ఈ సమయంలో జగన్ దీక్ష.. జైలు ఖాయం..

  ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకపక్క ఈ నెల 22వ తేదీన జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతుంటే మరోపక్క ప్రతిపక్షనేత జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ చేస్తున్న దీక్షపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన శుభకార్యం జరుగుతున్న సమయంలో జగన్ ఇలాంటి దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. శుభకార్య సమయంలో జగన్ చేసే ఈ చర్యలకు ఆయన తప్పకుండా మూడు నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. జగన్ అందరికీ భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

రేపు తెలంగాణా బంద్

  రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసనగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రేపు (శనివారం) తెలంగాణా రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తరువాత వాయిదాల పద్ధతిలో మాఫీ చేస్తామని చెపుతున్నారు. రుణమాఫీ చేయకపోవడంతో ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్న రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కనుక తక్షణమే రూ. 8,500 కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కానీ అంత మొత్తం ఒకేసారి విడుదల చేయలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పడంతో ప్రతిపక్షాలు రేపు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. తెరాస తప్ప ప్రతిపక్ష పార్టీలన్నీ బంద్ కి మద్దతు ఇస్తున్నందున అది విజయవంతం అయ్యే అవకాశాలే ఎక్కువ. రైతన్నల సమస్య కోసం జరుగుతున్న బంద్ కనుక ప్రజలు కూడా స్వచ్చందంగా సహకరించే అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుకిపైయెత్తు వేస్తుంటారు. కనుక ప్రతిపక్షాలు ఊహించని విధంగా ఏదయినా నిర్ణయం తీసుకొనవచ్చును.

ప్రత్యేక హోదా ఏం జిందా తిలిస్మాత్ కాదు ఇవ్వడానికి.. వెంకయ్యనాయుడు

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రత్యేక హోదాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరమే కానీ.. దానితోనే అన్నీ తీరిపోవని ఆయన అన్నారు. అన్నీ సమస్యలకు పరిష్కారం జిందా తిలిస్మాత్ మాదిరి.. ప్రత్యేక హోదాతో అన్నీ సమస్యలు పరిష్కారం కావన్నారు. ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగిఉన్నాయి. కాని ఇప్పటికీ సమస్యల పరిష్కారానికి మావద్దకు వస్తున్నారని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా పై నీతి అయోగ్ పర్యవేక్షిస్తుంది.. ఈ కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడటం ఏంటంని ప్రశ్నించారు.

స్టాలిన్ మళ్లీ చెయ్యి చేసుకున్నారు

  డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్  మరోసారి ఓ సామాన్యుడి చెంప చెల్లుమనిపించి వార్తల్లోకెక్కారు. గతంలో కూడా ఒకసారి తను మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిపై చెయ్యి చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకుని తన ప్రతాపాన్ని చూపించారు. స్టాలిన్ కోయంబత్తూరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో తన చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ స్టాలిన్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా అసహనానికి లోనైన స్టాలిన్ అతనిపై చేయి చేసుకుని పక్కకు నెట్టేశారు. అయితే స్టాలిన్ అతనిని చేయి చేసుకోవడం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో హల్ చల్ చేస్తుంది. అయితే దీనిని స్టాలిన్ ఖండిస్తున్నారు. ఈవీడియోలో నిజం లేదని.. గ్రాఫిక్స్ యాడ్ చేశారని తాను ఆవ్యక్తిని నెట్టలేదని.. జనాలకు అసౌకర్యం కలిగించవద్దని పార్టీ కార్యకర్తకు తాను చెప్పానని, ఈ సందర్భంగా అతడిని నెట్టిన మాట వాస్తవమేనన్నారు. ఇదిలా ఉండగా దీనిపై స్టాలిన్ మేనేజర్ చెప్పిన దానికి.. స్టాలిన్ చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా ఉంది. అది  యాదృచ్చికంగా జరిగిందని ...స్టాలిన్ను చుట్టుముట్టిన వారిని అదుపు చేసే సమయంలో అలా జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట.. కర్ణాటక హోం మంత్రి

అమ్మాయిలపై జరిగే అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంత మంది రాజకీయ నేతలు బుక్కవుతుంటారు. గతంలో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నలుగురు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేయలేరని, ఒకరు రేప్ చేస్తే మిగిలిన అందరి పేర్లూ పెట్టేస్తారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి కూడా అదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లో  22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని  కదులుతున్న వ్యానులో అత్యాచారం చేసిన ఘటనపై మీడియా ప్రతినిధులు కేజే జార్జిని ప్రశ్నించగా దానికి ఆయన ఇద్దరే మగవాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని.. కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. కేజే జార్జి చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలపై జరిగుతున్న అఘూయిత్యాల గురించి ఒక ప్రజానాయకుడు ఇలా మాట్లాడటం సరికాదని.. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని అన్నారు.

జగన్ దీక్షకు ఆదినారాయణరెడ్డి దూరం.. దీంతో అర్ధమైపోయింది

 వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ పార్టీకే చెందిన కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అతని సోదరుడు ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డికూడా దీక్షకు దూరంగా ఉన్నారు. దీంతో ఎప్పటినుండో ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతున్నా అని వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టుంది. ఇదిలా ఉండగా ఎప్పటినుండో ఆదినారాయణ రెడ్డి వైకాపా ను వీడి టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే తాను టీడీపీ అధినేత చంద్రబాబు తో కూడా మంతనాలు జరిపారు. చంద్రబాబు కూడా ఈ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈలోపు ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడాల్సి వస్తుందని టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆదినారాయణ రెడ్డి ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు తెలస్తోంది. కానీ ఆదినారాయణను టీడీపీలోకి ఆహ్వీనించడానికే ఎక్కవ సముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని రామసుబ్బారెడ్డి నేరుగా ఫిర్యాదు చేసినప్పుడు చంద్రబాబు మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారే తప్ప పార్టీలో చేర్చుకోబోమని చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే రామ సుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్నారు. మరో వైపు వైకాపా నేతలు కూడా ఆదినారాయణను పార్టీలో ఉంచడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఆదినారాయణ రెడ్డి మాత్రం పార్టీ లో ఉంటానని ఏ ఒక్కరికి చెప్పిన దాఖలాలు లేవు. మొత్తానికి ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరాలంటే ఇంకా టైం పట్టేలా ఉన్నట్టు తెలుస్తోంది.

పొలిటికల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ గుడ్ బై!

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎపిసోడ్ ముగిసినట్లేనని మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వస్తున్నాయి, ఆమధ్య ఎప్పుడో రాహుల్ అనంతపురం టూర్లో మెరుపులా మెరిసినా... ఆ తర్వాత అటువైపు చూడటమే మానేశారని, ఏదో పేరుకి కాంగ్రెస్ నాయకుడని అనిపించుకుంటున్నా ఆ దరిదాపులకే వెళ్లడం లేదంటున్నారు, ఇప్పుడు ఆయన దృష్టంతా 150వ సినిమాపైనే ఉందని... పొలిటికల్ ఎపిసోడ్ కి దాదాపు గుడ్ బై చెప్పేసినట్లేనని అంటున్నారు. రాహుల్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని, ఆ విషయాన్ని చిరంజీవితో డైరెక్ట్ గా చెప్పి చీవాట్లు కూడా పెట్టారంటున్నారు, చిరంజీవి తన 150వ సినిమాపై పెడుతున్న శ్రద్ధ... పార్టీ బలోపేతంపై పెట్టుంటే... ఏపీలో కొంచెమైనా కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడి ఉండేదని అన్నారట. రాహుల్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న చిరంజీవి...టోటల్ గా పొలిటికల్ లైఫ్ కి గుడ్ బై చెప్పేయాలని డిసైడయ్యారట.

టీఆర్ఎస్ లో స్వేచ్ఛ లేదంటున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే

ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది, తీవ్ర తర్జనభర్జనల తర్వాత టీడీపీని వీడి... తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినా... తెలుగుదేశం పార్టీపై మాత్రం ఇంకా మమకారం పోలేదని చెబుతున్నారు, టీడీపీ తనకు సొంతిల్లు లాంటిదంటున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... టీఆర్ఎస్ లో తాను సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందంటున్నారు. అయితే తనకు టీడీపీలో ఉన్నంత స్వేచ్ఛ... టీఆర్ఎస్ లో లేదని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు, మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలతో కంగుతిన్న ఆయన అనుచరులు, గులాబీ శ్రేణులు... బలవంతంగా టీఆర్ఎస్ లో చేరినట్లున్నారని మాట్లాడుకుంటున్నారు

రైతు ఆత్మహత్యలపై ర్యాలీ.. దానం నాగేందర్ అరెస్ట్

  తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు రుణమాఫీ చేయాలని దానివల్ల రైతులకు ఆర్ధికంగా సహాయపడినట్టు ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని కోరుతూ తెలంగాణలోని కాంగ్రెస్తోపాటు వివిధ రాజకీయ పక్షాలు రేపు తెలంగాణలో బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపు నిర్వహించే బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్లతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. దీంతో పోలీసులు  వారిని అదుపులోకి తీసుకుని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు.

జగన్ మందకృష్ణ మద్దతు.. చంద్రబాబు అందుకే మాట్లాడటంలేదు

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు లో నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ  మద్దతు తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఏపీకి రాజధాని ఎంత అవసరమో అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా అవసరమని అన్నారు. ప్రత్యేక హోదా ఏపీలో ఉన్న ఐదు కోట్ల ఏపీ ప్రజల ఆకాంక్ష అని.. దానికోసం పోరాడుతున్న జగన్ కు మద్దతుగా ఉంటామని.. ప్రత్యేక హోదా పై ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అంతేకాదు వైసిపి భవిష్యత్తులో చేపట్టే పోరాటాల్లో భాగస్వాములం అవుతామని చెప్పారు. అంతేకాదు జగన్ చేస్తున్న దీక్షను ఏపీ మంత్రులు, టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కుపోవడం వల్లే చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటంలేదని అన్నారు.

తలసాని రాజీనాపై నాయిని సంచలన వ్యాఖ్య.. ఆయన ఎప్పడు చేశారు

  తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆపార్టీలో రాజీనామా చేయకుండానే తరువాత టీఆర్ఎస్ పార్టీ మారి మంత్రి పదవి కొనసాగిస్తున్న తలసానిపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు కూడా ఈ విషయంలో తాము యాక్షన్ తీసుకోవడానికి లేదని.. కాని స్పీక్పర్ ఏదో ఒక చర్య తొందరగా తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా నిన్న తెలంగాణ భవన్ లో నాయిని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విలేకరులు తలసాని రాజీనామా గురించి, సనత్ నగర్ ఉపఎన్నిక గురించి నాయినిని ప్రశ్నించారు.  దీనికి నాయిని సనత్ నగర్ కు ఉపఎన్నిక ఎందుకు తలసాని ఏమైనా రాజీనామా చేశారా అంటూ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు అందరికి పెద్ద చర్చాంశనీయంగా మారింది.

అమరావతికి జగన్ వెళ్తాడా? వెళ్లడా?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి దేశ విదేశీ ప్రతినిధులతోపాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, అతిరథ మహారథులంతా తరలిరానున్నారు, కానీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్లకూడదదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది, గతంలో సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా హాజరుకాని జగన్... అమరావతికి కూడా వెళ్లకూడదని డిసైడయ్యారు, దీనికి గుంటూరులో చేపట్టిన దీక్ష ఒక కారణమైతే... పద్ధతి ప్రకారం పిలవకపోవడం మరో కారణమని వైసీపీ నేతలంటున్నారు, ఏదో మొక్కుబడిగా ఓ లెటర్ పంపించారని, అందుకే నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకూడదని జగన్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు

పార్టీ మారడం లేదు.. దిగ్విజయ్ కు దానం సలహా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానంకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తన పార్టీ మార్పుపై ఆరా తీసినట్టు.. దీనికి దానం నాగేందర్ తమ పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తనకి పార్టీ మారే ఆలోచన లేదని చేప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన దిగ్విజయ్ సింగ్ కు ఒక సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని దానం దిగ్విజయ్‌సింగ్‌ కు సూచించారు.

ఒక్క మాట.. జగన్ ను ఇరకాటంలో పడేసిందా?

అప్పుడప్పుడు ఆవేశంతో మాట్లాడే కొన్ని మాటలు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఎదురైంది. ప్రస్తుతం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరు దీక్ష చేస్తు బిజీగా ఉన్నారు. అయితే ఈ దీక్షలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు అదేంటంటే తాను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నానని చెప్పారు. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ జగన్ కు ఇబ్బందికరంగా మారనుందా అంటే అవుననే అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిలో భాగంగానే ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే. అది జగన్ అమరావతి శంకుస్థాపనకు వస్తాడా?రాడా? అని. ఎందుకంటే దసరా రోజు అక్టోబర్ 22న ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి చంద్రబాబు ఎంతో మంది అతిధులను ఆహ్వానించారు. వారితో పాటే ప్రతిపక్షనేత అయిన జగన్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే ముందునుండి జగన్ ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ.. తాను కనుక పదవిలోకి వస్తే వారి భూములను వారికి ఇచ్చేస్తా అని కూడా అన్నారు. మరి అలాంటి ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు ఈ అమరావతి శంకస్థాపన కార్యక్రమానికి వస్తారా? రారా అని సందేహం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తాను పాటుపడుతున్నానని చెప్పిన జగన్ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకపోతే ప్రజలలో వ్యతిరేక భావం వస్తుంది. అందులో ఏపీ భవిష్యత్తు అయిన..రాజధాని నిర్మాణానికి దూరంగా ఉండటం వల్ల తాను ఏపీ రాజధానికి వ్యతిరేకం అనే రాంగ్ సిగ్నల్స్ పంపించినట్టు ఉంటుంది. అందులోనూ ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ తోపాటు దేశ విదేశాల నుండి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో జగన్ వారికి దూరంగా ఉండటం కూడా నష్టమే. మరి జగన్ ఇన్ని సమస్యల మధ్య అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తారో లేదో చూడాలి.

హరీష్ రావును కేసీఆర్ సైలెంట్ గా తప్పిస్తున్నాడా?

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావును చూసి ఇప్పుడు అందరూ జాలీ పడుతున్నారట. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావును పదవి నుండి తప్పించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అది అటో ఇటో అనే విషయం ఒక వారంలో తెలియనుంది. ఇంత సడెన్ గా హరీష్ రావును పదవి నుండి ఎందుకు తప్పిస్తున్నట్టు.. టీఆర్ఎస్ పార్టీలో మంచి వాక్చాతుర్యం ఉండి.. మంచి బలమైన నాయకుడిగా మంచి పేరు ఉన్న హరీశ్ రావును పదవి నుండి తప్పిండానికి గల కారణాలు ఎంటని ఆలోచిస్తున్న అందరికి అంత పెద్ద సమాధానాలు కూడా ఏం కనిపించకపోవచ్చు. ఎందుకంటే అది కేవలం హరీష్ రావు నాయకత్వానికి కేసీఆర్ భయపడటమే అని అర్ధమవుతోంది. గత కొద్దిరోజులుగా కేసీఆర్ కుటుంబానికి.. హరీష్ రావుకు మధ్య అభ్యంతరాలు తలెత్తినట్టు వార్తలు వింటూనే ఉన్నాం. అందుకు కారణం హరీష్ రావుకు బలమైన నాయకత్వం ఉంటబట్టే. ఓ రకంగా చెప్పాలంటే తరువాత కేటీఆర్ కు కాని.. కూతురు కవితకు కాని అంత బలమైన నాయకత్వపు లక్షణాలు లేవు.. కేసీఆర్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించగల వ్యక్తి హరీష్ రావు. అందుకే ఈ భయంతోనే కేసీఆర్ ఎక్కడ తనను మింగేస్తాడో అని.. తన కొడుకు కేటీఆర్ ప్రభావం హరీశ్ వల్ల ఎప్పుడూ దిగువగానే ఉండటంతో వీటిని దృష్టిలో పెట్టుకొని తాను హరీష్ ను పదవి నుండి తొలగించాలని ఆలోచించినట్టు తెలుస్తోంది. మరి హరీష్ రావును మంత్రి పదవి నుండి తొలగిస్తే తాను ఊరుకుంటాడా.. తను వేరే పార్టీ నిలవగల సత్తా ఉన్న మనిషి. అందుకు కేసీఆర్ చాలా తెలివిగా ఆలోచించి టీఆర్ఎస్ కు ఒక ప్రజా నేత కావాలంటూ.. పార్టీని బలోపేత చేయగల మంచి చరిష్మా ఉన్న నాయకుడు కావాలంటూ.. దానికి హరీశ్ రావు అయితే కరెక్ట్ అని వెన్న పూసినట్టి పదవి నుండి తప్పించి  ప్రధాన కార్యదర్శిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి కొనసాగిస్తూ ఈ బాధ్యత చేపట్టాలంటే కష్టం..  గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి అన్ని స్థాయిల్లోనూ కార్యకర్తలకు జవజీవాలు కల్పించాలంటే ఆ పదవిలో ఉంటూ చేయడం కష్టం అందుకే మంత్రి పదవి నుండి తప్పించి ఇలా హరీష్ కు ఐస్ పూస్తున్నారు కేసీఆర్. మొత్తానికి కేసీఆర్ ఎత్తుగడలకు పాపం హరీశ్ కూడా బలైపోతున్నాడని కొంత మంది నేతలు అనుకుంటున్నారు. అయితే రాజకీయంగా ఎన్నో చూసినా హరీష్ రావుకు తన మామ తనపై ప్రయోగించే తంత్రాలను తెలుసుకోలేరు అని కూడా అనుకోలేం. చూద్దాం ఈ వారం రోజుల్లో ఏం జరుగుతుందో.

చంద్రబాబు కాదు ఆయన బాబు తరం కాదు.. రోజా

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. ఈ దీక్ష సందర్భంగా ఆపార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీపై మండిపడ్డారు. తమ పార్టీనేత చేపట్టిన దీక్షను చూసి టీడీపీ నేతలు మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. జగన్ దీక్షను ఆపడం చంద్రబాబు వల్లకాదు కదా ఆయన బాబు వల్ల కూడా కాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా అంటే అధికార పార్టీకి పచ్చిమిరపకాయలు తిన్నట్టు మంటెక్కిపోతున్నారని.. అందుకే వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఒక్కొక్కరూ కాదు వంద మంది టీడీపీ నేతలు వచ్చి విమర్శించినా... తమ పార్టీ లెక్క చేయదని అన్నారు. అసలు ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు అనుకూలమో లేక వ్యతిరేకమో చెప్పే దమ్ము ధైర్యం లేవన్నారు.

నన్ను అడుగుతున్నారు.. అప్పుడు మీరేం చేశారు.. కేసీఆర్

  రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో రెండు రోజులపాటు చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్షాలు అధికార పార్టీపై విరుచుకపడ్డాయి. అయితే కేసీఆర్ మాత్రం ఈవ్యవహారంపై గత ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ల తరువాత తెలంగాణ  రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. 58 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో అరాచక పాలన చేశారు.. రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ఇందుకు కారణం ఎవరని అన్నారు. ఈ 58 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ హయాంలో తెలంగాణకి నష్టం జరిగిందని.. రైతు సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతున్నారు.. వారి పాలన అప్పుడు వారేం చేశారు.. వారు పాలనలో ఉన్నప్పుడు రైతుల ఇళ్లకు బంగారు వాసాలు కట్టించారా? అని ప్రశ్నించారు. ఈ 58 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు రాష్ట్రానికి ఏం చేశారు అని అంటున్నారు.. ఇన్నేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన మీరు ఈ 15 నెలల్లో మీరే చేయలేదని అడిగితే ఎట్లా అని అన్నారు.

ఏపీ టైప్ లో పంజాబ్ లోనూ కాంగ్రెస్ కు దెబ్బ

రాహుల్ గాంధీకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్... పార్టీకి గుడ్ బై చెబుతారంటూ వార్తలు వస్తున్నాయి, ప్రస్తుతం లోక్ సభలో కాంగ్రెస్ ఉపనేతగా ఉన్న అమరీందర్... పంజాబ్ వికాస్ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి, అమరీందర్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ హైకమాండ్ తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని, ఇటీవల జరిగిన పార్లమెంట్ సెషన్స్ కు కూడా సరిగా హాజరుకాలేదని అంటున్నారు, అయితే అమరీందర్ కొత్త పార్టీ పెడితే... వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోతామని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు...నష్ట నివారణ చర్యలకు దిగారు, అమరీందర్ ను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్లు... ఆయన ఏ కోరిక కోరినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు, అమరీందర్ కోరితే పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తెలిపారు. అయితే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో అమరీందర్ సింగ్ టచ్ లో ఉన్నాడని, కొత్త పార్టీ పెట్టడానికే మొగ్గుచూపుతున్నాడని సన్నిహితులు అంటున్నారు.