తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 లో ఏర్పాటు కానుంది. ఎన్ఆర్ఐల వితరణతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రానికి ముఖ్యమత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (సెప్టెంబర్ 25) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, వీజీవో రాంకుమార్, టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ పరిశీలించారు.
శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఏఐ ను వినియోగించాలన్న చైర్మన్ నిర్ణయం ప్రకారం ఎన్ఆర్ఐ ల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటు లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు చర్యలు చేపట్టనుంది.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే ఎలా ఉపయోగపడుతుందనే ఆంశాలను ఒకసారి పరిశిలిస్తే ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ.. అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తు లను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంచనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల హావభావాల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.
క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడీ మ్యాపులు, చిత్రా లతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలిస్తుంది. ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ.. సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపుతుంది.