హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
Publish Date:May 24, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు. మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మాణ పనులు, పీవీ ఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేపై సీసీ కెమెరాల ఏర్పాటు పనుల నేపథ్యంలో మే 24, 25 తేదీల్లో ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. మాసబ్ ట్యాంక్, ఎస్డీ కంటి ఆసుపత్రి నుంచి రేతిబౌలి వెళ్లే వాహనాలను పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెం.2, 3 వద్ద అజీ జియా మసీదు సమీపంలోని మెరాజ్ కేఫ్ మార్గం ద్వారా మళ్లించనున్నట్లు తెలిపారు. తోలిచౌకి, లంగర్ హౌస్, అత్తాపూర్ ప్రాంతాల నుంచి మాసబ్ ట్యాంక్ వెళ్లే వాహనాలను పిల్లర్ నెం.23 వద్ద యూ-టర్న్ ద్వారా దారి మళ్లించనున్నట్లు చెప్పారు. మాసబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే వాహనాలను ఎస్డీ కంటి ఆసుపత్రి వద్ద లక్ష్మీనగర్ రాంప్, పిల్లర్ నెం.77 వైపుకు మళ్లించనున్నట్లు తెలిపారు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెహదీపట్నం వచ్చే వాహనాలు లక్ష్మీనగర్ రాంప్, పిల్లర్ నెం.88 వద్ద ఎగ్జిట్ తీసుకోవాలని సూచించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించవచ్చని వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/heavy-traffic-restrictions-in-hyderabad-36-220734.html





