కొత్త అధికారి రావడం విశేషం. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఆఖరి చార్జ్ షీట్ కూడా వేసిన తరువాతనే ప్రస్తుత ఎస్.పి.వెంకటేష్ బదిలీపై వెళ్లబోతున్నట్లు సమాచారం.   ఇక మొన్నతాజాగా సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్ షీట్లలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, భారీ నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల పేర్లు లేకపోవడంతో తెదేపా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత మారబోయే రాజకీయ సమీకరణాలకు ఇది కాంగ్రెస్ చేస్తున్న సన్నాహమని తెదేపా భావిస్తోంది. విజయమ్మ డిల్లీ యాత్ర తరువాతనే ఈ మార్పులు మొదలవడాన్నిఅందుకు కారణంగా పేర్కొంటోంది.   తెదేపా వాదనలు నిజమయితే త్వరలో జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదల కావడం ఖాయమని చెప్పవచ్చును. ఏది ఏమయినప్పటికీ మరో ఐదు రోజులలో ఏ సంగతీ తెలిసిపోయే అవకాశం ఉంది. తెదేపా చేస్తున్నఈ తీవ్ర ఆరోపణల నేపద్యంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా సీబీఐ అడ్డుపడినా పడవచ్చును.

సమ్మె కొనసాగిస్తాం

  ఈ నెల 16న సీమాంద్ర ఉద్యోగుల సమ్మెకు సంభందించి కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తన కార్యాచరణ ప్రకటించారు. కోర్టు తీర్పు ఎలా ఉన్న సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కేసులకు నిర్భందాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చారు. హైకోర్టుతో వచ్చిన తీర్పు తమకు వ్యతిరేఖంగా ఉంటే ఆ తీర్పును సుప్రిం కోర్టుతో సవాల్‌ చేస్తామన్నారు. ఏపీఎన్జీవో సంఘం నేతలతో కలిసి బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 16 కోర్టు ఇచ్చే తీర్పు తమకు వ్యతిరేఖంగా వచ్చే అవకాశాలే ఎక్కువన్నారు. హైకోర్టు వద్ద న్యాయవాదులు మధ్య జరిగిన గొడవను ఆయన ఖండించారు. శాంతియుతంగా చేపట్టిన సీమాంద్ర న్యాయవాదుల మానవహారాన్ని తెలంగాణవాదులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండిచారు.

మాది సమైఖ్యవాదమే : విజయమ్మ

  తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఆపేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షులు వైయస్‌ విజయమ్మ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు లేఖ రాశారు. సిపియం మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా ఉన్నాయన్న షిండే వ్యాఖ్యలను ఆమె ఖండిచారు. సిపియంతో పాటు మజ్లిస్‌, వైయస్‌ఆర్‌సిపిలు కూడా విభజనకు వ్యతిరేఖమన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అఖిలపక్షంతో పాటు, ప్రదానికి రాసిన లేఖలో కూడా తాము సమైఖ్య గళమే వినిపించామన్నారు విజయమ్మ. విభజన నిర్ణయం వల్ల సీమాంద్ర ప్రాంతం తగలబడుతుందని కేంద్ర చొరవ తీసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. ఏకాభిప్రాయం కుదరక కుండా విభజనపై ముందుకెలా వెళ్తారని ప్రశ్నించిన ఆమె, రాష్ట్రం కలిసున్నపుడే కర్నాటక, మహారాష్ట్రలతో నీటి సమస్యలు ఉన్నాయని విభజన తరువాత సమస్యలు మరింత తీవ్రమవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే లభిస్తున్నదని, విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికి వెళ్ళాలని ఆమె ప్రశ్నించారు.