వెంకీ రాధాకు కథ పరీక్ష

  వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రాధా". ఈ చిత్ర కథ కాపీ కొట్టిందని వస్తున్న వార్తలపై ఈ చిత్ర దర్శకుడు మారుతి స్పందిస్తూ... "గతంలో ఓ ఎమ్మెల్యే బంధువు వెంకటేష్ గారికి ఇలాంటి కథే ఒకటి వినిపించారు. ఆ కథనే వెంకీ నాతో ఈ సినిమా చేయిస్తున్నాడని సదరు వ్యక్తులు రచయితల సంఘానికి ఫిర్యాదు చేసారు. అసలు ఇంతవరకు నేను వెంకీ గారికే కథ పూర్తిగా చెప్పలేదు. కథపై నాకే పూర్తిగా క్లారీటి లేదు. అలాంటిది కాపీ కొట్టడానికి ఛాన్స్ ఎక్కడిది. ఈ నెల 14న వెంకటేష్ గారికి కథ చెప్పబోతున్నాను. నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలున్నాయి. ఒకరి కథల్ని కాపీకొట్టాల్సిన అవసరం నాకు లేదు. వేరొకరి కథ దొంగిలించి నేను ఈ సినిమా చిత్రీకరిస్తున్నాను అని అనడం అవాస్తవం. నా "రాధా" కథ.. రచయితల సంఘం పరిశీలనకు వెళ్ళింది. నా నిజాయితీ రుజువయ్యాకే షూటింగ్ కి వెళతాను" అని అన్నారు. మరి మారుతి నిజాయితీ మరి కొద్దిరోజుల్లోనే తెలియనుంది.

హాలీవుడ్ సీతగా మంచు లక్ష్మీ

  మంచు లక్ష్మీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆమె తెలుగు. బ్రిటిష్ వాళ్ళు మన తెలుగు నేర్చుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది లక్ష్మీ తెలుగు. లక్ష్మీ తెలుగులో ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. అలాంటి ఈ అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది. "బాస్మతి బ్లూస్" పేరుతో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది లక్ష్మీ. ఓ శాస్త్రవేత్త బియ్యం తయారు చేసి, దాని వ్యాపారం నిమిత్తం ఇండియా రావడం, ఇక్కడి అమ్మాయితో ప్రేమలో పడటం తదితర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా లక్ష్మీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

అబ్బే.. అదేం లేదు.. ఉమ్మా...

  రాజకీయాల్లో ప్రతిరోజు ఎదో ఒక మార్పు వస్తూనే వస్తుంది. అదే విధంగా ప్రేమికుల్లో కూడా ప్రతిరోజు ఎదో ఒక మార్పు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శింబు, హన్సిక ప్రేమ కూడా ఇలాగే నడుస్తుంది. అందరు ఉన్నప్పుడు మాత్రం "టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను" అంటూ మాట దాటివేస్తుంది హన్సిక. శింబు కూడా "నాకేం సంబంధం లేదు" అన్నట్లుగా ఉంటున్నాడు. మరి వీరిద్దరూ మళ్ళీ కలుస్తారో లేదో అని కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది. అయితే వీరు మాత్రం రహస్యంగా కలుసుకుంటూ వారి ప్రేమను మరింతగా పెంచేసుకుంటున్నారు. సోమవారం శింబు పుట్టినరోజు.. ఆదివారం రాత్రి 12గంటలకు కేక్ కట్ చేసాడు శింబు. కానీ ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ సరిగ్గా కేక్ కటింగ్ సమయానికి హన్సిక అక్కడికి చేరుకొని ప్రియుడిని సంతోషపెట్టింది. వీరిద్దరూ కూడా ఈ పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేసారని తెలిసింది. ఏం లేదంటూనే వీళ్ళు ఇలా ప్రేమలో ముద్దు, మురిపాలతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రేమికుల రోజున బుల్లోడు రాక

