ఏంటీ ఆప‌రేషన్ నుమ్ ఖోర్?

భూటాన్ భాష‌లో నుమ్ ఖోర్ అంటే వెహిక‌ల్. అచ్చ తెలుగులో చెప్పాలంటే వాహ‌నం అని అర్ధం. మ‌న దేశంలోకి విదేశీ వాహ‌నాల దిగుమ‌తిపై నిషేధం ఉండ‌టంతో, ఈ వాహ‌నాల‌ను మొద‌ట భూటాన్ కి  త‌ర‌లించి.. ఆపై వాటిని సెకెండ్ హ్యాండ్ పేరిట భార‌త్ లోకి తెస్తుంటార‌న్న‌మాట‌. ఇలాంటి వాహ‌నాలు భార‌త్ లో సుమారు 120 వ‌ర‌కూ ఉన్న‌ట్టు గుర్తించారు. అందునా కేర‌ళ‌లో ఇవి 30కి పైగా ఉన్న‌ట్టు క‌నుగొన్నారు. ఇక బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఒక నిషేధిత ల‌గ్జ‌రీ కార్లో తిరుగుతున్న‌ట్టు గుర్తించారు. మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, పృధ్వీరాజ్ సుకుమార‌న్ వంటి సినీ న‌టుల ఇళ్ల‌లో విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు అధికారులు. వీరితో పాటు మ‌రికొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌లు, ఇత‌ర సంప‌న్నుల ద‌గ్గ‌ర కూడా ఈ ల‌గ్జ‌రీ కార్లున్న‌ట్టు గుర్తించారు అధికారులు. తిరువ‌నంత‌పురం, కొజికోడ్, మ‌ల‌ప్పురం, కుట్టిపురం, త్రిసూర్ వంటి ప్రాంతాల్లో.. సోదాలు నిర్వ‌హించిన అధికారులు.. ఎవ‌రెవ‌రి ద‌గ్గ‌ర ఎన్నేసి ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. వీటిని ఎక్క‌డి నుంచి త‌ర‌లించారు? ఆ వివ‌రాలేంట‌న్న ఆరా తీస్తూ  సోదాలు నిర్వ‌హించారు. దుల్క‌ర్ స‌ల్మాన్ నుంచి 2 కార్లు, అమిత్ చ‌ల‌క్క‌ల్ నుంచి 8 కార్ల‌తో స‌హా మొత్తం 36 కార్లు స్వాధీనం చేస్కున్నారు. ఈ లగ్జ‌రీ కార్ల‌కు విన్ అనే ఒక డిఫ‌రెంట్ కోడ్ ఉంటుంది. దీనిలో ఆ కారు చాసిస్ నెంబ‌ర్ ఉంటుంది. ఈ ప‌ద‌హారు అక్ష‌రాల కోడ్ లో కారు ఎక్క‌డ త‌యారైంది? దాని ఇత‌ర డీటైల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఈ కార్ల‌ను సీజ్ చేశారు క‌స్ట‌మ్స్ అధికారులు. తెలంగాణ విష‌యానికి వ‌స్తే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ కోవ‌లోకి వ‌చ్చే ల్యాండ్ క్రూయిజ‌ర్ కార్లో తిరుగుతున్న‌ట్టు ఆరోపిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. లగ్జ‌రీ కార్ స్కామ్ నిందితుడు బ‌స‌ర‌త్ ఖాన్ అక్ర‌మంగా దిగుమ‌తి చేసుకున్న కారు కేటీఆర్ కుటుంబ కంపెనీ పేరిట ఎందుకు రిజిస్ట‌ర‌య్యిందో చెప్పాల‌న్నారు బండి సంజ‌య్. దీని కొనుగోలులో మార్కెట్ ధ‌ర చెల్లించారా?  లేదంటే త‌క్కువ ధ‌ర‌కే కొన్నారా? బినామీల పేరిట కొన్నారా? వంటి అంశాల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు బండి సంజ‌య్. ఎక్స్ వేదిక‌గా ఈ అంశానికి సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు బండి సంజ‌య్. బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎనిమిది కార్లను స్మగ్లింగ్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాల స్మగ్లర్‌ బసరత్‌ ఖాన్‌ అంగీకరించారు. ఆ వాహనాల నంబర్లనూ అధికారులకు బసరత్‌ ఖాన్‌ అందజేశారు. ఆ నంబర్లలో టీజీ00డి 6666 నంబరు గల ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాన్ని తన కాన్వాయిలో కేటీఆర్‌ ఉపయోగిస్తున్నట్లుగా అధికారుల ఎదుట బసరత్‌ఖాన్‌ చెప్పారు. ఇలా దేశ వ్యాప్తంగా ల‌గ్జ‌రీ కార్ల స్కామ్ కి సంబంధించి ఒకేసారి బ‌య‌ట ప‌డ్డంతో.. ఇపుడీ వ్య‌వ‌హారం హాట్ టాపిగ్గా మారింది.

ఉచిత బస్సుల్లో సచివాలయానికి వచ్చిన అంగన్వాడీలు.. ఎందుకో తెలుసా?

అంగన్వాడీ టీచర్లు తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన చేపట్టేందుకు వారు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని  వాడుకుని వచ్చారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సులలో సచివాలయానికి వచ్చిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. డిమాండ్లను నెరవేర్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకు దిగిన అంగన్వాడీ టీచర్చను అదుపులోనికి తీసుకుని వారు వచ్చిన ఫ్రీ బస్సుల్లోనే పోలీసు స్టేషన్లకు తరలించారు.  

తిరుమలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, చంద్రబాబు

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలిసి తిరుమలలో పలు కీలక అభివృద్ధి పనులను గురువారం (సెప్టెంబర్ 25) ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన 'వేంకటాద్రి నిలయం' యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి, సీఎం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు, శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విజన్ బేస్డ్ స్టోరింగ్ మెషిన్‌కు ప్రారంభించారు.  అంతకుముందు వెంకటాద్రి నియలం  ప్రాంగణానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి, ముఖ్య మంత్రికి టీటీడీ అధికారులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసిన అనంతరం వారు భవనాన్ని కలియతిరిగి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం, తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను (ఐసీసీసీ) కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ ఆయన వెంట ఉన్నారు.  రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

నక్సల్ విముక్త భారత్ దిశగా వేగంగా అడుగులు?

మావోయిస్టుల‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. నిన్న ఇద్ద‌రు కేంద్ర క‌మిటీ స‌భ్యుల హ‌తం కాగా.. నేడు ఏకంగా 71 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  తాజాగా దంతెవాడ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టుల‌లో ఇర‌వై మందికి పైగా 64 ల‌క్ష‌ల రూపాయ‌ల రివార్డు ఉంది. లోంగిపోయిన వారిలో 21 మంది మ‌హిళ‌లు కాగా.. ఒక బాలుడు, ఇరువురు బాలికలు సైతం ఉన్నారు. మావోయిస్టులకు వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు చూస్తుంటే.. మావోయిస్టు ఉద్య‌మం ఉనికి ప్ర‌శ్నార్ధంలా క‌నిపిస్తోంది. ఒక స‌మ‌యంలో మావోయిస్టు నేత‌ జ‌గ‌న్ అన్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే..  ఇక‌పై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న వారి ప్రాబ‌ల్యం బాగా త‌గ్గి.. కేవ‌లం గిరిజ‌నులు మాత్ర‌మే మావోయిస్టుల్లో ఉంటార‌ని అన్నారాయ‌న‌. దీనంత‌టికీ కార‌ణ‌మేంటంటే.. తుపాకీ గొట్టం ద్వారా సాధార‌ణ యువ‌త ప్ర‌భుత్వాల‌తో తేల్చుకునే ప‌రిస్థితి బొత్తిగా క‌నుమ‌రుగవ్వడమే అంటున్నారు. వీరంతా స్టార్ట‌ప్ ల ద్వారా ఉద్యోగిత‌ను పెంచ‌డంలో బాగా బిజీగా ఉన్నారు. దీంతో నాగ‌రిక యువ‌త అడ‌వుల బాట ఇక‌పై క‌నిపించ‌క పోవ‌చ్చు. కొంద‌రు అమెరికా హెచ్ 1 బీ వీసా ఎంత క‌ష్ట‌త‌ర‌మైనా స‌రే సాధించ‌డానికి ముందుకొస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. బెంగ‌ళూరుకు చెందిన త‌నూశ్ శ‌ర‌ణార్ధి అనే యువ‌కుడు మూడు సార్లు ట్రై చేసి ఎట్ట‌కేల‌కు అనుకున్న వీసా పొందాడు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి.. ఏఐపై ప‌ట్టు సాధించాన‌ని.. దీంతో త‌న‌కు 0- 1 వీసా అప్రూవ్ అయింద‌ని అంటున్నాడు శ‌ర‌ణార్ది. దీన్నే ఐన్ స్టీన్ వీసా అంటారు. ఇది ఎంతో టాలెంట్ ఉన్న వారికి త‌ప్ప సాధ్యంకాదు. ఇక పోతే.. ఈ ప్రపంచ గ‌తిని మార్చిన మూడు సీలు ఏంటంటే క్రీస్ట్, క‌మ్యూనిజం, కంప్యూట‌ర్. ప్ర‌స్తుతం క‌మ్యూనిజాన్నిక్రాస్ చేసి కంప్యూట‌ర్ జ‌మానాలో ఉన్నాం. వ‌చ్చే రోజుల్లో అది క్వాంటం కంప్యూటింగ్ లోకి వెళ్ల‌నుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ సిట్యువేష‌న్స్ లో.. యువ‌త అడ‌వుల్లోకి వెళ్లి త‌మ భ‌విష్య‌త్తును వెతుక్కోవాల‌ని భావించ‌డం లేదు. స‌రిక‌దా విండోస్ లోంచి క్లౌడ్ లోకి వెళ్లి స‌మ‌స్తం అక్క‌డి నుంచే పుట్టించేయ‌త్నం చేస్తున్నారు. దీంతో వారికి ఫ‌లానా అని ప్ర‌భుత్వాల‌తో గొడ‌వే లేదు. అస‌లు మావోయిజం బేసిక్ థియ‌రీ.. ప్ర‌భుత్వాల నుంచి అధికారం లాక్కుని.. దాని ఫ‌లాలు అంద‌ని వారికి అందించ‌డం. ఇటు ప్ర‌భుత్వం కూడా ఆ ఫ‌లాల‌ను అడ‌వుల్లోకి కూడా అందేలా చేస్తూ.. అక్క‌డా బ‌డి, రోడ్డు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తూ.. వారి వారి జీవితాల్లోనూ మార్పు వ‌చ్చేలా చేస్తోంది. కాబ‌ట్టి.. ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీల్లోనూ ప్ర‌స్తుతం విప్ల‌వంలోకి దిగాల‌న్న ఆలోచ‌న ఏమంత‌గా రావ‌డం లేదు. వారు సైతం జ‌న జీవ‌నంలోకి సులువుగా క‌ల‌గ‌ల‌సి పోతున్నారు. ఇక మిగిలింది అడ‌వుల్లోని మావోయిస్టు అవ‌శేషం మాత్ర‌మే. ఇదిగో ఇప్పుడు ఈ యువ‌త కూడా జ‌న‌జీవ‌నంలోకి అడుగు పెడుతుండ‌టంతో.. ఇక మిగిలింది చాలా  త‌క్కువ మొత్తంలోని వృద్ధ, కొస‌రు మాత్ర‌మే. వార్ని కూడా 2026 మార్చినాటికి ఏరి పారేయ‌నుంది.. కేంద్రం. దీంతో జీరో మావోయిజం ఇన్ భార‌త్ అన్న కేంద్ర ల‌క్ష్యం సాకారం కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే మావోయిస్టుల్లోనే చీలిక వచ్చింది. ఆయుధం వ‌దిలేద్దామ‌ని కొంద‌రు.. లేదు కొన‌సాగిస్తామ‌ని మరి కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాద‌న‌లు కూడా ఎక్కువ కాలం నిలిచేలా లేవు. దీంతో.. వ‌చ్చే రోజుల్లో రెండో సీల్లోని క‌మ్యూనిజం దాదాపు త‌న ఉనికి కోల్పోయేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జ‌న బాహుళ్యంలోని క‌మ్యూనిస్టు పార్టీలు జాతీయ హోదా కోల్పోయి రాష్ట్ర హోదాలోకి.. వ‌చ్చేసిన  రోజుల్లో అందులోంచి కూడా బ‌య‌ట‌కు రానున్న క్ర‌మంలో.. ఇక సెకండ్ సీ యొక్క ప్ర‌భావం పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యేలా తెలుస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు సామాజిక వేత్త‌లు. ఫైన‌ల్ గా మిగిలిన అర్బ‌న్ న‌క్సల్స్ పై కూడా ప్ర‌భుత్వం ఉక్కు పాదం మోప‌డంతో ఇక‌పై ఇటు న‌గ‌రంలో అటు అడ‌వుల్లో అన్న‌ల ప్ర‌స్తావ‌నే లేకుండా పోయేలా తెలుస్తోంది.

సృష్టి పై ఈడీ కేసు నమోదు

తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ పై ఈడి కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కు పాల్పడిన సృష్టి..  ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేద కుటుంబాలను టార్గెట్  చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి వారి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో పిల్లలు లేని వేరే దంపతులకు విక్రయిస్తూ కోట్లలో డబ్బులు సంపాదించారు. ఇలా దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లను పెట్టి సరోగసి పేరు తో వ్యాపారం కొనసాగించారు. డాక్టర్ డాక్టర్ నమ్రత  మరి కొంతమందితో కలిసి ఈ నయా దందాకు తెరలేపారు. గాంధీ హాస్పిటల్ లో అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడా వీరితో కలిసి పని చేశాడు. అయితే డాక్టర్ డాక్టర్ నమ్రత కేవలం నిరుపేద గ్రామీణ దంపతులను ట్రాక్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి ఐదు లక్షల రూపాయలు వారికి ఇచ్చి వారి పిల్లల్ని కొనుగోలు చేసి.... సరోగసి పేరుతో పిల్లలు లేని దంపతులకు 50 లక్షల రూపాయలకు  విక్రయించేవారు. ఎవరైనా దంప తులు ఎదురు తిరిగితే... లాయర్ అయిన తన కొడు కుతో డాక్టర్ డాక్టర్ నమ్రత వారిని బెదిరింపులకు గురి చేసేవారు. అయితే ఇతర రాష్ట్రానికి చెందిన ఓ దంపతులు సరోగసి తో పిల్లలు కావాలంటూ డాక్టర్ డాక్టర్ నమ్రతను ఆశ్రయిం చారు. దీంతో డాక్టర్ నమ్రత ఆ దంప తుల వద్ద నుండి 50 లక్షల రూపా యలు వసూలు చేసి... వేరే దంపతులకు పుట్టిన శిశువును తీసుకు వచ్చి... సరోగసితో పుట్టిన శిశువు అంటూ సదరు దంపతులకు ఇచ్చారు. దంపతులకు అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించారు. దీంతో సరోగసి పేరుతో డాక్టర్ డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు నిర్ధారించుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిం చగా ఈ సరోగసి దందా అక్రమాలు మొత్తం బయట పడ్డాయి. పోలీ సులు వెంటనే డాక్టర్ డాక్టర్ నమ్రతతో పాటు ఈ దందాలో పాల్గొన్న డాక్టర్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే గత నాలుగు ఏళ్లలో దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లను పెట్టి సరోగసి పేరుతో దాదాపు 500 కోట్ల రూపా యల వరకు లావా దేవీలు జరిపినట్లు గా గుర్తించిన ఈడీ రంగంలోకి దిగింది.  సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఈడి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు మొత్తం తొమ్మిది ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి క్లినిక్ లతోపాటు నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.   డాక్టర్ అతలూరి నమ్రత ఆధ్వర్యంలో నడిచిన యూనివ ర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌, పిల్లలు లేని దంపతులను మోసం చేయడం, నకిలీ ఐవీఎఫ్ లు, సరోగసి ప్యాకేజీలు చూపించడం, శిశువుల అక్రమ రవాణా, ఫోర్జరీ  రికార్డులు తయారు చేయడం వంటి అక్రమాలను గుర్తించింది. అలాగే 2021లో లైసెన్స్ రద్దయిన తరువాత కూడా అక్రమంగా ఈ దందా  కొనసా గించినట్లు ఈడి దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం డాక్టర్ నమ్రత (64)తో పాటు వైద్యులు, ఏజెంట్లు, టెక్నీషియన్లు సహా కనీసం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కేసులో క్రిమినల్ అంశాలను  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారస్తుండగా,   మనీ లాండరింగ్ కోణంలో ఆర్థిక లావాదేవీలను ఈడీ విచారిస్తోంది.  

కాళేశ్వరంపై సీబీఐ విచారణ షురూ

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలుపెట్టింది. ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రాజెక్ట్ జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారించనుంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యాక ఎఫ్ఎఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకల విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.  ఈ విషయాన్ని  సీఎం అసెంబ్లీలోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీబీఐ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ముందుకు వచ్చింది. కాళేశ్వరంపై గురువారం (సెప్టెంబర్ 25) నుంచి సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది.  కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణలో భాగంగా   జస్టిస్  ఘోష్‌ నివేదికలను సీబీఐ పధికారులు పరిశీలించడంప్రారంభించారు. రికార్డుల పరిశీలన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

తెలుగు రాష్ట్రాలలో వానలే వానలు.. భయపెడుతున్న వాయుగుండం!

తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు బెంబేలెత్తించనున్నాయి.  తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి శుక్రవారం (సెప్టెంబర్ 27) నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  ఈ వాయుగుండం ప్రభావం ఈ నెల 30 వరకూ ఉంటుందని పేర్కొన్న వాతావరణ శాఖ అప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శుక్ర, శని (సెప్టెంబర్ 26, 27) వారాల్లో  తెలంగాణ, కోస్తాంధ్రల్లో  భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఉండగా గురువారం (సెప్టెంబర్ 25) కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాయలసీమలో ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  అలాగే  తెలంగాణ వ్యాప్తంగా గురువారం (సెప్టెంబర్ 25) సాయంత్రం నుంచీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.  నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  శుక్ర, శని వారాల్లో (సెప్టెంబర్ 26, 27) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలా ఉండగా గురువారం దేశ వ్యాప్తంగా దాదాపు పది జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, "ఆంధ్రప్రదేశ్", జార్ఖండ్, కేరళ, గోవా , మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ.. ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

చంద్రబాబు చేతుల మీదుగా డీఎస్సీ అభ్యర్థులకు నియామకపత్రాలు

మెగా డీఎస్సీలో  ఎంపికైన అభ్యర్థులకు గురువారం (సెప్టెంబర్ 25) ప్రభుత్వం నియామక పత్రాలను అందజేయనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలను అందుకోనున్నారు. ఇందు కోసం అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వాస్తవానికి డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు అందజేయాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది.   సరే.. ఇప్పుడు గురువారం (సెప్టెంబర్ 25) సీఎం డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు పాల్గొంటారు.  డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న 15,941 మందికి నియామక పత్రాలు అందజేస్తారు.  సభలో జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 22 మందికి నియామకపత్రాలను స్వయంగా అందజేస్తారు. మిగిలిన వారికి అధికారులు అందజేస్తారు.  

పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలు!?

బంగారం ధరల పెరుగుదలకు అడ్డూ ఆపూ లేకుండా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో రానున్న రోజులలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరు అవకాశం ఉందని స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు ప్రస్తుతమున్న ధర కంటే 77 శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి.  

తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత

తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్వాల సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం  రంగనాయకుల మండపం నుండి భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు.. సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశాన్ని ఆ వేంకటేశ్వర స్వామి తనను పలుమార్లు కల్పించారన్నారు.  అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం కూడా ఆ స్వామి వారి సంకల్పమేనని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.   దాదాపు నాలుగు దశాబ్దాల కిందట  ఎన్‌.టి.రామారావు ప్రారంభించిన అన్నప్రసాద వితరణ సత్కార్యం నేడు అనేక రెట్లు విస్తరించి..  ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ సేవను అన్ని టిటిడి ఆలయాలకు విస్తరించాలని టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులను ఆయన కోరారు. శ్రీవాణి ట్రస్ట్ కు  ఇప్పటివరకు రూ.2,038 కోట్ల విరాళాలు అందాయన్న ఆయన..  అందులో రూ.837 కోట్లు ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారన్నారు. దేశలోని 29 రాష్ట్రాల రాజధానులలోనూ   శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, వివిధ దేశాల్లో శ్రీవారి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించాలని చంద్రబాబు టీటీడీకి సూచించారు.   తనకు ప్రాణభిక్ష పెట్టిన రోజునే ఎస్‌వి ప్రాణదాన ట్రస్టును తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభించామని గుర్తు చేసిన ఆయన ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.709 కోట్లు  విరాళంగా వచ్చాయన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు  వైద్య సహాయంఅందజేస్తున్నట్లు తెలిపారు.  స్వామివారి సేవకుల సేవలను చంద్రబాబు ప్రస్తుతించారు. స్వామివారి సేవకులు  స్వామివారి నిజమైన సంపద అన్నారు. 

కూష్మాండ అవతారంలో భ్రమరాంబికాదేవి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో  శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నాలుగో రోజు అంటే గురువారం (సెప్టెంబర్ 25) అమ్మవారు కూష్మాండ దుర్గ రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ కూష్మాండ మాత విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తగా, తేజోమయిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.   ఇక మూడో రోజు బుధవారం (సెప్టెంబర్ 24) అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.  అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు,వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీభ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవార్లను రావణవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు, కేరళ చండిమేళం, కొమ్మ కోయ నృత్యం, స్వాగత నృత్యం,రాజ బటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాలు,చెంచు గిరిజనుల నృత్యాలు, జానపద పగటి వేషాల ప్రదర్శన వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవంగా కదలివస్తున్న శ్రీస్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు.  

తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్.. ప్రారంభించిన చంద్రబాబు

దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 లో ఏర్పాటు అయ్యింది.  ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ( సెప్టెంబర్ 25) ప్రారంభించారు. ఎన్ఆర్ఐల వితరణతో ఏర్పాటు అయిన ఈ కేంద్రం  శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా  చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది.  వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటు లో ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ద్వారా  భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు అవకాశం ఉంటుంది.   ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో   పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని పాతిక మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ.. అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు ఉన్నారు? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తు లను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల హావభావాల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.  క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడీ మ్యాపులు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలిస్తుంది. ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ.. సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.  

