ysr congress

ప్రభుత్వ వైఖరితో ఖంగు తిన్న వైకాపా నేతలు

  వైకాపా నేతలు నిరవదిక నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇప్పటికి 5వ రోజు. కానీ, ఇంతవరకు పోలీసులు వారి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించలేదు. నిన్నసాయంత్రం పోలీసులు రావడంతో ఇక మరో గంటో గడియలోనో తమ దీక్షను భగ్నంచేసి ఆసుపత్రికి తరలిస్తారని అందరూ ఊహించారు. కానీ వచ్చిన పోలీసులు, దీక్షా శిబిరం దగ్గర కుర్చీలలో కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ప్రభుత్వ ఆదేశాల కోసం ఇంతవరకు కూడా ఎదురు చూస్తున్నారు.   ఈ లోగా శిభిరంలో నిరాహార దీక్ష చేస్తున్న చాలా మందికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో ఆరోగ్యాలు క్రమంగా క్షీణించడం మొదలు పెట్టాయి. నిన్న సాయంత్రం శాసన సభ్యురాలు వనిత షుగర్ లెవెల్ 40 కంటే తక్కువ స్థాయికి పడిపోవడంతో ఆమెను అక్కడున్న వైద్యులు అంబులెన్స్ లో నీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థిని దృష్టిలో ఉంచుకొని వైకాపా నేతలు సైతం ఆమెను తరలించడానికి అంగీకరించక తప్పలేదు.   ప్రస్తుతం మళ్ళీ శాసన సభ్యులు శోభానాగి రెడ్డి, సుజయ్ రంగ రావుల షుగర్ లెవెల్స్ పడిపోగా, జోగి రమేష్, సుచరిత, గురునాథ రెడ్డిల బీపీ లెవెల్స్ క్రమంగా పడిపోతున్నాయని సమాచారం. అదే విధంగా పార్టీ గౌరవధ్యక్షురాలు విజయమ్మ ఆరోగ్యం కూడా నిన్న రాత్రి నుండి క్షీణించ సాగింది. అయినప్పటికీ, ప్రభుత్వం మాత్రం పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇంత వరకు జారీ చేయలేదని సమాచారం. వారి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించడం కంటే, వారంతట వారే తమని ఆసుపత్రికి తరలించామని అడిగినప్పుడే తరలించాలని ప్రభుత్వ ఆలోచన కావచ్చును.   ఊహించని ఈ పరిణామానికి వైకాపా నేతలు కంగుతిన్నారు. అందరు చేసినట్లే తాము ఓ మూడు నాలుగు రోజులు దీక్షలు చేసి పోలీసుల చేత భగ్నం చేయించుకొని వీర త్రాళ్ళు వేసుకొని బయట పడదామని అనుకొంటే కిరణ్ కుమార్ ప్రభుత్వం చల్లగా కూర్చొని చూస్తుండటంతో వైకాపా నేతలకు ఇప్పుడ ఏమి చేయాలో పాలు పోవడం లేదు. దీక్ష మద్యలో లేచిపోతే నవ్వులపాలవుతారు గనుక దీక్ష కొనసాగించక తప్పట్లేదు. బహుశః ప్రభుత్వమే వారి ఆరోగ్య పరిస్థితి చూసి జాలిపడి దీక్ష భగ్నం చేయమని ఆదేశించవచ్చును, లేదా ఒకరొకరిగా అందరినీ ఆసుపత్రికి తరలించవచ్చును. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వం తమ డిమాండ్ల గురించి హామీ ఈయకపోయినా పరువలేదు కానీ, దయతలచి ముందు తమ దీక్షను భగ్నం చేసి తమ పరువు, ప్రాణాలు కాపాడితే అదే పదివేలని కోరుకొంటున్నట్లుంది.

 KVP Ramachandra Rao ED inquiry

జగన్ అవినీతికి సూత్రధారి కేవీపీ

        కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బినామీలు, అడ్రసులేని కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. జగన్, గాలి, రఘురామరాజు సంస్థలో ఒకే కంపెనీ ఎలా పెట్టుబడులు పెడుతుందని ప్రశ్నించారు. కేవీపీ పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసులో కేవీపీ పాత్ర ఉందని ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నరేంద్ర విమర్శించారు. కేవీపీ బినామి రఘురామరాజు అని, జేడీ కాల్‌డేటా లిస్టులో ఆయనే ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకే విదేశాలకు వెళ్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రఘురామరాజును వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని వైఎస్ విజయలక్ష్మి కలిసిన తర్వాత జగన్ కేసులో అరెస్ట్ తగ్గాయని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.

jr.ntr

జూ.ఎన్టీఆర్ కు బాలయ్య వార్నింగ్, ఫ్లెక్సీలపై స్పందించాలి

  వైకాపా మొదలుపెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ యుద్దంలోకి ఇప్పుడు బాలకృష్ణ కూడా ప్రవేశించారు. వైకాపా యన్టీఆర్ ఫోటోలు వాడుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ పార్టీ నేతల ఫోటోలు బ్యానర్లలో పెట్టుకొంటే ఓట్లు రాలవనే ఆలోచనతోనే వారు యన్టీఆర్ ఫోటోలు వాడుకొంటున్నట్లున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలోజూ.ఎన్టీఆర్ వెంటనే స్పందించవలసి ఉందని, లేకుంటే దాని పరిణామాలు వేరేలా ఉంటాయని అన్నారు. నిత్యం సినిమా షూటింగు హడావుడిలో ఉండే జూ.ఎన్టీఆర్ కి ఒకవేళ ఇక్కడ జరుగుతున్న సంగతులు తెలియకపోవడం వలన ఆయన స్పందించకపోయి ఉంటే, తానూ ఆయనతో మాట్లాడుతానని, ఈ విషయాలు అన్నీ తెలిసి కూడా స్పందించకపోయి ఉంటే ఆయన తను ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలనీ అన్నారు.   కొడాలి నాని తెదేపా నుండి వెళ్ళిపోయిన తరువాత పార్టీలో అందరూ చాల సంతోషించారని, ఆయన వెళ్ళిపోవడం వలన పార్టీకి వచ్చిన నష్టం ఏమిలేదని అన్నారు. తానూ జూ.ఎన్టీఆర్ కు సహకరించవద్దని ఎన్నడూ ఎవరికీ ఆదేశాలు జారీ చేయలేదని, అవన్నీ ఊహాగానాలేనని ఆయన అన్నారు. ఇక పార్టీ నాయకత్వం విషయంలో కూడా భిన్నాభిప్రాయాలకు తావు లేదని, వచ్చే ఎన్నికల తరువాత కూడా చంద్రబాబు నాయుడి సారద్యంలోనే అందరూ పనిచేస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్న జయప్రద తమ పార్టీలో చేరాలనే ఆలోచన కనుక ఉంటే తనను సంప్రదిస్తే విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. త్వరలోనే తానూ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశిస్తానని తెలిపారు. రెండు రోజుల కృష్ణా జిల్లా పర్యటన కోసం తిరువూరు నియోజకవర్గంలోని కొమరోలు వచ్చిన బాలకృష్ణ ఈ రోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించారు.   ఇప్పటికయినా బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ఖండించడం బాగానే ఉన్నపటికీ, ఆయన జూ.ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విధంగా కొంచెం కరుకుగా మాట్లాడటం చూస్తే, జూ.ఎన్టీఆర్ కి ఈ విషయాలు తెలిసినా ఖండించట్లేదని ఆయన కూడా అభిప్రాయపడుతున్నట్లు ఉంది. ఆయన ఆవిధంగా భావించడంలో తప్పులేదు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఏమూల ఏమి జరిగిన క్షణాలలో ఆ సమాచారం అందరికీ తెలుస్తున్నపుడుజూ.ఎన్టీఆర్ కి వైకాపా ఆడుతున్న ఆట గురించి తెలియదని భావించలేము. అందుకే బాలకృష్ణ కొంచెం తీవ్ర స్వరంతోనే మాట్లాడవలసి వచ్చింది. ఇక, జూ.ఎన్టీఆర్ వైకాపా పై విరుచుకుపడతారో లేకపోతే వేరేమయినా సమాధానం చెప్పబోతున్నారో త్వరలోనే తేలిపోవచ్చును.   ఇక, వైకాపా తన ఫ్లెక్సీ బ్యానర్ బాణాలను సరిగ్గా గురిచూసి కొట్టినట్లే కనిపిస్తోంది. ఒక దెబ్బకి రెండు పిట్టలు కొట్టినట్లు. తెదేపాలో ఆశించిన విదంగా చిచ్చుపెట్టడమే కాకుండా, పార్టీలో జూ.ఎన్టీఆర్ ఒంటరి అయిపోయాడనే భావన ఆయన అభిమానులలో బాగా వ్యాపింపజేయగలిగింది.ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న విడుదల అయిన బాద్షా సినిమా విజయవంతం అయినందుకు జూ.ఎన్టీఆర్ అభిమానులతో సమానంగా వైకాపా కూడా సంబరాలు చేసుకొంది. తద్వారా జూ.ఎన్టీఆర్ కి తెదేపా మద్దతు ఈయకపోతే తాము మద్దతుగా ఉంటామని స్పష్టంగా సందేశం పంపగలిగింది. గమ్మతయిన విషయం ఏమిటంటే, తెదేపాలో ఉన్న జూ.ఎన్టీఆర్ అభిమానుల హడావుడి ఎక్కడా కనబడలేదు.

 chandrababu tdp

బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది

        "మా హయాంలో వైర్లు పట్టుకుంటే షాక్ కొట్టేవి... ఇపుడు బిల్లులు చూస్తేనే షాక్ కొడుతోంది'' అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. గొర్రెల కాపరుల సంఘాలకు ఐదు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. చెంచల్‌గూడ జైలునే పార్టీ కార్యాలయంగా పెట్టుకుంటే బాగుంటుందని వైసీపీకి సలహా ఇచ్చారు.   టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే..జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తున్నదని చంద్రబాబు ధ్వజమెత్తారు. "ఉప ప్రణాళిక తెచ్చామని గొప్పగా ప్రకటించుకొని.. ఆ మరునాడే ఆ నిధులను బ్యాలెట్ బాక్సుల గోదాములకు తరలించారు. నాడేమో ఆ నిధులతో వైఎస్ ఇడుపులపాయకు రోడ్డేయించుకున్నారు.. కాదేమో ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను చెప్పమనండి? ఈ విషయంలో వారితో చర్చకు నేను సిద్ధమే'' అని సవాల్ విసిరారు.  

 balakrishna tdp

ఓట్ల కోసమే ఎన్టీఆర్ ఫోటో

        ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరి౦చడంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని ప్రముఖ సినీ నటుడు, నందమూరి బాలకృష్ణ విమర్శించారు. రెండు రోజుల కృష్ణా జిల్లా పర్యటనలో బాగంగా కొమరవోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువు కాలంలో రైతులకు టిడిపి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని అన్నారు.   టిడిపి హయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఓట్లు రాలుతాయనే వైకాపా ప్లేక్సిల్లో ఎన్టీఆర్ బొమ్మను పెడుతున్నారని..అది సరైనది కాదని అన్నారు. ప్లేక్సిల్లో బొమ్మ పెట్టడం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని చెప్పారు. ఎన్టీఆర్ పర్యటనకు కార్యకర్తలు రాకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. 

 Justice Markandey Katju telangana issue

స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణ: కట్జూ

        తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమ నేతలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. తెలంగాణ డిమాండ్ న్యాయమైనది కాదని, కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నరన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని జస్టిస్ కట్జూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాయన్నారు. మరి జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై టి.నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Charge Sheet To be filed today on jagan illegal properties

నేడు జగన్ అక్రమాస్తులపై మరో చార్జ్ షీట్ ...

  వై.ఎస్. జగన్ కంపెనీల్లో పట్టుబడులు పెట్టిన పెన్నా కంపెనీపై సిబీఐ అభియోగాలు మోపిన సంగతి విధితమే. తాజాగా పెన్నా సిమెంట్స్ కు చెందిన సున్నపురాయి మైనింగ్ లీజు దరఖాస్తులు వైఎస్.ఆర్. ప్రభుత్వంలో ఆగమేఘాలపై కదిలాయి. ప్రభుత్వం చెబితేనే అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసుతో సంబంధం వున్న జీవోలకు బాధ్యులుగా గుర్తించి మంత్రులు సబిత, పొన్నాల, గీతారెడ్డిలను సహనిన్డులుగా చేరుస్తారా, లేక సాక్ష్యులుగా చూపిస్తారా అనేది తాజా చార్జిషీట్ లో తేలనుంది. 2008 మార్చి 12న అనంతపురం జిల్లా తలారిచెరువు గ్రామంలో సున్నపురాయి నిక్షేపాలున్న 264 ఎకరాల కేటాయింపు, కర్నూలు జిల్లాలో 807 ఎకరాల సున్నపురాయి ప్రాస్పెక్తింగ్ లైసెన్స్, రంగారెడ్డి జిల్లాలో 548 ఎకరాల మైనింగ్ లీజు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెన్నా సిమెంట్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి పొందిన మేళ్ళుకు బదులుగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబీఐ ఆధారాలు సేకరించింది. అలాగే దాల్మియా సిమెంట్ జగన్ సిమెంట్ కంపెనీ ఇండియా సిమెంట్ లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం సేకరించింది. ఇంకొక సిమెంట్ కంపెనీ రఘురాం సిమెంట్స్ పేరుతొ గనులు పొందిన భారతీ సిమెంట్ వై.ఎస్. జగన్ దే అనేది బహిరంగ రహస్యం. కాబట్టి ఇప్పుడు తాజాగా సిబీఐ వై.ఎస్. జగన్ పై మరొక చార్జి షీట్ నేడు దాఖలు చేయనుంది.

chief minister kiran kumar reddy promises to SC

ఎస్సీ, ఎస్టీ లకు ముఖ్యమంత్రి వరాల జల్లు

  పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీలపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 50 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వాడుకునే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఈ రుసుమును ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికల వ్యయం నుంచి ఖర్చు చేస్తామని, ఎస్సీ, ఎస్టీల కాలనీలలోని వారు బకాయిపడిన 268 కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్నట్లు, ఇందిరమ్మ గృహ రుణం ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు 1.05 లక్షల రూపాయలు చెల్లిస్తామని వివరించారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 50 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు ఏడాదికి 110 కోట్ల రూపాయలు వస్తున్నాయి, వారు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇకపై వారు బిల్లులు చెల్లించకుండా చర్యలు తీసుకున్నామని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ ఎస్సీ, ఎస్టీ నిధుల్ని వారికే చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారని, ఆమె ఆదేశాల్లో భాగంగానే దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నిధుల్ని వారికీ మాత్రమే కేటాయించేలా చట్టం తీసుకువచ్చామని, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక బాబూ జగ్జీవన్ రాం జయంతి రోజున ప్రారంభిస్తామని, అంబేద్కర్ జయంతి ఏప్రిల్14 వరకు కొనసాగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.

north korea

అమెరికాతో అణ్వస్త్ర యుద్దానికి ఉవ్విళ్ళూరుతున్న ఉత్తర కొరియా

  తీవ్ర యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న ఉత్తర కొరియా దేశ ప్రభుత్వం తన శక్తికి మించినదని తెలిసి ఉన్నపటికీ దక్షిణ కొరియాకు అండగా నిలబడ్డ అగ్రరాజ్యం అమెరికాతో ఏకంగా .అణ్వస్త్రయుద్దానికి సిద్దపడుతూ ఇరుదేశాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ రోజు ఆ దేశ విదేశాంగ శాఖ రాజధాని పయోంగ్ యాంగ్ లో గల అన్ని దేశాల రాయభార కార్యాలయాలకు వెంటనే తమ దేశం విడిచివెళ్ళడం వారికే క్షేమమని లేఖలు వ్రాసింది. ఈ నెల 10వ తేదీ తరువాత ఏ క్షణానయినా అణుయుద్ధం జరిగే అవకాశం ఉంది గనుక ఆ లోగా వారు దేశం విడిచి వెళ్ళకపోతే వారికి రక్షణ కల్పించలేమని తెలిపింది. బ్రిటన్, రష్యా, చైనా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు లేఖలు అందుకొన్నట్లు దృవీకరించాయి.   దక్షిణ కొరియా దేశంతో దశాబ్దాల తరబడి వైరం పెంచుకొంటూ వస్తున్న ఉత్తర కొరియా ఏనాటికయినా ఆ దేశాన్ని ప్రపంచ పటంలోంచి కనబడకుండా చేరిపేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే అణ్వస్త్రాలను సైతం సమకూర్చుకోవడంతో, ఉత్తర కొరియాను అణ్వస్త్ర దేశంగా గుర్తించబోమని ఖరాఖండీగా చెప్పడమే కాకుండా అణు నిరాయుధీకరణకు కూడా అమెరికా పట్టుపట్టింది. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ (30) అణ్వస్త్ర పరీక్ష జరిపి అగ్రరాజ్యానికి సవాలు విసరడంతో పరిస్థితులు విషమించాయి.   అమెరికా కూడా దానికి దీటయిన జవాబుగా దక్షిణ కొరియా దేశంతో కలిసి సైనిక విన్యాసాలు చేసి ఉత్తర కొరియా సరిహద్దులో ఒక డమ్మీ అణ్వస్త్ర బాంబు జారవిడిచింది. అమెరికా చర్యతో మరింత ఆగ్రహించిన ఉత్తర కొరియా, ఉభయ దేశాల సరిహద్దుల వద్దగల రెండు దేశాల సహకారంతో నడుస్తున్నపారిశ్రామికవాడను మూసివేసి యుద్ధ ప్రకటన కూడా చేసింది. తన అణ్వస్త్రాలను దక్షిణ కొరియా వైపు మొహరించిన ఉత్తర కొరియా ఈ రోజు రాజధానిలో గల అన్ని దేశాల రాయభార కార్యాలయాలకు ఈనెల 10లొగా ఖాళీచేసి వెళ్ళిపోవడం మేలని లేఖలు వ్రాసింది. 10వతేదీ నుండి ఏరోజయినా అణ్వస్త్ర యుద్ధం జరుగవచ్చని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉత్తర కొరియా మిత్ర దేశాలయినా చైనా, రష్యాల తో సహా వివిధదేశాలు వారిస్తున్నపటికీ ఆ దేశం యుద్ధానికే ఇష్టపడుతోంది.   ఒకసారి అణ్వస్త్ర యుద్ధం మొదలయితే అది ఎంత దారుణంగా ఉంటుందో తెలిసినప్పటికీ, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్నఅమెరికా వంటి దేశంతో యుద్ధానికి సై అనడం చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ది అనే మన పెద్దల మాటలు గుర్తుకు రాకమానవు. ప్రభుత్వ దురహంకారానికి, యుద్ధ కాంక్షకు అక్కడి అమాయక ప్రజలు, పిల్లలు, మహిళలు అందరూ బలవబోతుంటే ప్రపంచం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం విచారకరం.

s.janaki

భారతరత్నకి తక్కువయితే కుదర్దు మరి

  తన మృదుమదురమయిన గళంతో పాటలకు ప్రాణం పోసే పాటల కోయిల శ్రీమతి యస్. జానకికి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకమయిన పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. అయితే గత 55ఏళ్లుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర సీమలకు సేవచేస్తూ దాదాపు 20౦౦౦ పాటలు పైగా పాడిన తనకు ఈ అవార్డు ఎప్పుడో ఇచ్చి ఉండవలసిందని కానీ, దానిని ఇచ్చేందుకు కూడా ఇన్ని ఏళ్ళు ఆలోచించడం తనకి చాలా బాధ కలిగించిందని, ఇన్నేళ్ళుగా తానూ చేస్తున్న సేవలకి భారతరత్న ఇచ్చి ఉండి ఉంటే తనకు గౌరవంగా ఉండేదని, అందువల్ల తానూ ఈ అవార్డును స్వీకరించలేనని ఆమె తెలిపారు. ఈ వయసులో కూడా ప్రజలు మరియు చిత్ర సీమ, తనపై కురిపిస్తున్న అపార ప్రేమాభిమానాలే ఈ అవార్డుల కంటే తనకు ఎక్కువ ఆనందం కలిగిస్తాయని ఆమె అన్నారు.   ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖ నటి శ్రీదేవి, ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు బాపు, క్రికెటర్ రాహుల్ డ్రావిడ్, చేనేత కళాకారుడు గజం అంజయ్యలకు పద్మ అవార్డులు అందుకొన్నారు.

kodali Nani ntr

ఎన్టీఆర్ ను టిడిపి తప్ప ఎవరైనా వాడొచ్చు!

      ఎన్టీఆర్‌ బొమ్మను ఒక్క టీడీపీ తప్ప ఎవరైనా వాడుకోవచ్చని కొడాలి నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వ్యవస్థాపక అధ్యక్షుడిని గెంటేసిన చంద్రబాబుకు ఆయన ఫోటోను వాడుకునే అర్హత లేదన్నారు. అధికారం యావతో చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోను కూడా రాద్దాంతం చేస్తున్నాడని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిలను పేద ప్రజలు గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారని చెప్పారు. అలాంటి ఉత్తమ నాయకులను ఎవరైనా అభిమానిస్తారని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కొన్ని పిచ్చికుక్కలు మొరుగుతున్నాయని అన్నారు.

kiran kumar

గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకొన్న కిరణ్

    ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏవయినా ముఖ్య నిర్ణయాలు తీసుకొనేటప్పుడు అటు పార్టీలో కానీ, ఇటు కేబినేట్ సహచరులతో గానీ సంప్రదించే అలవాటు లేదని విద్యుత్ చార్జీల పెంపు విషయంలో మరో మారు రుజువు చేసుకొన్నారు. కరెంటు చార్జీలపై ప్రతిపక్షాల ఆందోళనలకి ఎంత మాత్రం భయపడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వపక్షంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాక వెనక్కి తగ్గక తప్పలేదు.   అయినప్పటికీ, 200 యూనిట్లు లోపుగా వాడుకోనేవారికే తప్ప మిగిలిన వారికి మాత్రం పెంచిన చార్జీలు యధాతధంగా వర్తింపజేశారు. 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ అధికంగా వాడినా మొత్తం బిల్లు కొత్త చార్జీల ప్రకారమే చెల్లించవలసి ఉంటుంది. ఆయన తీసుకొన్న నిర్ణయం ప్రజలను అవహేళన చేయడమే తప్ప మరొకటి కాదు. ముఖ్యమంత్రి నిర్ణయంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు తమ అందోళనలను మరింత ఉదృతం చేయనున్నట్లు ప్రకటించాయి.   ముఖ్యమంత్రి మొండిగా ఎవరినీ ఖాతరు చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తరువాత స్వపక్ష విపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత వెనక్కి తగ్గటం ఒక అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు వలన ఆయన తన పేరు తానే పాడు చేసుకోవడమే కాకుండా, పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. తద్వారా ప్రజలలో ఇప్పటికే ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేఖతని మరింత పెంచి పోషిస్తూ పార్టీకి మరింత నష్టం కలిగిస్తున్నారని వీ. హనుమంత రావు వంటి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.   కానీ, అధిష్టానం అండదండలు ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన బాటలో తానూ ముందుకు సాగిపోతున్నారు. ఎన్నికలకి ఇంకా చాల సమయం ఉంది గనుక ప్రస్తుతం ఆయనకి ఎవరినీ ఖాతరు చేయవలసిన అవసరం ఉండకపోవచ్చును. కానీ రేపు ఎన్నికలు దగ్గిర పడిన తరువాత పార్టీలో కార్యకర్త మొదలు సీనియర్ల వరకు అందరి సహకారం అవసరం ఉంటుంది. ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆయనేమి వైయస్సార్ కాదని తెలుసుకొంటే, పార్టీలో అందరి సహకారం ఎంత అవసరమో ఆయనకి అర్ధం అవుతుంది.   కరెంటు చార్జీలు పెంచడం అనివార్యం అయినప్పుడు ఆ సంగతిని పార్టీలో, ప్రభుత్వంలో చర్చించిన తరువాత వారి అభిప్రాయం తీసుకొని, ఒకసారి ప్రతిపక్షాలను కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి ఉంటే ఈరోజు ఇన్ని ఆందోళనలు ఉండేవి కావు. కానీ, అహం అడ్డు రావడం వలనో లేక ఎవరినీ సంప్రదించవలసిన అవసరం తనకు లేదనే అహంభావం వలనో ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసేసుకొని గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తీసుకువచ్చి చేతులు కాలేక ఆకులు పట్టుకొన్నట్లు వెనక్కి తగ్గక తప్పలేదు. దీని వల్ల ప్రజలలో నవ్వులపాలవడమే కాకుండా, రేపు డిల్లీ వెళ్ళినప్పుడు అధిష్టానం చేత కూడా అక్షింతలు వేయించుకోక తప్పదు. అందువల్ల కనీసం ఇప్పటినుంచయినా తన వ్యవహార శైలి మార్చుకొనకపోతే అది ఆయనకీ, కాంగ్రెస్ పార్టీకీ నష్టం కలిగిస్తుంది చెప్పకతప్పదు.

ysr congress tdp

వైఎస్ జగన్ వర్గ ఎమ్మెల్యేల తెలివైన వ్యూహం

        రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 13 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. తమ శాసనసభ సభ్యత్వాలు తక్షణమే రద్దు చేసి నోటిఫై చేయాలని జగన్ వర్గ ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 151ఏ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను ఆ ఎమ్మెల్యేలు కోరారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పార్టీల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని టీడీపీ, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్, టీడీపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలా స్పందిస్తారో చర్చానీయాంశంగా మారింది.

 Padma Bhushan for Rama Naidu

పద్మభూషణ్ అందుకున్న రామానాయుడు

        పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు ఢిల్లీలో ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాల కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో జరిగింది. ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, ప్రముఖ నటి శ్రీదేవి, ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మా అవార్డులను అందజేశారు. పద్మవిభూషన్, పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రతిభావంతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ntr baadshah

ఎన్టీఆర్ టాలీవుడ్ బాద్‌షా..జగన్ పొలిటికల్ బాద్‌షా ఫ్లెక్సీలు

        విశాఖజిల్లాలో బాద్‌షా చిత్రానికి సంబంధించిన ఫ్లెక్సీలు వివాదాన్ని రేపుతున్నాయి. కిన్నెర థియేటర్ దగ్గర జగన్, జూ.ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ పొలిటికల్ బాద్‌షా...ఎన్టీఆర్ టాలీవుడ్ బాద్‌షా  అంటూ ఫ్లెక్సీలపై రాతలు రాశారు. అయితే ఈ రాతలు రాజకీయాలకు అతీతం అని పెట్టడం విశేషం. కాగా ఈ ఫ్లెక్సీలపై బాలకృష్ణ, జూ.ఎన్టీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. థియేటర్‌పై దాడిచేస్తామనే హెచ్చరికలతో ఫ్లెక్సీలను తొలగించారు.   మరోవైపు కృష్ణా జిల్లాలో గుడివాడలో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసి ఫ్లెక్సీల్లో టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు ఫోటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. మరో రెండు ఫ్లెక్సీల్లోనూ ఫోటోను కత్తిరించడంతో రావి అభిమానులు ఆందోళనకు దిగారు.

ఎన్నాళ్లని జెండాలు మోస్తారు

        మీరంతా కష్టాల్లో ఉన్నారు.. అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్లుగా జెండాలు మోస్తున్నారు.. ఎన్నాళ్లని మోస్తూ కూర్చుంటాం.. అధికారం వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలం..'' అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని, టీడీపీ గెలుపు ఒక చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏడాదిలో రావచ్చు. ఆరు నెలల్లోనైనా రావచ్చు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలన్నారు. జెండాలు మోసీమోసీ భుజాలు అరిగిపోయాయని, ఇక అధికారంలోకి రావడం తప్పనిసరని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్టీఆర్ బాద్‌షా ఫ్లెక్సీలలో జగన్

        వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ను ఇప్పట్లో వదిలేలా కనపడడం లేదు. మొన్న జూనియర్ ఎన్టీఆర్, నిన్న సీనియర్ ఎన్టీఆర్ ను జగన్ పార్టీ ఫ్లెక్సీల లో వాడేసుకుంది. అయితే ఓ వర్గం ఓటర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే ఆ పార్టీ ఈ ఎత్తుగడలను వేస్తుందని భావిస్తున్నారు. తాజాగా 'బాద్ షా' సినిమా విడుదల నేపధ్యంలో ఏర్పాటైన ఫ్లెక్సీల లో జగన్ ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి. చీరాల మోహన్ థియేటర్ వద్ద అభిమానులు జగన్ తో ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ముందు జాగ్రత్తగా థియేటర్ యాజమాన్యం వాటిని తొలగించింది. తిరువూరు వెంకటేశ్వర థియేటర్ వద్ద కొడాలి నాని, ఎన్టీఆర్, వైఎస్ జగన్ లు ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనలతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు.

కిరణ్ తగ్గింపులు ... తృప్తి చెందని విపక్షాలు

  గత కొద్దిరోజులుగా విపక్షాలు విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరాహార దీక్షలు, నిరసనలు తెలుపుతున్న విషయం విదితమే. స్వపక్షంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై గురువారం మంత్రులు, విద్యుత్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, ఆనం రాంనారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పార్థసారథి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గీతారెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గృహ వినియోగదారులకు కొత్తగా పెరిగిన కరెంటు ఛార్జీల భారంలో 830 కోట్ల రూపాయలను ప్రభుత్వం రాయితీగా భరిస్తుందని, నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ యూనిట్లు వాడుకునే వారికి పాత ఛార్జీలనే కొనసాగిస్తామని, 201 యూనిట్ల నుంచి ఆపైన వాడుకునే వారికి మొదటి యూనిట్ నుండి కొత్తగా పెరిగిన ఛార్జీల ప్రకారం చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నారు. అలాగే గృహ వినియోగదారులు రెండు కోట్లు ఉంటే ప్రభుత్వ తాజా నిర్ణయంతో 1.86 కోట్ల ప్రజలకు కరెంటు ఛార్జీల పెంపు నుంచి ఉపశమనం పొందుతారని అన్నారు. విపక్షాలు మాత్రం సిఎం నిర్ణయంతో సంతృప్తికరంగా లేరు. ఈనెల తొమ్మిదిన రాష్ట్రవ్యాప్త బంద్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

దావుద్ ఇబ్రహీం, ముషారఫ్ ఫోటోలు పెట్టుకోండి ... రేవంత్ రెడ్డి

  టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారంవిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ... జగన్, వైఎస్సార్ ఫోటోలు  పెట్టుకుంటే ప్రజలకు దొంగలు, దోపిడీదారులు గుర్తుకు వస్తారని భయపడి వైఎస్సార్సీపీ ఎన్టీఆర్, జూ. ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుంటున్నారని, రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు పెట్టుకునే కొత్త బిచ్చగాళ్ళు, పగటి వేషగాళ్ళ పార్టీలను ఇప్పుడే చూస్తున్నామని, ఎన్టీఆర్ నిజాయితీ పరుడని, నిజాయితీకి మారుపేరని అన్నారు. ఆయన ఫోటోను వైఎస్సార్సీపీ పార్టీ ఫ్లెక్సీలపై పెట్టుకుని మలినపరుస్తున్నారని, ఎన్టీఆర్ ఎప్పుడూ వైఎస్సార్ తో రాజీ పడలేదని, జగన్, వైఎస్సార్ ఫోటోలు పట్టుకుని ఓట్లు సంపాదించే రోజులు పోయాయని ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకుందని ఎద్దేవా చేశారు. దావుద్ ఇబ్రహీం, ముషారఫ్ వంటివారి ఫోటోలు పెట్టుకుంటే మంచిదని రేవంత్ రెడ్డి వైఎస్సార్సీపీ వారికి సలహా ఇస్తున్నారు.