Gujarat Election Results 2012

మణినగర్‌లో మోడి విక్టరీ

      మణినగర్‌లో ముఖ్యమంత్రి నరేంద్రమోడి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్వేతాభట్‌పై 85 వేల ఓట్ల మెజార్టీతో నరేంద్రమోడి గెలుపొందారు. మరోవైపు గుజరాత్‌లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్‌లో స్పందించారు. ఇక అంతా ముందు చూపేనని.. వెనుక చూపు లేదని ట్వీట్ చేశారు. గుజరాత్ లో 112 స్థానాలలో బీజేపీ, 64 స్ధానాలలో కాంగ్రెస్ , 4 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొదట ముందంజలో ఉన్న బీజేపి తరువాత వెనకబడింది. 26 స్థానాలలో బీజేపీ, 36 స్థానాలలో కాంగ్రెస్, 6 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు.  

Gujarat Election Results

గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడిదే హవా

    గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి పదవిని అధిష్టించేందుకు ముఖ్యమంత్రి నరేంద్రమోడి స్పష్టమయిన అధిక్యతను దక్కించుకున్నాడు. మొదట పోలింగ్ సరళి ఈ సారి బీజేపీ కొన్ని స్థానాలు నష్టపోతున్నట్లు కనిపించినా చివరకు వచ్చేసరికి పుంజుకుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిన మాదిరిగానే మోడి గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునే దిశగా సాగుతున్నారు. గుజరాత్ లో 111 స్థానాలలో బీజేపీ, 58 స్ధానాలలో కాంగ్రెస్ , 3 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొదట ముందంజలో ఉన్న బీజేపి తరువాత వెనకబడింది. 24 స్థానాలలో బీజేపీ, 36 స్థానాలలో కాంగ్రెస్, 5 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. గుజరాత్ లో 13 స్థానాలలో,  హిమాచల్ ప్రదేశ్ లో 3 స్థానాలలో ఫలితాలు రావాల్సి ఉంది.

bjp

గుజరాత్ లో వికసిస్తున్న కమలం

  కొద్ది నెలల క్రితం జరిగిన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలపట్లగానీ, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంతో బాటు ఎన్నికలకివెళ్ళిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఫలితాలగురించి గానీ పెద్దగా ఆసక్తి చూపని దేశవాసులు ముందుగానే ఊహించిన ఫలితాలకోసం గుజరాత్ వైపు ఆసక్తిగా చూస్తున్నారంటే అందుకు కారణం ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీయేనని చెప్పక తప్పదు.   అభివృద్ధి మంత్రం జపిస్తున్న మోడీని ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అతని చేతిలో ఘోరపరాభవం తప్పదనీ తెలిసికూడా గుజరాత్ లో అతనిని డ్డీ కొనక తప్పలేదు. డ్డీ కొన్నపుడయినా తన స్వంత మేనిఫెస్టో గురించి చెప్పుకొనే బదులు, అతను రాష్ట్రంలో సాదించిన అభివృద్ధి గురించే తన ఎన్నికల సభల్లోనూ ప్రస్తావించక తప్పక పోవడం కాంగ్రేసుకి మింగుడుపడని మరో విషయం. సాక్షాత్ ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ సైతం రాష్ట్రంలో కొన్నిచోట్ల అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవడం మోడీ యొక్క తొలివిజయంగా చెప్పవచ్చును. అందుకే ఫలితాలు కూడా అందుకు అనుకూలంగానే వెలువడుతున్నాయిప్పుడు.   ఇప్పుడే అందిన తాజా వార్తల ప్రకారం గుజరాత్ లో బీజేపీకి ౧౧౪ స్థానాలలొ ఆదిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో ఆదిక్యతలో ఉంది. మోడీని ఇబ్బందిపెట్టగల సమర్థుడు, అతని ఓట్లను చీల్చి కాంగ్రేసు తో ప్రభుత్వం ఏర్పరచగల ఒకే ఒక్కనేత అని భావించిన కేషుభాయి పటేల్ యొక్క గుజరాత్ పరివర్తన్ పార్టీ కేవలం అంచనాలకు పూర్తీ విరుద్దంగా కేవలం 82 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 3 స్థానాలలో మాత్రమే ఆదిక్యతలో ఉండటం కూడా మోడీ ఎఫెక్టేనని చెప్పక తప్పదు. గానీ,   కాంగ్రెస్ పార్టీ ముందే ఊహించినట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం ముందంజలో ఉంది. అక్కడ ఆ పార్టీకి 39 స్థానాలలో ఆదిక్యం ఉండగా, బీజీపీ మాత్రం కేవలం 22 స్థానాలలో ఆదిక్యత కనబరుస్తూ వెనక బడిపోయింది.

ambati rambabu

అంబ పలికె...రాంబాబు పలికె...

