లగడపాటిపై జగన్ హాట్ కామెంట్

      విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ పై వైకాపా అద్యక్షుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్ గురించి తాను మాట్లాడటం మొదలు పెడితే 'పెంట మీద రాయి వేసినట్లే' అని అన్నారు. సమైక్యానికి వైయస్సార్ కాంగ్రెసుతో పాటు మజ్లిస్, సిపిఎంలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయన్నారు. రేపు తమ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని చెప్పారు. జైల్లో ఉన్నా నిజాయితీగా రాజకీయం చేశా ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో అందరికీ తెలుసునని జగన్ అభిప్రాయపడ్డారు. తాను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ నిజాయితీగా రాజకీయం చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నిలబెట్టిన చంద్రబాబు కుమ్మక్కయ్యారా లేక మేమా అన్నది మీరే గుండె మీద చెయి పెట్టి ఆలోచించుకోవాలని జగన్ అన్నారు.

26న సమైక్య శంఖారావ౦

      ఈ నెల 26న హైదరాబాదులో సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి ఇచ్చారని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సమైక్యమంటే... తెలంగాణ..కోస్తాంధ్ర.. రాయలసీమ' అని చెప్పారు. తనకు మూడు ప్రాంతాలు సమానమేనని..ఆ మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా మైక్య శంఖారావ౦ ఉంటుందని తెలిపారు.   సమైక్యాంధ్ర కోసం తనతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారని చెప్పారు. కోర్టు అడ్డంకుల వల్ల తనకు ఢిల్లీ వెళ్లే అవకాశం లేకుంటే తమ పార్టీ ఎంపీల ద్వారా తన రాజీనామా లేఖను పంపిస్తానని, రాజీనామా ఆమోదించాలని తాను స్పీకర్ మీరా కుమార్‌ను విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.  

సీఎం కిరణ్ తో ఏపీ ఎన్జీవో నేతలు భేటి

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏపీ ఎన్జీవో ఉద్యోగ నేతలు సమావేశంమయ్యారు. చర్చల అనంతరం ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించేది, లేనిది మీడియా సమావేశంలో ప్రకటక చేయనున్నారు. గురువారం ఉదయం ఏపీఎన్జీవో భవన్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతలు సమావేశయ్యారు. ఈ సందర్భంగా సీఎంతో మాట్లాడాల్సిన అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.   ఆర్టికల్ 371 డిని ఏ విధంగా పరిష్కరిస్తారో సీఎం నుంచి హామీ తీసుకుంటామని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చే హామీలపై నిర్ణయం తీసుకునేందుకు 15 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు అశోక్‌బాబు తెలిపారు. ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయంఅందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సీమాంధ్ర జిల్లాలలో సోనియా సమాధులు

      సోనియాగాంధీకి సమాధులు కడితే మా మీద కేసులు పెట్టాలని చిరంజీవి అంటున్నారు. ఇక ముందు ఆయనకు సమాధులు కట్టే రోజు ముందుంది. తెలంగాణ రాష్ట్ర విభజనతో సీమాంధ్ర విద్యార్థుల జీవితాలకు సమాధులు కడితే నోరు మెదపలేని వారు సోనియాగాంధీ చిత్రపటానికి సమాధి కడితే గగ్గోలు పెడుతున్నారు” అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో సోనియా చిత్రపటాలకు సమాధులు కడతామని, ఏం చేస్తారో చేయండని సవాల్ విసిరారు.     టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిర్యాని కోసం ఆరాట పడుతున్నాడని, సీమాంధ్రులది రాగి ముద్దల కోసం సాగుతున్న పోరాటం అని అన్నారు. కేంద్రమంత్రులు, కాంగ్రెసు నేతలు విభజన జరుగుతుంటే, సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు ? వీరంతా సీమాంధ్ర ప్రయోజనాలకు సమాధి కట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ? సమాధులు కట్టినందుకు మా మీద కేసులు పెడతారా ? అప్పుడు సీమాంధ్ర సమాజం మా త్యాగాన్ని గుర్తిస్తుంది అని పయ్యావుల అన్నారు.  

పురంధేశ్వరి సీఎం కలలు

      రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర కు ముఖ్యమంత్రి కావాలని పురంధేశ్వరి కలలు కంటున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. విభజనపై దగ్గుబాటి దంపతులు శకుని పాత్ర పోషిస్తున్నారన్నారు. సీఎం పదవి కోసం పురంధేశ్వరి కొత్త స్వరం వినిపిస్తున్నారని, దగ్గుబాటి దంపతుల మాటలు నమ్మేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరని ఉమా అన్నారు. ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తెచ్చి సమ్మె విరమింపజేయాలని సీఎం కిరణ్ కుట్ర పన్నారని, సోనియా డైరెక్షన్‌లోనే సీఎం పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాల విషయంలో ఎంపీ లగడపాటి డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. ప్రధానికిచ్చిన బ్లూప్రింట్‌ను పురంధేశ్వరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలని, రాష్ట్రాన్ని నాశనం చేశారని ఉమా వ్యాఖ్యానించారు.

సమైక్యంపై ప్రజలను మోసం చేయను

      రాష్ట్ర విభజన వ్యవహారం కీలకదశకు చేరుకున్న పరిస్థితులలో ప్రజలను మభ్యపెట్టలేనని, ఎవరయినా సీడబ్లూసీ తీర్మానానికి లోబడే వ్యవహరించాలని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అన్నారు. విభజన ఆగదని తెలిసి కూడా సీమాంధ్ర ప్రజలకు రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది అని చెప్పి మోసం చేయలేను చెప్పారు. ఈ రోజు ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భేటి తరువాత మాట్లాడుతూ.. ఈ నెల 18, 19 తేదీల్లో విభజన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందాన్ని కలుస్తామని, సీమాంధ్ర ప్రయోజనాల గురించి పట్టుబడతామని కృపారాణి తెలిపారు. పైలిన్ తుపాను బాధితుల గురించి, ఇతర నష్టాల గురించి సోనియాగాంధీకి వివరించానని, తుపాను బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరానని తెలిపారు.

ఆర్టికల్.3 లోని నిజా నిజాలు

      రాష్ట్ర విభజన అంటూ జరిగితే - 7వ షెడ్యూలులో 1వ రాష్ట్రంగా ఉన్న 'ఆంధ్రప్రదేశ్', ఆర్టికల్ 3(e) ప్రకారం 'తెలంగాణా రాష్ట్రం' గా పేరు మార్చుకొంటుంది. 29వ రాష్ట్రమొకటి కొత్తగా ఏర్పడుతుంది. అయితే, దానికి పేరు లేదు; రాజధాని లేదు; రాజ్యాంగ అస్తిత్వం లేదు! ఉన్నదల్లా రాజకీయ నాయకుల చేతుల్లో మోసగించబడిన దిక్కు తోచని ప్రజలు, గత 56 సంవత్సరాలుగా అనేక రకాలుగా వెనుకబడిన కొంత భూభాగము మాత్రమే! ఇట్లాంటి ఒక రాష్ట్రం తమకు ఏర్పాటు చెయ్యమని ఆ ప్రాంత ప్రజలు ఎన్నడూ కోరలేదు. అందుచేత దానికి ఏమి పేరు పెట్టాలనే ఆలోచనే లేదు! రాజధాని ఎక్కడ ఉండాలనే తీర్మానమే లేదు!   ఆ ప్రాంత ప్రజల కోరిక లేకుండా, అందుకు సంబంధించిన విజ్ఞాపన లేకుండా, వాళ్లకి ఇష్టం లేకుండా - కనీసం వాళ్ళతో చర్చించకుండా, కొత్త రాష్ట్రం మాకొద్దు, మమ్మల్ని విడదీయ వద్దు అని మొత్తుకుంటున్నా, కొనసాగుతున్న హైదరాబాద్ స్టేట్ ఉరఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బలవంతంగా తన్ని తరిమేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడన్నా ఇంత నికృష్టంగా, ఇంత నిరంకుశంగా, ఒక రాష్ట్రం ఏర్పరిచిన సందర్భాలు ప్రజాస్వామ్య ప్రపంచంలో ఉన్నాయా? నిపుణులే తేల్చి చెప్పాలి!

రాష్ట్రపతి పాలనతో తెలంగాణ సాధ్యం

      రాష్ట్రపతి పాలన పెడితే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వాని స్పష్టం చేశారు. "ఒక ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. కానీ, ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. లేదంటే తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న వారి ప్రకటనను అమలు చేయడం సాధ్యం కాదు'' అని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రాంతంలో ఎందరో చనిపోయారు. ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు . మా హయాంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయగలిగాం అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో బీజేపీ మద్దతుపై తెలంగాణవాదుల నుంచే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో అద్వాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషంగా ఉంది.

సమైక్య శంఖారావ౦ వాయిదా!

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావ సభను వాయిదా వేసే ఆలోచనలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 19న హైదరాబాద్ సమైక్య శంఖారావ సభ నిర్వహించేందుకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు మంజూరు చేసింది. అయితే సమయం తక్కువగా ఉన్నందున అదికారులను ఈ విషయమై సంప్రదించి అదేరోజు నిర్వహించడమా? లేక మరోరోజు కు వాయిదా వేయడంపై వైకాపా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.   సభ ఏర్పాటుకు కాస్త సమయం పడుతుందని, గడువు తక్కువ ఉండటంతో సభను మరో తేదీలో నిర్వహిస్తామని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి చెప్పారు. సంబంధిత అధికారుల అనుమతితో తాము తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలోనే సభను నిర్వహిస్తామన్నారు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే

  తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు సమైక్యాంధ్ర ఉద్యామాలు ఉద్యమాలే, వ్యాపారాలు వ్యాపారాలే అన్నట్లుంది మన రాజకీయవ్యాపారవేత్తల తీరు.   గత రెండు నెలలుగా ఏపీ ఎన్జీవోల సమ్మెతో, ఆ తరువాత మొదలయిన విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మూలానపడగా, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లాభాలు ఆర్జించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ సంస్థల ఉద్యోగులు కూడా సమ్మెకు దిగడంతో ఇతర రాష్ట్రాలలో సైతం విద్యుత్ కొరత ఏర్పడింది.   ఒకవైపు సీమాంద్రా జిల్లాలు విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొని విలవిలాడుతుంటే, సమైక్యవాద చాంపియన్స్ లో ప్రదముడిగా పేరొందిన లగడపాటి రాజగోపాల్ కు చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ల్యాంకో పవర్ మరి కొన్ని సంస్థలు, ఇదే అదునుగా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకొని మంచి లాభాలు ఒడిసి పట్టాయి. ల్యాంకో పవర్, రిలయన్స్ ఎనర్జీ, స్పెక్ట్రం పవర్, విజ్జేశ్వరం గ్యాస్ మరియు జీవీకే జేగురుపాడు గ్యాస్ ప్లాంట్ సంస్థలు ఈ రెండు నెలల సమ్మె కాలంలో దాదాపు రూ.50నుండి 120 కోట్లు వరకు లాభాలు ఆర్జించాయి.   వీటిలో అందరి కంటే ఎక్కువగా లగడపాటికి చెందిన ల్యాంకో పవర్ సంస్థ-3 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసి లాభాలలో ప్రధమ స్థానం ఆక్రమించగా, స్పెక్ట్రం పవర్-2, విజ్జేశ్వరం గ్యాస్-2, జీవీకే జేగురుపాడు గ్యాస్ ప్లాంట్-2, మరియు రిలయన్స్ ఎనర్జీ-1 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకొని లాభాలను కళ్ళజూసాయి.

పరేఖ్ వ్యాఖ్యలపై దిగ్విజయ్‌ ఆగ్రహం

      బొగ్గు కుంభకోణంపై పీసీ పరేఖ్ బహిరంగ ప్రకటనలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేఖ్ ఏదైనా చెప్పాలనుకుంటే పరేఖ్ సీబీఐకి చెప్పాలని సూచించారు. పరేఖ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. హిండాల్కోకు బొగ్గు గని కేటాయింపు సక్రమమే అని, హిండాల్కో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి కంపెనీ అని దిగ్విజయ్ తెలిపారు. మరోవైపు నిజాయితీపరుడుగా పేరొందిన పి.సి.ఫరేఖ్ పేరును సిబిఐ బొగ్గు కుంభకోణం కేసులో చేర్చడం చర్చనీయాంశం అవుతోంది.బొగ్గు శాఖలో పారదర్శక తేవడానికి కృషి చేసిన తనపై కేసు పెట్టడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నిజంగానే సిబిఐ ఇలాంటి వ్యక్తులపై కేసులు పెట్టడం ద్వారా కొంత అప్రతిష్టపాలయ్యే అవకాశం ఉంది.

కొంపముంచిన అత్యుత్సాహం

  కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనేకానేక గొప్ప సిద్ధాంతాలలో సోనియా, రాహుల్ గాంధీల భజన కార్యక్రమం కూడా ప్రముఖమయినది. కేంద్రమంత్రి నుండి కార్పొరేటర్ వరకు అందరూ తమ పదవులు సురక్షితంగా కాపాడుకోవాలంటే, గొప్పగా పనిచేయకపోయినా ఈ భజన కార్యక్రమం సర్వకాల సర్వావస్తలందూ కూడా నిష్టగా చేస్తూ ఉండాలి. అదే వారి పదవులకి శ్రీరామ రక్ష.అయితే ఒక్కోసారి వారు అత్యుత్సాహంతో చేసే ఈ భజన వల్లనే అమ్మ ఆగ్రహానికి గురవుతుంటారు. అందుకు ఉదాహరణగా ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ లో ఒక ప్రధాన కూడలిలో కొందరు ‘వీరభక్తులు’ పెట్టిన బ్యానర్ వ్యవవహారం గురించి చెప్పుకోక తప్పదు.   అలహాబాద్ లోని ఫూల్ పూర్ పార్లమెంటు నియోజక వర్గానికి గెలుపు గుర్రం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కసరత్తు చేస్తోంది. అయితే ఇక్కడ నుండి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా వాద్ర పోటీ చేస్తే బాగుటుందని పార్టీలో అభిప్రాయం ఉంది. కానీ రీటా బహుగుణ వంటి వేరే పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే, భజన సంస్కృతి నరనరాన్న జీర్ణించుకొన్న కొందరు కాంగ్రెస్ నేతలకు మాత్రం ఈ వ్యవహారమంతా నచ్చలేదు. నేరుగా ప్రియాంకా గాంధీకి ఆ సీటు అప్పగించకుండా ఇంకెవరి పేర్లో పరిశీలించడం ఏమిటని బాధపడుతూ, తమ ఆవేదనని ఒక బ్యానర్ రూపంలో బయటపడితే పార్టీ తమ కోరికను మన్నిస్తుందనే ఆలోచన రాగానే, అలహాబాద్ లో ఒక ప్రధాన కూడాలిలో ఒక పెద్ద బ్యానర్ ఏర్పాటు చేసారు.   అందులో సోనియా, ప్రియాంకా గాంధీల ఫోటోలు వేసి క్రింద ఈ విధంగా వ్రాసారు. “అమ్మ ఇప్పుడు తరచు జబ్బు పడుతోంది. తమ్ముడు పని ఒత్తిడితో సతమవుతున్నాడు. అందువల్ల ప్రియాంక గాంధీ పూల్ పూర్ నుండి పోటీకి నిలబడి పార్టీని మళ్ళీ మూడో సారి అధికారంలోకి తీసుకు రావాలి.”   ప్రియాంకా గాంధీ పోటీ చేయాలనో, లేకపోతే పోటీ చేస్తే బాగుంటుందనో వ్రాస్తే సరిపోయే దానికి ప్రాస కోసం సోనియాగాంధీ తరచు జబ్బు పడుతోందని వ్రాసి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు పాపం ఆ వీర భక్తులు. సోనియాగాంధీ గురించి ఆవిధంగా వ్రాసినందుకు సదరు నేతలందరికీ పార్టీ సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది కూడా.

తెలంగాణ కాంగ్రెస్ కే పెద్ద మచ్చ

      కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే చాలా మచ్చలు పడ్డాయని, కానీ, సోనియా అధ్యక్షురాలైన తర్వాత ఎలాంటి మచ్చలూ పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అంటున్నారు. తెలంగాణ విషయంలో మాత్రం న్యాయ పరీక్షకు, ధర్మ పరీక్షకు నిలబడని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.   ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం ధర్మంగా చేశారని ఎవరూ భావించరని తెలిపారు. ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్ విజయవంతంగా బయటపడుతుందని తాను భావిస్తున్నానని, ఒకవేళ బయటపడకపోతే కాంగ్రెస్‌పై ఈ మచ్చ అలా ఉండిపోతుందని చెప్పారు. సోనియాగాందీ నాయకత్వంలో కాంగ్రెస్ పై అసలు మచ్చే పడలేదని చెప్పడమే విచిత్రంగా ఉంటుంది. బొగ్గు కుంభకోణం కాని, కామన్ వెల్త్ కుంభకోణం కాని ఇవేవి కాంగ్రెస్ పైన, సోనియాగాంధీపైన పడిన మచ్చలు కాదని ఉండవల్లి ఎలా చెబుతారో తెలియదు.  

ముస్లింల అభద్రతా భావమే ఓట్లు రాలుస్తోందా

  రాజకీయ నాయకులకి ప్రజలు, అందునా మైనార్టీ, పేద, మధ్య తరగతి మరియు వెనుకబడిన తరగతుల ప్రజలు మనుషుల కంటే ఎక్కువ వోట్లుగానే కనబడతారు. అందుకే ప్రజలని కులాల వారిగా, మతాలు వారిగా విభజించేసి, ఒక్కో వర్గానికి ఒక్కో రకం వరం (ఆయుధం) వాడుతూ ఓట్లు పిండు కొంటుంటారు. ఆ సంగతి సదరు వర్గాలకి తెలియకనే వారికి ఓట్లు వేస్తున్నారనుకోనవసరం లేదు. ఎవరి అవసరాలు వారివి ఎవరి బలహీనతలు వారివి. ఇదొక చక్రంలా అలా సాగిపోతూనే ఉంటుంది.   ఇక మన దేశంలో అందరి కంటే రాజకీయ నేతలు బాగా వాడేసుకొంటున్న వారు ముస్లిం ప్రజలు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా అన్ని’సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు’ కూడా వారిలో ఎప్పటికప్పుడు అభద్రతా భావం నిలిచి ఉండేలా చూసుకొంటూ, వారి భయం నుండే ఓట్లను పిండుకొంటున్నాయి తప్ప అత్యంత దైన్యామయిన స్థితిలో జీవితాలు గడుపుతున్నలక్షలాది ముస్లిం ప్రజల కోసం పెద్దగా చేసిందేమీ లేదు.   వారిలో ఎవరయినా ఒక మెట్టు పైకి ఎక్కాలంటే, వారు సమాజంలో మిగిలిన వారికంటే మరికొంత అధిక శ్రమచేస్తే తప్ప సాధ్యం కాదు. నేడు వారిలో ఏ మాత్రమయినా అభివృద్ధి కనబడుతోందంటే అది వారి స్వయం కృషితో సాధించినదే తప్ప వారికి ఏ సెక్యులర్ రాజకీయ పార్టీలు, ఏ సెక్యులర్ ప్రభుత్వాలు గానీ చేసిందేమీ లేదు.   ప్రముఖ ముస్లిం నేత మౌలానా మెహమూద్ మధాని మీడియాతో మాట్లాడుతూ “తమను తాము గొప్ప సెక్యులర్ పార్టీలుగా అభివర్ణించుకొనే కొన్ని రాజకీయ పార్టీలకు మా ముస్లిం ప్రజల మనవి ఏమిటంటే “మీకు మా ఓట్లు కావలసి వస్తే, అందుకు వేరేవరినో బూచిగా మాకు చూపించి మాలో అభద్రతా భావం కలిగించనవసరం లేదు. సెక్యులర్ పార్టీలుగా చెప్పుకొని మా ఓట్లు కోరే మీరు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇంత వరకు మాకోసం ఏమి చేసారో చెప్పండి. ఏమి చేయబోతున్నారో చెప్పండి. అంతే తప్ప మాలో భయాందోళనలు పెంచి, మీరే మాకు రక్షణ కలిగించగలమనే భావనతో మా ఓట్లు కోరే ప్రయత్నించకండి,” అని అన్నారు.   అయితే కాంగ్రెస్ పార్టీ తన సహజ సిద్దమయిన శైలిలోనే స్పందించింది. “మేము ఎవరినో బూచిగా చూపించి ఎవరినీ భయపెట్టాలనుకోవడం లేదు. అక్కడ ఇప్పటికే బూచి ఒకటుందని మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాము.”

కిరణ్‌కు డిగ్గీ పిలుపు

  కేంద్రంలో తెలంగాణ వేడి పెరుగుతున్న నేపథ్యంలో సియం కిరణ్‌కుమార్‌ రెడ్డి కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ అంశంపై గత కొంత కాలంగా ప్రరోక్షంగా మాటల యుద్దం చేస్తున్న కిరణ్‌ కుమార్‌, దిగ్విజయ్‌ సింగ్‌లు రేపు ముఖాముఖి కలవనున్నారు.   తెలంగాణ ఏర్పాటు సంభందించిన బిల్లు అసెంబ్లీకి రాదని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని కేంద్ర హొం మంత్రి సుశీల్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి దిగ్విజయ్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి స్పష్టత కోరారు.   ఈ నేపధ్యంలో రేపు ముఖ్యమంత్రిని ఢిల్లీ రావాల్సిందిగా దిగ్విజయ్‌ కోరారు. మొదటి నుంచి అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందని, ఆ తర్వాత ముసాయిదా బిల్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెబుతూ వచ్చారు. అందుకు విరుద్ధంగా సుశీల్ కుమార్ షిండే ప్రకటన చేయడంతో రాష్ట్రంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. దీంతో సియం డిల్లీ పర్యటనపై ఆసక్తి  నెలకొంది.

బిర్లాలకు అంటిన బొగ్గుమసి

  సాక్ష్యాత్తు దేశ ప్రదానమంత్రినే దోషిగా నిలబెట్టిన బొగ్గు కుభంకోణం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టిస్తూనే ఉంది.. ఇప్పటికే ఈ కేసులో పలు చార్జీషీట్లను దాఖలు చేసిన సిబిఐ తాజాగా మరో చార్జీషీట్‌ను దాఖలు చేసింది. మంగళ వారం దాఖలు చేసిన చార్జీషీట్లో బొగ్గు శాఖ కార్యదర్శి పిసి పరేఖ్‌, బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార్‌ మంగళం బిర్లా పేర్లను చార్జీషీట్లో చేర్చారు.   ఇప్పటికే ఈ కేసుకు సంభందించి హైదరాబాద్‌తో పాటు కొలకత్తా, ముంబైలలో కూడా సిబిఐ తనిఖీలు చేస్తుంది. ఇప్పటికే చాలా మంది పెద్దలతో ముడి పడి ఉన్న బొగ్గు కుంభకోణంలో ఇప్పుడు తాజాగా బిర్లాల పేరు కూడా వినిపిస్తుండటంతో కేసు పై అంతర్జాతీయంగా చర్చ తీవ్రమయింది.

పురంధరేశ్వరి...మాట

    ....సాయి లక్ష్మీ మద్దాల     ఆంధ్ర రాష్ట్ర విభజన విషయమై కేంద్రం వెనక్కి వెళ్ళడం సాధ్యపడదని, విభజన ఆగదని కేంద్ర మంత్రి పురంధరేశ్వరి వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇప్పుడు సీమాంధ్ర ప్రాంత ప్రజలు సమైఖ్య ఉద్యమాన్ని నిలుపుదల చేసి తమ ప్రాంతానికి జరగవలసిన సమన్యాయం కోసం పోరాటం చేయాలని తమకు కేంద్రం నుంచి ఏది కావాలో కోరుకోవటం మంచిదని సీమాంధ్రులకు సలహా ఇస్తున్నారు. లేదూ ఇలాగే సమైఖ్య రాష్ట్రం అనే నినాదం తో ఉద్యమాన్ని, ఆందోళనను కొనసాగిస్తే కేంద్రం నుంచి సీమాంధ్ర ప్రాంతానికి అందవలసిన న్యాయం అందదని, సీమాంధ్రులను హెచ్చరిస్తున్నారు. తాము ప్రభుత్వం లో ఉండి చాలా పోరాటం చేసామని, అయినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. కాని ఆమె ఒక విషయాన్ని గమనించాలి. ఆమె ప్రభుత్వం లో ఉండి పోరాటం చేసాము అనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే ప్రజలు ఉద్యమం చేసున్నారు అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆమె ఈ ప్రకటన చేయడం ద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసి ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తుందని సీమాంధ్రులు భావించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ప్రకటన చేయటం ద్వారా ఆమె రాజకీయ విరోధి ఐన చంద్రబాబు ను దెబ్బతీయటానికి కాంగ్రెస్ అధిష్ఠానం పన్నిన కుట్రలో ఆమెకూ భాగస్వామ్యం ఉందని పలువు భావిస్తున్నారు. కాంగ్రెస్ బద్ధవిరొధిగా రాజకీయజీవితం గడిపిన రామారావు గారి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టిన్చగలిగారు అంటేనే కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఆమెకు ఎంత పలుకుబడి ఉందో ప్రజలకు అర్థమౌతుంది. 9 సం. రాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె తెలుగుజాతికి చేసిన మేలు ఏమీ కనిపించదు కానీ చెడు మాత్రం చేయవద్దని ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించటం కోసం ప్రజలను బలి చేయటం పురంధరేశ్వరి వంటి ఔన్నత్యులకు ఎంత మాత్రం సమంజసం కాదని, ఇక ఆమెను తెలుగు ప్రజలు MPగా ఎన్నుకున్నది సోనియా గాంధీని చూసి కాదు, రాజశేఖర రెడ్డిని మరియు ఆమె తండ్రిగారైన రామారావు గారిని చూసి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.     సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలందరూ తమను ఎన్నుకున్న ప్రజల కన్నా కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమనే ఉద్దేశ్యం లోనే ఉన్నట్లైతే ప్రజలు వారిని ఓడించిన రోజు సోనియా గాంధీ వద్ద వారికి ఉండబోయే పలుకుబడి ఏమిటి? అనే విషయాన్ని తమని తాము వారు ఒకసారి విశ్లేషించుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.