కూష్మాండ అవతారంలో భ్రమరాంబికాదేవి
posted on Sep 25, 2025 @ 9:56AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నాలుగో రోజు అంటే గురువారం (సెప్టెంబర్ 25) అమ్మవారు కూష్మాండ దుర్గ రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ కూష్మాండ మాత విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తగా, తేజోమయిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఇక మూడో రోజు బుధవారం (సెప్టెంబర్ 24) అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు,వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీభ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవార్లను రావణవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు.
అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు, కేరళ చండిమేళం, కొమ్మ కోయ నృత్యం, స్వాగత నృత్యం,రాజ బటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాలు,చెంచు గిరిజనుల నృత్యాలు, జానపద పగటి వేషాల ప్రదర్శన వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవంగా కదలివస్తున్న శ్రీస్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.