bird flu

బర్డ్ ప్లూ హెచ్చరిక: చికెన్, గుడ్లు తినొద్దు

  అందరికీ హెచ్చరిక.... హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ బయటపడింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో వున్న కోళ్ళఫారాలలో ఉన్న కోళ్ళకు బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు భోపాల్ ల్యాబ్‌కి శాంపిల్స్ పంపించారు. ల్యాబ్ ఫలితాలు బర్డ్ ఫ్లూ ఉన్నట్టు వచ్చాయి. దాంతో అధికారులు చికెన్‌, గుడ్లు తినవద్దని ప్రజలకు సూచించారు. కొద్ది సంవత్సరాల క్రితం బర్డ్ ఫ్లూ కారణంగా మరణాలు సంభవించాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం పాటు చికెన్, కోడిగుడ్ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఒక్క హైదరాబాద్‌లో వారు  మాత్రమే కాదు... తెలుగు రాష్ట్రాల వారు కొద్ది రోజులపాటు చికెన్, గుడ్లకు దూరంగా వుంటే మంచిది.

Nara Lokesh

తెదేపా కార్యకర్తల కోసం నారా లోకేష్ సంక్షేమ యాత్ర

  దేశంలో ప్రప్రధమంగా తెదేపాయే తన కార్యకర్తల సంక్షేమం కోసం నిధులు ఏర్పాటు చేసి వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చాలా ఏళ్ళబట్టి తెదేపా తన కార్యకర్తలు, వారి కుటుంబాల కోసం, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నప్పటికీ వాటన్నినీ నిరంతరంగా కొనసాగించేందుకు పటిష్టమయిన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది మాత్రం నారా లోకేష్ అని చెప్పక తప్పదు. పార్టీ కార్యకర్తలకి రూ. 2 లక్షల ప్రమాద భీమా చేయాలనే ఆలోచన కూడా ఆయనదే.   ప్రస్తుతం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన ఈరోజు నుండి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో పర్యటించి, ప్రమాదాలలో మరణించిన 49 మంది కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి ఒక్కొక్కరికీ రూ.2లక్షల భీమా పరిహారం అందజేస్తారు. ముందుగా అయన చిత్తూరు జిల్లాలో కుప్పం నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఆ తరువాత జిల్లాలో మదనపల్లి, పుత్రమద్ది, శెట్టిపల్లె గ్రామాలలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి చెక్కులు అందజేస్తారు.   రాత్రికి తిరుపతిలోనే బస చేసి రేపు కడప జిల్లాలో కేశవాపురం, అనంతపురం జిల్లాలో కండ్లగూడూరు, హోసూరు, డోన్ మండలాలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేస్తారు. బుధవారం నాడు కర్నూలు జిల్లాలో కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి చెక్కులు అందజేస్తారు.

 red sandal thief arrested

‘ఎర్ర’ దొంగలకి బుద్ధి రాలేదు

  మొన్నీమధ్యే 20 మంది ఎర్రచందనం దొంగలని పిట్టల్లా కాల్చి పారేసినా, మిగతా ఎర్రచందనం దొంగలకు బుద్ధి వచ్చినట్టు కనిపించడం లేదు. అడవుల్లోకి ప్రవేశించి ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూనే వున్నారు. కడప, నెల్లూరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో పోలీసులు జరిపిన కూంబింగ్‌లో 134 మంది ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాలు, సెల్‌ఫోన్లు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారందరూ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు చెందినవారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన కూలీలలో ఎక్కువమంది ఈ ప్రాంతానికి చెందినవారే.

sakshi maharaj comments

కు.ని. ఆపరేషన్‌కీ, ఓటుకీ లింకు

  బీజేపీ నాయకుడు సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలని ఆమధ్య పిలుపు ఇచ్చి వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారాయన. ఇప్పుడు ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికే ఓటుహక్కు ఇవ్వాలని, అలా చేయించుకోని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఆయన వ్యాఖ్యానించారు. జనాభాని నియంత్రించాలంటే అదే సరైన దారి అని, దీనిపై చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలు, క్రైస్తవులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోరని తాను అనడం లేదని, తాను సూచిస్తున్న చట్టాన్ని అన్ని మతాలవారికీ వర్తించేలా చేయాలని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే ప్రజలు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవడం ప్రారంభించినట్టయితే ఇప్పుడు భారత జనాభా 30 కోట్లు మాత్రమే వుండేదని, అలా చేయించుకోనందునే 130 కోట్లకు చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. సాక్షి మహరాజ్ చేసిన ఈ వ్యాఖ్యల మీద నిరసన వ్యక్తమవుతోంది.

telangana secretariat

చెస్ట్ ఆస్పత్రిపై హైకోర్టు ఆదేశాలు

  హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో వున్న చెస్ట్ ఆస్పత్రిని నగరం బయటకి తరలించి, ఆ ప్రదేశంలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న సచివాలయానికి వాస్తుదోషం వున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిమీద తెలంగాణ ప్రభుత్వం కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వాస్తుదోషం కారణంగా అని కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసమే సచివాలయాన్ని తరలించాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. కోర్టు ఇదే విషయాన్ని పిటిషనర్‌కి తెలిపింది. దాంతో పిటిషనర్ చెస్ట్ ఆస్పత్రి పురాతన భవనమని విన్నవించారు. హైకోర్టు చెస్ట్ ఆస్పత్రి పురాతన భవనాల పరిధిలోకి వస్తుందో రాదో చెప్పాలని పురావస్తు శాఖను ఆదేశించింది. ఒకవేళ అది పురాతన భవనం అయిన పక్షంలో అక్కడ సచివాలయం నిర్మాణం చేయడానికి వీల్లేదని, నిర్మాణ పనులన్నీ ఆపివేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

actor shivaji jaladeeksha

నటుడు శివాజీ జలదీక్ష

  నటుడు శివాజీ విజయవాడ వద్ద కృష్ణానది నీటిలో సగం మునిగి జలదీక్ష ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆయన ఈ జలదీక్షను ప్రారంభించారు. సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రి దిగువన కృష్ణానదిలో ఆయన జలదీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇప్పించే బాధ్యతను తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే సగం మునిగామనే విషయాన్ని కేంద్రానికి గుర్తు చేస్తూ తాను జలదీక్ష చేస్తున్నానని, ఏపీ ప్రజలను పూర్తిగా ముంచొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు. తాను బీజేపీలో లేనని సోము వీర్రాజు అనే బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించడం మీద శివాజీ స్పందిస్తూ.. సోము వీర్రాజు అనే వ్యక్తి అసలు ప్రజలకు తెలుసా అని ప్రశ్నించారు. తాను బీజేపీలో లేనట్టయితే, మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా బీజేపీలో లేనట్టేనని, ఎందుకంటే తామిద్దరం ఒకేసారి పార్టీలో చేరామని శివాజీ చెప్పారు.

bangladesh railway station

డ్రైవర్ లేకుండానే వెనక్కి వెళ్లిన రైలు

  బంగ్లాదేశ్ లోని రాజ్ బర్హీ రైల్వే స్టేషన్లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. రైలులో డ్రైవర్, గార్డ్ లేకుండానే రైలు ప్రయాణించింది. అది కూడా ఏకంగా 26 కిలోమీటర్లు, అందులోనూ వెనక్కి ప్రయాణించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. రాజ్ బర్హీ నుంచి ఫరీద్ పూర్ కు బయల్దేరిన రైలు ఆరో నెంబరు ఫ్లాట్ ఫాం పై ఆగింది. టీ తాగడానికి డ్రైవర్ ఇంజిన్ ఆపకుండా వెళ్లడంతో, అప్పటికే ఆన్ లో ఉన్న ఇంజిన్ గేర్ మారి వెనక్కి ప్రయాణించడం మొదలుపెట్టింది. ఆసమయంలో రైలులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సమయానికి హోం గార్డ్ కూడా అందుబాటులో లేడు. దీంతో భయపడిన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపే ప్రయత్నం చేసినా రైలు ఆగలేదు. ఇంతలో టీటీ అన్వర్ హుస్సేన్ రైలులో డ్రైవర్ లేడని గ్రహించి వెంటనే వ్యాక్యూమ్ బాక్స్ నుంచి కీ బాక్స్ ను తొలగించడంతో రైలు ఆగింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్, గార్డులను విధుల నుండి సస్పెండ్ చేశారు.

Sania creates history

అదరగొట్టావ్ సానియా...

  మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా నంబర్‌వన్ ర్యాంక్‌ను పొందడంతో ఆమెను అభినందనల వెల్లువ ముంచెత్తుతోంది. పలువురు ప్రముఖులు ట్విట్టర్లో సానియాని అభినందించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ‘‘ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ సొంతం చేసుకొన్నందుకు అభినందనలు’’ ట్వీట్ చేశారు. యువతరానికి సానియా విజయాలు ఆదర్శం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. వివిధ రాష్ట్రాల సీఎంలు అనందిబెన్ పటేల్, దేబేంద్ర ఫడ్నవీస్, మమతాబెనర్జీ, సినీ ప్రముఖులు నాగార్జున, రవీనాటాండన్ సోనూసూద్, సుశాంత్, ఫరాన్ అక్తర్, ఫరాఖాన్, క్రీడాకారులు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సచిన్, లియాండర్ పేస్, రాజకీయ ప్రముఖులు కేటీఆర్, దిగ్విజయ్ సింగ్ లతో పాటు మరికొందరు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇంకా అభినందనల ప్రవాహం కొనసాగుతూనే వుంది...

Supreme Court

కలిసున్నా పెళ్లయినట్టే... సుప్రీం

  పెళ్లి కాకుండా, సహజీవనం చేస్తే పెళ్లయినట్టే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. పెళ్లి కాకుండా కలిసి జీవించే వారిలో సహజీవన భాగస్వామి చనిపోతే అతని ఆస్తి ఆమెకు చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ తాత ఆస్తులపై మనవలు, మనవరాళ్లు వేసిన కేసులను విచారించిన తరువాత సుప్రీం కోర్టు ఈ రకమైన రూలింగ్ ఇచ్చింది. తమ బామ్మ చనిపోగా తాత వేరే మహిళతో కలిసి ఉంటున్నాడని, కానీ వారు పెళ్లి మాత్రం చేసుకోలేదని, ఇటీవల తాత మరణించాడని వాళ్లు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ ఆస్తి ఆమెకు చెందదని వాదించారు. సుప్రీంకోర్టు మాత్రం ఆమెకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తాజాగా ఈ రూలింగ్ ను పాస్ చేసింది.

is kcr belongs to telangana

ఇంతకీ కేసీఆర్ తెలంగాణవాడేనా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఏ ప్రాంతానికి చెందనవాడన్న సందేహాలు, వాదనలు వున్నాయి. కేసీఆర్ పూర్వికులు ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి ప్రాంతం నుంచి తెలంగాణకు వలస వచ్చారని అంటారు. అలాగే కేసీఆర్ స్వయంగా అసలు తమ పూర్వికులు బీహార్‌కి చెందినవారని చెప్పారు. ఇదిలా వుంటే, ఇంతకీ కేసీఆర్ తెలంగాణవాడేనా అనే సందేహం తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన అసలు తెలంగాణవాడేనా అనే సందేహం కలుగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.

 High Court

ఒకేరోజు మూడు క్లిష్టమయిన కేసులపై హైకోర్టులో విచారణ

  ఈరోజు హైకోర్టులో ఒకేసారి మూడు ముఖ్యమయిన పిటిషన్లపై విచారణ జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా అసోసియేషన్)కి జరిగిన ఎన్నికలపై దాఖలయిన మూడు పిటిషన్లను కోర్టు ఈరోజు విచారణకు చేప్పట్టనుంది. వాటిలో మా అసోసియేషన్ ఎన్నికలపై పెద్ద వివాదమేమీ లేదు కనుక ఈరోజు దాని ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికల నిర్వహణ, ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ కేసులలో అనేక చిక్కు ముళ్ళు ఉన్నాయి కనుక వారిపై తీర్పు చెప్పడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.   మా అసోషియేషన్ ఎన్నికల ప్రక్రియను విడియో రికార్డింగ్ చేసి హైకోర్టుకి సమర్పించబడింది. దానిని చూసిన తరువాత కోర్టు తన తీర్పు వెలువరించవచ్చును.   ఇక జి.హెచ్.యం.సి. ఎన్నికల నిర్వహించేందుకు కనీసం ఈ ఏడాది డిశంబర్ వరకు సమయం అవసరమని తెలంగాణా ప్రభుత్వం కోరుతోంది. కానీ అంత సమయం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది కనుక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేంది తెలియజేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని తెలంగాణా ప్రభుత్వం ఈరోజు కోర్టును కోరవచ్చును.   ఇక ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ పై ఆంద్రప్రదేశ్ డీ.జి.పి. ఇచ్చిన సంజాయిషీతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయినవారు హత్యకు గురయినట్లుగా కేసులు నమోదు చేసి, దానిపై సమగ్ర నివేదిక అందజేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనిస్తే హైకోర్టు ఈ ఎన్కౌంటర్ పై చాలా ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది కూడా పలు క్లిష్టమయిన అంశాలతో కూడిన కేసు కనుక దీనిపై కూడా విచారణ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని భావించవచ్చును.

muslims vote

ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలట

  దేశంలో ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని శివసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని కోరింది. ముస్లింలు తరుచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నారని పేర్కొంది. ఎఐఎంఐఎం పార్టీ నేతలు విషపు పాముల లాంటి వారని విమర్శించింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేదని సామ్నాలో తెలిపింది. అయితే శివసేన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ శివసేన పై విరుచుకుపడ్డాయి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల మతస్థుల మధ్య విభేదాలు వస్తాయని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. ప్రజలలో ఆవేశాలను రగిలించి సమాజాన్ని చీల్చడానికే శివసేన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని.. శివసేన చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

chain snatcher home guard

హోంగార్డ్.. చలాకీ చైన్ స్నాచర్

  చైన్ స్నాచింగ్ ఒక కళ. ఈ కళలో నిష్ణాతులైన చాలామంది మనకు కనిపిస్తూ వుంటారు. చిటికెలో మెడలోని నగలను తెంచుకుని వెళ్ళిపోతుంటారు. ఈ కళ మీద ఒక హోంగార్డ్‌కి మక్కువ కలిగింది. ఎవరెవరో చైన్ స్నాచింగ్ చేసి బాగుపడిపోతున్నారు.. నేను మాత్రం ఎందుకు బాగుపడకూడదు.. ఈ హోంగార్డ్‌ ఉద్యోగానికి వచ్చే జీతం ఏ మూలకి వస్తుందని అనుకున్నాడో ఏమోగానీ హైదరాబాద్‌లోని ఓ హోంగార్డు చైన్ స్నాచర్‌గా మారిపోయాడు. ఒకవైపు హోంగార్డుగా పనిచేస్తూనే, ఖాళీ సమయాల్లో సరదాగా చైన్ స్నాచింగ్ చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడు. ప్రొఫెషనల్ చైన్ స్నాచర్ల కంటే బెటర్‌గా చైన్ స్నాచింగ్‌లు చేస్తున్న ఈయనగారి జాతకం తిరగబడి హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసులకు దొరికిపోయాడు. ఇతగాడు దొరికిపోయిన తర్వాత అతను హోంగార్డు అని తెలుసుకుని పోలీసులు నోళ్ళు తెరిచారు. ఇతనితోపాటు అతనికి సహకరిస్తున్న ఒక మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరి దగ్గర్నుంచి పోలీసులు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

andhra pradesh

వర్షాలు ఇంకా కురుస్తాయి

  తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. మండుటెండలు కాస్తాయని అనుకుంటే వర్షాకాలం తరహాలో పట్టినపట్టు వదలకుండా వర్షాలు కురవడం విచిత్రం. దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరిగింది. అయితే వర్షాలు ఇంకా కురిసే అవకాశం వుందని తెలుస్తోంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయట. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వుందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కర్నాటక నుంచి కేరళ మీదుగా కొమరిన్ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి సైతం కదులుతోంది. వీటికి తోడు క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. వీటి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

చైనా పెత్తనం చేయాలని చూస్తోంది...

  అమెరికా అధ్యక్షుడు చైనా తీరుపై మండిపడ్డారు. ఆసియా ఖండంలోని చిన్న దేశాలపై ఆర్ధిక బలంతో చైనా పెత్తనం చేయాలని చూస్తోందని, ఇది ఆ ప్రాంతానికి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఇది చాలా చెడు ప్రభావాలకు దారి తీస్తుందన్నారు. పనామాలో జరుగనున్న కరేబియన్ సదస్సులో పాల్గొనేందుకు ఒబామా జమైకా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ సముద్రంలోని అధిక భాగాన్ని చైనా క్లెయిమ్ చేసుకుంటుందని, దీనివల్ల ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర దేశాల ఎక్స్ క్లూజివ్ జోన్ లోకి చైనా చొచ్చుకెళ్తోందని మండిపడ్డారు. దీని వల్ల భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం..

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా బాలసముద్రం వద్ద నేషనల్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీని ప్రారంభించారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బెంగుళూరుకు దగ్గరలోనే నేషనల్ అకాడమీ ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లో అనంతపురం రెండో స్థానంలో ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. బెంగుళూరు-హైదరాబాద్ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుచేయాలని చంద్రబాబు అరుణ్ జైట్లీని కోరారు.

నిజమైన ప్రజాస్వామ్యం అదే

  మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలే ఆశయాలను ఆచరించాలి.. అదే ఆయనకు మనము ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ పూలే ఆశయ సాధన కోసం తపించేవారని, పూలేను ఆదర్శంగా తీసుకొనే అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలే అని, వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎప్పడైతే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని వెల్లడించారు.

కత్తిపోట్లతో ప్రేయసి... తాళి కట్టిన ప్రియుడు

  కత్తిపోట్లుతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ప్రియురాలు మెడలో తాళి కట్టి తన భార్యను చేసుకున్నాడు ఓ ప్రియుడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కలెసైల్వి అనే యువతి తమిళనాడులోని తిరువారూరు జిల్లా వవుసినగర్ లో ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన ఇళయరాజా, ఆమె ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను ఇంట్లో వ్యతిరేకించడంతో ఆమె ఇళయరాజా దగ్గరే ఉంటుంది. కాగా వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహానికి కావలసిన తాళి, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇళయరాజా వెళ్లాడు. ఈ నేపథ్యంలో కలెసైల్వికుటుంబసభ్యులు, చిన్నాన్నలు అక్కడికి వెళ్లి ఆమెను ఇంటికి వచ్చేయాలని బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన వారు ఆమెపై కత్తితో దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన కలెసైల్విని తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఒక వైపు కలెసైల్వి చికిత్స పొందుతున్నా మళ్లీ ఎక్కడ వచ్చి దాడి చేస్తారో... లేదా తమను విడదీస్తారేమోనని భయంతో ఇళయరాజా ఆమె మెడలో తాళికట్టాడు.