తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు సమైక్యాంధ్ర ఉద్యామాలు ఉద్యమాలే, వ్యాపారాలు వ్యాపారాలే అన్నట్లుంది మన రాజకీయవ్యాపారవేత్తల తీరు.
గత రెండు నెలలుగా ఏపీ ఎన్జీవోల సమ్మెతో, ఆ తరువాత మొదలయిన విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మూలానపడగా, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లాభాలు ఆర్జించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ సంస్థల ఉద్యోగులు కూడా సమ్మెకు దిగడంతో ఇతర రాష్ట్రాలలో సైతం విద్యుత్ కొరత ఏర్పడింది.
ఒకవైపు సీమాంద్రా జిల్లాలు విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొని విలవిలాడుతుంటే, సమైక్యవాద చాంపియన్స్ లో ప్రదముడిగా పేరొందిన లగడపాటి రాజగోపాల్ కు చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ల్యాంకో పవర్ మరి కొన్ని సంస్థలు, ఇదే అదునుగా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకొని మంచి లాభాలు ఒడిసి పట్టాయి. ల్యాంకో పవర్, రిలయన్స్ ఎనర్జీ, స్పెక్ట్రం పవర్, విజ్జేశ్వరం గ్యాస్ మరియు జీవీకే జేగురుపాడు గ్యాస్ ప్లాంట్ సంస్థలు ఈ రెండు నెలల సమ్మె కాలంలో దాదాపు రూ.50నుండి 120 కోట్లు వరకు లాభాలు ఆర్జించాయి.
వీటిలో అందరి కంటే ఎక్కువగా లగడపాటికి చెందిన ల్యాంకో పవర్ సంస్థ-3 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసి లాభాలలో ప్రధమ స్థానం ఆక్రమించగా, స్పెక్ట్రం పవర్-2, విజ్జేశ్వరం గ్యాస్-2, జీవీకే జేగురుపాడు గ్యాస్ ప్లాంట్-2, మరియు రిలయన్స్ ఎనర్జీ-1 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకొని లాభాలను కళ్ళజూసాయి.