ఆర్టీసీ బస్సు బోల్తా..30 మందికి గాయాలు
Publish Date:Feb 23, 2026
Advertisement
ఆదిలాబాద్ జిల్లా షాంపూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడ్డ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం ఆదిలాబాద్ బయల్దేరింది. షాంపూర్ వద్దకు చేరుకోగానే.. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ తో పాటు 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణీకులను బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి వర్షం పడడం, మరోవైపు ఉదయం పూట రహదారిపై పొగ మంచు కమ్ముకోవడంతో డ్రైవర్ ముందు భాగం కనబడక కల్వర్టును ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/bus-accident-in-adilabad-district-36-214516.html





