telangana issue

తెలంగాణాపై సోనియా మాటే ఆలస్యం!

      తెలంగాణాపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేయడానికి కేంద్ర హోం శాఖ సిద్దంగా ఉందని కేంద్ర హోం మంత్రిసుశీల్ కుమార్ షిండే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీ అన్నింటికంటే ఎక్కువగా తెలంగాణకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరలో స్పష్టమైన పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారని షిండే చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై సీడబ్ల్యూసీలో నిర్ణయం ప్రకటించవచ్చునని అంటున్నారు. తెలంగాణతో సీమకు చెందిన 2 జిల్లాలు కలిపి హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించడమా, లేక హైదరాబాద్‌ను 'యూటీ'గా కొనసాగించడమా, లేక మరో ప్రతిపత్తి కలిగించడమా అన్న అంశంపై తర్జన భర్జనలు జరిగాయని, ఈ విషయంలో ఒక స్పష్టత రాలేదని ఈ వర్గాలు అంటున్నాయి.

bihar

బీహార్ లో 20మంది చిన్నారులు మృతి

  బీహార్‌లోని శరణ్ జిల్లా మష్రాఖ్ బ్లాక్ గందావన్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆరగించిన 20మంది విద్యార్థులు మరణించారు. మరో 21 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 22ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడినప్పటికీ తీవ్ర అస్వస్థతో ఉన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాధిత విద్యార్ధులను సమీపంలో ఉన్న చాప్రా సదర్ ఆస్పత్రికి తరలిస్తుండగానే పదకొండు మంది దారిలోనే మరణించిగా మరి కొందరు ఆసుపత్రిలో మరణించారు. నిన్నమధ్యాహ్నం విద్యార్ధులకు వడ్డించిన భోజనంలో క్రిమిసంహరక మందు ఆర్గానో పాస్పరస్ కలసి ఉండవచ్చని బీహార్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అమర్ జీత్ సిన్హా అనుమానిస్తున్నారు. బాధిత విధ్యార్ధులకు పాట్నామెడికల్ కాలేజీలో చికిత్సఅందిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. చనిపోయిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

Chandrababu Bus Yatra

ఆగస్టు 24 నుండి బాబు బస్సు యాత్ర

      తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 7 నెలలు పైగా రాష్ట్రంలో పలు జిల్లాలలో పాదయాత్ర చేసి పార్టీ శ్రేణులలోఉత్సాహం నింపారు. అదే సమయంలో ఆయన కూడా పాదయాత్ర తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో బస్సుయాత్రకు సిద్దం అవుతున్నారు. ఆయన చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను మాత్రం తన పాదయాత్రలో పర్యటించలేకపోయారు. అందువల్ల వచ్చేనెలలో బస్సుయాత్ర చేప్పట్టి ఆ జిల్లాలను కూడా పర్యటించాలని ఆయన సిద్దపడుతున్నారు. ఒకవేళ పంచాయితీ ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా వస్తే అది తన యాత్రకు మంచి ఊపునిస్తుందని, అప్పుడు తన బస్సు యాత్ర ద్వారా ఆ తరువాత జరగనున్నమునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నధం చేయవచ్చునని చంద్రబాబు ఆలోచన. ఆగస్టు 24 నుండి ఈ యాత్ర మొదలు కానుంది. ఈ మేరకు ఇంతకుముందే పార్టీ వర్గాలు ప్రకటన చేశాయి. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండి వారికి దగ్గరగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.

congress

కాంగ్రెస్ నేతలు ప్రజలను ఏమార్చడానికే తిట్టుకొంటున్నారా?

  తెలంగాణా, రాష్ట్ర విభజన అంశాల మీద రోజుకొక వార్తని మీడియాకి లీక్ చేయడం మళ్ళీ దానిని ఆ మరునాడు ఖండించడం, లేకుంటే రోజుకొక వ్యాఖ్య చేయడం దానిని పట్టుకొని అటు మీడియాలో తీవ్రంగా చర్చలు, ఇటు కాంగ్రెస్ నేతలు మాటలు రువ్వుకోవడం, గత రెండు మూడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా ఈ తంతు నడిపిస్తూ రోజులు దొర్లించేస్తోంది.   త్వరలో రాష్ట్ర విభజన అంశంపై ఖచ్చితమయిన నిర్ణయం ప్రకటిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పినప్పుడు, రెండు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలను నియంత్రించి ఉండాలి. కానీ, చేయలేదు. వారు రెండు గ్రూపులుగా విడిపోయి బద్ధ శత్రువులవలే కత్తులు దూసుకొంటూ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంటే, కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తోంది. అసలు ఇదంతా ప్రజలను, ప్రతిపక్షాలను ఏమార్చడానికి కాంగ్రెస్ ఆడుతున్ననాటకంలో భాగమేనేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కీచులడుకొంటూ ప్రజల దృష్టిని మళ్ళిస్తుంటే, అక్కడ డిల్లీ పెద్దలు రకరకాల వ్యాక్యాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుంది.   ఇక నేడో రేపో తెలంగాణా అంశాన్ని తేల్చేస్తామని ఒక పక్క చెపుతూనే, ‘తెలంగాణా ప్యాకేజి’, ‘రాయల తెలంగాణా’ వంటి లీకులు ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ఆలోచన ఏమీ లేదని, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాజనిత వార్తలేనని” చెప్పడం చూస్తే, ఆయన మళ్ళీ మరో కొత్త చర్చకు అవసరమయిన ముడిసరుకు అందజేస్తునట్లు భావించాలి. ఆయన ఆవిధంగా అన్నారు గనుక, ‘బహుశః హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఏర్పాటు చేయవచ్చునేమో’, లేకపోతే ‘హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచి రాష్ట్ర విభజన చేయవచ్చునేమో’, లేకపోతే ‘అసలు రాష్ట్ర విభజన చేసే ఆలోచన లేనందునే ఆయన ఆవిధంగా అన్నారేమో’ అంటూ ఆయన తాజా వ్యాఖ్యలపై అనేక కోణాలలో చర్చలు మొదలవుతాయి.   అదే అంశం పట్టుకొని రేపటి నుండి ఉభయ ప్రాంతాలకి చెందిన కాంగ్రెస్ కూడా ఎవరికి అనుకూలమయిన వాదనలు వినిపించవచ్చును. అసలు ఒక సమస్యని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే మంచి పద్ధతి లేదా? లేక ఈ సమస్యను మరింత కాలం సాగదీసేందుకు కోరుండే ఈ విధంగా ప్రవర్తిస్తోందా? అత్యంత సున్నితమయిన అంశాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలననే సమస్య ఇంతవరకు వచ్చింది. కనీసం ఇప్పటికయినా ఆ పార్టీ మేల్కొందా అంటే లేదనే అనిపిస్తోంది.

Congress MP Manda Jagannadham

నక్సలిజం పుట్టింది సీమాంధ్రలోనే!

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోర్ కమిటిలో తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. నక్సలిజం పుట్టింది సీమాంధ్రలోనని ఆయన అన్నారు. కిరణ్ సీఎంలా కాకుండా సీమాంధ్ర నేతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో సీఎంగా కిరణ్ విఫలమయ్యారని విమర్శించారు. కోర్‌ కమిటీకి ఇచ్చిన నివేదికను సీఎం కిరణ్ లీక్ చేసి అనైతికతకు దిగుతున్నారని అన్నారు. సీఎం నివేదికను తెలంగాణ నేతలు ఖండించాలని కోరారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని అన్నారు.

