రాజ్యాంగంలోనే రాష్ట్ర సమైక్యతను కాపాడగల క్లాజు [ఇ]?!

 

ఎబికె ప్రసాద్


[సీనియర్ సంపాదకులు]

 

 

 

రాజనీతి శాస్త్రాన్ని కాస్తా స్వతంత్రభారతదేశంలో "పదవీరాజకీయ శాస్త్రం''గా మార్చిన 'ఘనులు' కాంగ్రెస్ నాయకులు! అలాంటివాళ్ళు దేశ సమాఖ్య (ఫెడరల్)వ్యవస్థను ప్రజాప్రయోజనాల రక్షణకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాల సుస్థిరతకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తోడునీడగా ఉండకుండా కేవలం ఎన్నికలలో విజయం సాధించడం కోసం 'పావు'గా వినియోగించుకుంటూ వస్తోంది. అలాంటి తాజాగా చేతివాటంగా అందివచ్చిన 'పావు' - స్వతంత్ర భారతంలో భాషాప్రయుక్త ప్రాతిపదికపై మొట్టమొదటిసారిగా ఏర్పడిన పెద్దరాష్ట్రమైన తెలుగువారి "ఆంధ్రప్రదేశ్''ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో తమ నాయకురాలైన ఇటాలియన్ సోనియా రాజకీయ కుటుంబ ప్రయోజనాలకోసం అశాస్త్రీయంగా నిట్టనిలువునా చీల్చడానికి తీసుకున్న నిర్ణయం! ఆంధ్రప్రదేశ్ లో భాగమైన తెలంగాణా ప్రాంతంలో 15 పార్లమెంటు సీట్లకోసమని వేర్పాటువాదులయిన కొందరు రాజకీయ నిరుద్యోగులతో చేతులు కలిపి కాంగ్రెస్ ఈ పనిచేసి, తెలుగుజాతికి విద్రోహం తలపెట్టి, ఆ విద్రోహాన్ని సమర్థించుకోడానికి మరికొన్ని తప్పులు చేస్తూ పోతోంది. ఇందుకు అది ఆధారపడుతున్నది రాజ్యాంగంలోని 2,3,4 అధికరణలమీద. ఈ మూడింటి సారాంశం - భారత యూనియన్ లో కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి, ఉన్న రాష్ట్రాలనుంచి భూభాగాలను చీల్చి మరొక రాష్ట్రంలో విలీనం చేయడానికి పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని చెప్పడం. 3వ అధికరణ ప్రకారం - నూతన రాష్ట్రాలను ఏర్పర్చడమే గాక, ప్రస్తుతమున్న రాష్ట్రాల వైశాల్యాన్ని పెంచడానికి, లేదా కుదించడానికి, లేదా వాటి సరిహద్దుల్ని మార్చడానికి లేదా ఆ రాష్ట్రాల పేర్లను కూడా మార్చడానికి శాసనం రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉంది!

 

 

అయితే పాలనాధికారాన్ని చేపట్టే రాజకీయపార్టీలు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తమ "బ్రూట్ మెజారిటీ''ద్వారా తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించడానికి ఈ అధికరణవల్ల అవకాశం దొరికింది! రానురానూ ఈ తప్పుడు సంప్రదాయం ఎక్కడికి దారితీస్తోంది? పాలనా పగ్గాలు పట్టుకున్న అధికారపక్షాలు భారత సమాఖ్య వ్యవస్థలోని రాష్ట్రాల ప్రజల మెజారిటీ అభీష్టాన్ని, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రాల చట్టసభలనూ ఖాతరు చేయకుండా కూడా కొత్తరాష్ట్రాలను స్వార్థప్రయోజనాలకోసం ఏకపక్షంగా ఏర్పర్చచే దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది పంజాబ్-హర్యానాలుగా పంజాబ్ విభజనతోనే మొదలయింది! పంజాబ్ శాసనసభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా సభ ఆమోదముద్ర లేకుండానే కేంద్రంలోని కాంగ్రెస్ అధికారపక్షం పంజాబ్ ను విభజించేసింది! రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ఐక్యతను బలిగొన్నది! అదే పద్ధతిని ఇప్పుడు దేశంలోని తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను బలిగొనజూస్తోంది! ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తనకు తననే ఆంధ్రప్రదేశ్ లో ఆత్మాహుతికి సిద్ధమవుతోంది! కొందరు వేర్పాటువాద నాయకుల వత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ ను 3వ అధికరణ ఆధారంగా విభజించడానికి సిద్ధమయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఇటాలియన్ సోనియా నాయకత్వంలో హోంమంత్రిత్వశాఖ రాష్ట్ర విబజనకోసం మూడు రకాల ప్రతిపాదనలతో ఒక "నోట్'' (పత్రం) తయారుచేసింది. దాన్ని మంత్రి షిండేకి సమర్పించింది. ఇదో విచిత్రమైన పత్రం! దీనికి పునాది రాజ్యాంగంలోని 3వ అధికరణమే అయినా, హోంశాఖ "నోట్''లో మొదటి అంశం పూర్తిగా ప్రజల పరిశీల దృష్టికి యింకా వచ్చినట్టులేదు!



