శ్రీవారికి విలువైన కానుక సమర్పించిన తెలంగాణ బీజేపీ ఎంపీ

  తిరుమల శ్రీవారికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం నాడు భారీ విరాళం సమర్పించారు. సుమారు రూ.60 లక్షల విలువైన అత్యంత అపురూపమైన స్వర్ణాభరణాన్ని ఆయన స్వామివారికి కానుకగా అందించారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి 535 గ్రాముల బరువున్న అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి అనే స్వర్ణ కంఠాభరణాన్ని శ్రీవారికి సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తాము ఈ విరాళాన్ని స్వీకరించినట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ ఏడాది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు రోజు, అంటే సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆలయ యాగశాలలో అంకురార్పణ ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడుతుంది. అంకురార్పణలో నవధాన్యాలను మొలకెత్తించి భూమి పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ విష్వక్సేనులవారి ఊరేగింపు ఉంటుంది. ఇది బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించే ఆధ్యాత్మిక సూచనగా భావిస్తారు.నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా మేదినిపూజ నిర్వహించి భూదేవిని ప్రసన్నం చేసుకుంటారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తూ ప్రత్యేక వేదకార్యక్రమాలు చేస్తారు.

విజయవాడ ఉత్సవ్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

శరన్నవరాత్రులను పురస్కరించుకుని బెజవాడలో దసరా ఉత్సవ్ నిర్వమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. మైసూరు ఉత్సవాలను తలదన్నేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలలని తలపెట్టింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఘనంగా చేసింది. అయితే ఈ ఉత్సవాల నిర్వహణకు ఎంపిక చేసిన స్థలాలలో ఒకటి దుర్గగుడికి చెందినదని పేర్కొంటూ ఆలయ భూమిలో వ్యాపార  కార్యక్రమాల నిర్వహణ ఏమిటంటూ వైసీపీ సీనియర్వి నేత పేర్నినాని విమర్శలు గుప్పించారు. ఆయన విమర్శలను ఆధారం చేసుకుని కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హై కోర్టు  సింగిల్ బెంచ్ ఆలయభూమిలో వ్యాపార కార్యక్రమాలను వీల్లేదంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఆ స్టేను సవాల్ చేస్తూ కొన్ని హిందూ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్ సుప్రీం కోర్టు సోమవారం (సెప్టెంబర్ 22) విచారించి విజయవాడ ఉత్సవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఉత్సవాల నిర్వహణను నిలిపివేయాలంటూ కొన్ని సంఘాల దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో విజయవాడ ఉత్సవ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. 

ఆర్జీవీ ‘మెగా’ భజన.. మేటర్ ఏంటి?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవిలపై పొగడ్తల వర్షం కురిపించేవారు. రాజును సైతం మించిన రాజభక్తిని ప్రదర్శించినట్లుగా ఆ మెగా బ్రదర్స్ సైతం టూమచ్ అనుకునే లెవెల్లో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు ఉండేవి. అయితే ఎప్పుడైతే ఆయన వైసీపీ ఫోల్డ్ లోకి వెళ్లారో.. అప్పటి నుంచీ ఆయన అదే మెగా బ్రదర్స్ పై అనుచిత రీతిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా ఆయన ట్వీట్ లు, సోషల్ మీడియా పోస్టులు ఉండేవి. జగన్ కోసం ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాలో పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా పాత్రను సృష్టించారు.  అయితే ఆ విమర్శలట్వీట్లు అటు వైసీపీ ఏ మాత్రం ఉపయోగం లేకపోగా.. స్వయంగా ఆర్జీవీ కూడా భ్రష్టుపట్టిపోయారు. ఆయన క్రెడిబులిటీ పూర్తిగా పోయింది.  సరే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని దయనీయ స్థితికి దిగజారిపోయింది. ఇక వైసీపీ అధికారంలో ఉండగా హద్దుల్లేకుండా అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఆర్జీవీని కేసులు చుట్టుముట్టాయి. దీంతో ఆయనకు తత్వం బోధపడి రాజకీయాల జోలికి పోను అంటూ చెంపలేసుకున్నారు. చెంపలైతే వేసుకున్నారు కానీ, అటు సినీ పరిశ్రమలో, ఇటు ప్రజలలో కోల్పోయిన క్రెడిబులిటీని మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయారు.  ఇప్పుడు ఇక ఆ క్రెడిబులిటీ కోసం గతంలో విమర్శలు గుప్పించిన వారినే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడానికి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా వర్మ మెగా బ్రదర్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.   అదే సమయంలో నెటిజన్లు ఆర్జీవీని ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి తావిచ్చింది.  ఇంతకీ  ఆర్జీవీ చేసిన ట్వీట్  ఏమిటంటే..   మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా వస్తే.. అది ఈ శతాబ్దానికే మెగా పవర్ ఫిల్మ్ అవుతుంది అన్నది.   కొన్నేళ్ల కిందట పవన్ కు వ్యతిరేకంగా అనుచిత ట్వీట్లు చేసిన ఆర్జీవీ ఇప్పుడు పవర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారంటే కామెంట్లు చేస్తున్నారు. ఎన్ని రంగులు మార్చినా.. ఆర్జీవీని నమ్మేవారెవరూ ఉండరంటూ పోస్టులు పెడుతున్నారు.

మేడారంలో తులభారం సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

    సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.  అనంతరం ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతోపాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించనున్నారు ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని సీఎం అన్నారు. మేడారం పర్యటనలో భాగంగా ఆయన సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోరాటం, పౌరుషానికి ప్రతీకలైన సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే అమ్మవార్లను దర్శించుకుంటున్నానని, 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే తన పాదయాత్ర ప్రారంభమైందని తెలిపారు. ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, సంప్రదాయంలో ఏ మార్పు రాకుండా ప్రజల అభిప్రాయాలతో ముందుకు వెళ్తామన్నారు. భక్తి డబ్బులతో కొలవలేనిదని, నమ్మకమే నిజమైన కొలమానం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా సూచించారు. ప్రకృతి ఒడిలో నిలిచిన ఈ ఆలయం ప్రత్యేకమని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జన్మ చరితార్థమని, ఇది ఒక వరమని అన్నారు. ఆదాయం కోసం కాదు, భక్తితో సేవ చేయాలని అధికారులకు సూచించారు. జంపన్న వాగులో నీటి నిల్వ కోసం చెక్‌డ్యాంలు నిర్మించాలని ఆదేశించారు. ప్రత్యేక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

కోల్ కతాలో వర్ష విలయం.. ఐదుగురు మృతి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో భారీ వర్షం జల విలయాన్ని సృష్టించింది. దసరా శరన్నవరాత్రులలో భాగంగా  నగరమంతా దసరావేడుకలకు ముస్తాబైన వేళ భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. సోమవారం (సెప్టెంబర్ 22) అర్థరాత్రి దాటిన తరువాత మొదలై మంగళవారం (సెప్టెంబర్ 23)ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కోల్ కతా నగరం చిగురుటాకులా వణికింది. ఈ భారీ వర్షానికి నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నగరం మొత్తం జల దిగ్భంధంలో చిక్కుకుంది. గడిచిన 24 గంటలలో  కోల్ కతాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమో దైంది.కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్  సమాచారం మేరకు నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్ష తీవ్రత చాలా చాలా అధికంగా ఉంది.   గరియా కమ్‌దహరిలో కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా 332 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  జోధ్‌పూర్ పార్క్‌లో 285, కాళీఘాట్‌లో 280.2,  అలీపూర్‌లో 247.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.   

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 26 నాటికి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ఈ అల్పపీడనం 27వ తేదీన దక్షిణ ఒడిసా, ఉత్త కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇలా ఉండగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణలో  భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు అన్న సమచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక పోతే మంగళవారం తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.  

బీచ్ ఫెస్టివల్ వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బాపట్ల జిల్లా సూర్యలంకలో ఈ నెల 26 నుంచి 28 వరకూ మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించాల్సి ఉంది. ఈ బీచ్ ఫెస్టివల్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సి ఉంది. అ యితే ప్రతికూల వాతావరణం కారణంగా బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బీచ్ ఫెస్టివల్ ను వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తారు.  

శ్రీశైలంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు

శ్రైశైలం క్షేత్రంలో దసరామహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ మొదటిరోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రీ అలంకారంలో ఉన్న అమ్మవారికి, పలురకాల పూలతో అలంకరించి  బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతు లిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవార్లను భృంగివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, కేరళ నృత్యాలు వాయిద్యాలు, గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు   విహారించగా  భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు.  

మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్పూర్ బ్రిడ్జి కింద ఓ మహిళా మృతదేహం లభ్యం కావడం తీవ్ర సంచ లనాన్ని సృష్టించింది.  అయితే ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకొని చెరసాలలో వేశారు. ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం సమయంలో యాకత్పురా నుండి హైదర్‌గూడకు వచ్చింది... హైదర్ గూడా లో ఉన్న కల్లు కాంపౌండ్ లో కూర్చుని ఫుల్లుగా కల్లు సేవించింది. ఆ మద్యం మత్తులో కల్లు కాంపౌండ్ నుండి బయటికి వచ్చి రోడ్డు మీద పడిపోయింది. టోలిచౌకి కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు అదే సమయానికి కల్లు కంపౌండ్ కు వచ్చారు. ఈ  మానవ మృగాలు మహిళ కదలికలు గమనించి ఆమెపై కన్ను వేశారు.  మద్యం మత్తులో పడి ఉన్న మహిళ ను బలవంతంగా ఆటోలో ఎక్కించు కొని... రాజేంద్రనగర్ కిస్మత్పూర్ బ్రిడ్జి కిందకు తీసుకువెళ్లి ఆమెకి ఫుల్లుగా మద్యం తాగిం చారు... వారు కూడా ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం ఈ మృగాలు మద్యం మత్తులో ఉన్న ఆ మహిళపై ఒకరి తర్వాత ఒకరు కామవాంఛ తీర్చుకున్నారు. అయినా కూడా ఈ మృగాలు ఆ మహి ళను వదిలిపెట్ట లేదు. ఈ కామాంధులు తమకు సరైన రీతిలో సహకరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాల్లా ప్రవర్తిస్తూ మహిళను పూర్తిగా వివస్థగా చేసి దిగంబరంగా మార్చి వేసి అత్యంత క్రూరంగా హత్య చేసి అనంతరం అక్కడి నుండి పారిపోయారు. రాజేంద్రనగర్ ఎస్ఓటి బృందం గత ఐదు రోజుల పాటు ఈ మృగాల కోసం వేట కొన సాగించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నాంపల్లి నుండి రాజేంద్ర నగర్, హైదర్‌గూడ వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఈ కామాంధుల గురించి తెలిసింది. దీంతో పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్

  విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆరాధ్య దేవతగా కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. నేటి నుంచి ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆలయానికి చేరుకోగా, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆలయ ఈవో, వేదపండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  అనంతరం డిప్యూటీ సీఎం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ఉప ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించగా, ఆలయ ప్రాంగణం “జయ జయ దుర్గ” నినాదాలతో మారుమ్రోగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్...ఇద్దరు అగ్రనేతలు హతం

  ఛత్తీస్‌గఢ్‌లో నారాయణపూర్‌ జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతిచెందారు. మృతులను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్‌ కోసాగా గుర్తించారు.  ఘటనా స్థలిలో ఏకే 47, ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ ధ్రువీకరించారు. ఒక్కొక్కరి తలపై రూ.40లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.పార్టీ వారోత్సవాల సమయంలో కీలక నేత హతమయ్యాడన్న వార్త మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతోంది. 

నళినికి సీఎం రేవంత్‌రెడ్డి భరోసా

  సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాజీ డీఎస్పీ నళినిని కలిశారు. సర్వీసు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని త్వరలోనే పరిష్కరస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కలెక్టర్.  వివరించారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి సందేశాన్ని ఆమెకు అందజేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందుతుందని కలెక్టర్ ఆమె భరోసా కల్పించారు.  నళిని ఫేస్‌బుక్‌లో పంచుకున్న బహిరంగ లేఖపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆమె “ఇక నా ప్రయాణం ముగియనుంది” అంటూ రాసిన ఈ లేఖ సీఎం దృష్టికి రాగానే వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళిని, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆదివారం ఫేస్‌బుక్‌లో ఓ బహిరంగ లేఖను పోస్టు చేశారు. మరణ వాంగ్మూలంలా కనిపించిన ఆ లేఖలో తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. నళిని పేర్కొన్నదాని ప్రకారం ఒక అధికారిణి, ఉద్యమకారిణి, రాజకీయవేత్త, ఆయుర్వేద ఆరోగ్యసేవకురాలు, ఆధ్యాత్మిక సాధకురాలిగా సాగిన నా జీవితం ముగింపు దశలో ఉంది. గత ఎనిమిదేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. రెండు నెలలుగా వైరల్ ఫీవర్ వల్ల పరిస్థితి మరింత దిగజారింది. 2018లో ఈ వ్యాధి మొదటగా సోకినప్పుడు హరిద్వార్‌లో రాందేవ్ బాబా పంచకర్మ కేంద్రంలో చికిత్స పొంది కొంత మెరుగయ్యాను. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్లే శక్తి, వనరులు లేవు” అని ఆమె రాసుకున్నారు.ఈ లేఖ బయటకు రావడంతో అధికారులు ఆమెకు తక్షణ వైద్య సహాయం అందించే దిశగా చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.

రోడ్డుపై పడుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

  అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి సంచలనానికి తెరలేపారు. నిత్యం ఏదో అంశంతో వార్తల్లో నిలిచే జేసీ, ఈసారి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. సోమవారం ఉదయం తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం ఎదుటకు వచ్చి రోడ్డుపై పడ్డారు. దృశ్యం ఈ  చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులు చేరుకుని చర్చలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన పోలీస్‌ రక్షణపై ప్రశ్నలు లేవనెత్తిన ప్రభాకర్‌ రెడ్డి “ఆ రక్షణకు ఆయన డబ్బు చెల్లించారా? చెల్లించి ఉంటే రసీదు చూపించండి” అని డిమాండ్‌ చేశారు. అదనంగా, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, తమ అనుచరులపై కేసులు పెట్టారని, వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. పోలీసులు ఈ డిమాండ్లను అంగీకరించకపోవడంతో, ఆయన డీఎస్పీ కార్యాలయం వద్ద నుంచి అశోక్‌ పిల్లర్‌ సర్కిల్‌కు వెళ్లి అక్కడ కూర్చుని ధర్నా కొనసాగించారు. దీనికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో  డీఎస్సీ ఆఫీస్ వద్ద నుండి అశోక్ పిల్లర్ సర్కిల్ వద్దకు చేరుకొని అక్కడ సర్కిల్లో కూర్చుని నిరసన తెలిపారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందేనంటూ జేసీ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం...వాహనదారుల ఇబ్బందులు

  హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, పెద్దఅంబర్‌పేట ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట,  హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెంట్, ఎర్రగడ్డ, బోరబండ  తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్ల జలమయం అయ్యాయి. వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  ఖైరతాబాద్‌-రాజ్‌భవన్‌ రోడ్డులో మోకాలి లోతు వరద నీరు నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తర–ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని సూచించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే విధంగా, ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 26న అది వాయుగుండంగా బలపడవచ్చని తెలిపింది. 27న ఆ వాయుగుండం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలుగు వన్‌లో సౌందర్యలహరి

    తెలుగు వన్ ఆధ్వర్యంలో భక్తివన్ ద్వారా ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి భక్తుల కోసం సరికొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. వంద సంస్కృత శ్లోకాలను సులభంగా అర్థమయ్యేలా తెలుగులో తాత్పర్యంతో వివరించిన ఈ ప్రత్యేక వీడియోను సోమవారం ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సీఎస్ మాట్లాడుతూ  “సౌందర్యలహరి శ్లోకాలు ఆధ్యాత్మిక తాత్పర్యాన్ని మాత్రమే కాక, మానవ జీవనానికి అందమైన దారిదీపమవుతాయి.  తెలుగు వన్ తీసుకున్న ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక వనరుగా నిలుస్తుంది” అన్నారు. కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ మాట్లాడుతూ, “ఆది శంకరుల అమూల్య కృతిని కొత్త తరానికి అందించే అవకాశం లభించడం మా అదృష్టం” అన్నారు. భక్తివన్ బృందం రూపొందించిన ఈ వీడియోలో ప్రతి శ్లోకానికి భావార్థం, పఠనం, విశ్లేషణను సమగ్రంగా చేర్చారు. సాంకేతికతతో సంస్కృత సంపదను సమ్మిళితం చేసిన ఈ కృషి, భక్తుల హృదయాలలో భక్తి, జ్ఞానం కలగలిపే వంతెనగా నిలుస్తోంది.  

పోలీసులపై బీహార్ కార్మికులు రాళ్ల దాడి

  సూర్యాపేట జిల్లాలో పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్న  ఓ కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేశారు.  అయితే ఆగ్రహించిన కార్మికులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కొందరు బీహార్ కార్మికులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకూ, పలువురు కార్మికులకూ గాయాలు అయ్యాయి. దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కార్మికులు రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్‌ ఫ్యాక్టరీ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో మంత్రి లోకేష్ భేటీ

  ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా కలిశారు. శాసనసభ కార్యక్రమాలకు విరామం ఇచ్చిన సమయంలో వీరిద్దరూ భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన టీచర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎంను మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. ఈ నెల 25వ తేదీన డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.  ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థుల వివరాలు విద్యాశాఖ వెబ్‌సైట్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్, విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో, అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్  అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది.  రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.  మొత్తం 16,347 టీచర్ల పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను సెప్టెంబర్ 15న విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, పురపాలక, గిరిజన సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీల భర్తీ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. అనంతరం టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తూ, ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి తుది జాబితాను రూపొందించారు.