ఏపీ శంకుస్థాపన 400 కోట్లు.. కాదు కాదు 10 కోట్లే అంటున్న మంత్రులు..

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో మరోవైపు కార్యక్రమానికి అవుతున్న ఖర్చు నిమిత్తం విమర్శలు తలెత్తున్నాయి. ఒకపక్క రాష్ట్రం విడిపోయి ఆర్ధిక పరిస్థితులు అంతత మాత్రంగా ఉన్న ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని ఇతర పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎప్పుడు ఖర్చు గురించిన వివరాలు పట్టించుకోని సీఎం చంద్రబాబు కూడా తాను చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు బడ్జెట్ గురించిన వివరాలు తెలుపుతున్నారు. అంతేకాదు మంత్రులు కూడా ఈ విమర్శలను ఖండిస్తున్నారు. ఏపీ ప్రతిపక్షనేత జగన్ శంకుస్థాపన కార్యక్రమానికి రూ 400 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పిన నేపథ్యంలో.. ఆమాటల్లో ఎంతమాత్రం నిజం లేదని.. శంకుస్థాపన కార్యక్రమానికి కేవలం రూ. 10 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామని ఏపీ మంత్రులు తెలుపుతున్నారు.  ఇప్పటివరకూ గుంటూరు కలెక్టర్ కు రూ.7కోట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కు రూ.2కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశామని చెబుతున్నారు. అంతేకాదు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కొంత మంది తమంతట తాముగా ఉచితంగా సర్వీసులు అందిచడానికి ముందుకు వచ్చారని.. కొంత మంది నేతలు తమ ఖర్చు తామే పెట్టుకుంటున్నారని.. అంతేకాదు ఈ కార్యక్రమానికి యాకరింగ్ గా ఒప్పుకున్న సాయికుమార్ సైతం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా యాంకరింగ్ చేయడానికి ఒప్పుకున్నారని తెలియజేశారు. మొత్తానికి రూ.400 కోట్ల రూపాయల ఖర్చు అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేవలం రూ.10 కోట్లు మాత్రమే అని చెప్పడం దానికి సంబంధించిన వివరాలు కూడా వారు తెలియజేస్తున్నా.. కేవలం 10 కోట్ల రూపాయలకే శంకుస్థాపన కార్యక్రమం అవుతుందా అని పలువురు సందేహాలు వస్తున్నాయి.

జగన్ కు ఒళ్లంతా కుళ్లే.. లోకేష్

తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శల బాణాలు కురిపించారు. ఈ నెల 22వ తేదీన ఏపీ నూతన రాజధాని శంకస్థాపన కార్యక్రమం జరుగుతున్న సంగతి  తెలిసింది. ఈనేపథ్యంలో జగన్ చంద్రబాబుకు బహిరంగ లేఖ కూడా రాశారు. తనను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిలవద్దని.. పిలిచినా రానని.. ఒకవేళ పిలిచిన తరువాత రాకపోతే తనను నిందిచవద్దని అందుకే ముందే చెబుతున్నానని లేఖ రాశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ తాము చేసే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఓర్వలేకే జగన్ తాను రానని.. తనని పిలవద్దని కుంటి సాకులు చెబుతున్నారు. జగన్ కు ఒళ్లంతా కుళ్లుమోతుతనమే ఉందని అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి.. ఇలా రాష్ట్ర కార్యక్రమాలను బహిష్కరించడం ఆయనకే మంచిది కాదు. ఇంత వైరం పెట్టుకున్నాక ఆయన అధికారుల్తో మాత్రం ఎలా మెదల గలుగుతున్నారు.. అని వారు అనుకుంటున్నారు. ఒక్క నారా లోకేశ్ మాత్రమే కాదు ఇతర పార్టీ నేతలు కూడా జగన్ ఓర్వలేక ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రానని అంటున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ హడావుడి చూసి జగన్ తాను సీఎం అయితే తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగి ఉండేది కదా అని ఫీలవుతున్నట్టున్నారు.

కీలకమయిన బీహార్ అసెంబ్లీ రెండవ దశ పోలింగ్ నేడే

  బీహార్ అసెంబ్లీకి నేడు రెండవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో మాత్రం పోలింగ్ మూడు గంటలకే ముగుస్తుంది. బీజేపీ, జనతా పరివార్, సమాజ్ వాదీ పార్టీలకు అత్యంత కీలకమయినవిగా భావిస్తున్న 32 నియోజక వర్గాలలో ఇవ్వాళ్ళ ఎన్నికలు జరుగబోతున్నాయి. కైమూర్, రోహ్తాస్, అరవాల్, జెహనాబాద్, ఔరంగాబాద్ మరియు గయ జిల్లాలో గల 32 స్థానాలకు మొత్తం స్థానాలకు 456మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.   బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ (ఎన్డీయే) ఇమామ్ గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్ధి ఉదయ్ నారాయణ్ చౌదరి (జె.డి.యు.) ఇదే నియోజక వర్గం నుండి వరుసగా ఐదుసార్లు గెలిచారు. ఆయన బీహార్ అసెంబ్లీ స్పీకర్. ఇవ్వాళ్ళ పోలింగ్ జరుగుతున్న నియోజక వర్గాలలో మొత్తం 86,13,870 మంది ఓటర్లున్నారు. ఎన్నికల సంఘం 32 నియోజక వర్గాలలో మొత్తం 9, 119 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. పోలింగ్ సజావుగా సాగేందుకు 993 కంపెనీల పారా మిలటరీ దళాలు రంగంలో దింపింది.

మూడోరోజూ మిన్నంటిన బతుకమ్మ సంబరాలు

తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయ్. ఉయ్యాల పాటలు, కోలాటాల, గౌరమ్మ పూజలతో బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. తెలగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న వేడుకలు కూడా ఘనంగా జరిగాయి,  బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ అచ్చమైన పల్లె పాటల నడుమ మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం బంగారు బతుకమ్మ నృత్యరూపకం ప్రదర్శించారు. బతుకమ్మ సాక్షిగా నూటికి నూరుశాతం ఆడపిల్లలను చదివించాలంటూ నిర్ణయం తీసుకున్నారు, బతుకమ్మపై వివిధ రకాల పూలను ఎలా అమర్చుతారో తెలంగాణ రాష్ట్రంలో కూడా విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న వర్గాలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

రవీంధ్రభారతిలో రెండోరోజూ అదే ఉత్సాహం

  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో... హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు తరలివచ్చారు. విద్యుత్ దీపాల కాంతులతో రవీంద్రభారతి ప్రాంగణం వెలిగిపోతుంటే, తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్నారు, తెలంగాణ సంస్కృతి పట్ల అవగాహన కల్పించడానికి ఈ వేడుకల్లో విద్యార్థులను కూడా భాగస్వాములుగా చేశారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో విద్యార్ధులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు కళాకారులను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నందిని సిధారెడ్డి, ఆచార్య ఏస్‌వీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

రవీంధ్రభారతిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్రమంతటా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి, హైదరాబాద్ రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్‌, సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు, ఈ వేడుకలకు పెద్దఎత్తున హాజరైన మహిళలు... బతుకమ్మలను ఎత్తుకుని ఆడిపాడారు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలతో, రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మ పరిమళాలతో రవీంద్రభారతి ప్రాంగణం పులకరించింది, రవీంధ్రభారతిలో 8రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను చాటుతూ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తున్నారు.

శంఖుస్థాపనకి నన్ను పిలవద్దు...పిలిచినా నేను రాను: జగన్

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఒక బహిరంగ లేఖ వ్రాసారు. రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానిస్తూ తనకు ఎటువంటి లేఖ పంపవద్దని కోరారు. ఒకవేళ ఆహ్వానించినా తను హాజరుకానని తెలిపారు. ఆహ్వానం పంపించి ఆ తరువాత తను రానందుకు నిందించవద్దని అన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కొని దానిపై రాజధాని నిర్మించడాన్ని తను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నానని కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా అక్కడే రాజధాని నిర్మిస్తున్నందున నిరసనగా తను ఈ కార్యక్రమానికి హాజరుకాదలచుకోలేదని వ్రాసారు. రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ ఎందుకు విధించారని ముఖ్యమంత్రిని జగన్ తన లేఖలో ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకొని రాజధానిని నిర్మించడాన్ని తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అందుకే నిరసనగా తను శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కాదలచుకాలేదని తెలిపారు.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి కొత్త అస్త్రాన్ని బయటికి తీశారు, గతంలో ఒకసారి దళిత్, ముస్లిం, బ్రాహ్మణ కాంబినేషన్ తో  ఘనవిజయం సాధించిన మాయావతి...ఈసారి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు, వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్ర కులాలను ఆకట్టుకోవడానికి కొత్త ఎత్తువేసిన మాయావతి...  బీఎస్పీ అధికారంలోకి వస్తే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అగ్రవర్ణాల్లోని పేదలు చాలా దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్సించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు, తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు.

కేసీఆర్ ఫెయిల్ అయ్యారంటున్న తమ్మినేని

  ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిప్పులు చెరిగారు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సక్సెస్ అయ్యారేమో కానీ, ముఖ్యమంత్రిగా పరిపాలనలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారంటూ తమ్మినేని ఆరోపించారు. రైతులు, కార్మికులు, గిరిజనులు, దళితులు ఇలా అన్ని వర్గాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని తమ్మినేని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న తమ్మినేని... రైతుల బ్యాంకు రుణాలపై మంత్రి పోచారం పచ్చి అబద్దాలు చెబుతున్నారంటూ విమర్శించారు

అమెరికా అధ్యక్షుడి కంటే బాబు ఖర్చే ఎక్కువట

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు, టీడీపీ ప్రభుత్వం హంగూ ఆర్భాటాలతో పాలన సాగిస్తోందన్న ఆయన.... చంద్రబాబు విమాన ప్రయాణాల ఖర్చే వంద కోట్లు ఉంటుందని ఆరోపించారు, అమెరికా అధ్యక్షుడు కంటే ఎక్కువగా చంద్రబాబు తన పర్యటనల కోసం ఖర్చు పెడుతున్నారని లోక్ సత్తా జేపీ విమర్శించారు. ఎప్పుడూ అమరావతి జపం మాత్రమే చేస్తూ మిగతా ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నారని, చంద్రబాబు విధానాలతో మరోసారి ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు వచ్చే అవకాశముందని జేపీ వ్యాఖ్యానించారు, రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన ఏపీని నిధుల దుబారాతో చంద్రబాబు మరింత కష్టాలు పాలు చేస్తున్నారని జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు.

అమరావతిపై ప్రధానికి ఫిర్యాదులు

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రధాని నరేంద్రమోడీకి పర్యావరణవేత్తలు ఫిర్యాదు చేశారు, ఏపీ రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చుంటే, దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కి అందజేసి, వారి అనుమతితో పనులు చేపట్టాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు, ఇవేమీ చేయకుండా ఏపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పనులు చేపడుతోందని ప్రధాని మోడీకి పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు కంప్లైంట్ చేశారు, పర్యావరణం, ఇతర సమస్యలను పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం చేపట్టడం మంచిది కాదని, అమరావతి శంకుస్థాపనకు వచ్చే మోడీ దీనిపై ఆలోచించాలని పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు సూచిస్తున్నారు.

రాజీనామాలపై వైసీపీ ఎమ్మెల్యేల్లో విభేదాలు?

  జగన్ దీక్ష విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో కంగుతిన్న వైసీపీ ముఖ్యనేతలు... నానా హైరానాపడ్డారట, ఒకవైపు జగన్ హెల్త్ రిపోర్ట్ పై మంత్రుల విమర్శలు... మరోవైపు జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా... ప్రభుత్వం దీక్షను భగ్నం చేయకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని బెదిరించారట, ఇదే విషయాన్ని నేరుగా స్పీకర్ కు కూడా చెప్పారట, అయితే మూకుమ్మడి రాజీనామాల ప్రతిపాదనపై కొందరు అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది, దాంతో అంతర్మథనంలో పడిన వైసీపీ అధిష్టానం... ఆ నిర్ణయంపై వెనక్కితగ్గిందంటున్నారు. ఒకవేళ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించినా...అందరూ ముందుకురాకపోతే అసలుకే మోసం వస్తుందని భావించి వెనకడుగు వేసిందంటున్నారు. దాంతో జగన్ ను ఆస్పత్రికి లిఫ్ట్ చేయాలంటూ ప్రభుత్వాన్ని వైసీపీ ముఖ్యనేతలు బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణదీక్షకు దిగిన జగన్...చివరికి ప్రభుత్వాన్ని వేడుకుని లిఫ్ట్ చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

మూకుమ్మడి రాజీనామాలంటూ బెదిరించారట

  67మంది వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారనే టాక్ వినిపిస్తోంది, జగన్ దీక్ష విషయంలో చంద్రబాబు సర్కార్  తమాషా చూడటంతో వైసీపీ నేతలు కంగారుపడ్డారని, జగన్ ఆరోగ్యం విషమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం, ఆస్పత్రికి లిఫ్ట్ చేయకపోవడంతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ బెదిరించారని అంటున్నారు, దీక్ష పేరుతో బాబును జగన్ ఇరకాటంలో పెడదామనుకుంటే, ప్రభుత్వం కూడా జగన్ విషయంలో గేమ్స్ ఆడిందని అంటున్నారు. దీక్ష పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ చూస్తే, ఎన్నిరోజులు ఉంటాడో చూద్దామనే రీతిలో సర్కార్ వ్యవహరించిందంటున్నారు, ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్షను భగ్నంచేయకుండా జగన్ కు సర్కార్ చుక్కలు చూపించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించారని, దాంతో కొత్త తలనొప్పి ఎందుకని భావించి ఏడోరోజు జగన్ దీక్షను భగ్నం చేశారని చెప్పుకుంటున్నారు.