  సునీల్, ఎస్తర్ జంటగా నటించిన "భీమవరం బుల్లోడు" చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ చిత్రాన్ని అనుకోకుండా వాయిదా వేసి ప్రేమికులరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. తనకి క్యాన్సర్ ఉందని అనుకున్న వ్యక్తి మొండితనంతో సాహసాలు చేయడం, ఆ తర్వాత తనకు క్యాన్సర్ లేదని తెలిసి రెచ్చిపోవడం చాలా సరదాగా ఉంటుందని సునీల్ తెలిపాడు. 1990లో వచ్చిన "షార్ట్ టైమ్" అనే మూవీ ఆధారంగా ‘భీమవరం బుల్లోడు’ నిర్మించారు. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో డి.సురేష్ బాబు నిర్మించారు. సునీల్ కెరీర్ లో అత్యధిక కామెడిని పంచే చిత్రంగా తెరకెక్కినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అనూప్ అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి.

పవన్ అత్తారింటికి కూడా అంతేనంటున్న పూరి

  నితిన్, ఆదాశర్మ జంటగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన "హార్ట్ ఎటాక్" చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా డివైడ్ టాక్ ను సంపాదించుకుంది. దీని గురించి పూరి మాట్లాడుతూ...ప్రతి సినిమాకు డివైడ్ టాక్ ఉంటుంది కదా. ఏ సినిమాకు డివైడ్ టాక్ రాలేదో చెప్పండి? మొన్న బ్లాక్ బస్టర్ హిట్టయిన "అత్తారింటికి దారేది" సినిమాకు కూడా డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే మా "హార్ట్ ఎటాక్" సినిమాకు మంచి రిపోర్టులు వచ్చాయి. సినిమా బాగుందని చాలా మంది చెబుతున్నారు. కానీ కొందరు బాగోలేదని అంటున్నారు. "హార్ట్ ఎటాక్" తొలిరోజు నైజం ఏరియాలో ఒక కోటి తొమ్మిది లక్షల షేర్ వసూలు చేసి నితిన్ సినిమాల్లో రికార్డ్ నెలకొల్పింది. మిగతా ఎరియల్లోను కలెక్షన్లు చాలా బాగున్నాయన్నారు పూరి.

విష్ణుతో హన్సికగిరీ

  హన్సిక ఇంట్లో చిన్నతనం నుండి తనదే ఆధిపత్యం ఉండాలని అనుకునేదట. చిన్న సైజు దాదాల చేసేదట. ఈ దాదాగిరి చూసి అందరూ తన మాటే వినాలని అనుకునేదని, పాపం అందరూ కూడా అలాగే ఉండేవారంట. కాకపోతే ఈ దాదాగిరిలో అల్లరి, చిలిపితనం, చిరుకోపం.. ఇలా అన్ని భావాలు కలిసుండేవని.. ఈ దాదాగిరికి తాను "హన్సికగిరీ" అనే పేరు కూడా పెట్టుకుందని చెపుతుంది. అయితే ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రం నేడు విడుదలయ్యింది. ఇందులో హన్సికగిరీని చూడొచ్చు అని చెపుతుంది. హన్సిక ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది. మరి విష్ణుకి ఎలాంటి హన్సికగిరీని చూపెట్టిందో మరికొద్ది గంటల్లోనే తెలియనున్నది.