వార్డు సచివాలయాల్లో సమస్యలకు చెక్.. ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో  వార్డు సచివాలయాలలో పాలనాపరమైన సమస్యలకు తెరపడినట్లే. ఇప్పటి వరకూ గ్రామ, వార్డు సచివాలయాలలో విద్యాంశాలను డిజిటల్ సెక్రటరీయే చూస్తున్నారు. దీని వల్ల ఇంత కాలం డిజిటల్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతూ వచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీల విధుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. దీంతో  ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో మాదిరిగానే వార్డులలోనే విద్యను సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షణలోకి వెడుతుంది. దీంతో పాలనాపరంగా సమస్యలకు తెరపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.  

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు.  గురువారం (సెప్టెంబర్ 25) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతోంది. అదే టైమ్ స్లాట్ భక్తులకు స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.   మూడు వందల రూపాయల ప్రత్యేక  ప్రవేశ దర్శనం  టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంటగంటన్నర సమయంలో కలుగుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 24) శ్రీవారిని  58,628 మంది దర్శించుకున్నారు. వారిలో 21,551 మంది  తలనీలాలను సమర్పించుకున్నారు.  తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల లక్షరూపాయలు వచ్చింది. 

నాగోల్‌లో ప్రియుడి ఇంట్లో మహిళ ఆత్మహత్య

  మానవత్వం తో ఆలోచించి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. అదే అతడు చేసిన పెద్ద తప్పు...ఆ తప్పే  అతని నిందితుడిగా నిలబెట్టింది...నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.మహబూబాబాద్ జిల్లా రెడ్యాల చెందిన ఓ స్వరూప (38) అనే మహిళ కు భర్త, కుమారుడు (3) ఉన్నాడు. జీవ నోపాధి నిమిత్తం ఈ కుటుంబం హైదరాబాద్ నగరానికి వచ్చి నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు . ఆ మహిళ కుటుంబం నివసించే సమీపంలోనే బానోతు అనిల్ నాయక్(24) అనే యువకుడు నివసిస్తున్నాడు.  ఈనెల 19వ తేదీన కుమారుడిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నారని చెప్పి ఇంట్లో నుండి బయటకు వచ్చిన స్వరూప.... అనిల్ వద్దకు వెళ్ళింది.   ఈనెల 21వ తేదీ వరకు వారిద్దరూ కలిసి ఉన్నారు. 21వ తేదీన అనిల్ కూరగాయలు కొనుగోలు చేయడానికి బయటికి వెళ్లాడు. ఇంతలోనే స్వరూప బాత్రూం వెళ్ళింది. బాత్రూం హ్యాంగర్ కు ఉరివేసుకుంది.. కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అనిల్ కు స్వరూప కనిపించ లేదు. దీంతో అతడు బాత్రూం డోర్ ను గట్టిగా కొట్టాడు. అతి కష్టం మీద బాత్రూం డోర్ ను పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. ఇప్పటికే ఆ మహిళ తుది శ్వాస విడి చింది. ఆమె మర ణించడంతో అతడు భయపడ్డాడు. దీంతో అతని కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని... కత్తితో చేతిని కోసుకున్నాడు.  ఇంతలోనే స్వరూప కుమారుడు అక్కడికి వచ్చి.. తన తల్లిని పిలుస్తూ గట్టి గట్టిగా ఏడవ సాగాడు. స్వరూప కుమారుడిని చూసి అనిల్ మనసు మార్చుకొని వెంటనే  తన చేతికి రుమాలు కట్టుకొని..  నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం పోలీసులు  అనిల్ నాయక్ తో ఆ మహిళకు ఎటు వంటి సంబంధం ఉంది? ఆసుపత్రికి వెళ్తానని చెప్పి నేరుగా అనిల్ ఇంటికి రావడం ఏమిటి? అనిల్ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి?అనే విషయాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా సెన్సేషన్ ఆపరేషన్ చేస్తున్న తెలంగాణ సీఐడీ

  తెలంగాణ సీఐడి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.. బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసు కున్న తెలంగాణ సిఐడి విచారణ చేస్తున్నారు.. మూడు రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసి ఎనిమిది మంది కీలక సూత్రధారు లను అరెస్టు చేశారు . ఆరు యాప్ ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తెలంగాణ సిఐడి విచారణ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడి లక్షల్లో డబ్బులు కోల్పోయి... చివరకు  ఆత్మ హత్య లకు  పాల్పడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కొరడా ఝళిపించా లని నిర్ణయించు కున్నారు.అందుకే దేశంలో తొలిసారి ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ సీఐడీ బృందాలు రాజ స్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రా ల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిం చారు. 6 ప్రత్యేక బృందాలను పంపి 8 మంది నిందిత ఆపరేటర్ల ను అరెస్ట్ చేశారు.ఈ 6 బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ, ప్రజలకు భారీగా నష్టాలు కలిగించి నట్లుగా సిఐడి పోలీసులు గుర్తించారు.సిఐడి చేసిన ఈ దాడుల్లో అనేక హార్డ్వేర్ పరికరాలు, వాటిలోని విస్తృతమైన డేటాను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉండే అవకాశమున్నందున, వారి గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది.

విజయవాడ ప్రజల ఆతిథ్యం హృదయాన్ని తాకింది : ఉపరాష్ట్రపతి

  విజయవాడ ఉత్సవ్ మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కొనసాగాలని ఉపరాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్  ఆకాంక్షించారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ – 2025 లో ఉపరాష్ట్రపతి  పాల్గొనన్నారు. తెలుగు భాష అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ, “అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయిని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.  సాహిత్యభరితంగా, సంగీతభరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తోంది” అని అన్నారు.  నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను గుర్తుచేశారు. “దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకం. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజించే సంప్రదాయం భారతీయుల అదృష్టం. ఇది సాంప్రదాయానికి, సంస్కృతికి అద్దం పడుతోంది” అని పేర్కొన్నారు. మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయమని, అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కొలవడం ద్వారా శక్తి, భక్తి రెండూ లభిస్తాయి అని ఉపరాష్ట్రపతి చెప్పారు.విజయవాడ ప్రత్యేకతపై మాట్లాడుతూ ఆయన, “విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్. రాబోయే రోజుల్లో విజయవాడ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోంది” అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై మాట్లాడుతూ, “విద్య, వైద్యం రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోంది. వికసిత భారత్ అనేది ఒక కల కాదు, అది నిజం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోంది. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విద్య రంగాల్లో కూడా రాష్ట్రం విశేష పురోగతిని సాధిస్తోంది” అని అన్నారు. ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటన విజయవాడకే రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, “విజయవాడలో అద్భుతమైన గౌరవం లభించింది. ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి దేశానికి గర్వకారణం. కనకదుర్గ అమ్మ పేరులోనే అనుగ్రహం, ప్రేమ, అమృతం నిక్షిప్తమై ఉంది” అని భావోద్వేగంగా తెలిపారు. మంత్రులు, అధికారులు అందరూ కలసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాక, ఉత్సవ వేదికపై గాయని గీతా మాధురి పాడిన పాటలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగం, విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్న వేలాది మంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపగా, నగర అభివృద్ధి పై ఆయన విశ్వాసపూర్వక మాటలు హాజరైన వారందరిలో ఆనందాన్ని కలిగించాయి.  

శ్రీవారికి భారీ బంగారు కానుక

  తిరుమల శ్రీవారికి వైజాగ్‌కు చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ ప్రైజెస్‌  ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు భారీ బంగారు కానుక అందించారు. రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. దాతలను అభినందించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం పాల్గోన్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.  టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ అశోక్‌ సింఘాల్‌ పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు. ధ్వజస్తంభంపై ఎగిరే ఈ గరుడ పతాకమే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా సకల దేవతలను, అష్టదిక్పాలకులను, ఇతర గణాలను ఆహ్వానించే శుభ సూచికమని అర్చకులు వివరించారు. ధ్వజారోహణం అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.