Read more!

శ్రీ నారసింహ క్షేత్రాలు – 17

 

 

శ్రీ నారసింహ క్షేత్రాలు – 17


సింగరకొండ

ప్రకాశం జిల్లాలోనే వున్న సింగరకొండ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా క్రీ.శ. 1443-44 సంవత్సరాలలో విజయనగర రాజు దేవరాయలుచే నిర్మించబడినదని శిలా శాసనం ద్వారా తెలుస్తున్నది.  ఇక్కడ ప్రచారంలో వున్న ఇంకొక కధనం ప్రకారం 14వ శతాబ్దంలో సింగన్న అనే నరసింహస్వామి భక్తుడు ఈ ప్రాంతంలో నివసించేవాడు.  ఆయన కూతురు నరసమ్మ తమ పశువులను మేపటానికి ఈ కొండమీదకి వచ్చేది.  వారి మందలోని ఒక ఆవు కొన్ని రోజులుగా పాలివ్వకపోవటం గమనించిన సింగన్న ఒక రోజు ఆ ఆవుని  రహస్యంగా వెంబడించి వెళ్ళాడు.  ఆ ఆవు ఈ కొండమీద ఒక పెద్ద రాతిదగ్గరకొచ్చి నుంచోగా, ఆ రాతినుంచి ఒక బాలుడు వచ్చి ఆవు పాలు తాగి అదృశ్యమయ్యాడుట.  సింగన్న ఆవు పాలు తాగి అదృశ్యమైన బాలుడు తన ఇష్టదైవమైన నరసింహస్వామిగా భావించి ఆ స్వామికి అక్కడ ఆలయాన్ని నిర్మించాడుట.  తర్వాత ఆయన పేరుమీద ఆ కొండ సింగరకొండ అయింది.

ఆలయంలో స్వామి ఎడమతొడపై లక్ష్మీ దేవితో దర్శనమిస్తాడు.  గర్భగుడి చుట్టూ ఆళ్వార్ల విగ్రహాలు చిన్న గూళ్ళల్లో వున్నాయి. 

210 సంవత్సరాల  క్రితం ఆ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది.  వేలాది భక్తులు ఆ ఉత్సవానికి వచ్చారు.  వారందరు చూస్తుండగా,  అత్యంత తేజోరూపుడైన యోగి ఒకరు  కొండ దిగువన వున్న భవనాశని పుష్కరిణి దగ్గర ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి అదృశ్యమయ్యారుట.  ఆ రోజునుంచీ,  భక్తులు కొండ దిగువన ప్రసన్నాంజనేయస్వామిని పూజిస్తున్నారు.  ఈ ఆలయం విశాలంగా వుండి, స్వామి నిలువెత్తు విగ్రహం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంపొందింప చేస్తుంది.  ఇక్కడ ఆంజనేయస్వామి దక్షిణాభిముఖంగా వుంటారు. ఆంజనేయస్వామి ఆలయానికి ఈశాన్యాన భవనాశని పుష్కరిణి, నైఋతి దిశలో నరసింహస్వామి నెలకొన్న సింగరకొండ వుండటంవల్ల ఈ క్షేత్రం వాస్తు ప్రకారం ఉత్తమంగా వున్నదని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.  ఈ స్వామి మీద అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ క్షేత్రానికి వచ్చేవారి సంఖ్యకూడా ఎక్కువే.

 

ఆంజనేయస్వామి ఆలయ క్షేత్రపాలకుడు లక్ష్మీనరసింహస్వామి.

ఉత్సవాలు
ఫాల్గుణ శుధ్ధ పౌర్ణమి రోజు తిరునాళ జరుగుతుంది.  వైశాఖ బహుళ దశమి రోజు హనుమజ్జయంతి అత్యంత వైభవంగా జరుగుతుంది.  ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతారు.  హనుమజ్జయంతి రోజు విద్యుద్దీపాలతో అలంకరించిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణ.

దర్శన సమయాలు
ఉదయం 6-30 నుంచీ, సాయంకాలం 6-30 దాకా.

సింగరాయకొండనుంచీ పైన చెప్పిన ఆలయాలకి ఆటోలో కూడా వెళ్ళిరావచ్చు.  రెండు కొండలమీదకీ ఆటోలు వెళ్తాయి.

 

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)