జగన్ దీక్ష ఫ్లాప్.. ఆ నాయకుడు వల్లేనా

ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్ష చేయడం వల్ల ఓరిగేందంటే కనీసం ఆపార్టీ నేతలు కూడా సమాధానం చెప్పలేరు. అసలు దీక్ష చేసి ఏం సాధించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా జగన్ కు దీక్షలు చేయడం అలవాటుగా మారిపోయింది. అలాగే ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసి ఆఖరికి నవ్వులపాలు అవ్వాల్సి వచ్చింది. అయితే పార్టీ శ్రేణులు మాత్రం ఇప్పుడు దీక్ష చేయోద్దని జగన్ చెప్పినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వంతో పాటు అటు ప్రజలు కూడా రాజకీయ శంకుస్థాపన కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారని.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం తరువాత దీక్ష సంగతి చూద్దాం అని చెప్పినా కూడా జగన్ దీక్షకు పూనుకున్నారట. అయితే జగన్ దీక్ష చేయడం వెనుక పార్టీలో కొత్త నాయకుడు ఉన్నాడని.. అతని ప్రోత్సాహం వల్లే జగన్ దీక్షకు పూనుకున్నారని దీక్షలో విఫలం అయ్యారని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారట. అంతేకాదు ఈ దీక్ష వల్ల జగన్ కు చాలా నష్టం జరిగిందని.. ఇక భవిష్యత్ లో జగన్ ఎలాంటి దీక్షలు చేస్తానన్నా ఎవరూ పట్టించుకోరని.. దీనివల్ల జగన్ కు చాలా నష్టంజరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడే జగన్ అంత సీరియస్ గా దీక్ష చేస్తేనే ఏపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. అలాంటిది ఈ ఎఫెక్ట్ వల్ల భవిష్యత్ లో చేసే దీక్షలకు కూడా విలువ ఉండదని అనుకుంటున్నారు. ఏది ఏమైనా జగన్ దీక్ష ప్లాప్ అయిందని జగన్ పార్టీ నేతలే అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు.

రైతు ఆత్మహత్యలపై కోదండరాం.. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు, అధికార పార్టీని ఎండగడుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని.. రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జేఏసీ కోదండరాం కూడా రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు షాకిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలపై ఆయన కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అయితే ఇప్పటి వరకూ రైతు ఆత్మహత్యలపై ఏం మాట్లాడటం లేదని కోదండరాంపై ఇప్పుడు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో చర్చాంశనీయమైంది. ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉన్నాయని.. స్వామినాథన్ కమిటీ నివేదికను పట్టించుకోవడం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని, దీని పైన తాను సమగ్ర సర్వే జరిపానని, ఇందుకు సంబంధించి తన వద్ద నివేదిక ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలతో ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు కోదండరాం కూడా తోడయ్యాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ శంఖనాదం

దసరా రోజు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి ప్రత్యేకంగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఏ ముఖ్యమంత్రో.. ఇంకెవరో అనుకుంటున్నారా? కాదు. అది ఎవరంటే.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో శంఖం ఊదేందుకు శంఖేశ్వర్ ను ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన శంఖేశ్వర్ శంఖం ఊదడంలో  నిష్ణాతుడు. ఈయన గురించి ప్రముఖ సంఘ సేవకుడు రామచంద్ర డోంగ్రీజీ మహరాజ్ గోశాల ట్రస్టీ జస్ మత్ భాయ్ పటేల్ ద్వారా తెలుసుకున్న టీడీపీ వర్గాలు ఆయనతో శంఖం ఊదించాలని నిర్ణయం తీసుకొని ఆయనను ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కాగా శంఖేశ్వర్ కు రెండు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయనతో శంకునాదం చేయిస్తుంటారు. ఆయన మంచినీళ్లు కూడా తాగకుండా ఏకధాటిగా 1100 సార్లు శంఖనాదం చేయగలరు.

టీడీపీ ఎంపీ మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

మెడికల్ సీట్ల విషయంలో మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 127 సీట్లకు తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో A, B కేటగిరి సీట్లను అమ్ముకున్నారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఆ 127 సీట్లకు ఈనెల 20లోగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి సూచించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటును కోటి రూపాయలకు అమ్ముకున్నారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి.