ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా సీఐఐ సదస్సు
posted on Oct 13, 2025 3:13PM
.webp)
అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్నంలో వచ్చే నెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సన్నాహకాలపై ఆయన సచివాలయంలో సోమవారం (అక్టోబర్ 13) ఆయన సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ సీఐఐ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు. వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్-గ్లోబల్ సీఈవోలను కూడా ఈ సదస్సుకు ఆహ్వాచించాలని ఆయన అదికారులకు నిర్దేశించారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పాలసీ థింకర్లకు ఈ సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్సఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశంచేశారు. ఈ సదస్సు సందర్భంగా విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆయన అలాగే సదస్సుకు వచ్చే ప్రతినిథులకు మంచి ఆతిథ్యమివ్వాలన్నారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం త్వరలోనే ఏఐ, ఇన్నోవేషన్ హబ్గా మారనుంది. సదస్సులో ఈ అంశాలు, రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలన్నారు. ఏర్పాట్లకు సమయం తక్కువ ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
ఇలా ఉండగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో సీఐఐ సదస్సు నిర్వహించడం ఇది నాలుగో సారి. గతంలో 2016, 2017, 2018లో వరుసగా మూడేళ్ల పాటు మూడు విశాఖలో వేదికగానే సీఐఐ సదస్సులు జరిగాయి. ఇప్పుడు జరగనున్న ఈ సీఐఐ సదస్సు టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియోఎకనామిక్ ఆర్డర్ థీమ్తో నిర్వహించనున్నారు. మొత్తం 13 సెషన్లుగా జరిగే ఈ సదస్సులో.. 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13మంది కేంద్ర మంత్రులు హాజరవుతారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు.
ట్రేడ్, జియోఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, టెక్నాజజీ-ఇన్నోవేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్-సప్లయ్ చైన్, సస్టెయినబిలిటీ-క్లీన్ ఎనర్జీ, లెవరేజింగ్ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి. అయితే ఈ సమ్మిట్ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలుదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించడంతో రోడ్షోలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ పాల్గొన్నారు.