కార్ల అమ్మకాలు భారీగా పెరగనున్నాయా?.. జీఎస్టీ సంస్కరణతో ధరలు దిగిరావడమే కారణమా?
posted on Sep 5, 2025 12:19PM

కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదానా.. అంటూ పాట పాడుకోవాలంటే సెప్టెంబర్ 22 వరకూ ఆగండి.. కార్ల ధరలు రూ. 80 వేల నుంచి రూ. 1. 5 లక్షల వరకూ తగ్గనున్నాయన్నది పతాక శీర్షికలకెక్కిన వార్త. దీంతో 10 లక్షల రేంజ్ కార్లు భారీగా సేల్ అవుతాయని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని కనిపిస్తున్నాయి.. సదరు కార్ల కంపెనీలు.
జీఎస్టీతో పాటు జీవితకాల పన్ను రిజిస్ట్రేషన్ చార్జీల ఉపశమనం కూడా కలుగుతుందని అంటున్నారు. దీంతో టోటల్ ఎక్స్ పెండిచర్ ఆఫ్- కార్ పర్చేస్ లో భారీ తగ్గుదల ఉంటుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా 1200 సీసీ కార్ల జీఎస్టీ 18 శాతానికి పడిపోనుంది. దీంతో కారు కొనడానికి సెప్టెంబర్ 22 తరువాత వచ్చేవి మంచి రోజులు అంటున్నారు.
బేసిగ్గా గత కొంత కాలంగా కార్ల విక్రయాలు ఏమంత గొప్పగా లేవు. గతంలో మారుతీ అయితే అత్యంత సులువుగా కస్టమర్లకు కార్లను అంటగట్టేసేది. పాతిక వేలు కూడా చేతిలో లేని వారు కార్లు కొనేసి విలాసవంతంగా తిరిగేవారు. కానీ ఈ మధ్య కాలంలో మారుతి సైతం ఏమంత ఎక్కువ కార్ సేల్స్ చేయలేక పోతోంది.
దీనంతటికీ కారణం జీఎస్టీ కానే కాదు. సిబిల్ రేటింగ్. ఎప్పుడైతే సిబిల్ రేటింగ్ ఒక గుదిబండగా మారిందో.. కార్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ గణాంకాలను బట్టి చూస్తే తయారయ్యి అమ్ముడు పోక గోడౌన్లలో పడి ఉన్న కార్ల విలువ.. సుమారు 70 వేల కోట్ల రూపాయలుగా ఉంది. దీనంతటికీ కారణం సిబిల్ రేటింగే.
ప్రస్తుతం జీఎస్టీ ద్వారా తగ్గనున్న మొత్తం డిస్కౌంట్ ఇవ్వడానికి ఈ కంపెనీలు ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాయి. 50 వేల నుంచి 80 వేల డిస్కౌంట్లకు కార్లు కొనమంటూ కస్టమర్లను వెంటాడుతూనే ఉంటాయి. కానీ సదరు కస్టమర్లలో చాలా మందికి పర్సనల్ లోన్, హోం లోన్ ఇంకా ఇతరత్రా లోన్ల వల్ల.. వాటిని కట్టడంలో వారి వారి సమస్యల కారణంగా సిబిల్ రేటింగ్ దారుణంగా దెబ్బ తినడం వల్ల.. వారికి కారు కొనుగోలు అందని ద్రాక్షగా మరింది. ఎప్పుడైతే సిబిల్ రేటింగ్ ని తిరిగి సవరిస్తారో అప్పుడు నిజంగా కార్ల అమ్మకాలు భారీగా పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయని అంటారు ఆర్ధిక రంగ నిపుణులు.