అది - "పదిజిల్లాలతో ఏర్పడగల తెలంగాణా రాష్ట్రంలో ఆ పదిజిల్లాలతో పాటు తెలంగాణలో ఐచ్చికంగా ఏ ఇతర జిల్లాలయినా సరే వచ్చి చేరదలిస్తే అవన్నీ చరవచ్చు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పిమ్మట తెలంగాణాగానే ఏర్పడుతుంది'' ["Along with 10 districts, any other disstricts that voluntarily come forward to join in Telangana will be taken into consideration and Telangana will be formed]!



 

ఈ "నోట్''ను ఎవరు తయారుచేశారోగాని సదరు పత్రకారుడు సరసుడే కాదు, ప్రజలను విభజించి-పాలించటం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! రాష్ట్ర మెజారిటీ, ప్రజల ఆకాంక్షకు అనువునంగానే ఈ 'నోట్' డ్రాఫ్టింగ్ తయారైనట్టుంది! చివరికి ఏ కేంద్రపాలకపక్షం ఏ "3''వ రాజ్యాంగఅధికరణ ఆధారంగా, ఐక్యంగా ఉన్న తెలుగుజాతిని చీల్చాలని ఉవ్విళ్ళూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని "ఇ''క్లాజు కూడా "రాష్ట్రం పేరును మార్చుకోవచ్చు''నని అభ్యంతరం లేదనీ చెప్పింది! అంటే హోంశాఖవారి అద్భుతమైన 'డ్రాఫ్టింగ్' పర్యవసానంగా వెలువడిన ఆ "నోట్'' తెలంగాణాలోని పదిజిల్లాలతో పాటు మరిన్ని జిల్లాలు, ఎన్ని జిల్లాలు వస్తే అన్ని జిల్లాలు 'తెలంగాణా రాష్ట్రం'గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించినట్టయింది! ఆ లెక్కన రాష్ట్రంలోని మిగిలిన 13జిల్లాలు కూడా ఆ పదిజిల్లాలతో కలిసిపోతే - అదే హోంశాఖ "నోట్'' ఆశిస్తున్న మొత్తం రాష్ట్రం అంతా నిజంగానే అక్షరాలా "తెలంగాణా'' అవుతుంది గదా!! ఎందుకంటే, ఈ మాట వ్యంగ్యంగా అనటంకాదు, ఎగతాళి కోసం అంటున్న మాట అంతకంటే కాదు. నిజానికి "తెలంగాణం'' అంటే తెలుగులకు (తెలుగువారికి) అణెము, అంటే తెలుగువారు నివశించే చోటు అనీ, ప్రాంతం అనీ, నివాసమనీ వ్యవహారార్థమూ, విశిష్టార్థమూనని గుర్తించాలి! పండితులూ, నిఘంటుకారులూ స్థిరపరిచిన స్థిరనివాసమే తెలుగువారి తెలంగాణం! చరిత్ర తెలియని మన తెలుగు రాజకీయ సన్యాసులకన్నా, గిరీశం భాషలో మన 'వెధవాయిల'కన్నా కోస్తాంధ్ర, సీమాంధ్ర ప్రాంతాలతో పాటు సుమారు 300 ఏళ్ళపాటు దక్కన్ వరకూ ఏలికలుగా ఉన్న మహమ్మదీయ పాలకులు తెలుగు పాలకులకన్నా తెలివిగల వాళ్ళు కాబట్టి తాము పాలిస్తున్న నివసిస్తున్న ప్రాంతమంతా తెలుగువారిది కనుకనే మొత్తం తెలుగుప్రాంతాన్ని 'తెలంగాణం' [15-16 శతాబ్దాల దేశపటాల్లో "తెలంగాణం'' అని లిఖితపూర్వకంగా పేర్కొని] అని పేరుపెట్టుకున్నారని గుర్తించాలి!


 

అందువల్ల "తెలంగాణా రాష్ట్రం'' అంటే మొత్తం తెలుగు ప్రాంతమంతటికీ వర్తిస్తుంది కాబట్టే హోంశాఖ "నోట్'' తెలుగువారి అన్ని జిల్లాలూ వచ్చి చేరమని ("any other districrs that come forward")  ఆహ్వానం పలికి ఉంటుంది! మరో మాటలో చెప్పాలంటే మిగతా 13 సీమాంధ్రజిల్లాలు కూడా వెరసి మొత్తం 23 జిల్లాలతో కూడిందే తెలంగాణం/ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్ర రాష్ట్రం గదా! అందువల్ల ఇప్పుడున్నదంతా 'తెలంగాణం' అదే 'తెలుగునాడు! కాబట్టి రాజ్యాంగంలోని 3వ అధికరణం "ఇ''సెక్షను ప్రకారం "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రాన్ని కృత్రిమంగా విభజించకుండానే పేరును అర్థవంతంగా అమరగల "తెలంగాణా''గా లేదా "తెలుగునాడు''గా మార్చుకోవచ్చు! తద్వారా "విభజన'' అనే పురుగును, లేదా 'కలుపుమొక్క'ను లేదా 'బి.టి.'లాంటి వినాశకర విత్తనాన్ని [టెర్మినేటర్ సీడ్] మనస్సులనుంచి పెకించివేయవచ్చు! తొలుత దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి రాష్ట్రం ఏర్పడినప్పుడు, రెండురకాల పరాయి పీడనా పాలనలనుంచి తెలుగుజాతి ఒక్క గొడుగుకిందికి వచ్చినప్పుడు ఆకారాది క్రమం కోసం అటు ఇంగ్లీషు వర్ణమాలకు, ఇటు తెలుగువర్ణమాలకు తొలి అక్షరంతో 'A'/ 'ఆ'/"ఆంధ్రప్రదేశ్" (Andhra Pradesh) ఏర్పడడం శుభదాయకం అనుకున్నారు పెద్దలు. ఆ ఆశతోనే, పేరు తప్పు సమాసం అయినా "ఆంధ్రప్రదేశ్' పేరును ఎంచుకోవటం జరిగింది. కాని, ఆకారాదిక్రమంలో తొలి అక్షరంతో మనం 8వ షెడ్యూల్ లో అగ్రభాగంలో కనిపించినంతమాత్రాన అభివృద్ధికి చిహ్నం కాదు, అలా లేకపోయినంత మాత్రాన ఒక రాష్ట్రం పేరు కడుపంక్తిలో [ఉదా: తమిళనాడు - Tamilnadu ఉందికాబట్టి ప్రగతిపథంలో అది అట్టడుగున ఉందనీ చెప్పలేం!]



 

అందువల్ల, వ్యక్తులకుగానీ, రాష్ట్రంకుగాని వారికి (వాటికి) తగినట్టుగా అర్థవంతంగా ఉండాలేగాని 'పేరు' బలాల్ని బట్టి, 'నక్షత్రబలాల్ని' బతి విలువలూ, గౌరవప్రతిష్టలూ సమకూడవు! ఎందుకంటే అబద్ధాలతో, బూతులతో 'ఉద్యమాలు' నిర్మించేవారంతా చచ్చినా కొమరం భీములూ కాలేరు, దొడ్డి కొమరయ్యలూ కాజాలరు; వినాయక వేషధారులంతా ప్రజానాయకులు కారు; గాంధీ పేరుతొ చెలామణీ కాదలచుకునే వారంతా గాంధీలూ కారు, భగత్ సింగ్ పేరు తగిలించుకునే వారు విప్లవకారులూ కాలేరు; అల్లూరి సీతారామరాజును కొలిచేవారంతా ఆయని పేరు ఉచ్చరించడానికీ తాగారు; రుద్రమ పేరు పెట్టుకున్న వారంతా వీరనారీమణులూ కారు; చిత్తం చెప్పులమీద భక్తి శివుడిమీద నిలిపే వారంతా నిజమైన భక్తులూ కారు; యావదాంధ్ర శ్రమజీవుల ప్రతినిధిగా కష్టజీవులకు బతుకునిచ్చే బతుకమ్మ/అదే దుర్గమ్మ/అదే గౌరమ్మను కాస్తా హైజాక్ చేసి క్షుద్ర రాజేకీయాలకోసం వాడుకో జూసే సంపన్నుల బతుకులు బతుకులూ కావు; ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఆంద్ర (తెలుగు) జాతి చరిత్రకూ దాని వేల సంవత్సరాల సంస్కృతీ విభావానికీ ఐకమత్యానికీ దివిటీలుగా నిలిచినా శాతవాహన, కాకతీయ, విజయనగర ప్రజాహిత పాలనా యుగాలను విస్మరించిన తెలుగుజాతి విచ్చిన్నకులూ, అందుకు దోహదం చేసిన ఆధునిక విద్యోజులయిన రాకీయ దుర్యోధన, దుశ్శాసనలూ మూడు ప్రాంతాల ప్రజాబాహుళ్యం గుండెల్లో శాశ్వత శత్రువులుగా నమోదు కాకుండా తప్పించుకోలేరు; తెలుగువారి మహాయుగాల ఆనవాళ్ళను చేరిపివేయడానికి ప్రయత్నించిన ఆధునిక రాజకీయ 'సామంతులు'గా, చరిత్రహీనులుగా వీళ్ళు మిగిలిపోతారు!


 

ఎందుకంటే, "ప్రజాప్రతిదుల'' వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలకపక్షాలు,ముఖ్యంగా దీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలుతూ వచ్చిన చెడిపోయిన కాంగ్రెస్ తో కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్ళుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ కుత్సితమైన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి సహితం వేనుదీయలేదు. వాటిల్లో కొన్ని - రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్యూట మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి - రేపటి పాలకపక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలు! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేడ్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవికావు!  స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధవిరుద్ధమైన సవరణ చట్టాలు తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ అధికరణ ఒకటికాగా, ఆ సవరణ కేంద్రం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణక్కు భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ప్రజాహితంగా దేశంలోనే తొలిమెట్టుగా తెలుగుజాతినంతనూ ఒక్క గొడుగుకిందికి తెచ్చేందుకు సాధికార కమీషన్ సిఫారసులు ఆధారంగానే 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది; దానికి తగినట్టుగానే రాష్ట్రంలోని మూడుప్రాంతాల మధ్య కాలక్రమంలో ఉద్యోగ సద్యోగాలలో ప్రాంతాలమధ్య సమతుల్యమైన ఆర్థికాది రంగాలలో సాధ్యమైనంత త్వరగా అభ్యుదయాన్ని సాధించడం కోసం ఏ ఇతర రాష్ట్రానికీ లేని ఒక విశిష్టమైన ప్రత్యేకమైన (స్పెషల్) సవరణ చట్టాన్ని 371 (డి) పేరిట రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.


 

కాగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషాప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు "డి'' క్లాజుద్వారా రాజ్యాంగానికి సవరణ చట్టం తీసుకువచ్చి, దానికి భాష్యం చెప్పాలన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్తుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే యితర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలుగాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్రప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371 (డి) సవరణ చట్టానికి మూడింట రెండువంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దానిద్వారా కేంద్ర క్యాబినెట్టుకూ సాధ్యమవుతుంది గాని అడ్డదారుల్లో కాదు! పైగా, హోంశాఖ చూపిస్తున్న "నోట్''లో, నేడు ప్రజావ్యతిరేకులుగా మారి ప్రజలకోసం పదవుల్ని త్యాగం చేయలేని 'దేహభక్తి'కి తప్ప దేశభక్తికి దూరమైనా నాయకులకు తెలియని ఒకటి రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి యిచ్చిన "ఒకటవ వివరణ''లోనే ఉంది. ఇది రెండురకాల భాష్యానికి అవకాశమిస్తోంది.


 

ఎలా అంటే, 3వ అధికరణలో 'ఎ'నుంచి 'ఇ'వరకూ ఉన్న క్లాజుల్లో "రాష్ట్రం'' అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యు.టి.)ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! అయితే జనాన్ని పాలకపక్షాలు గందరగోళ పరచడం కోసం చేసిన ప్రయత్నం మినహాయింపు "క్లాజు'' పేరిట "రాష్ట్రం'' అనే పదంలో "కేంద్రపాలిత ప్రాంతం'' చేరి ఉండదని అదే "వివరణ (1)''లో విరుద్ధంగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్రప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ, ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని "కేంద్రపాలితప్రాంతం''గానో (యు.టి) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ట్ర "విభజన'' గురించి ఆలోచించాలిగాని అంతకుముందు కాదని ప్రతిఆదించడానికి కారణం - 3వ అధికరణంలోని ఈ అయోమయపు "వివరణ 1''! కాబట్టి - మొత్తం తెలుగుజాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోడానికిగాను, "ఆంద్ర'' అనే పదా(తెలుగు అనేది తెలియక)నికి అజ్ఞానంతో కొందరు 'ఎలర్జీ' పెంచుకుని తెలుగుజాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగా 3వ అధికరణలోని "ఇ''క్లాజు ప్రకారం గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగువాడికీ అభ్యంతరం ఉండదు, మనసారా ఆహ్వానించి తీరుతాడు! సెంటిమెంటును గౌరవించాలనుకునే వారంతా కోస్తా నుంచి దక్కను దాకా తెలుగువారి నివాసప్రాతంగా ''తెలంగాణా'' పేరు హేతుబద్ధమైన పేరు రాష్ట్రానికి చక్కగా అమరుతుంది, అర్థవంతంగా భాసిల్లుతుంది, అరమరికలులేని తెలుగుజాతికి ఆత్మవిశ్వాస సోర్యోదయంగా చిరంజీవిత్వం కల్గిస్తుంది!

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. కేటీఆర్ కు ముళ్ల కిరీటమేనా?

క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?

సీఎం లోకేష్.. ముహూర్తం ఫిక్సైందా?

లోకేష్ ని 2027 ఉగాది నాటిక‌ల్లా  ముఖ్య‌మంత్రిని చేసే దిశ‌గా  కొన్ని  పావులు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ క‌లిసిన‌పుడు జ‌రిగే  ప్ర‌ధాన  చ‌ర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది.  ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  నంబర్ 1, 2,  3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఈ హైరాక్కీని దాటి   త్వ‌ర‌లో  లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే   సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియ‌ర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు. 

ఓట్ చోరీ.. రాహుల్ ని గట్టెక్కించలేదెందుకు?

ఒక‌ప్పుడు ఇందిరాగాంధీ, ఆ తరువాత  రాజీవ్ గాంధీ.. భార‌త రాజ‌కీయాల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. వారికి చట్టసభల్లో సంఖ్యాబలానికి ఒక పరిమితి అంటూ ఉండేది కాదు.  ఇప్పుడైతే వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చినా, మూడో సారి బీజేపీకి స్వయంగా వచ్చిన స్థానాలు   240 కాగా.. ఎన్డీయే  భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో ఎలాగోలా  గ‌ట్టెక్కి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌లిగింది. అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అయితే అప్ప‌ట్లో  లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం  400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి  చేయ‌లేదు. ఎవ‌రి  క‌ష్టం  వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేస్తున్న ఆర్భాటాన్నీ, హంగామానూ బిల్డప్ ప్రక్రియగా కొట్టి పారేశారు.  ఏదో ఒక నేరేటివ్ బిల్డ‌ప్ చేయ‌డంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని  తెర‌పైకి తెచ్చారంటున్నారు. రాహుల్ అందిపుచ్చుకున్న ఓట్ చోరీ..  వ్యూహ‌క‌ర్త‌లిచ్చిన స‌ల‌హా  లేదా సూచ‌న  కావ‌చ్చు. అదీ కాదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే స్వయంగా ఈ నినాదాన్ని ఎత్తుకుని ఉండవచ్చు. అయితే ఓటు చోరీ నినాదం ప్రజల్లోకి లోతుగా వెళ్లినట్లనిపించినా.. అది కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఓట్ చోరీ స్లోగ‌న్ తో బీహార్ ఎన్నిక‌ల‌కు వెళ్తే అది బూమ‌రాంగ్ అయ్యింది. రాహుల్ లాంటి ప్ర‌చార‌క్ ఉన్నంత వ‌ర‌కూ బీజేపీ  అధికారంలోకి వ‌స్తూనే ఉంటుంద‌న్న టాక్  అధికార కూటమిలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.  రాహుల్ విషయంలో చెప్పుకోవలసిందంటూ ఏదైనా ఉంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర.  ఆ యాత్ర ద్వారా.. రాహుల్  ఇటు కాంగ్రెస్ ని అటు ఇండి కూట‌మిని  ఈ మాత్ర‌మైనా  నిలబెట్టగలిగారు.   అలాగ‌ని రాజ‌కీయ ప‌రంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలాంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల  కాంగ్రెస్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు.  కార్య‌క‌ర్త‌లను ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంచాలి.  అందులో భాగంగానే రాహుల్ గాంధీ.. ఈ నినాదం భుజానికి  ఎత్తుకున్నారు. త‌ర‌చూ త‌న వాద‌న‌ల రూపంలో  ఏదో ఒక అంశాన్ని, సమస్యను తెరమీదకు తీసుకువస్తుంటారు. తినగతినగ వేమ తియ్యగుండు అన్నట్లుగా.. నిరంతరం జనంలోకి ఏదో ఒక అంశాన్ని తీసుకువెడుతుంటే.. ఏదో ఒక లీడ్ దొరికి అధికారం ‘చేతి’కి రాకుండా ఉంటుందా అన్నది ఆయన ఆలోచనో, వ్యూహమో అయి ఉంటుందంటున్నారు పరిశీలకులు.   ఇవాళ్రేపు రాజ‌కీయంగా ఒక నెగిటివిటీని నూరిపోస్తే త‌ప్ప రాణించ‌లేని గ‌డ్డు కాలం న‌డుస్తోంది. అందుకే రాహుల్ ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాల‌ను పార‌దోలాల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంద‌నీ,  వారి ప్ర‌భావం నుంచి దేశాన్ని కాపాడాలని అంటున్నారు కానీ అది ఎలా సాధ్యం అన్న విషయంలో మాత్రం రాహుల్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ క్లారిటీ కానరావడం లేదంటారు పరిశీలకులు. ఓట్ చోరీ నినాదం విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉండటం యాధృచ్ఛికమేనా?  

జ‌గ‌న్ ‘పీపీపీ’.. డుం డుం డుం!

మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానాల‌ పై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎంత ఉందో తెలియ చేస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల  నుంచి మెడికల్ కాలేజీల ప్రభుత్వ, ప్రైవేటు   భాగస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా కోటీ  4 ల‌క్ష‌ల   ఈ సంత‌కాల సేక‌ర‌ణ చేసి గ‌వ‌ర్న‌ర్ కి స‌మ‌ర్పించారు జగన్.  ఈ సందర్భంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. జగన్ స్వయంగా 40 మంది బృందంతో కాలినడకన వెళ్లి మరీ ఆ సంతకాల పత్రాలను గవర్నర్ కు అందజేశారు. అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇంత‌కీ జ‌గ‌న్ అండ్ కో  పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ఏమిటంటే..   పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీ అభివృద్దికి ముందుకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాపేక్షతోనే వస్తారు. కోట్లు కొల్లగొడతారు. దీని వల్ల పేదలకు వైద్య విద్య మ‌రింత ఖ‌రీద‌వుతుంది. ఇది వారి పాలిట ఆశ‌నిపాతంగా మారుతుంది. ఇదీ జగన్ అండ్ కో అంటే జగన్, వైసీపీయులు చేస్తున్న వాదన. ఇక కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించే సందర్భంగా  జగన్ హాట్ కామెంట్లు కూడా చేశారు. అందులో యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావించారు. యోగాంధ్ర కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం పేదల మెడికల్ విద్య కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.  ఇక్కడే ఆయన ఆర్థిక అజ్ణానం బయటపడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేయడం లేదు.. ప్రైవేటు వ్యక్తులను ఆ వ్యయంలో భాగస్వాములను చేస్తున్నది. అదే పంధాలో సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నది. జగన్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి బటన్ నొక్కుడు అంటూ ఖజానా మొత్తం సంక్షేమం అంటే ధారపోసి జగన్ బావుకున్నదేంటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అంటే జగన్ కు ఘోర పరాజయం, రాష్ట్రానికి తలకు మించిన అప్పులు మాత్రమే.  ప్రభుత్వానికి తలకు మించిన భారం కాకుండా  ప్రైవేటు వ్య‌క్తుల‌ను కూడా ఇన్వాల్వ్ చేయ‌డం మంచిదే కదా అంటున్నారు ఆర్థిక నిపుణులు. జ‌గ‌న్  హయాంలో ఆయన రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇంకా అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం అంటూ చేసిన పందేరం.. ఓట్ల వేటే తప్ప మరేదీ కాదంటున్నారు.  ఇటీవల వలంటీర్ల విషయంలో తనకు జ్ణానోదయం అయ్యిందని ఇటీవల జగన్ ప్రకటించారు. మరి అప్పులు చేసి రష్ట్ర ప్రగతిని శూన్యం చేసి అమలు చేసిన సంక్షేమం దారి తప్పిందన్న విషయంలో ఆయనకు ఇంకా జ్ణానోదయం కలిగినట్లు లేదంటున్నారు విశ్లేషకులు.   ప్ర‌తిదీ ప్ర‌భుత్వం నుంచే ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల అది  పెట్టుబ‌డి అనిపించుకోదు.   ప్ర‌భుత్వ‌మే  అన్నీ ఉచితంగా చేయ‌డం వ‌ల్ల ఎన్ని నిధులూ సరిపోవు. అప్పులే శరణ్యం అవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నది చంద్రబాబు సర్కార్.  ఈ విషయం అర్ధం చేసుకోకుండా,  జగన్ ఇలాగే వ్యవహరిస్తే..  2029 కాదు.. 2034నాటికి కూడా  వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులే కాదు... వైసీపీయులు కూడా  అంటున్నారు.  ఎవరో అనడం ఎందుకు జగన్ తాను స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా అవే చెబుతున్నాయి కదా!  మరి జగన్  ఈ తీరు వైసీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే. 

ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టిన పంచయతీ ఫలితాలు.. సీఎం రేవంత్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు.  పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు.  ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు.  అంటే  2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు.  2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయగలరా?!

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ భారతం ఆకలితో అలమటించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం ఈ పథకంలో ఉన్న లోపాలను సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది. పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి వైదొలగుతోందని దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు.  జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు సరే.. భారత కరెన్సీ నోట్ల మీద నుంచి గాంధీ బోమ్మను తొలగించగలరా?  అని చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందనీ, దేశ సమగ్రత, సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని డికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. జగన్ పై చంద్రబాబు విజయం!?

తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే అధికంగా కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రెండో స్ధానంలో బీఆర్ఎస్ నిలిచింది. బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై   తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది. అదేంటంటే మూడో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇదేంటి ఎన్నికలు జరిగింది తెలంగాణలో  ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై గెలవడమేంటి? అన్న ఆసక్తి కలిగించేలా సోషల్ మీడియాలో వార్త  హల్ చల్ చేసింది. ఇంతకీ విషయమేంటంటే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ సంర్పంచ్ పదవికి పోటీ పడిన వారిలో ఒకరి పేరు భేక్య చంద్రబాబు కాగా, మరో వ్యక్తి పేరు బానోత్ జగన్నాథమ్. ఈ పేర్లే ఈ ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి.  ఈ ఎన్నికలో   భూక్య చంద్రబాబు  బానోత్ జగన్నాథమ్  బానోత్ జగన్నాథమ్ పై విజయం సాధించారు.  దీనిపైనే నెటిజనులు తెలంగాణలో కూడా జగన్ ను చంద్రబాబు ఓడించారు అంటూ సెటైరిక్ గా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  

సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనే అంటున్నారు. నల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో చంద్రబాబు  ప్రధాని మోడీ,  జలవనరులశాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ తో వేర్వేరుగా భేటీ కానున్నారు.నల్లమల సాగర్‌కు అనుమతులతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ పర్యటనలో కేంద్రాన్ని సిఎం కోరనున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా   ఉపాధి హామీ  పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.  ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే  ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ భగ్గు.. బీజేపీ కార్యాలయాల ముట్టడి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18)  దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  తెలంగాణలో కూడా  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే  అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్  నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.    బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.