Read more!

"రామో విగ్రహవాన్ ధర్మః''

 

"రామో విగ్రహవాన్ ధర్మః''

 

 

 

 

వేదాలలో నిక్షిప్తమైన "ధర్మం'' సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు. అందుకే, ఆచరణయోగ్యమైన "ధర్మానికి' ఆకారం దాల్చాలని ఆశపుట్టింది కాబోలు. శ్రీరామునిగా అవనీతలంపై అవతరించింది.
ధర్మసంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో "రామావతారం'' పూర్ణావతారము. జన్మబంధాలులేని పరమాత్మ జగత్కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి, శ్రీరామునిగా సర్వలోకాలకూ ధర్మపథావలంబకుడై ఇదీ "రామాయణం'' అని చాటి చెప్పాడు.

రామస్య ఆయనం'' - రామాయణం :

 

 

 

 


"ఆయనం'' అంటే గమనం, కదలిక. రామాయణం అంటే "రామగమనం'. అదే "ధర్మం యొక్క కదలిక''. ఈ సృష్టి చక్రమంతా అంటే ధర్మ బలంతోనే నడుస్తోంది. ప్రపంచంలోని సకల సుగుణాలు, సుఖాలు, శుభకర్మలూ ధర్మాన్ని అనుసరించే వుంటాయి. ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్నీ అదృశ్యమైపోతాయి. అందుకే "ధర్మో రక్షతి రక్షితః'' అన్నారు.
శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంటుంది. తాటకా సంహార సమయంలో "స్త్రీని చంపడం ఎంతవరకూ ధర్మం'' అనే సంశయంలో శ్రీరాముడు పడ్డప్పుడు :


    నృశంస మనృశంసం వా ప్రజారక్షణ కారణాత్
    పాతకం వా సదోషం వా కర్తవ్యం రాక్షతా సతా ||


"ధర్మరక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన క్షత్రియుడు, ధర్మసంరక్షణ కోసం పాపమని కానీ, క్రూరమని కానీ, అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి. ఇది పాపరహితమైన సనాతన ధర్మం'' అని బోధిస్తాడు విశ్వామిత్రుడు. అంతే, సంశయాన్ని వదిలి తాటకను సంహరించాడు ... శ్రీ రాముడు.

 

 

 

 



శివధర్భంగం జరిగింది. సీతారాముల కళ్యాణము జరిగింది. తన వీరత్వంతోనే శివధర్భంగం జరిగిందనీ ... సీతను పెళ్ళి చేసుకున్నానని శ్రీరాముడు ఎప్పుడూ అనుకోలేదు.


    ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి
    గుణాద్రూప గుణాచ్చాపి ప్రీతిర్భుయో భ్యవర్థత ||


తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టే, రామునకు సీతపై ప్రేమ కలిగింది. సీత, తన సౌదర్యముచేతనూ, సద్గుణముల చేతనూ రామునకు తనపై గల ప్రేమను ఇంకా వృద్ధి చేసెను'' అంటాడు ఆదికవి వాల్మీకి. "తనయుని వివాహా విషయంలో తండ్రిదే సర్వాధికారం'' అన్న వైదిక వివాహ ధర్మానికి కట్టుబడ్డవాడు శ్రీరాముడు.
శ్రీరామ పట్టాభిషేక ముహూర్త నిర్ణయం జరిగింది. కానీ, "అదే మొహూర్తానికి పదునాలుగేళ్లు వనవాసం చెయ్యాలి'' అని శ్రీరాముని ఆదేశించింది పినతల్లి కైక, చిరునవ్వుతో అంగీకరించాడు శ్రీరాముడు. "మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా?'' అని సందేహాన్ని వ్యక్తం చేసింది కైక.
"రామో ద్విరాభి భూషతే'' అమ్మా! ఈ రామునకు రెండు నాలుకలు (మాటలు) లేవు. పితృవాక్య పాలనమే నా ధర్మం'' అన్నాడు శ్రీరాముడు. అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అదీ రాముని ఆయనం, ధర్మం. శ్రీరాముని మనస్సు, మాట,చేత ఒక్కటే.అందులో మార్పు వుండదు. అప్పుడే "ధర్మాచరణ'' సాధ్యం. అదే చేసి చూపించాడు శ్రీరాముడు.

రామో విగ్రహవాన్ ధర్మః

 

 

 

 


శ్రీరాముడు వనవాసం చేసే రోజులలో మహర్షులందరూ రాముని చేరి శరణుకోరగా, "సర్వరాక్షస సంహారం చేసి, ఈ దండకారణ్యాన్ని మునిజన వాస యోగ్యం చేస్తాను'' అని వారికి మాట ఇచ్చాడు. అప్పుడు సీత, "ఆర్యపుత్రా! కారణం లేని వైరం, వైరం లేని హింస పాపహేతువులు కాదా ! ఈ రాక్షసులతో మనకు వైరం లేదు కదా! మరి వారిని సంహరించడం ఎంతవరకు ధర్మం'' అని హితవు చెబుతుంది. "సీతా! క్షత్రియ వంశసంజాతుడు అరణ్యంలోవున్నా, రాజ్యంలోనున్నా సజ్జన సంరక్షణ కోసం దుష్టశిక్షణ చేసి తీరాలి. ఇది క్షత్రియ ధర్మం. ధర్మసంరక్షణ కోసం అవసరమైతే నిన్నేకాదు, నా ప్రాణాలు సైతం పరిత్యజించడానికి వెనుకాడను'' అంటాడు శ్రీరాముడు. ఇదీ, రాముని ధర్మరక్షణ దీక్ష. సీతను అపహరించాలనే సంకస్పంతో రావణుడు మారీచుని దగ్గరకు వచ్చి, శ్రీరాముని నిందిస్తూ మాట్లాడుతుంటే భరించలేని మారీచుడు "రావణా! శ్రీరాముని స్వరూప స్వభావాలు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. రాముడెవరనుకున్నావు."రామో విగ్రహవాన్ ధర్మః'' సాధుస్సత్యపరాక్రమః'' అని నిర్భయంగా ప్రశంసించాడు. శతృవు చేత కూడా కీర్తించబడే ధర్మచరిత్ర గలవాడు శ్రీరాముడు.

 

 

 

 


రామధనుర్విముక్త శరాఘాతానికి మహాబలి వాలి నేలకూలాడు. కొనూపిరితోనున్న వాలి, శ్రీరాముని నానా దుర్భాషలాడి "రామా! సీతాన్వేషణకోసం నువ్వు సుగ్రీవునితో చేతులు కలిపే బదులు, నా సహాయం అర్థించి వుంటే, నేనే రావణసంహారం చేసి, సీతను నీకు సమర్పించేవాడిని'' అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు "వానరేశ్వరా! సీతాన్వేషణ అనే నా స్వార్థప్రయోజనం కోసం నిన్ను శిక్షించలేదు. కడుపున పుట్టిన కుమార్తెతో బాటు, సోదరుని భార్యం కోడలు, శిష్యుని భార్య కూడా కుమార్తెలతో సమానం. ఇది సనాతన ధర్మం. నువ్వు ఈ ధర్మాన్ని విస్మరించి నీ సోదరుడైన సుగ్రీవుని భార్యను అపహరించావు. అందుకే మరణమే శిక్ష. ఆ శిక్షే నీకు విధించాను'' అంటాడు. ధర్మపాలన విషయంలో శ్రీరాముడు అంత నిరంకుశంగాను ఉంటాడు.

శ్రీరాముని దేశభక్తి :

 

 

 

 


శ్రీరాముడు రావణసంహారం కోసం సర్వవానర సైన్యంతో కలిసి లంకానగరం చేరాడు. త్రికూట గిరిపైనున్న సుందర లంకానగరాన్ని రామలక్ష్మణులు వానరులు చూసారు. బంగారు శోభతో అత్యంత వైభవోపేతంగానున్న లంకా నగరాన్ని చూసి లక్ష్మణుడు ఆశ్చర్యంగా "అన్నా! ఈ లంకానగరం ఎంత అందంగా ఉందొ చూడు'' అన్నాడు. అందుకు శ్రీరాముడు చిన్నగా నవ్వి :


    అపి స్వర్ణమయీం లంకామ్ లక్ష్మణ కాననరోచతే
    జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ


లక్ష్మణా! సువర్ణ నిర్మితమైన ఈ లంకానగరం ఎంత అందంగా ఉన్నా, మన అయోధ్యానగర సౌందర్యానికి సరిపోతుందా! జన్మనిచ్చిన తల్లి పుట్టి పెరిగిన వూరు స్వర్గం కన్నా ఎక్కువ సుందరమైనవి'' అంటాడు.
అదీ శ్రీరాముని మాతృదేశాభిమానం.

శ్రీరాముని శరణాగతి - క్షమాగుణం :

 

 

 

 


యుద్ధరంగంలో రామరావణులు తొలిసారి తలపడ్డారు "రావణా! ఇప్పటికైనా మించిపోయినది లేదు. సీతను నాకు అప్పగించి శరణుకోరు క్షమిస్తాను'' అంటదు. ఎంతటి శతృవునైనా క్షమించగల స్థిరచిత్తుడు శ్రీరాముడు. శ్రీరాముని హితవులు వినలేదు రావణుడు. యుద్ధానికి దిగాడు. వీరోచితంగా పోరాడి మరణించాడు. మరణించిన తన అన్న మహాపాపాత్ముడని, అతనికి అగ్నిసంస్కారం చెయ్యడం కూడా నరకహేతువనీ నిష్ఠూరంగా పలుకుతాడు విభీషణుడు. అప్పుడు శ్రీరాముడు "


    మరణాన్తాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనం
    క్రియాతామస్య సంస్కారో మయాప్యేష యథాతవ


విభీషణా! ఎంతటి వైరమైనా మరణంతో నశించిపోవాలి ఇప్పుడు రావణునిపై నాకు కోపంలేదు. ఈతడు నీకెంతో నాకూ అంతే. ఈ మహావీరునికి అగ్నిసంస్కారం చెయ్యి'' అంటాడు. అదే రాముని క్షమాగుణం.

రామం దశరధాత్మజం :

 

 

 

 


రావణ సంహారం చేసిన రాముని ముందు సకల దేవగణాలు ప్రత్యక్షమై "రామా! రావణసంహారం చేసి, సకల లోకాలకు శాంతి చేకూర్చావు. నీవు శ్రీమహావిష్ణువువు. రావణసంహారం కోసం నరునిగా అవతరించావు'' అని వేనోళ్ళ శ్రీరాముని కీర్తిస్తారు. వారి మాటలు శ్రీరాముడు నమ్మాడు. దేవతలందరూ శ్రీరామునికి నమ్మకం కలిగించడం కోసం స్వర్గంలోనున్న దశరథుని రప్పిస్తారు. దశరథుడు రాముని చూసి "రామా! దేవతలు పలికిన మాటలు సత్యాలు. రావణసంహారం కోసం నీవు నరునిగా, నాకుమారునిగా జన్మించడం నా అదృష్టం. నీవు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువువి, సందేహం లేదు'' అన్నాడు. అప్పుడు శ్రీరాముడు భక్తిగా చేతులు జోడించి :


    "ఆత్మానం మానుషం మన్వే రామం దశరధాత్మజం''


"నేను మానవుడను, దశరథుని కుమారుడను. అంతే మరేమియును కాదు'' అని వినయంగా పలికాడే కానీ ... దైవత్వాన్ని ప్రకటించలేదు. అందుకే రామావతారం పూర్నావతారం. ఇన్ని ధర్మాలు తాను ఆచరించి, సర్వలోకాలకూ ఆదర్శమూర్తిగా నిలిచాడు కనుకనే శ్రీరాముడు మానవులందరికీ ఆరాధ్యదైవం అయ్యాడు.

శ్రీరామనవమి :

 

 

 

 


శ్రీరామనవమి నాడు "శ్రీసీతారాముల కళ్యాణం'' చేయడం అనాదినుంచి వస్తున్నా ఆచారం. నిజానికి చైత్రశుద్ధనవమినాడు శ్రీసీతారామ కళ్యాణం జరగలేదు.
వైవస్వత మన్వంతరంలోని పంచమ త్రేతాయుగమునందలి నాల్గవ పాదంలో 30,000 సంవత్సరాలు అయిన విశంచి నామసంవత్సర చైత్రశుద్ధనవమి, బుధవారం నాడు, పునర్వసూ నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో రవి, గురు, శుక్ర, శని, కుజ గ్రహాలు ఉచ్ఛరాశులలో సంచరిస్తున్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు.
సౌమ్యనామ సంవత్సర ఫాల్గుణ పౌర్ణమి తిథినాడు ఉత్తరానక్షత్రంలో శ్రీసీతారాముల కళ్యాణం జరిగింది.
లోక కళ్యాణం కోసమే శ్రీరామజననం జరిగింది. సీతాకల్యాణంతో రామ అవతార లక్ష్యానికి, రావణసంహారానికి నాంది జరిగింది. అందుకే శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధనవమినాడు సీతారాముల కళ్యాణం జరిపించి ఆనందించడం ఆచారమైంది. అంతేకాదు ....
నూతన సంవత్సరం మనకు ఉగాదితో మొదలవుతుంది. చిత్రశుద్ధ పాడ్యమి నుంచే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో "శ్రీరామాయణాన్ని'' పారాయణ చేస్తారు. రామాయణం కేవలం కథ కాదు. లోక కళ్యాణం కోసం నరునిగా అవతరించిన దేవదేవుని దివ్యగాథ ఆ పుణ్య చరిత్రను బీజాక్షరబద్ధం చేసి తొలికృతిగా తీర్చిదిద్దాడు ఆదికవి వాల్మీకి.
శ్రీమద్రామాయణం రసానందాన్ని కలిగింగే మహాకావ్యం మాత్రమే కాదు ... కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు.
-    బాలకాండలోని పుత్రకామేష్టి యాగ ఘట్టాన్ని మండలం [40] రోజులు పారాయణ చేస్తే సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది.
-    సీతారామ కళ్యాణ ఘట్టాన్ని నలభైరోజులు పారాయణ చేస్తే వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామితో వివాహం జరుగుతుంది.
-    ఇక సర్వకార్యార్థసిద్ధి ప్రదమైన సుందరకాండ పారాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే.


చివరగా ఒక మాట :

 

 

 

 



"శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం'' అని కేవలం నోటిమాటగా చెప్పుకోవడం కాదు. ఇందుకు నిదర్శనం రామాయణంలోనే ఉంది.
ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణుడు తన అస్త్రబలంతో ఇంద్రజిత్తు మాయలను ఛిన్నాభిన్నం చేస్తున్నాడేగానీ అతన్ని సంహరించలేక పోతున్నాడు. చివరకు విసుగు చెందిన లక్ష్మణుడు షరాసంధానం చేసి :


    ధర్మోత్మా సత్యసన్దశ్చ రామోదాశరథిర్విది
    పౌరుషే చాప్రతిద్వాన్ద్వః శరైనం జహిరావణిమ్


"దశరధాత్మజుడైన రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, అజేయుడు అయితే ... ఈ శరాఘాతంతో ఇంద్రజిత్తు మరణించుగాక'' అని శరప్రయోగం చేసాడు. ఇంద్రజిత్తు మరణించాడు.
"రామో విగ్రహవాన్ ధర్మః సాధుస్సత్యపరాక్రమః'' అనడానికి ఇంతకన్నా మరో నిదర్శనం అక్కర్లేదు.
ధర్మస్వరూపమైన శ్రీరాముని గురించి ఎంత వ్రాసినా,ఎంత స్మరించినా తనివి తీరదు. రామనామమే ఆపాత మధురం. అది ఒక మహామంత్రం.


    శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామనమవరాననే


పరమశివుడంతటివాడు పరవశిస్తూ పార్వతికి బోధించిన రామతారక మంత్రమిది. అట్టి పరబ్రహ్మస్వరూపుడు ఆచరించిన అన్ని ధర్మాలు ఆచరించడం సామాన్యులమైన మనకు సాధ్యం కాని పని. కనీసం ఒక ధర్మానికైనా కట్టుబడదాం, ఆచరిద్దాం.శ్రీరాముని జన్మదినాన్ని భక్తిగా జరుపుకుందాం, తృప్తిగా శ్రీసీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం.
    శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః
                                                                             

రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం

 

                                                                     --- స్వస్తి ----