‘వైకాపు’ల కలవరం.. కలకలం...

  ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని, తుంటిమీద కొడితే పళ్ళు రాలినట్టు అనే సామెతలు తెలిసినవే. ఇప్పుడు జగన్ పార్టీ వైకాపాలో అంతర్గత రాజకీయాలు ఈ సామెతకు తగ్గట్టుగా తయారయ్యాయి. ప్రస్తుతం పార్టీలో ఏర్పడిన పరిస్థితులు ఇంతకాలం పార్టీకి ‘కాపు’గాసిన వారికి పార్టీలో మనశ్శాంతిగా వుండలేని పరిస్థితులు తెచ్చిపెట్టాయి. సిట్యుయేషన్ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం పార్టీలోని వ్యక్తులు కాదు.. అసలు వైసీపీకి ఎలాంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్. ఆశ్చర్యగా వుందా? నమ్మశక్యం కావడం లేదా? కానీ, ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్. వై‘కాపు’లలో కలవరం, కలకలం రేగడానికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా కారణమయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే....   ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్‌కి జనాల్లో ఎంత క్రేజ్ వుందో, ఆయన సామాజికవర్గమైన కాపులలో కూడా అంత క్రేజ్ వుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాపు సామాజికవర్గం కొన్ని దశాబ్దాలుగా తమనుంచి సరైన నాయకుడు లేక చాలా వెలితిగా ఫీలవుతోంది. సంఖ్యాపరంగా రాష్ట్ర రాజకీయాలను శాశించే స్థితిలో వున్నప్పటికీ తమ నుంచి సరైన నాయకుడు రాలేదే అనే బాధ వీరికి వుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఆయన మీద ఆశలు పెట్టుకున్న వీరందరూ ఆయన జెండా పీకేసి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో షాకయ్యారు. అయితే మొన్నీమధ్యే రాజకీయ రంగప్రవేశం చేసి ‘జనసేన’ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ చుట్టూ వీళ్ళు తమ ఆశల పందిరిని అల్లుకుంటున్నారు. భవిష్యత్తులో తమ నుంచి ‘ముఖ్య’ నేతగా ఎదిగే వ్యక్తి పవన్ కళ్యాణ్‌ అని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య అటు తిరిగి, ఇటు తిరిగి వైసీపీలోని కాపులలో కలకలం రేగేలా చేసింది.   ఏపీ రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ మొన్నామధ్య పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పదేళ్ళపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతే... ఈమాట డైరెక్టుగా వెళ్ళి వైసీపీ నాయకుడు జగన్‌ గుండెని తాకింది. అప్పటి వరకూ తమ పార్టీలోని సీనియర్ కాపు నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనుకుంటున్న జగన్ ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. ఆ పదవిని శెట్టిబలిజ నాయకుడు పిల్లి సుభాస్ చంద్రబోస్‌కి ఇవ్వాలని డిసైడ్ చేసేశారు. గోదావరి జిల్లాల్లో కాపులకు దీటుగా నిలిచే సామాజిక వర్గం శెట్టిబలిజ. తమ నాయకుడిని కాదని తమకు వ్యతిరేకంగా వుండే సామాజికవర్గం నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో వైసీపీలోని కాపు నాయకులందరూ లబోదిబో అంటున్నారు. వచ్చే ఎన్నికలలో కాపుల అండదండలతో తాను సీఎం అవ్వాలని ఓవైపు జగన్ భావిస్తుంటే, మరోవైపు కాపుల ఇష్టుడు పవన్ కళ్యాణ్ మాత్రం మరో పదేళ్ళపాటు చంద్రబాబే సీఎం అని అనడంతో జగన్ హర్టయ్యారట. ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయే కాపు నాయకులకు తాను ఎందుకు పదవులు ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి మొండిచెయ్యి ఇచ్చారట. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు తిరిగి, ఇటు తిరిగి ఉమ్మారెడ్డి పదవికి ఎసరుపెట్టేసరికి వైసీపీలోని కాపు నాయకులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో వున్నారట.

ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద శాపనార్ధాలు

  ఈ ఏడాది నుండి శ్రీ రామనవమి ఉత్సవాలను కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీరామాలయంలో అధికారికంగా నిర్వహించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని విశాఖకు చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తీవ్రంగా తప్పు పట్టారు. హిందూమత సంబంధమయిన ఇటువంటి విషయాలలో ప్రభుత్వం తమవంటి మఠాధిపతులు, సాధువుల సలహాలు తీసుకోవడం అధికారుల సలహాలను పాటించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇదివరకు గోదావరి పుష్కరాలకు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమనెవరినీ సంప్రదించలేదని ఇప్పుడు శ్రీ రామనవమి ఉత్సవాలకు కూడా సంప్రదించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం తలబెట్టే ఇటువంటి కార్యక్రమాలకి ఆ దేవుడి ఆశీసులు కూడా దక్కవని అన్నారు. తమను పక్కనబెట్టి ముందుకు వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూలిపోతుందని శపించారు.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెపుతున్నారు. ఆయన  కొన్ని రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు పనిగట్టుకొని వెళ్లి స్వామీ స్వరూపానందను కలవడం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. జగన్మోహన్ రెడ్డి ఆయనను దర్శించుకొని సేవించుకొన్నందునే స్వామీజీకి జగన్ పై అనుగ్రహం కలిగి ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిలాగే ఈ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చేపుతున్నారేమో? మతంపేరుతో స్వామీజీలు ఈవిధంగా రాజకీయాలలో, ప్రభుత్వ నిర్ణయాలలో వేలుపెట్టాలనుకోవడం, లేకపోతే ఈ విధంగా ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రభుత్వాలు కూలిపోతాయని శాపాలు పెట్టడం సమంజసమేనా? ఈ విధంగా తెర వెనుక రాజకీయాలు చేస్తూ, ప్రభుత్వాలను అప్రదిష్టపాలు జేస్తూ ప్రభుత్వాలకు శాపనార్ధాలు పెట్టే బదులు స్వామీజీలు, వాస్తు సిద్దాంతులకు రాజకీయాల మీద అధికారం మీద అంత మక్కువ ఉంటే వారు కూడా ఎన్నికలలో పోటీచేసి గెలిచి ప్రభుత్వాన్ని తమకు నచ్చినట్లు నడిపించుకోవచ్చు కదా?

భోగాపురం వద్ద ఎయిర్ పోర్ట్ సిటీ నిర్మాణానికి కసరత్తు మొదలు

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ చాలా ఆత్మవిశ్వాసం కనబరుస్తూ అనేక భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులు మరియు రాజధాని నిర్మాణం అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును. ఇప్పుడు తాజాగా విజయనగరం-విశాఖ నగరాల మధ్య ఉన్న భోగాపురం వద్ద 15, 000 ఎకరాల స్థలంలో ఒక విమానాశ్రయం, విమాన శిక్షణ కేంద్రం, విమానాల రిపేరింగ్ మరియు సర్వీసింగ్ విభాగలతో కూడిన ఒక ‘ఎయిర్ పోర్ట్ సిటీ’ నిర్మాణం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసం సాంకేతిక మరియు సామాజిక సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఆర్.ఐ.టి.ఈ.యస్.(రైట్స్) అనే ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థకు పని అప్పగించింది. ఆ సంస్థ ఈ ఏడాది చివరిలోగా తన నివేదిక సమర్పిస్తుంది.   ఎయిర్ పోర్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల నుండి మొత్తం 28 అనుమతులు పొందవలసి ఉంటుందని వాటిలో కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన 18 అనుమతులను వచ్చే ఏడాదిలోగా సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని రాష్ట్ర మౌలిక వసతుల కల్పనా శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టుని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపడతామని అందులో ప్రభుత్వం తన వాటాగా భూమిని ఇస్తుందని ఆయన తెలిపారు. దీని కోసం భోగాపురం వద్ద మొత్తం 15, 000 ఎకరాల స్థలం సేకరించి అందులో 5000 ఎకరాలు విమానాశ్రయానికి, 5000 ఎకరాలు విమాన శిక్షణ మరియు సర్వీసింగ్ విభాగాలకి, మిగిలిన 5000 ఎకరాలు అభివృద్ధి చేసి తిరిగి రైతులకే అప్పగిస్తామని ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (నోడల్ సంస్థ)ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.   భోగాపురం వెళ్ళేదారిలోనే ఉన్న మధురవాడ వద్ద ఐ.టి.హబ్, ఐ.టి.ఇంక్యూబేటర్ సెంటర్, గంభీరం గ్రామం వద్ద ఐ.ఐ.యం. మొదలయిన ఉన్నత విద్యా ఉపాధి సంస్థలు రాబోతున్నాయి. ఇంతకాలం అభివృద్ధికి నోచుకోని విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజి వచ్చే అవకాశం ఉంది గనుక ఆ రెండు జిల్లాలలో మున్ముందు అనేక పారిశ్రామిక కారిడార్లు కూడా ఏర్పాటవ్వబోతున్నాయి. ఒకవేళ ఈ ఎయిర్ పోర్ట్ సిటీ కల కూడా సాకారం అయినట్లయితే ఇక విశాఖతో బాటు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో కూడా అభివృద్ధి జోరందుకొంటుంది.

జనసేనకి మద్దతు ఇచ్చిన జనాలకి థాంక్స్!

  రాజకీయాలలోకి హటాత్తుగా ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవిలాగే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా అయోమయంలో ఉన్నట్లుంది. చిరంజీవికయితే తన ప్రజారాజ్యం ఎన్నికలలో గెలవాలి, గెలిచి తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని ఏలేయాలనే ఒక నిర్దిష్టమయిన పగటి కలయినా ఉండేది. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మాత్రం అటువంటిదేమీ లేకుండానే బరిలోకి దిగిపోయి తడబడుతున్నాడు. పార్టీని పెట్టింది అధికారం కోసం కాదు ప్రశ్నించడానికేనన్నాడు. పోనీ ప్రశ్నించడానికయినా మనిషి కనబడతాడా? అంటే అదీ లేదు.   అంత తీరిక లేకపోతే కనీసం ట్వీటర్ లోనయినా ఆ పని కానిచ్చేస్తుంటే ఆయన అభిమానులు కూడా ఎలాగో సర్దుకుపోయేవారు. కానీ దానికీ ఆయనకీ టైం ఉండటం లేదు. అంత బిజీ మనిషి మళ్ళీ ఉన్నట్లుండి తుళ్ళూరుకి వచ్చి ఒకరోజంతా వీరంగం ఆడేశాడు. ఆ తరువాత ఏమయిందో ఏమో గానీ అంతకు ముందు తిట్టిన నోటితోనే ప్రభుత్వాన్ని తెగ మెచ్చేసుకొని మాయమయిపోయాడు. పోతూపోతూ "జి.హెచ్.యం.సి ఎన్నికలలోనే మళ్ళీ నే..కనబడేది." అని ఓ చిన్న మాట అనేసి పోయాడు. అది పట్టుకొని అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. కానీ ఆ సంబరంలో అంతకు ముందు, తరువాత ఆయన చెప్పిన మాటలన్నీ మరిచిపోయారు.   మళ్ళీ ఇప్పుడు తాజాగా “జనసేనకు మద్దతు ఇచ్చిన జనాలకి థాంక్స్” అంటూ ఒక ట్వీటర్ మెసేజ్ ఒకటి పోస్ట్ చేసాడు. ‘అయితే అదేదో అప్పుడే చెప్పేస్తే బాగుండేది కదా?’ అని కొందరు గొణుకొంటుంటే, ‘మళ్ళీ వస్తానన్న పెద్దమనిషి, ప్రశ్నించడానికి ఎప్పుడు వస్తాడో చెప్పకుండా ఇలా ఇప్పుడు చల్లగా ‘థాంక్స్’ చెపుతున్నాడేమిటి?’ అంటూ మరికొందరు రుసరుసలాడుతున్నారు. అయితే ఇన్ని రోజుల తరువాత ‘అక్కలకీ, చెల్లెమ్మలకీ, అన్నలకీ, తమ్ముళ్ళకీ పేరుపేరునా జగన్మోహన్ రెడ్డి ఇస్టయిల్లో ఎందుకు ‘థాంక్స్’ చెప్పుకోవడం దేనికో ఆయనే వివరిస్తే బాగుండేది. తన వన్-మ్యాన్-ఆర్మీ జనసేన పార్టీకి జనాలు మద్దతు ఇస్తున్నారని గ్రహించినప్పుడు, ఇలా ఎక్కడో కూర్చొని వారికి థాంక్స్ మెసేజులు పెట్టడం కంటే ఆయన కూడా వచ్చి వారికి మద్దతు ఇస్తే బాగుండేది కదా? ఇప్పుడు ఎందుకు రాలేకపోయాడో మరో ఆరు నెలల తరువాత జనాల మధ్యకి వచ్చినపుడు చెపుతాడేమో.

పంట పొలాల క్రింద పైప్ లైన్స్?

  రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టే వివిధ ప్రాజెక్టులలో అన్నిటి కంటే క్లిష్టమయిన ప్రక్రియ భూసేకరణే. ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేప్పట్టిన భూసేకరణ ప్రక్రియ అందుకు అద్దం పడుతోంది. ప్రభుత్వం 40, 000 ఎకరాలు భూసేకరణ చేద్దామనుకొంటే ఇప్పటి వరకు అతికష్టం మీద 32, 0000 ఎకరాలు సేకరించగలిగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపేట్టబోయే జల హారం (వాటర్ గ్రిడ్) ప్రాజెక్టులో భాగంగా నీళ్ళ గొట్టాలు వేసేందుకు భూసేకరణ చేయాలంటే ఇంకా చాలా కష్టం అవుతుంది. కనుక దాని అవసరం లేకుండా అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికీ కూడా పెద్దగా నష్టం లేకుండా వ్యవసాయ భూములున్న ప్రాంతాలలో వాటి క్రింద నుండి గొట్టాలు వేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా పంట పొలాల క్రింద ఉండే భూమిని వినియోగించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఈ విధానాన్ని మొదట గుజరాత్ రాష్ట్రంలో అమలుచేసారు. తరువాత తెలంగాణా రాష్ట్రంలో అమలుచేయబోతున్నారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలుచేయాలని భావిస్తోంది. అందుకోసం ఆ రెండు ప్రభుత్వాలు రూపొందించిన నియామావళి, అనుసరిస్తున్న విధివిధానాలు, పద్దతులను రాష్ట్ర రెవెన్యూ మరియు జలవనరుల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వారి అధ్యయనం పూర్తి చేసి తమ నివేదికను అందజేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేస్తుంది. బహుశః ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలున్నాయి.

రాహుల్ శలవు పొడిగింపా...అంతా కుట్ర!

  కీలకమయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు వారాలు శలవు మీద వెళ్ళడం, అందుకు ఆ పార్టీ చెపుతున్న కారణాలవల్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలయ్యింది. అది సరిపోదన్నట్లుగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఈ నెలాఖరు వరకు తన శలవును పొడిగిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలతో మరింత అభాసుపాలయింది. దానితో అప్రమత్తమయిన కాంగ్రెస్ పార్టీ తక్షణమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించింది.   పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సురేజ్ వాలా డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శలవు మీద వెళ్ళిన మాట వాస్తవమే. కానీ ఆయన తన శలవును పొడిగించారని మీడియాలో వచ్చిన వార్తలేవీ నిజం కాదు. ఎవరో కొందరు వ్యక్తులు ఆయన ప్రతిష్టను, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఉద్దేశ్యపూర్వకంగానే ఇటువంటి వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. కనుక అటువంటి వార్తలను నమ్మవద్దని, ప్రచురించవద్దని మా మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము,” అని కోరారు.   కానీ రెండు వారాల శలవుపై వెళ్ళిన రాహుల్ గాంధీ ఇంకా ఎందుకు తిరిగిరాలేదు? ఎప్పుడు తిరిగి వస్తారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏమి చేస్తున్నారు? అనే మీడియావారి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేరుగా సమాధానం ఇవ్వలేదు. మీడియా కూడా రాహుల్ గాంధీ వ్యక్తిగత స్వేచ్చను గౌరవించాలని మాత్రం కోరారు.   నిజానికి ఆయన ఈనెల 10వ తేదీన పార్టీ కార్యక్రమాలలో తిరిగి పాల్గొంటారని అందరూ భావించేరు. కానీ నేటికీ ఆయన రాకపోవడంతో పార్టీ వర్గాలను సంప్రదిస్తే ఈనెలాఖరు వరకు ఆయన తన శలవును పొడిగించినట్లు చెప్పడంతో మీడియా అదే వార్తను ప్రచురించింది. కానీ ఇప్పుడు దాని వలన ఆయనకి, పార్టీ ప్రతిష్టకి భంగం కలుగుతోందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ వార్తలను ఖండిస్తోంది. కానీ ఆవిధంగా చేసి ప్రజలకు తనే స్వయంగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయింది. ఆయన శలవు పొడిగించినట్లయితే ఆయన ప్రతిష్టకు, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని స్వయంగా కాంగ్రెస్ పార్టీయే ద్రువీకరిస్తునట్లుంది.   ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం, తన మీదే ఆధారపడున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసం ఏవో సరికొత్త వ్యూహాలు, సిద్ధాంతాలు కనిపెట్టేందుకు శలవు తీసుకొన్నట్లు కాంగ్రెస్ పార్టీయే చెప్పుకొంటోంది. కానీ పార్టీని ఇంతగా నలుగురిలో నవ్వులపాలు చేస్తూ ఆయన పార్టీని తీర్చిదిద్దేందుకు శలవు తీసుకోవడందేనికో పార్టీకే తెలియాలి. తీరాచేసి శలవు ముగించుకొని ఆయన తన మంత్రదండంతో తిరిగి వచ్చిన తరువాత తనకంటే దేశముదురు కాంగ్రెస్ నేతలను ఏమీ చేయలేక చతికిలపడితే అప్పుడు ఇంకా అప్రదిష్ట కలుగుతుంది. అంతేకాదు పార్టీలో సీనియర్లను పక్కన బెట్టాలని ఆయన ప్రయత్నించినట్లయితే అప్పడు వారందరూ కలిసి ఆయనకే పార్టీ నుండి ఉద్వాసన ఇప్పించినా ఆశ్చర్యం లేదు. ఏమయినప్పటికీ రాహుల్ గాంధీ మొదలు పెట్టిన ఈ డ్రామాతో కాంగ్రెస్ పార్టీ చాలా ఇరకాటంలోపడింది. మున్ముందు ఇంకా పెద్ద ఇరకాటంలో పడబోయే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి.

భ్రమలు వదిలించిన ఏపీ ఉద్యోగులు

  భ్రమలు వదిలించిన ఏపీ ఉద్యోగులు ఎవరూ ఎవరినీ ఎక్కువకాలం భ్రమల్లో వుంచలేరు. తాత్కాలికంగా భ్రమల్లో వుంచినా, చాలా కొద్దికాలానికే వారి అసలు స్వరూపం బయటపడిపోయి, వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే అయింది. రాష్ట్ర విభజన వద్దంటూ అప్పట్లో ప్రభుత్వోద్యోగులు సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా నడిపారు. తెలుగువారు కలిసి వుండాలని ఉద్యోగులు ఎంత బాగా శ్రమపడుతున్నారో అని అప్పట్లో అందరూ అనుకున్నారు. అప్పటి వరకూ ప్రభుత్వోద్యోగుల మీద ప్రజల్లో వున్న వ్యతిరేక భావం మాయమైపోయింది. ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు హీరో అయిపోయారు. ఇంత మంచి ప్రభుత్వోద్యోగులు ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం అని తెలుగువారు మురిసిపోయారు. అయితే ఆ మురిసిపోవడం మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ప్రభుత్వోద్యోగుల అసలు స్వరూపం మెల్లమెల్లగా బయటపడింది. ప్రజలు ప్రభుత్వోద్యోగుల మీద పెట్టుకున్న భ్రమలన్నీ క్రమంగా తొలగిపోయి, ఇప్పుడు వారి నిజ స్వరూప దర్శన భాగ్యం కలుగుతోంది.   రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన చూసిన ఏపీ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే, ప్రభుత్వోద్యోగులు సమైక్య ఉద్యమం చేసింది తెలుగు ప్రజలు ఒక్కటిగా వుండాలన్న ఉద్దేశంతో కాదు... హాయిగా స్థిరపడిన హైదరాబాద్‌ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టంలేకే. ఏపీ కొత్త రాజధానికి సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ పాలన మొత్తం హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఉద్యోగుల మొండి వైఖరి ఇబ్బందికరంగా మారింది. ఏపీ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సీఎం అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే ఏపీకి తరలి వెళ్ళిపోయినట్టయితే ప్రజల్లో వారి మీద వున్న గౌరవం పెరిగేది. అయితే వారు తాము ఇప్పుడప్పుడే హైదరాబాద్‌ వదిలేది లేదని, కొత్త రాజధానిలో తమకు సదుపాయాలు వుండవని చెబుతున్నారు. ఈ ఒక్క మెతుకు చాలు.. ప్రభుత్వ ఉద్యోగుల అన్నం ఎంతవరకు ఉడికిందో చెప్పడానికి.   కొత్త రాష్ట్రం ఏర్పడగానే రాష్ట్ర అభివృద్ధి కోసం సామాన్య ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో అవకాశాలు కోల్పోయారు. భవిష్యత్ తరాల ప్రజలు కూడా ఎన్నో అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వోద్యోగులు మాత్రం తమకు చెందిన ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వోద్యోగుల పదవీకాలాన్ని రెండేళ్ళపాటు పెంచేలా ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. తద్వారా నిరుద్యోగుల నెత్తిన చెయ్యి పెట్టారు. ఆ తర్వాత తాము సమ్మె చేసిన కాలానికి స్వచ్ఛందంగా జీతం వదులుకున్నట్టయితే గౌరవంగా వుండేది. ఆ కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించేలా ఒత్తిడి తెచ్చి, తమ జీతం డబ్బులు ఎక్కడకీ పోకుండా చూసుకున్నారు. అసలే ఆర్థికంగా కష్టాల్లో వున్న ప్రభుత్వం మీద ఎంతమాత్రం జాలి చూపించకుండా 43 శాతం ఫిట్‌మెంట్ పుచ్చుకుని జీతాలు డబుల్ చేసుకున్నారు. ఇన్నిచేశాం కదా... ఇప్పుడు కొత్త రాజధానికి వెళ్దాం పదండయ్యా అంటే, అక్కడ మా స్థాయి సౌకర్యాలు లేవు కాబట్టి ఇప్పుడప్పుడే రాలేం అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇలాంటి వారిని నమ్ముకుంటే ఏపీ ఎప్పటికి బాగుపడుతుందో దేవుడనేవాడుంటే ఆయనకే తెలియాలి. ఏపీ ప్రభుత్వోద్యోగులు తెలంగాణ టూరిస్టులే... జీతం అక్కడ తీసుకోవాలి.. టాక్స్‌లు ఇక్కడ కట్టాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మొహమాటంగా చెప్పేసినా ఇంకా హైదరాబాద్‌‌నే పట్టుకుని వేలాడుతున్న వాళ్ళని ఏమనాలి?

తెదేపా, బీజేపీల కలహాల కాపురం ఇలాగేసాగుతుందా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు తమ మిత్ర పక్షమయిన తెదేపాకి, తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వానికి ఇంతవరకు అప్పుడప్పుడు చిన్నచిన్న చురకలు వేస్తుండేవారు. కానీ తెదేపా నేతలు మిత్రధర్మం వల్లనయితేనేమి కేంద్రంతో తమ అవసరాల కారణం వల్లనయితేమేనీ ఎన్నడూ వారిపై ప్రతి విమర్శలు చేయకుండా నిగ్రహం పాటిస్తుండేవారు. కానీ కేంద్రబడ్జెట్ వెలువడిన తరువాత సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా తెదేపా నేతలందరూ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే బీజేపీ నేతలు మౌనం దాల్చవలసి వచ్చింది.   ఆ తరువాత కేంద్రం నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించడంతో తెదేపా వెనక్కి తగ్గగానే, మళ్ళీ బీజేపీ నేతలు గొంతు సవరించుకోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు తమ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని స్వయంగా విమర్శించడమే కాకుండా, తన పార్టీ నేతలను కూడా అందుకు అనుమతించినందుకు, రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనపై కొంచెం గుర్రుగానే ఉన్నారు. పైగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో తెదేపా యంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని కోరుతూ ధర్నా కూడా చేసారు.   తెదేపా యంపీ యన్. శివప్రసాద్ మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు అనుమతిస్తే “మేము జమ్మి చెట్టుపై ఉంచిన మా అస్త్రశస్త్రాలన్నీ క్రిందకు దించి కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేసేందుకు సిద్దంగా ఉన్నామని” మీడియా సాక్షిగా ప్రకటించడం కూడా బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సరిపోదన్నట్లు చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్ మరియు మాణిక్యాల రావు కొన్ని రోజుల క్రితం చిత్తూరులో కరువు ప్రాంతాలను పర్యటిస్తున్నప్పుడు, అక్కడ వారికి స్థానిక తెదేపా నేతల వలన కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వారి సమావేశంలో ‘ఇంతకీ బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసింది?’ అనే శీర్షికతో కొందరు కార్యకర్తలు కరపత్రాలు పంచడం వారికి చాలా ఆగ్రహం కలిగించింది.   అందుకే తాము కూడా తెదేపాపై బాణాలు వేసుకొనేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చేసుకొన్నవిన్నపానికి బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే మొదట శాసనసభలో చంద్రబాబుని పొగిడిన బీజేపీ సభ్యులు ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి చిన్న చురకలు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తెదేపా సైలెంట్ అయిపోయింది. కానీ ఒకవేళ తెదేపా మళ్ళీ గళం విప్పితే తాము కూడా దానితో సమాన స్థాయిలో రాగాలాపన చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.   మోడీ అధికారం చేప్పట్టగానే అసలు ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఇవ్వనివిధంగా ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే 24x7గంటలు నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు, ఎయిమ్స్, ఐఐయం, ఐఐఐటి సంస్థలను మంజూరు చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వాటికంటే ముందు పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించేందుకు మోడీ ప్రభుత్వం తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ఏడూ ముంపు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసిన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   ఒకవేళ తెదేపా నేతలు తమతో సఖ్యతగా ఉంటే సరేసరి లేకుంటే తాము కూడా కత్తులు, బాణాలు బయటకు తీయకతప్పదని బీజేపీ నేతలు చెపుతున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు, ప్రతిపక్షాలు వారి ఈ కలహాల కాపురం ఇంకా ఇలా ఎన్నాళ్ళు సాగుతుందో ఏమోనని అనుకొంటున్నారు.

ఏపీ గ్యాస్ ఏపీకే కానీ వయా గుజరాత్

  గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల కృష్ణా, గోదావరి బేసిన్ నుండి వెలికి తీస్తున్న అపారమయిన గ్యాస్ నిక్షేపాలు ఎక్కడో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి పైపుల ద్వారా తరలిపోతున్నాయి. అందువల్ల పెరట్లో ఉత్పత్తి అవుతున్న ఈ గ్యాస్ ని ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ కి భారీగా డబ్బు చెల్లించి మరీ కొనుగోలు చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. వేసవిలో పెరగనున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక విద్యుత్ సంస్థల నుండి విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంది. కానీ ముందు జాగ్రత్తతో గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ తో కూడా ఒక ఒప్పందం చేసుకొంది.   దాని ప్రకారం ఆ సంస్థ రోజుకి 1.6 మిలియన్ స్క్వేర్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ రాష్ట్రానికి సరఫరా చేస్తుంది. ఈ గ్యాసుతో రాష్ట్రంలో ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థల ద్వారా 300 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే అవకాశం ఉంటుంది. దానితో ఈవేసవిలో విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా జరుగుతుంది. ఇక మరో విశేషం ఏమిటంటే గెయిల్ సంస్థ ఇదే గ్యాసుకి 14.5 డాలర్లు వసూలు చేస్తుంటే, గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ మాత్రం 13.8 డాలర్ల ధరకే సరఫరా చేసేందుకు అంగీకరించింది. తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ సంస్థ నుండి గ్యాస్ కొనుగోలు చేసి లగడపాటి రాజగోపాల్ కి చెందిన ల్యాంకో గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థకు దానిని అందించి దాని నుండి విద్యుత్ తీసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.   కేంద్ర పెట్రోలియం మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేయగానే రాష్ట్రానికి గ్యాస్ సరఫరా మొదలవుతుంది.

పాదయాత్రలతో పాపాలను కడిగేసుకోగలిగితే...

  బొగ్గు కుంభకోణం కేసులో వచ్చేనెల 8న కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలని మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కి సీబీఐ ప్రత్యేక కోర్టు నిన్న నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. ఆయనతో బాటు కుమార్ మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి పిసి.ఫారెక్, హిండాల్కో కంపెనీ, దానికే చెందిన మరో ఇద్దరు అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది. 2005 సం.లో డా. మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను నిర్వహిస్తున్నప్పుడు, ఒడిషా రాష్ట్రంలోతలబిర-2 బొగ్గు గనులలో హిండాల్కో కంపెనీకి 15 శాతం వాటాను కేటాయించడం జరిగింది. బొగ్గు గనుల కేటాయింపులలో భారీ కుంభకోణం జరుగుతోందనే సంగతి గ్రహించిన సుప్రీంకోర్టు బొగ్గు గనుల త్రవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దాదాపు 147 లైసెన్సులు రద్దు చేసి, వాటిపై విచారణ చెప్పట్టమని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుని ఏర్పాటుచేసి విచారణ మొదలుపెట్టింది. ఆ కోర్టు మొట్ట మొదటగా డా. మన్మోహన్ సింగ్ వైపే వేలెత్తి చూపడం విశేషం.   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈరోజు డిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం నుండి తన యంపీలు, సీనియర్ నేతలతో కలిసి డా. మన్మోహన్ సింగ్ కి మద్దతు తెలుపుతూ ఆయన ఇంటివరకు పాదయాత్ర చేసారు. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ “డా. మన్మోహన్ సింగ్ నిష్కళంకమయిన వ్యక్తి అని యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. అటువంటి వ్యక్తిపై సీబీఐ ఇటువంటి నిందారోపణలు చేయడం కోర్టుకి హాజరుకమ్మని నోటీసులు జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తి మద్దతుగా ఉంటుంది. అవసరమయితే ఆయన కోసం న్యాయ పోరాటం చేయడానికి కూడా మేము సిద్దం,” అని తెలిపారు.   డా. మన్మోహన్ సింగ్ ఎటువంటి అవినీతికి పాల్పడరని అందరికీ తెలుసు. కానీ ఆయన బొగ్గు మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నప్పుడు అందులో జరిగే అక్రమాలకు ఆయన బాధ్యుడుకాడని చెప్పలేము. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలకు ఆయన ఆమోదముద్ర వేసి, ఇప్పుడు అందుకు తను బాధ్యుడినికానని ఆయన వాదించడం అసమంజసం. అదీగాక బొగ్గు గనుల కేటాయింపులో చాలా అవినీతి జరుగుతోందని ఆ సమయంలో ప్రతిపక్షాలు చాలా గట్టిగా హెచ్చరించాయి కూడా. అయినా అదేమీ పట్టించుకోకుండా ఆయన ఆమోదముద్ర వేశారంటే ఖచ్చితంగా అందుకు బాధ్యత వహించాల్సిందే.   ఆయన స్వయంగా ఎటువంటి నేరమూ చేసి ఉండకపోవచ్చును. ఆ కుంభకోణంలో ఎటువంటి లబ్ది పొంది ఉండకపోవచ్చును. కానీ అవినీతి జరుగుతోందని ఖచ్చితంగా తెలిసిన తరువాత కూడా ఆయన ఆమోదముద్ర వేయడం అంటే అవినీతికి ఆమోదముద్ర వేసినట్లే. కనుక ఇటువంటి పాదయాత్రల వలన ఆయనకు అంటుకొన్న ఈ అవినీతి మసి తొలగిపోదు. పైగా ఇప్పుడు ఆయనకు మద్దతుగా సోనియాగాంధీ చేప్పట్టిన పాదయాత్ర వలన యావత్ ప్రపంచానికీ కూడా ఈ సంగతి కాంగ్రెస్ పార్టీయే స్వయంగా డప్పు కొట్టుకొని మరీ చాటింపు వేసుకొన్నట్లయింది. ఈ కుంభకోణంలో నిందితులుగా పేర్కొనబడిన ఆరుగురు వ్యక్తులు కూడా తాము ఎటువంటి తప్పు చేయలేదని, ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్పుకొంటున్నారు. మరయితే ఇన్ని వేలకోట్ల అవినీతికి పాల్పడింది ఎవరు? దేశ సంపదని అంతా బొక్కేసింది ఎవరు?

ఆడిన మాట తప్పని జగన్

  ఇంతకాలం జగన్‌ అనుచరగణం ఆయన్ని మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు అని పొగుడుతూ వుంటే రాజకీయ వర్గాలు మంచి జోక్ విన్నట్టుగా హాయిగా నవ్వుకునేవి. జగన్ అనే పేరు వినగానే లక్షల కోట్ల కుంభకోణాలు, పదహారు నెలల జైలు జీవితం తప్ప మరో విషయం ఎవరికీ గుర్తుకురాని పరిస్థితుల్లో, జగన్ అనుచరగణం ఆయన మాటతప్పని, మడమ తిప్పని మనిషి అని పొగుడుతూ ఆత్మానందం చెందుతూ వుండటం నిజంగానే నవ్వు తెప్పించే విషయమే. అయితే ఏపీ రాజకీయాలలో తాజాగా జరిగిన పరిణామాలు జగన్ మడమ తిప్పని మనిషి అనే విషయం అలా వుంచితే జగన్ మాట తప్పని మనిషి అనే విషయం మాత్రం చాలా కరెక్ట్ అని తేలిపోయింది. రాజకీయ వర్గాలు ఈ విషయంలో ఇంతకాలం ఆయన్ని అపార్థం చేసుకున్న విషయం కూడా స్పష్టమైంది. ఇంతకీ, జగన్ మాట తప్పని మనిషి అని ఎలా రుజువైంది?   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతోపాటు జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తాను కోరుకున్నట్టు అసెంబ్లీలో జరగకపోతే తాను ‘అగ్లీ’గా ప్రవర్తిస్తానని స్పీకర్ని హెచ్చరించారు. ఆ మీటింగ్‌లో జగన్ వ్యవహార శైలి, ‘అగ్లీ’గా ప్రవర్తిస్తానని హెచ్చరించడం గౌరవనీయ స్పీకర్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. వెంటనే ఆయన జగన్‌కి క్లాస్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మీరు ఇలా మాట్లాడ్డం సరికాదని మందలించారు. మామూలుగా ఎవరైనా తాను మాట్లాడిన విధానాన్ని పునః పరిశీలించుకుని పశ్చాత్తాపం చెందుతారు. కానీ, అక్కడ ఉన్నదెవరూ.... జగన్ గారు. అందుకే పశ్చాత్తాపం లాంటి పనులేమీ జరగలేదు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. స్పీకర్‌తో జరిగిన మీటింగ్‌లో తాను అసెంబ్లీలో ఎలా ప్రవర్తిస్తానని చెప్పారో జగన్ కచ్చితంగా అలాగే ప్రవర్తిస్తూ తాను మాట మీద నిలబడే వ్యక్తినని నిరూపించుకున్నారు. ఇలా ఆడిన మాట తప్పని జగన్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా వుండటం ఆ రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పుణ్యం.

మందు చూపుతో టీడీపీలోకి... ముందు చూపుతో వైసీపీలోకి...

  మొన్నటి ఎన్నికలలో వైసీపీ తరఫున ఓ పెద్దాయన ఎంపీగా గెలిచారు పారిశ్రామికవేత్తగా మంచి పేరు ప్రతిష్ఠలున్న ఆ పెద్దాయన చిటుక్కున ఇలా గెలిచాడో లేదో లటుక్కున వైసీపీలోంచి టీడీపీలోకి జంపైపోయారు. ఆయనకు ఓట్లు వేసిన ఓటర్ల వేళ్ళమీద ఇంకు ఆరకముందే ఆయన జంప్ జిలానీ అయిపోయారు. ఆ జంప్ జిలానీ పేరేంటో తెలుసుకోవాలన్న ఇంట్రస్ట్ మీకు బాగా పెరిగిపోయింది కదూ.. ఆయన పేరును మేం చెప్పడం కంటే.. రెండు నిమిషాలు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. సరే, ఎన్నికలు అయిపోయాయి, పార్టీ మారడమూ అయిపోయింది... ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఆయన ప్రస్తావన ఎందుకనే సందేహం మీకు రావడం సహజం.. ఆ సందేహాన్ని తీర్చడం మా బాధ్యత. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకురావలసి వచ్చిందంటే... ఆయన మరోసారి పార్టీ మారబోతున్నారు. టీడీపీ నుంచి బ్యాక్‌ టు హోం అన్నట్టుగా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళబోతున్నారు. దీనికోసం ఆయన ఇప్పటికే మూటాముల్లె సర్దేసుకుని సిద్ధంగా వున్నారు. రేపో ఎల్లుండో వైసీపీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తాను తిరిగి వైసీపీలోకి వెళ్ళబోతున్నానని ప్రకటించే అవకాశం వుంది. మరి ఎంతో ముచ్చటపడి టీడీపీలో చేరిన ఆయన మళ్ళీ ఎందుకు వైసీపీలోకి వెళ్ళబోతున్నారు? దీని వెనుక వున్న అసలు కారణమేంటి? పార్టీ ఫిరాయింపుల చట్టం చేతిలో చిక్కి చిక్కి శల్యమైపోతానన్న భయమా? లేక మరేదైనా వుందా?   నిజానికి సదరు పెద్దాయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అవడం వెనుక ‘మందు’చూపు వుంది. అచ్చు తప్పు కాదు.. నిజంగానే మందుచూపు వుంది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద డిస్టిలరీ వుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా డిస్టిలరీలు తెలంగాణ రాష్ట్రంలోనే వుండిపోయాయి. అయితే ఏపీలో సదరు పెద్దాయనకు ఉన్న డిస్టిలరీని ప్రభుత్వం ఒడిలోకి చేర్చితే తనకు బోలెడంత ఆదాయం వస్తుందని ప్లాన్ వేసిన ఆయన టీడీపీలో చేరిపోయారు. దాంతో ఈమధ్యే ఆయన డిస్టిలరీని ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ఆ పెద్దాయనికి బోలెడు ఆదాయం వచ్చేలా చేసింది. తన మందు చూపు వర్కవుట్ అయిందని హ్యాపీగా వున్న ఆ పెద్దాయనకి ఇంతలో ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. తనకు ఒక ప్రాణాంతక వ్యాధి వుందని, అది అడ్వాన్స్ స్టేజ్‌లో వుందని తెలిసిపోయింది. జీవితంలో ఎంతో శ్రమించి, ఎంతో సాధించిన తనకు ఇక శాశ్వత విశ్రాంతి తప్పదని ఆయనకు అర్థమైపోయింది. కాలం ముందు ఎవరైనా ఓడిపోక తప్పదన్న సత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆయన మానసికంగా సిద్ధమయ్యారు. ఈ దశలో ఆయన ఇప్పుడు ముందుచూపుతో, మధ్యంతర ఎన్నికల చూపుతో ఆలోచిస్తున్నారు. మందుచూపుతో టీడీపీలోకి వచ్చిన ఆయన ఇప్పుడు ముందుచూపుతో వైసీపీలోకి వెళ్ళబోతున్నారు. తన తర్వాత తన వారసుడు టీడీపీ తరఫున పోటీకి నిలిచిన పక్షంలో తనమీద ఆగ్రహంతో వున్న వైసీపీ తప్పకుండా పోటీ పెడుతుంది. అప్పుడు తన వారసుడు గెలవొచ్చు లేదా ఓడిపోవచ్చు. అదే తాను మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతే తన వారసుడు తప్పకుండా గెలిచే అవకాశం వుంది. టీడీపీ కూడా అభ్యర్థిని పోటీకి నిలిపే అవకాశం లేదు. ఎందుకంటే, నందిగామ, తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని నిలపలేదు. ఈ కోణంలో ఆలోచించిన ఆ పెద్దాయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. వైసీపీ నాయకుడు జగన్‌కి ఈ పెద్దాయన మీద కోపం వున్నప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

నిధుల కోసం నిలదీసేవరకు వేచి చూడటం ఎందుకు?

