విశ్వనగరాన్ని వణికించిన భారీ వర్షం.. బల్కంపేటలో ఒకరు మృతి
posted on Sep 18, 2025 9:14AM

హైదరాబాద్ ను వర్షాలు వదలడం లేదు. విడవకుండా కురుస్తున్న వర్షాలు విశ్వనగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి కురిసే వరకూ భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. ఆల్ మోస్ట్ క్లౌడ్ బరస్ట్ అన్న స్థాయిలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.
ముషీరాబాద్లో 18 సెం.మీ, సికింద్రాబాద్లో 14 సెం.మీ, హిమాయత్నగర్లో 12 సెం.మీ వర్షం పాతం నమోదైంది. భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. వరద నీటి ప్రవాహంతో డ్రైనేజీలు, కాలువలు పొంగిపొర్లాయి. యూసుఫ్గూడ కృష్ణానగర్ బి బ్లాక్లో వరద నీటి ప్రవాహంతో వాహనదారులు, స్థానికులు నానా అవస్థలు పడ్డారు. పలు చోట్ల వరద నీటి ప్రవాహానికి ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడ్పల్లి అంబేద్కర్ నగర్,రామ్గోపాల్ పేట్లోని బస్తీలు, చిల్కలగూడ, మియాపూర్ దీప్తిశ్రీ నగర్లో ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
బల్కంపేట ప్రాంతంలో ఓ వ్యక్తి వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. రెండు రోజుల కిందట కురిసిన వర్షానికి హబీబ్ నగర్ లోని ఆఫ్జాల్ సాగర్ కాలువలో మామ అల్లుళ్ళు కొట్టుకుపోయిన సంఘటన మరవకు ముందే భారీ వర్షంతో వచ్చిన వరద కారణంగా మరో వ్యక్తి మరణించడం విషాదం. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సహక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.