జగన్ ఢిల్లీ టూర్ వెనుక సీక్రెట్టేంటి?

  వైసీపీ అధినేత జగన్ అర్జెంటుగా ఢిల్లీ టూరు పెట్టుకున్నారు. ఇంత అర్జెంటుగా ఢిల్లీ టూర్ ఎందుకయ్యా అంటే, ఢిల్లీకి వెళ్ళి, ప్రధాని నరేంద్రమోడీని కలిసి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సిందిగా కోరబోతున్నానని చెబుతున్నారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన జగన్ రాత్రికి రాత్రే మారిపోయి ఇలా రాష్ట్రానికి పనికొచ్చే పని చేయబోతున్నాడేంటా అని కొంతమందికి సందేహం రావడం సహజం. మరికొంతమంది అమాయకులకైతే పోలవరం నిధుల కోసం ప్రధానిని కలుస్తున్న జగన్ సారు ఎంత మంచోడో అని అనిపిస్తుంది. అయితే జగన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు సీక్రెట్ వేరే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   జగన్ ఢిల్లీ వెళ్ళడం, ప్రధానిని కలవటం, పోలవరం కోసం నిధులు అడగటం... యాజ్‌టీజ్ ఇలాగే జరిగితే అది రొటీన్. జగన్ ఢిల్లీకి వెళ్ళడం, ప్రధానిని కలవటం, తాను జైల్లో పడకుండా సహకరిస్తే, ఏపీలో బీజేపీ బలపడటానికి ఏం చేయాలో అది చేస్తానని నరేంద్రమోడీకి చెప్పి, ఒప్పించడం... ఇదీ జగన్ టూర్ వెనుక వున్న అసలు ప్లాన్ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే జగన్ త్వరలో జైల్లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నే మరికొన్ని వందల కోట్ల జగన్ సంబంధీకుల ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ‘బంపర్ ఆఫర్’ ఇవ్వడం ద్వారా తనకు మరోసారి జైలుయోగం పట్టకుండా చేసుకోవాలన్నది జగన్ ప్లాన్ అని పరిశీకులు చెబుతున్నారు.   బీజేపీ తెలంగాణలో పుంజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో భాగస్వామిగా వుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎదగాలని భావిస్తోంది. అందుకే ఏపీలోని కొంతమంది బీజేపీ నాయకులు జగన్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో జగన్‌ని ప్రేమగా లాలిస్తున్నారు. జగన్ అసెంబ్లీకి రానని మొండికేస్తే ఆయన్ని లాలించి, బుజ్జగించిన బీజేపీ నాయకులు ఆయన తిరిగి అసెంబ్లీకి వచ్చేలా చేశారు. స్పీకర్ మీద జగన్ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా చేసి, స్పీకర్‌కి సారీ చెప్పించిన బృహత్కార్యం వెనుక వున్నది బీజేపీ ఎమ్మెల్యేలన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా దినదిన ప్రవర్ధమానమైన వైసీపీ - బీజేపీ దోస్తీ ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిసే ప్రయత్నం చేయడం వరకూ వెళ్ళింది. ఈ కలయిక కోసం పోలవరం ప్రాజెక్టుని ఉపయోగించుకుంటున్న జగన్ తెలివితేటలకి హేట్సాఫ్. మరి వైసీపీ, బీజేపీల మధ్య ఈ ఇన్‌స్టెంట్ స్నేహం భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతుందో, ఈ స్నేహం కారణంగా ఏపీ రాజకీయాల్లో మరెన్ని వింతలు చూస్తామో...

రాహుల్ బాబు వచ్చేస్తున్నాడు కాసుకోండి

  రాజకీయాలలో ఉన్నవాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం అంటే ఆత్మహత్యతో సమానంగా భావిస్తారు. అందుకే వారు నిత్యం ఏదో ఒక అంశం దొరకబుచ్చుకొని మీడియాముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ జనాలు తమని మరిచిపోకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ దేశానికి ప్రధానమంత్రి అవుదామనుకొన్న రాహుల్ గాంధీ, కనీసం తన స్వంత పార్టీ మీద కూడా పట్టు సాధించలేకపోవడంతో, పార్టీ మీద అలిగి ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన ఈవిధంగా మాయమయిపోవడంతో మీడియా ప్రశ్నలకు, ప్రతిపక్షాల వెక్కిరింతలకు సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ నేతలు సతమతమవుతున్నారు. కానీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం ఇంతకాలంగా మీడియాను తప్పించుకొని తిరుగుతున్నప్పటికీ శనివారంనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూరే దేవ్ బధే గ్రామానికి వెళ్లినప్పుడు ఆమె కూడా మీడియాకు దొరికిపోయారు.   ఆమెను చూడగానే మీడియావాళ్ళు అందరూ అడిగిన మొట్ట మొదటి ప్రశ్న ‘రాహుల్ గాంధీ ఎప్పుడు తిరిగివస్తారనే.’ కానీ ఆమె కూడా వారికి ఫలానా తేదీన తిరిగి వస్తాడని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. త్వరలోనే తిరిగివచ్చి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటాడని మాత్రమే చెప్పారు.   ఇంతకు ముందు ఆయన మరో రెండు, మూడు వారాలపాటు తన శలవు పొడిగించారని మీడియాలో వార్తలు వస్తే అప్పుడు కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ ఆ వార్తలను ఖండించారు. కానీ మూడు కాదు నాలుగు వారాలవుతున్నా ఆయన అయిపూ జాడా లేదు. కనీసం ఆమె కూడా తన కొడుకు అసలు ఈవిధంగా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్పలేకపోవడం చూస్తుంటే రాహుల్ గాంధీ అజ్ఞాతంలో వెళ్ళడానికి చాలా బలమయిన కారణాలే ఉన్నట్లు అనుమానించవలసి వస్తోంది. ఎలాగూ రాహుల్ బాబు తిరిగి వచ్చేస్తున్నాడని రాజమాత ప్రకటించేశారు గనుక ఒకవేళ యువరాజవారు మళ్ళీ తన లీవ్ పొడిగించకుండా నిజంగా తిరిగి వచ్చేస్తే అప్పుడు ఆయన నోటితోనే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసుకోవచ్చును.

రచ్చ చేయనేల.. సారీ చెప్పనేల?

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నానా రచ్చ చేయడమే కాకుండా గౌరవనీయమైన సభాపతి స్థానాన్ని కూడా అవమాన పరిచేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. గంటలు గంటలు సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూనే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్ష నాయకుడు జగన్ మొత్తుకోవడం ఏపీ ప్రజలు గమనించారు. అధికార పక్షం మీద లేనిపోని ఆరోపణలు, హద్దూ అదుపూ లేని విమర్శలు వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నాయకుడు జగన్, ఆయన అడుగు జాడల్లో నడిచే ఇతర సభ్యులు ఎంతమాత్రం వెనుకాడలేదు. వైసీపీ సభ్యురాలు రోజా అయితే కర్ణకఠోరమైన వ్యాఖ్యలతో తన పరువును తానే దిగజార్జుకున్నారు. అలాగే మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా అంత అల్లరి చేసిన వైసీపీ చివరికి సభాపతి మీదే అన్యాయమైన ఆరోపణలు చేసింది. చివరికి ఆయన మీద అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది. అయితే, అయితే అసెంబ్లీలో వైసీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన మీద సభాపతి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తూ వుండటంలో ఎట్టకేలకు దారికొచ్చిన వైసీపీ నాయకుడు జగన్ సారీ చెప్పుకున్ని వివాదానికి ముగింపు పలికారు. ఇప్పుడు సారీ చెప్పకపోతే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం వుందని గ్రహించిన జగన్ సారీ చెప్పి గండం నుంచి బయటపడ్డారు. .   అసెంబ్లీకి సంబంధించినంత వరకూ జగన్ సారీతో ఈ వివాదం ముగిసిపోయి వుండొచ్చు. కానీ జనం దృష్టిలోంచి మాత్రం ఈ గొడవంతా తొలిగిపోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఏపీ ప్రజలు ఈ అంశం విషయంలో ‘‘రచ్చ చేయనేల.. సారీ చెప్పనేల’’ అనుకుంటున్నారు. అనవసరంగా అయిన దానికీ కానిదానికీ రచ్చ చేసి చివరికి సారీ చెప్పుకునే పరిస్థితిని వైసీపీ నాయకులు చేతులారా తెచ్చుకున్నారని అనుకుంటున్నారు. సారీ చెప్పిన తరువాత జగన్ మాట్లాడిన మాటలు విని జనం అవాక్కయిపోతున్నారు. సభాపతి మీద కోపంతోనో, ఆయన్ని పదవినుంచి దించేయాలనో జగన్ అండ్ కో అవిశ్వాస తీర్మానం పెట్టలేదట. ప్రజా సమస్యల ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారట. అవిశ్వాస తీర్మానం మీద జగన్ చెబుతున్న రీజన్ ఏమైనా అతికేట్టు వుందా? ఇలాంటి లేనిపోని రాద్ధాంతాలు చేయడమెందుకు, ఆ తర్వాత సారీ చెప్పడం ఎందుకు, విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం ఎందుకు? అందుకే జగన్ తన వైఖరిని మార్చుకునే విషయాన్ని తీవ్రంగా ఆలోచించుకోవాలి.

సంస్థాగత నిర్మాణం లేనందునే ఓడిపోయాము: తుమ్మల

  ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస పార్టీకి బలమయిన పునాది కానీ, సంస్థాగత నిర్మాణం గానీ లేదని,కేవలం తెలంగాణా సెంటిమెంటు మీద ఆధారపడే పార్టీ నడుస్తోందని అటువంటి పార్టీని ఎన్నికలలో ఓడించడానికి బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీకి పెద్ద కష్టం కాదని అన్నారు. తమ పార్టీ గురించి ఆయన అంత చులకనగా మాట్లాడతానని కేసీఆర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు.   కానీ మొన్న జరిగిన యం.యల్సీ.ఎన్నికలలో తెరాస అభ్యర్ధి జి. దేవీ ప్రసాద రావు బీజేపీ అభ్యర్ధి రామచంద్రారావు చేతిలో ఓడిపోవడంతో ఆనాడు అమిత్ షా తెరాస గురించి చెప్పిన మాటలు నిజమని రుజువయింది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా సరిగ్గా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం. తమ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోవడం వలననే ఎన్నికలలో ఓడిపోయామని, కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తమ సత్తా చూపిస్తామని ఆయన అన్నారు.   తమ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని అంగీకరిస్తున్నప్పుడు ఆంద్ర ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం తెరాస ఏవిధంగా విజయం సాధించగలదు? అక్కడ గెలవడం కష్టమని తెలుసు గనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పై మంచి పట్టు ఉన్న తెదేపా యం.యల్యేలను పార్టీలోకి రప్పించుకొన్నారు. అందుకే హడావుడిగా వివిధ కులాలు, మతాలకు ప్రార్ధనా మందిరాలు వగైరా నిర్మించి ఇస్తున్నారు. ఇంకా చాలానే ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తెరాసకి సంస్థాగత నిర్మాణం లేదని ప్రతిపక్షాలు కూడా గుర్తించగలిగినప్పుడే తెరాస అధిష్టానం అప్రమత్తమయ్యే బదులు తమ లోపాన్ని ఎట్టి చూపించిన వారిపై ఎదురు దాడి చేయడం వలన చివరికి నష్టపోయింది ఎవరు?

వైకాపా సభ్యులపై సస్పెన్షన్ వేటు తప్పదా?

  వైకాపాకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై తెదేపా సభ్యురాలు అనిత ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానంపై ఈరోజు సభలో చర్చ జరిగినప్పుడు వైకాపా సభ్యులు అందరూ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరారు. స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ కూడా వారిని క్షమించినట్లు ప్రకటించారు. కానీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డి తను బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్దం అంటూనే గత చరిత్రలు చదవడం మొదలుపెట్టారు. ఆయన తీరు చూస్తే ఆయనలో ఎటువంటి పశ్చాతాపం కనబడటంలేదు, కేవలం తన యం.యల్యేలపై సస్పెన్షన్ వేటు పడుతుందనే భయంతోనే మాట్లాడుతున్నట్లుందని మంత్రి అచ్చెం నాయుడు ఆక్షేపించారు. మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సభా హక్కుల ఉల్లంఘనపై ఇంకా చర్చ పూర్తవ్వలేదని, తామిచ్చిన నోటీసులను ఇంకా వెనక్కి తీసుకోలేదని అనడం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకుంటే బహుశః రేపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తారేమో!

‘మా’ ఎన్నికలు.. డోకు...

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న తంతును గమనిస్తున్న వారికి డోకు వచ్చే పరిస్థితులు తయారయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ నటులందరూ కలసి ‘మా’ ఎన్నికల ప్రక్రియను ఒక కామెడీ ప్రహసనంగా మార్చేశారు. మాదంతా సినిమా కుటుంబం, మేమంతా ఒక్కటే అని చెప్పుకునే సినీ నటులు ఇప్పుడు ‘మా’ ఎన్నికల పుణ్యమా అంటూ మీడియాకు ఎక్కి పెద్ద పెద్ద డైలాగ్స్ చెబుతున్నారు. ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఏ స్థాయిలో రాజకీయాలు నడుస్తాయో, ఆ స్థాయి రాజకీయాలు నడుపుతూ నటులు తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు.   అసలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి సంబంధించిన పదవుల్లో ఎవరు వున్నా సినిమా రంగంలో ఉన్న పేద నటీనటులను ఉద్ధరించేదేమీ లేదు. ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు కూడా. ఎవరు పదవుల్లో వున్నా ఆ పదవులు అడ్డు పెట్టుకుని ఇండస్ట్రీలో బిల్డప్పు ఇవ్వడం తప్ప ఆకలికి మాడుతున్న, అవకాశాలు లేక అల్లాడుతున్న నటులకు ఒరిగిందేమీ లేదు. గతంలో ఉన్నవాళ్ళు ఉద్ధరించిందేమీ లేదు.. కొత్తగా వచ్చేవాళ్ళు ఉద్ధరించడానికి అవకాశమూ లేదు. ‘మా’ అనేది చాలా తక్కువ విస్తృతి వున్న చాలా చిన్న సంస్థ. ఆ సంస్థలో అధికారం చెలాయించడానికి నటీనటులు పడుతున్న తంటాలు, ఒకరినొకరు తిట్టుకుంటున్న విధానం చూస్తే డోకొస్తోంది. రాజకీయ రంగంలో వున్నవారు పదవుల కోసం ఇలా తిట్టుకుంటే అది ఒక పద్ధతిగా వుంటుంది. మరి సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులంటే ఘోరంగా తిట్టుకుంటూ వుండటం చూడ్డానికి చాలా విచిత్రంగా వుంది. ఆ తిట్టుకోవడం కూడా సహజంగా నటనలో పండిపోయినవాళ్ళు కాబట్టి రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ తిట్టుకుంటూ తరిస్తున్నారు. సినిమాల్లో నటన సంగతేమోగానీ ఈ ఎలక్షన్ల సందర్భంగా వీళ్ళు ప్రదర్శిస్తున్న నటన చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకూ పనికిరాని, జనాలకి ఎలాంటి సంబంధం లేని ఒక సంస్థకి ఎన్నికలు జరగడమేంటో... దానికోసం వీళ్ళు జుట్టు జుట్టు పట్టుకోవడమేంటో.. దానికి మీడియాలో భారీ కవరేజ్ ఏంటో... ఇప్పటి వరకు తెప్పించిన డోకు చాలు.. ఇక ఆపండయ్యా బాబు...

