చంద్రబాబు దీక్ష భగ్నం

    Video courtesy ETV2   తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం భగ్నం చేశారు. రాష్ట్ర విభజన ఆపాలని, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని, ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఏపీభవన్ లో నిరహార దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని వైద్యులు చెప్పడంతో ఉదయం నుండి ఏపీ భవన్ రహదారులు బంద్ చేసిన పోలీసులు బలవంతంగా బాబును రామ్ మనోహన్ లోహిలా ఆసుపత్రికి తరలించారు. బాబు తరలింపును అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. చంద్రబాబు నాయుడు దీక్ష దేశాన్ని ఆకర్షించిందని, ఆయన దీక్ష మూలంగానే కేంద్ర ప్రభుత్వం కదిలిందని, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు తెలుగు ప్రజల కొరకు పోరాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

విభజన ప్రకటనలపై కిరణ్ ఆగ్రహం

      రాష్ట్ర విభజనపై హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటన పై పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభ్యంతరం చెప్పారని వార్తలు వచ్చాయి. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం విషయంలో సుశీల్ కుమార్ షిండే ఒక మాట, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అయిన మీరు ఒక మాట చెబుతున్నారు. ఇద్దరూ వేర్వేరు ప్రకటనలు చేయడం ఏమీ బాగోలేదు. ఇది ప్రజలను ఆందోళన పరుస్తోంది. విభజనకు సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసన సభకు వస్తుందని మీరు చెప్పారు. ఇప్పుడు షిండే తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తుందని అంటున్నారు. మీరు చెప్పారని నేను ఏపీఎన్జీఓలకు నచ్చజెప్పాను. ఇప్పుడు ఇలా చేస్తే ఎలా” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

బెయిలు షరతులు సడలింపుకు జగన్ కొత్త ఎత్తు

  హైదరాబాద్ విడిచి బయటకు వెళ్ళరాదనే షరతుకి అంగీకరిస్తూ రెండు వారల క్రితం బెయిలుపై జైలు నుండి విడుదల అయ్యి బయటకు వచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ షరతుని అదిగమించేందుకు ఇప్పుడు సరికొత్త ఎత్తు వేసారు. రాష్ట్రంలో నెలకొన్నఅనిశ్చిత పరిస్థితికి ప్రజలు చాలా ఆందోళన చెందు తున్నారని, ఇటువంటి సమయంలో బాధ్యతగల ఒక ప్రజాప్రతినిధిగా వారికి బాసటగా నిలవడం తన కర్తవ్యమని, అందువల్ల బెయిలు షరతులు సడలించి తనకు రాష్ట్రంలో పర్యటించేందుకు గాను అనుమతించాలని కోరుతూ ఆయన ఈ రోజు సీబీఐ కోర్టులో ఒక పిటిషను వేసారు.   ఆ వాదన ఎలా ఉందంటే ఆయన వచ్చి ప్రజలను ఓదార్చకపోతే వారు అలా బాధపడుతూనే ఉంటారన్నట్లుంది. ఒకవైపు కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియ చేసుకుపోతుంటే, ఆయన నిరాహార దీక్షలు చేయడం, సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమాలు నడపడం కేవలం తన పార్టీని బలపరుచుకోవడానికేనని ప్రజలకి తెలుసు. ఆ క్రమంలోనే ఆయన పార్టీలోకి కాంగ్రెస్ శాసన సభ్యులు, యంపీలు వరుసకట్టి వస్తున్నారు.   సాధారణ ఎన్నికలకు కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం మిగిలినందున, ఆయన ఇప్పుడు తన పార్టీని బలపరుచుకోవడానికి సీమంద్రా పర్యటనకి బయలుదేరాలనుకొంటున్నారు. అయితే అందుకు ఆయన చెపుతున్న కారణాలు మాత్రం వేరే విదంగా ఉన్నాయి.   తను చాలా బాధ్యత గల ప్రజాప్రనిధినని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే, ఆయన ఎలాగు సమైక్యంద్రానే కోరుకొంటున్నారు గనుక, ముందుగా తెలంగాణాలో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకొని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందోనని తీవ్ర భయాందోళనలు చెందుతున్న తెలంగాణా ప్రజలను ముందుగా ఓదార్చితే బాగుటుంది. కానీ కేవలం సీమంద్రాలో ప్రజలనే ఓడార్చాలనుకొంటే, ఆ మిషతో పార్టీని బలపరచుకొనే ప్రయత్నంగానే భావించవలసి ఉంటుంది.

బాబు దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు సిద్దం

  గత ఐదు రోజులుగా డిల్లీలో ఏపీ భవన్ వద్ద చంద్రబాబు చేస్తున్నఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు రంగం సిద్దమయింది. ఆయన ఆరోగ్యపరిస్థితి క్రమంగా విషమిస్తుండటంతో అప్రమత్తమయిన హోం శాఖ , వైద్యులతో కూడిన ఒక అంబులెన్స్ ను కొద్దిసేపటి క్రితమే దీక్షావేదిక వద్దకు పంపింది. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సాయంత్రంలోగా ఎప్పుడయినా పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును.   ఆయన కోసం స్థానిక ఆసుపత్రిలోఒక గది (రూమ్ నెంబర్:6) ను కూడా సిద్దం చేసి ఉంచింది. పోలీసులు దీక్షా స్థలికి చేరుకోవడంతో అక్కడ ఉన్న తెదేపా నేతలు, కార్యకర్తలలో ఆందోళన మొదలయ్యింది. అయితే దీక్షను భగ్నం చేయడం అనివార్యమని అందరికీ తెలిసిన విషయమే.   తెలుగు ప్రజలకు న్యాయం జరిగే చ్వరకు డిల్లీ నుండి కదలనని భీషణ ప్రతిజ్ఞా చేసిన చంద్రబాబు మరి దీక్ష భగ్నం అయిన తరువాత డిల్లీలోనే మఖం వేసి తన ప్రయత్నాలు కొనసాగిస్తారా లేక రాష్ట్రానికి తిరిగి వచ్చి తన ఆత్మా గౌరవ యాత్రలు మొదలు పెడతారా తెలుసుకోవాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడాలి.   ఏమయినప్పటికీ ఆయన దీక్ష వల్ల రాష్ట్ర విభజన సమస్య గురించి ఇప్పుడు జాతీయ నాయకులకు, జాతీయ మీడియాకు ఆసక్తి పెరిగింది. ఇంతవరకు ఈ వ్యవహారంలో వారు చూడని అనేక రాజకీయ కోణాలు ఆయన తన దీక్షా సమయంలో బయటపెట్టి, వారి మద్దతు కూడా గట్టగాలిగారు.

ఉద్యోగులు ఒక్కరుగా సమ్మె నుండి విరమణ

      సీమాంధ్ర ఉద్యోగులు ఒక్కరుగా సమేనుండి విరమిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు కరెంటు కష్టాలు తీరనున్నాయి. పిల్లలు స్కూళ్ళకు వెళ్లనున్నారు. ఇది మంచి పరిణామమే. అయితే సమ్మె విరమించిన ఉద్యోగస్తుల జె.ఏ.సి లు మాత్రం తమ సమస్యలపై ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారని, రాష్ట్రం విడిపోకుండా చూసే భాధ్యత తనదని హామీ ఇచ్చినందున సమ్మె విరమిస్తున్నట్లు వారు చెబుతున్నారు. మరి మరో వైపు కేంద్రం నుండి పెద్ద సంఖ్యలో బలగాలు సీమాంధ్ర లో మోహరిస్తున్నాయి. మరో పక్క కేంద్ర హోమంత్రి షిండే అసెంబ్లీ కి తీర్మానం రాదనీ బిల్లు మాత్రమే వస్తుందని చెపుతున్న నేపధ్యంలో రాష్ట్ర విభజన జరగకుండా ముఖ్యమంత్రి ఎలా ఆపగలరొ ప్రజలకు ఏమి అర్ధం కాని గందరగోళ పరస్థితి నెలకొంది. ఉద్యోగస్తులు వారి సమస్యల విషయమై హామీ పొందారు సరే,కాని సామాన్య ప్రజానీకమైన రోజు కూలీలు మిగిలిన బడుగు బలహీన ప్రజలకు ఎవరు ఎలాంటి హామీ ఇస్తారని పలువురు సందేహ పడుతున్నారు. ఈ సమ్మె నేపధ్యం లో సామాన్య ప్రజానీకమే ఈ 72 రోజులుగా నానా యాతనలు పడ్డారే కానీ ఏ నేతలు కాదు. మరి ఏ ఒడంబడికల నేపధ్యంలో సమ్మె విరమించుకున్నారో సదరు ఉద్యోగస్తుల జె.ఏ.సి లు ఇన్నాళ్ళు సమ్మె ల తో అష్ట కష్టాలు అనుభవించిన ఈ సామాన్య ప్రజానీకానికి మాత్రం వివరించ వలసిన బాధ్యత ఉన్నదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

స్వరం మార్చిన వెంకయ్య

        తాము అధికారం లోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని బి.జె.పి ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్న మహబూబ్ నగర్ లో జరిగిన బి.జె.పి బహిరంగ సభలో సుష్మ స్వరాజ్ ఈసారి కనుక తెలంగాణా ఇవ్వకుంటే తనే స్వయంగా ఉద్యమంలో పాల్గొంటానని హెచ్చరించారు. మొన్న కాంగ్రెస్ కేబినేట్ నోట్ తెలంగాణ పై నోట్ ఆమోదిస్తే ఆ నోటును బి.జె.పి ఆహ్వానించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ను గుజర్రత్ కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో నిర్వహించిన బి.జె.పి బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.ఇవన్ని ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా బి.జె.పి అగ్రనేతలలో ఒకరైన మాజీ మంత్రి వెంకయ్యనాయిడు తెలంగాణ పై తన స్వరం మార్చారు. మొన్నటి వరకు తెలంగాణ అంశం త్వరగా తేల్చాలని పట్టుబట్టిన ఆయన ముందు సీమాంద్ర ప్రాంత సమస్యలు పరిష్కరించి ఆతర్వాత రాష్ట్రాన్ని విభజించాలని సూచించారు. అసలు ఇప్పటి వరకు సీమాన్ధ్రులు విభజన అనంతరం తాము ఎడుర్కొనబోయే సమస్యలు ఏమిటో చెబుతున్న వాటిపై బి.జె.పి తన దృష్టిని సారించలేదు. హైదరాబాదు విషయం లోను ఎలాంటి అభిప్రాయాన్ని కాని సూచనను కానీ చేయలేదు. నదీ జలాల సమస్యలు,ఉద్యోగాల సమస్యల పై తమ వైఖరేమిటో బి.జె.పి ఇంతవరకు ఏవిధమైన స్పష్టతను తెలియ చేయ లేదు. మరి ఈ సమస్యలన్నిటి మీద వెంకయ్యనాయుడు ఐన ఒక సీనియర్ నేతగా తన నిర్ణయాన్ని తెలియచేస్తారా అంటే అది సందేహమే!ఒక పక్క సుష్మాస్వరాజ్ తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమిస్తానంటారు,మరోపక్క వెంకయ్య నాయుడు సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాకే విభజన చెయ్య మంటారు. ప్రతి రాజకీయ పార్టీకి తెలంగాణ అంశం ఒక ఆట వస్తువుగా తయారైంది . ప్రతి నేత ఇరుప్రాంత ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. మరిస్వరం మార్చిన బి.జె.పి నేత వెంకయ్య నాయుడు ను తెలంగాణ ప్రాంత నేతలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

చంద్రబాబు దీక్షకు వర్షం దెబ్బ

  Video courtesy TV9     తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో వచ్చే ఇబ్బందులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఏపీభవన్ లో చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుణుడు అడ్డంకులు సృష్టిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వర్షం కారణంగా ఏపీ భవన్ లో దీక్ష శిబిరం తడిసిపోయింది. ఇక తాజాగా ఈ రోజు కూడా ఢిల్లీలో కురిసిన భారీ వర్షంతో బాబు దీక్షా శిబిరం తడిసిపోయింది. దీంతో అక్కడ దీక్షలో ఉన్న చంద్రబాబు తో సహా నాయకులంతా ఇబ్బందికి గురయ్యారు.   శిబిరంలోని టెంట్లు తడిసి ప్రాంగణం అంతా నీరు చేరింది. ఇక దీక్ష నేపథ్యంలో బాబుకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు. ఆనంతరం వారు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, న్యూఢిల్లీ డిసిపి, ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్, ఆరోగ్య విభాగం డైరెక్టర్ జనరల్‌కు ఒక నివేదికను సమర్పించారు. దీక్ష మూలంగా బాబు మూడు కిలోల బరువు తగ్గారు. షుగర్, బీపీ లెవెల్స్ లో తేడా వచ్చింది.

అసేంబ్లీకి తెలంగాణ నోట్: షిండే

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసేంబ్లీకి తెలంగాణ నోట్ ను త్వరలోనే పంపనున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. నెల వారీ సమీక్ష నివేదిక వెల్లడించడంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ అంశం గురించి మాట్లాడారు. కేబినెట్ నోట్ ముందుగా అసేంబ్లీకి వెళ్లదని, కేంద్ర మంత్రుల బృందం నివేదిక వచ్చిన తరవాత దానిని ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుందని తెలిపారు.     ఆ నివేదికను రాష్ట్రపతి అసేంబ్లీకి పంపుతారని, అసేంబ్లీ నుండి నోట్ పార్లమెంట్ కు వస్తుందని తెలిపారు. వీలయినంత తొందరగా తెలంగాణ తీర్మానం అసేంబ్లీకి వస్తుందని షిండే అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ అందరితో చర్చించిందని, మంత్రుల బృందం ఇప్పుడు ఎవరెవరితో చర్చిస్తుంది, ఎవరెవరిని కలుస్తుంది అన్నది చెప్పలేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అవసరమయిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

కోర్టు ఒకే అంటే బాబును బయటకి పంపుతాము:షిండే

  రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం యొక్క అనుచిత వైఖరిని నిరసిస్తూ రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలంటూ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిల్లీలో ఏపీ భవన్లో గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షతో కలవర పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఆయనను వీలయినంత త్వరగా అక్కడి నుండి బయటకి పంపేయాలని ప్రయత్నిస్తోంది. ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ శశాంక్ గోయల్ చంద్రబాబుని ఖాళీ చేయమని నోటీసులు కూడా జారీ చేసారు. అయితే కేంద్రం దిగివచ్చేవరకు తాను డిల్లీ నుండి కదలబోనని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు ఏపీ భవన్లోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు.   ఈ విషయాన్నీ శశాంక్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో, ప్రభుత్వం హోం శాఖకు ఒకలేఖ వ్రాసింది. దానిపై హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే స్పందిస్తూ “ఇటువంటి దీక్షలు తానెన్నడూ చూడలేదని” అని అన్నారు. ఇప్పటికయినా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ తమ దీక్షలు విరమించి మంత్రుల బృందంతో చర్చలకు రావాలని ఆయన హితవు పలికారు.   చంద్రబాబును ఏపీ భవన్ నుండి ఖాళీ చేయించడానికి అధికారులు సివిల్ కోర్టు నుండి ఆదేశాలు తీసుకు వచ్చినట్లయితే, తను పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయగలనని ఆయన తెలిపారు. కానీ వారు చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తే అది ఆయనకు మరింత ప్రచారం కలిగించే అవకాశం ఉంది గనుక, ఇక నేడో రేపో ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును.

త్వరలో సచిన్ టెండూల్కర్ క్రికెట్ కి గుడ్ బై

  భారత్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం సృష్టించుకొన్న సచిన్ టెండూల్కర్ త్వరలో ఆ అధ్యాయం ముగించబోతున్నాడు. త్వరలో ముంబై కోల్ కత్తలో ఆడనున్న రెండు టెస్ట్ మ్యాచులతో 200 టెస్ట్ మ్యాచులు పూర్తి చేసిన తరువాత క్రికెట్ ఆట నుండి రిటర్ అవుతానని ఆయన ప్రకటించారు.   ఇదేవిషయం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి తెలియజేస్తూ వ్రాసిన లేఖలో, 11ఏళ్ల వయసులో క్రికెట్ ఆట మొదలుపెట్టిన తనకు ఎప్పటికయినా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల ఉండేదని, అది అభిమానుల, క్రికెట్ బోర్డు సభ్యుల మద్దతు, ఆశీర్వాదంతో నెరవేరిందని అందుకు వారికి సర్వదా ఋణపడి ఉంటానని తెలిపారు. తన 22 ఏళ్ల సుదీర్గమయిన కెరీర్లో, క్రికెట్ ఆటలో ఉన్న ఆనందం అంతా తనివి తీరా అనుభవించానని తెలిపారు. క్రికెట్ లేని జీవితం ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంటుంది. అయినప్పటికీ, ఇక ఆట నుండి తప్పుకోవలసిన సమయం ఆసన్నమయిందని తన మనసు చెపుతోందని, అందువల్లే రిటైర్ అవ్వాలని నిశ్చయించుకొన్నానని సచిన్ తన లేఖలో తెలిపారు. ఇన్నేళ్ళుగా తనకు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉన్నత శిఖరాలు జేరుకోనేందుకు తోడ్పడిన అభిమానులకు, బోర్డు సభ్యులకు మరియు కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.   క్రికెట్ లేని జీవితం ఊహించుకోవడం సచిన్ టెండూల్కర్ కి ఎంత బాధ కలిగిస్తుందో, సచిన్ లేని క్రికెట్ ను ఊహించుకోనేందుకు, అభిమానులకు కూడా అంత కంటే ఎక్కువే బాధ కలిగిస్తుంది. ఆయన వంటి మేటి ఆటగాళ్ళు దేశంలో క్రికెట్ ను ఒక మతంగా మార్చగలిగితే, అందులో సచిన్ వంటి వారు క్రికెట్ దేవుళ్ళుగా కొలవబడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి దేవుడి గొప్పదనం గురించి ఎవరికీ ప్రత్యకంగా వివరించనవసరం లేదు. ఆయన అభిమానులు ఇప్పుడు ఆ దేవుడు లేని దేవాలయానికి వెళ్ళడానికి అలవాటు చేసుకోక తప్పదు.

దక్షత లేని దీక్షలు

      సమన్యాయం చెయమనొ రాష్ట్రాన్ని సమైఖ్యంగానే ఉంచమనొ మొత్తం మీద రాష్ట్ర రాజధాని లో జగన్,అటు దేశ రాజధానిలో చంద్రబాబు నాయుడు నిరాహార దీక్షలు చేపట్టారు. జగన్ దీక్ష ప్రారంభించి ఐదు రోజులు ఐన కారణంగా ఆయన దీక్షను పోలీసులు గత రాత్రి భగ్నం చేశారు. నేడో,రేపో అక్కడ ఢిల్లీ లో బాబు గారి దీక్షను ఇలాగే అడ్డుకుంటారు. అయితే ఈ తతంగ మంత చూస్తున్న ప్రజానీకానికి ఒక్క విషయం అర్ధం కావటం లేదు. ఇటు జగన్ కాని అటు చంద్రబాబు కానీ తమ దీక్షలతో తమకు ఏమి న్యాయం చేయబుతున్నారా అని.ఒకనాడు రాష్ట్రాన్ని విభజించమని లేఖలు ఇచ్చిన ఈ ఇద్దరు నేతలు నేడు సమన్యాయం కోసం దీక్షలు చేపట్టట మేమిటని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆనాడు అఖిల పక్ష సమావేశం లో లేఖలు ఇచ్చిన నాడు సమన్యాయం ఎలా చేయ వచ్చో లేక విభజన అనంతరం సీమాంధ్ర లో తలెత్తే సమస్యలేమిటో ఎందుకు పేర్కొనలేదు.     అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇచ్చిన జగన్ ఈరోజు ఎందుకు వరుసగా దీక్షలమీద దీక్షలు చేస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు విజయమ్మ దీక్ష వలన గాని ఆతరువాత జైలులో నే జగన్ రెడ్డి ప్రారంభించిన దీక్ష వలన కానీ మళ్ళి ఐదు రోజుల క్రితం వరకు జగన్ రెడ్డి దీక్ష వలన ప్రజలకు ఒరిగిందేమిటి?ఇంకా వై.కా.పా లోనే కొంత మంది కొత్తనేతలు తమ రాజకీయ భవిష్యత్తు ను వెతుక్కొంటూ వచ్చి చేరారు తప్పా. ఇంత చేసినా కనీసం ఇప్పటికైనా ప్రజల తరఫున పోరాడాలి అంటే జగన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పట్ల తన వైఖరి ఏంటో చెప్పాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.2014 ఎన్నికలలో తిరిగి యు.పీ.ఎ  ప్రభుత్వానికే కనుక తన మద్దతు తెలియ చెబితే సీమాంధ్ర ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది.                         చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికైనా ఆయన వైఖరేమిటో స్పష్టంగా చెప్పకుండా ఎన్ని దీక్షలు చేసి ఏమిటి ప్రయోజనం అని కూడా పలువురు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన పరిస్థితి ఇక్కడి వరకు రావటానికి ఆయన తప్పిదం కూడా చాలా ఉంది అనేది ఎవరు కాదనలేని సత్యం. నేడు ప్రజలకు కావాల్సింది నేతలనుండి స్పష్టమైన హామీ. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రాంతం లోని అన్ని పార్టీల నేతలు ప్రజల కోసం ఒక్కతాటి మీదకు వచ్చి ప్రజల పక్షాన నిలబడాలని ఎందుకు అనుకోరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఇరువురు నేతల కన్నా ప్రజలే నయం. 70 రోజులుగా జీతాలు లేకున్నా,కరెంటు ,నీళ్ళు,పాలు ఏవి లేకున్నా ఎంతో ఆత్మ స్థైర్యం తో పోరాడుతున్నారు,నేతలను వణికిస్తున్నారు. కానీ ఇంకా రాజకీయ లబ్ధి తోనే ఆలోచిస్తూ ప్రజల ఆందోళనలు గుర్తించకపోతే ఆయా పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదు అనేది సుస్పష్టం. ఇహ మీదటైన ఈ నేతలు ఈ దక్షత లేని దీక్షలు చేపట్టకుండా ఉంటె మంచిదని ప్రజలే భావిస్తున్నారు.  

పాలన అంటే కాంగ్రెస్ పాలనే!

  సోదర సోదరీ మణుల్లారా! కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఓసారి మా ప్రభుత్వం ఉన్నఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి చూడండి. అక్కడ ఉగ్రవాదులు దాడులు ఉంటాయి గానీ, మత ఘర్షణలు పెద్దగా ఉండవు. నిరంతర ఉద్యమాలు ఉంటాయి గానీ ఈవిధంగా రోడ్ల మీద ప్రజలు ఒకరినొకరు కత్తులతో పోడుచుకోవడాలు ఉండవు. ఉగ్రవాదులు అప్పుడప్పుడు బాంబులు పేల్చినప్పుడు ప్రజలు చనిపోవచ్చు. ఉద్యమాలలొ యువకులు బలి దానాలు చేసుకొని ఉండవచ్చు, అప్పుల బాధలు భరించలే రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండవచ్చును. గానీ ఇలా అనాగరికంగా ప్రజలు ఒకరినొకరు పొడుచుకొని చావరు. అందుకే మీరందరూ మా పార్టీకే ఓటేసి గెలిపించమని కోరుతున్నాము.   అసలు ఈ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమనేది అసలుందా లేదా? ఉండి కూడా పనిచేయకపోతే అది మా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి పోటీగా వస్తోందని మేము భావించవలసి ఉంటుంది. మీ దగ్గర ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ పనిచేయదు. కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ప్రత్యేకంగా కనబడదు. పని చేయదు కూడా. ఎందుకంటే అది ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటుంది గనుక.   అక్కడ మంత్రులు, యంపీలు, శాసన సభ్యులు, ఉద్యోగులు ఒకరేమిటి అందరూ ప్రజలతో కలిసి ఉద్యమాలు చేసుకొంటూ కలిసిమెలిసి తిరుగుతారు. ఇక్కడ లాగ పదేసి కార్ల కాన్వాయ్ వేసుకొని హడావుడిగా తిరిగే మంత్రులు అక్కడ కనబడరు మీకు. అందువల్ల అక్కడి ప్రజలు ప్రభుత్వం కోసం ప్రత్యేకంగా పనిగట్టుకొని ఏదో కార్యాలయానికి వెళ్ళనవసరం లేదు.   బహుశః ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ భూ ప్రపంచంలో మరెక్కడా కనబడదేమో కూడా. మీకు అలాంటి ప్రభుత్వం కావాలని కోరికగా ఉందా? అయితే ఈ సారి ఎన్నికలలో మా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పితే కాంగ్రెస్ పాలనలో ఉన్నమజా ఏమిటో మీకు రుచి చూపిస్తాము. మా గొప్పదనం గురించి మేము చెప్పుకోవడం కాదు. ఏదయినా టీవీ చానల్ పెట్టుకొని చూడండి. అక్కడ మా పాలన ఎంత దివ్యంగా సాగుతోందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.   మా పాలనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంగతి ఎలా ఉన్నపటికీ, ప్రజలలో మంచి రాజకీయ చైతన్యం తేగలిగాము. అందుకే అక్కడ నిరంతరంగా ఎక్కడో అక్కడ ఉద్యమాలు జరుగుతుంటాయి. అందుకు మా నాయకులే ప్రాంతాల వారిగా విడిపోయి అక్కడి ప్రజలకు పూర్తిగా సహకరిస్తుంటారు.   మరి మీ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కనీసం ఒక్కసారయినా ఉద్యమం జరిగిన దాఖలాలు ఉన్నాయా? అని అడుగుతున్నాము. లేదు! అంటే ఇక్కడ ప్రజలకి స్వేచ్చ లేదు. ఇక్కడి నేతలకి ప్రజలతో కలిసి పనిచేసే అలవాటు అంత కంటే లేదని అర్ధం అవుతోంది కదా?   అభివృద్ధి ఎవరయినా చేయగలరు. కానీ ప్రజలని ఇంతగా చైతన్య పరచడం ఎవరికయినా సాధ్యమేనా? అని అడుగుతున్నాము. అందుకే ఈసారి మా పార్టీకే ఓటేసి మా పరిపాలనలో దొరికే పూర్తి స్వేచ్చా,స్వాతంత్రాలను పొంది ఆనందంగా జీవించమని సవినయంగా కోరుతున్నాము.   ఒకసారి మీరు మా పార్టీకి ఓటేస్తే ఇక మీ జీవితాలే మారిపోతాయి. ఇక మీరు ఉద్యోగాలే కాదు అసలు  ఏ పనీ కూడా చేయనవసరం లేదు . ఎందుకంటే మేము ప్రవేశపెట్టిన నగదు బదిలీ పధకం ద్వారా ప్రతీ నెల టంచనుగా డబ్బు మీ ఖాతాలో పడిపోతుంటుంది. ఆ డబ్బుతో మేము ప్రవేశపెట్టిన ఆహార భద్రతా పదకంలో కావలసినంత సరుకులు తెచ్చుకోవచ్చును.   ఇక మీకు ఇళ్ళు, పొలాలు గట్రా ఏమయినా ఉంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులే. అందుకోసం ఇటీవలే మా ప్రభుత్వం భూ సేకరణ చట్టం తీసుకు వచ్చింది. అంటే మేము మీ ఇళ్ళను, పొలాలను తీసుకొని బోలెడంత డబ్బు ఇస్తామన్న మాట. దానితో హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చును.   అలాగని ఇల్లు పోయిందని మీరు బాధపడితే మేము చూడలేము. అందుకే మీ అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు వంటి పధకాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టాము. ఈ పధకం క్రింద ఒక్కొకరికీ అరవై గజాల విశాలమయిన స్థలాలు ఇస్తాము. అందులో మరీ అంబానీ ఇల్లు వంటిది కాకపోయినా పేద్ద ఇల్లు కట్టుకోవచ్చును. దానికి కూడా మేమే డబ్బిస్తాము. ఇంతకంటే ఎవరికయినా ఇంకేమి కావాలి చెప్పండి.    గనుక ఇక మీరు చేయవలసిందల్లా మాకు ఓటేసి హాయిగా ఉద్యమాలు చేసుకోవడమే!మా ప్రియమయిన సోదర సోదరీ మణుల్లారా... ఇప్పుడు ఈ అవకాశం తప్పిపోతే మళ్ళీ ఐదేళ్ళవరకు మా పాలన పొందే యోగ్యత మీకు దక్కదు. ఆనక మిమల్ని మీరు ఎంత తిట్టుకొన్నా ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంటి ప్రజా ప్రభుత్వం మీకు కూడా కావాలనుకొంటే ఈ సారి పొరపాటున కూడా ఎన్నికలలో మాకు ‘రిజక్ట్ బట్టన్’ నొక్కేయకుండా ఓటేసి గెలిపించుకోండి. (ఇటీవల ఒక యువ కాంగ్రెస్ నేత యుపీలో చేసిన ప్రసంగం స్పూర్తితో)

విద్యుత్త్ ఉద్యోగుల సమ్మె విరమణ

      సమైఖ్యాంధ్ర కోసం విద్యుత్త్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మె ముఖ్య మంత్రి చర్చల తరువాత ఈరోజు వాయిదా పడింది. వీరి సమ్మె కారణంగా సీమాంధ్ర లోని ప్రజలు గత కొద్ది రోజులగా ఇబ్బంది పడుతూ నరకాన్ని చవిచుశారు. తుఫాన్ కారణం గా సీమంధ్ర లో మరియు రాష్ట్ర వ్యాప్తం గా పలు ప్రాంతాలలో తలేత్తనున్న పరిస్థితుల దృష్ట్యా తాత్కాలికంగా సమ్మె విరమించు కుంటున్నట్లు విద్యుత్త్ ఉద్యోగ జె.ఎ.సి అద్యక్షుడు సాయిబాబు తెలియ జేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళితే మళ్ళి సమ్మె చేస్తామని వారు తెలియచేస్తున్నారు. ఇప్పటినుండి విద్యుత్త్ ఉద్యోగులు విధులకు హాజరైన కూడా వి.టి.పి.యెస్ లో మరమ్మత్తులు చేపట్టిన కూడా కోస్తాంధ్ర లో ని పలు ప్రాంతాలకు విద్యుత్త్ సరఫరా పూర్తి స్థాయి లో కావటానికి 48గంటల సమయం పడుతుందని అధికారులు చెపుతున్నారు.

అవసరమైతే రాష్ట్రపతి పాలన: చాకో

      రాష్ట్రంలో నెలకొన్న అనిస్చితుల దృష్ట్యా అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో అన్నారు. దీనితో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి హెచ్చరికలు జారీ చేసినట్లు అర్ధమవుతోంది. గత కొద్ది రోజులుగా ముఖ్య మంత్రి సీమాన్ద్రలో జరుగుతున్న సమ్మె నేపధ్యంలో ఉద్యోగుల జె.ఎ.సి ల తో జరుపుతున్న చర్చలు విఫలం అవుతున్న నేపధ్యంలో చాకో ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చునని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరో పక్క కిరణ్ కుమార్ రెడ్డి తాను ముఖ్య మంత్రి గా ఉన్నంత వరకు ఈ రాష్ట్రం సమైఖ్యం గానే ఉంటుందనే వెల్లడించటం మరింత గందరగోళానికి,సందిగ్ధతలకు దారితీస్తోంది. అయితే చాకో చేస్తున్న వ్యాఖ్యానం నేపధ్యంలో కేబినెట్ నోట్ అసెంబ్లీ తీర్మానం కోసం అసెంబ్లీ కి వస్తుందా,రాదా అనే అనుమానాలు కూడా నెలకొంటున్నాయి.