త్వరలో ఏపీలో లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటు : సీఎం చంద్రబాబు
posted on Sep 2, 2025 9:55PM

ఏపీను తూర్పు తీరానికి ప్రధాన మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఓడరేవును జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మార్చేందుకు వీలుగా జల, వాయు, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానిస్తూ ఒక సమగ్రమైన కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ కీలక ప్రణాళికతో ఏపీని దేశంలోనే అగ్రగామి లాజిస్టిక్స్ హబ్ గా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.
వైజాగ్లో జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్’కు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సహజ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. "మన రాష్ట్రానికి కేవలం మన అవసరాల కోసమే కాకుండా, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక వంటి భూపరివేష్టిత రాష్ట్రాల కార్గో రవాణాకు కూడా కీలక కేంద్రంగా మారే అపారమైన అవకాశం ఉంది. వారి సరుకును ఏపీ పోర్టుల ద్వారానే ప్రపంచానికి చేరవేసేలా ఒక పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నాం" అని వివరించారు.
ఈ సదస్సుకు ముందు ముఖ్యమంత్రి, దేశవ్యాప్తంగా వివిధ పోర్టులు, కార్గో కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, టెర్మినళ్ల ఆధునీకరణ, షిప్ బిల్డింగ్ వంటి అంశాలపై వారితో విస్తృతంగా చర్చించారు. భారీ నౌకలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 18 మీటర్ల లోతైన ఓడరేవులు తూర్పు తీరంలో ఏపీలో మాత్రమే ఉన్నాయని, ఇది మనకు సానుకూల అంశం అని పేర్కొన్నారు.
పోర్టు ఆధారిత అభివృద్ధికి శ్రీకారం
కేవలం రవాణాతోనే ఆగిపోకుండా, పోర్టుల చుట్టూ ఒక పారిశ్రామిక, ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. "రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూలపేట వంటి పోర్టుల వద్ద పరిశ్రమల ఏర్పాటు, ఆధునిక టౌన్ షిప్ ల నిర్మాణం కోసం దాదాపు 10 వేల ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నాం. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు త్వరలోనే లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేస్తాం," అని ప్రకటించారు. లాజిస్టిక్స్ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ‘ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.