అయోమయంలో జగన్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిని చూస్తుంటే అదేదో సినిమాలోని ‘‘రాను రానంటూనే చిన్నదీ.. రాములోరి గుడికొచ్చే చిన్నదీ’’ అనే పాటను పాడుకోవాలని అనిపిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి, అంతకు రెండు రోజుల ముందు నుంచీ జగన్ వ్యవహరిస్తున్న తీరు చూసి రాజకీయ వర్గాలు మాత్రమే కాదు.. జనం కూడా ముక్కున వేలేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు స్పీకర్ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో అగ్లీగా బిహేవ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తర్వాత తాను హెచ్చరించినట్టుగానే అగ్లీగా ప్రవర్తించారు. తమ నాయకుడే అగ్లీగా ప్రవర్తించినప్పుడు తాము అగ్లీగా ప్రవర్తిస్తే తప్పేం వుండదని అనుకున్నారేమోగానీ, రోజా తదితరులు మరీ అగ్లీగా ప్రవర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా ఎమ్మెల్యేని రోజా కించపరుస్తూ మాట్లాడిన తీరు చూసి జనాలు నోళ్ళు తెరిచారు. సినిమా తెరమీద లలితంగా కనిపించిన రోజా నోటి వెంట ఇలాంటి మాటలు వస్తున్నాయేంటని జనం అదిరిపోయారు. ఇదిలా వుంటే, బడ్జెట్ మీద చర్చ సందర్భంగా జగన్ గొడవ చేస్తూనే వున్నారు. కొందరు సభ్యులు సస్పెండ్ అయ్యాక జగన్ కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం మీద చర్చ జరిగినప్పుడే అసెంబ్లీకి వస్తానని, అప్పటి వరకూ అసెంబ్లీలో అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత మీడియాని పిలిచి రెండున్నర గంటలు మాట్లాడి బుర్రలు వేడెక్కేలా చేశారు.   జగన్ చేసిన భీషణ ప్రతిజ్ఞ ప్రజలకు ఆనందం కలిగించింది. జగన్ అసెంబ్లీకి వెళ్ళకుండా వుంటే అసెంబ్లీ కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తాయని, వాటికి పరిష్కారాలు దొరుకుతాయని అందరూ ఆశించారు. అసెంబ్లీలో ‘అగ్లీ’గా ప్రవర్తించేవారు లేకపోవడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయమే కదా.. అయితే ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లుతూ మంగళవారం నాడు జగన్ అండ్ కో అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికే వచ్చామంటూ వివరణ ఇచ్చుకున్నారు. జగన్ మాట మీద నిలబడే రకం కాదు కాబట్టి అసెంబ్లీకి రానని చెప్పిన ఆయన మళ్ళీ వచ్చినా ఎవరూ పెద్దగా షాకవ్వలేదు. అయితే కాసేపటికే మళ్ళీ ఆయన బృందం మొత్తం వాకౌట్ చేసి బయటకి వెళ్ళిపోయింది. దాంతో షాక్ అవడం జనం వంతయింది. ఆయన ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాక జగన్ ‌సృష్టించిన అయోమయంలో జనం గజిబిజి అయిపోయారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి స్థానంలో వున్న జగన్ గారు తాను అయోమయానికి గురవుతూ, జనాన్ని కూడా అయోమయంలోకి నెడుతున్నారని, ఇప్పటికైనా ఇలాంటి అయోమయం సృష్టించే పనులు మానుకోవాలని పలువురు అంటున్నారు.

తెలంగాణాకి హైకోర్టు ఏర్పాటుపై అందరూ తొందరపడ్డారా?

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడినందున దానికి ప్రత్యేక హైకోర్టు కావాలనుకోవడం సహజమే. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ స్వయంగా ఈ విషయం గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తాతో చర్చించారు కూడా. హైకోర్టు కోసం గచ్చిబౌలీలో ఉన్న ఒక విశాలమయిన భవనాన్ని కేటాయించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖా మంత్రికి ఒకలేఖ అందజేశారు.   ఇక నేడో రేపో తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు అవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తా, న్యాయమూర్తి సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా వ్యతిరేకించడమే కాక అది ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని (సెక్షన్ 31) ఉల్లంఘన చేసినట్లు అవుతుందని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. విభజన బిల్లులో తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయమని ఎక్కడా పేర్కొనలేదని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఏర్పాటు చేయవలసి ఉందని, అంతవరకు ఉమ్మడి హైకోర్టునే కొనసాగించవలసి ఉంటుందని విస్పష్టంగా పేర్కొన్నారు.   ఒకవేళ తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయదలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుందని, దానిని సవరించకుండా అందుకోసం ఎటువంటి ప్రయత్నాలు చేసినా అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాక తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు కోరుతూ న్యాయవాదులను ఎటువంటి ఆందోళనలు చేయవద్దని, ఎవరయినా ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే దానిని కోర్టు ధిక్కారంగా పరిగణించి కటిన చర్యలు చేపడతామని హెచ్చరించారు కూడా. హైకోర్టు విభజనపై ఆంద్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ ఫైల్ చేయమని ధర్మాసనం ఆదేశించింది. అవి చూసిన తరువాతే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపింది.   విభజన చట్టంలో ఉన్న ఈ అంశాలనన్నిటినీ గమనించకుండానే హైకోర్టు కోసం తెలంగాణా న్యాయవాదులు ఉద్యమించడం, అందుకోసం తెలంగాణా ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేయడం, తెలంగాణా అడ్వకేట్ జనరల్ కూడా ఈ అంశాన్ని విస్మరించడం, కేంద్రన్యాయశాఖ మంత్రిగా ఉన్న సదానంద గౌడ హైకోర్టు ఏర్పాటుకి హామీ ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. హైకోర్టు ఏర్పాటుకి చట్టంలో సాంకేతిక సమస్యలున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ తమ ప్రయత్నాలకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని తెలంగాణా మంత్రులు ఆరోపణలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ వ్రాసే ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తాని కలిసి మాట్లాడారు. కనుక చట్టంలో ఉన్న ఈ సాంకేతిక సమస్యల గురించి ఆయన ముఖ్యమంత్రికి అప్పుడే తెలియజేసే ఉంటారని అనుకొంటే, మరి ఈవిషయంలో తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేసినట్లు? ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టులో చాలా సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా కూడా ఎందుకు ముందుకు వెళ్ళినట్లు? ఇప్పుడు ఇంత వరకు వచ్చిన తరువాత తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్లగలదా? వెళ్ళలేకపోతే అందుకు ఎవరిని నిందిస్తుంది?

మెగాస్టార్ కి అభిమానులే శ్రీరామరక్ష

  చిరంజీవి తనకున్న విశేష జనాధారణను చూసుకొనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలలో ప్రవేశించారు. కానీ ఏ అభిమానుల అండతో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అవుదామనుకొన్నారో వారినే ఎన్నికల సమయంలో విస్మరించడంతో ఆయన అభాసుపాలయ్యారు. ఆ తరువాత నుండి చేసినవన్నీ స్వయంకృతాపరాదాలే. కనీసం కేంద్రమంత్రిగా నిలద్రొక్కుకొన్నప్పుడయినా ఆయన మళ్ళీ తన అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి ఉండి ఉంటే నేడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేదేమో! కానీ చేతులు కాలే వరకు కూడా ఆయన మేల్కొనలేదు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద ఆంద్రప్రదేశ్ ప్రజలు కోపంతో రగిలిపోతున్నారనే సంగతిని గ్రహించకుండా లేదా గ్రహించనట్లుగా నటిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు.   ఆ కారణంగానే చాలా మంది అభిమానులు కూడా ఆయనకి దూరమయ్యి, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే కంకణం కట్టుకొన్న పవన్ కళ్యాణ్ వైపు మళ్ళారు. కనీసం అప్పుడయినా చిరంజీవి మేల్కొని తమ్ముడితో చేతులు కలిపి ఉండి ఉంటే నేడు వారిరువురి రాజకీయ భవిష్యత్ మరియు రాష్ట్ర రాజకీయాలు మరోలా ఉండేవేమో? కానీ ఒకప్పుడు లక్ష్మణుడిలా తన వెన్నంటి సేవ చేసిన తమ్ముడితో చేతులు కలిపే బదులు అతని జనసేన పార్టీకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడంతో ప్రజలు పూర్తిగా ఆయనకు దూరమయ్యారు.   రాజకీయాలపై ఎటువంటి అవగాహనలేకపోయినా చిరంజీవి కేంద్రమంత్రి స్థాయికి ఎదగగలిగారు. కానీ ప్రజాధారణ కోల్పోతే రాజకీయాలలో రాణించలేరనే సంగతి తెలుసుకొనేందుకు ఆయనకి చాలా కాలమే పట్టింది. ఒకప్పుడు రాజకీయ ఆరంగ్రేటం చేయడానికి అభిమానుల భరోసాయే కారణం. ఇప్పుడు మళ్ళీ తన ప్రతిష్టని పునరుద్దరించుకోవడానికీ మళ్ళీ ఆయనకి వారి సహాయసహకారాలే అవసరమయ్యాయి.   ఆయన ఇంతకాలం తన అభిమానులతో ఎలా వ్యవహరించినప్పటికీ, వారు మాత్రం మళ్ళీ ఆయనకు అండగా నిలబడేందుకు సిద్దమయ్యారు. ఆయనకు సోషల్ నెట్ వర్క్ సైట్ల ద్వారా మద్దతు కూడగట్టి ఆయన పుట్టిన రోజునాడు పెద్ద ఎత్తున సమాజసేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా పోయిన చోటే ఉంగరం వెతుక్కోవాలన్నట్లు రాజకీయాలలో చేరిన తరువాత తను దూరం చేసుకొన్న అభిమానులను, పోగొట్టుకొన్న ప్రతిష్టను మళ్ళీ సినీపరిశ్రమ ద్వారానే పొందాలనుకొంటున్నారు.   అయితే ఒక రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం పార్లమెంటులో మాట్లాడాలనే చిన్న విషయం విస్మరించి, సినిమాల ద్వారా ప్రజలను మెప్పించాలనుకోవడం చాలా హాస్యాస్పదం. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించవలసిన తరుణంలో ఆయన తన భవిష్యత్ గురించి ఆలోచించడమే కాకుండా అందుకు తను ఒకనాడు దూరంగా ఉంచిన అభిమానుల సహాకారం కూడా కోరుతున్నారు. ఆయన సినిమాలలో ఉన్నప్పుడు వేసుకొన్న మేకప్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత పూర్తిగా తొలగిపోవడంతో ఆయన అసలు వ్యక్తిత్వం ఎటువంటిదో అర్ధం చేసుకొనే అవకాశం ప్రజలకి దక్కింది. మళ్ళీ ఇప్పుడు ఆయన మేకప్ వేసుకొని ప్రజలను మెప్పించేందుకు వస్తున్నారు.

తప్పులెన్నువారు...

  ఈరోజుల్లో బోడి గుండుకి మొకాలుతో ముడిపెడుతూ మాట్లాడటం వస్తే చాలు రాజకీయాలలో చేరేందుకు ప్రాధమిక అర్హత ఉన్నట్లే భావించవచ్చును. ఈ విషయంలో తెరాస, వైకాపా నేతలకున్న ప్రతిభ మరొకరికి ఉండబోదని చెప్పవచ్చును.   అసెంబ్లీలో తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదంటూ గంటలు గంటలు ప్రసంగాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఆ వంకతో అసెంబ్లీని బహిష్కరించివెళ్ళిపోతే, ప్రతిపక్షం లేకుండానే చంద్రబాబు నాయుడు అసెంబ్లీని నిర్వహించేస్తున్నారంటూ, తెలంగాణా అసెంబ్లీ నుండి 11 మంది తెలంగాణా తెదేపా సభ్యులను బడ్జెట్ సమావేశాల నుండి బహిష్కరించి చేతులు దులుపుకొన్న ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఆక్షేపించడం విచిత్రం. తెలంగాణాలో నిరంకుశపాలన సాగుతోందని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. అదే విధంగా మీడియాపై కూడా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఆ సంగతి విస్మరించి, చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన సాగిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించడం మరో విచిత్రం.   వైకాపా సభ్యులు వారంతటవారే శాసనసభ సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోయారు. ప్రజల తరపున శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత కలిగిన ప్రధాన, ఏకైక ప్రతిపక్షం వైకాపా చాలా బాధ్యతారాహిత్యంగా కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోతే అందుకు వైకాపాను దాని అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హరీష్ రావు విమర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ని ఖరారు చేసేందుకు శాసనసభ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయినప్పుడు, తమ పార్టీ సూచిస్తున్న అంశాలను అజెండాలో చేర్చకపోయినట్లయితే సభలో “అగ్లీ సీన్స్ క్రియేట్’ చేస్తామని వైకాపా ప్రతినిధులు ముందే హెచ్చరించారు. చెప్పినట్లే సభలో అగ్లీ సీన్స్ క్రియేట్ చేసి సభను బహిష్కరించి వెళ్ళిపోయారు. మళ్ళీ సభలో అడుగుపెట్టబోమని శపథం చేయడమే కాకుండా బస్సు యాత్ర చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. అంటే అన్ని ముందుగా అనుకొన్నట్లే ఒక పధకం ప్రకారమే వైకాపా వ్యవహరించిందని స్పష్టం అవుతోంది. ఈవిధంగా వైకాపా ఏదో ఒక రాజకీయ వ్యూహ ప్రకారం సభను బహిష్కరించి బయటకు వెళ్ళిపోతే, కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి బస్సు యాత్రలు చేయబోతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించవలసిన మంత్రి హరీష్ రావు చంద్రబాబు నాయుడుని ఎందుకు నిందిస్తున్నారో?   తెలంగాణా అసెంబ్లీ నుండి బహిష్కరించబడిన తెదేపా సభ్యులు తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ తమను బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించమని కోరుతున్నా వారిని తెలంగాణా ప్రభుత్వం అనుమతించడం లేదు. వారు తమ తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పేందుకు కూడా సంసిద్దత వ్యక్తం చేసారు. అయినా కూడా వారిని సభలోకి అనుమతించడం లేదు. వైకాపా సభ్యులు వారంతట వారుగా సభను బహిష్కరించి వెళ్లిపోతే, తెదేపా తెలంగాణా సభ్యులు తిరిగి సభలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా అనుమతించడం లేదు. చంద్రబాబు నాయుడులో తప్పులెంచుతున్న మంత్రి హరీష్ రావు తన ప్రభుత్వం చేసింది మాత్రం తప్పుగా భావించక పోవడం విచిత్రం. అయినా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అడుగుపెట్టమని ప్రకటించి బస్సు యాత్రలు చేయదలచుకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఏమి చేయగలరు? స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ పై వైకాపా సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి సిద్దంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చెపుతున్నారు. కానీ వారికి సమావేశాలలో పాల్గొనే ఉద్దేశ్యాలు లేవని స్పష్టం చేస్తున్నారు.    

ఆంద్రప్రదేశ్ రాజధాని పేరు అమరావతి

  ఆంద్రప్రదేశ్ రాజధానికి గొప్ప చారిత్రిక నేపధ్యం కలిగిన ‘అమరావతి’ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు తాజా సమాచారం. అచ్చమయిన తెలుగుదనం ఉట్టిపడుతున్న అమరావతి గురించి కవులు, సాహితీవేత్తలు తమ రచనలలో అనేకవిధాలుగా వర్ణించారు. అంతేగాక ‘అమరావతి’ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమయిన పేరు. దానితో ప్రజలు చక్కటి అనుబంధం కలిగి ఉన్నారు. ఇక అమరావతి పేరు వెనుకున్న బౌద్ధ నేపధ్యం వలన రాష్ట్ర రాజధాని నగరానికి, తద్వారా రాష్ట్రానికి కూడా ప్రపంచ దేశాలలో చాలా త్వరగా గుర్తింపు ఏర్పడుతుందనే అభిప్రాయంతోనే చంద్రబాబు నాయుడు ఈపేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి మొన్న తుళ్ళూరులో ఉగాది వేడుకలు జరుపుకొన్నప్పుడే చంద్రబాబు నాయుడు రాజధాని పేరు ప్రకటించాలనుకొన్నారు. కానీ ముందుగా అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించి సభ్యుల ఆమోదం పొందిన తరువాతే బయట ప్రకటించడం మంచిదనే ఆలోచనతో ఆ ఆలోచన విరమించుకొన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం ఎలాగో మీడియాకు తెలియడంతో ఇంకా అధికార ప్రకటన వెలువడక ముందే ప్రజలకు తెలిసిపోయింది. కనుక చంద్రబాబు నాయుడు ఈరోజే అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించవచ్చును.

ఇక జగన్ మైక్ ని ఎవరూ కట్ చేయలేరు!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికు శాసనసభలో మొన్న గంటసేపు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చేరు. ఆ తరువాత కూడా ఆయన ఇంకా తన పిర్యాదుల పంచాంగం అనర్గళంగా చదివే ప్రయత్నం చేసినప్పుడు ఇక ముగించమని స్పీకర్ చెపుతున్నా వినకపోవడంతో స్పీకర్ ఆయన మైక్ కట్ చేసారు. దానితో జగన్ ఇగో దెబ్బతింది. అది చూసి వైకాపా సభ్యుల ఇగో దెబ్బతింది. అప్పుడు వారందరూ స్పీకర్ మీద విరుచుకుపడ్డారు. స్పీకర్ వారిని సభ నుండి 3 రోజులపాటు స్పస్పెండ్ చేసారు. అప్పుడు జగన్ ‘మీకో దణ్ణం!’ అంటూ స్పీకర్ అనుమతి తీసుకోకుండానే, సభ నుండి వాక్ అవుట్ చేస్తున్నట్లు ప్రకటించకుండానే వాకవుట్ చేసేసారు. పోతూపోతూ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నామంటూ అసెంబ్లీ కార్యదర్శి చేతిలో ఒక లేఖ పెట్టి చక్కాపోయారు.   ఆ తరువాత తన లోటస్ పాండ్ లో సిద్దంగా ఉన్న తన మీడియా సాక్షిగా తను శాసనసభలో మళ్ళీ అడుగుపెట్టనని భీకర శపథం చేసేసారు. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును సభలో చర్చకు అనుమతిస్తామని చెప్పినప్పుడే తిరిగి సభలో కాలుపెడతానని శపథం చేశారు. ఆ తరువాత దాదాపు రెండు గంటలసేపు మీడియా ముందు తన ఆవేదనంతా ఒలకబోసుకొన్నారు. ఇంకా ఒలకబోసేవారేనేమో గానీ ఇంక ఓపికలేకపోవడంతో ముగించినట్లున్నారు. బడ్జెట్ సమావేశాలకి తను హాజరు కానప్పటికీ దానిపై తన అమూల్యమయిన అభిప్రాయాలు తెలుసుకోగోరే ప్రజలు మీడియాలో చూసుకోమని ఒక ఉచితసలహా ఇచ్చేరు.   అసెంబ్లీలో స్పీకర్ అధికార పార్టీకి చెందినవారు కనుక తనకు తృప్తిగా మాట్లాడనివ్వకుండా మైక్ కేట్ చేసేవారు. కానీ ఇప్పుడు తన స్వంత ఇంట్లో స్వంత మీడియా ముందు కూర్చొని ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు నిరభ్యంతరంగా, అనర్ఘళంగా నచ్చినట్లు మాట్లాడుకోవచ్చును. అసెంబ్లీని ఇడుపులపాయో, లోటస్ పాండో అన్నట్లు సభలో వ్యవహరిస్తే కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకు ఒకసారి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన హెచ్చరికలో అసలు అర్ధం గ్రహించలేకపోయినా, దానిలో నుండి మంచి ‘క్లూ’ మాత్రం పొందినట్లున్నారు. అందుకే లోటస్ పాండ్ నుండే తన ప్రసార కార్యక్రమాలు మొదలుపెట్టేసారు. ఇప్పుడు ఎవరూ కూడా ఆయన మైక్ కట్ చేయలేరు. కనుక ఎన్ని గంటలు ఓపిక ఉంటే అన్ని గంటలూ మాట్లాడుకోవచ్చును. చూసేవాళ్ళు చూస్తారు, లేని వాళ్ళులేదు.

గచ్చిబౌలీ వద్ద తెలంగాణా హైకోర్టు?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేవరకు అలుపెరుగని పోరాటం సాగించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు, హైకోర్టు విభజనకు చకచకా పావులు కదుపుతున్నారు. కేంద్ర న్యాయ శాఖామంత్రి సదానంద గౌడ కూడా అందుకు సై అనడంతో ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా రాష్ట్ర అసెంబ్లీ చేత అందుకు ఒక తీర్మానం చేయించారు. రాష్ట్ర న్యాయశాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొందరు న్యాయవాదుల సంఘాల నాయకులను డిల్లీకి పంపించారు. అదేసమయంలో తెరాస యంపీలను కూడా సదానంద గౌడ వద్దకు పంపించి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, గచ్చి బౌలీ వద్ద 1.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సువిశాల భవనం ఒకటి సిద్దంగా ఉందని తెలియజేసారు.   హైకోర్టు విభజనకు కేసీఆర్ చాలా వేగంగా పావులు కదుపుతున్నప్పటికీ, ఉభయ రాష్ట్రాలు ఈ విషయం గురించి చర్చించుకొని తన వద్దకు రమ్మని చెప్పిన సదానంద గౌడ సూచనను మాత్రం పట్టించుకోలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ ఆయన పట్టించుకాకపోయినా, న్యాయశాఖామంత్రిగా ఉన్న సదానంద గౌడకి మాత్రం తప్పదు కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు విభజన గురించి లేఖ వ్రాసి దాని అభిప్రాయం తెలుసుకొన్న తరువాత ముందుకు వెళ్తానని తనను కలిసిన రాష్ట్ర ప్రతినిధులకు చెప్పినట్లు తెలుస్తోంది. హైకోర్టు విభజనకు కేసీఆర్ ఇంతగా తొందరపడుతున్నప్పుడు, ఆయనే ఒకమెట్టుదిగి చంద్రబాబు నాయుడుతో నేరుగా మాట్లాడి ఉండి ఉంటే ఆలస్యం జరుగకుండా నివారించగలిగేవారు కదా? తన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండానే కోర్టు విభజన జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు అడ్డు చెపుతారు? కనుక కేంద్రప్రభుత్వం హైకోర్టు విభజన చేయాలనుకొంటే అందుకు చంద్రబాబు నాయుడు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చును.

తెలంగాణా రవాణా శాఖకు హైకోర్టు మొట్టికాయలు

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ రాష్ట్రంలో ప్రవేశించే ఆంద్ర వాహనాలపై ప్రవేశ పన్ను విధిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఒక జి.ఓ. జారీ చేసినప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో ఆ జి.ఓ.ను వెనక్కు తీసుకోవలసి వచ్చింది. కానీ ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ కలిగి ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో తిరుగుతున్న వాహనాలపై రాష్ట్ర రవాణాశాఖ అధికారులు జీవితపన్ను చెల్లించమని గత నెలరోజులుగా నోటీసులు జారీ చేస్తుండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.   వాహనాలు ఏ రాష్ట్రంలో కొన్నప్పటికీ వాటిని కొన్నప్పుడే జీవిత పన్ను వసూలు చేస్తారు. కనుక తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో తిరిగినప్పటికీ వాటిపై మళ్ళీ జీవితపన్ను విధించడానికి వీలులేదు. కానీ మళ్ళీ జీవితపన్ను చెల్లించమని రాష్ట్ర రవాణాశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో, వాటిని సవాలు చేస్తూ కోర్టులో నిత్యం పిటిషన్లు పడుతున్నాయి. వాటిపై దృష్టి సారించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.   కొన్ని రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర రవాణాశాఖ అధికారులు చెన్నైకి చెందిన ఒక వైద్యుడికి కారుని పట్టుకొని దానిపై వడ్డీతో సహా అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తం మొత్తం ఒక లక్షా డబ్బై ఎనిమిదివేలు జీవితపన్ను చెల్లించమని నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో రాజస్థాన్ కి చెందిన యస్.వి.ఈ.సి.అనే నిర్మాణసంస్థకు చెందిన ఒక లారీని జీవితపన్ను చెల్లించలేదంటూ రవాణా శాఖ అధికారులు నిలిపివేశారు.   ఇటువంటివే మరి కొన్ని కేసులు కోర్టు దృష్టికి రావడంతో చీఫ్ జస్టిస్ కళ్యాన్ సేన్ గుప్తా మరియు జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖకు మొట్టికాయలు వేసారు. ఒకసారి జీవిత పన్ను చెల్లించిన వాహనంపై మళ్ళీ జీవితపన్ను ఎందుకు విధిస్తున్నారని రవాణాశాఖ తరపున కోర్టుకి హాజరయిన న్యాయవాదిని నిలదీసినప్పుడు, తెలంగాణా రాష్ట్రంలో ముప్పై రోజులకంటే ఎక్కువ రోజులున్న వాహనానికి మళ్ళీ జీవితపన్ను చెల్లించవలసి ఉంటుందని ఆయన బదులిచ్చారు. ఆయన సమాధానం విన్న న్యాయమూర్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి చట్టం ఎక్కడ ఉందో తమకు చూపించాలని ఆదేశించారు. అంతేగాక ఈవిధంగా వాహనదారులను ఇబ్బందులు పెడుతున్న సదరు అధికారుల పేర్లను తమకు తెలియజేయాలని ఆదేశించారు. వారు సీజ్ చేసిన అన్ని వాహనాలను తక్షణమే విడుదల చేయమని ఆదేశించారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే సంబంధిత అధికారుల నుండి నష్టపరిహారం వసూలుచేసి సదరు వాహనదారులకు చెల్లింపజేయిస్తామని న్యాయమూర్తులు హెచ్చరించారు. ఈ జీవితపన్ను వ్యవహారంపై వారం రోజుల్లోగా రవాణా శాఖ సంజాయిషీ ఇవ్వవలసిందిగా కోర్టు ఆదేశించింది.

ప్రజాస్వామ్యమా...వైకాపాలో ఉందా అది?

  ఆంద్రప్రదేశ్ శాసనసభ ఈరోజు సమావేశం కాగానే మళ్ళీ షరా మామూలుగానే అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం మొదలయింది. నిన్న పట్టిసీమ మీద యుద్ధం చేసుకొంటే, ఈరోజు పంట రుణాలపై మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డికి తగినంత సమయం ఇవ్వకుండా స్పీకర్ మైక్ కట్ చేసి అధికార పార్టీ సభ్యులకి మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఇచ్చారంటూ యుద్ధం మొదలుపెట్టారు. వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకి వెళ్లి నినాదాలు చేయడం మొదలుపెట్టడంతో ఆయన సభను 10 నిమిషాలు వాయిదా వేసారు. అయితే అంతమాత్రాన్న వివాదం సద్దుమణుగుతుందని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది.   సభలో తనకి మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదనే అంశం మీదనే గంటలుగంటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండటం ఒక విచిత్రమేయితే, సభలో తన పార్టీ సభ్యులెవరికీ కూడా మాట్లాడే అవకాశం ఈయకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సుదీర్ఘ ప్రసంగాలు చేయడం మరో విచిత్రం. సభలో సభ్యులు ఏదయినా ఒక అంశం గురించి మాట్లాడదలిస్తే, స్పీకర్ అందుకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. ఆ సమయంలోనే సభ్యుడు తను చెప్పదలచుకొన్నది క్లుప్తంగా చెప్పవలసి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తను ఎంతసేపు మాట్లాడదలుచుకొంటే అంతసేపు తనను ఎవరూ అడ్డుకోరాదని, అడ్డుకొంటే అది ప్రతిపక్షాల గొంతు నొక్కేయడమేనని వితండవాదన చేస్తుంటారు.   తను మాట్లాడుతుంటే అధికార పార్టీకి చెందిన పదిమంది తనకు అడ్డుతగులుతున్నారని వాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి, సభలో తన పార్టీ తరపున మరెవరూ మాట్లాడేందుకు ఎందుకు అనుమతించడం లేదు? అది వారి హక్కులను కాలరాయడం కాదా? అప్రజాస్వామికం కాదా? వైకాపా సభ్యులు అందరూ ఆయన ఆదేశానుసారం శాసనసభలో అల్లరి చేయడానికే పరిమితయ్యారా? ఈవిధంగా తన పార్టీలో సభ్యులు తమ తమ నియోజకవర్గాల సమస్యలను శాసనసభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించకుండా వారి సమయాన్ని కూడా యధేచ్చగా వాడేసుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం మంటగలిసిపోతోందని గావుకేకలు పెడుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది.

ఆంధ్ర, తెలంగాణా శాసనసభల నిర్వహణలో ఎంత తేడానో

  ఆంద్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్ష నేతల తీరు చూసి ముక్కున వేలేసుకొంటున్న ప్రజలు తెలంగాణా శాసనసభను చూసి మెచ్చుకొంటున్నారు. ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు 40 రోజులు ఎందుకు పెట్టలేదనే అంశంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలయిన యుద్ధం పట్టిసీమతో పరాకాష్టకు చేరుకొంది. నిన్న సభలో సభ్యులు ప్రవర్తించిన తీరు చూసిన తరువాత ఈ మాత్రం దానికి 17 రోజులు సమావేశాలు కూడా అనవసరమని ప్రజలు భావిస్తున్నారు.   తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, బీజేపీలు మూడు కూడా రాజకీయంగా శత్రువులే అయినప్పటికీ, ఆ మూడు పార్టీల సభ్యులు శాసనసభలో చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నతీరు చాలా ముచ్చట గొలుపుతోంది. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలపై సభ్యులు అందరూ లోతుగా చర్చించడం, అధికార పార్టీ చెపుతున్న విషయాల గురించి ప్రతిపక్షాలు ఆసక్తిగా అడిగి తెలుసుకొని ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇస్తుండటం, వాటిని అధికార పార్టీ వినమ్రంగా స్వీకరిస్తుండటం చూస్తుంటే చాలా ముచ్చట కలుగుతోంది.   ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యులు నిన్న ఒకరినొకరు బూతులు తిట్టుకొంటుంటే, తెలంగాణా శాసనసభ లో సభ్యులు అందరూ కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇరు రాష్ట్రాల శాసనసభల నిర్వహణలో, సభ్యులు వ్యవహరిస్తున్న తీరులో చాలా తేడా కనబడుతోంది. ఒకే సమయంలో, ఒకే ప్రాంగణంలో రెండు రాష్ట్రాల శాసనసభలు జరుగుతున్నందున ఆ తేడా మరీ కొట్టవచ్చినట్లు కనబడుతోంది.

మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నేతలు

  మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా వ్యవహరించినప్పటికీ చట్టసభల పట్ల ప్రజలలో నెలకొని ఉన్న గౌరవం అలానే నిలిచి ఉంది. కారణం ప్రజాస్వామ్యంపై వారికున్న అపారమయిన నమ్మకం, గౌరవమే. కానీ చట్టసభలలో కూర్చొన్నవారికి మాత్రం అటువంటి మూడ నమ్మకాలు, అపోహలు ఏమీ లేవని పదేపదే నిరూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరును చూసి ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “అసెంబ్లీ అంటే మీ ఇడుపులపాయో లేకపోతే మీ లోటస్ పాండో అన్నట్లు ఏమి మాట్లాడినా చెల్లుతుందన్నట్లు వ్యవహరించడం సరికాదు,” అని హెచ్చరించవలసి వచ్చింది. కానీ ప్రజాసమస్యల గురించి మాట్లాడుతుంటే తమకు మాట్లాడే అవకాశం ఈయకుండా అధికార పార్టీ సభ్యులు అడ్డుపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రత్యారోపణలు చేసారు.   రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన తరువాత ఇప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం అంటూ ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అధికార తెదేపా పార్టీ ప్రతిపక్ష పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర అసెంబ్లీని ఒక ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేసిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి మాట్లాడే అవకాశం ఇచ్చినా మాట్లాడేందుకు ఆసక్తి చూపేవారు కాదని అన్నారు.   కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వ్యవహారంలో ఎంత గొప్పగా వ్యవహరించిందో ప్రజలందరికీ తెలుసు. సాక్షాత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన వల్ల వచ్చే కష్టనష్టాల గురించి తన అధిష్టానానికి ఎంతగా వివరించి వారించినా వినకుండా రాష్ట్ర విభజన చేసింది. కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్రమంత్రులు చెప్పిన సలహాలను సూచనలను పెడచెవిన పెట్టింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాదిమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి దాదాపు రెండున్నర నెలలపాటు ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు.   విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కిటికీలు, తలుపులు మూసివేసి, టీవీ చానళ్ళ ప్రసారాలు నిలిపివేసి అత్యంత హేయమయిన పద్దతిలో విభజన బిల్లుని ఆమోదింపజేసుకొంది. కానీ ఇవేవీ అప్రజాస్వామికంగా కాంగ్రెస్ నేతలు భావించలేదు. అందుకే వారు ఇంతవరకు ఏనాడు కూడా అందుకు పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. కనీసం ఆ ప్రసక్తి కూడా తేలేదు. రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ తదితర కాంగ్రెస్ నేతలు ఏవిధంగా వ్యవహరించారో, అప్పుడు ప్రజలు ఏవిధంగా స్పందించారో అందరికీ తెలిసిన విషయమే.   అటువంటి వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మొసలి కన్నీరు కారుస్తూ రోడ్ల మీద ధర్నాలు చేసినంత మాత్రాన్న రాష్ట్ర ప్రజలు వారు చేసిన తప్పులను మరిచిపోయి క్షమించేస్తారా? ఆనాడు యావత్ దేశ ప్రజలు నివ్వెరపోయేలా పార్లమెంటులో వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీని ఒక ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేశారని ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం.

ఒప్పు... తప్పు... బూతు...

  తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే కాకలు తీరిన రాజకీయ పండితులకు కూడా బుర్ర తిరిగిపోతోంది. హిచ్‌కాక్ సినిమాల్లో ట్విస్టులనైనా ముందుగా ఊహించగలం కానీ, తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఎప్పుడు, ఏమి, ఎందుకు, ఎలా జరుగుతోందో తమ ఊహకు అందడం లేదని సదరు పండితులు బుర్రలు గోక్కుంటూ చెబుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కూడా తెలుగుదేశాధినేత తీసుకున్న నిర్ణయం రాజకీయ పరిశీలకుల దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.   ఎమ్మెల్యే కోటాలో తెలుగుదేశం పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునే అవకాశం వుండటంతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎంతోమంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవి రేసులో నిలిచారు. మొన్నామధ్య జరిగిన సాధారణ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినవారికి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఛాన్స్ లేదని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించడంతో అప్పుడు ఓడిపోయిన చాలామంది నిరుత్సాహపడి రేసులోంచి విరమించుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సముచిత నిర్ణయం తీసుకుని సమర్థులకే ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తారని భావించారు. అయితే చంద్రబాబు నాయుడు అందరికీ షాకిస్తూ మూడు పేర్లు ప్రకటించారు. వారిలో కోస్తా నుంచి వి.వి.వి.చౌదరి, ఉత్తరాంధ్ర నుంచి గుమ్మడి సంధ్యారాణి, రాయలసీమ నుంచి తిప్పేస్వామి వున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్ తప్పకుండా వస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయనని పక్కనపెట్టి తిప్పేస్వామిని తెరమీదకు తెచ్చారు. వీరిలో వి.వి.వి.చౌదరి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వినిపించడం లేదుగానీ, సంధ్యారాణి, తిప్పేస్వామిల ఎంపిక మాత్రం పార్టీలో కలకలం రేపింది.   చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను పార్టీ కార్యకర్తలు ‘ఒప్పు... తప్పు... బూతు’’ అని అభివర్ణిస్తున్నారు. ప్రతిక్షణం పార్టీ పనిలోనే వుంటూ, నిరంతరం పార్టీ కార్యాలయంలోనే వుండే వి.వి.వి.చౌదరికి టిక్కెట్ ఇవ్వడం ‘ఒప్పు’ అని అంటున్నారు. అలాగే మొన్నటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినవారికి టిక్కెట్ ఇవ్వనని చెప్పిన చంద్రబాబే ఇప్పుడు అరకు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన సంధ్యారాణిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ‘తప్పు’ నిర్ణయంగా చెబుతున్నారు. ఇక తిప్పేస్వామి ఎంపిక నిర్ణయాన్ని ‘బూతు’ అని అభివర్ణిస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా సేవ చేసిన వారిని పక్కనపెట్టి నిన్నగాక మొన్న కాంగ్రెస్‌లోకి వచ్చిన తిప్పేస్వామికి ఎమ్మెల్సీ రావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడి తీరు అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డించిన చందంగా వుందని చెవులు కొరుక్కుంటున్నారు. సంధ్యారాణి, తిప్పేస్వామిలకు ఎమ్మెల్సీ స్థానాలు దక్కడం వెనుక చక్రం తిప్పిన ‘ఎమ్మెల్సీ మంత్రి’ గారి మీద టీడీపీ కార్యకర్తలు గుర్రుగా వున్నారు.

రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ దేనికయినా సిద్ధం

  గత అనేక ఏళ్లుగా దేశంలో అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నాయి. కానీ యూపీయే ప్రభుత్వం దేనికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కానీ, సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జే.డి.యు.) తమ యూపీయే కూటమిలో చేరేందుకు అంగీకరిస్తే, ఆయన కోరుకొన్నట్లుగా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ ప్రధానమంత్రి కావాలని కలలుగంటున్న ఆయన, రాహుల్ గాంధీని నెత్తినపెట్టుకొని తిరుగుతున్న యూపీయే కూటమిలో చేరడం వలన తన లక్ష్యం నెరవేరే అవకాశం ఉండదనే ఆలోచనతో వామపక్ష పార్టీలనన్నిటినీ పోగేసి థర్డ్ ఫ్రంట్ కూటమి కట్టేడు. అందుకే యూపీయే ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. లేకుంటే అప్పుడే ఇచ్చేసేదే. అంటే నితీష్ కుమార్ కి తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలనే తపన కంటే తను ప్రధానమంత్రి అవ్వాలనే తపనే ఎక్కువని స్పష్టం అవుటోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన చేతిలో అధికారం ఉంది కనుక తనకు లాభం చేకూరుతుందంటే అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఏ రాష్ట్రానికయినా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వెనుకాడదని అర్ధమవుతోంది.   ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సరిగ్గా అలాగే ఆలోచించి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించేసింది. కానీ వ్రతం చెడ్డా ఫలం మాత్రం దక్కన్నట్లు ఆంద్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. మళ్ళీ రాష్ట్రంలో బలం పుంజుకొని నిలబడాలంటే, రాష్ట్ర విభజన చేసినందుకు తనపై ఆగ్రహంగా ఉన్న ప్రజలను మంచి చేసుకోవలసి ఉంటుందని గ్రహించి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడుతోంది. ఆవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధి బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని దానిని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఇరకాటంలో పెట్టవచ్చనే దురాలోచన కూడా ఇమిడి ఉంది.   ఒకప్పుడు రాష్ట్ర ప్రజల మనోభావాలను, వారి ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుస్తున్నట్లు నటిస్తోంది. కానీ ఆంధ్రాకే కాదు తెలంగాణా రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వవద్దని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పార్లమెంటులో గట్టిగా చేస్తున్న వాదనలు వింటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏపాటిదో, ఇన్నేళ్ళుగా దానిని నెత్తిన పెట్టుకొన్న తెలుగు రాష్ట్రాల పట్ల దానికి ఎంత గొప్ప అభిప్రాయం ఉందో అర్ధమవుతోంది.   ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకి పారిశ్రామిక అభివృద్ధికి సబ్సీడీలు ఇచ్చినట్లయితే, ఇరుగు పొరుగు రాష్ట్రాలకి నష్టం కలుగుతుందని, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతాయని వీరప్ప మోయిలీ హెచ్చరిస్తున్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం బీహార్ రాష్ట్రానికి ఏవిధంగా ప్రత్యేక హోదా ఇచ్చేయాలనుకొంది?మరి అప్పుడు అడ్డురాని ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ఇస్తేనే వస్తాయా? అయినా ఇచ్చేది పుచ్చుకొనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలయినప్పుడు, కందకు లేని కత్తిపీటకు ఎందుకన్నట్లు లోక్ సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దురద?