వేటూరి జయంతి

      సినీ తోటలోని పాటలు చెట్టుకు...కొమ్మకొమ్మకు సన్నాయిలు పూయించి....రాగాల పల్లకిలో ప్రేక్షకుల్ని ఊయలలూగించిన పాటల మాంత్రికుడాయిన...తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన!తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేసి ఆకుచాటు పిందెను, కొండమీద చందమామను పదాలతో సాక్షాత్కరించజేసిన పదచిత్రకారుడు వేటూరి.   బ్రాహ్మణకుటుంబంలో 1936 జనవరి 29న జన్మించారు వేటూరి సుందరరామమూర్తి.నిత్యం వేదఘోషల మధ్య… సంస్కృత మంత్రోచ్ఛారణల నడుమ పెరిగిన బాల వేటూరికి అచేతనంగానే ఆ సాహిత్యం… అందులోని లయ… పదగాంభీర్యత ఆకట్టుకున్నాయి. ఇలా పుట్టిన వ్యక్తి ఆ తర్వాత కాలంలో తెలుగు ప్రేక్షకలోకానికి పాటల నైవేద్యం పెట్టే పదార్చకుడిగా మారుస్తుందని వేటూరి సైతం ఊహించలేదు.          వేటూరి కెరీర్‌- మొదట జర్నలిస్ట్‌గా మొదలైంది. వార్తా రచన, రిపోర్టింగ్‌లోని సైతం ఆయన భావగర్భితమైన ప్రయోగాలు చేసేవారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలలో ఆయన పాత్రికేయ జీవితం… కళాతపస్వి కె.విశ్వనాథ్‌- పిలుపుతో సినీగేయ రచయితగా కొత్త మలుపు తిరిగింది. అలా సుందరరాముడు- ‘ఓ సీత కథ’ సినిమా ద్వారా… విశ్వనాథుడు అంటే శివుడి నిర్దేశకత్వంలో పాటని పరవళ్లు తొక్కించాడు. వేటూరి కలం సోకిన సినీ సంగీత నాదం ఝమ్మంది. పాదం సయ్యంది. ప్రేక్షకుల తనువులు ఆ నాదంతో పాటే ఊగాయి.            1970 దశకంలో తెలుగు సినిమా పాటల ప్రపంచానికి పిల్ల తెమ్మరలా వచ్చి… ప్రభంజనమై వీచి… సునామీలా చుట్టుముట్టినవాడు – వేటూరి. కృషి + క్రియేటివిటీ కలసిన ఆయన గీతర్షి అయ్యారు. మహాపురుషుడయ్యారు. తెలుగునేల మీద తరతరాలకూ తరగని పాటల నిధి అయ్యారు.రేక్షకుల మనోభావాలను చదివినట్లుగా వారు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారో ఏ సరసాన్ని, ఏ శృంగారాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలను మేలి ముసుగు భావనలతో తన పాటలో పలికించడంలో వేటూరికి వేటూరే సాటి. ఈ పాటల వేటగాడు- ఆకుచాటు పిందె లోని అందాలను రమ్యంగా వ్యక్తీకరించి వానపాటల ట్రెండ్‌కు నాంది పలికాడు.                1983 నాటికి తెలుగు యూత్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వారిలోని ఎమోషన్స్‌కి తగినట్లుగా పాటలోని వరుసలు… వారి హృదయ వరుసలు ట్యూన్ అయ్యేలా రాసి గర్ల్‌ఫ్రెండ్ నచ్చిన తర్వాతి ఆనందాన్ని ఇంగ్లీష్‌ పదాలైన ఛాన్సు, రొమాన్సు, యురేకా వంటి ప్రయోగాలతో నభూతో నభవిష్యతి అన్న తరహాలో అందించాడు.ఆదికవి వాల్మీకి ‘శోకం నుంచే శ్లోకం పుడుతుంది అన్నాడు. అలాగే ఈ సినీకవి తను రాసిన పాటల్లో అద్భుతమైన సింబాలిజమ్‌ను అలాగే కవితాత్మను సైతం ప్రవేశపెట్టారు. సప్తపది సినిమాలోని గోవుళ్లు తెల్లన… అనే పాటలోని చరణంలో ఈ భావాన్ని అనన్య సామాన్యంగా వ్యక్తీకరించాడు. పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలనీ… అందులోంచి రసవంతమైన గేయాలు వస్తాయని భావగర్భితంగా చెప్పారు.                            రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి సినీ గేయ రచనకు కూడా నంది అవార్డును 1977లో ప్రకటించినపుడు ఆ అవార్డును వేటూరి అందుకున్నారు.సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నవతా కృష్ణంరాజు నిర్మించిన 'పంతులమ్మ' చిత్రంలో రాసిన 'మానస వీణ మధు గీతం మన సంసారం సంగీతం' గీతానికిగాను అందుకున్నారు.ఆ తరువాత 'శంకరాభరణం'లోని 'శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా' గీతానికి 'కాంచనగంగ' చిత్రంలోని 'బృందావని వుంది యమునా నది ఉంది మధురాపురి ఉంది కాళింది ఉంది' గీతానికి, ప్రతిఘటన చిత్రంలోని 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.... రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలే వున్నాయి. తెలుగు సినిమా పాట దశనూ దిశనూ మార్చిన సినీకవి వేటూరి సుందరరామ మూర్తిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆయన మధుర గీతాలు అభిరుచిగల శ్రోతలను అలరిస్తూనే వుంటాయి.

రవితేజ పవర్ కి రికార్డు బ్రేక్స్

  పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్ర టీజర్ ఏ క్షణాన విడుదలయ్యిందో కానీ... అప్పటినుండి యూట్యుబ్ లో రికార్డులు మొదలయ్యాయి. పవన్ సినిమా టీజర్ ను అత్యధిక స్థాయిలో వీక్షించి రికార్డులు క్రియేట్ చేసారు. ఆ తర్వాత వచ్చిన మహేష్ "1" సినిమా టీజర్ కు రికార్డులు బద్దలు కొట్టే రేంజులో వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా అదే జాబితాలోకి మాస్ మహారాజ రవితేజ త్వరలోనే చేరనున్నారు. రవితేజ నటిస్తున్న "పవర్" సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ టీజర్ కు యూట్యుబ్ లో కేవలం రెండు రోజుల్లోనే 4,47,000 వ్యూస్ వచ్చాయి. అంటే త్వరలోనే రవితేజ కూడా తన సత్తా ఏంటో చూపించనున్నాడని అర్థం అవుతుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఫిబ్రవరి 7న నాని పైసా

  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాని "పైసా" ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ... "మా బ్యానర్లో తెరకెక్కిన "పైసా" చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 7న అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. వంశీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. వంశీ, నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే ఆడియో మంచి హిట్టయ్యింది. సినిమా కూడా అంతకంటే ఎక్కువ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు. ఇందులో నాని సరసన కేథరిన్ తెరెసా హీరోయిన్ గా నటించింది.

రీలీజ్ కు ముందే పూరీ సక్సెస్

  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్, ఆదాశర్మ జంటగా నటించిన "హార్ట్ ఎటాక్" చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టిస్తుంది. దాదాపు 23కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్ర బిజినెస్ అప్పుడే 20కోట్లు రాబట్టినట్లుగా తెలిసింది. ఈ చిత్రం హక్కుల్ని నైజాంకి 6 కోట్లకి, సీడెడ్‌కి 2 కోట్లకి, ఆంధ్రాకి 8 కోట్లకు అమ్మారని, అదే విధంగా శాటిలైట్ హక్కులు 4 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ దాదాపు వచ్చేసినట్లే అని చెప్పుకోవచ్చు. పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్లో పూరి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాబట్టి నిర్మాతగా విజయం సాధించినట్లే. కానీ సినిమా విడుదలై ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

గౌతమ్ కూడా మొదలెట్టేశాడు

  మహేష్ నటించిన "1" చిత్రం ఇటీవలే విడుదలైన విషయం అందరికి తెలిసిందే. అభిమానుల అంచనాలను అందుకొని "1" సినిమా మొదటి నుంచే డివైడ్ టాక్ ను సంపాదించుకొని, సినిమా ఫ్లాప్ బాటలో నడుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ చిన్నతనం పాత్రలో నటించిన గౌతమ్ ఒక రైమ్ పడుతుంటాడు. ఆ పాటను పిల్లల సమక్షంలో గౌతమ్ ముఖ్య అతిధిగా విచ్చేసి, విడుదల చేసాడు. ఈ కార్యక్రమంలో నిర్మాతలతో పాటు గౌతమ్ తల్లి నమ్రత కూడా పాల్గొన్నది. సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోకపోయినా కూడా ఇందులోని ఈ పాట మాత్రం చిన్న పిల్లలకు బాగా నచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి గౌతమ్ తన వంతు ప్రయత్నంగా తన సినిమాను ఈ విధంగానైనా పబ్లిసిటీ చేస్తున్నాడనే అనుకోవచ్చు.