  తెదేపా, బీజేపీలు మిత్రపక్షాలుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రానికి హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేకహోదా, వివిధ ప్రాజెక్టుల మంజూరు, నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో తెదేపా నేతలు, మంత్రులు కేంద్రంపై కొంచెం గుర్రుగా ఉన్నారు. కానీ వారు స్నేహధర్మం పాటిస్తూ ఇంతకాలం మౌనంగా ఎదురుచూసారు. కానీ కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడంతో వారి ఆగ్రహం బయటపడింది.   కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో తెదేపా విఫలమయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల వలన పార్టీపై, ప్రభుత్వంపై ప్రజలలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందనే భయంతోనే ఇంతకాలం పాటిస్తున్న మిత్రధర్మాన్ని కొంచెం పక్కనబెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించక తప్పలేదు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమయిన ప్రత్యమ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుదామని భావిస్తున్న బీజేపీపై కూడా ప్రజలలో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది గనుక కేంద్రం పునరాలోచించుకొని రాష్ట్రానికి తొలివిడతగా రూ.3, 000 కోట్లు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది, అంతే కాదు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.   బహుశః ఈ సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముందుగానే అంది ఉండవచ్చును. అందుకే ఆయన నిన్న ప్రధాని మోడీని ఆయన పాలనను ప్రసంశలతో ముంచెత్తారు. కానీ కేంద్రం ఇదేపని ఇంతకు ముందే చేసి ఉంటే అప్పుడు కేంద్రానికి, బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా గౌరవంగా ఉండేది. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీల అమలుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్రం పదేపదే చెపుతున్నప్పుడు, ప్రజలు, ప్రతిపక్షాలు చివరికి మిత్రపక్షం కూడా నిలదీసే పరిస్థితి కల్పించుకొనే బదులు వాటిని అమలుచేసేందుకు ప్రయత్నించి ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషించేవారు. కానీ ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనలను పట్టించుకోకపోవడం వలన బీజేపీకి, తెదేపాకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, చివరికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా కొంత నష్టం జరిగింది. ఆ పార్టీలు, ప్రభుత్వాలు, వాటి అధినేతలపై ప్రజలలో కొన్ని అపోహలు ఏర్పడ్డాయి.   ఇటువంటి పరిణామాలు ఎవరికీ కూడా మంచిది కాదు. కనుక ప్రత్యేకహోదా, నిధులు, ప్రాజెక్టుల విషయంలో ప్రతీసారి ఇదేవిధంగా ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆ తరువాత నిధులు మంజూరు చేయడం, మళ్ళీ ప్రసంశలు కురిపించుకోవడం, ఆ తరువాత ఇరుపార్టీల నేతలు తమ మధ్య దృడమయిన స్నేహ సంబంధాలున్నాయంటూ ‘సెల్ఫ్ డిక్లరేషన్’ ఇచ్చుకొంటూ నవ్వులపాలవడం కంటే ఇక ముందు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, ఆ చేసేపనులేవో అన్నీ సకాలంలో చేయగలిగితే వారికే మంచిది.

తెలంగాణాలో విద్యుత్ సంక్షోభానికి ఎవరు బాధ్యులు?

  చంద్రబాబు నాయుడు ఇచ్చే కరెంట్ మాకు అక్కరలేదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న శాసనసభలో తెగేసి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తెలంగాణాకు రావలసిన విద్యుత్ ఇవ్వడం లేదని ఇంతవరకు ఆయనే వాదిస్తున్నారు. ఇప్పుడు అసలు అక్కరలేదని చెపుతున్నారు. ఆయన కత్తికి రెండు వైపులా పదునుంటుందని నిరూపిస్తూ చంద్రబాబు విద్యుత్ ఇవ్వలేదని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే, ఆ విధంగా చేసి తమకు మహోపకారం చేసారని చెప్పడం విశేషం. ఆయన విద్యుత్ ఇవ్వకపోబట్టే తాము ఈ విద్యుత్ సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కోగలిగామని చెపుతున్నారు. అంటే చంద్రబాబుదే తప్పు కానీ దానిని తానే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నానని చెపుతున్నారు.   ఆయన ఆవిధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? దాని వలన ఏమి జరుగుతుంది? అని ఆలోచిస్తే ఇప్పుడప్పుడే ఈ విద్యుత్ సంక్షోభం పరిష్కారం కాదని ఆయన కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నప్పటికీ అందుకు ప్రజలు ఆయనను కాక చంద్రబాబునే దోషిగా భావించే అవకాశం ఉంటుంది. తద్వారా తెలంగాణాలో బలపడాలని ప్రయత్నిస్తున్న తెదేపాపట్ల ప్రజలలో విముఖత ఏర్పడేందుకు ఎంతో కొంత అవకాశం ఉంది.   తమ పార్టీ అధికారంలోకి వస్తే మూడే మూడు నెలలలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు మరో ఒకటి రెండేళ్ళపాటు ఓపిక పట్టమని, అంతవరకు రైతులు, పరిశ్రమలు విద్యుత్ సమస్యలు ఎదుర్కోక తప్పదని చెపుతూనే, వారి ఆ కష్టాలకు చంద్రబాబే కారణమని చెపుతున్నారు. అంతేకాదు ఈలోగా ఎన్ని కష్టాలు ఎదురయినా ఆంధ్రప్రదేశ్ నుండి విద్యుత్ తీసుకోబోమని కూడా ఆయనే చెపుతున్నారు. అందుకు బలమయిన మరో కారణం కూడా ఆయనే చెప్పారు. ఆంధ్రా నుండి విద్యుత్ తీసుకొంటే, తిరిగి సగం ధరకే ఆంధ్రాకి విద్యుత్ ఈయవలసివస్తుందనే తాము ఆంధ్రా నుండి విద్యుత్ తీసుకోవడంలేదని చెప్పారు. మరి అటువంటప్పుడు చంద్రబాబుని ఎందుకు నిందిస్తున్నారు?   ఆయన తెలంగాణా రాష్ట్రానికి వందలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి ఆయన విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెపుతున్నారు. కానీ తెలంగాణా రాష్ట్రంతో పూర్తిగా అనుసంధానమయున్న విద్యుత్ సరఫరా వ్యవస్థలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ తీసుకొనేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఎందుకు?   తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 330 మెగావాట్స్ విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఆయన తీసుకొనేందుకు ఇష్టపడలేదు. కనీసం ఆయన ప్రతిపాదనపై స్పందించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఎందుకు?   తెలంగాణా రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమలకు వారానికి రెండేసి రోజులు పవర్ హాలీ డే విధించడంతో చిన్న,మద్యతరగతి పరిశ్రమలు అనేకం తీవ్రంగా నష్టపోయాయి. వాటి మీద ఆధారపడిన వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఒకమెట్టు దిగివచ్చి చంద్రబాబుతో ఈ విషయంపై నేరుగా మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఎందుకు?   ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం కనబడుతోంది. తెదేపాతో ఉన్న రాజకీయ వైరమే బహుశః అందుకు కారణం అనిపిస్తోంది తప్ప మరే ఇతర కారణాలు కనబడటం లేదు. అసలు రెండు రాజకీయ పార్టీల, వాటి అధినేతల మధ్య ఉన్న రాజకీయ వైరానికి మధ్యలో ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి? అనే ప్రశ్నకు జవాబు కోసం ఎవరిని అడగాలి?

భారత్-శ్రీలంక మళ్ళీ దగ్గరయ్యే అవకాశం?

  ప్రధాని మోడీ ఈరోజు విదేశీపర్యటనకు బయలుదేరుతున్నారు. ఐదు రోజులపాటు సాగే ఈ పర్యటనలో ఆయన షెల్లాస్, మారిషస్ మరియు శ్రీ లంక పర్యటిస్తారు. ఇదివరకు భారత్-శ్రీలంక దేశాల నడుమ మంచి సంబంధాలే ఉన్నప్పటికీ యల్.టి.టి.యి. కారణంగా క్రమంగా రెండు దేశాల మధ్య దూరం పెరగసాగింది. యల్.టి.టి.యి.ని నియంత్రించడంలో శ్రీలంకకు సహాయపడేందుకు భారత్ శాంతి సేనలను పంపడం, అందుకు ప్రతీకారంగా యల్.టి.టి.యి.కి చెందిన కొందరు వ్యక్తులు భారత ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేయడం వంటి సంఘటనలతో రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది.   ఆ తరువాత శ్రీలంక దేశాధ్యక్షుడిగా అధికారం చేప్పట్టిన మహింద రాజపక్సే యల్.టి.టి.యి.ని తుడిచిపెట్టేసే ప్రయత్నంలో వేలాది మంది తమిళ ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులను అతికిరాతకంగా చంపించడంతో అప్పటి నుండి భారత్ తో సహా ప్రపంచదేశాలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. భారత్-శ్రీలంకలు దూరం అవడంతో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా దేశం ఇదే అదునుగా శ్రీలంకలో కోట్ల డాలర్లు కుమ్మరించి దానికి దగ్గిర కాగలిగింది. భారత్ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా చైనాకు చెందిన రెండు అణ్వాయుధ జలాంతర్గాములను తన పోర్టులో నిలిపి ఉంచేందుకు శ్రీలంక అధ్యక్షుడు అనుమతించారు. మోడీ ప్రభుత్వం మళ్ళీ శ్రీలంకతో సత్సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ఈ తొమ్మిది నెలలలో చాలా కృషి చేసింది. కానీ చైనా ప్రభావంలో ఉన్న రాజపక్సే, ప్రధాని రనీల్ విక్రమే సింఘే సానుకూలంగా స్పందించలేదు.   ఈ పరిస్థితులలో శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం అందులో మైత్రీపాల సిరిసేన విజయం సాధించి శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టడంతో మళ్ళీ రెండు దేశాల నడుమ స్నేహ సుమాలు విరిసే అవకాశం కలిగింది. ఆయన అధికారం చేప్పట్టగానే మొట్టమొదట భారత్ పర్యటించి ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరుచుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం అభినందనీయం. ఆయన ఆహ్వానాన్ని మన్నించి భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంకలో పర్యటించేందుకు బయలుదేరుతున్నారు.   కానీ చైనావైపు మొగ్గు చూపుతున్న ఆ దేశప్రధాని ప్రధాని రనీల్ విక్రమే సింఘే ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ సముద్ర జలాలలో ప్రవేశిస్తున్న తమిళ జాలారులను కాల్చి చంపే హక్కు తమకు ఉందని, శ్రీలంకలో ఉన్న తమిళులు (ఆయన దృష్టిలో శరణార్ధులు) అందరూ భారత్ తిరిగి వెళ్లి పోవలసిన సమయం వచ్చిందని చెప్పడం భారత్ లో కలకలం సృష్టించింది. ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనకు బయలుదేరుతున్న ఈ సమయంలో శ్రీలంక ప్రధాని ఈవిధంగా మాట్లాడటం ఇరు దేశాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయి. అయినా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపరుచుకోవాలని భావిస్తున్న ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకోకుండా శ్రీలంకకు వెళుతున్నారు.   నేపాల్, శ్రీలంక వంటి చిన్నచిన్న దేశాలకు కూడా భారత్ ఇంత అలుసయిపోయిందంటే అందుకు కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అనుచిత విదేశీ విధానమే. మోడీ ప్రభుత్వం ఆ విధానాలను పూర్తిగా మార్చి ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క అవసరమయినప్పుడు చాలా దృడంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనలో ఇరు దేశాల మధ్య అనేక కీలకమయిన ఒప్పందాలు జరగనున్నాయి. అవి ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పునరుద్దరించబడేందుకు సహాయపడవచ్చును.

