టెస్టుల్లోకి కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడా?
posted on Dec 5, 2025 8:52PM

టెస్టు ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కోరే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ‘క్రిక్బజ్’ పేర్కొంది. టెస్టు ఫార్మాట్లో జట్టును బ్యాలెన్స్ చేయడానికి చేపట్టిన యత్నాల్లో భాగంగా విరాట్ సహా ఇటీవల రిటైర్మెంట్ తీసుకొన్న ఆటగాళ్లు తమ నిర్ణయాల్ని పునః పరిశీలించాలని కోరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బీసీసీఐ కోరితే.. తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఓ ఆటగాడు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో భారత్ వైట్ వాష్ కావడంతో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోచ్ గంభీర్ నేతృత్వంలో జట్టులో మార్పులు సజావుగా జరగడంలేదని.. మితిమీరిన ప్రయోగాలు చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత జట్టు పూర్తిగా లయ తప్పినట్లు అర్థమవుతోంది. ఇక దీనికి తోడు టెస్టు స్పెషలిస్టులైన పుజారా విశ్రాంతి ప్రకటించగా.. రహానే కూడా జట్టుకు దూరంగానే ఉంటున్న విషయం తెలిసిందే.