అవసరమైతే రాష్ట్రపతి పాలన: చాకో

      రాష్ట్రంలో నెలకొన్న అనిస్చితుల దృష్ట్యా అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో అన్నారు. దీనితో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి హెచ్చరికలు జారీ చేసినట్లు అర్ధమవుతోంది. గత కొద్ది రోజులుగా ముఖ్య మంత్రి సీమాన్ద్రలో జరుగుతున్న సమ్మె నేపధ్యంలో ఉద్యోగుల జె.ఎ.సి ల తో జరుపుతున్న చర్చలు విఫలం అవుతున్న నేపధ్యంలో చాకో ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చునని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరో పక్క కిరణ్ కుమార్ రెడ్డి తాను ముఖ్య మంత్రి గా ఉన్నంత వరకు ఈ రాష్ట్రం సమైఖ్యం గానే ఉంటుందనే వెల్లడించటం మరింత గందరగోళానికి,సందిగ్ధతలకు దారితీస్తోంది. అయితే చాకో చేస్తున్న వ్యాఖ్యానం నేపధ్యంలో కేబినెట్ నోట్ అసెంబ్లీ తీర్మానం కోసం అసెంబ్లీ కి వస్తుందా,రాదా అనే అనుమానాలు కూడా నెలకొంటున్నాయి.

వినాశకాలే విపరీతి బుద్ది

  వినాశకాలే విపరీత బుద్ది అని పెద్దలు అన్నారు. బహుశః కాంగ్రెస్ పార్టీకి ఇది ఇప్పుడు అక్షరాల వర్తిస్తుందేమో. ఎంతో జాగ్రత్తగా, శాస్త్రీయంగా చేయవలసిన సంక్లిష్టమయిన రాష్ట్ర విభజనను కేవలం రాజకీయ కోణం లోంచి మాత్రమే చూస్తూ పరిష్కరించబోయి కాంగ్రెస్ పార్టీ తన చేతులు కాల్చుకొంటోంది. పనిలోపనిగా రాష్ట్ర ప్రజల చేతులు, కాళ్ళే కాదు అనేక నిండు ప్రాణాలు కూడా బలిగొంటోంది.   ఇక నేడో రేపో ఏపీ యన్జీవోలు తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమ్మెను విరమించక మానరనే దైర్యంతో రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏడుగురు మంత్రులతో కూడిన ఒక కమిటీని కాంగ్రెస్ అధిష్టానం, ప్రకటించేసింది. కానీ ఇప్పుడు ఉద్యోగులు సమ్మెను విరమించక పోగా వారికి విద్యుత్ ఉద్యోగులు తాజాగా ఎక్సైజ్ ఉద్యోగులు కూడా తోడవడంతో రాష్ట్రంలో పరిస్థితులు నానాటికి విషమించడం మొదలయ్యాయి.   విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే సీమంధ్ర జిల్లాలో పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోగా, విద్యుత్ సంక్షోభం కారణంగా అనేక రైళ్ళు రద్దవుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ సంక్షోభం కేవలం సీమాంధ్ర ప్రాంతంలోనే గాక క్రమంగా తెలంగాణా జిల్లాలకి, దక్షిణాది రాష్ట్రాలకి కూడా విస్తరిస్తోంది. దీనితో ఆందోళన చెందుతున్న టీ-నేతలు మరియు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులు వెంటనే నష్ట నివారణా చర్యలు చెప్పట్టాలని కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.   సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ యన్జీవోల చర్చలు విఫలం అయిన తరువాత వారు తమ సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్టానంలో కలవరం మొదలయింది.   ఒకవైపు డిల్లీలో చంద్రబాబు వల్ల రాజకీయంగా నష్టబోయే ప్రమాదం, మరో వైపు యావత్ దక్షిణాది రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉండటంతో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేప్పటింది. అయితే ఉద్యోగులతో నేరుగా చర్చలకు దిగితే అది తెలంగాణా నేతలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది గనుక, ఏ.ఐ.సీ.సీ. ప్రతినిధి పీసీ చాకో ఒకవైపు కాంగ్రెస్ సహజ సిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగించి దారికి తేవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచిస్తూనే, తెలంగాణా రాష్ట్రం ఎన్నికల ముందు ఏర్పడుతుందో లేకపోతే ఆ తరువాత ఏర్పడుతుందో చెప్పలేమని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ఏడుగురు మంత్రులతో కూడిన కమిటీకి పెట్టిన ఆరు వారాల గడువుని తొలగించామని, ఆ కమిటీ ఈ అంశంపై అనేక మందితో విస్తృత చర్చలు జరుపవలసి ఉన్నందునే నిర్దిష్ట గడువు పెట్టలేదని చెప్పుకొచ్చారు.   తద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన నాన్పుడు ధోరణి అవలంభించేందుకు సిద్దమవుతున్నట్లుంది. దీనితో తెలంగాణాలో పెద్ద ఎత్తున నిరసనలు, రాజకీయ నేతల ఖండనలు మొదలవగానే మళ్ళీ ఏ దిగ్విజయ్ సింగో, షిండేయో మీడియా ముందుకు వచ్చి తెలంగాణా పై వెనకడుగు వేసే ప్రసక్తేలేదని పునరుద్ఘాటిస్తారేమో!   ఇంతవరకు కేవలం సీమాంధ్ర ప్రాంతంలోనే కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుందని భావిస్తున్నప్పటికీ, నిన్న ఆపార్టీ ప్రతినిధి పీసీ చాకో చేసిన ప్రకటనతో తెలంగాణాలో కూడా తుడిచిపెట్టుకు పోయేలా ఉంది.

చంద్రబాబు దీక్షతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందా?

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని కోరుతూ గత మూడు రోజులుగా డిల్లీలో ఏపీ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంతవరకు సీమంద్రాలో జరుగుతున్న ఉద్యమాలను పెద్దగా పట్టించుకోని జాతీయ పార్టీల నాయకులు మరియు జాతీయ మీడియా ఇప్పుడు చంద్రబాబు దీక్షతో రాష్ట్ర విభజన సమస్యపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఎటువంటి దుస్థితి తెచ్చిందో ఆయన వివరిస్తూ, దానివెనుక ఉన్న కాంగ్రెస్ ఎత్తుగడలను వివరిస్తుంటే, త్వరలో డిల్లీతో సహా ఐదురాష్ట్రాలలో ఎన్నికలను ఎదుర్కోనున్న కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు మరిన్ని రోజులు డిల్లీలో ఉంటే ముందుగా అది డిల్లీ ఎన్నికలలో తమ విజయావకాశాలపై ప్రభావం చూపువచ్చునని ఆందోళన చెందుతున్నారు.   ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో డిల్లీ ఎన్నికలలో తమ పార్టీ గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా చేతున్న ప్రచారానికి ఇప్పుడు చంద్రబాబు చెపుతున్న విషయాలు కూడా తోడయితే అది అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుశః నిన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో చేసిన “తెలంగాణపై నాన్పుడు ప్రకటన”కు ఇది కూడా ఒక కారణం కావచ్చును.

వై.కా.పా స్నేహం ఎవరితో?

      రానున్న 2014 ఎన్నికల సందర్భం లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఐన వై.కా.పా ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనేది ఒక చర్చగా మారింది. జైలు నుండి బెయిల్ మీద విడుదల అనంతరం కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యారనే ప్రచారం జోరుగా సాగింది. కాని ఢిల్లీ లో నిన్న రాష్ట్రపతిని కలిసిన విజయమ్మ సి.పి. ఎం జాతీయ నాయకుడు సీతారం ఎచూరిని కలవటం ద్వారా సి.పి. ఎం తో కూడా పొత్తుకు సిద్దపడుతున్న సంకేతాలు అందుతున్నాయి. అయితే మరోపక్క జైలు నుండి వచ్చిన అనంతరం ఒకసందర్భంలో నరేంద్ర మోడీ మంచి పరిపాలన దక్షుడని,కాకపోతే ఆయన మతతత్వ వాదం నుండి బయట పడితే బాగుంటుందని మరొక సంకేతాన్ని అంటే బి.జె.పి తో కూడా పొత్తు పెట్టుకోవచ్చు ననే భావాన్ని కూడా ప్రజలకు కలుగ చేశారు. ఈ మొత్తం సంకేతాల నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి కేంద్రం లో ఎవరు అధికారంలో కి వస్తే వారికి తన స్నేహ హస్తాన్ని అందిస్తారా?అది యు.పి. ఎ ప్రభుత్వమైనా లేక థర్డ్ ఫ్రంట్ ఐన సరే,అన్ని ద్వారాలు తెరచి స్నేహ హస్తం అన్ని పార్టీలకు అందించటానికి ఎదురుచూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

జగన్ దీక్ష భగ్నం

      తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఆయన నివాసం లోటస్‌పాండ్‌ వద్ద గత శనివారం నుంచి జగన్‌ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం విషమించటంతో వైద్యుల సలహా మేరకు బుధవారం రాత్రి పోలీసులు రంగప్రవేశం చేసి జగన్‌ను ఆసుపత్రికి తరలించారు. రక్తపోటు, సుగర్‌ లెవల్స్‌ గణనీయంగా తగ్గడంతో దీక్ష ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు. శరీరంలో కీటోన్లు 4 ప్లస్‌గా వృద్ధిచెందినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స నిర్వహించక పోతే శరీర అవయవాలు దెబ్బతినటంతో పాటు అపస్మారక స్థితిలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఆయనను బలవంతంగా నిమ్స్ కు తరలించారు.

బాబు దీక్షలో 'రాయపాటి '

      రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొంటున్న రాజకీయ సమీకరణాలు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇందుకు సాక్ష్యం గ రాయపాటి నేడు ఢిల్లీ లో బాబు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలియ చేయటం. దీని మూలంగా రాయపాటి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరవచ్చు ననే సంకేతాలు ప్రజలకు అందుతున్నాయి. విభజన నేపధ్యంలో కాంగ్రెస్ లో ఎం.పి గా కొనసాగుతున్న తన పదవికి విభజన ప్రకటన అనంతరం రాజీనామా చేసిన విషయం విదితమే. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ నుండి బలమైన నాయకుడిగా ఉన్న లాల్ జాన్ పాషా ను కోల్పోయిన ఆ పార్టీకి ఇది చాలా కలిసివచ్చే అంశం. రాయపాటి టి.డి.పి లో చేరితే సీమాంధ్ర లో ఆ పార్టీ బలపడటం ఖాయం.

ఒక్క కాంగ్రెస్ వంద నాలుకలు

  దిగ్విజయ్ సింగ్: రానున్న ఎన్నికల ముందుగానే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి కృషి చేస్తాము.   పీసీ చాకో: ఎన్నికల ముందుగా తెలంగాణా వస్తుందో లేకపోతే తరువాత వస్తుందో చెప్పలేము.   దిగ్విజయ్ సింగ్: రాష్ట్రంలో అన్ని పార్టీలను సంప్రదించి,వాటి అభిప్రాయలు తీసుకొన్న తరువాతనే రాష్ట్ర విభజన చేయాలనీ నిశ్చయించుకొన్నాము. ఇక ఈ నిర్ణయంపై ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.   పీసీ చాకో: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పరచిన మంత్రి వర్గ బృందానికి (జీ.ఓ.యం.) తొలుత పెట్టిన ఆరువారాల గడువు ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించాము. ఎందుకంటే రాష్ట్ర విభజన ప్రక్రియలో ఆ బృందం అనేక మంది  వ్యక్తులతో, పార్టీలతో విస్తృతంగా చర్చలు జరుపవలసి ఉంది. అందువల్ల మంత్రి వర్గ బృందం తనకు అప్పజెప్పిన పనులను పూర్తి చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఏమి విడించలేదు.   దిగ్విజయ్ సింగ్: ప్రాంతీయ పార్టీలు ఎన్ని ‘యు’ టర్నులయినా తీసుకోగలవు. కానీ జాతీయ పార్టీ అయిన మా కాంగ్రెస్ పార్టీ ఆవిధంగా చేయదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ మాది. పీసీ   చాకో:!!!   కిరణ్: ప్రజాభీష్టాన్ని మన్నించకుండా ప్రభుత్వాలు ముందుకు వెళితే  అటువంటి ప్రభుత్వాలకి ప్రజలు శలవు ప్రకటిస్తారు.   బొత్స: కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం అందరికీ శిరోదార్యం. క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా అధిష్టానం నిర్ణయాన్ని అమలుచేయడం మా అందరి బాధ్యత.   వీ.హెచ్: మా సోనియమ్మ ఒకసారి మాటిస్తే మరిక దానికి తిరుగు ఉండదు. అధిష్టానం నిర్ణయాన్ని హృదయపూర్వకంగా శిరసావహిస్తాము.   బొత్స: అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేము కానీ ప్రజల మాటను కూడా వినాలి కదా? నేను అసలు సిసలయిన సమైక్యవాదిని. నాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజలే ముఖ్యం.   లగడపాటి: మా కాంగ్రెస్ పార్టీయే మమ్మల్ని, ప్రజల్ని కూడా మోసం చేసింది. ఎవరికోసమో మా అందరి జీవితాలతో ఆడుకొంటోంది.   బొత్స: మా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి క్లిష్టమయిన సమస్యనయినా దైర్యంగా ఎదుర్కొని పరిష్కరించే సత్తా గలది. సమస్యలు వచ్చినప్పుడు పార్టీని వదిలిపోవడం మా నైజం కాదు.   ఉండవల్లి: ప్రజాభీష్టాన్నిమ, మా అభిప్రాయాలకు విలువనీయని కాంగ్రెస్ పార్టీలో ఉండటం కంటే బయటకి పోవడమే మంచిదని పార్టీకి, నా యంపీ పదవికీ రాజీనామా చేసాను.   బొత్స: వెనుకబడిన వర్గానికి చెందిన నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది. మా పార్టీలోనే కొందరు పెద్దలు అంతా తాము చూసుకొంటామని నమ్మబలుకుతూ  రాష్ట్ర విభజన విషయంలో నన్ను పక్క దారి పట్టించారు.

ఫలించని ఎ.పి ఎన్జీవోల చర్చలు

  ఈ రోజు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రెండు గంటలకు పైగా చర్చలు జరిపిన ఎ.పి ఎన్జీవోల చర్చలు ఫలించలేదు. చర్చల అనంతరం ఏ.పి.ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ, “ఢిల్లీ పెద్దలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, రాష్ట్ర విభజనపై స్పష్ట మైన హామీ వస్తేనే సమ్మె పై తగు నిర్ణయం తీసుకుంటామని” అశోక్ బాబు తెలియచేసారు. తుఫాను వచ్చే ప్రమాదమున్నందున ఉద్యోగులు సహకరించాలని కోరుతున్నందున సమ్మెలో కొనసాగుతూనే సహాయక చర్యలు అందింస్తామని ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు అశోక్ బాబు తెలిపారు. తాను సి.ఎం. గా ఉన్నంత వరకు రాష్ట్రం సమైఖ్యంగా ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని, అయితే కేవలం సి.ఎం. హామీకి స్పందించి ఏ నిర్ణయమూ తీసుకోలేమని, తమకు కేంద్రం స్పష్టమయిన హామీ ఇచ్చినప్పుడే సమ్మె విరమించే ఆలోచన చేస్తామని అశోక్ బాబు మీడియాకు తెలిపారు.

జగన్ నా కొడుకు వంటి వాడు: దిగ్విజయ్

  మూడు నెలల క్రితం దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి తనకు ఆప్తమిత్రుడని, జగన్మోహన్ రెడ్డి డీయన్ఏ కాంగ్రెస్ పార్టీ డీయన్ఏ ఒకటేనని అని చెప్పడంతో, నేడు కాకపోతే రేపయినా వైకాపా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయమని ఆయన పరోక్షంగా ప్రకటించినట్లే అయ్యింది.   మళ్ళీ ఇప్పుడు తాజాగా జగన్ చేస్తున్నఆమరణ నిరాహార దీక్ష గురించి మాట్లాడుతూ అతను, చంద్రబాబు ఇద్దరు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే నిరాహార దీక్షలు చేస్తున్నారని భావిస్తున్నాను. నా ఆప్త మిత్రుడి కొడుకయిన జగన్మోహన్ రెడ్డి నాకు కూడా కొడుకు వంటివాడేనని నేను భావిస్తాను,” అని అన్నారు.   కాంగ్రెస్ పార్టీతో వైకాపా రహస్య అవగాహనకు వచ్చినందునే జగన్మోహన్ రెడ్డికి బెయిలు దొరికిందని, ఎన్నికల తరువాత వైకాపా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడం ఖాయమని తెదేపా గుప్పిస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పుకోలేక సతమతమవుతున్న వైకాపాకు, ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ‘జగన్ నా కొడుకు వంటివాడని’ జాతీయ మీడియా ముందు, అది కూడా డిల్లీలో చంద్రబాబు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో చెప్పడంతో వైకాపాకు మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది.   అందుకే ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దిగ్విజయ్ వ్యాఖ్యలపై వెంటనే స్పందిస్తూ “జగన్ తన కొడుకు వంటి వాడయితే, మరి ఆయన గత 16 నెలలుగా జైలులో మగ్గుతున్నపుడు దిగ్విజయ్ సింగ్ ఎందుకు ఊరుకొన్నారు? ఆయన చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డిని ఒకే గాటకట్టి మాట్లాడటం మేము ఖండిస్తున్నాము,” అని అన్నారు.   రానున్న ఎన్నికల తరువాత జేడీ(యూ) వంటి సెక్యులర్ పార్టీలు కేంద్రంలో ఏర్పడే సెక్యులర్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లే తాము కూడా మద్దతు ఇస్తామని ఇటీవలే జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా అతను బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని పొగిడినప్పటికీ, ఆయన బీజేపీని సెక్యులర్ పార్టీగా తీర్చిదిద్దితేనే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందన్నట్లు మాట్లాడారు.   బీజేపీ పూర్తి స్థాయి సెక్యులర్ పార్టీగా మారే అవకాశం లేదు గనుక, ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోనడిచే యుపీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థితిలో ఉంటే వైకాపా మద్దతు ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఎంతయినా రెండు పార్టీల డీయన్ఏ ఒకటేనని మరో మారు దిగ్విజయ్ సింగ్, జగన్ ఇద్దరూ తమ మాటలతో ఖరారు చేసారు గనుక దిగ్విజయ్ సింగ్ మాటలకి అంబటి రాంబాబు మరీ అంతగా నొచ్చుకోవలసినదేమీ లేదు.  

నాకు వ్యతిరేకంగా కుట్ర ...... బొత్స

  తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ పి. సి. సి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత,నోట్ ఆమోదం అనంతరం తాను ముఖ్య మంత్రి కాబోతున్నట్లు వార్తలు ప్రచారం జరగటం ఆకుట్ర లోని భాగమేనన్నారు. విజయనగరం లో జరిగిన అల్లర్లను సాకుగా చూపించి తన మీద మరింతగా బురద చల్లే ప్రయత్నం జరుగుతోంది అన్నారు. రాష్ట్రాన్ని సమైఖ్యం గ ఉంచేందుకు తాను కూడా చాల ప్రయత్నం చేసానని,కాని మొత్తం నేపమంత తనమీదే వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించటం జరిగింది. అందరు రాజీనామాలు చేయటం ద్వారా రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తే తప్ప ఈ విభజన ప్రక్రియ ఆగదని తాను తెలియ చేసానని,అయితే తన మాట పెడ చెవిన పెట్టి ,నేడు తన మీదే అభియోగం మోపేందుకు కుట్ర పన్ని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు.

ఢిల్లీ ఏ.పి భవన్ లో ఉద్రిక్తత

  ఆంద్ర రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయమని కోరుతూ ఢిల్లీ లోని ఏ.పి భవన్ లో చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యం లో ఏ.పి భవన్ లో దీక్షకు అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు అక్కడి నుండి వైదొలగాలంటూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతు తెలుపుతూ వందలాదిగా రాష్ట్రం నుండి కార్యకర్తలు ఢిల్లీ కి తరలి వెళ్తున్నారు. ఈ నేపధ్యం లో తెలుదేసం పార్టీ ఎంపి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ.పి భవన్ ఉన్నది ఎవరికోసమని,దేశ రాజధానిలో న్యాయం కోసం దీక్ష చేపట్టిన ఒక ప్రముఖ నేతకు ఇంతటి పరాభావమా అని,ఇది తెలుగువారి పట్ల కాంగ్రెస్ అధిష్టానం యొక్క నిర్లక్ష్య వైఖరి,తెలుగువారికి జరుగుతున్న అవమానం అని నామా వాపోయారు.

మళ్లీ ఆంటోని కమిటీ నే ...

  కేంద్రం ప్రభుత్వ కమిటీగా మళ్ళి ఏ.కె ఆంటోని కమిటీ నే నియమిత మయింది. ఈ కమిటిలో ఇంతకు ముందు పదిమంది ఉన్న సభ్యుల సంఖ్య ఏడుకు కుదించ బడింది. ఇందులో కేంద్ర మంత్రి పల్లంరాజు సభ్యుడుగా ఉండబోవటం లేదు. బహుశా రాజీనామా చేసిన కారణం గా ఐయి ఉండవచ్చు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, వీరప్పమొయిలి, గులామ్‌ నభి ఆజాద్,చిదంబరం, జైరాం రమేష్, నారాయణ స్వామి సభ్యులుగా ఉండనున్నారు. మళ్ళి రాష్ట్ర సమస్య గురించి మాట్లాడానికి రాష్ట్రం నుండి ఒక్కరు కూడా కమిటి సభ్యునిగా లేకపోవటం కాదు శోచనీయం. సమైఖ్య వాదం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో పల్లం రాజు తానుగా కమిటిలో సభ్యత్వం వహించాకపోవటం సీమంద్ర ప్రజల సెంటిమెంట్ ను గౌరవించటం లేదనే సంకేతాలు ప్రజలలోకి వెళ్ళవచ్చు.