ఫస్ట్ టైం కేసీఆర్‌ను ప్రశ్నించిన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. అదేంటి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అవును ఇందులో అద్భుతం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన జగన్..ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మాటల్లో గులాబీ దళపతి పేరు వినపడకుండా చేశారు. రెండేళ్ల కాలంలో కనీసం ఒక్కసారి కూడా కేసీఆర్ విధానాల పట్ల జగన్ నోరు మెదపలేదు. తన పార్టీ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నప్పుడు కూడా జగన్ కిక్కురుమనలేదు. పైగా వీరిద్దరి బంధం గురించి అప్పట్లో మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. సెక్షన్-8పైనా, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ జగన్, కేసీఆర్‌కు అండగా నిలిచారు. అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ పాలనపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. రైతులకు మద్దతు ధర, కరువు మండలాల ప్రకటన, రుణమాఫీ అమలు, రైతు ఆత్మహత్యలు, కల్తీకల్లు ఇలా ఏ విషయంలోనూ కేసీఆర్‌ను నిలదీసిన ఘటనలు లేవు. అలాంటి వైఎస్ జగన్ ఆశ్చర్యకరంగా కేసీఆర్‌ను ఏకీపారేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద పెదవి విప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు..ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిరసిస్తూ..మూడు రోజుల నిరసన దీక్ష చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా మనుషులు అన్నాక ఎక్కడున్నా మనుషులే..తెలంగాణలో ఉన్న వారైనా..ఏపీలో ఉన్న వారైనా ఒక్కటే." ఇక్కడున్న పాలకులు అక్కడున్న మనుషులకు తాగటానికి నీళ్లు లేకుండా చేయటానికి పూనుకోవడాన్ని ప్రశ్నించకపోతే నాయకులుగా తప్పు చేసిన వాళ్లమవుతాం. ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెట్టాలి" అని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు కష్టం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఇద్దరు చంద్రుళ్లకు హెచ్చరిక పంపారు. దాంతో పాటు తెలంగాణలో తన సామాజిక వర్గం గట్టిగా ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ , ఖమ్మం జిల్లాల్లో తన పార్టీ ప్రయోజనాలు కూడా జగన్‌ చేత కేసీఆర్ పట్ల వ్యతిరేకంగా మాట్లాడించాయి. తన విధానాల్ని ఎప్పుడూ తప్పుపట్టని జగన్ తాము చేపట్టే ప్రాజెక్ట్‌ల్ని ప్రశ్నించడంపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో..?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu