'లెజెండ్' అంచనాలను అందుకుంటాడా?

      నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'లెజెండ్'. ఈ సినిమా మొదటి టీజర్ ను బుధవారం విడుదల చేశారు. బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ కు దేవి శ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జతకావడంతో ఈ టీజర్ సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతుంది. ఒక పక్క ఒక్కొక్కటిగా లెజెండ్ చిత్ర విషయాలు విడుదలవుతుంటే, మరో పక్క అభిమానులు ఆనందాల కోలాహాలంలో మునిగి తేలుతున్నారు. ఇక నిన్న విడుదలైన 27 సెకండ్ల టీజర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచే విధంగా ఉండడంతో నందమూరి అభిమానులు ఈ చిత్రం విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 'సింహా' తరువాత బోయపాటి, బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరీ బాలయ్య వారి అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాలి!  

రవితేజ తమ్ముళ్ళు మారరా!

      రవితేజ తమ్ముళ్ళు ఇప్పటికే మద్యం తాగి, యాక్సిడెంట్లు చేసి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని అతని పరువు తీశారు. తాజాగా రవితేజ రెండో తమ్ముడు భరత్ మద్యం మత్తులో వీరంగం సృష్టించడంతో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటాక భరత్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. భరత్‌పై ఐపీసీ 186,290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం మియాపూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. భరత్ మద్యం తాగి వాహనం నడపడమే కాక.. అడ్డుకున్న పోలీసుల్ని నానా మాటలన్నాడని అంటున్నారు. వారిపై దాడికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం అతణ్ని బెయిల్ మీద బయటకు తీసుకువచ్చారు..

న్యూజిలాండ్ కు రభస సయ్యాట

  ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "రభస" చిత్ర యూనిట్ మార్చి రెండవ వారంలో న్యూజిలాండ్ కు వెళ్లనున్నారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి "కందిరీగ" ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తారక్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిందని, కేవలం ఓ పాట షూటింగ్ మాత్రమే మిగిలిందని తెలిసింది. తమన్ అందించిన పాటలు త్వరలో విడుదల కానున్నాయి. యూత్ ఫుల్, కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

షారుక్ ఖాన్ కు ఎండోస్కొపీ

'హ్యాపీ న్యూ ఇయర్' చిత్ర షూటింగ్ లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ త్వరలోనే ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోనున్నారు. ఐఏఏ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ మాట్లాడుతూ.. ‘‘గాయం నుంచి కోలుకున్నాను. ప్రస్తుతం సర్జరీ అవసరం లేదు. కాని ఎండోస్కోపీ మాత్రం అవసరమైంది’’ అని తెలిపారు. జనవరి 23 తేదిన 'హ్యాపీ న్యూ ఇయర్' షూటింగ్ లో చోటు జరిగిన ప్రమాదంలో షారుక్ భుజానికి ఫ్రాక్చర్ అయింది. దాంతో రెండు, మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని.. రిస్క్ తో కూడిన ఫైట్స్ చేయకూడదని షారుక్ కు డాక్టర్లు సూచించారు. మరో నెల రోజుల విశ్రాంతి తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని షారుక్ తెలిపారు.

అదే రిపీటవ్వుద్ది.. అయ్యింది

  తనకు ఇష్టం లేని పని చేస్తే .. 'మళ్లీ ఇదే రిపీట్ అవ్వుద్ది' అంటూ బద్రీ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ కొడతాడు. నిజంగానే మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది, అయ్యింది కూడా. మెగా ఫ్యామిలీ అనేది ఓ పెద్ద కోట అనుకుంటే, ఆ కోటకు నెమ్మదిగా బీటలు వారుతున్నాయన్న వాదనలకు వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచింగ్ కార్యక్రమం మరింత బలాన్నిచ్చింది.   ఇంతకుముందు రాంచరణ్ తేజ్ నటించిన రచ్చ సినిమా ఆడియో ఫంక్షన్ మొత్తమ్మీద ఎక్కడా పవన్ కనిపించలేదు. ఇక నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ్ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి పవన్ వచ్చాడన్న మాటే గానీ, ఎందుకొచ్చిందిరా భగవంతుడా అన్నట్లుగా మెట్ల మీద ఒక రకమైన ఫోజు పెట్టుకుని కూర్చున్నాడు. పవన్ వచ్చేటప్పుడు చాలా సందడి కనిపించినా, ఆ తర్వాత చిరంజీవి ఉండగా మాత్రం ఆ సందడి ఎక్కడా కనిపించనే లేదు.   చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలకు కారణం ఏంటనే ప్రశ్నకు అనేక సమాధానాలు ఉంటాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులను పరోక్షంగా ఉద్దేశించి.. వాళ్ల పంచెలూడదీసి కొట్టండి అంటూ పవన్ ఆవేశంగా మాట్లాడాడు. ఆ ప్రసంగాలలో వాడి, వేడి పార్టీ కొంతయినా బతికి బట్టకట్టడానికి ఉపయోగపడిందని అంటారు. కానీ అలాంటిది.. తర్వాతి కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయంలోనే సోదరులిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం.   ఇక ఆరెంజ్ సినిమా తీసిన తర్వాత నాగేంద్రబాబు ఎంత అప్పుల్లో కూరుకుపోయాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ సమయంలో దాదాపుగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని నాగబాబు బాధపడుతుంటే, ఎక్కడో విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ముందుగా ఫోన్ చేసి, అన్నయ్యా.. నువ్వు కంగారు పడకు, నేనున్నాను. రాగానే అన్నీ చూసుకుంటా అని చెప్పి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి మాత్రం తన కొడుకు సినిమాయే అయినా.. దాని విషయంలో పెద్దగా పట్టించుకోలేదని.. తాపీగా కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి పర్వాలేదుగా, అంతా బాగానే ఉందిగా అంటూ పొడిపొడిగా మాట్లాడారని అంటారు. ఈ విషయం కూడా మెగా ఫ్యామిలీ ఐక్యతకు కొంత వరకు చేటు చేసింది.   ఇక తర్వాత కూడా రకరకాల కారణాలతో అన్నదమ్ముల మధ్య అంత ఎక్కువ సఖ్యత కనిపించలేదు. తాజాగా వరుణ్ తేజ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హావ భావాలు అందుకు అద్దం పట్టాయనే చెప్పక తప్పదు.

హీరోయిన్ భూమికకు బాబు

  దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన ప్రముఖ కథానాయిక భూమిక 2007లో యోగా గురు భరత్ ఠాకూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే భూమిక ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భూమిక స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. "మాకు ఆ దేవుడు బాబును బహుమతిగా ఇచ్చాడు. ఆ సందర్భంలో భరత్, నేను ఉద్వేగానికి లోనయ్యము" అంటూ ట్వీట్ చేసింది. పెళ్ళయ్యాక కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "లడ్డుబాబు" చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

పవన్, చిరుల విభేదాలు బయటపడ్డాయి!

      మెగా కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న చిత్ర ప్రారంబోత్సవం సందర్బంగా ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఈ చిత్రం ప్రారంబోత్సవానికి హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి మాట్లాడుకోకుండా ఎడమొహం, పెడమొహంగా వుండడం ఈ వార్తలకు ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాయి. వరుణ్ తేజకి స్వయంగా బాబాయి అయిన పవన్ ప్రారంబోత్సవానికి వచ్చినా అయిష్టంగానె దూరంగా వుండి మధ్యలోనే వెళ్ళిపోవడం మెగా అభిమానులకు షాక్ కి గురిచేసింది. చాలా రోజుల తరువాత మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఓకే వేదికపైన చూద్దామని ఆశగా వచ్చిన అభిమానులకు పవన్ నిష్క్రమణ నిరాశనే మిగిల్చింది.

వరుణ్ ఆరున్నరడుగుల అందగాడు

      మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పరిచయ చిత్ర ప్రారంబోత్సవం రామానాయుడు స్టూడియోలో చిత్ర పరిశ్రమ పెద్దల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సినిమా ప్రారంభానికి దర్శకుడు వినాయక్ గౌరవ దర్శకత్వం వహించగా, కేంద్రమంత్రి చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ను లాంచనంగా ప్రారంభించారు.   ఈ సందర్బంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ...వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడు కాదని...ఆరున్నరడుగుల అందగాడని కితాబిచ్చారు. మెగా అభిమానుల అండదండలు వరుణ్ తేజ్ కి ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించాలని కోరుకున్నారు.  ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ తరువాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రమిది. వరుణ్ తేజ్ పరిచయ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధర్మ తేజ, రాఘవేంద్రరావు, సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. VJ!

పాటేసుకున్న రవితేజ హన్సిక

  "బలుపు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ నటిస్తున్న తాజా చిత్రం "పవర్". ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతుంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వంలో హీరోహీరోయిన్లపై పాటను చిత్రీకరిస్తున్నారు. హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో రవితేజ మాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చందమామ ల్యాండ్ మార్క్ అవుతుందట...!

  ఎనిమిది వేరు వేరు కథలను కలిపి ఒకే సినిమాలో చూపిస్తూ.. కొత్త రీతిలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "చందమామ కథలు". ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చాణక్య బూనేటి నిర్మించాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ.... "చందమామ కథలు లాంటి ఓ మంచి సినిమాలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. తెలుగు సినిమా చరిత్రలో ఈ మూవీ ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు" అని అన్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.