  వై.యస్సార్. కాంగ్రేసు పార్టీలో నోరున్న పెద్దమనుషుల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. అసలు నోరున్డటమే ఈరోజుల్లో రాజకీయాలకి ఒక ప్రధానార్హత కూడా గనుక అంబటి తిరుగులేని రాజకీయ నాయకుడుగానే చెప్పుకోవచ్చును.   అదేదో సినిమాలో హీరోకి నోటి దూల ఎక్కువ ఉండటమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు, మన రాంబాబుగారికీ ‘బూతుల పంచాంగ స్పెషలిస్టు’గా మంచి పేరున్నసంగతి, తన ప్రావీణ్యాన్ని పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర విరివిగా ఉపయోగిస్తారని మీడియాకి ఎవరో గిట్టని వాళ్ళు ఉప్పందిన్చినప్పుడు, అయన మీడియాలో కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగేరు. అప్పుడు కొంచెం తగ్గినా మళ్ళీ ఇప్పుడిపుడే ఆయన పున్జుకొంటూ మళ్ళీ మీడియాలో నిత్యం కనిపించడం ప్రారంబించేరు.   మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారు ఇందిరమ్మని తలచుకొంటూ వైజాగ్ బాట పట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకోస్తున్నవనే ప్రతిపక్షాల నీలపనిందలు భరించలేక, ఆ కోపంలో జగన్ని ఓ దులుపు దులిపపేసారాయన. “అతను అనేక అక్రమాలకి పాల్పడాడు గాబట్టే జైల్లో పడ్డాడు. అతనిపట్ల మనం జాలి చూపనవసరం లేదు. అతనేమయిన జైల్లో ఉన్న స్వతంత్ర సమరయోదుడా గౌరవించడానికి?” అంటూ దులిపోదిలి పెట్టారాయన.   అప్పుడు జగన్ ఉప్పు తింటున్న కారణంగా అంబటి కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నోరు చేసుకోవలసి వచ్చింది. అంబ పలికే...రాంబాబు పలికే....అంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఏ విదంగా ఉండబోతోందో అయన జాతకం వేసి చెప్పేసాడు.   “ఒకప్పుడు కేవలం 26 సీట్లు మాత్రమే గెలుచుకొని రాష్ట్ర రాజకీయాలలో ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పిన మీ కాంగ్రెస్ పార్టీ, రేపు రాబోయే ఎన్నికలలో కేవలం 16 సీట్లు మాత్రమె గెలిచి మీ పాత రికార్డుని మీరే బద్దలు కొట్టుదురు గాక....” అంటూ పిల్లిశాపాలు పెట్టినట్లు కిరణ్ కుమార్ రెడ్డిని శపించి పడేసాడాయన.   అంతేగాకుండా తమ నేత కాంగ్రేసులో ఉన్నపుడు లక్ష తొంబై వేల ఓట్లు సాదిస్తే, కాంగ్రేసు నుండి బయటకి వచ్చేసిన తరువాత జరిగిన ఎన్నికలలో 5.4 లక్షల ఓట్లు సాదించేడని మీడియా ముఖంగా కిరణ్ కుమార్ రెడ్డికి అయన తెలియజేసారు.   సోనియమ్మని ఆయన ఎదిరించినందుకే ఇప్పుడ జైల్లో మగ్గ వలసి వస్తోందే తప్ప అక్రమార్జన వల్లమాత్రం కాదని కిరణ్ కుమార్రెడ్డి గారికి ఆయన జ్ఞాపోదేశం కూడా చేసేరు.   మొత్తం మీద అంబటి వారు వేసిన కాంగ్రెస్ జాతక చక్రంలో మరి జగన్ పేరుందో లేదో అయన చెప్పలేదు. ఎందుకంటే, రాహుల్ బాబు ‘మళ్ళీ మనం జగన్నివాటేసుకొంటే జనం నవ్వుతారా లేదా? ఏమనుకొంటారు? అని రాష్ట్ర నేతలని అడిగినట్లు సమాచారం. మరటువంటప్పుడు కాంగ్రేసుకి కేవలం 16 సీట్లు మాత్రమే వస్తే తనకీ ఇబ్బందే కదా?

gantasrinivasa rao

వడ్డించేవాడు మనోడయితే

  వడ్డించేవాడు మనోడయితే మనం ఏమూల కూర్చొన్నా అందవలసినవి అన్నీసవ్యంగా అందిపోతాయని ఊరికే అనలేదు పెద్దలు.   ప్రజాసేవ అంటూ ముందు కొన్నిసేవాకార్యక్రమాలు చేప్పటడం, కొంచెం ప్రజలలో పాపులారిటీ పెరిగిన తరువాత మెల్లగా రాజకీయాలలోకి అడుగుపెట్టడం, ఆ తరువాత ఏరాజకీయ పార్టీనో ఆశ్రయించి మెల్లగా పార్టీటికెట్ దక్కించుకోవడం, ఆ తరువాత ఇక తన ‘స్వయంసేవ’ మొదలుపెట్టుకొని కోట్లుకూడవేసుకొంటూ, దొరికిన కాడికి భూములు పోగేసుకోవడం, మంత్రిపదవి కోసం లాబీయింగ్ చేసుకొని మరింత పై......కి ఎదగడం, ఇదే ప్రస్తుతo ప్రతీ రాజకీయనాయకుడి ఫార్మాట్. ఈ పద్దతిలో ముందుకు సాగిపోయిన వారు మాత్రమే ‘ప్రజాసేవ’లో ఆరితెరినవారుగా పరిగనించబడుతారు.   మిగిలిన వాళ్ళు సిద్దాంతాలు, ఆదర్శాలూ అంటూ ‘ఈల’ వేసుకొంటూ కాలక్షేపం చేయవలసిందే తప్ప మరో దారిలేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రం నిరాడంబర జీవితం గడుపుతూ ‘ప్రజలకు సేవ’ చేసుకొంటూ రాజకీయ అప్రయోజకులుగా మిగిలిపోతారు. అటువంటి వారిని పార్టీలూ పట్టించుకోవు, ప్రజలు కూడా పట్టించుకోరు.   ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఒక రాజకీయ నాయకుడు (ప్రజాసేవలో నిమగ్నమయినవాడు) ఎన్ని కోట్లు పోగేసుకొంటే అంత గొప్పనాయకుడు. ఎన్ని కుంభాకొణాలలో అతని పేరు కనబడితే అంత ‘ఫేమస్ పర్సనాలిటీ.’ జైలుకి కూడా వెళ్ళి వస్తే అదో ప్రత్యెక అర్హత కింద లెక్క. ఇందులో సిగ్గు పడేందుకు ఏమిలేదు. సిగ్గూలజ్జా అనుకోవలసిన అవసరం అంతకంటే లేదు. ఎటువంటి వారినయినా కుల ప్రతిపాదికనో లేక వేరే మరేదో ప్రాతిపదికనో నెత్తినపెట్టుకు మోసే ప్రజలకి మన దేశంలో కరువు లేదు.   విజయ చిహ్నంగా రెండు వ్రేళ్ళూ ఊపుతూ బహుఠీవిగా కోర్టులకీ, జైళ్ళకీ తిరుగుతూ కూడా నెగ్గుకు రావచ్చును. నిజం చెప్పాలంటే అప్పటినుండే ప్రజలు, మీడియా కూడా అతనిని అసలు సిసలయిన రాజకీయ నాయకుడిగా గుర్తించడం మొదలు పెడతారు. అప్పుడే అతనికి అటు రాజకీయ పార్టీలు, ప్రజలు వీలయినచోట ప్రభుత్వమూ కూడా అండగా నిలబడతారు. ఈ తర్కానికి మద్దతుగా ఇక్కడ ఒక మోటు సామెత చెప్పుకోక తప్పదు. తేనే తీసేవాడు చేయి నాకడా? అనట్లు, అధికారంలో ఉన్నవాడు కాకపొతే విపక్షం లో ఉన్నవాడు వెనకేసుకొంటాడా అనే లాజిక్ ని కూడా బాగా వంట బట్టిన్చుకొన్నారు ప్రజలు. అధికారంలో ఉన్న నాయకుడు తన పదవిని తనకోసం వాడుకోవడంలో తప్పేమిటో? అని గునిసే ప్రజలు మనకి చాలామందే ఉన్నారు. ఈ విదంగా పరిణతి చెందిన ప్రజలు మనకి ఉన్నపుడు ఇక ఏ రాజకీయనయకుడయినా ఆత్మాన్యునతతో ఎందుకు బాద పడాలి?   కమింగ్ టూ పాయింట్ ఈ సారి చర్చ మన గౌరవమంత్రివర్యులు శ్రీమాన్ గంట శ్రీనివాసరావు గారి వ్యాపార సంస్తలు, వాటి అభివృద్దికి ఆయన కష్టపడుతున్న తీరు గురించి. కొద్ది నెలల క్రితమే ఆయన విజయవాడ కృష్ణనది మద్యనున్న భవానీ ఐల్యాండ్ ని తన ‘ప్రత్యుషా కంపెనీ’ ద్వారా సొంతం (లీజు అని మరో పేరు పెట్టారు దానికి) చేసుకోవడాన్ని ప్రజలు ముక్కున వేలేసుకొని చూస్తూ ఉండిపోయారు.   మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటపట్టి విశాఖకి వచ్చినప్పుడు, ప్రతిపక్షాలు మంత్రిగారికి చెందిన ప్రత్యుషా కంపెనీకి నగరం నడిబొడ్డునఉన్న కోట్లువిలువ చేసే ప్రభుత్వ గ్రంధాలయం ౩౩సం.లు లీజుపై (స్వంతం చేసుకోవడాన్ని) ఇవ్వడాన్ని ఆపేక్షిస్తూ ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రం ఇవ్వబోయారు. బి.ఓ.టి.(బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్) ప్రాతిపాదికన ప్రభుత్వమే అతనికి విలువయిన గ్రంధాలయభూమిని అప్పజేప్పడాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఈయబోయారు. ప్రజోపయోగమయిన అటువంటి విలువయిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఈవిదంగా ధారాదత్తం చేయడం మంచికాదని చెప్పబోయారు.   గానీ ముందే అనుకొనట్లు వడ్డించేవాడు మనోడయితే.....ప్రభుత్వభూములేమిటి పరిశ్రమల పేరిట పొలాలు, కొండలను కూడా బొంచేసేయవచ్చును అని గతంలోనే చాలామంది నిరూపించేరు గనుక ముఖ్యమంత్రి బహుశః దానినే ప్రాతిపదికగా తీసుకొంటున్నట్లు ‘దానికో ప్రత్యేక కమిటీ వేసాము కదా అదే ఈ వ్యవహారాలు చుసుకొంటుoది’ అని తేలికగా తీసి పడేసి పక్కన కూర్చొన్న గంటా వారిని ఆనందభరితుడ్ని చేసారు. అప్పుడు గంటావారు కూడా ఒట్టిపుణ్యానికే ప్రతిపక్షాలవారు ప్రతీచిన్నవిషయాన్ని(భూమి ఖరీదు రూ.50కోట్లు మాత్రమే గాబట్టి) రాజకీయం చేయాలని చూస్తున్నారని గట్టిగా ఖండించి ముసి ముసి నవ్వులు నవ్వుతూ తన ‘కాంగ్రెస్ హస్తం’ దులుపు కొన్నారు.

Nara lokesh 2014 elections

2014 లో లోకేష్ పోటీ చేయరా?

    చంద్ర బాబు నాయుడు తనయుడు లోకేష్ వచ్చే 2014 ఎన్నికల్లో పోటీ చేయక పోవచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతానికి తన తండ్రిని ఎలాగైనా తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని వారంటున్నారు. ఆయనే స్వయంగా బరిలోకి దిగితే, తెర వెనుక చేయవలసిన కసరత్తు, నేతల మధ్య సమన్వయం, పార్టీ యంత్రాంగ పర్యవేక్షణ వంటి బాధ్యతలు వంటివి చూసే సామర్ధ్యం ఉన్న నేతలు పార్టీలో లేని కారణంగా లోకేష్ ప్రస్తుతానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కీలక బాధ్యతలు చూస్తారని తెలుస్తోంది.   లోకేష్ నిరంతరం పార్టీలోని సీనియర్ల కుమారులతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఎన్నికలకు దూరంగా ఉండాలని, 2019 ఎన్నికల్లో మాత్రం మనమంతా కలిసి పోటీ చేద్దామని చెపుతున్నారని తెలుస్తోంది. ఆయన చాలా కాలం నుండి పార్టీ తెర వెనుక రాజకీయాల్లో కీలక పాత్రే పోషిస్తున్నారు. క్రితం ఎన్నికల్లో పార్టీ మానిఫెస్టో రూపకల్పనలో కూడా తన వంతు పాత్ర పోషించారు. అయితే, మీడియాలోని ఒక వర్గం లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఆయన ఓ నియోజక వర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారని ప్రచారం చేస్తోంది. లోకేష్ ను కేవలం ఓ నియోజక వర్గానికి పరిమితం చేసి, ఆయన పాత్ర మరింత క్రియాశీలకంగా ఉండకుండా చేసే ఎత్తుగడలో ఈ ప్రచారం భాగమని లోకేష్ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   అలాగే, చంద్ర బాబు కూడా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి లోకేష్ సేవలను వినియోగించుకొనే ఆలోచనలో ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

   Delhi gang rape

పార్లమెంట్ ను కుదిపేసిన గ్యాంగ్ రేప్: బీజేపీ ధ్వజం

      ఢిల్లీలో మెడికల్ స్టూడెంట్ పై జరిగిన గ్యాంగ్ రేప్‌ పై పార్లమెంట్ ఉభయ సభల్లో గందగోళం నెలకొంది. రాజ్యసభలో ప్రశ్నోత్తర సమయాన్ని రద్దు చేసి, అత్యారారంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుపట్టారు. ప్రశ్నోత్తర సమయం అనంతరం అవకాశమిస్తామని ఛైర్మన్ చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. దీంతో సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా మరో అరగంట వాయిదా వేశారు.   మరోవైపు లోక్‌సభలోనూ ఇదే అంశం కుదిపేసింది. దీనిపై ఎంసీ జయాబచ్ఛన్ ఉద్వేగంతో ప్రసంగించారు. అత్మాచార ఘటనపై ప్రభుత్వం సమాధానం సరిగా లేదని విమర్శించారు. విద్యార్ధినిపై జరిగిన రేప్‌ను హత్యాయత్నం కేసుగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై మాట్లాడేందుకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించలేదు. దేశ రాజధానిలో నేరాలను అదుపుచేయలేకపోతున్నారని బీజేపీ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. ఈ ఘటన చాలా సీరియస్ అంశమని, ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బిజేపీ వ్యాఖ్యానించింది. కాగా ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని గుర్తించినట్లు సమాచారం.  

YS sharmila jagan

జగన్ ని కలిసిన షర్మిలా : రేపు ఆపరేషన్

      చంచల్ గూడ జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ని ఈ రోజు ఉదయం ఆయన సోదరి వైయస్ షర్మిలా కలిశారు. జగన్ తో మాట్లాడేందుకు షర్మిలా కు జైలు అధికారులు అరగంట సమయాన్ని ఇచ్చారు. షర్మిలా వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా జైలుకు వచ్చారు. మోకాలి గాయంతో బాధ పడుతున్న షర్మిలా జగన్ ను కలిసేందుకు వీల్ చైర్ లో జైలుకు వచ్చారు.   కాలి గాయంతో షర్మిలా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె మోకాలుకు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు. షర్మిలా చేస్తున్న పాద యాత్రకు మూడు వారాలు బ్రేక్ పడనుంది. పాద యాత్ర చేస్తున్న సమయంలో తన వాహనం ఫై నుండి పడటంతో ఆమె మోకాలికి గాయం అయింది. గత శని, ఆది వారాల్లో ఆమె పాద యాత్ర జరగలేదు. సోమ వారం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే,మోకాలి నొప్పి కారణంగా అది సాధ్య పడలేదు. దీనితో, వైద్యులు జరిపిన ఎమ్మార్ స్కాన్ లో గాయం పెద్దదిగా ఉన్నట్లు తేలింది. బుధవారం ఆమెకు వైద్యులు కీ హోల్ ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు ఆమెకు తెలియచేశారు.

CM chopper destroyed

మంటల్లో కాలిపోయిన ముఖ్యమంత్రి హెలికాప్టర్

      బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఎయిర్ పోర్ట్ లో కొన్ని విమానాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ చేసే హ్యంగర్స్ కు మంటలు రేగాయి. అందులో ఇంధనం కూడా ఉండడంతో మంటలు మిగతా బాగాలకు వేగంగా వ్యాపించాయి. మంటలు ఎగిసిపడి పేలుళ్లు జరగడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఇళ్ల నుండి బయటకు వచ్చారు.   ఈ ప్రమాదంలో రెండు ప్రభుత్వ, రెండు ప్రైవేటు విమానాలతో పాటు ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్ కూడా మంటల్లో కాలిపోయింది. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం పూర్తయ్యాక ఇక్కడ నుండి ఎలాంటి రాకపోకలు లేవు. ప్రధాని, ముఖ్యమంత్రి లాంటి ప్రముఖులు రాకపోకలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక పలు విమానాలు, చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లను ఇక్కడ నిలిపి ఉంచుతున్నారు.

Y. S. Sharmila Apollo Hospital

అపోలో లో షర్మిలా మోకాలికి ఆపరేషన్

    కాలి గాయంతో షర్మిలా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆమె మోకాలుకు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు. షర్మిలా చేస్తున్న పాద యాత్రకు మూడు వారాలు బ్రేక్ పడనుంది. మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఆమె పాద యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాద యాత్ర చేస్తున్న సమయంలో తన వాహనం ఫై నుండి పడటంతో ఆమె మోకాలికి గాయం అయింది. గత శని, ఆది వారాల్లో ఆమె పాద యాత్ర జరగలేదు. సోమ వారం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే,మోకాలి నొప్పి కారణంగా అది సాధ్య పడలేదు. దీనితో, వైద్యులు జరిపిన ఎమ్మార్ స్కాన్ లో గాయం పెద్దదిగా ఉన్నట్లు తేలింది. మరో రెండు రోజుల్లో ఆమెకు వైద్యులు కీ హోల్ ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు ఆమెకు తెలియచేశారు.

 Trs k Chandra sekhara rao konda surekha

కేసిఆర్ ఫై కొండా సురేఖ ఫైర్

        టిఆర్ఎస్ అధినేత కే. చంద్ర శేఖర రావు, తన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకొంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండ సురేఖ ఆయన ఫై ఘాటుగా విమర్శలు చేశారు. ఆ పార్టీ నాయకురాలు షర్మిలా చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా వరంగల్ జిల్లా పరకాలలో సురేఖ నిన్న విలేఖరులతో మాట్లాడారు.   ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల రక్తంతో కేసిఆర్ తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని సురేఖ ఆరోపించారు. ఒక వైపు విద్యార్దులు ప్రాణ త్యాగాలు చేస్తోంటే, ప్యాకేజీ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో చర్చలు జరపడం ఏమిటని ఆమె విమర్శించారు.   ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ తెలంగాణా కు అనుకూలంగా మాట్లాడితే, ఎన్ని రోజుల్లో తెలంగాణా సాధించాగలరో చెప్పాలని ఆమె అన్నారు. నిర్ణీత గడువులోగా తెలంగాణా తెలేకపోతే, టిఆర్ఎస్ నేతలంతా తమ పార్టీలోకి రావాలని, తెలంగాణా వస్తే, తాము టిఆర్ఎస్ వెనుక నడుస్తామని ఆమె ప్రకటించారు. ఈ అఖిల పక్ష సమావేశానికి ప్రతి పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని ఆమె సూచించారు.   ఏది ఎలా ఉన్నా, ఇలా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని వ్యాఖ్యలు చేయడం మాత్రం ఎంత వరకూ సబబో గతంలో మంత్రిగా కూడా పని చేసిన సురేఖ ఒక్క సారి ఆలోచించుకుంటే బాగుంటుంది.

Tamballapalli mla Praveen kumar reddy

జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవీణ్ కుమార్ రెడ్డి

      చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి తెలుగు దేశం పార్టీ ఎంఎల్ఎ ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న కొత్తకోట లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షం లో ఆయన జగన్ పార్టీలో చేరారు. విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ‘తన స్వార్ధ ప్రయోజనాల కోసం చంద్ర బాబు పార్టీని నాశనం చేశారు. గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసినవారిని బయటకు వెళ్ళగొట్టారు’, అని ప్రవీణ్ ఈ సందర్భంగా అన్నారు. భారత దేశం లో ఏ నాయకుడు చేయలేని సంక్షేమ పధకాలను వై ఎస్ అమలు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రాష్ట్ర మఖ్య మంత్రి కావడానికి అందరూ కృషి చేయాలని ప్రవీణ్ కార్యకర్తలను కోరారు.   ఎన్ టి ఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టిన కొత్తలో తంబళ్ళపల్లి లో ఆ పార్టీ ఓడిపోయిందని, తమ కుటుంబానికి టికెట్ ఇచ్చాకే ఇక్కడ ఆ పార్టీ గెలిచిందని ప్రవీణ్ గుర్తు చేశారు. ఇక తెలుగు దేశం పార్టీ కనుమరుగవుతుందని ప్రవీణ్ అన్నారు. తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కు అయి, జగన్ ను జైలుకు పంపారని ఆయన అన్నారు.

gujarat elections

గుజరాత్ ఎన్నికల ప్రభావం ఎవరిపై ఎలాగ ఉంటుంది?

  ఈనెల 20వ తేదిన ఇద్దరు ప్రముఖరాజకీయ నాయకుల భవితవ్యం తేలనుంది. ఒకరు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కాగా, మరొకరు భావిభారత ప్రధాని కావాలని సర్వంసిద్దం చేసుకొని ఎదురుచూస్తున్న రాహుల్ గాంధీ. ఈనెల 20వ తేదిన వెలువడే గుజరాత్ ఎన్నికల ఫలితాలు కేవలం గుజరాత్ రాష్ట్రానికే పరిమితమయినవి కాబోవు. వాటి ఫలితాలు డిల్లీ వరకు ప్రభావం చూపించబోతున్నాయి. ఏవిదంగా అంటే, ఈ ఎన్నికలలో నెగ్గినవారికి డిల్లీ దర్బార్ ఎర్ర తివాచి పరిచి ఆహ్వానం పలబోతుంటే, ఓడినవారికి ఆ సదవకాశం కోల్పోవచ్చును.   ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలో జరిగిన ఎన్నికలకి సారద్యం వహించిన రాహుల్ గాంధీ అక్కడ ఓటమి చవిచుసాక, ఏంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఎన్నికలివి. అందువల్ల, ఇక్కడ గెలవడం అతనికి ఏంతో అవసరం. లేదంటే, అది అతని రాజకీయ భవిష్యత్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఎంతయినా ఉన్నాయి. ఈ గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గానీ గెలిస్తే, అతనికి మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగి, కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా లేక కనీసం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా ఆ కీర్తి అంతా ఆటోమేటిక్ గా అతని ఖాతలోనే జమ చేయబడుతుంది. అప్పుడు, అతను ‘ప్రధానమంత్రి పదవి రేసులో’ మొదటి ‘హర్డిల్’ దాటినట్లే అనుకోవచ్చును. అంతే గాక, అతను ప్రధానపదవికి ఎంట్రాన్స్ పరీక్ష పాస్ అయినట్లే అనుకోవచ్చును. గానీ, అది అతని ప్రధాన అర్హత ఎంతమాత్రం కాబోదు. ఎందుకంటే, అందరికి తెలిసిన విషయమే, అతని ప్రధానఅర్హత ‘సోనియా గాంధీ కొడుకు’ అనే హోదా వల్లవచ్చిందే తప్ప, అతని అనుభవం లేదా తెలివితేటలు వగైరాల వల్ల వచ్చినది మాత్రం కాదు. అందువల్ల, ఈ ఎన్నికలలో గెలుపు అతనికి కేవలం ఒక అదనపు అర్హతని ఇచ్చి, ప్రధానమంత్రి పదవి మరికొంత సౌకర్యంగా అందుకొనే వీలుకల్పిస్తుంది.   ఒకవేళ, ఈ ఎన్నికలలో గానీ (అతను సారద్యం వహించిన) కాంగ్రేసు పార్టీ ఓడిపోయినట్లయితే, తరువాత రాబోతున్న సాధారణ ఎన్నికల బాద్యతలు తీసుకోవడానికి అతనికి జంకు యేర్పడవచ్చను. మూడు వరుస పరాజయాలకి బాద్యతవహించిన రాహుల్ గాంధీ చేతిలో మళ్ళీ వచ్చేసాధారణ ఎన్నికల సారద్య బాద్యతలు కూడా పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది.   “ఒక మారుమూల రాష్ట్రంలోనే పార్టీని గెలిపించలేక పోయినవాడు, రేపు దేశం మొత్తం మీద జరిగే ఎన్నికలలో పార్టీని ఏవిదంగా గెలిపించగలడూ?” అని గాని కాంగ్రెస్ పార్టీ నిర్మొహమాటంగా ఆలోచన చేసినట్లయితే, ఖచ్చితంగా అతనికి బాద్యతలు అప్పగించదు. ఒకవేళ, అప్పగించినట్లయితే, అది తన చరిత్రలోనే అతిపెద్ద రిస్కుకి సిద్దపడి ఇచ్చిందని భావించాల్సి ఉంటుంది.   అప్పుడు కూడా కాంగ్రెస్పార్టీ మెజార్టీ సాదించలేక చతికిలబడితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తే భావిభారత ప్రధాని కావలనుకొంటున్నరాహుల్ గాంధీకి చాల ఇబ్బందికరమయిన పరిస్తితి ఏర్పడవచ్చును, గానీ, భజనపరులతో నిండిన కాంగ్రెస్ పార్టీలో అతను ప్రధానిపదవి చెప్పటడం పెద్ద అసాద్యమయిన పనిమాత్రం కాదు. సిగ్గువిడిచయినా సరే, ఆ పదవిచేపడుదామని అతను గానీ అనుకొంటే చాలు, పార్టీలో అన్నిద్వారాలు వాటంత అవే తెరుచుకుపోయి అతనికి స్వాగతం చెపుతాయి. ముందే అనుకొనట్లుగా అతని దక్షత, అనుభవం వంటివి కాక ‘సోనియాగాంధీ కుమారుడు హోదా’లోనే అది సాద్యం అవుతుంది.   ఇక, నరేంద్ర మోడీ ఈ ఎన్నికలలో విజయం సాదిస్తే, అతను గుజరాత్ లో తిరుగులేని నాయకుడిగా తనను తానూ మరోమారు నిరూపించుకోవడమే గాకుండా, బిజెపి తరపున ప్రధానమంత్రి అభ్యర్దిగా జాతీయస్థాయికి ఎదిగే అవకాశం కూడా పొందుతాడు. తద్వారా, మళ్ళీ రాహుల్ గాంధీకి మరోమారు జాతీయ స్థాయిలోకూడా సవాలుగా మారుతాడు.   అయితే, మోడీ రాష్ట్రంలో పొందుతున్న మద్దత్తు దేశవ్యాప్తంగా పొందగాలుగుతాడా లేదా అనేది మాత్రం ఇప్పుడే ఊహించలేము. ఒక వేళ పొందితే, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ‘తానే పార్టీ, పార్టీయే తానూ’ అన్నరీతిలో సాగుతున్న అతను జాతీయస్థాయిలో కూడా అదేరీతిలో చక్రంతిప్పే ప్రయత్నం చేయవచ్చును. బిజెపి అగ్ర నాయకత్వం తన అభిజాత్యాన్ని పక్కన బెట్టి అతనికి పార్టీ పగ్గాలు అప్ప్గగించగలిగితే, అప్పుడు అతను పార్టీకి పునర్ వైభవం తెచ్చే అవకాశం కూడా ఉంది. అంతేగాకుండా, పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేసి, ఉత్తర దక్షిణ భారతంలో రెండుచోట్ల కూడా పార్టీకి అధికారం తెచ్చిపెట్టవచ్చును. గానీ, ఈ లెక్కలన్నీ బిజెపి వచ్చే సాదారణ ఎన్నికలో మెజారిటీ సాదించగలిగితేనే వేసినవి మాత్రమే. ఒకవేళ యన్.డి.యే. సంకీర్ణం ఏర్పాటు చేయ వలసి వస్తే, అప్పుడు లెక్కలు వేరేవిదంగా ఉండవచ్చును. యన్.డి.యే. లో అతను తనకు అనుకూలంగా ఎందరిని తిప్పుకోగాలడనే దానిపై అతని ప్రధానమంత్రి పదవి అధిష్టించే అవకాశాలు ఆదారపడి ఉంటాయి.   ఇక, నరేంద్ర మోడీ గుజరాత్ లో ఓడిపోయినా లేక గుజరాత్ లో సంకీర్ణం వచ్చినా అతని ప్రభావం కొంతమేర తగ్గవచ్చును. అతను గెలవలేకపోయినా కూడా, కాంగ్రెస్ ఒంటరిగా గెలిచే అవకాశం కూడా ఎంతమాత్రంలేనట్లు కనిపిస్తోంది కనుక, గుజరాత్ లో కేషుభాయి పటేల్ తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం ఏర్పాటుచేస్తే అది విచ్చినం అయ్యేవరకు మోడీ తీవ్రంగాశ్రమించి, మళ్ళీ అధికారం కైవసం చేసుకోవచ్చును. అక్కడ అతని ఓటమి, అతనికి డిల్లీ తలుపులు మూసివేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, అతని నియంత్రత్వ ధోరణి నచ్చని వారు బిజెపిలో చాలమందే ఉన్నారు. అతను గుజరాత్లో ఓడినట్లయితే, అతను డిల్లీకి రాకుండా ఆపేందుకు అటువంటివారు విశ్వప్రయత్నం చేయక మానరు. అయినా, గుజరాత్ లో ఓడిన మోడీ, ముందు మళ్ళీ గుజరాత్ లోనే పోగోట్టుకొన్న తన అధికారాన్ని దక్కించుకోవాలని తాపత్రయపడతాడు గానీ, డిల్లీ వెళ్లాలని అనుకోడు కదా!   అందువల్ల, గుజరాత్ ఎన్నికలు అతనికి చాలా కీలకమే. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిపార్టీల మద్య యుద్ధం జరుగుతున్నట్లు పైకి కనిపిస్తున్నా, అది నిజానికి రాహుల్ గాంధీకీ నరేంద్రమోడికీ మద్య జరుగుతున్న బీకరపోరు మాత్రమే. ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్దుల రాజకీయ భవిష్యత్ నిర్నయించే నిర్ణయాత్మకమయిన యుద్ధం గుజరాత్ ఎన్నికలు గనుక దాని ఫలితాలు వారిద్దరికీ చాల కీలకమే కానున్నాయి.

world telugu conference

అన్నగారి ఊసులేదు..నర్సిమన్న పేరూ లేదు...

                  ఈ నెల 27 వ తేది నుండి 29 వ తేదివరకు తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలలో మన కిరణ్ కుమార్గారి ప్రభుత్వం, తెలుగుజాతి గర్వపడే ఇద్దరు మహానుభావులను రాజకీయ కారణాలతో పక్కకుబెట్టి విమర్శలు మూటగట్టుకొంటోంది. వారు స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారు మరియు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. పరిచయమే అవసరంలేని మహనీయులు వారిరువురూ.   తెలుగుజాతి గర్వపడే మేధావి స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారయితే, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు నిలిచేరు. దేశం చాల క్లిష్టమయిన పరిస్థితుల్లో ఉన్నపుడు ప్రధానమంత్రిగా పగ్గాలుచేపట్టిన స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారు, తన అపారమయిన తెలివి తేటలతో దేశాన్ని సురక్షితంగా ఆర్దిక సమస్యలనుండి గట్టెకించడమేగాకుండా, తన మైనార్టీ ప్రభుత్వాన్ని కడదాకా పడిపోనివ్వకుండా చాకచక్యంగా నడుపుతూ ఆర్దిక సంస్కరణలకు రూపుదిద్దారు. బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన ఆయన స్వయంగా ఎన్నో రచనలు చేసారుకూడా. దాదాపు 8 బాషలపై పూర్తీ సాధికారతగల ఆయన తన గొప్పలు తానూ ఎన్నడూ చెప్పుకోనీ ఒక మౌనమునీస్వరునిగా పేరుగాంచారు. తెలుగుజాతి గర్వపడే అటువంటి పెద్దమనిషి పేరు తలుచుకోవడానికూడా నేడు కిరణ్కుమార్ ప్రభుత్వం జంకుతోంది అంటే తెలుగు ప్రజలకి అంతకంటే అవమానం ఏముంటుంది.   అదేవిదంగా తెలుగు బాషకి నిలువెత్తు స్వరూపంగా భాసిల్లిన స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదని అందరికి తెలుసు. తెలుగు బాషపై అపారమయిన మమకారం చూపించిన ఆయనకీ తెలుగు మహాసభలలో చోటు దొరకలేదు.   ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.లో తెలుగుజాతికి చెందిన అనేకమంది పేర్లు ఉన్నపటికీ, వీరిద్దరి పేర్లు లేకపోవడంతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు ఆ జీ.ఓ.కాపీలను మీడియా ముందే చించి చెత్త బుట్టలో పడవేసి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఇప్పటికయినా కొంత విజ్ఞత అలవరుచుకోవాలని కోరారు. రాజకీయాలు తెలుగుబాషని ఏవిదంగా కబలిస్తున్నాయో తెలుసుకొనేందుకు ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది.  

టిఆర్ఎస్, వైఎస్ లఫై బాబు ఫైర్

  కరీంనగర్ జిల్లాలో పాద యాత్ర సాగిస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు టిఆర్ఎస్ పార్టీ, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి లఫై తీవ్ర విమర్శలు చేశారు. టిఆర్ఎస్ ను తిరకాసు పార్టీగా అభివర్ణించిన బాబు, పనిలో పనిగా వైఎస్ ఫైన కూడా విమర్శలు చేశారు. వైఎస్, తన అల్లుడికి 1.46 లక్షల ఎకరాల భూమిని కట్టబెట్టారని బాబు విమర్శించారు.   తెలుగు దేశం పార్టీ తెలంగాణా కు వ్యతిరేకం కాదని, తాను ప్రత్యెక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని బాబు వివరించారు. ఇక ముందు కూడా తాను తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడనని బాబు స్పష్టం చేశారు.   అలాగే, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలఫై వరాల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, రైతులకు రోజుకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని, రైతుల రుణాలను మాఫీ చేసి, వడ్డీ లేని రుణాలు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం లకు 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పత్తికి మద్దతు ధర నాలుగు వేల రూపాయలు ఉండేటట్లు చూడాలని బాబు డిమాండ్ చేశారు.   రైతుల విషయంలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు దారుణంగా ఉందని బాబు విమర్శించారు.

కొత్త పార్టీని స్థాపించే ఆలోచనే లేదు : రజనీకాంత్

       తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాలంటే నిరాసక్తత వ్యక్తం చేసిన ఆయన, ఆ రంగంలో తనకు ప్రత్యేకంగా లక్ష్యాలేమీ లేవని అన్నారు.   కొంత మంది రజని అభిమానులు ఇటీవల ఆయనను కలిసి తమిళ రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించాలని కోరిన విషయం తెలిసిందే. దీని ఫై ఆయన వ్యాఖ్యానిస్తూ, తాను నేతగా పనికి రానని, తన వ్యక్తిత్వంలో నాయకుడు లేదని కుండ బద్దలు కొట్టారు.   తాను ఈ స్థాయిలో ఉండడానికి తమిళ నాడు ప్రజలే కారణమని, వారికి తానెప్పుడూ ఋణపడి ఉంటానని రజనీకాంత్ అన్నారు. మూడు రోజుల క్రితం 63 వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆయన, గతంలో జి.కే. మూపనర్ పార్టీకి మద్దతు పలికి, ఆ పార్టీ అధిక సీట్లు గెలవడానికి సహాయపడ్డారు.

సోనియాను ప్రశ్నించినందుకే జైలులో జగన్ ?

        వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని , కాంగ్రెస్ పభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికే తమ నేత జగన్ ను జైలులో పెట్టారని ఆయన అన్నారు.   హత్య చేసిన ఖైదీకి కూడా ఆరు నెలలు అవ్వగానే బెయిల్ ఇస్తారని, ఏ తప్పూ చేయని జగన్ కు బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదని అంబటి అన్నారు. జగన్ జైలులో అడుగు పెట్టి రెండు వందల రోజులు పూర్తయిన కారణంగా శ్రీకాకుళం లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కుమ్మక్కు అయి, జగన్ ను జైలులో అంబటి ఆరోపించారు. కాంగ్రెస్ దిగజారుడు కార్యక్రమాలకు ఇది నిదర్శనమని అంబటి వ్యాఖ్యానించారు. జగన్ ను అక్రమంగా జైలులో పెట్టారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అంబటి అన్నారు.   కాంగ్రెస్ పార్టీలో అవినీతి చేయని మంత్రి ఎవరున్నారని అంబటి ప్రశ్నించారు. మోపిదేవికి ఒక న్యాయం, ధర్మానకు మరో న్యాయమా అని ఆయన అన్నారు. జగన్ త్వరలోనే బయటకు వస్తాడని, ప్రజల కష్టాలు తీరుస్తారని అంబటి అన్నారు.

‘గ్రేటర్’ లో పాగా కు జగన్ ప్రయత్నాలు ?

      వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో సాధ్యమైనంత ఎక్కువ మంది కార్పొరేటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.   దాదాపు 20 మంది కార్పోరేటర్లు జగన్ గూటిలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. కార్పొరేషన్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నిన్న జైలులో జగన్ మోహన్ రెడ్డి ని కలిసారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జగన్ పార్టీ నుండి అంబర్ పేట్ శాసనసభ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.   ప్రస్తుతం ‘గ్రేటర్’ లో జగన్ పార్టీకి ఐదుగురు అసోసియేట్ సభ్యులు ఉన్నారు. నలుగు కాంగ్రెస్ కార్పోరేటర్లు, ఒక తెలుగు దేశం కార్పోరేటర్ జగన్ పార్టీలో చేరారు. మరో 20 మంది కార్పొరేటర్లను జగన్ పార్టీలోకి తెచ్చేందుకు వెంకటేష్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   నగరంలో ఎదిగే కార్యక్రమంలో మొదటి దశగా కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.