ఒకే వేదిక‌పైకి అద్వాని, మోడి

  ప్రదాని అభ్యర్ధిగా మోడి ప్రక‌ట‌న‌ల‌తో కినుక వ‌హించిన అద్వాని శాంతిస్తున్నట్టుగా స‌మాచారం.ఇప్పటి వ‌ర‌కు అద్వాని ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాకున్నా ఆయ‌న అల‌క తీర్చడానికి బిజేపి అగ్రనేత‌లు చేస్తున్న ప్రయ‌త్రాలు ఫ‌లిస్తున్నట్టుగా క‌నిపిస్తున్నాయి. బిజెపి పార్టీ ఎప్పుడు అద్వాని సార‌ధ్యంలోనే న‌డుస్తుంద‌ని రాజ్‌నాధ్ వ్యాఖ్యనించ‌గా, అద్వానికి ఎలాంటి అసంతృప్తి లేద‌న్నారు సుష్మా. మోడి ప్రక‌ట‌న‌తో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారాయి. అదే స‌మ‌యంలో అద్వాని రాజ్‌నాధ్‌కు లేఖ రాయ‌డంలో అద్వాని మ‌రోమారు అస్త్రస‌న్యాసానికి దిగుతున్నట్టుగా కూడా వార్తలు వ‌చ్చాయి.  అయితే అలాంటి వాద‌న‌ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ బిజెపి పెద్దలు అద్వానిని బుజ్జగించే ప్రయ‌త్నం చేశారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, అద్వానీని శాంతపర్చేందుకు అన్నిర‌కాలుగా ప్రయ‌త్నించారు. అద్వాని ఎప్పటికి బిజెపి అగ్రనేతే అన్న రాజ్‌నాధ్ ఆయ‌న‌కు మమ్మల్ని తిట్టే హ‌క్కు కూడా ఉంటుంద‌ని చెప్పారు. భ‌విష్యత్తులో కూడా ఆయ‌నే మ‌మ్మల్ని ముందుడి న‌డిపిస్తార‌ని, భోపాల్‌లో జ‌ర‌గ‌బోయే స‌భ‌లో అద్వాని మోడిలు ఒకే వేదిక పంచుకోనున్నార‌ని ప్రక‌టించారు.

నా కూతురే అయితే సజీవ దహనం చేసేసేవాడిని

  “నా కూతురే గనుక పెళ్ళికి ముందే శృoగారంలో పాల్గొంటూ పరాయి మొగాడితో అలా అర్ధ రాత్రి వరకు రోడ్ల మీద తిరిగి ఉంటే, ఆమెను నేనే సజీవ దహనం చేసేసేవాడిని. అసలు ఇటువంటి పరిస్థితి రానే రానీయకపోదును. తల్లి తండ్రులందరూ కూడా ఇటువంటి ధోరణినే అలవరచుకోవాలి,” ఈ వివాద స్పద మాటలు అన్నది మరెవరో కాదు నిర్భయ కేసులో ఇద్దరు దోషుల తరపున డిఫెన్స్ లాయర్ గా వాదించిన ఏపీ.సింగ్.   ఆయన చేసిన వ్యాఖ్యలతో డిల్లీ ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారే గాక డిల్లీ బార్ కౌన్సిల్ సభ్యులు కూడా అతని వ్యాక్యలను తప్పుపట్టారు. అతనిపై ఎవరయినా లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినట్లయితే దాని ఆధారంగా కేసు వేస్తామని, లేకుంటే అతను మీడియాతో అన్నమాటలనే సుమోటోగా స్వీకరించి అతనిపై కోర్టులో కేసు వేస్తామని డిల్లీ బార్ కౌన్సిల్ కార్యదర్శి మురారి తివారి మీడియాకు తెలియజేసారు. ఈ నెల 20న జరుగనున్న బార్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.

ఉమ్మడి రాజ‌ధానికి ఒప్పుకోం

  విభ‌జ‌న‌కు వ్యతిరేఖంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న నేప‌ధ్యంలో తెలంగాణ నాయ‌కులు కూడా త‌మ స్వరం పెంచారు. రాష్ట్రవిభ‌జ‌న అనివార్యం అయిన ప‌క్షంలో హైద‌రాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజ‌ధానిగా చేయాల‌న్న కొంద‌రు సీమాంద్ర నాయ‌కుల వాద‌నను వారు ఖండిచారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని తాత్కలిక ఉమ్మడి రాజ‌ధానిగా అయితేనే అంగీక‌రిస్తాం త‌ప్ప శాశ్వత ఉమ్మడి రాజ‌ధానిగా అంగీక‌రించే ప్రస‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. ఈనెల 29వ తేదీన సకల జనుల భేరీ నిర్వహిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. దీనితో పాటు తెలంగాణ జిల్లాలో ప‌దిరోజుల పాటు స‌న్నాహ‌క ర‌ణ‌భేరి ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగా ప్రక‌టించారు. రాష్ట్ర రాజ‌ధాని పై పెద్ద మ‌నుషుల ఒప్పందం త‌ర‌హాలో నిర్ణయం జ‌ర‌గాల‌న్నారు. అలాగే రాజ‌ధాని విష‌యంలో ఎలాంటి మార్పు లేకుండా మంత్రులు ప్రజా ప్రతినిధుల‌పై వ‌త్తిడి తీసుకు వ‌స్తామ‌ని జెఏసి నాయ‌కులు ప్రక‌టించారు.

'తెలుగుతేజం' యాత్రలో జెపికి సమైక్య సెగ

        లోక్ సత్తా నేత, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ‘తెలుగుతేజం’యాత్రలో సమైక్య సెగ తగిలింది. కొండారెడ్డి బురుజు వద్ద జేపిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో లోక్సత్తా కార్యకర్తలకు సమైక్యవాదులకు మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. సమైక్యవాదులు అక్కడ ఉన్న స్పీకర్ బాక్స్లను తోసి వేశారు. జేపి గోబ్యాక్ అని నినాదాలు చేశారు. జేపీ వెళ్లిపోయిన అనంతరం సమైక్యవాదులు లోక్ సత్తా పార్టీ బ్యానర్ల, జెండాలను తొలగించారు. ఇక కర్నూలులో జేపీ వ్యాఖ్యల పట్ల తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాష్ట్ర విభజన జరిగిందని హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన జేపీ ఇప్పుడు విభజన అంశం ముందుకు వెళ్లొద్దని, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టామని, రాజధానిని త్యాగం చేశామని ఎలా అంటారని తెలంగాన వాదులు ప్రశ్నిస్తున్నారు.

కెసిఆర్ దృష్టిలో 1956కి "ముందున్న తెలంగాణా జిల్లాలే''వి?

  - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     ఒకటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చి, "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తానని మాటయిస్తే'' తాను ఏర్పాటు చేసుకున్న సొంతపార్టీ (టి.ఆర్.ఎస్.)ను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో రహస్యమంతనాలు జరిపివచ్చిన కాంగ్రెస్ మాజీ సభ్యుడు, "తెలుగుదేశం'' పార్టీలో మాజీమంత్రి అయిన "బొబ్బిలిదొర'' కె.సి.ఆర్. మళ్ళీ క్షణానికొక మాట మారుస్తున్నారు. ఇలా అతని నాలుక పదేపదే తిరగబడుతూ కొత్త ప్రతిపాదనలతో కొత్త సమస్యలు లేవనెత్తుతూండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తల బద్ధలు కొట్టుకోవలసి వస్తోంది. ఈలోగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ప్రజలు ఆందోళన చెంది, భారీస్థాయిలో ఉద్యమాల బాట పట్టవలసి వస్తోంది. ప్రజలను ఎలా విరగదొక్కాలో తెలిసిన కె.సి.ఆర్. తాజాగా ఓ కొత్త నినాదం లేవనెత్తాడు. తన మాట విని, తన డిమాండ్ ను అంగీకరించి, ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే "తెలంగాణా పునర్నిర్మాణం'' పేరిట తనను ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ప్రకటిస్తే సరి, లేదా అది నెరవేరే దాకా కాంగ్రెస్ తో సహకరించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానంతో ఆయన పేచీ పెట్టుకున్నాడు. ఈ "పేచీకోరు''తో తన అనాలోచిత నిర్ణయాల ద్వారా యిప్పటికే రెండు ప్రాంతాలలోనూ (సీమాంధ్ర, తెలంగాణా) పరువు ప్రతిష్ఠలు వేగంగా కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కె.సి.ఆర్. మాటలు వింటే "కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే''నన్న సామెతలా అవుతుందని భావించిన కాంగ్రెస్ రెండు ప్రాంతాలలోనూ తన మిగిలిన పరువును కాపాడుకోవడం కోసం "రెండు పడవలపై''న రెండు కాళ్ళు పెట్టి కె.సి.ఆర్.తో సంబంధం లేకుండా పార్టీని ఇటు తెలంగాణాలోనూ, అటు సీమాంధ్రలోనూ కొనవూపిరితోనైనా బతికించుకోవాలని నిర్ణయించుకుంది!     హైదరాబాద్ లో ఇటీవల భారీ ఎత్తున జరిగిన "సమైక్యాంధ్ర సభ'' జయప్రదం కావడంతో ఇటు తెలంగాణలో కెసిఆర్ (టి.ఆర్.ఎస్.) పార్టీతో నిమిత్తం లేకుండానే, సమైక్యాంధ్ర సభ తాకిడి ఫలితంగా వేరుగా ఒక సభ జరపాలని స్థానిక కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది; అటు కె.సి.ఆర్. వర్గం కూడా కాంగ్రెస్ తో సంబంధం లేకుండా లోపాయకారీగా కాంగ్రెస్ సభకు పోటీగా వేరే సభను వేరే తేదీల్లో జరపాలని నిర్ణయించుకుంది! అంటే అటువైపు, సమైక్యాంధ్ర సభలు జరపడానికి రాజకీయ నాయకులను వెలివేసి ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.వో.ల సంస్థ కేవలం ఉద్యోగవర్గాలతో భారీస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగుతూండగా, ఇటు కె.సి.ఆర్. వర్గానికి, అటు కాంగ్రెస్ (తెలంగాణాలో) నాయకవర్గానికి "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం'' అనే లక్ష్యం ఒకటే అయినా, ఒకే సభగా కాకుండా "ఎవరికీ వారే యమునా తీరే'' అన్నట్టుగా వేర్వేరుగా రెండు భిన్నమైన తేదీల్లో జరుపుకుంటున్నారు. అంటే, అక్కడ జరుగుతున్నది తెలుగుజాతి విడిపోకూడదు, "విడిపోతే చెడిపోతాం'' అన్న హెచ్చరికలతో ఉద్యోగ కార్మిక, కర్షక, విద్యార్థి, వర్తక, మహిళా, బడుగు బలహీనవర్గాల ప్రజాబాహుళ్యంతో, గ్రామ గ్రామం నుంచీ సాగుతున్న మహోద్యమం కాగా, ఇక్కడ మన తెలంగాణలో నడుస్తున్నది కేవలం రాజకీయ నిరుద్యోగుల నిర్వహణలో పదవీ ప్రయోజనాల కోసం సాగిస్తున్న ఉద్యమంగా మారింది! అందుకే, లక్ష్యంలోనూ, ఆచరణలోనూ కూడా ఇరుప్రాంతాల సభల మధ్య అంత తేడా వచ్చింది. ఈ ఇరువర్గాల ఉద్యమాల మధ్య నినాదాలలో కూడా నేలకూ నింగికీ మధ్య ఉన్నంత తేడా స్పష్టంగా కన్పిస్తోంది!   "సీమాంధ్రులది ఒక సభా, పనికిమాలినది'' అని ఇటు రాజకీయ నిరుద్యోగుల ఉద్యమనాయకులు వర్ణిస్తుండగా, అటు సీమాంధ్ర ఉద్యోగసంఘాల "సమైక్యాంధ్ర'' ఉద్యమం "తెలుగుజాతి ఒక్కటిగా కలిసి ఉంటే'' సభ్యప్రపంచంలో ఇనుమడించిన వ్యక్తిత్వంతో "ఎగిసిపడుతుంది'' అని నినదించింది; రాష్ట్ర సమస్యలకు "మూడుప్రాంతాల ప్రజల మధ్య, ప్రజా ప్రతినిధుల మధ్య ప్రజాస్వామిక చర్చలే శరణ్య''మని చివరికి మావోయిస్టు పార్టీ సహితం ప్రకటిస్తుండగా అసలు "చర్చలే మాకొద్దు, లెక్కలూవద్దు, మా తెలంగాణా మాకివ్వండి'' అని వేర్పాటు ఉద్యమ నిరుద్యోగ నేతలు నినదిస్తున్నారు. సరిగ్గా ఈ సందర్భంగానే మూడు, నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి కె.సి.ఆర్. కాంగ్రెస్ నూ, అతడితో పోటీగా ఎక్కడ వెనుకబడి పోతామోనని ఇన్ని రోజులూ "ప్రత్యేక రాష్ట్ర'' నినాదంతో కదంతొక్కినా చంద్రబాబు పార్టీ సహా కొన్ని ఇతర పార్టీల రాజకీయ నిరుద్యోగులూ ఆశ్చర్యపడేలా ఒక ప్రకటన చేశాడు.   అసలు అదీ, ఇదీ కాదు "1956 నాటికి ఉన్న తెలంగాణా'' అంతా కావాలని, అంతకు మినహా మరొకటి తనకు ఇష్టంలేదనీ పాత 'దొర'స్వామ్యం రాచరికపు స్థాయిలో కెసిఆర్ ప్రకటించారు! అంటే, నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలన్న  కోరికపై ప్రారంభించి కొనసాగిస్తున్న "ఉద్యమాన్ని'' 1956కి ముందు, నిజాం పాలనలోనూ, 1953 నాటి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న 16 జిల్లాలతో కూడిన తెలంగాణా కావాలని ఆయన కోరుతున్నాడన్న మాట, అప్పటిదాకా చెబుతున్న 10 జిల్లాలకు తోడు ఏనాడో హైదరాబాద్ స్టేట్ లో నిజాం-బ్రిటిష్ పాలకుల జమానాలో యుద్ధాలద్వారా, దురాక్రమణ పూరిత ఒడంబడికల ద్వారా కలుపుకున్న మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలు సహా అదే స్టేట్ లోని నిరంకుశ పాలన కింద విద్యకు, వికాసానికి దూరమై, అణచివేతలకు గురి అవుతూ వచ్చిన తెలుగు జిల్లాలని అర్థం!   అంటే, 1953లో కేంద్రప్రభుత్వం తెలుగుప్రాంతాలన్నింటిని [సీమాంధ్ర-నిజం ఆంధ్రుల జిల్లాలతో] విలీనంచేసి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పరచాలన్న సంకల్పంతో సమస్య పరిశీలనార్థం నియమించిన జస్టిస్ ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పాటు చేయగా, ఆ కమీషన్ 1955 చివరి మాసాల కల్లా సమర్పించిన నివేదిక ప్రకారమే "ఆంధ్రప్రదేశ్'' ఏర్పడింది; ఆ నివేదిక ప్రకారమే భాషాప్రయుక్త రాష్ట్రాలా ప్రాతిపదికపైన హైదరాబాద్ స్టేట్ లో అంతవరకూ భాగమై ఉండి, కునారిల్లిపోతూ వచ్చిన మరాఠీ ప్రాంతాలూ, కన్నడ ప్రాంతాలూ ఎలాంటి వివాదాలూ లేకుండా అటు బొంబాయి రాష్ట్రంలోనూ, ఇటు కర్నాటక రాష్ట్రంలోనూ చేరి పునరావాసం పొందాయి! అలానే ఈ కమీషన్ నివేదిక ఆధారంగానే ఆంధ్ర-తెలంగాణాల విలీనం సందర్భంగా తలెత్తే సమస్యలేవైనా ఉన్నా, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలలో విలీనమైన పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో నిరంకుశ పాలన క్రింద మగ్గిపోతూ వచ్చిన మరాఠీ, కన్నడ ప్రాంతాలతో కూడా ఆ రెండు రాష్ట్రాలలో కొన్ని సమస్యలు రావచ్చుననీ, విశాల భాషాప్రయుక్త రాష్ట్రాలలో తలెత్తే సమస్యలు పరిష్కారానికి అతీతం కావనీ కమీషన్ స్పష్టం చేసింది.   కాని ఒక్క ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణ సందర్భంగానే కాలం చెల్లిన పాత ఫ్యూడల్ శక్తులకు ప్రతినిధులయిన కొందరు దొరలు, జాగిర్దార్లు, దేశ్ ముఖ్ లు పోతున్న పూర్వవైభవాన్ని మరచిపోలేక కాంగ్రెస్ లో దూరి ఆంధ్రప్రదేశ్ అవతరణకు అడ్డు కొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు! దాని ఫలితమే, వేర్పాటు ఉద్యమానికి పడుతూ వచ్చిన స్వార్థపూరిత బీజాలు! కెసిఆర్ మనస్సులో ఉన్న 1956కి ముందున్న "తెలంగాణా జిల్లాలు'' అంటే మనకు చెందని మరాఠా ప్రాంతాలూ లేదా కన్నడ ప్రాంతాలతో కూడిన పాత "హైదరాబాద్ స్టేట్'' అనే! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అంతవరకూ నిజాముల ఏలుబడిలో పడి ఉన్న మరాఠా ప్రాంతాలైన ఉస్మానాబాద్, ఔరంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్ ప్రాంతాలు, కర్నాటకలో చేరిపోయిన బీదరు, రాయచోరు వగైరా ప్రాంతాలూ అన్నమాట!   ఇది యిలా ఉండగా అటు సీమాంధ్రలోని ఆంధ్రోద్యమానికి, ఇటు తెలంగాణలో మాడపాటి సురవరం, హయగ్రీవ చారి ప్రభృతులు, రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఎస్.వి. ప్రసాద్ లాంటి కమ్యూనిస్టు యోధుల నాయకత్వాన నడిచిన ఆంధ్రోద్యమాలకు ఒక దశ వరకూ నిజాముల నిర్బంధకాండ మధ్య విజయవాడ కార్యక్షేత్రంగా ఉందన్న సత్యాన్నీ మరచిపోరాదు. ఈ పూర్వరంగాన్నంతనూ పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే ఫజల్ ఆలీ కమీషన్ హైదరాబాద్ ను సందర్శించి వివిధ సంస్థల, వ్యక్తుల అభిప్రాయాన్ని తెలుసుకుని వారినుండి భారీస్థాయిలో మహాబరులను స్వీకరించి, 1955 సెప్టెంబర్ 30న తన నివేదికను సమర్పించింది; "విశాలాంధ్ర ఏర్పాటునకు ఏకాభిప్రాయం బలంగా ఉన్నందున హైదరాబాద్ స్టేట్ ను విభజించడం సబబని కమీషన్ అభిప్రాయపడింది. అలాగే ఉభయ ప్రాంతాలకు చెందిన కొన్ని సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చుకో కూడా సిఫారసు చేస్తూ ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది :   "రెండువందల సంవత్సరాలనుండి దక్కను ప్రాంతానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఏర్పడినందున, ఈ సంస్కృతే భారతదేశ ఐక్యతకు మిక్కిలి దోహదపడింద'ని చెబుతూ విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కొలదిమంది వేర్పాటువాద నాయకుల వాదాలను అప్పుడే కమీషన్ తోసిపుచ్చింది! అంతేగాదు, రాష్ట్ర ఐక్యత మాదిరిగానే హైదరాబాద్ రాష్ట్ర సంస్కృతి కూడా ఆనాటి పాలకులు విధి రాసిందే గాని మరొకటి కాదు కదా అని కమీషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే కమీషన్ తొలి ప్రాధాన్యతగా ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణనే కమీషన్ అభిలషించి బలంగా నివేదికలో పేర్కొంది. 'విశాలాంధ్ర' రాష్ట్రం ఏర్పాటు వల్ల వొనగూడే ప్రయోజనాల్ని స్పష్టంగా కమీషన్ యిలా వివరించింది :   "ప్రస్తుతపు ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణా విలీనమైతే కోట్లాది జనాభాతో పాటు విలువైన ముడిసరుకులు, కావలసినంత ఖనిజసంపద, ఎక్కువ జల, విద్యుత్ వనర్లు కల్గిన భూభాగంతో పెద్దరాష్ట్రం ఏర్పాటవుతుంది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర రాజధాని సమస్య కూడా పరిష్కారమై పోతుంది. విశాలాంధ్ర రాజధానిగా జంటనగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదు చక్కగా సరిపోతాయి. విశాలాంధ్ర ఏర్పాటువల్ల కృష్ణా-గోదావరి నదీజలాల వినియోగం ఒకే అధికారం కిందికి వస్తుంది. వివిధ సాంకేతిక, పాలనాపరమైన కారణాల వల్ల జరిగిన సుదీర్ఖ కాలహరణం తర్వాత ఈ ప్రాజెక్టులు డెల్టా ప్రాంతంలో రూపుదిద్దుకోవలసి వచ్చింది. అయితే కృష్ణా-గోదావరి లోయల (బేసిన్స్) పూర్తీ ఏకీకరణ అసాధ్యం. ఈ నదీ ముఖద్వారాలలో ఉన్న తూర్పు ప్రాంతాలకు అభివృద్ధి పథకాలను రూపొందించడానికి, అమలు పరచడానికి గొప్ప అవకాశాలుంటాయి. విశాలాంధ్రలో భాగంగా తెలంగాణా ప్రాంతం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రయోజనాలు పొందుతుంది. కాబట్టి తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఆంధ్రరాష్ట్రం, తెలంగాణా ప్రాంతాలకు కలిగే పరస్పర ప్రయోజనాలు కూడా ముఖ్యమైనవే. కరువు కాటకాది ఉపద్రవాలు వచ్చినప్పుడు తెలంగాణలో ఆహారకొరత ఉంటుంది. అయితే ఆంధ్రరాష్ట్రంలో ఎప్పుడూ అధికాహారోత్పత్తికి వీలుంటుంది కాబట్టి మిగులు ఉత్పత్తిని తెలంగాణా ప్రాంతానికి వాడుకోవచ్చు. ఇదే విధంగా ఆంధ్రరాష్ట్రంలో బొగ్గు వనరులు లేవు. వీటిని సింగరేణి నుండి ఆంధ్రరాష్ట్రానికి చేరవేయవచ్చు. పైగా ఆంధ్రరాష్ట్రంలో కలవడంవల్ల తెలంగాణాకు పరిపాలనా సంబంధమైన వ్యయం కూడా ఉండదు''   ఈ వాస్తవాలన్నింటిని 1969, 1970ల నాటి వేర్పాటువాద ఉద్యమాల సందర్భంగా తెలంగాణా రైతాంగ సాయుధపోరాట అగ్రనాయకులంతా గురించి, "విడిపోతే చెడిపోతాం'' అని ఆనాడే పదేపదే హెచ్చరించిన వాళ్ళని మరవరాదు, మరవరాదు! అందువల్ల "బొబ్బిలిదొర'' కెసిఆర్ 1956 నాటి హైదరాబాద్ స్టేట్ ను మొత్తంగా తెలంగాణా అని భావించుకుని మనవిగాని ఇతర నిజాం ఆక్రమిత జిల్లా ప్రాంతాలు కూడా కలిసిన తెలంగాణా ఏర్పడాలని కోరుకుంటున్నందున - ఆ ప్రతిపాదన కాంగ్రెస్ అధిష్ఠానం మెడకు తగిలిస్తున్న కొత్త 'ఉచ్చు' అవుతుంది! ఇది సమస్యలను పరిష్కరించడానికి కాదు, కొందరు భావిస్తున్నట్టు "తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదని'' భావిస్తున్న వ్యక్తి అసలు కెసిఆర్ మాత్రమేనన్న అపవాదును అతను మీద మోసుకోక తప్పదు! చరిత్రలో తెలంగాణా రాష్ట్రమంటూ ఏనాడూ లేదు! ఉన్నదల్లా హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణా ఒక భాగమేగాని, తెలంగాణా రాష్ట్రమనేది లేదు. కనుకనే మూడుప్రాంటలలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలూ, వాటిలోని బడుగు బలహీనవర్గాల ప్రయోజనాలకు పరిష్కారం ప్రభుత్వాల విధాన నిర్ణయాలే గాని ప్రాంతీయ వాదాలు కావు. ఆ వాదాలు ముందుకు రావడానికి అసలు కారణం - పెట్టుబడిదారీ, భూస్వామ్యవ్యవస్థలో దోపిడీ, అసమా ఆర్థికాభివృద్ధి దశలేనని మరవరాదు!

డీజీపీపై కధనంతో ‘జీ-24గంటలు’ హడావుడి

  సంచలన వార్తల కోసం మీడియా ఆరాటం వలన మీడియా కూడా ఇబ్బందులో పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ ‘జీ-24గంటలు’ కూడా అటువంటి చిక్కుల్లోనే పడింది. మూడు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డి హైదరాబాదు, ఫతెహ్ దర్వాజా వద్ద ఉండే బాబా హబీబ్ ముస్తఫా ఇబ్రూస్ ను కలసినపుడు, వారిరువురి పరువుకు భంగం కల్గించే రీతిలో ఒక ప్రత్యేక కధనం‘జీ-24గంటలు’ చానల్ ప్రసారం చేసింది.   అందుకోసం కొంత మార్ఫ్ చేయబడిన వీడియో ఫుటేజ్ ను కూడా వాడినట్లు గమనించిన సిటీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యం.సుబ్బారావు పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు ‘జీ-24గంటలు’ పై సెక్షన్ 469 క్రింద క్రిమినల్ కేసు నమోదు చేసారూ.అదే విధంగా బాబా కుటుంబ సభ్యులు హుస్సేనీ ఆలం పోలీసు స్టేషనులో ‘జీ-24గంటలు’ చానల్ పై పిర్యాదు చేయడంతో‘జీ-24గంటలు’ పై మరో మరో కేసు కూడా నమోదు చేసారు.   ‘జీ-24గంటలు’ కధనంపై ఆగ్రహించిన బాబా అనుచరులు కొందరు ఖైరతాబాద్ వద్దగల ‘జీ-24గంటలు’ కార్యాలయం వద్దకు చేరుకొని చానల్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ లోపలకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకొని శాంతింప జేశారు. కానీ  ‘జీ-24గంటలు’ చానల్ మీడియా ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేయడానికి బయలుదేరాన్నసమాచారంతో నగరంలో మిగిలిన మీడియా ప్రతినిధులు కూడా వెంటనే చానల్ కార్యాలయం వద్దకు చేరుకొని, పోలీసులకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ కాసేపు ట్రాఫిక్ ను కూడా స్తంభింపజేసారు. అయితే పోలీసులు తాము ఎవరినీ అరెస్ట్ చేయడానికి రాలేదని, కేవలం చానల్ లో ప్రసారమయిన వీడియో గురించి ప్రశ్నించడానికే మాత్రమే వచ్చామని నచ్చజెప్పడంతో గొడవ సర్దుమణిగింది.

అంతా షరా మామూలే

  షరా మామూలుగానే మళ్ళీ సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, యంపీలు హైదరాబాదులోఈ రోజు మరో మారు సమావేశమయ్యారు. షరా మామూలుగానే కాఫీ టిఫిన్స్ సేవించారు. షరా మామూలుగానే రాష్ట్ర విభజనను ఏవిధంగా ఎదుర్కోవాలోసమావేశంలో తీవ్రంగా చర్చించారు. షరా మామూలుగానే రాష్ట్రాన్నివిభజిస్తే ఊరుకొనేది లేదని గట్టిగా గర్జించారు. షరా మామూలుగానే రాజీనామాలకు వెనుకాడేది లేదని కూడా గట్టిగా చెప్పారు. షరా మామూలుగానే కొందరు రాజీనామాల వలన ఎటువంటి ఉపయోగం ఉండదని అభిప్రాయలు వ్యక్తం చేసారు. షరా మామూలుగానే తెలంగాణా బిల్లును శాసనసభలో, పార్లమెంటులో ఓడించడానికి తము పదవులలో కొనసాగడం ఎంతయినా అవసరమని మరోమారు తేల్చి చెప్పారు. షరా మామూలుగానే త్వరలోనే మరో మారు సమావేశం అవ్వాలని నిర్ణయించుకొన్నారు. షరా మామూలుగానే ఈ వార్త మీడియాలో ప్రచురితమయింది.

ముందుకెళ్తే రాజీనామాలే: లగడపాటి

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ముందడుగు వేసినా రాజీనామాలకు వెనుకాడేది లేదు. ఏడుగురు సీమాంధ్ర ఎంపీలం రాజీనామాలు ఆమోదించుకుంటాం. కేంద్రమంత్రులు కూడా కొందరు రాజీనామాలకు సిద్దంగా ఉన్నారు అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో సమైక్య వాదులు తమను రాజీనామాలు కోరడంలో అర్ధం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని, సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే శాసనసభలో తెలంగాణ తీర్మానం ఓడించడం కష్టంగా ఉంటుందని, తెలంగాణ మీద కేంద్ర కేబినెట్ నోట్ వస్తే ఏం చేయాలి అన్న విషయం మీద సమాలోచనలు చేసేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు లగడపాటి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించమని అన్నారు.

100 కోట్ల కుంభకోణం..ఐఏఎస్ అరెస్టుకు రంగం సిద్ధ౦!

      విశాఖ నగరాభివృద్ధి సంస్థ భూ మాయ కేసులో ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణు అరెస్టుకు రంగం సిద్ధమైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన సమర్పించిన అభ్యర్థనను హైకోర్ట్ కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న వీఎన్ విష్ణు గతంలో వుడా వీసీగా వ్యవహరించారు. అప్పట్లో విశాఖలోని ఎంవీపీ కాలనీలో సామాజిక అవసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొందరికి కేటాయించారు. ఆ స్థలాన్ని సామాజిక అవసరాలకే ఉపయోగించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా...  ఆ ఆదేశాలను భెఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు సమర్పించిన ఫోర్జరీ పత్రాలను ఆధారంగా చేసుకుని గజం రూ.50 వేలు విలువైన స్థలాన్ని కేవలం రూ.3,500 చొప్పున విష్ణు వారికి కేటాయించారు. ఆ తర్వాత ఆయన మహా విశాఖ నగర పాలక సంస్థకు కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ఆ హోదాలో అదే స్థలంలో బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇంతలో అక్రమంగా ఈ స్థలం పొందినవారు తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించారు. విచారణ తరువాత  సీబీఐ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం మళ్ళీ విచారణ చేయమని సీఐడీకి కేసు అప్పగించారు. సీఐడీ కూడా అక్రమాలు వాస్తవమేనని నిర్థారించి కేసు నమోదు చేసింది.ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణును ఏ1 నిందితునిగా పేర్కొంది. మరో 18 మందిని నిందితులుగా చేర్చి వారిలో ఆరుగురిని 15 రోజుల క్రితం అరెస్ట్ చేసి జైలుకు పంపించింది.  ఈ కేసులో అరెస్టులు జరుగుతున్నాయని తెలిసిన విష్ణు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. విష్ణు నిర్ణయం వల్ల వుడాకు రూ.100 కోట్ల నష్టం జరిగిందని...ఇందులో కుట్ర ఉందని, ముందస్తు బెయిల్ పొందడానికి అనర్హులు అంటూ దరఖాస్తును కొట్టేశారు.

పహిల్వాన్ తో కుస్తీకే మొగ్గు చూపుతున్న అసదుద్దీన్

  హైదరాబాద్ పాతబస్తీ అనగానే మజ్లిస్ పార్టీ దాని అధినేతలు ఒవైసీ సోదరులే ముందు గుర్తుకు వస్తారు. వారిలో చిన్నవాడయిన అక్బరుదీన్ ఒవైసీపై దాదాపు రెండేళ్ళ క్రితం అదే ప్రాంతానికి చెందిన మొహమ్మద్ పహిల్వాన్ హత్యా ప్రయత్నం చేసినపుడు, ఒవైసీ త్రుటిలో తప్పించుకోగలిగాడు. అప్పుడు పహిల్వాన్ పై ఆయన నమోదు చేసిన కేసు నేటికీ కోర్టులో నలుగుతూనే ఉంది. అయితే మొన్నఅకస్మాత్తుగా పహిల్వాన్ శ్రేయోభిలాషులుగా చెప్పబడుతున్నఓనలబై,యాబై మంది బర్కాస్, జామియా మశీదు యొక్క ఇమామ్ నేతృత్వంలో, దరుసలాం వద్దగల ఒవైసీల కార్యాలయానికి వచ్చి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో దాదాపు అర్ధగంట పైగా మంతనాలు చేసారు.   పహిల్వాన్ తరపున వచ్చిన వారు దయచేసి ఆయనను క్షమించి, ఈ కేసును ఇంతటితో ముగించాలని అసదుద్దీన్ ఒవైసీకి విజ్ఞప్తి చేసారు. అయితే ఆయన తన సోదరుడిపై హత్యా ప్రయత్నం చేసిన మహమ్మద్ పహిల్వాన్ ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదని, అతనితో రాజీకి అంగీకరించబోమని, ఈ విషయం ఇక కోర్టులోనే తేల్చుకొందామని వారికి చెప్పడంతో వారు అసంతృప్తిగా వెనుతిరిగారు.   ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో కేవలం పాతబస్తీకే పరిమితమయిన మజ్లిస్ పార్టీ నేతలు, తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు స్థానికంగా బలమయిన యఫై శాఖకు చెందిన పహిల్వాన్ తో రాజీపడి ఆయన వర్గానికి చెందిన ముస్లిం ప్రజల ఓట్లను పొందుతారో లేక తమపై హత్యాప్రయత్నం చేసిన వ్యక్తికి శిక్ష పడేందుకే మొగ్గు చూపుతారో త్వరలోనే తేలిపోవచ్చును.

ఆంటోనీ కమిటీకి టైమ్ కావాలట

      తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్‌కమిటీలో ఎలాంటి ముందడుగూ పడలేదు. ప్రస్తుతానికి ఇది పెండింగ్‌లో ఉందని, కదలిక రావడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని ఏఐసీసీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలను కూడా విస్మరించలేమని హైకమాండ్ భావిస్తోంది. ఏ ప్రాంతాన్నీ నొప్పించకుండా నిర్ణయం తీసుకునేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది. అలాగని రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితిని కూడా ఎక్కువ కాలం అనుమతించలేమని అభిప్రాయపడుతోంది.     పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అమెరికా నుంచి రావడంతో, కాంగ్రెస్ కోర్‌కమిటీ శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ నివాసంలో సమావేశమైంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్, రక్షణ మంత్రి ఆంటోనీ... గత నెల రోజులుగా రాష్ట్రానికి చెందిన నేతలతో జరిపిన సమావేశాల వివరాలను కోర్ కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిసింది. సీమాంధ్రలో పెద్ద ఎత్తున ప్రజాందోళన జరుగుతున్నందున నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టాలని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్టు కోర్‌కమిటీకి ఆంటోనీ వివరించారు. ఈ నేతలు ఎవరూ పరిష్కార మార్గాలను సూచించేందుకు సిద్ధంగా లేరని కూడా ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలను విన్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని వారు కోరుతున్నట్టు పేర్కొన్నారు. అందువల్లే ఎలా ముందుకు వెళ్లాలో తెలియక, నివేదిక రూపొందించలేకపోయానని ఆయన నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. నివేదికను తయారు చేసేందుకు మరింత సమయం కావాలని ఆయన సోనియాను కోరారు. దీంతో తెలంగాణ నోట్‌పై కోర్‌కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోలేకపోయింది. కమిటీ సభ్యులు సత్వరమే ఒక నిర్ణయానికి రావాలని, ఎక్కువ మందిని సంతృప్తిపరిచే ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలని ఆంటోనీకి సోనియా సూచించినట్లు తెలిసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగానే కేబినెట్ నోట్ తయారీకి అవసరమైన రాజకీయ దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుందన్న దానిపై కోర్‌కమిటీ క్లుప్తంగా చర్చించినట్టు సమాచారం.

రాష్ట్ర విభజనతో ఎవరికి లాభం

  తెలంగాణా రాష్ట్ర ఏర్పడటంతోనే కేసీఆర్ తన వద్దనున్న మంత్రదండం తిప్పిఅక్కడి ప్రజల సమస్యలన్నిటినీ, ఆ ప్రాంతం వెనకబాటుతనాన్ని చిటికలో మాయం చేసి పడేస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతునారు.   ఆయన, తెరాస పార్టీ నేతలు నిజంగా తెలంగాణా ప్రజల సంక్షేమం కోరేవారయి ఉంటే తమకున్న రాజకీయ పరపతితో ఫ్లోరోసిస్ వ్యాధులతో సతమవుతున్న నల్గొండ ప్రజల కష్టాలను తీర్చగలిగేవారు. అర్ధాకలితో మాడుతూ పత్తి పొలాలలోపనిచేస్తూ తమ బాల్యం బుగ్గిపాలు చేసుకొంటున్నమహబూబ్ నగర్ జిల్లా బాలలను ఆదుకొనేవారు. రెక్కాడితే తప్ప డొక్కాడని బీడీ కార్మికుల జీవితాలకు వెలుగు చూపగలిగేవారు. సిరిసిల్లా నేతన్నల కష్టాలను తీర్చగలిగేవారు. ఉన్నఇల్లు, చివరికి భార్య మెడలో పుస్తెలు కూడా అమ్ముకొని, అప్పులు చేసి పొట్ట చేతితో పట్టుకొని గల్ఫ్ దేశాలకు పోయి నానా కష్టాలు పడుతున్నకరీంనగర్ జిల్లా ప్రజలకు ఉపాధి చూపగలిగేవారు. కానీ, తెరాస అటువంటి గొప్ప ఆలోచనలు ఏనాడు చేయలేదు. చేసి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కావు. సమస్యలు లేకపోతే ప్రజలు దాని మాటలు వినేవారు కారు.   అందుకే వాటిని అలాగే గాలికొదిలి తెలంగాణా ప్రజలను ఉద్దరించేందుకు కేసీఆర్ తనకు తానే స్వయంగా కిరీటం పెట్టుకొని, మంచి వాక్పటిమ గల తన కుటుంబ సభ్యులనే సైనికులుగా చేసుకొని ఉద్యమాలు మొదలుపెట్టి వందలాది యువకుల జీవితాలను బలి తీసుకొని, ఇంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్లు తిట్టారో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారం పంచుకొనేందుకు ఆఖరి ఆట మొదలుపెట్టారు.    స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా సీమాంధ్ర నేతలు, వ్యాపారులు తెలంగాణా ప్రజలని దోపిడీ చేసారని వాదిస్తున్నతెరాస ఇప్పుడు చేస్తున్నపనేమిటి? మరి ఇంత కాలంగా తెలంగాణా నుండి ఎన్నికవుతున్న కాంగ్రెస్, తెదేపా, తెరాస, బీజేపీ శాసనసభ్యులు, యంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు తెలంగాణకు ఇంత అన్యాయం జరుగోతోందని తెలిసి మరి ఎందుకు అడ్డుకోలేదు? తెలంగాణా ప్రజల సమస్యలను ఇన్నేళ్ళలో ఎందుకు తీర్చలేకపోయారు?వారిని తెలంగాణా ప్రజల సంక్షేమం కోసం, ఆ ప్రాంత అభివృద్ధి పాటుపడకుండా ఎవరు అడ్డుకొన్నారు? అడ్డుకొని ఉంటే ఆనాడే వారు ఎందుకు గొంతెత్తలేదు?ఎందుకు పోరాడలేదు?   ఈ ప్రశ్నలన్నీ వట్టి అమాయక ప్రశ్నలుగా కొట్టిపారేయవచ్చును. కానీ, కాంగ్రెస్, తెరాస నేతలలో, ఇంకా చెప్పాలంటే తెలంగాణా నేతలలో తమ ప్రజల, తమ ప్రాంతం పట్ల చిత్తశుద్ది లేకపోవడం వలనే నేడు ఈ దుస్థితి ఏర్పడింది తప్ప వేరేవరి దోపిడీ కారణంగా మాత్రం కాదు.   ఇన్నేళ్ళలో అక్కడి రాజకీయ నేతలు, ఉద్యమ నేతలు పది తరాలకు సరిపడేంత ఆస్తులు సంపాదించుకొని, త్వరలో అధికారం కూడా దక్కించుకోబోతుంటే, వారి వెనుక నడచిన ప్రజల పరిస్థితి మాత్రం ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లుంది, ఉంటుంది కూడా. ప్రజల త్యాగాల ఫలితంగా ఏర్పడే కొత్త రాష్ట్రంలో అధికారం దక్కించుకొనేందుకు అర్రులు చాస్తున్నఈ రాజకీయ నేతలు రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే ఒక్కసారిగా మారిపోతారని అనుకొంటే అంతకంటే వెర్రి ఆలోచన మరొకటి ఉండదు.   ఇన్నేళ్ళుగా దేశంలో, వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు వెలగబెడుతున్నకాంగ్రెస్ పార్టీ పాలనలో అక్కడి ప్రజల పరిస్థితి ఎలా ఉందో, రేపు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కూడా అలాగే ఉంటుంది. రాష్ట్ర విభజన జరగగానే ఏ అద్భుతాలు జరిగిపోవు. కేవలం రాజకీయ సమీకరణాలు మారుతాయి, సదరు నేతల వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. తద్వారా వారు మరిన్ని ఆస్తులు కూడబెట్టుకొంటారు. కానీ ఇరుప్రాంతల ప్రజల పరిస్థితి మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. పైగా కొత్తగా మరికొన్ని సమస్యలు కూడా ఎదుర్కోకతప్పదు.

స్పాట్ ఫిక్సింగ్ క్రికెట‌ర్లపై వేటు

  స్పాట్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న భార‌త్ క్రికెటర్లపై బిసిసిఐ కొర‌డా జులిపించింది. ఐపియ‌ల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి అరెస్ట్ అయిన శ్రీశాంత్, అంకిత్ చ‌వాన్‌, అజిత్ చండిలా.అమిత్ సింగ్‌ల‌పై బిసిసిఐ నిషేదం విధించింది. అయితే తాము ఫిక్సింగ్‌కు పాల్పడ‌టంతో పాటు ఇత‌ర‌ల‌ను ప్రొత్సహించ‌టం అస‌భ్యంగా ప్రవ‌ర్తించ‌టం లాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొటున్న శ్రీశాంత్‌, అంకిత్ చ‌వాన్‌ల‌పై జీవిత‌కాల నిషేదం విధించిన బిసిసిఐ, అమిత్ సింగ్‌ను ఐదేళ్ల పాటు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి నిషేదించింది. అలాగే మ‌రో క్రికెట‌ర్ సిద్దార్ధ త్రివేదిపై ఏడాది నిషేదం విధించింది. బిసిసిఐకి చెందిన క్రమ‌శిక్షణ క‌మిటీతో పాటు ఇత‌ర క‌మిటీలు ఈ మేర‌కు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి.

మ‌ళ్లీ పేలిన పెట్రోబాంబ్‌

  కేంద్ర తీసుకున్న నిర్ణయం మ‌రోసారి సామ‌న్యుడి వెన్ను విరిచింది. పెట్రోలు ధ‌ర‌ను నిర్ణయించుకునే అధికారం ఆయిల్ కంపెనీల‌కే అప్పగించిన ప్రభుత్వం ధ‌ర‌లు నియంత్రించ‌క‌పోవ‌డంతో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధ‌ర‌ల‌ను పెంచేస్తున్నాయి. ధ‌ర‌ను పెంచి 15 రోజుల కూడా గ‌డ‌వక ముందే ఇప్పుడు మ‌రోసారి పెట్రో బాంబును పేల్చాయి ఆయ‌ల్ కంపెనీస్‌. లీటర్ పెట్రోల్ ధరను రు.1.63 పెంచుతూ దేశీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యాట్ అద‌నంగా ప‌డ‌టంతో 2 రూపాయ‌ల‌కు పైగా పెట్రోలు రేటు పెరిగే అవ‌కాశం ఉంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లొ రూపాయి విలువ హెచ్చు త‌గ్గుల‌తో పాటు క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌టంతో పెట్రో రేటు పెంచ‌క త‌ప్పడం లేదంటున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో భార‌త్‌లోని ప్రదాన న‌గ‌రాల్లో ఇప్పటికే 8 రూపాయ‌ల‌కు పైగా ఉన్న లీట‌ర్ పెట్రోలు ధ‌ర ఈ అర్ధరాత్రి నుంచి మ‌రో రెండు రూపాయ‌లు పెర‌నుంది.

మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ

  కొద్ది సేపటి క్రితం డిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్ధి గా ప్రకటించింది. ఇంతకాలంగా నరేంద్ర మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడానికి వెనకాడుతున్నబీజేపీని, “తనకు ప్రధాని పదవిపై ఆశలేదని, 2017 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగానే కొనసాగాలనుకొంటున్నాననే ఒక చిన్న ప్రకటనతో, కేవలం పది రోజుల్లోనే పార్టీచేత ప్రధాని మంత్రి అభ్యర్ధిగా ప్రకటింపజేసుకోవడం ఆయన రాజకీయ చతురతకి ఒక చిన్న నిదర్శనం అయితే, ప్రధాని పదవిపై ఆశలేదని చెప్పడం ద్వారానే ఆయన ప్రధాని అభ్యర్ధిగా ఎంపిక అవడం మరో విశేషం.   ఇక గత ఆరేడు నెలలుగా పార్టీలో తన అభ్యర్దిత్వంపై జరుగుతున్న వాదోపవాదాలకు ఆయనే స్వయంగా చొరవ తీసుకొని ఒక చిన్న ఉపాయంతో ఇంత తేలికగా తెర దించడం కూడా చెప్పుకోవలసిన విశేషమే. అలాగని, ఈ ప్రకటనతో పార్టీలో అద్వానీ వంటి తన వ్యతిరేఖులు చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోరని ఆయనకీ తెలుసు. అయితే ప్రధాని పదవి ఆశిస్తున్న వ్యక్తి ఆ మాత్రం పరీక్షలు తట్టుకొని నిలిచి తన నాయకత్వ లక్షణాలను, పోరాట పటిమను కూడా చాటుకోవడానికి ఇటువంటి పరీక్షలు కూడా చాలా అవసరమే.   తనను పార్టీ ప్రధాని అభ్యర్ధి గా ప్రకటింపజేసుకోవడంతో ఆయన తొలి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇక రేపటి నుండి పార్టీలోపల, బయట ఎదురయ్యే విమర్శలకు, పరీక్షలకు ఆయన సిద్ధంగా ఉండక తప్పదు. ముఖ్యంగా రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి చూసుకోవాలని తపిస్తున్నసోనియమ్మకు సైంధవుడిలా అడ్డుపడుతున్నమోడీని సోనియా-రాహుల్ భజన బృంద సభ్యులు ఎన్నటికీ క్షమించలేరు. గనుక రేపటి నుండి మోడీ వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. వారు పెట్టే పిల్లి శాపాలను భరించక తప్పదు.

ఆపరేషన్ కిరణ్ సర్కార్

   క్రమంగా రాష్ట్ర విభజన అనివార్యమని తేలుతున్నతరుణంలో దానిని వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సీమాంధ్ర మంత్రులు ఇప్పుడు ఏమి చేయబోతారనే ప్రశ్న తలెత్తుతోంది. సీమాంధ్ర ప్రజలు, ఏపీ ఎన్జీవోలు సమైక్యాంధ్ర కోరుతూ నానాటికి ఉద్యమం తీవ్రతరం చేస్తుండగా, వారికి తాము ఏవిధంగా జవాబు చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు. ఇక సీమాంద్రాకు చెందిన కేంద్ర మంత్రులయితే రాష్ట్రానికి తిరిగి రావడానికి కూడా భయపడుతూ డిల్లీలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల డిల్లీ వెళ్ళిన శైలజానాథ్ తదితరులకు త్వరలో హోంశాఖ తెలంగాణా నోట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపుతున్న సంగతి తెలుసుకొని కంగు తిన్నారు. ఆ తరువాత తెలంగాణా ఏర్పాటుకోసం రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు దానిపై సభలో చర్చజరుగుతుంది తప్ప ఓటింగ్ లేకుండా చేసేందుకు, కేంద్రం ముందుగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి అందుకు తగిన సూచనలు ఇచ్చింది.   అందువల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుపై చర్చ జరిగిన తరువాత, సభలోనే రాజీనామా చేసి, సమైక్యవాదిగా బయటకు రావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించినప్పటికీ అడ్డుకోబోవడం లేదు గనుక పార్టీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షించవచ్చును. ముఖ్యమంత్రితో బాటే మిగిలిన సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది గనుక, అంతకంటే ముందే కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి శాసనసభను నిద్రాణ స్థితిలో ఉంచి, విభజన ప్రక్రియ వేగవంతం చేసే అవకాశం ఉంది.   ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన వెనుకనే మిగిలిన సీమాంధ్ర మంత్రులు ప్రజలలోకి వచ్చి తాము ఆఖరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయామని, ఇక ‘సమన్యాయం’ కోసం పోరాటం మొదలుపెడతామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేయవచ్చును. అప్పటికి ఏపీ యన్జీవోలు కూడా తమ పట్టు సడలించే అవకాశం ఉందని, వారితో బాటే ప్రజలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు వెనక్కి తగ్గితే ఇక తెదేపా, వైకాపాలు వారిని అనుసరించక తప్పదు. అంటే ఈ పరిణామాలన్నీ రాగల 10రోజుల్లో జరిగే అవకాశం ఉందనుకోవచ్చును.   ఆ తరువాత అంటోనీ కమిటీతో బేరసారాల డ్రామాలతో మరో నెల, రెండు నెలలు సాగదీస్తూ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా కనబడగానే ఎన్నికలకి గంట కొట్టేస్తే అప్పుడు అందరి దృష్టి రాష్ట్ర విభజనపై నుండి ఎన్నికల పైకి మళ్ళుతుంది. ఈ లోగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అతని అనుచర మంత్రులు కూడా మెల్లగా సర్దుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది.   కాకపోతే తమ ఉద్యమాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారా లేక కిరణ్ కుమార్ రెడ్డి మొహం చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారా అనేది తేలేందుకు చాల సమయం ఉంది.

సీమాంద్ర నాయ‌కుల రాజీనామా..?

  తెలంగాణ,సీమాంద్ర ప్రాంతాల్లో ఆందోళ‌నల సంగ‌తులు ఎలా ఉన్నా.. కేంద్ర మాత్రం విభ‌జ‌న దిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తుంది. ఇప్ప‌టికే హోం శాఖ నోట్ కూడా రెడీ చేసిన కేంద్ర త‌దుప‌రి చ‌ర్య‌లకు కూడారెడీ అవుతుంది. ఆంటోని క‌మిటీ కూడా త‌న నివేదిక‌ను నేడు కేంద్ర ముందు ఉంచ‌నుంది. తెలంగాణ ప్ర‌క‌ట‌న త‌రువాత వ‌చ్చిన భావోద్వేగాల నేప‌ధ్యంలో కేంద్రం ఈ క‌మిటీని ప్ర‌క‌టించింది. ఈ నేప‌ధ్యంలో నిర్ణ‌యం తెలంగాణ‌కు అనుకూలంగా వ‌స్తే సీమాంద్ర ప్ర‌జా ప్ర‌తినిధులు మూకుమ్మ‌డి రాజీనామాల‌కు సిద్దం అవుతున్నారు. సీమాంద్రుల‌తో పాటు తెలంగాణ ప్రాంత నాయ‌కులు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించిన ఆంటోని క‌మిటీ దాదాపుగా తెలంగాణ‌కు అనుకూలంగా నివేధిక ఇచ్చే అవ‌కాశం ఉంద‌టున్నారు విశ్లేష‌కులు. కేంద్ర నిర్ణ‌యంతో పాటు హోం శాఖ నోట్ తుదిమెరుగులు కూడా ఆంటోని క‌మిటీ ఆదారంగా త‌యారు చేయ‌నున్న నేప‌ధ్యంలో సీమాంద్ర ప్రజాప్ర‌తినిధులు త‌మ ఆఖ‌రి అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నారు.

నిర్భయ కేసులో నలుగురికి ఉరిశిక్ష

      దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులకు సాకేత్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇదే కేసులో ఉన్న మరో బాల నేరస్థుడికి జువైనల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ఇదే కేసులో ఉన్న మరో ప్రధాన నిందితుడు రాసింగ్ గత మార్చిలో తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నలుగురి నిందితులపై 13 అభియోగాలు రుజువైన నేపథ్యంలో వారికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. శిక్షపడిన వారిలో అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, వపన్ గుప్తా, ముఖేష్ లు ఉన్నారు. నిందితులకు సరయిన శిక్ష పడిందని కోర్టు వద్దకు వచ్చిన విద్యార్థి సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఇక కోర్టు తీర్పు మీద దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

చంద్రబాబు జోకర్

      సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపింది. మొదటి నుండి తెలంగాణలో బలహీనంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటన వస్తుందనగానే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించింది. ఇక ఆ తరువాత నాలుగు రోజులు సమన్యాయం వాదన ఎత్తుకుని ఆ తరువాత సమైక్యాంధ్ర వాదం ఎత్తుకుంది. ఈ మేరకు సమైక్య శంఖారావం యాత్ర మొదలు పెట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది.     తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూస్తే భయపడేవాడు..అంతే కానీ నేను ఎవరికీ భయపడను అని అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టింది. చంద్రబాబును చూసి వైఎస్ ఎప్పుడూ జోకర్ ను చూసినట్టు నవ్వుకునే వారని, కావాలంటే వారి పాత సంభాషణలు, కలిసిన సన్నివేశాలను సాక్షి ఛానల్ లో వేయించి చూయిస్తామని ప్రకటించింది. ఎంత సొంత ఛానల్ ఉంటే మాత్రం పాత సీడీలు వేసి మరీ చూయిస్తామని చెప్పడం ఆశ్చర్యకరం.