 Mumbai dance bars back

బార్లలో డాన్సులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

      ముంబై బార్లలో డాన్సులను అనుమతినిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. బోంబే పోలీస్ చట్టం 2005 ప్రకారం బార్ లలో నృత్యాలు చెయ్యటాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ చట్టం ఆహారపానీయాలు సేవించే చోట, పర్మిట్ రూం లేదా బార్ లేక బీర్ రూంలలో డ్యాన్స్ లు చెయ్యటాన్ని నిషేధించింది కానీ త్రీస్టార్ అంతకంటే పై స్థాయి హోటళ్ళు, కొన్ని పెద్ద సంస్థలలో అందుకు మినహాయింపు ఇచ్చింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మత్తు పదార్థాల సేవించే చోటు నృత్యాలు తగవని, అనైతికమని, అశ్లీలమని, వ్యభిచారానికి దారితీసే అవకాశముందని, మహిళలపట్ల దురాచారమని మహారాష్ట్ర ప్రభుత్వం వాదించింది. కానీ చట్టం ఎక్కడైనా ఒక్కటే కాబట్టి కొన్ని చోట్ల అనుమతులు మరికొన్ని చోట్ల నిషేధాలుండటం సరికాదని 2006 లో డ్యాన్సర్లు బార్ యజమానులు ఎపెక్స్ కోర్టు ని ఆశ్రయించగా కోర్టు వారి వాదనతో ఏకీభవించింది.  ఈ లోపు బొంబాయి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం డాన్సర్లకు వారి వృత్తిని వారు చేసుకునే హక్కుని కాలరాస్తోందని అభిప్రాయపడింది.  దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది.

Gandra Venkata Ramana Reddy

తెలంగాణ ఇస్తే నక్సల్స్ సమస్య ఉండదు

      తెలంగాణపై అధిష్టానం తీసుకోబోయే నిర్ణయానికి పార్టీకి చెందిన ఇరుప్రాంతాల నేతలు కట్టుబడి ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. పంచాయితీ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫరెండమన్నారు. తెలంగాణ ఇస్తే నక్సల్స్ సమస్య వస్తుందని అనుకోవడంలేదని అన్నారు. నక్సల్ సమస్య గతంలో ఉండేదని, కాని ఆ తర్వాత జరిగిన మార్పులు, సామాజిక ప్రగతి వంటి కారణాలతో నక్సల్ ఉద్యమం లేదని గండ్ర అన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో నక్సల్స్ సమస్య లేదని గుర్తు చేశారు. విభజనపై పార్టీ పెద్దల నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 Manish Tiwari hits out at Modi

మోడీ ప్రసంగం విలువ ఐదు రూపాయలేనా?

      కేంద్రమంత్రి మనీష్ తివారి బీజేపీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని విమర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. నరేంద్రమోడీతో హైదరాబాద్ లో బీజేపీ యువ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే దానికి ఎంట్రీఫీజుగా ఐదు రూపాయలను నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. స్వాముల ప్రవచనాలకు వంద నుండి లక్ష రూపాయలు ఉంటుందని, పరాజయం పాలయిన సినిమాకు కూడా రూ. రెండు వందల నుండి ఐదు వందలు ఉంటుందని, అలాంటిది మోడీ ప్రసగం విలువ రూ.5 మాత్రమేనా ? అని ట్విట్టర్ లో ఆశ్చర్యపోయారు. వినడానికే బీజేపీ ఐదు రూపాయల పన్నువిధిస్తే.. ఇక 120 కోట్ల మందిపై మాట్లాడే పన్ను ఇంకెంత విధిస్తారోనని ఆయన ఎద్దేవాచేశారు. యువజన సదస్సుకు వసూలుచేసే ఫీజు మొత్తాన్ని ఉత్తరాఖండ్ బాధితులకు విరాళంగా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.

jagga reddy telangana

తెలంగాణను మత రాజకీయాలు శాసిస్తాయి: జగ్గారెడ్డి

      రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణ అల్లకల్లోలమవుతుందని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణను మత రాజకీయాలు శాసిస్తాయని అన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో కిరణ్ మావోయిస్టుల అంశాన్ని ప్రస్తావించడాన్ని ఆయన సమర్ధించారు. సీఎం కిరణ్ ప్రతిపాదించిన భారీ ప్యాకేజీ తెలంగాణకు వారం అని పేర్కొన్నారు. సీఎం ప్రయత్నం సఫలమయితే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలా కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల పరిస్థితి దుర్భరంగా మారుతుందని ఓ ప్రైవేటు వార్తా చానల్ తో అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తున్న వాళ్లు ప్యాకేజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని జగ్గా రెడ్డి ప్రశ్నించారు.

kiran telangana issue

తేల్చే దాకా ఆగండి: సీఎం కిరణ్

      తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఏదో ఒకటి తేల్చేద్దాం అనుకుంటున్న తరుణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మరో నాటకానికి తెర తీశారు.. రాష్ట్రాన్ని విభజించడం కన్నా భారీ ప్యాకేజీతో సరెపెట్టోచ్చని కిరణ్‌ కోర్‌ కమిటీకి విన్నవించినట్టుగా వచ్చిన వార్తలు రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారాన్ని లేపాయి.. అంతేకాదు అధిష్టానం కూడా ఈ విషయం పై ఆలోచిస్తుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది..   ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యవహారాల ఇంచార్ట్‌ దిగ్విజయ్‌ సింగ్‌ కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డితో భేటి కావడం ప్రాదాన్యత సంతరించుకుంది.. జైపాల్‌ నివాసంలో ఆయన్ను కలిసిన దిగ్విజయ్‌ దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో చర్చలు జరిపారు.. ఈ చర్చల్ల కోర్‌కమిటీ బేటితో పాటు, ప్యాకేజీల ప్రకటన రాష్ట్ర ఏర్పాటుకు ఆవశ్యకత లాంటి ఎన్నో విషయాలను చర్చించినట్టుగా తెలుస్తుంది.. అంతేకాదు అధిష్టానం నిర్ణయం వెలువడే వరకు తెలంగాణ నేతలను సంయమనంతో ఉంచే బాధ్యతను కూడా దిగ్విజయ్‌ జైపాల్‌ రెడ్డి కే అప్పగించారు.. అయితే ఇద్దరు నేతలు భేటి విషయలను తెలియజేయకపోవడంతో ఇరు పక్షాల వారు భేటి తమకు అనుకూలంగానే జరిగిందని చెప్పుకుంటున్నారు..

 RBI fines 22 banks

బ్యాంక్‌లపై జరిమానా

      రూల్స్‌ను పక్కన పెట్టిన బ్యాంక్‌లపై చర్యలు మొదలు పెట్టింది ఆర్‌బిఐ.. నోయువర్‌ కస్టమర్‌, యాంటీ మనీలాండరింగ్‌ నిబందనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించిన 22 బ్యాంకులకు దాదాపు 50 కోట్ల రూపాయల వరకు జరిమాన విధించింది..   ఎస్‌బిఐ, పిఎన్‌బి, యస్‌ బ్యాంక్‌తో పాటు చాలా బ్యాంక్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.. అంతే కాదు సిటిబ్యాంక్‌ లాంటి మరి కొన్ని సంస్ధలను భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని హెచ్చరిస్తూ లేఖలను కూడా పంపింది.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మనీలాండరింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందంటూ ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రాపోస్ట్ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో దశలవారీగా స్టింగ్ ఆపరేషన్‌తో బయటపెట్టింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించిన ఆర్‌బిఐ ఇందులో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసిఐసిఐ, యాక్సిక్ బ్యాంకులలో యాంటీ మనీలాండరింగ్, కెవైసి నిబంధనల ఉల్లంఘన జరిగిందని వాటికి రూ.10.50 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు మరికొన్ని బ్యాంక్‌లపై కూడా చర్యలు చేపట్టింది. 22 బ్యాంకులలో ఖాతాల నిర్వహణ, పుస్తకాలు, అంతర్గత నియంత్రణ, నిబంధనల అమలు తీరు తదితర వివరాలను ఆర్‌బిఐ విచారణ బృందం ఏప్రిల్‌లో సమగ్రంగా పరిశీలించాక కెవైసి/యాంటీ మనీలాండరింగ్ నిబందలను సదరు బ్యాంక్‌లు ఉల్లంగిచాయని తేల్చింది. ఇవే కాదు ఇలాగే భవిష్యత్తులో మరిన్ని బ్యాంక్‌లపై ఆర్‌బిఐ చర్యలకు రెడీ అవుతుంది..

chandrababu

త్వరలో చంద్రబాబు ‘బస్సు యాత్ర’ షురూ

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 7 నెలలు పైగా రాష్ట్రంలో పలు జిల్లాలలో పాదయాత్ర చేసి పార్టీ శ్రేణులలోఉత్సాహం నింపారు. అదే సమయంలో ఆయన కూడా పాదయాత్ర తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. సుదీర్ఘమయిన తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో తన పార్టీ పరిస్థితిని ఆయన స్వయంగా అధ్యయనం చేయగలిగారు. అనారోగ్యం, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నపటికీ ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను ముగించారు. పార్టీపై, ప్రజలపై ఆయన పాదయాత్ర ప్రభావం ఎంత ఉందో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలే తెలియజేస్తాయి.   ఆయన చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను మాత్రం తన పాదయాత్రలో పర్యటించలేకపోయారు. అందువల్ల వచ్చేనెలలో బస్సుయాత్ర చేప్పట్టి ఆ జిల్లాలను కూడా పర్యటించాలని ఆయన సిద్దపడుతున్నారు. ఒకవేళ పంచాయితీ ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా వస్తే అది తన యాత్రకు మంచి ఊపునిస్తుందని, అప్పుడు తన బస్సు యాత్ర ద్వారా ఆ తరువాత జరగనున్నమునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నధం చేయవచ్చునని చంద్రబాబు ఆలోచన. కానీ, కాంగ్రెస్ పార్టీ ఈనెలాఖరులోగా రాష్ట్ర విభజనపై ప్రకటన చేసినట్లయితే, తదనుగుణంగా పార్టీని సన్నధం చేసేందుకు చంద్రబాబు తన బస్సు యాత్ర ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవచ్చును.

Digvijay Singh

తెలంగాణ పై జైపాల్ తో దిగ్విజయ్ చర్చ

      రాష్ట్ర విభజన సమస్య పై కేంద్రం భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తో సమావేశం కావడం ప్రాధాన్యం సత్కరించుకుంది. గతకొంతకాలంగా జైపాల్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా పనిచేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ భేటి తరువాత జైపాల్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్ మంత్రి జానా రెడ్డితో పాటు మరికొందరితో ఫోన్ లో మంతనాలు జరిపారు. ఈ సారి తెలంగాణ రావడం ఖాయమని జైపాల్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారని సమాచారం. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ బహరింగంగా చర్చలు జరపడం శుభసంకేతం అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ అంశంలో ఇప్పటి వరకూ తెర వెనుక ఉంటూ వచ్చిన జైపాల్ తో అధిష్టానం పెద్దలు చర్చలు జరపడం సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. 

Uttarakhand tragedy

నెల గడిచిన మానని గాయాలు

      కైలాస నాథుని సాక్షిగా ఉత్తరాఖండ్‌ వరద బీభత్సం దేశానికి తీరని నష్టం మిగిల్చింది. చార్‌ధామ్‌ యాత్రకని వెళ్లిన వారిలో చాలా మందే మృత్యువాత పడగా ఇంకా ఎంతో మంది జాడ కూడా తెలియటం లేదు... నెల క్రితం వరకు కేధర్‌నాద్‌, బద్రీనాధ్‌, గంగ్రో తి, యమునోత్రి, లాంటి పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకల లాడాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా స్మశాన నిశబ్దం ఆవహించింది..   సోమవారంతో ఈ వరద బీభత్సానికి నెల రోజులు పూర్తయ్యాయి. దీంతో వరదల్లో గల్లంతయిన వారిని గుర్తించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న టైం  ముగిసిందని ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌బహుగుణ చెప్పారు. ఇప్పటికి 5వేల 748 మంది యాత్రికుల జాడ తెలియట్లేదని చెప్పారు. అయితే వారందరు చనిపోయినట్టు నిర్ధారించటం లేదని ఇంకా వారికోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. ఐతే తాము అనుకున్న గడువు ముగిసినందున గల్లంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్  గ్రేషియా చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు. కానీ భవిష్యత్తులో ఈ గల్లంతయిన వారిలో ఎవరైన తిరిగి వస్తే ఎక్స్‌క్రేషియా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని చెప్పారు.. చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం మూడున్నర లక్షలు చెల్లిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షల పరిహారం అందిస్తోంది. ఐతే బాధిత కుటుంబాలు తమవారు చనిపోయినట్లు అంగీకరిస్తూ సంతకం చేస్తేనే వారికి పరిహారం అందిస్తున్నట్లు బహుగుణ తెలిపారు. మరోవైసు ఇంకా ఆళయ పరిసర ప్రాంతాల్లో శిథిలాలు అలాగే ఉన్నాయి.. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఆ శిధిలాలను తొలగించలేకపోతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చార్‌దామ్‌ యాత్ర తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం కనిపించటం లేదు..

మోడీ ర్యాలీకి 5 రూపాయలు టికెట్

      దేశ భవిష్యత్ ప్రధానిగా భావించబడుతున్న నరేంద్రమోడీ ముందు రాహుల్ గాంధీ ప్రభ వెల వెలబోతుంది. గుజరాత్ సర్వతోముఖాభివృద్ది నరేంద్రమోడీ జాతి దృష్టిని ఆకర్షించారు. మూడో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయిన ఆయన అయితేనే ఈ దేశానికి దిశానిర్ధేశం చేయగలుగుతారని, ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపోతున్న భారత్ కు ఆయనే దిక్సూచి అని యువత భావిస్తోంది.   బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ గా మోడీ ఇప్పటికే పోటీలో దూసుకెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా ఆయన పర్యటనలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన హైదరాబాద్ లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారు.  ఈ నేపథ్యంలో మోడీ ర్యాలీకి హాజరయ్యే ప్రతి ఒక్కరూ రూ.5 చెల్లించి టికెట్ కొనుక్కోవాలని నిర్ణయించారు. ఈ విధంగా వసూలయిన మొత్తం ఉత్తరాఖండ్ వరద బాధితులకు పంపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదో మంచి ప్రయత్నంగా మిగులుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

పుట్టిన తేదీ మార్చినందుకు ప్రభుత్వానికి జరిమానా

  ప్రభుత్వ ఉద్యోగాలలో చేరేవారు తమ జన్మతేదీ దృవీకరణ పత్రాలను విధిగా సమర్పించడం, దానిని ఆధారంగా తీసుకొని వారి సర్వీస్ కాలం లెక్కకట్టడం సాధారణ విషయమే. ఒకసారి సర్వీస్ రికార్డులో జన్మ తేదీ నమోదు చేయబడిన తరువాత ఇక దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేయడం సాధ్యం కాదు. అందుకు చట్టం కూడా అనుమతించదు. అయితే, ఈ చట్టాలకు అతీతులమని భావించేవారు కొందరు ఉంటే, అటువంటి వారికి ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుంటుందని ఈ కేసు నిరూపిస్తోంది.   రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ శివారెడ్డి సర్వీసు రికార్డులో తన పుట్టిన తేదీ తప్పుగా నమోదు చేయబడిందని, అందువల్ల దానిని 1954 బదులుగా 1956గా సవరించమని ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ సర్వీసు రికార్డులో ఆయన పుట్టిన తేదీని ఆయన కోరినట్లు మార్చేందుకు ఒక జీఓ జారీ చేసింది.   గంగాధర్, రామ్మూర్తి అనే ఇద్దరు వ్యక్తులు ఈ జీవోను సవాలు చేస్తూ ట్రిబ్యునల్లో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన ట్రిబ్యునల్ ఆ జీవోను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ శివారెడ్డి, ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురయింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శివారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.   న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టివేస్తూ సర్వీసు రిజిస్టర్‌లో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ నిబంధనల్లోని రూల్ 4(1)(బి) ప్రకారం పుట్టిన తేదీ సవరణపై నిషేధం ఉందని గుర్తు చేసింది. అంతే గాకుండా శివారెడ్డికి, అతనిని వెనకేసుకు వచ్చిన ప్రభుత్వానికి చెరో రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని ప్రతివాదులుగా ఉన్న గంగాధర్, రామ్మూర్తిలకు చెల్లించాలని ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

ఖత్రోచీకి భారత్ ఋణపడి ఉండాలిట

  ఇటలీ దేశానికి చెందిన ఖత్రోచి బోఫోర్స్ కేసులో భారత్ లో చేసిన నిర్వాకం గురించి భారతీయులందరికీ తెలుసు. ఆయన చేసిన నిర్వాకం వల్ల చివరికి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీపై రూ.80 కోట్లు ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, తత్ఫలితంగా ఆయన ఎన్నికలలో ఓడిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. బోఫోర్స్ కేసులో సీబీఐ కేసు నమోదయిన సంగతి పసిగట్టిన వెంటనే రాత్రికి రాత్రి దేశం నుండి ఉడాయించిన ఆ పెద్ద మనిషిమీద రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయబడింది. రెండు సార్లు పోలీసులనుండి తెలివిగా తప్పించుకొని ఇటలీ చేరుకొన్న అతనిని భారత్ కి తిరిగి రప్పించలేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అతనిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయడం జరిగింది. మన దేశం పరువు తీసిన ఆ మహానుభావుడు నాలుగు రోజుల క్రితం ఇటలీలో గుండెపోటుతో మరణించాడు. బోఫోర్స్ కుంభకోణంలో అసలు సూత్రధారి అయిన అతని మరణంతో ఇక మరెన్నడూ బోఫోర్స్ గురించి ప్రస్తావన కూడా చేయనవసరం లేని పరిస్థితి.   ఇంత పెద్ద గ్రంథo నడిపిన ఆ మహానుభావుడు భారత్‌ను ఎంతగానో ప్రేమించారని, ఆయన భారత్ కు చేసిన సేవలకు గాను భారత్ ఆయనకు ఋణపడి ఉండాలని ఆయన కుమారుడు ‘మాసిమో’ మీడియాతో చెప్పడం విశేషం. తన తండ్రిని రాజకీయ వేధింపుల కారణంగానే భోపోర్స్ కుంభకోణంలో ఇరికించారని, నిజానికి ఆయన ఏ పాపం ఎరుగరని అని మాసిమో పేర్కొన్నారు. తన తండ్రి చేసిన పనులకు తానూ చాలా గర్విస్తున్నానని తెలిపారు. పెట్ర ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు అమోఘం అని కొనియాడారు.

పార్లమెంటు సమావేశాలు ఆగస్ట్ 5 నుండి మొదలు

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 30 వరకు జరుగుతాయి. మధ్యంతర ఎన్నికల గురించి జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నందున బహుశః పార్లమెంటుకు ఇవే ఆఖరి సమావేశాలు కావచ్చును. కాంగ్రెస్ తనకు ఓట్ల వర్షం కురిపిస్తుందని భావిస్తున్నఆహార భద్రతా బిల్లును ఈ సమావేశాలలో ప్రవేశపెట్టవచ్చును. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ఉంటే గనుక ఈ సమావేశాల్లోనే తెలంగాణపై బిల్లు కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.   కీలకమయిన ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టినా లేకున్నా కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు రెండూ కూడా ఒకరిపై మరొకరు దాడికి అస్త్రాలు సిద్ధం చేసుకొంటున్నాయి. బహుశః ఇదే ఆఖరి సమావేశమని ప్రతిపక్షాలు భావిస్తే ఆ దాడి మరింత తీవ్రంగా ఉండవచ్చును. క్రిందటిసారి సమావేశాల సమయంలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుత పరిస్థితి చాల మెరుగ్గా ఉంది గనుక, కాంగ్రెస్ కూడా అంతే దీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవచ్చును.   అయితే అధికార విపక్షాల ఈ వ్యూహాల వలన పార్లమెంటు విలువయిన సమయం వృధాకావడం మినహా మరేమీ సాధించేది ఉండదని ఇరుపక్షాల నేతలకి తెలుసు. కానీ, ఎవరి రాజకీయ ప్రయోజనాలను వారు కాపాడుకోవడం కోసం తమ పరస్పర దాడులు, ఆరోపణలు, వాక్ అవుట్లు వంటివి కొనసాగిస్తుంటారు.