Read more!

వరాల వరలక్ష్మి

 

వరాల వరలక్ష్మి

 

సౌభాగ్యాన్ని, సిరి సంపదలను,వివేకంతో కూడిన జ్ఞానాన్ని కలిగించి శ్రేష్టమైన సంపూర్ణమైన జీవితాన్ని ప్రసాదించే వర మహాలక్ష్మి వరలక్ష్మి. స్త్రీలకు పవిత్రతకు శక్తిని సమకూర్చి ఓపికను, ఒద్దికను ప్రసాదిస్తుంది జగజ్జనని. తెలుగు వారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే వ్రతం వరలక్ష్మీ వ్రతం. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ వరలక్ష్మీ వ్రతం శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. ఈ రోజు ఎంతో మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేనిని పూజిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవికి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు కుదరని వారు శ్రావణమాసంలో తర్వాత వచ్చే వారాల్లోనూ చేసుకోవచ్చు.

శ్రావణ వరలక్ష్మి పూజ కొత్త నగతో చేయాలనేది నియమం.అందుకే నవ వధువులకు అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తయిదువులు లక్ష్మీరూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. తర్వాత ఆ బంగారమే భవిష్యత్తు తరాలకు మదుపు అవుతుంది.


శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు.
వ్రత విధానం..

◆పూజ విధానం

ఈ పవిత్రమైన రోజున, మహిళలు త్వరగా మేల్కొని తలంటు స్నానం ఆచరిస్తారు.అమ్మవారికి తీపి పదార్ధాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.లక్ష్మీదేవిని ఈశాన్యదిక్కున పూజిస్తే మంచిదని చెబుతుంటారు. ఇంటి ఈశాన్యభాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి.పీట మీద నూతన తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి.. దాని మీద కలశాన్ని ప్రతిష్టించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అద్ది, దాని మీద కొబ్బరికాయను ఉంచాలి.

కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దితే ఇంకా మంచిది. కొబ్బరికాయంతో పాటుగా కలశం మీద మామిడి ఆకులను ఉంచడమూ శుభసూచకమేనని పెద్దలు చెబుతుంటారు.ఈ పూజ ఆచరించే మహిళలు ఆ రోజున కొన్ని ఆహార పదర్థాలను తినరు. ప్రాంతాన్ని బట్టి ఇది మారుతుంది.ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఏర్పాటు చేయాలి.

తోరగ్రంథి పూజ చేసి..

తోరం ధరించిన అనంతరం వరలక్ష్మి వ్రత కథ చెప్పుకుని లక్ష్మీదేవిని పూజించాలి.అనంతరం పిండివంటలను నైవేథ్యంగా సమర్పించాలి.వాయినంగా నానబెట్టిన శనగలు పంచిపెట్టాలి.పూజ మరుసటి రోజు కలషం లోని నీళ్లు ఇంటి చుట్టూ చల్లాలి. కలషం కింద ఉంచిన బియ్యంతో అన్నం వండుకుని ప్రసాదంగా స్వీకరించవచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