తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్.. ప్రారంభించిన చంద్రబాబు
posted on Sep 25, 2025 @ 9:44AM
దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 లో ఏర్పాటు అయ్యింది. ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ( సెప్టెంబర్ 25) ప్రారంభించారు. ఎన్ఆర్ఐల వితరణతో ఏర్పాటు అయిన ఈ కేంద్రం శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటు లో ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు అవకాశం ఉంటుంది.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని పాతిక మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ.. అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు ఉన్నారు? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తు లను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల హావభావాల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.
క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడీ మ్యాపులు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలిస్తుంది. ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ.. సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.