డ్రోన్ల ద్వారా ఆయుధాల స్మగ్లింగ్!
posted on Nov 22, 2025 1:45PM

ఢిల్లీ ఢిల్లీలో ఎర్రకోట వద్ద బాంబు పేలుడుపై దర్యాప్తు కొనసాగున్న సమయంలోనే మరో కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్ఠాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారీగా ఆయుధాలను తరలిస్తున్న స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాక్ ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్న ఈ ముఠా నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో కొంతమంది భారీగా అక్రమ ఆయుధాలు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని పోలీసు బృందం పలు ప్రాంతాల్లో నిఘా ఉంచగా.. రోహిణిలో ఈ ఆయుధ మాడ్యూల్ గుట్టు బయటపడింది. నిందితులు డ్రోన్లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పంజాబ్ సరిహద్దుల నుంచి తీసుకొచ్చిన ఈ ఆయుధాలను లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా, గోగి వంటి గ్యాంగ్ సభ్యులకు అందజేయడానికి ఉద్దేశించినవిగా తేలింది.
నిందితుల నుంచి విదేశాల్లో తయారైన 10 అత్యాధునిక సెమీ ఆటోమెటిక్ పిస్టల్స్తో పాటు 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లభ్యమైన ఆయుధాలు టర్నీ, చైనాలో తయారైనవిగా తెలిపారు. ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. ఈ నెట్వర్క్పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆయుధాలను ఎవరికి విక్రయించారు, నెట్వర్క్లో ఇంకా ఎంతమంది ఉన్నారనే వివరాలు రాబట్టేందుకు అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు. నిందితులకు చెందిన మొబైల్ ఫోన్ డేటా, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.