పవన్ ఇంటికి బాబు వెళ్ళకుండా వుండాల్సిందా?

      పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్ళడాన్ని పలువురు తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి నాయకుడు అవసరమైతే పవన్ కళ్యాణ్‌నే తన దగ్గరకి పిలిపించుకోవాలే తప్ప తాను పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడమేంటని బాధపడుతున్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌తో ఎంత అవసరం వుంటేమాత్రం ఇలా మెట్టు దిగడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని కలవటానికి గుజరాత్ వరకు వెళ్ళాడు. అలాంటిది చంద్రబాబు నాయుడిని కలవటానికి హైదరాబాద్‌లో చంద్రబాబు ఉన్నచోటికి రాలేడా అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏరకంగా చూసినా నరేంద్రమోడీ కంటే ఎక్కువ స్థాయి నాయకుడన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇంట్లో 'టీ' తాగిన చంద్రబాబు

      నిన్నటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎడమొహం పెడమొహంగా వున్నారని అందరూ అనుకున్నారు. నిన్న మోడీ సభలో కూడా చెరోవైపు చూస్తూ వుండటంతో ఇద్దరి మధ్య గ్యాప్ పోలేదని చాలామంది అనుకున్నారు. అయితే ఈ అనుకోవడాలకి ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఇద్దరూ వున్నట్టున్నారు. అందుకే ఇద్దరూ సమావేశమయ్యారు. చంద్రబాబు పెద్ద మనసు చేసుకుని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి, ఆయన ఇంట్లో వేడివేడిగా కాచిన టీ తాగారు. టీయే తాగారని ఎలా తెలుసు? కాఫీ తాగి వుండొచ్చు కదా అనే సందేహం రావొచ్చు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి ‘తేనీటి విందు’కు వెళ్ళారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీ తాగాక ఇద్దరూ తమమధ్య వున్న గ్యాప్‌ను తొలగించుకోవడానికి చర్చలు జరిపినట్టు సమావేశం. మోడీ కోరినందువల్లే వీరిద్దరూ ఇలా కలసి టీ తాగారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

అక్క పురందేశ్వరికి బాలకృష్ణ రాజంపేటలో ప్రచారం చేయడంట!

      గత ఎన్నికల సమయంలో బాలకృష్ణ అక్కయ్య దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో వున్నారు. బాలకృష్ణ గురించి చెప్పేదేముంది పక్కా తెలుగుదేశం. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా తన అక్క అత్తగారి ఊరు కారంచేడు వెళ్ళి, అక్కయ్య ఇంటిముందు నిల్చుని తొడ కొడితే రాష్ట్రంలో సంచలనం రేగింది. అయితే పురందేశ్వరి మాత్రం తమ్ముడి తొడకొట్టుడుని లైట్‌గా తీసుకుని తమ్ముణ్నే వెనకేసుకుని వచ్చారు.   ఫ్లాష్ బ్యాక్ ఇలా వుంటే, తాజాగా పురందేశ్వరి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి భారతీయ జనతాపార్టీ నుంచి పోటీలో వున్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ పొత్తు వుండటంతో బాలకృష్ణ రాజంపేట వెళ్ళి అక్కడ అక్కకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నారు. ఇలా ప్రచారం చేయడం ద్వారా గతంలో తాను అక్క ఇంటి ముందు తొడకొట్టిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని అందరూ భావించారు. అయితే బాలకృష్ణ అలాంటిదేమీ చేయడం లేదని తెలుస్తోంది. రాష్ట్రమంతటా ప్రచారం చేస్తున్న బాలకృష్ణ రాజంపేట మాత్రం తన ప్రచారం రూట్లో లేదని చెబుతున్నాడు. తెలుగుదేశం వర్గాలు చెప్పేదాని ప్రకారం బాలకృష్ణ రాజంపేటలో ప్రచారం చేయరు. దీనికి కారణం చంద్రబాబు బాలకృష్ణని కట్టడి చేయడమేనని తెలుగుదేశంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కి టిడిపితో అవసరం లేదేమో: బాలయ్య

      నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మీద మరోసారి మాటల బాణాలు వేశారు. తెలుగుదేశానికి ప్రచారం చేయాలంటూ తాము ఎవరినీ బొట్టు పెట్టి పిలవమని, అది ఎవరైనా కావొచ్చని పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశించి ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం లేదంటే ఆయనకి తెలుగుదేశం పార్టీతో అవసరం లేదని భావిస్తున్నామని ఆయన అన్నారు. తమను వద్దనుకునేవాళ్ళ వెంటపడే అలవాటు లేదని బాలకృష్ణ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి స్టార్లు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక్క స్టార్ చంద్రబాబు నాయుడు అని బాలకృష్ణ బావని పొగిడారు. తాను పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి కొట్టని కోట అని బాలకృష్ణ ధీమాగా చెప్పారు.

అధికారం ఇవ్వకుంటే రెస్ట్ తీసుకుంటా: కేసీఆర్

      కేసీఆర్ మాట తీరు గురించి అందరికీ తెలిసిందే. నోరు విప్పాడంటే చాలు విచిత్రమైన మాటలే నోట్లోంచి వస్తూనే వుంటాయి. సీమాంధ్రులు వినలేక చెవులు మూసుకోవాల్సిన మాటల తూటాల్ని వదలటంలో ఆయనకి ఆయనే సాటి. లేటెస్ట్ గా ఆయన సీమాంధ్రులను తిట్టడంతోపాటు తెలంగాణ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసేవిధంగా కూడా మాట్లాడుతున్నారు. మీరు చచ్చినట్టు తెరాసకే ఓటేయాలని బెదిరించినట్టుగా చెబుతున్నారు.   టీఆర్ఎస్‌కి 90 సీట్లు వస్తాయని బిల్డప్పు కోసం చెబుతున్నప్పటికీ తన పార్టీకి అంత సీన్ లేదని టీఆర్ఎస్ అధినేతకి అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలు తన మాటలను నమ్మడం లేదని తెలుసుకున్న ఆయన ఇప్పుడు తనకే ఓటేయాలన్నట్టుగా బ్లాక్ మెయిలింగ్ చేస్తునారు. తనకు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానని, అధికారం ఇవ్వకపోతే రెస్ట్ తీసుకుంటానని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఇది బెదిరింపో, దేబిరింపో అర్థంకాక తెలంగాణ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. టీఆర్‌ఎస్‌కి అధికారం ఇచ్చినా కేసీఆర్ రెస్ట్ తీసుకుంటాడని అనుకుంటున్నారు.   టీడీపీ, బీజేపీ కూటమికి తెలంగాణలో విశేష ఆదరణ  లభిస్తూ వుండటంతో కేసీఆర్‌కి వణుకుపుట్టి ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అయితే కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్‌ని పట్టించుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని పరిశీలకులు చెబుతున్నారు.

తెరాసను మోడీ ఎందుకు ఉపేక్షించినట్లో!

  నిన్న తెలంగాణాలో నరేంద్ర మోడీ పాల్గొన్న నాలుగు సభలలో కూడా ఆయన నేరుగా కేసీఆర్ లేదా తెరాస పార్టీ పేరు పెట్టి విమర్శలు చేయలేదు. ఆయన కేవలం ‘తండ్రీకొడుకుల రాజ్యం’, ‘మామా అల్లుళ్ళ రాజ్యం’ కూడదని మాత్రమే అన్నారు. అంతకు మించి కేసీఆర్, తెరాసలపై ఆయన పెద్దగా విమర్శలు చేయలేదు. నరేంద్ర మోడీ ప్రచారంపై స్థానిక బీజేపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ఆయన తామెవరమూ ఎదుర్కోలేని కేసీఆర్ ను గట్టిగా ఎదుర్కొని తమకు కొండంత బలం కలిగిస్తారని ఆశపడ్డారు. కానీ మోడీ ‘కేసీఆర్’, ‘తెరాస’ పదాలు కూడా ఎక్కడా పలకకకుండా చాలా జాగ్రత్తపడ్డారు.   తెలంగాణాలో 1100 మంది విద్యార్ధులు చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బలంగా నొక్కి చెప్పిన మోడీ, తెలంగాణా కోసం తమ పార్టీ నేతలు చేసిన ఉద్యమాలు గురించి మాట్లాడలేదు. నిజానికి ఆయన కంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం, బీజేపీ తరపున గట్టిగా మాట్లాడారని చెప్పవచ్చును. అయితే తమ పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పనిగట్టుకొని మరీ వచ్చిన మోడీ, ఎందుకు ఈవిధంగా వ్యవహరించారు? అని ఆలోచిస్తే కొన్ని బలమయిన కారణాలు కనబడతాయి.   1.ఈ ఎన్నికలలో తెలంగాణాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చని ఆయన వద్ద నివేదికలు ఉండి ఉండవచ్చును. అందువల్ల ఎన్నికల తరువాత తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగంటున్న కేసీఆర్ కు మద్దతు ఇచ్చి, అందుకు బదులుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెరాస యంపీల మద్దతు తీసుకొని, తను ప్రధాని కావాలనే కలను సాకారం చేసుకోవాలని మోడీ భావిస్తున్నందునే, కేసీఆర్, తెరాసలపై గట్టిగా విమర్శలు చేసి ఉండకపోవచ్చును. తెలంగాణా బీజేపీ నేతలు మొదటి నుండి కూడా తెదేపాతో కంటే తెరాసతో జత కట్టేందుకే మొగ్గు చూపుతున్నందున, ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి అవసరమయితే తెరాసకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ ఆలోచిస్తున్నందునే మోడీ తెరాసను ఉపేక్షించి ఉండవచ్చును.   2. ఇక తెరాస పట్ల ఈ మాత్రమయినా సానుకూలత చూపినట్లయితే, ఎన్నికల తరువాత వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకుండా నిలువరించవచ్చును.   3. దేశంలో మోడీ ప్రభంజనం ఉందని భావిస్తున్నా అది ప్రధానంగా ఉత్తర భారతంలోనే ఎక్కువగా కనిపిస్తోంది తప్ప దక్షిణాదిన అంతగా లేదు. కారణం భాష అవరోధం, ప్రాంతీయ పార్టీల ప్రాభల్యం అధికంగా ఉండటమే. తెలంగాణా కూడా అందుకు మినహాయింపు కాదు. తెలంగాణా సెంటిమెంటు ముందు మోడీ ప్రభంజనం పెద్దగా ప్రభావం చూపక పోవచ్చును. అందువల్ల స్వయంగా తానే వచ్చి ప్రచారం చేసినా, అవి బీజేపీ అభ్యర్ధుల విజయావకాశాలను మెరుగు పరచలేవు. తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా క్రెడిట్, మంచి ఆర్ధిక, అంగ బలం, ప్రజలలో ఉన్న గుర్తింపు వగైరాలు గల కాంగ్రెస్, తెరాస అభ్యర్ధులతో పోలిస్తే బీజేపీ అభ్యర్ధులు అన్ని విధాల తేలిపోతున్నారు. ఈసంగతి మోడీకి తెలియదని భావించలేము. బహుశః అందువల్లే ఆయన తెరాసతో బాటు స్వంత పార్టీ పట్లకూడా ఉదాసీనంగా వ్యవహరించారు.   అందువల్ల ఇకపై బీజేపీ అభ్యర్ధులు తమ స్వశక్తితోనే కాంగ్రెస్, తెరాసలను ఎదుర్కొని గెలిచే ప్రయత్నాలు చేసుకోవలసి ఉంటుంది. తెదేపా అభ్యర్ధులలో చాలా మంది స్వయంశక్తితోనే గెలువగల సమర్ధులు, అలా గెలవలేనివారి తరపున ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఉండనే ఉన్నారు.

పవన్ చెప్పిన ఆ మూడు ముక్కలు

  ఈరోజు మోడీతో కలిసి రెండు బహిరంగ సభలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ప్రధానంగా మూడు విషయాలు బలంగా చెప్పారు. 1. తెరాస యొక్క వేర్పాటువాదాన్ని బలంగా ఖండించడం. 2. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టమని పిలుపు ఈయడం. 3. దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరమని గట్టిగా చెప్పడం.   తెరాస నేతలు, ముఖ్యంగా కేసీఆర్ ఎన్నికలలో గెలిచేందుకు చేస్తున్న విద్వేష ప్రచారం, అందుకు వారు ఎంచుకొన్న అసభ్యకరమయిన బాష పట్ల పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. అధికారం కోసం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడినా, వ్యహరించినా సహించబోనని హెచ్చరించారు. అయితే ఇటువంటి హెచ్చరికలను తెరాస నేతలు ఖాతరు చేసే స్థితిలో లేరనే సంగతి ఆయనకీ తెలిసే ఉండాలి. అటువంటప్పుడు పవన్ ఇటువంటి హెచ్చరికలు చేయడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. సరికదా తిరిగి వారే ఆయనకు తీవ్రమయిన హెచ్చరికలు చేయడం, ఆయనపై అందరూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టవచ్చును.   అయితే పవన్ ఒక సామాజిక స్పృహ గల పౌరుడిగా ఆవిధంగా హెచ్చరించడంలో తప్పులేదని చెప్పవచ్చును. రాజకీయాలలో విలువలు ఎన్నడో పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పుడు తెరాస నేతలు బాషను కూడా మరింత దిగజార్చుకొని ‘మోడీ బీడీ’ ‘ పనికి రాని సన్నాసులు’ వంటి పదాలతో సభ్యసమాజం తల దించుకొనేలా మాట్లాడుతున్నారు. అందుకే పిల్లి మెడలో గంట కట్టేందుకు ఎవరు సాహసించకపోవడంతో, నేడు పవన్ కళ్యాణ్ ఆపని చేయవలసి వచ్చింది.   ఇక పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పట్ల తనకున్న వ్యతిరేఖతను ఎన్నడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడూ చేయలేదు. కారణం కాంగ్రెస్ పాలనలో పొంగి పొర్లుతున్న అంతులేని అవినీతి, వంశ పారంపర్య పరిపాలన. అందుకే ఆయన నేరుగా రాహుల్ గాంధీ పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక సాధారణ క్రికెట్ ఆటగాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలంటే అనేక స్థాయిల్లో ఆది తన ప్రతిభ నిరూపించుకోవలసి ఉంటుంది. కానీ 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి కీలకమయిన ప్రధాని పదవి చెప్పట్టేందుకు, రాహుల్ గాంధీ కేవలం తన గాంధీ, హ్రూ వంశంలో పుట్టడమే ఒక అర్హతగా భావిస్తున్నారని ఎద్దేవా చేసారు. రాహుల్ ఎటువంటి అనుభవము, సామర్ధ్యము, తెలివితేటలు లేకుండా దేశానికి ప్రధాన మంత్రి అయిపోదామని కలలు కంటే మాత్రం ప్రజలు అంగీకరించరని ఈసభలో మరోమారు స్పష్టంగా చెప్పారు. అవినీతిలో కూరుకుపోయి, వంశ పారంపర్య పాలనను ప్రజల నెత్తిన రుద్దుతున్న కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టి దేశాన్ని రక్షించు కోవాలని ఆయన మరోమారు నినదించారు.   గుజరాత్ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపించిన కారణంగానే అక్కడి ప్రజలు మోడీకి వరుసగా మూడుసార్లు పట్టం కట్టారని దృడంగా నమ్ముతున్న పవన్ కళ్యాణ్ అదే మాటను నేడు కూడా మరోమారు గట్టిగా చాటి చెప్పారు.

తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం: పవన్

      ప్రత్యేక తెలంగాణ కోసం యువకులు బలిదానాలు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నిజామాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్ పైన విమర్శల వర్షం కురిపించారు. మేం పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని కొందరు చెబుతున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన శ్రవణ్‌కు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కులాల ప్రాతిపదికనే టిక్కెట్లు ఇస్తారా? అంటూ పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావుకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వలేదని, అలాంటిది తెలంగాణ ప్రజలపై అభిమానం ఉంటుందా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ-టీడీపీ కూటమికే ఓటు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

మోడీ ప్రసంగంలో కేసీఆర్ ప్రసక్తి లేదేమిటి?

  ఈరోజు నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్, మోడీ ఇద్దరూ తమ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కేసీఆర్ కుటుంబంపై కూడా విమర్శలు గుప్పించారు, కానీ మోడీ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్, తెరాసల ప్రసక్తి రాకుండా జాగ్రత్త పడటం గమనార్హం. తెలంగాణాను బీజేపీ చేతుల్లో పెడితే అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు తప్ప ‘కాంగ్రెస్, తెరాసలను ఓడించి తెదేపా-బీజేపీ కూటమికే ఓటేయండి!’ అని నేరుగా ఆయన పిలుపు ఈయకపోవడం చాలా ఆశ్చరయం కలిగించింది. అదే నిన్న రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకొని ప్రసంగించి, అటువంటి నమ్మక ద్రోహికి ఓటేయవద్దని, కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని గట్టిగా చెప్పారు. కానీ, తెరాసపై యుద్ధం ప్రకటిస్తారనుకొన్న మోడీ మాత్రం తన ప్రసంగంలో అసలు కేసీఆర్, తెరాసల ఊసే లేకుండా ముగించడం విశేషమేనని చెప్పుకోవచ్చును. ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బహుశః తెరాస మద్దతు కూడా అవసరం ఉంటుందనే ఆలోచనతోనే, కేసీఆర్, తెరాసపై విమర్శలు చేయకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడి లౌక్యం ప్రదర్శించినట్లు కనబడుతోంది. కానీ ఆయన కేసీఆర్, తెరాసను ఉపేక్షిస్తే, తెదేపా-బీజేపీ కూటమికి ఆశించిన ప్రయోజనం దక్కదు. అందువల్ల ఆయన ఈరోజు హాజరయ్యే మిగిలిన మూడు సభలలో కేసీఆర్,తెరాసలపై విమర్శలు గుప్పిస్తారా? లేక ఆ పనిని చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డిలకు అప్పగించి తాను లౌక్యంగా తప్పుకొంటారా? చూడవలసి ఉంది. మొదటగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, తాను ఎన్నికల రాజకీయాలు చేయడానికి ఈ సభకు రాలేదని స్పష్టం చేసారు. కానీ, మోడీ ప్రసంగం చూస్తే, ఆయన ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారా? అనే అనుమానం కలుగక తప్పదు.

పవన్ మాటలు హత్తుకున్నాయి: మోడీ

      నిజామాబాద్ లో బిజెపి నిర్వహించిన భారత్ విజయ ర్యాలీ బహిరంగసభలో మాట్లాడిన నరేంద్రమోదీ..తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికలకు చాలా కీలకమని గుర్తు చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వుండాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైన వుందని మోడీ అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది ప్రాణాలు కోల్పోయారు... వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోతను తాము తీరుస్తామని మోదీ హామీ ఇచ్చారు.   టీఆర్ఎస్ పార్టీపైన మోదీ విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలు దేశానికి అరిష్టమని వ్యాఖ్యానించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పోటీ చేస్తుంటే నిలదేసే ధైర్యం లేదా అంటూ టీఆర్ఎస్‌పై పరోక్ష విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రజలను మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే సమయంలో తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిందని, అయితే తెలుగు స్ఫూర్తి, తెలుగు సంస్కృతి అనే తల్లిని మాత్రం చంపేసిందని విమర్శించారు. ఆ సమయంలో తానెంతో బాధపడ్డానని, ఆ సమయంలో తనను పవన్ కళ్యాణ్‌ కలిశాడని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ని చూసి తనలో వున్న బాధ తగ్గిందని, పవన్ కళ్యాణ్ మాటలు తనను హత్తుకున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ వంటి వారు తెలుగు స్ఫూర్తిని కాపాడగలరని పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పారు.          

మా ఆయన రాబర్ట్ వాద్రా చాలా మంచోడు: ప్రియాంక

    చాలా మంచోడయిన తన భర్త రాబర్ట్ వాద్రాను రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం కోసం ఆయన్ని అనవసరంగా తిట్టిపోస్తున్నాయని, చెడ్డవాడిలా చిత్రీకరిస్తున్నాయని సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తమీద రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న కామెంట్లు తనకెంతో బాధని కలిగిస్తున్నాయని ఆమె చెప్పారు.   రాజకీయ నాయకులు ఆధారాలు లేని ఆరోపణలతో తమ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ప్రియాంక అంటున్నారు. సోనియాగాంధీ పోటీ చేస్తున్న రాయబరేలిలో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక ఒక సభలో ఈతరహా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తన భర్తని, తన కుటుంబాన్ని ఎంత బలహీనపరచాలని చూసినా తమ కుటుంబం అంత స్ట్రాంగ్ అవుతుందన్న ధీమాని ప్రియాంక వ్యక్తం చేశారు. మా అమ్మ ఈ దేశంలో పుట్టకపోయినా ఆమెను ఈ దేశ ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారు. ఈ దేశంలో వున్న గొప్పతనం ఇదే అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో తాను తన తల్లి సోనియాగాంధీకి ఓటు వేయమని అడగనని, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఓటు వేయండని అడుగుతానని ప్రియాంక రాయబరేలి ఓటర్ల సెంటిమెంట్ మీద గురిచూసి కొట్టేలా మాట్లాడారు.  

పవన్ కళ్యాణ్‌ని పొగిడిన నరేంద్ర మోడీ

  నిజామాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే సమయంలో తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిందని, అయితే తెలుగు స్ఫూర్తి, తెలుగు సంస్కృతి అనే తల్లిని మాత్రం చంపేసిందని విమర్శించారు. ఆ సమయంలో తానెంతో బాధపడ్డానని, తెలంగాణ వచ్చింది కానీ, తల్లి చనిపోయిందన్న బాధలో తాను వున్న సమయంలో తనను పవన్ కళ్యాణ్‌ కలిశాడని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ని చూసి తనలో వున్న బాధ తగ్గిందని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వుంటే తెలుగు సంస్కృతి, తెలుగు స్ఫూర్తి చనిపోవని ఆయన అన్నారు.

బలిదానాల వల్లే తెలంగాణ వచ్చింది: నరేంద్ర మోడీ

  తెలంగాణ మేం ఇచ్చాం.. మేం తెచ్చాం అని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు చెప్పుకుంటున్నాయని, కానీ నిజానికి తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఆత్మ బలిదానాలేనని భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చందని కాదని ఆయన చెప్పారు. నిజామాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణను చిన్న శిశువుతో ఆయన పోల్చుతూ, ఆ శిశువును బాగా పెంచి పెద్ద చేసేవాళ్ళ చేతుల్లో పెట్టాలని, అది చాలా ముఖ్యమని అన్నారు. ఆ బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ చేతిలో ఈ తెలంగాణ బాలుడిని పెడితే కాంగ్రెస్ ఆ బాలుడిని ఎదగనివ్వదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ 11 వందల మంది బలిదానం చేసుకునేవరకూ తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మితే దారుణంగా మోసపోతారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ బిడ్డ టి.అంజయ్యని అవమానించిన చరిత్ర రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీకి వుందని మోడీ గుర్తు చేశారు. ఈ కుటుంబానికి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల్ని మరింత అవమానిస్తారని అన్నారు. తెలంగాణ బిడ్డ అయిన పీవీ నరసింహరావును ఆయన చనిపోయిన తర్వాత కూడా దారుణంగా అవమానించిన చరిత్ర గాంధీ కుటుంబానికి వుందని ఆయన చెప్పారు. దేశంలో పీవీ నరసింహరావు పేరు కనిపించకుండా చేసిన దుర్మార్గం గాంధీ కుటుంబానిదని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ఎంతో కీలకమైనవని, వారి భవిష్యత్తు ఎలా వుండాలో నిర్ణయించకోవాల్సింది వారేనని నరేంద్ర మోడీ అన్నారు.

హేమమాలిని ఏం చదువుకుంది? – మధురలో కరపత్రాలు!

  ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా సినీ నటి హేమమాలిని పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో మిగతా పార్టీల అభ్యర్థుల కంటే హేమమాలిని ప్రచారంలో ముందున్నారు. ఇదిలా వుంటే సోమవారం నాడు హేమమాలిని మీద గుర్తుతెలియని వ్యక్తులు ప్రచురించిన కరపత్రాలు సంచలనం సృష్టించాయి. దినపత్రికతో పాటు పంపిణీ చేసిన ఈ కరపత్రాల్లో హేమమాలిని ఏం చదువుకుందని? మధుర ఎంపీగా ఎంపిక కావడానికి ఆమెకున్న విద్యార్హతలేమిటని ఆ కరపత్రాల్లో ప్రచురించారు. సదరు కరపత్రాలు ఎవరు ముద్రించారన్న సమాచారం వాటిలో లేదు. ఈ కరపత్రాలు ఎవరు ప్రచురించారో పరిశోధించి తెలుసుకుని వారిమీద చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కరపత్రాలు అందుకున్న మధుర ఓటర్లు ఇంతకీ హేమమాలిని ఎంతవరకు చదువుకుంది? అసలు చదువుకుందా లేదా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

చప్పగా సాగిన పవన్ కళ్యాణ్ స్పీచ్

  నిజామాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో చప్పగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులతోపాటు బీజేపీ వర్గాలను కూడా నిరాశపరిచాడు. మెల్లమెల్లగా, ఒక్కోమాట, సాగదీస్తూ మాట్లాడిన పవన్ ప్రసంగం సభలో వున్న వారికి బోర్ కొట్టించింది. పవన్ మాట్లాడినంతసేపూ తన గురించి ఎక్కువగా చెప్పుకోవడంతో సరిపోయింది. మాట్లాడ్డానికి మాటలే లేనట్టు గత మీటింగ్స్ లో చెప్పిన మాటలు చెబుతూ విసుగెత్తించాడు. మాట్లాడినంతసేపూ తన ముందు వున్న కాగితాలు చదువుతూ బోరు కొట్టించాడు. ఒక దశలో అయితే చేతిలోకి కాగితాలు తీసుకుని ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని బట్టీ పట్టినట్టు చదివేశాడు. కాసేపు టీఆర్ఎస్‌ని, కాసేపు కాంగ్రెస్‌ని తిట్టిన పవన్ కళ్యాణ్ మరి కాసేపు మోడీని పొగిడాడు. అయితే ఏ దశలోనూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఎంతమాత్రం ఆకట్టుకునేలా లేదని పరిశీలకులు అంటున్నారు. పవన్ మాట్లాడిన మాటలు ఆయనకు రాజకీయాల పట్ల అపరిపక్వత స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ఉత్తేజభరితంగా మాట్లాడి ఓట్లు రాలేలా చేస్తాడని ఆశించిన బీజేపీ నాయకులు పవన్ మాట్లాడిన తీరు చూసీ డీలా అయిపోయారు. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల వల్ల సచిన్ టెండూల్కర్ అభివృద్ధిలోకి వచ్చాడని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు అందరూ నోళ్ళు తెరిచారు.

పవన్ కళ్యాణ్ స్పీచ్ : టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసిన పవర్‌స్టార్

  నిజామాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్‌ని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలకు ప్రధాన కారణం టీఆర్ఎస్‌ అని అన్నారు. టీఆర్ఎస్‌లో కుటుంబ పాలన ముదిరిపోయిందని చెప్పారు. 32 పేజీల టీఆర్ఎస్ మేనిఫెస్టోలో బోలెడన్ని వాగ్దానాలు చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ తెలంగాణలో వస్తే వాటిని నెరవేర్చే సత్తా ఆ పార్టీకి లేదన్నారు. కేసీఆర్ నోరు వేసుకుని ప్రతి ఒక్కరినీ తిడుతూ వుంటే అది తెలంగాణకు నష్టం చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. టీఆర్ఎస్‌కి అధికారం ఇస్తే తెలంగాణ 20 ఏళ్ళు వెనక్కి వెళ్తుందని చెప్పారు. తనను టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు తెలంగాణలో పుట్టలేదని అంటూ వుంటారని, తాను తెలంగణలో పుట్టకపోయినా తెలంగాణ తనకు జీవితం ఇచ్చిందని ఆయన అన్నారు. పీఆర్పీకి ప్రచారం చేస్తున్న సమయంలో తనకు హై టెన్షన్ వైరు తగిలినా బతికానని, కొండగట్టు ఆంజనేయ స్వామి దయవల్లే బతికానని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం తనకు స్ఫూర్తి అన్నారు. అందర్నీ బూతులు తిట్టే కేసీఆర్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ అధోగతి పాలు అవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం కాదని.. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలని అన్నారు.

వైకాపా దొంగలపార్టీ : ప్రచారంలో బాలకృష్ణ గర్జన

   శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రచారం ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ ప్రచారంలో సింహ గర్జన చేస్తున్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌ల మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. నిన్న శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీద ఘాటైన విమర్శలు చేసిన బాలకృష్ణ మంగళవారం నాడు జగన్ పార్టీని ఏకంగా దొంగలపార్టీ అని విమర్శించారు. జగన్ పార్టీ ప్రజలని ఇంకా దోచుకోవడానికే రాజకీయాల్లో వుందని అన్నారు. తెలుగుదేశం వ్యతిరేక పార్టీలను అణిచేస్తానని ఆయన చాలా స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. అసలే ‘లెజెండ్’ విజయానందంలో వున్నాడేమో బాలకృష్ణ మహా ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. బాలకృష్ణ దూకుడు చూసి తెలుగుదేశం వర్గాలు మురిసిపోతున్నాయి.