ఇచ్చట ఉచితంగా ప్రజాసేవ చేయబడును

  అదేమిటి...ప్రజాసేవ...ఉచితంగానా..ఏమిటీ అర్ధంపర్ధం లేని మాటలు అనేసుకోవద్దు. కొందరు సామాజిక న్యాయం చేయడానికే పుట్టినవారున్నారు. మరికొందరు ప్రశ్నించాడానికే పుట్టినవారున్నారు. ఇంకొందరు జనాలని ఓదార్చడానికే పుట్టినవారున్నారు. వారిలో ఎవరికీ అధికార దాహం లేదు. ఎందుకంటే వారి కడుపులు ముందే నిండాయిట. పాపం ప్రజల కష్టాలను చూసి జాలిపడి వారిని తాము కాకపోతే మరెవరు కాపాడుతారు? అది తమ సామాజిక బాధ్యత కూడా అనుకొంటూ వారందరో వెరైటీ రాజ్యాలు స్థాపించి తమ తమ సైన్యాలతో జనాల ముందుకు వచ్చేరు. మరి అది ఉచిత ప్రజాసేవే కదా...అదెలా సాగిందో అందరికీ తెలుసు.   వారిలో సామాజిక న్యాయం చేస్తానంటూ బయలుదేరిన చిరంజీవి తనను నమ్ముకొని వచ్చిన అభిమానులను, పార్టీ కార్యకర్తలను, చివరికి హేమాహేమీలయిన సీనియర్ రాజకీయ నేతలను కూడా హ్యాండిచ్చేసి తన (ప్రజా) రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి కేంద్రమంత్రి పదవి పుచ్చుకొని సామాజిక న్యాయం సాధించి చూపారు. సామాజిక న్యాయం చేస్తానన్న పెద్దమనిషి ప్రస్తుతం 150 సినిమాని తీసుకొనేపనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారని జనాలు గొణుక్కోవచ్చు గాక కానీ ఆయన నేటికీ జనాల సంతృప్తి కోసం రాజ్యసభకి ఓ రౌండేసి వస్తూనే ఉంటారు.   తమ్ముడు పవన్ కళ్యాణ్ 'నేను వచ్చింది అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి మాత్రమే' అనే సరికొత్త సబ్ టైటిల్ తో రాజకీయాలలోకి వచ్చేరు. "ఆ...అలాగంటాడు కానీ...ఎన్నికలలో పోటీ చేయకుండా ఉంటాడా?" అనుకొంటూ ఆయన చుట్టూ ఓ పెద్దమనిషి చాలా రోజులు తిరిగాడు. "వెయ్యెకరాల మాగాణీ పోతే పోయింది గానీ చట్టం గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగాను" అని వెనకటికొకడు తృప్తిపడినట్లు ఆయన కూడా తన మూనెల్ల రాజకీయనుభావంతో తృప్తిపడి మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయాడు. ఆయనతో బాటే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు. ప్రశ్నించడం కోసమే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పిన పెద్దమనిషి కనీసం ఆ చిన్న పని కూడా చేయకుండానే సినిమాలతో కాలక్షేపం చేసుకొంటున్నారు.   సినిమాకి సినిమాకి మధ్యలో కొంత టైం దొరికినప్పుడు తను జనసేన పార్టీ పెట్టాననే సంగతి జ్ఞాపకం రాగానే ఆవేశం తెచ్చుకొని ట్వీటర్ లో ఏదో ఒకటి గెలికి పడేస్తుంటారు. ఇంకా టైం మిగిలి ఉంటే తుళ్ళూరులో అలా ఓ రౌండేసి వెళ్ళిపోయారు. ఈసారి టైం దొరికితే కొంచెం పొలిటికల్ ఎక్స్ పీరియన్స్ గెయిన్ చేయడానికి జి.హెచ్.యం.సి.ఎన్నికలను కూడా ఓసారి ట్రై చేద్దామనుకొంటున్నట్లు ప్రకటించేసారు.   ఇక మడమ తిరగని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం బాగుపడాలంటే దానికి సర్వ రోగ నివారిణి వంటి ఒకే ఒక్క పరిష్కారం ఉందని చెపుతుంటారు. అదే తను ముఖ్యమంత్రి అయిపోవడం. తను ముఖ్యమంత్రి అయిపోతే ఇక రాష్ట్ర ప్రజలు చీకు చింత లేకుండా జీవించేసుకోవచ్చని చెపుతుంటారు. అంతేకాదు..తను ముఖ్యమంత్రి అయిపోగానే తుళ్ళూరులో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ వంటి ఎన్ని పెద్ద పెద్ద భవనాలు కట్టిపడేసినా సరే వాటి క్రింద నుండి రైతుల భూమిని భద్రంగా ఎలా తీసుకొన్నది అలాగ బయటకి తీసిచ్చేయగల అత్యాధునిక టెక్నాలజీ తన దగ్గర ఉందని చెపుతుంటారు. కనుక ఆ భూమి కావాలనుకొంటే తనను గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకొనే బాధ్యత మీదేనని పదేపదే చెపుతుంటారు.   మెగాస్టారు కాకపోతే పవర్ స్టారు ఆయన ఏమీ చేయలేకపోతే జగనన్న మనకి ఉండనే ఉన్నాడని జనాలు అనుకొన్నారు. కానీ ముగ్గురు ముగ్గురేనని నిరూపించారు. ఇక తాజాగా మరొక కొత్త పుకారొకటి పుట్టుకొచ్చింది. అదేమిటంటే బాబాయ్ పెట్టిన జనసేనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ "లైక్" చేసాడుట! హైదరాబాద్ నడిరోడ్డు మీద చేతికి మట్టి అంటకుండా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను అలఓకగా ఉతికి ఆరేయించిన మన చినబాబు కూడా రాజకీయాలలోకి వస్తే ఆ..రేంజ్ ఒక తుఫానులా ఉంటుందని జనాలు అప్పుడే ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. నిప్పు లేనిదే పొగ రాదనే సిద్దాంతం నిజంగా కరెక్టయితే జనసేన మెగాసేనగా మారి జనాల ముందుకి వచ్చినా ఆశ్చర్యం లేదు.

పిడిపితో బీజేపీ పొత్తు దేశానికి మంచిది కాదు: శివసేన

  జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాశ్మీరు వేర్పాటువాదులను జైలు నుండి విడుదల చేయడంపై ప్రతిపక్షాలతో బాటు బీజేపీకి మిత్రపక్షమయిన శివసేన పార్టీ కూడా తీవ్రంగా విమర్శించింది. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుపనిచ్చినందుకు పాకిస్తాన్ తీవ్రవాదులకు, కాశ్మీర్ వేర్పాటువాదులకు కృతజ్ఞతలు తెల్పిన ముఖ్యమంత్రి సయీద్, మొన్న శనివారం రాత్రి కొందరు కరడుగట్టిన వేర్పాటువాదులను జైలు నుండి విడిచిపెట్టారు.   దానిపై శివసేన అధినేత ఉద్దావ్ థాక్రే స్పందిస్తూ, తన సామ్నా పత్రికలో అటువంటి పార్టీతో బీజేపీ కలిసిపనిచేయడాన్ని తప్పుపట్టారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సయీద్ తన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి కానీ భారత ప్రభుత్వానికి గానీ తెలియజేయకుండా వేర్పాటువాదులను జైలులో వదిలివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన చర్యలు దేశాన్ని అవమానపరిచేవిగా, భారత ప్రభుత్వానికి సవాలుచేస్తునట్లున్నాయని శివసేన అధ్యక్షుడు ఉద్దావ్ థాక్రే అభిప్రాయపడ్డారు. కనుక సయీద్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆయన ప్రభుత్వంలో కొనసాగడంపై బీజేపీ పునరాలోచించుకోవాలని ఉద్దావ్ థాక్రే బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసారు.

ఎంత పనిచేశావు గోపాలా?

  చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములిరువురూ సినీ రంగంలో ఎంత గొప్ప పేరు సంపాదించుకొన్నారో, రాజకీయాలలో చేరిన తరువాత అంత అప్రదిష్టపాలయ్యారు. చిరంజీవి రాజకీయ ప్రస్తానం గురించి అందరికీ తెలిసిందే గనుక మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ నిన్న తుళ్ళూరులో పర్యటించినపుడు ఒకలాగా, హైదరాబాద్ తిరిగి రాగానే మరొకలా మాట్లాడి అభాసుపాలయ్యారని చెప్పక తప్పదు. అసలు ఇన్ని రోజులు మౌనంగా కూర్చొని ఆయన ఇప్పుడు ఇంత హటాత్తుగా తుళ్ళూరు పర్యటనకు ఎందుకు బయలుదేరారో, వెళ్లి వచ్చిన తరువాత మళ్ళీ అక్కడి ప్రజలు పిలిచినందునే వెళ్లాను...ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్దేశ్యం లేదని మళ్ళీ ఎందుకు అన్నారో తెలియదు కానీ పొంతనలేని మాటలు మాట్లాడి తన రాజకీయ అపరిపక్వతను మరొకమారు బయటపెట్టుకొని అభాసుపాలయ్యారు.   ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ విశ్లేషకులు ఆయన పర్యటన వెనుక మర్మం ఏమిటి? ఎవరి ప్రోద్బలంతో పర్యటనకు బయలుదేరారు? అంటూ అన్ని కోణాలలో నుండి చేసిన విశ్లేషణల వలన రాజకీయ వర్గాలలో మరింత చులకనయ్యారు. పైగా ఒకపక్క పార్టీ నిర్మాణం చేసుకోలేదని ఒప్పుకొంటూనే త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. లేదా ఉపఎన్నికలలో తన పార్టీ పోటీ చేయవచ్చని చెప్పుకోవడం హాస్యాస్పదం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇరువురూ రాజకీయాలలో రాణించలేరనే సంగతి కళ్ళకు కట్టినట్లు కనబడుతూనే ఉంది. కానీ వారిరువురూ ఇంకా రాజకీయాలకు అంటిపెట్టుకొని ఉండేందుకు ప్రయత్నిస్తుండటం వలన అభాసుపాలవుతున్నారని చెప్పవచ్చును.   రాజకీయలలో తల బొప్పి కట్టిన చిరంజీవి మెల్లగా మళ్ళీ సినీరంగం వైపు అడుగులు వేస్తుంటే, పవన్ కళ్యాణ్ తన కెరీర్ పతాక స్థాయికి చేరుకొన్న ఈ సమయంలో సినీరంగాన్ని వదిలిపెట్టి తనకు ఏమాత్రం అనుభవం లేని రాజకీయాల వైపు తప్పటడుగులు వేస్తున్నారు. జీవితంలో అత్యంత అమూల్యమయిన సమయంలో ఇటువంటి ప్రయోగాలు చేయడంకంటే తమ పరిధిలో సామాజికసేవ చేసినా అదే స్థాయి సంతృప్తి పొందవచ్చును.

యాదగిరి గుట్ట పేరు ఎందుకు మార్చుతున్నారో?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతికి ఏ మాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసేందుకు నడుం కట్టారు. అందుకోసం భారీగా ప్రణాళికలు సిద్దం చేసి నిధులు కూడా కేటాయించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అయితే అచ్చమయిన తెలంగాణా బాషకు అద్దం పడుతూ సామాన్య ప్రజలకు అర్ధమయ్యే ‘యాదగిరి గుట్ట’ పేరును వైష్ణవ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామి ‘యాదాద్రి’ మార్చడం విమర్శలకు తావిస్తోంది. చుట్టుపక్కల మూడు నాలుగు రాష్ట్రాలకు సుపరిచితమయిన యాదగిరి గుట్ట అనే పేరులో వారిరురువురికీ ఏమి లోపం కనబడిందో మరి తెలియదు. తిరుమల కొండను వెంకటాద్రిగా పిలుచుకొంటారు గనుక యాదగిరి గుట్టకు యదాద్రి అని పేరు పెట్టారేమో?   యాదగిరి గుట్ట ఆనుకొని ఉన్న మరో ఎనిమిది కొండలను కలుపుకొని ‘నవగిరులు’ అని పేరుతో వాటినీ పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఆ ఎనిమిది కొండలకు కూడా చిన జీయర్‌ స్వామి పేర్లు పెడతారుట. తిరుమలకు ఏడు కొండలున్నాయి గనుక వాటి కంటే మరో రెండు కొండలు ఎక్కువే ఉండాలనుకొంటే అది చాలా హాస్యాస్పదమయిన ఆలోచన. అటువంటి ఆలోచనకు వైష్ణవ పీఠాధిపతి అయిన చిన జీయర్‌ స్వామి ఏవిధంగా ఆమోదం తెలిపారో మరి? యాదగిరి గుట్టను, దాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ కొండ దిగువన ఉన్న ఊరుని వదిలిపెట్టి చుట్టుపక్కల కొండలను అభివృద్ధి చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం గురించి, అందులో వెలసియున్న లక్ష్మీ నృసింహ స్వామి వారి మహత్యం గురించి తెలుగు ప్రజలకు మళ్ళీ కొత్తగా ఎవరూ పరిచయం చేయనవసరం లేదు. ఆ పవిత్ర క్షేత్రాన్ని ఇన్నేళ్ళుగా ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా నిత్యం వేలాదిమంది భక్తులు దేశం నలుమూలల నుండి వచ్చి దర్శించుకొని వెళుతూనే ఉన్నారు. కనుక ఇప్పుడు యాదగిరి గుట్టకి మరో కొత్తపేరు పెట్టడం, దానికి మరో ఎనిమిది కొండలు కొత్తగా అనుసంధానం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే ఆలోచించాలి.   యాదగిరి గుట్టతో సహా దేశంలో ఏ పవిత్ర పుణ్యక్షేత్రాలయినా సరే అక్కడ సహజంగా వెలసిన దేవతామూర్తుల కారణంగానే వాటికి ఆ ప్రశస్తి, మహత్యం కలిగిఉన్నాయి. కానీ ఆ తరువాత కోట్లాది రూపాయలు కుమ్మరించి కట్టబడిన ఏ దేవాలయాలు కూడా అంతటి ప్రశస్తి, మహత్యం పొందలేదనే సంగతి గ్రహిస్తే ఇటువంటి ప్రయత్నాల వలన కొత్తగా ఎటువంటి ప్రయోజనము ఉండబోదని అర్ధం అవుతుంది. రాజకీయ నాయకులు తమ అజెండాలను అనుసరించి ఏవేవో నిర్ణయాలు తీసుకొంటుంటారు. అవి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవయితే మత గురువులను సంప్రదించడం సహజమే. అప్పుడు వారు తమ దృక్కోణంలోనే ఆలోచించి మార్గదర్శనం చేయాలి తప్ప వారే రాజకీయ నాయకుల ప్రభావానికిలోనయి వారికి అనుకూలంగా మాట్లాడటం ప్రజలు కూడా జీర్ణించుకోలేరు.   కనుక యాదగిరి గుట్టపై వేంచేసి ఉన్న నృసింహస్వామి వారికి నిత్య దూపదీప నైవేద్యాలు, ఇతర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయా లేదా? మాడవీధుల విస్తరణ, గుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యాలు వంటి వాటిపై ప్రభుత్వం,మటాధిపతులు దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది.