సూటుకేసుల్లో డబ్బుల్లేవ్ చేయడానికి.. కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై.. రైతు రుణమాఫీలపై చర్చ వాడి వేడిగా సాగుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ ఒకింత అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీల విషయంపై చర్చజరుగుతన్న నేపథ్యంలో ఒకేసారి రైతు రుణమాఫీలు చేయాలంటే కష్టం.. ప్రభుత్వం దగ్గర సూటుకేసుల్లో డబ్బులుండవు.. నల్ల డబ్బు అంతకంటే ఉండదు అని వ్యాఖ్యానించారు. మొత్తం రాష్ట్రంలో 36 లక్షల రైతు ఖాతాలున్నాయి.. వీరందరికీ లక్ష రూపాయల లోపు ఒకేసారి రుణమాఫీ చేయాలంటే రూ.8 వేల కోట్లు అవసరమవుతాయి.. ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వానికి కష్టతరమైనది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ.. వాణిజ్య పన్నుల ద్వారా రూ.3500 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం ద్వారా 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి అదనంగా రూ.3500 కోట్లు..  ప్రభుత్వ స్థలాలను త్వరలో విక్రయించడం ద్వారా మరో రెండు మూడు వేల కోట్లు నిధులు రావాల్సి ఉంది అవన్నీ వచ్చిన వెంటనే మొదట రుణమాఫీకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

కాకినాడ టీడీపీ ఎంపీ... డెబిట్ కార్డ్ క్లోనింగ్

టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా నేరగాళ్లు మాత్రం వాటిని కూడా అధిగమించి తమ చేతివాటం చూపుతున్నారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు క్లోనింగ్ తో ఏటీఎమ్స్ నుంచి మనీ దోచేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నా... వాటిని అరికట్టడంలో అటు బ్యాంకులు కానీ, ఇటు పోలీస్ వ్యవస్థ కానీ సక్సెస్ కాలేకపోతున్నాయ్, ఇప్పుడు తాజాగా కాకినాడ టీడీపీ ఎంపీ తోట నర్సింహం హైటెక్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు, ఆయన డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన దుండగులు... తోట నర్సింహ ఖాతా నుంచి 50వేల రూపాయలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. గోవాలోని ఓ ఏటీఎం నుంచి ఈ డబ్బు తీసినట్లు తెలుసుకున్న కాకినాడ ఎంపీ... పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... దర్యాప్తు ప్రారంభించారు.

టీఆర్ఎస్ ని టెన్షన్ పెట్టిస్తున్న విపక్షాల ఐక్యత

తెలంగాణ అధికార పార్టీ ఇప్పుడు ఒక విషయానికి తెగ టెన్షన్ పడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టించిన టీఆర్ఎస్ ఇప్పుడు అంతలా టెన్షన్ పడటానికి కారణం ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడమే కారణమని అంటున్నారు. ఇప్పటివరకూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించిన విపక్షాలు రైతు సమస్యలపై పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్ పార్టీపై పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అసెంబ్లీలో రైతు సమస్యలపై అధికార ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రతిపక్షాలన్నీ ఇలా  తమపై దాడి చేస్తాయని అసలు ఏ మాత్రం ఊహించని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. దీనికి అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే నిజమనిపించేలా ఉన్నాయి. రైతు ఆత్మహత్యలపై సిద్దాంతాలన్నీ పక్కనపెట్టి మరీ ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని.. ఇది నిజంగా సిగ్గులేనితనం అంటూ గట్టిగానే కామెంట్ చేశారు. అయితే కేటీఆర్ కామెంట్ చేసినా కూడా అది ఒకింత భయంతో చేసిన కామెంట్స్ అనే అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు ప్రతిపక్షాలన్నీ ఇలాగే కలికట్టుగా ఉండి తమపై పోరాటం చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించి ముందు వారిలో విబేధాలు రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట. మొత్తానికి తమకు ఎదురులేదనుకునే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరకంగా విపక్షాలన్నీ కలిసి చెమటలు పట్టిస్తున్నాయి. మరి ఎంతకాలం కలిసికట్టుగా ఉంటారో చూద్దాం.

ఏపీకి హోదాపై మళ్లీ వెంకయ్య మాట మారింది

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి యూటర్న్ తీసుకున్నారు, ఏపీకి స్పెషల్ స్టేటస్ కన్నా ప్రాజెక్టులు రావడమే ముఖ్యమన్న వెంకయ్య... అదే తన తొలి ప్రాధానత్య అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినా కొత్త ప్రాజెక్టులు రావడం రాక ఇబ్బందులు పడుతున్నాయని, అందువల్ల ఏపీకి హోదా కన్నా... కొత్త ప్రాజెక్టులు తీసుకురావడమే ముఖ్యమన్నారు, తన తొలి ప్రాధాన్యత ప్రాజెక్టులు తీసుకురావడమే అయినా, ప్రత్యేక హోదా కోసం కూడా పోరాడతామంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా ఏపీకి పదేళ్లు హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన వెంకయ్య... అధికారంలో వచ్చాక ఇలా అనేకసార్లు మాట మార్చడంపై అటు విపక్షాలు, ఇటు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు

టీడీపీ నేత అలక.. తను వస్తే నేను పోతా

వైకాపా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైకాపాని వీడి టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొద్దిరోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ వరకూ బానే ఉన్నా ఇప్పుడు ఇంకో చిక్కు వచ్చిపడింది. ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం రామసుబ్బారెడ్డి నారా లోకేశ్.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసకుంటే తాను పార్టీనుండి వెళిపోతానని మొహం మీద చెప్పేశారు. అంతేకాదు తన కారణంగా టీడీపీకి చెందిన 150 కార్యకర్తలు చనిపోయారని అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారట. అయితే బాలకృష్ణ లోకేశ్ లు.. తమ ప్రతిపక్షనేత అయిన జగన్ సొంత జిల్లా నుండే పార్టీ నేతలు మన పార్టీలోకి రావడం మనకే ప్రయాజనం ఉంటుంది కదా అని ఎన్ని రకాలుగా నచ్చజెప్పడానికి చూసిన తాను మాత్రం వెనక్కి తగ్గలేదట. దీంతో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఎంట్రీకి బ్రేక్ పడినట్టుయింది.

ఏపీలో ఐటీ కంపెనీలకు చంద్రబాబు ఆఫర్లు

హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమను ఇంతలా అభివృద్ది చేయడానికి ముఖ్యకారణం చంద్రబాబు నాయుడే అని అందరికి తెలిసిన సంగతే. తెలంగాణ వాదులు ఈ విషయాన్ని ఒప్పుకోకపోయినా ఐటీ పరిశ్రమలో పనిచేసే ఏ ఒక్కరిని అడిగినా అవుననే సమాధానం చెపుతారు. అయితే ఇక్కడ పరిస్థితి ఒకే.. మరి ఏపీలో ఐటీ పరిశ్రమల పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగి కనీసం రాజధాని కూడా రాష్ట్రం.. ఇప్పుడు అన్ని నగరాల మాదిరి ఏపీ రాష్ట్రంలో కూడా ఐటీ రంగం ముందుండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏపీ రాష్ట్రంలో కూడా మిగతా రాష్ట్రాల మాదిరి ప్రోత్సాహాలను ఇస్తే సరిపోదని.. ఏపీకి మరింత ప్రోత్సాహాలు అవసరమని ఐటీ అధిపతులు చంద్రబాబుకు సూచించారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా మరింత ప్రోత్సాహాలను ఇవ్వడానికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అవి..   * కొత్తగా పెట్టబోయే కంపెనీకి 50 శాతం ఫీజు లేదా మూడేళ్లపాటు రీయింబర్స్ చేయడం. * ఒక్క రూపాయికే యూనిట్ విద్యుత్.. ఐదేళ్లపాటు * 25 శాతం ఇంటర్నెట్ కనెక్టెవిటీ.. మూడేళ్లపాటు * విద్యుత్ పన్నుల్లో రాయితీ.. ఐదేళ్లపాటు * రిజిస్ట్రేషన్.. స్టాంప్ ఫీజుల్లో 50 శాతం రీయింబర్స్ మెంట్ * ప్రాపర్టీ టాక్స్ లోనూ 50 శాతం రీయింబర్స్ మెంట్

రాజధాని అమరావతి శంకుస్థాపన ముహూర్తం ఖరారు

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత అంగరంగా వైభవంగా నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వెయ్యిమందికి పైగా అతిధులను ఆహ్వానించనున్నారు. అయితే ఈ నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముహుర్తం ఖరారు అయింది. దసరా రోజు అంటే అక్టోబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మందడం- ఉద్దండరాయపాలెం మధ్యలో భూమిపూజ జరిగిన చోటునే శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. గురువారం నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు శంకుస్థాపనం కార్యక్రమంపైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గాలి జనార్ధనరెడ్డికి మళ్ళీ జైలు గాలి సోకినట్లే ఉంది

  కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక కూడా ఊడిందన్నట్లు అయ్యింది గాలి జనార్ధనరెడ్డి పరిస్థితి. మూడేళ్ళపాటు జైలులో గడిపి బయటకు వచ్చిన ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. బళ్ళారి వెళ్లేందుకు తనకు బెయిలు షరతులు సడలించాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొన్నారు. ఆయన బళ్ళారి వెళ్ళడం సంగతి ఏమో కానీ మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. సుమారు ఐదు లక్షల టన్నుల ఇనుప ఖనిజానికి తప్పుడు లెక్కలతో తక్కువ చేసి చూపించి కర్ణాటకలోని కెరికెరి పోర్టు నుండి విదేశాలకు ఎగుమతి చేసినందుకు ఆయనపై లోకాయుక్తలో కేసు నడుస్తోంది. ఆయనతో బాటు ఎమ్మెల్యే సురేష్, మరో పది మందిపై కూడా కేసులు నడుస్తున్నాయి. వారందరినీ కొన్ని రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తరువాత వంతు గాలి జనార్ధన్ రెడ్డిదేనని తెలుస్తోంది. కనుక సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం మరో పటిషన్ వేసేందుకు ఆయన సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం.

గాంధీజి గురించి అందరికి తెలియని ఓ పది విశేషాలు

మహాత్మా గాంధీ అనే వ్యక్తీ ఈ భూప్రపంచం మీద ఒకప్పుడు నడయాడాడు ...అంటూ ఎన్ని యుగాలు గడిచినా ప్రజలు మరచిపోని, మర్చిపోలేని వ్యక్తీ గాంధీజీ. మన దేశంలో ఆయనకి ప్రతివ్యక్తి తన గుండెలలో గూడు కట్టి పూజిస్తాడు. అయితే మన మహాత్ముడు కేవలం మన దేశ జాతిపిత మాత్రమే కాదు. ఆయన ప్రభావం విశ్వవ్యాప్తం. గాంధీజీ గురించి తెలుసుకు తీరవలసిన ఒక పది విశేషాలు ఇవిగో ...   1. గాంధీజీ తన ఆత్మ కథ " మై ఎక్స్పెరి మెంట్స్ విత్ ట్రూత్" ని 1925 లో గుజరాతి భాషలో రాసారు. అది నవజీవన్ అనే పత్రికలో ధారావాహికంగా వచ్చింది. దానిని ఇంగ్లీష్ లోకి అనువదించినది " మహాదేవ్ దేశాయ్ " .   2. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గాంధీజి ఆత్మకథ ఎంతో ఆదరణ పొందించి. చివరికి పాకిస్తాన్ లో కూడా బెస్ట్ సెల్లెర్స్ జాబితాలో వుంది అంటే దాని ప్రభావం ఎంతో అర్ధం చేసుకోవచ్చు. 3. 20 శతాబ్దపు అతి గొప్ప ఆద్యాత్మిక పుస్తకాల జాబితాలో గాంధీజీ ఆత్మ కథది ప్రముఖ స్థానం.   4. గాంధీజీకి మన దేశంలో ఎన్నో చోట్ల గుళ్ళు వున్నాయి. అక్కడ ఆయనని దేవుడిలా కొలుస్తారు.   5. మన దేశంలోనే కాదు చాలా దేశాలలో గాంధీ పేరున వీధులు, నగరాలూ వున్నాయి. అమెరికాలోని టెక్సాస్ ప్రాంతానికి ' మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్ ' అని పేరు పెట్టారు. ఆఫ్రికా లోని బోట్సువాన దేశం లో వున్న ఫ్రాన్సిస్ టౌన్ లో గాంధీ పేరుతో ఒక వీధి వుంది. ఉరుగ్వే లోని మోంట్ వీడియో తీరప్రాంత౦ లో ఓ కాలనీకి మహాత్ముడి పేరు పెట్టుకున్నారు, దక్షిణాఫ్రికాలో 'గాంధీ స్క్వేర్ ' డర్బన్ లో గాంధీ మెమోరియల్ ఆసుపత్రి వున్నాయి.     6. ఇక గాంధీ విగ్రహాలు మన దేశంలో ఎంత విరివిగా దర్శనమిస్తాయో, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలలో, ఎన్నో ప్రాంతాలలో  కనిపిస్తాయి. జర్మన్ పార్లమెంట్లో మహాత్ముని విగ్రహం ప్రతిష్టించారు. మాస్కోలో కూడా గాంధీజీ విగ్రహంవుంది. ఆస్ట్రేలియా యూనివర్సిటీలో  కెనడాలో, ఇటలి,కజికిస్తాన్, ఫ్రాన్స్, మొరాకో, ఇలాఎన్నో దేశాలలో గాంధీజీ విగ్రహాలు ప్రతిష్టించారు.   7. సుమారు వందకు పైగా దేశాలు గాంధీజీ పేరున స్టాంపులు విడుదల చేసాయి.     8. గాంధీజీ ఎందరినో ప్రభావితం చేసారు. అమెరికా హక్కుల వీరుడు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఐన్ స్టీన్, అల్గోరే, బరాక్ ఒబామా,అంగ్సాన్ సూకీ, దలైలామా, వీరంతాగాంధీజీ అడుగుజాడలలో నడిచినవారు. ఆయనని ఆదర్శంగా తీసుకుని తమ జీవన మార్గాలని నిర్దేశించుకున్నవారు. 9 . అరబ్ దేశాల ఉద్యమగీతాలలో గాంధీయిజం నిండివుంటుంది. 10 . అంతర్జాతీయంగా అనేక విశ్వవిద్యాలయాలు గాంధీయిజంలోని మేనేజ్మెంట్ సూత్రాలని తమ కోర్స్ లో భాగం చేసాయి. .......రమ

జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ కూతురు భేటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత భేటీ అయ్యింది, లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కవిత... జగన్ తోపాటు ఆయన సతీమణి భారతితో కూడా సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగినా, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించడానికే భారతిని కలిసినట్లు తెలుస్తోంది, ప్రస్తుతం సాక్షి మీడియా గ్రూప్ బాధ్యతలు చూస్తున్న భారతిని మర్యాదపూర్వకంగానే ఆహ్వానించామని, త్వరలో అన్ని టీవీ ఛానల్స్ ను కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరనున్నట్లు చెబుతున్నారు

అమెరికాలో ఉన్మాది కాల్పులు, 9మంది మృతి

  అమెరికాలో గురువారం ఉదయం ఒరెగాన్ వద్ద గల వుంపక్ కమ్యూనిటీ కాలేజీ విద్యార్ధులపై ఒక ఉన్మాది కాల్పులు జరపడంతో 9 మంది మరణించగా 7 మంది విద్యార్ధులు గాయపడ్డారు. తాజా సమాచారం ప్రకారం అతను విద్యార్ధుల మతం గురించి అడిగి తెలుసుకొన్న తరువాత వారిని కాల్చి చంపాడు. తక్షణమే అక్కడికి చేరుకొన్న పోలీసులు కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా అతను వారిపై కూడా కాల్పులు జరిపాడు. కానీ పోలీసులు అతనిని చాకచక్యంగా బంధించగలిగారు. అతనిని చిరిస్ హార్పర్ మెర్సెర్ (26) గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన అమెరికా కాలమాన ప్రకారం గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. అతను వించిస్టర్ ఒరెగాన్ లో ఒక అపార్ట్ మెంటులో తన తల్లితో కలిసి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించి అతని ఇంటిని కూడా శోదా చేశారు. అతను ఇంటర్ నెట్ లో ‘మై స్పేస్’ అనే బ్లాగ్ నడిపిస్తున్నట్లు గుర్తించారు. అందులో అతని ఫోటోలు, అతని గ్రూప్ మెంబర్ల వివరాలు, ఆ బ్లాగ్ ద్వారా అతను వ్యాపింపజేస్తున్న మత సంబంధిత భావజాలం పోలీసులు అధ్యయనం చేస్తున్నారు.

బీహార్ లో బీజేపీ బీసీ ప్రయోగం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో బీజేపీ కొత్త ఎత్తువేసింది, రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో కొంచెం ఇబ్బంది పడుతున్న బీజేపీకి బూస్టింగ్ ఇచ్చేలా కేంద్ర నాయకత్వం కీలక ప్రకటన చేసింది, బీహార్ లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. రిజర్వేషన్లపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని ప్రత్యర్ధి పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ప్రజల్లోకి వెళ్తుండటంతో జాగ్రత్తపడిన బీజేపీ ఈ విధాన ప్రకటన చేయాల్సి వచ్చింది, దాంతో నితీష్, లాలూ ప్రచారాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టినట్టయింది. అన్ని సర్వేల్లోనూ ముందున్న బీజేపీకి ఈ బీసీ మంత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి

ఆంబోతులా... ఎంత మాటన్నావ్ నారాయణా!

సీపీఐ నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై విరుచుకుపడ్డ నారాయణ.... ఆ ముగ్గురినీ ఏకంగా ఆంబోతులతో పోల్చినట్లు వార్తలు వస్తున్నాయి, దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.... మోడీ, బాబు, కేసీఆర్ లు కొత్త పెళ్లికొడుకుల్లా విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించారు, అన్నదాతలు ఆక్రందనను పట్టించుకోకుండా ఆంబోతుల్లా తిరుగుతున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలతో గతంలో చిక్కులు కొనితెచ్చుకున్న సీపీఐ నారాయణ... తాజా కామెంట్స్ తో ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో చూడాలి

భోగాపురం సముద్రం ఒడ్డుకి చేరిన చిన్నారి అదితి మృతదేహం

  వారం రోజుల క్రితం విశాఖనగరంలో ప్రమాదవశాత్తు ఒక కాలువలో పడికొట్టుకుపోయిన ఆరేళ్ళ చిన్నారి అదితి, గురువారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం వద్ద గల సముద్ర తీరానికి శవమై కొట్టుకు వచ్చింది. ఆమె తండ్రి సత్య శ్రీనివాసరావు పాప ఒంటిపై ఉన్న దుస్తులను బట్టి ఆమె తన కూతురేనని దృవీకరించారు. గత వారం రోజులుగా పాప పడిపోయిన చోట నుండి సముద్రం వరకు గల కాలువలను, చివరికి సముద్రంలో కూడా హెలికాఫ్టర్ ద్వారా గాలించినప్పటికీ ఆమె ఆచూకి దొరకకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కానీ చివరికి ఆ చిన్నారి అదితి పక్క జిల్లాలో సముద్రం ఒడ్డున శవం అయి తేలింది. ఇంతవరకు ఆశగా ఎదురుచూసిన పాప తల్లితండ్రుల ఆ చిన్నారిని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం విశాఖకు తరలించారు.

ఏపీకి జగన్ అతిథా?

  రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట హైదరాబాద్ లోనే ఉండి పాలనా కార్యక్రమాలు నిర్వహించినా ఆతరువాత అది సాధ్యం కాదని భావించి వారంలో మూడు రోజులు అక్కడ మూడు రోజులు విజయవాడలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆతరువాత అది కూడా కాదని ఇప్పుడు మొత్తంగా అక్కడే ఉండి పాలనా విధానాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫోకస్ ప్రతిపక్ష నేత అయిన జగన్ మీద పడింది. ప్రతిపక్షనేత ఏపీకి అతిధిగా మారారని విమర్శలు తలెత్తున్నాయి. ప్రతిపక్షనేత జగన్ హైదరాబాద్ ను విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడటం లేదని.. ఎప్పుడో ఒకసారి ఏపీకి వస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు పార్టీ నేతలు ఏపీకి వెళదాం అని సూచించినా కూడా ఇప్పుడే వెళ్లి ఏం చేస్తాం అని కూడా అంటున్నారట. మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా విజయవాడలో ఉండటంతో జగన్ కు రాబోయే కాలంలో ఇదే మైనస్ పాయింట్ అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారట. మరి ఇప్పుడైనా జగన్ ఏపీ మకాం వేయడానికి ఇష్టపడతారో లేదో చూడాలి.