అందరి కళ్ళూ హిందూపురం బాలకృష్ణ మీదే!

      శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ పండుగ అంగరంగ వైభవంగా మొదలు కానుంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ, దేశంలో  ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమనే విషయం తేలిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్న విషయం కూడా క్లియర్‌గా వుంది. తెలంగాణలో హంగ్ ఏర్పడి తెలుగుదేశం, బీజేపీ కూటమి కింగ్ మేకర్‌గా మారే అవకాశం వుందన్న విషయం కూడా స్పష్టంగా వుంది.   అయితే ఇప్పుడు రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గం కూడా వుంది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి ప్రచారం మాత్రమే చేసిన బాలక‌ృష్ణ ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల బరిలోకి కూడా దిగారు. ఇప్పుడు అందరి దృష్టి ఆయనమీదే వుంది. హిందూపురం నందమూరి వంశానికి పెట్టని కోటలా వుంది. ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేసి విజయాలు సాధించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తాన్న నమ్మకం అందరిలోనూ వుంది. అయితే ఇప్పుడు అందరూ బాలక‌ృష్ణ వైపు చూస్తున్నది అయన విజయం సాధిస్తారా.. లేదా అనే విషయం మీద కాదు.. బాలకృష్ణ ఎంతటి సంచలన విజయం సాధిస్తారన్న విషయం మీదే. బాలకృష్ణ సాధించబోయే మెజారిటీ మీదే ఇప్పుడు అందరి ద‌ృష్టీ కేంద్రీక‌‌ృతమై వుంది. బాలక‌‌ృష్ణ హిందూపురం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలుస్తారన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వారి నమ్మకం నిజం కావడానికి ఎంతో సమయం లేదు. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

లగడపాటివి ఉత్తుత్తి సర్వేలు: వైఎస్సార్సీపీ

      సర్వేల స్పెషలిస్టు లగడపాటి రాజగోపాల్ తాను చేయించిన సర్వేల ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సర్వేల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. ఆయన అలా చెప్పినప్పటి నుంచి జగన్ పార్టీ ఆయన మీద మాటల దాడి చేస్తూనే వుంది. తాజాగా జగన్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు లగడపాటి సర్వేలు ఉత్తుత్తి సర్వేలని తేల్చిచెప్పారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే ఏ సంస్థలో చేయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అంబటి చెప్పారు. లగడపాటి సర్వేను నమ్మి ఎవరూ పందాలు కాయొద్దని అంబటి సూచించారు. జాతీయ సంస్థలన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని వెల్లడించాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల మధ్య నెలరోజుల సమయం ఉందని, ఆ సమయంలో చాలా మార్పులు జరిగాయని అంబటి పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు తాము పోటీ చేయలేమంటూ చేతులెత్తేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 110కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

గెలుపు కలలు కంటున్న కేసీఆర్ కుమార్తె కవిత

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాను నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తానని కలలు కంటున్నారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని కూడా మరో కల కంటున్నారు. గురువారం కవిత మాట్లాడుతూ, తాను నిజామాబాద్ లోక్‌సభ ఎంపీగా విజయం సాధించడం ఖాయమని, అలాగే టీఆర్ఎస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. అలాగే కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా దానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని కవిత చెప్పారు. తమ పార్టీ మూడో కూటమికే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అయితే నిజామాబాద్‌లో కవిత గెలవటం కష్టమేనన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

టీడీపీ అధికారంలోకి రావాలి: బొత్స సంచలనం

      ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, చీపురుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విచిత్రంగా ప్లేటు ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే జగన్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని కూడా చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్స ఆ పదవి పోయిన తర్వాత తన చీపురుపల్లి నియోజకవర్గానికే పరిమితమైపోయారు. రాష్ట్ర స్థాయిలో మీడియా ముందుకు రావడం మానేశారు. తన చీపురుపల్లిలో తన చీపురు విరిగిపోకుండా చూసుకోవడంలో బిజీగా వున్నారు. రాష్ట్ర విభజన విషయంలో తెలుగు ప్రజలను మోసం చేసేలా వ్యవహరించిన బొత్స ఈసారి చీపురుపల్లిలో గెలవటం డౌటేనన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇలా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

89 ఏట పెళ్ళి చేసుకున్న ఎన్.డి.తివారీ తాతయ్య

  కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్ తివారీ తన 89వ యేట మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. ఒకప్పటి సహచారిణి, రోహిత్ శేఖర్ తల్లి అయిన ఉజ్వలా శర్మ(62)ను ఆయన గురువారం లక్నోలో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత ఉజ్వలా శర్మ మీడియాతో మాట్లాడుతూ, వివాహ ప్రతిపాదనను తివారీ తన ముందుకు తెచ్చారని, ఈ వేడుక కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే జరిగిందని తెలిపారు. ఇన్నాళ్ళకైనా తనను తివారీ పెళ్ళి చేసుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఉజ్వల కొడుకు రోహిత్ శేఖర్ 2008లో తనను కొడుకుగా గుర్తించాలని ఎన్డీ తివారీపై ఢిల్లీ హై కోర్టులో దావా వేశాడు. తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభియోగాన్ని ఖండించటమే గాక, డిఎన్ఏ పరీక్షకు కూడా మొదట అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ విజయం సాధించాడు. ఇటీవలే రోహిత్ శేఖర్ తన కుమారుడేనని తివారీ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతని తల్లి ఉజ్వలా శర్మను తివారీ వివాహం చేసున్నట్లు తెలుస్తోంది. ఎన్డీ తివారీ 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. ఆ సమయంలోనే కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తివారీ తరచూ వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో షేర్ సింగ్ కూతురు ఉజ్వలా శర్మకు తివారీకి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి రోహిత్ శేఖర్ జన్మించాడు. కాగా, ఎట్టకేలకు వీరిద్దరూ పెళ్లితో మళ్లీ ఒక్కటయ్యారు.

రోడ్డు ప్రమాదంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్‌‌కి గాయాలు

  ప్రఖ్యాత భారతీయ నటీమణి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కపూర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. బోనీకపూర్ తన మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ హీరోగా ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకుని బోనీ కపూర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ని ఢీకొంది. దాంతో బోనీ కపూర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. బోనీ కపూర్‌తోపాటు కారులోనే ప్రయాణిస్తున్న ఆయన సహాయకులు ఇద్దరికి, డ్రైవర్‌కి కూడా స్వల్ప గాయాలయ్యాయి. బోనీకపూర్ వీపు మీద స్వల్స గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది.

నేడు టెన్త్ క్లాస్ ఫలితాలు

      పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డి-బ్లాకులోని కాన్ఫరెన్స్ హాలులో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్, మాధ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ మీడియా సమావేశంలో ఫలితాల 'సీడీ' ని విడుదల చేస్తారు. ఆన్‌లైన్‌, మీ సేవా కేంద్రాల నుంచి కూడా మార్కుల లిస్టులను పొందేందుకు ఏర్పాట్టు చేశారు. బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. సైతం ఐ.వి.ఆర్‌.ఎస్‌, ఎస్‌.ఎం.ఎస్‌.ల ద్వారా ఫలితాలను పొందేందుకు వీలు కల్పించింది. ఈ ఫలితాలను వెబ్‌సైట్లలో కూడా పొందవచ్చు.   To know results from the websites: * http://examresults.ap.nic.in * http://results.cgg.gov.in * www.apit.ap.gov.in * www.results.educationandhra.com * www.resumedropbox.com, * www.indiaresults.com * www.vidyavision.com * www.ExamResults.net * www. nettlinxresults.net * www.manabadi.com * www.manabadi.co.in * www.results.manabadi.co.in * www.schools9.com * www.exametc.com * http://results.webdunia.com * www.bharatstudent.com * www.kabconsultants.com * www.educationgateway.com * www.AndhraEducation.net * www.results.andhraeducation.net * www.educationandhra.com * www.betechs.com * www.koshercomm.in * www.resultsindia.in * www.educationplus.co * www.PsddOrFail.in * www.asmalldream.org * www.manachaduvu.com * www.vidyavision.co.in * www.vnssolutions.in * www.iitjeeforum.com 

బీజేపీకి పెరుగుతున్న మద్దతు

  ఆంధ్ర, తెలంగాణాలలో ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో మాత్రం బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. తత్ఫలితంగా ఇంతవరకు బీజేపీతో మైల పాటించిన అనేక పార్టీలు, తమ కుహానా సెక్యులర్ ముసుగులను పక్కన పడేసి కేంద్రంలో స్థిరమయిన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి సహకరిస్తామని ప్రకటిస్తున్నాయి. ఒరిస్సాలో బిజూ జనతా దళ్, మహారాష్ట్రలో మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన, తమిళనాడులో అన్నాడీయంకే, చివరికి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన నేషనలిస్‌‌ట కాంగ్రెస్‌ పార్టీ తదితర పార్టీలు కూడా ఎన్డీయేకి మద్దతు ఇచ్చేందుకు సంసిద్దత ప్రకటించాయి. ఎన్డీయే కూటమి స్వయంగా 300 సీట్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్తగా ఇతర పార్టీల మద్దతు స్వీకరించేందుకు తాము సిద్దమని బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం 25 పార్టీలున్నాయి. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎన్డీయే కూటమిలో చేరే పార్టీల, స్వతంత్ర యంపీల జాబితా మరింత పెరుగవచ్చును.ఇంతవరకు మోడీని, బీజేపీను బూచిగా చూపిస్తూ కుహనా లౌకిక వాదంతో పబ్బం గడుపుకొన్న కాంగ్రెస్ పార్టీకి మున్ముందు గడ్డు రోజులు ఎదురవవచ్చును.

యు.పి.ఎ. నిర్ణయాలను సమీక్షిస్తాం: వెంకయ్య నాయుడు

      దేశంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ఈ విషయంలో తమకు ఎలాంటి సందేహం లేదని భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవినీతి కూపంలో నెట్టేసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఎన్టీయే ప్రభుత్వం సమీక్షించే అవకాశం వుందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ తన బాధ్యతని సమర్థంగా నిర్వహించాలేదని వెంకయ్య నాయుడు అన్నారు.

ఏపీఎస్ఆర్టీసీని ముక్కలు చేసేశారు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్‌టిసి)ని విజయవంతంగా రెండు ముక్కలు చేసేశారు. గవర్నర్ నరసింహన్ గత కొద్ది రోజులుగా ఆర్టీసిని ఎలా ముక్కలు చేయాలా అని మంతనాలు చేస్తున్నారు. డిస్కస్ చేసీ చేసీ చివరికి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసికి వున్న బస్సుల్లో ఆంధ్రప్రదేశ్‌కి 10,352 బస్సులు ఇస్తారు. తెలంగాణకి 9,064 బస్సులు ఇస్తారు. అలాగే 70,231 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయిస్తారు. 63,479 ఉద్యోగులను తెలంగాణకు ఇస్తారు. 122 డిపోలు ఆంధ్రప్రదేశ్‌కి, 94 డిపోలు తెలంగాణకు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఆర్టీసీ జోన్లు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 3 ఆర్టీసీ జోన్లు ఏర్పాటు చేస్తారు.

భూమా శోభానాగిరెడ్డి కుమారుడి కారులో మంటలు

  భూమా శోభానాగిరెడ్డి కుమారుడి కారులో మంటలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్ళగడ్డ మాజీ శాసనసభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన సంఘటనను తెలుగు ప్రజలు మరచిపోలేకపోతున్నారు. తల్లి కారు ప్రమాదంలో మరణించిన విషాదం నుంచి భూమా శోభా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే విఖ్యాత్ రెడ్డి కూడా ఒక కారు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో విఖ్యాత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కలుగకపోవడం అదృష్టం. బుధవారం నాడు హైదరాబాద్‌లోని బేగంపేటలో విఖ్యాత్ రెడ్డి తన కారులో ప్రయాణిస్తూ వుండగా, కారు ఇంజన్‌లోంచి అకస్మాత్తుగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన విఖ్యాత్ రెడ్డి వెంటనే కారులోచి దిగిపోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారు ఇంజన్‌లో భారీగా రేగిన మంటల కారణంగా కారు బాయ్‌నెట్, కారు లోపలి భాగాలు కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన బాటసారులు మంటలను అదుపులోకి తెచ్చారు.

కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం

      తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. పని జరుగుతూ వుండగా వేడి నీరు మీద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురు సంస్థ ఉద్యోగులు. ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు. అయితే ఈ ఆరుగురికి చిన్నపాటి కాలిన గాయాలు అయ్యాయి తప్ప ప్రాణాపాయం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం అంటే ఏం జరిగిందో అని ప్రజలు భయపడతారని, అయితే ఇక్కడ జరిగింది అణు ధార్మికతకు సంబంధించిన ప్రమాదం కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు.

అభయ దోషులకు 20 ఏళ్ళ జైలు

      హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిపై అత్యాచారం కేసు (అభయ కేసు)లో దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐటీ ఉద్యోగిపై అత్యాచారం చేసిన దోషులు సతీష్, వెంకటేశ్వర్లుకు చెరో ఇరవై ఏళ్ళ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని 356, 342, 376డి సెక్షన్ల ప్రకారం ఈ శిక్ష ఖరారయింది. 2013 సంవత్సరం అక్టోబర్‌లో ఐటీ ఉద్యోగిపై అత్యాచారం జరిగింది. నిర్భయ చట్టం తర్వాత జరిగిన ఈ సంఘటనను పోలీసులు బాధితురాలి పేరు బయటకి తెలియకుండా అభయ కేసుగా పేర్కొంటూ వచ్చారు. ఈ కేసు విచారణ ఏడు నెలలపాటు జరిగింది. 21 మందిని సాక్షులుగా విచారించారు.

ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు... లోక్‌సభ స్పీకర్‌‌గా అద్వానీ?

      దేశ రాజకీయాలలో ఒకసారి చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. కేంద్రంలో ఎన్డీయే కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడగానే ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబునాయుడుని నియమించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. అలాగే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే ప్రధానమంత్రి మోడీకే ఎన్డీయే కన్వీనర్ బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచన కూడా వుంది. అయితే చంద్రబాబు ఆ పదవికి సంపూర్ణంగా న్యాయం చేస్తారన్న అభిప్రాయం ఎన్డీయే పార్టీల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సీనియర్ నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వాలనేదానిమీద కూడా చర్చ జరుగుతోంది. సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ వంటి నేతలకు అప్పగించే శాఖలు, బాధ్యతలపై బీజేపీలో అప్పుడే చర్చ మొదలైంది. అద్వానీని లోక్‌సభ స్పీకర్‌ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కేంద్ర రక్షణ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ను నియమించే సూచనలు కనిపిస్తున్నాయి.

సినీ ఫక్కీలో నైస్‌గా కోటి లూటీ

      పాట్నాలో కొంతమంది దొంగలు సినిమా స్టైల్లో కోటి రూపాయలు కొట్టేశారు. పాట్నా శివార్లలో వున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి కోటి రూపాయల నగదు వ్యాన్‌లో తరలిస్తూ వుండగా ఆ వాహనాన్ని ఎనిమిదిమంది దుండగులు అడ్డుకున్నారు. వాహనం ఆగగానే వ్యాన్‌లో వున్న డ్రైవర్, ఇద్దరు గార్డులు, బ్యాంకు ఉద్యోగి మీది దాడిచేసి గాల్లోకి కాల్పులు జరిపి వారిని బంధించారు. ఆ తర్వాత వ్యాన్‌లో వున్న డబ్బు పెట్టెని తీసుకుని పరారయ్యారు. పోయేవాళ్ళు ఖాళీగా పోకుండా గార్డ్ చేతిలో వున్న రైఫిల్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు. బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీవ్రంగా గాలించారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో డబ్బు పెట్టె దొరికింది. కాకపోతే అందులో డబ్బు లేదు.

పెళ్ళి చేసుకోమంటే విషం తాగిన ప్రియుడు

      ప్రేమనగర్ సినిమాలో ప్రియుడు ‘మధువు తాగనన్నాను.. విషం తాగమన్నావు’ అని పాడతాడు. హైదరాబాద్‌లో ఓ ప్రేమికుడు మాత్రం ‘పెళ్ళి చేసుకోమన్నావు.. విషం తాగుతున్నాను’ అని విషం తాగి చనిపోయాడు పెళ్ళి చేసుకొమ్మంటూ ప్రియురాలు పెట్టే టార్చర్ భరించలేక సత్యనారాయణ అనే వ్యక్తి వ్యక్తి విషం తాగి చనిపోయాడు. సత్యనారాయణకు ఆల్రెడీ పెళ్లయింది. ప్రైవేట్ జాబ్ చేసేవాడు. తన ఆఫీసులోనే పనిచేసే ఒక యువతిని ప్రేమించాడు. ప్రేమించావు కదా పెళ్ళి చేసుకో అని ఆమె చాలాకాలంగా ఒత్తిడి చేస్తోంది. ఈ విషయమై వీళ్ళిద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో విషం బాటిల్‌తో సత్యనారాయణ ఇంటికి వచ్చిన సదరు ప్రియురాలు ‘పెళ్లి చేసుకుంటావా.. విషం తాగమంటావా’ అంటు బెదిరించింది. దాంతో ఈ ప్రేమ వ్యవహారం అతని ఇంట్లో కూడా తెలిసిపోయింది. దీన్ని భరించలేకపోయిన సత్యనారాయణ తన ప్రియురాలి చేతిలో వున్న విషం బాటిల్ని లాక్కుని తానే తాగేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది.

కాంగ్రెస్ ఓటమి స్వయంకృతాపరాధమే

  సిపిఐ నేత కె.నారాయణ మీడియాతో మాట్లాడుతూ "తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని" జోస్యం చెప్పారు. "తెలంగాణాలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోవడం వారి స్వయంకృతాపరాధమేనని" ఆయన అన్నారు. కాంగ్రెస్ విషయంలో ఆయన మాటలు చాలా చేదుగా ఉన్నప్పటికీ అవి నూటికి నూరు పాళ్ళు నిజమని అంగీకరించక తప్పదు. ఎందుకంటే సోనియాగాంధీ ఎంతసేపు కూడా తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఏవిధమయిన ఎత్తులు వేయాలనే ఆలోచించారు తప్ప ఏనాడు తెలుగు ప్రజల భావోద్వేగాలను, వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు. ఆ ప్రయత్నంలోనే వరుసపెట్టి అనేక తప్పులు చేసుకొంటూ వెళ్ళిపోయారు. స్వంత పార్టీ నేతలను కాదని, కాంగ్రెస్ పార్టీని సవాలు చేస్తున్న కేసీఆర్, జగన్ లను అక్కున చేర్చుకొన్నారు. నమ్మదగని వ్యక్తులను నమ్ముకొని చేయకూడని పనిని, సమయం కాని సమయంలో చేసి చేతులు కాల్చుకొంది హస్తం పార్టీ. సీమాంధ్రలో పార్టీని, నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి, ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, పార్లమెంటరీ వ్యవస్థకు మాయని మచ్చగా రాష్ట్ర విభజన చేసింది. యావత్ దేశమంతా ఆ ఘోరకలిని చూసి నివ్వెరపోయింది. అందువలన ఆ ప్రభావం కేవలం ఆంధ్ర, తెలంగాణాలకే పరిమితమయిపోక యావత్ దేశ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ దోషిగా నిలబడింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఏనాడు బాధపడిందీ లేదు. పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. పైగా తెలంగాణాలో ఒకమాట, ఆంధ్రాలో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్, జగన్ లతో రహస్య ఒప్పందాలు చేసుకొని, పైకి మాత్రం వారు తమ శత్రువులన్నట్లు వారితో యుద్ధం చేస్తూ ప్రజలను వంచించింది. ఇప్పుడు ఆ తప్పులకు ఫలితం అనుభవించబోతోంది. అయితే ఇదంతా ఎవరి కోసం చేసిందో వారికి లబ్ది కలగలేదు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పుల వలన రాహుల్ గాంధీ రాజకీయ జీవితమే కాదు, అనేకమంది నిఖార్సయిన కాంగ్రెస్ నేతల జీవితాలు కూడా బలయిపోయాయి. ఇది స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు.

మోడీ స్థానంలో గుజరాత్ సీఎంగా మహిళ?

  నరేంద్రమోడీ భారతదేశ ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టిస్తే ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? ఈ బాధ్యతలు ఒక మహిళకు దక్కనున్నట్టు తెలుస్తోంది. మోడీ స్థానంలో సీఎం కావాలని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలామంది కలలు కంటున్నారు. వీరిలో సౌరభ్ పటేల్, నితిన్ పటేల్ ప్రధానంగా వున్నారు. అయితే గుజరాత్ తదుపరి సీఎం రాష్ట్ర రెవిన్యూ మంత్రి ఆనందిబెన్ పటేల్ అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మోడీ మద్దతు కూడా ఈమెకే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు.