చిన్న చిరునవ్వు చాలు మనిషి జీవితాన్ని పాజిటివ్ గా మార్చడానికి..

‘ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు. ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు’ అన్నాడు ఓ సినీగేయ రచయిత. ‘‘చిరునవ్వుతో శాంతి మొదలవుతుంది’’ అని చాలా గొప్ప మాట చెప్పారు మదర్ థెరిసా. నవ్వుకు ఉన్న శక్తి అలాంటిది మరి. చిన్న చిరునవ్వు స్నేహ బంధాలకు అంకురార్పణ చేస్తుంది. దూరమైనవారు దగ్గరవుతారు. నవ్వితే నవరత్నాలు అనే మాట ఏమో కానీ హాయిగా నవ్వితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వడం మనిషికి నూతనోత్తేజాన్ని ఇవ్వడమే కాదు రోజంతా ఆహ్లాదకరంగా ఉండేందుకు బాటలు వేస్తుంది. చుట్టుపక్కల ఉన్నవారిలో కూడా పాజిటివ్ శక్తిని నింపే శక్తి నవ్వుకుంది. నవ్వడం మొదలెడితే ఆందోళనలు ఆమడ దూరం పారిపోతాయి. అంతెందుకు ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చే సులభమైన ఆయుధమే నవ్వు. అసలు నవ్వు గురించి ఇంతలా ఇప్పుడెందుకు చర్చించాల్సి వచ్చిందో  తెలుసా?  ఎందుకంటే నేడు (శుక్రవారం) ప్రపంచ నవ్వు దినోత్సవం ( World smile day). ప్రతి వ్యక్తి ఆనంద క్షణాల్లో తనతోపాటే ఉండే నవ్వు గురించి,  అక్టోబర్ 6నే ప్రపంచ నవ్వు దినోత్సవంగా ఎందుకు నిర్వహించుకుంటారు? అనే అంశాలను గురించి ఎంతమందికి తెలుసు??  ఆనందాన్ని, దయను వ్యాపింపజేసే సామర్థ్యమున్న నవ్వు గురించి, ప్రపంచమంతా జరుపుకునే నవ్వు దినోత్సవం గురించి  వివరాలు తెలుసుకుంటే.. అసలు ఎలా మొదలైందంటే.. నవ్వు దినోత్సవం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.  మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్‌కు చెందిన హార్వే బాల్ అనే కమర్షియల్ ఆర్టిస్ట్ 1963లో స్మైలీ ఫేస్ సింబల్‌ని రూపొందించారు. నవ్వుతూనే దీనిని తయారు చేయడం విశేషం. ప్రజలు ఎల్లప్పుడూ నవ్వుతూ దయ, సంతోషాన్ని మరింత వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో 1999లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అక్టోబర్ నెలలో మొదటి శుక్రవారాన్ని నవ్వు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.  వ్యక్తుల నేపథ్యంతో సంబంధం లేకుండా ఇతరులకు చిరునవ్వు పంచాలనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలుగా దీనిని నిర్వహిస్తారు. ప్రాముఖ్యత ఇదే.. ప్రపంచ చిరునవ్వు  దినోత్సవం నిర్వహించుకోవడానికి ఆ నవ్వులో దాగివున్న శక్తే కారణం. చుట్టుపక్కలవారిని చూసి నవ్వడం, నవ్వించడం, దయాగుణంతో కూడిన  చర్యలు. స్నేహపూర్వక, సహకార,  సానుకూలతను ప్రోత్సహించవచ్చు. అంతేకాదు ఎవరి రోజునైనా నవ్వు ప్రకాశవంతం చేయడానికి తోడ్పడుతుందని గమనించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి సాధారణ చిరునవ్వు ఎంతోకొంత శక్తినిస్తుందని గమనించాలి. అందుకే ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన మీకు తెలిసినవారిని నవ్వించండి. నవ్వమని చెప్పండి. ఎవరి మీద అయినా కోపాలు, అలకలు ఉంటే వారి ముందు మనస్పూర్తిగా నవ్వి చూడండి. నిజంగా మనుషుల మధ్య అపార్థాలు, అపోహలు, గొడవలు అన్ని మంత్రమేసినట్టు మాయమైపోతాయి.  పసిపిల్లల నవ్వును కల్మషం లేనిది అంటారు. మనసులో ఏమీ పెట్టుకోకుండా నవ్వడం పిల్లలలో ఉన్న గొప్ప గుణం. ప్రతి మనిషి ఇలా నవ్వగలిగితే ఆ వ్యక్తి ఉన్నతవ్యక్తిత్వం కలిగిన వాడిగా రూపాంతరం చెందుతాడు.  స్నేహితులను, కుటుంబ సభ్యులను హాయిగా  నవ్వించే ప్రయత్నం కుటుంబాన్ని, బంధాలను దృఢంగా మారుస్తుంది. కేవలం కుటుంబంతో ఆగిపోకుండా సామాజిక మాధ్యమాల ద్వారా  నలుగురిని నవ్వించే ప్రయత్నం చేయవచ్చు. లాఫింగ్ క్లబ్బులు తరహాలో సన్నిహితులు, మిత్రులు అందరూ కలసి సరదాగా నవ్వు దినోత్సవానికి కితకితలు పెట్టొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నవ్వు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరులను నొప్పించే పద్దతిలో నవ్వు సృష్టించడం వల్ల పెద్ద అనర్థాలే జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యంగా నవ్వాలి, ఆరోగ్యంగా నవ్వించాలి. ఓ కవి  చెప్పినట్టు "నవ్వడం  భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం". గుర్తుపెట్టుకోండి మరీ..                                               *నిశ్శబ్ద.

మూగజీవాల మనుగడ కోసం మానవుడి స్వరం..

ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే.. చరిత్ర ఏం చెబుతోందంటే.. ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి. ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సగటు పౌరుడి భాద్యత ఏంటంటే.. చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు.. జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.   లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది. 1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది. ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది. సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.                                                              *నిశ్శబ్ద.

ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటారు చాణక్యుడు..!!

చాణక్య నీతిలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రస్తావించారు. జీవితంలో  ఏది సరైనది...ఏది తప్పు అని నిర్ణయించుకోవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  కానీ కొన్ని పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని ఆచార్య చాణక్య చెప్పారు. అవేంటో చూద్దాం.  ఆచార్య చాణక్యుడు మానవ ప్రవర్తనను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అతను తన చాణక్య నీతిలో అనేక సూత్రాలను వ్రాసాడు. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి  అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తన నీతి శాస్త్రంలో, ఒక వ్యక్తి ఎవరికీ సమాధానం ఇవ్వకూడదు..వాగ్దానం చేయకూడదు లేదా ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే మూడు పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. లేకుంటే ఆ వ్యక్తి దాని చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు వాగ్దానం చేయకూడదు? ఆచార్య చాణక్యుడు ప్రకారం, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఎందుకంటే  సంతోషంగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి కొన్నిసార్లు అతను నెరవేర్చలేని వాగ్దానాలను ఇస్తాడు. అందుకే వాగ్దానాలు ఎప్పుడూ ఆలోచించి మాత్రమే ఇవ్వాలని చాణక్య నీతిలో చెప్పబడింది. ఈ పరిస్థితిలో ఎవరికీ సమాధానం చెప్పవద్దు: మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే కోపంతో ఉన్న వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. దీని కారణంగా అతను కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు. అందువల్ల, మీకు కోపం వచ్చినప్పుడు ఓపికపట్టండి.  నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తప్పు కావచ్చు, దాని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి, చాణక్య నీతి ప్రకారం, దుఃఖ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  

పేదరికం ఉంటే జీవితంలో ఎదగలేమనే నిరాశతో ఉన్నారా..

అంగవైకల్యం ఉన్నా అనుకున్నది సాధించగలమేమో   కానీ, ఆలోచనలకు వైకల్యం వస్తే దేన్నీ సాధించలేం. కాబట్టి పేదరికం ఒక శాపమని ఊహించుకొని శిలలా మారిపోవడం కన్నా, అదీ ఒక వరమేనని భావించి చైతన్యవంతంగా మారడం ధీరుని లక్షణం. నిజానికి పేదరికం శాపం కాదు. అది  కార్యసిద్ధికి సహకరించే ఒక సాధనం. జీవితంలో మహోన్నత స్థితికి ఎదిగిన మహాత్ముల్లో ఎంతోమంది పేదరికపు కడలిని దాటినవారేనన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఉదాహరణకు గణిత శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి విదేశీయుల్ని సైతం అబ్బురపరిచిన యువకుడు శ్రీనివాస రామానుజం; బాల్యంలో వార్తాపత్రికల్నీ, కిరాణా సామాగ్రినీ అమ్ముతూ చదువు కొనసాగించి గొప్ప శాస్త్రవేత్తగా పేరుగాంచిన 'భారతరత్న' అబ్దుల్ కలామ్ - ఆ పేదరికపు కొలనులో వికసించిన కుసుమాలే. అలాగే అబ్రహామ్ లింకన్, టంగుటూరి ప్రకాశం, కందుకూరి వీరేశలింగం, డాక్టర్ అంబేద్కర్ మొదలైన వారు కూడా పేదరికాన్ని ప్రగతికి సోపానంగా మలచుకొని విజయాలను సాధించినవారే. success, not as a reason for failure. The full scope of our ability and ingenuity is usually only called forth by problems. - R.J. Heathorn 'కష్టాలు మనలోని అంతర్గత శక్తిని వ్యక్తపరిచేందుకు తోడ్పడేవే కానీ అపజయాలకు గురిచేసేవి కావు' అని సానుకూల దృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగిపోవడమే సరైన మార్గం.  మనస్సుంటే మార్గాలెన్నో! కాబట్టి ముందు మన మనస్సుకు నిరాశ అనే అంటువ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలి.  స్వామి వివేకానంద ఇచ్చిన ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటే ధైర్యంగా ముందుకు సాగడానికి తగినంత ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. Fire and enthusiasm must be in our blood... Think not that you are poor, that you have no friends. Ay. who ever saw money make the man? It is man that always makes money. - Swami Vivekananda పేదరికం వల్ల పస్తులుంటున్న  కుటుంబాలకు  ఆర్థికంగా సహాయపడడం  కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరి  ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఏ చిన్న పనైనా చేస్తూ డబ్బు సంపాదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చు. అలా పనిచేస్తూనే యువత చదువు కూడా కొనసాగించవచ్చు. చదివే పిల్లలు డబ్బు సంపాదించకూడదు అనే నియమం ఎక్కడా లేదు. పైన చెప్పుకున్న గొప్పవారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని శ్రమిస్తే అప్పుడు శారీరక లోపం అయినా,  పేదరికం అయినా  శాపం కాదనీ, అది మీలో ఉన్న నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ నిరూపించడానికి ఒక అవకాశమనీ అర్థమవుతుంది.  అలాంటివారు జీవితంలో తప్పకుండా విజేతలు అవుతారు.                                          *నిశ్శబ్ద.

శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.  కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన  ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి ,  భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు  బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు.  ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు.  జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి. మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు  ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది.  కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు. గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు.  ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి. కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు   సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు. శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.                                                 *నిశ్శబ్ద.

జీవితంలో అనుకరణ ఎంతవరకు మంచిది!

పిల్లలు పెద్దల్ని అనుకరించడం, వాళ్ళలాగే గొప్పవాళ్ళు కావాలని ఆశించడం సహజమైన విషయం. మనం మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తుంటాం. మన జీవితంలో ఈ'అనుకరణ'ఎంత వరకు అవసరమో తెలుసుకోవడం మంచిది. తల్లితండ్రులతో మొదలు..  పిల్లలు ప్రధానంగా తల్లి తండ్రులను అనుకరిస్తారు. కాబట్టి తల్లితండ్రులు ముందుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపితే పిల్లలు వారంతట వారే అమ్మా నాన్నల నుంచి అన్నీ నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లి తండ్రులకు పిల్లలతో కాస్త సమయం గడపడానికే తీరిక లేనప్పుడు వారి నుంచి పిల్లలు ఏం నేర్చుకోగలరు? నేటి తరం వారికి టీవీ, ఇంటర్ నెట్లో మిత్రులు, బంధువులు. పిల్లలు ఏమైనా పాఠాలు నేర్పుతున్నది ఇవే.. వీటిలో ఏముంటాయో  మనకూ తెలుసు. ఇలాంటి విషయాలు పిల్లలకు అలవాటు చేస్తే వారిలో ఏ పాటి ఉన్నత విలువలు అలవడతాయో మనం ఊహించవచ్చు. నేటి యువతరం ప్రసార మాధ్యమాల ప్రభావంతో ప్రతికూల భావాలకు బానిసలై, వాటినే తమ జీవితాల్లో అనుకరిస్తోంది. ఈ ప్రభావాలకు దూరంగా ఉంటూ, మనదైన ఉన్నత సంస్కృతికీ, ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే యువతీ యువకులు ప్రగతిని సాధించగలరు. వివేచనతో అనుకరణ ఉండాలి.. మనం సాధారణంగా ఒక వ్యక్తి, లేదంటే  సమాజంలో బయటకు కనిపించే ఎన్నో విషయాలకు ఆకర్షితులమై, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాం. దీని వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోగా నష్టం కలిగి తీరుతుంది. సింహం చర్మాన్ని వేసుకున్నంత మాత్రాన గాడిద కాస్తా సింహం కాబోదు కదా! మనం వివేచన లేకుండా గుడ్డిగా ఎవరినైనా అనుకరిస్తే పురోగతి చెందే మాట అటుంచి, అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి అనుకరణ వల్ల మన వ్యక్తిత్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోయి జీవచ్ఛవాలుగా మారతాం. అందుకే, మనం ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. మంచిని అనుకరిస్తేనే ఉన్నత స్థితి..  మనం చెడును అనుకరిస్తే అధోగతిని పొందినట్లే, మంచిని అనుకరిస్తే ఉన్నతమైన స్థితికి చేరుకోగలం. 'Be not an imitation of Jesus, but be Jesus. You are quite as great as Jesus, Buddha, or anybody else' అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే.. "ఒక దొంగ అర్ధరాత్రి సమయంలో రాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ రాజు, రాణితో 'మన అమ్మాయి వివాహం నదిఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుతో జరిపించాలి'. అన్నాడు. ఇది విన్న దొంగ 'నేను సాధువు వేషం వేసుకుంటాను. అదృష్టం బాగుంటే నన్నే రాజకుమారి వరించవచ్చు' అని మనస్సులో అనుకున్నాడు. తరువాత రోజు రాజు సేవకులు నది ఒడ్డుకు వెళ్ళి సాధువులను ఒక్కొక్కరినీ రాజకుమారిని వివాహం చేసుకోవలసిందిగా కోరారు. అయితే ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఈ ‘దొంగ – సాధువు' దగ్గరకు వచ్చి అడిగారు. ఇతను మౌనం వహించాడు. మౌనాన్ని అంగీకారంగా భావించి రాజ సేవకులు వెళ్ళి, జరిగినదంతా రాజుతో చెప్పారు. రాజు స్వయంగా ఆ నది ఒడ్డుకు వచ్చి, తన కుమార్తెను వివాహం చేసుకో వలసిందిగా ఆ దొంగ సాధువును ప్రార్ధించాడు. ఆ దొంగ- సాధువు తన మనస్సులో 'నేను సాధువు వేషం వేసినంత మాత్రాన స్వయంగా రాజు నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడు. నేను నిజంగా సాధువును కాగలిగితే ఈ జీవితం ఎంత సార్థకమవు తుందో కదా!' అని అనుకొని, వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప సాధువుగా ప్రఖ్యాతి చెందాడు". మనం కేవలం ఒకరిని అనుకరించడంతో ఆగిపోకుండా వారిలో ఉన్న ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితంలో మంచి స్థాయికి చెరగలం.                                  *నిశ్శబ్ద.

భగవద్గీత 1వ అధ్యాయం నుండి ఈ 3 పాఠాలు నేర్చుకోండి..!

భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం మన ఆచరణ జీవితంలో అన్వయించుకోగల మూడు పాఠాలను నేర్చుకోవచ్చు. మనం మంచి జీవితాన్ని గడపడానికి భగవద్గీత ఒక దీపం. భగవద్గీత సూత్రాలను మన జీవితంలో స్వీకరించడం ద్వారా మనం మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. భగవద్గీత మొదటి అధ్యాయంలో, అర్జునుడు శ్రీకృష్ణునితో, నా స్వంత సోదరులను చంపడం ద్వారా నేను విజయం సాధించినా, అది నాకు సంతోషాన్ని ఇవ్వదు, పశ్చాత్తాపాన్ని మాత్రమే ఇస్తుందని చెబుతాడు. భగవద్గీతలోని ఈ మొదటి అధ్యాయం అన్నదమ్ముల మధ్య ప్రేమ పాఠాన్ని నేర్పుతుందా..? లేక అన్నదమ్ముల మధ్య యుద్ధానికి నాంది పలుకుతోందా..? మరి మొదటి అధ్యాయంలో ఏం నేర్చుకుంటామో చూద్దాం.. 1. మంచి మూడ్ ఉండాలి: దుర్యోధనుడిని తలచుకున్నప్పుడల్లా అసూయపడే వ్యక్తిగా కనిపిస్తాడు. దుర్యోధనుడిలోనే కాదు మనలో అసూయపడే గుణం కూడా ఉంది. భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం స్థిరమైన మనస్సు కలిగి ఉండాలని అర్థం చేసుకోవాలి. మనం ఇతరులకు ఎంతగా అసూయపడతామో, అంత ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటాం. భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం ఇతరులపై అసూయపడకూడదని.. స్థిరమైన మనస్సును కలిగి ఉండకూడదని నేర్చుకోవచ్చు. 2. అభ్యాసం నిరంతరంగా ఉంటుంది: మనం ఎంత నేర్చుకున్నా, మనకు తెలిసినది పరిపూర్ణమైనది కాదు. నేర్చుకోవడం ఎప్పటికీ శాశ్వతం కాదు. మనం ఏమి నేర్చుకున్నా, మరింత తెలుసుకోవడానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. మహాభారతంలో, అర్జునుడు ఎల్లప్పుడూ జీవితం గురించి ఆసక్తిగా ఉండేవాడు. జీవితాంతం విద్యార్థిగా ఉండాలనుకున్నాడు. ఈ కారణంగా అతను శ్రీకృష్ణుడితో స్నేహం చేశాడు. శ్రీకృష్ణునికి శరణాగతి చేయడం ద్వారా, అతను అతని నుండి అన్ని రకాల జ్ఞానాలను పొందుతాడు. 3. జీవితంలో విజయం సాధించడానికి అన్ని పనులు చేయండి: మనం విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే, పనిలో ప్రతిష్టను లెక్కించకూడదు. పని పెద్దదైనా చిన్నదైనా దాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పం ఉండాలి. ఉదాహరణకు: అర్జునుడు కృష్ణుడిని తన రథసారధిగా ఉండమని కోరినప్పుడు, కృష్ణుడు ఆ ప్రతిపాదనను సంతోషంగా అంగీకరించాడు. “నేనే పరమాత్మను, నేనే భగవంతుడిని. నేనెందుకు రథసారధి పాత్రను ధరించాలి?” అని ఆలోచించినవాడు కాదు, వెనక్కి తగ్గినవాడు కాదు. శ్రీకృష్ణుడు పనిలో విజయం గురించి మాత్రమే ఆలోచించాడు. భగవద్గీత మొదటి అధ్యాయం యుద్ధానికి నాంది పలికింది. యుద్ధం ఎలా ప్రారంభించాలి..? ఇది ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది. ఈ అధ్యాయం నుండి మనం పైన పేర్కొన్న మూడు సూత్రాలను లేదా సందేశాలను మన జీవితాల్లో స్వీకరించడం ద్వారా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు.  

అబ్రహం లింకన్ వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత సంఘటన..

అబ్రహామ్ లింకన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కాగానే అమెరికాలోని కోటీశ్వరులు, ప్రముఖులు, అతిగౌరవనీయ కుటుంబాలకు చెందిన వేల మంది లోలోన అతలాకుతలమై పోయారు. ఎందుకంటే లింకన్ తండ్రి వడ్రంగి పనితో పాటు చెప్పులు కుట్టి జీవించాడు. అలాంటి హీనమైన వృత్తి చేసినవాడి కొడుకు తమ దేశానికి అధ్యక్షుడా! అతని హయాంలో తాము జీవించాలా! అది తమకు తలవంపులు అన్నది వారి బాధ. అమెరికా 'సెనేట్'లో అందరూ ప్రముఖ వ్యాపారవేత్తలూ, అత్యంత ధనవంతులూనూ! లింకన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, సెనేట్ను ఉద్దేశించి తన తొలి ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికి, ఎంతో గర్విష్టి అయిన ఓ కోటీశ్వరుడు లేచి, తన బూట్లను అందరికీ కనిపించే విధంగా చేతితో పట్టుకుని, వాటిని గాలిలో ఊపుతూ, బిగ్గరగా అరుస్తూ లింకన్ ప్రసంగానికి అడ్డు తగిలాడు. "మిస్టర్ లింకన్! నువ్వేదో అనుకోకుండా అధ్యక్షుడవయ్యావు గానీ, నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు! మీ నాన్న మా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ చెప్పులూ, బూట్లు కుట్టేవాడనేది వాస్తవం! ఇదిగో! నేనిప్పుడు చూపిస్తున్న బూట్లు ఒకప్పుడు మీ నాన్న కుట్టినవే!" అని అరిచాడు అతడు. అతడి మాటలు విని సెనేట్లో ఉన్న వారంతా ఘల్లున నవ్వారు. అలా నవ్వడం ద్వారా తాము కూడా ఆ కోటిశ్వరుడితో పాటు లింకన్ ను దారుణంగా అవమానించగలిగామని సంతోషించారు. లింకన్ కొన్ని క్షణాలు తన ప్రసంగాన్ని ఆపి, మౌనంగా నిలబడి పోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భావోద్వేగాన్ని అణచుకుని, ప్రశాంత స్వరంలో తన ఉపన్యాసాన్ని ఇలా పునఃప్రారంభించాడు: "ఈ సమయంలో నా తండ్రిని నాకు జ్ఞాపకం తెచ్చినందుకు మీకు నేనెంతైనా కృతజ్ఞుణ్ణి. నా తండ్రి చెప్పులు కుట్టడంలో చాలా నేర్పరి. ఏ రంగంలో చూపించినా ప్రతిభ అనేది గొప్పదే. నేను అధ్యక్షుడిగా, నా తండ్రి తన వృత్తిలో చూపించినంతటి ప్రతిభను చూపించడానికి ప్రయత్నిస్తాను!" అన్నాడు. ఒక్క క్షణం ఆగి, తన గంభీర స్వరంతో, "ఇంతకు ముందు ఈ పెద్ద మనిషి చెప్పినట్లే మా తండ్రి వారి కుటుంబంలోని అందరికీ చెప్పులు కుట్టాడు. వీళ్ళ కుటుంబంలో వాళ్ళకే కాదు ఇంకా చాలామంది శ్రీమంతుల కుటుంబాలలోని వాళ్ళకు పాదరక్షలు కుట్టాడు. మా నాన్న చెప్పులు కుట్టడం లోని నేర్పును తన వారసత్వంగా నాకు కూడా కొంత ప్రసాదించాడు. ఆయన కుట్టిన చెప్పులు మీకు సరిగ్గా సరిపోక పోయినా, బిగుతుగా ఉన్నా, మీ కాళ్ళకు నొప్పి కలిగిస్తున్నా. నాకు ఇవ్వండి. నేను వాటన్నింటినీ చక్కగా సరిచేసి మళ్ళీ మీకు ఇస్తాను. నేను ఆ తండ్రి కొడుకును. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చెప్పులు కుట్టడానికి సిగ్గుపడను" అంటూ ముగించాడు. సభ అంతా నిశ్శబ్దంతో నిండి పోయింది. అంతా నిశ్చేష్ఠులయ్యారు. లింకన్ లాంటి మేరునగధీరుణ్ణి అవమానించడం అతి కష్టమని సెనేటర్లందరికీ అప్పటికి అర్ధం. అయింది.                                            *నిశ్శబ్ద.

శత్రువులను ఓడించాలంటే..ఇవి అవసరం

ఆచార్య చాణక్యుడు తన నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక సమాచారాన్ని అందించాడు. చాణక్యుడు ప్రకారం, ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. చాణక్యుడి నీతి ప్రకారం, ప్రతి వ్యక్తి తన శత్రువును బలహీనుడిగా భావించకూడదు, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ శత్రువులు అవకాశం దొరికిన వెంటనే మిమ్మల్ని దెబ్బతీస్తారు. శత్రువులను ఓడించడానికి ఆచార్య చాణక్యుడు తన నీతిలో కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ఆ విషయాలు మీకు తెలుసా?  చెడు సహవాసాన్ని నివారించండి: చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు తన స్నేహితులతో, పనిలో ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతాడు. అందువల్ల, ప్రతి వ్యక్తి తన సంస్థపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరు మంచివారో, ఎవరు సహవాసానికి అర్హులో చెక్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు లేదా మన సహవిద్యార్థులు ఎక్కువ సమయం మనకు హాని చేయడానికి వేచి ఉంటారు. అదే సమయంలో, మన సహవాసం చెడ్డవారితో ఉంటే, శత్రువు దానిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అవకాశం వస్తే దాడి చేయడానికి వేచి ఉంటాడు. అందుకే ఎవరితో స్నేహం తీసుకోవాలన్నదానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రసంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి: చాణక్యుడి నీతి ప్రకారం, మనిషి తన ప్రసంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ శత్రువు దానితో మీకు మరింత హాని చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ ప్రసంగం చెడ్డది అయితే, మీ సంబంధం క్షీణించవచ్చు. పేలవమైన ప్రసంగం కారణంగా, మీ మంచి స్నేహితులు, బంధువులు మిమ్మల్ని దూరం చేయడం ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరూ చేదు, కఠినంగా మాట్లాడే వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడతారు. అందుకే ఎప్పుడూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాటను మధురంగా ఉంచుకోవాలని, వినయంతో మాట్లాడాలని చాణక్యుడు అంటాడు. చెడు అలవాట్లను వదిలేయండి: ప్రతి వ్యక్తి వ్యసనం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. శత్రువులు మాదకద్రవ్యాల బానిసలను చాలా సులభంగా ఓడిస్తారు. మత్తులో ఉన్న వ్యక్తి తన తెలివితేటలను, విచక్షణను ఈ విధంగా ఉపయోగించుకోలేడు. అటువంటి పరిస్థితిలో, అతను తప్పు చేస్తాడు. ఇది మీ శత్రువులు ప్రయోజనాన్ని పొందడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, మీరు మీ శత్రువును ఓడించాలనుకుంటే, మీ శత్రువుకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మీరు కలిగి ఉండాలి. ప్రతి మనిషి తన శత్రువుల బలాన్ని తెలుసుకోవాలి. మీ శత్రువు గురించి మీకు పూర్తి అవగాహన ఉంటే, మీరు వారిని సులభంగా ఓడించగలరు. చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం, పై విషయాలలో జాగ్రత్తగా ఉంటే శత్రువును సులభంగా ఓడించవచ్చు. మన శత్రువుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలనీ, నిర్లక్ష్యంగా ఉండకూడదనీ చాణక్యుడు చెబుతున్నాడు.   

మీ కష్టాలకు కారణం ఇవే..!!

మన చుట్టూ ఉన్న వ్యక్తులను విభిన్న వ్యక్తిత్వంతో చూస్తాం. కొందరు ఎప్పుడూ సంతోషంగా ఉంటే మరికొందరు ఎప్పుడూ విచారంగా ఉంటారు. అలాంటి వారి గురించి చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. మనిషి ఎప్పుడూ విచారంగా ఉండడానికి కారణమేంటో తెలుసా..?  మోసపూరిత వ్యక్తులతో స్నేహం: ఆచార్య చాణక్యుడు ప్రకారం, మోసపూరిత వ్యక్తితో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే మోసపూరిత వ్యక్తులు తమ స్నేహితులను ఏదో ఒక ఆలోచనతో బాధపెడతారు. జిత్తులమారి తనకు మంచివా, చెడ్డవా అన్నది పట్టించుకోడు. అతను మొదట తన మంచిని దృష్టిలో ఉంచుకుంటాడు. ఈ కారణంగా ఏ వ్యక్తి కూడా మోసగాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడడు. దీనివల్ల వారు నిత్యం కష్టాల్లోనే ఉంటారు. ఒంటరిగా: ఆచార్య చాణక్యుడు ఒంటరివాడు ఎప్పుడూ విచారంగా ఉంటాడని చెప్పాడు.  ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు తమ స్నేహితులందరినీ దూరం చేసుకుంటారు. అయితే, వారికి చాలా మంది శత్రువులు ఉంటారు. ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు తమ బాధలను ఎవరితోనూ పంచుకోరు. తమను తాము అనుభవించడం ద్వారా వారు ఎల్లప్పుడూ దుఃఖపు గుంటలో ఉంటారు. ఇతరులను బాధపెట్టే వ్యక్తి: ఇతరులకు హాని కలిగించే లేదా బాధించే వ్యక్తికి దూరంగా ఉండాలని కోరుకోవడం సాధారణం. మనం చేయలేని వాటితో మనం ఉన్నవారిని బాధపెట్టకూడదు లేదా హాని చేయకూడదు. కానీ, కొందరు అలాంటి తప్పులు చేస్తుంటారు. ఇది వారికి మరింత దుఃఖాన్ని, అసూయను సృష్టిస్తుంది. సమస్యలను గోప్యంగా ఉంచే వ్యక్తి:  కొంతమంది తాము ఏ సమస్యలో ఉన్నా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు దాని నుండి అన్ని బాధలను అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. వారి మనసు ఎప్పుడూ దుఃఖంతో బరువెక్కుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పిన ప్రకారం, సత్యవంతులు, జ్ఞానులతో స్నేహం చేసే వ్యక్తి ఏ కారణం చేతనూ దుఃఖపడడు. తనకి ఏదైనా దుఃఖం కలిగితే దాన్ని స్నేహితులతో పంచుకుని తగ్గించుకుంటాడు.

ఈ ఆరుగురి గురించి చెడుగా మాట్లాడకూడదు..!!

ఈ 6 మంది వ్యక్తుల గురించి చెడుగా ఆలోచించకూడదని లేదా చెడుగా మాట్లాడకూడదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవద్గీత ప్రకారం మనం ఏ 6 మందిని అవమానించకూడదో తెలుసా..? శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఫలానా వ్యక్తులను అవమానించకూడదని.. వారి గురించి చెడుగా ఆలోచించకూడదని చెప్పాడు. ముఖ్యంగా ఈ 6 మంది గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదని చెప్పాడు. ఈ ఆరుగురు వ్యక్తుల గురించి చెడుగా ఆలోచిస్తే మనల్ని నాశనం చేసే అవకాశం ఉంది. వారిని అవమానించడం ద్వారా మనమే నాశనం చేసుకుంటాం. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం మనం ఏ 6 మందిని చెడుగా చూడకూడదో తెలుసా..? వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.. దేవతల గురించి: భగవంతునిపై తక్కువ విశ్వాసం ఉన్నవారిని నాస్తికులు అంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ దేవుడి గురించి చెడుగా మాట్లాడతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ప్రకారం, అటువంటి వ్యక్తులు వీలైనంత త్వరగా నశిస్తారు. కాబట్టి మీరు ఈ తప్పు చేయడం మానేయాలి. ఈ తప్పు చేయడం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది మీరు దేవుని కోపానికి గురి కావచ్చు. వేదాల గురించి: వేదాలు ప్రపంచంలోని పురాతన,  గొప్ప గ్రంథాలలో ఒకటిగా పరిగణిస్తారు. వేదాలలో సనాతన ధర్మం గురించి మాత్రమే కాదు. ఇది మనకు శాస్త్రీయ ఆలోచనలను కూడా చెబుతుంది. మన జ్ఞానాన్ని పెంపొందించే, ఏదైనా విషయాన్ని తెలియజేసే పవిత్ర వేదాలను మనం ఎప్పుడూ అవమానించకూడదు. ఆవు గురించి: మత గ్రంధాల ప్రకారం, గోమాతలో కోట్లాది దేవతలు నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఆవును పూజనీయమైనదిగా భావిస్తారు. గోవులు మానవులకు అన్ని విధాలుగా క్షేమాన్ని కలిగిస్తాయి. అందుకే మనం ఆవులను తల్లిగా గౌరవిస్తాం. బ్రాహ్మణుల గురించి: మత గ్రంధాల ప్రకారం, బ్రహ్మదేవుని నోటి నుండి బ్రాహ్మణులు జన్మించారని నమ్ముతారు. దీనివల్ల బ్రాహ్మణులు గౌరవించబడ్డారు. వారి గురించి చెడుగా మాట్లాడకండి. వారు తప్పు చేసినా మనం వారిని అవమానించకూడదని భగవద్గీతలో పేర్కొన్నారు. మతం గురించి: మతం గురించి అవగాహన లేని లేదా మతం గురించి సరిగా తెలియని వ్యక్తులు మతం గురించి అసంబద్ధంగా ప్రవర్తిస్తారు. మతానికి విశాలమైన అర్థం ఉంది. కాబట్టి సరిగ్గా ఆలోచించకుండా లేదా తెలియకుండా మతం గురించి చెడుగా మాట్లాడకండి. ఋషి గురించి: శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఋషులను ఎప్పుడూ అవమానించకూడదని లేదా వారి గురించి చెడుగా మాట్లాడకూడదని చెప్పాడు. మీకు వీలైతే, మీరు వారికి సహాయం చేయాలి లేదా వారికి అవసరమైన వస్తువులను విరాళంగా ఇవ్వండి. అది మీకు మేలు చేస్తుంది.  

విజేతగా నిలవాలని అనుకునేవారు తెలుసుకోవలసిన విషయమిది!!

మనిషి జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కానీ విజయం సాధించి మళ్ళీ కింద పడి, ఎమ్మల్లి లేచి నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టం, తెలివి, ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం.. ఇవ్ణనే ఉండాలి. దేనికి ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది. విదేశంలోని ఒక వ్యాపారవేత్త అనుకోని పరిస్థితుల్లో ఘోరంగా దివాళా తీశాడు. ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయాడు. మరోవైపు ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన అప్పుల వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. పరిస్థితి అగమ్యగోచరమైపోయింది. ఎంతో ఆందోళనతో ఆ వ్యాపారి ఒక రోజు తన ఇంటికి సమీపంలోని ఓ పార్క్ కు  వెళ్ళి, తలపై చేతులు పెట్టుకొని విషాదంగా కూర్చున్నాడు. ఇంతలో హుందాగా వస్త్రధారణ చేసుకున్న ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు ఆయన వద్దకు వచ్చాడు. "ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నావు. జీవితంలో ఏమైనా నష్టం వాటిల్లిందా?" అని అడిగాడు. ఎంతో ఆత్మీయంగా పలకరించే సరికి, కదలిపోయిన ఆ వ్యాపారి తన కష్టనష్టాల్ని ఆ పెద్దాయనకు వివరించాడు. వెంటనే ఆ వృద్ధుడు స్పందించి "నేను నీకు ఏదైనా సహాయం చేద్దామనుకుంటున్నాను" అంటూ, "నీ పేరేంట"ని అడిగాడు. ఆ వ్యాపారి తన పేరు చెప్పగానే వెంటనే తన చెక్ బుక్ జేబులో నుంచి తీసి, ఆ పేరుతో చెక్ రాసి, సంతకం చేసి వ్యాపారి చేతిలో పెట్టాడు. "ఈ చెక్కు తీసుకో. నేను దీన్ని నీకు అప్పుగా ఇస్తున్నాను. సరిగ్గా సంవత్సరం తరువాత నేను నిన్ను ఇక్కడే కలుస్తాను. అప్పుడు నా అప్పు తీర్చేయ్" అన్నాడు. అయిదు లక్షల డాలర్ల చెక్కు అది. పైగా ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు - ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుల్లో ఒకరైన రాక్ఫెల్లర్ అని తెలిసి వ్యాపారికి నోట మాట రాలేదు. ఆ చెక్కు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యాపారి. కానీ దాన్ని నగదుగా మార్చుకొని అప్పులు తీర్చుకోలేదు. దాన్ని బీరువా అరలో పెట్టుకొని, అది ఉందన్న నమ్మకంతో ముందు తన వ్యాపారాన్ని చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు. ఆ అయిదు లక్షల డాలర్లు తన వెనుక ఉన్నాయన్న విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేశాడు. అప్పుల వాళ్ళ వద్దకు వెళ్ళి, కొద్దిరోజులు గడువు ఇవ్వమని అడిగాడు. తనకు రావలసిన మొత్తాన్ని చాకచక్యంతో రాబట్టుకున్నాడు. తిరిగి కొంత పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు మళ్ళీ తన పూర్వవైభవానికి చేరుకున్నాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అదే చెక్కు తీసుకొని, కృతజ్ఞతలు చెప్పుకొని ఇచ్చేసేందుకు అదే పార్క్ కు వెళ్ళాడు. సాయంత్రానికి ఆ వృద్ధుడు మళ్ళీ అక్కడకు వచ్చాడు. ఎంతో ఆనందంతో ఈ వ్యాపారి ఆయన వద్దకు వెళ్ళబోతుండగా, దూరంగా ఉన్న ఓ మొబైల్ వ్యాన్ నుంచి నర్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ వృద్ధుడిని పట్టుకొని "హమ్మయ్య! ఇప్పటికి దొరికాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన వారికల్లా. 'నేను రాక్ఫెల్లర్ని' అంటూ చెక్కులు రాసి ఇచ్చేస్తున్నాడు" అంటూ డ్రైవర్ సహాయంతో ఆ వాహనంలోకి అతణ్ణి ఎక్కించుకొని తీసుకువెళ్ళి పోయింది. వ్యాపారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ఇన్నాళ్ళూ తన దగ్గర ఉన్నది ఓ చెల్లని చెక్కనీ, దానిపై భరోసా పెట్టుకొని ఇంత సాధించానా అనీ ఆత్మశోధన చేసుకొని పులకరించి పోయాడు. నిజానికి ఆ వ్యాపారికి బయట నుంచి ఏ సహాయమూ అందలేదు. కానీ తనలో అచేతనంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపేందుకు ఆ చెల్లనిచెక్కు ఉపయోగపడింది అంతే! అదే విధంగా చాలాసార్లు మనం బయట నుంచి ఏదో ఒక ఆలంబన కావాలని తపించిపోతూ ఉంటాం. కానీ అది కొంత వరకే మనకు సహకరిస్తుంది. ఎప్పుడైనా మనకు వాటిల్లిన ఉపద్రవం నుంచి బయటపడడానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది మనమే!  బాహ్యప్రపంచం నుంచి ఎవరికీ, ఎప్పుడూ ఏ సహాయమూ అందదు. ఎవరికి వారే ఆలంబనగా నిలిచి, నిలదొక్కుకోవాలి. అలాంటివారే గొప్ప విజయాలను సాధించగలరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.                                         *నిశ్శబ్ద.

నిన్ను నువ్వే రక్షించుకోవాలంటాడు చాణక్యుడు..!!

ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తి, సలహాదారు, వ్యూహకర్త, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. అతని జ్ఞానం, సామర్థ్యాలు భారతదేశ చరిత్రను మార్చాయి. మానవుల సంక్షేమం కోసం తన విధానంలో ఎన్నో ఆలోచనలను ఇచ్చారు చాణక్యుడు.  అవి నేటికీ ప్రసిద్ధి చెందాయి. మీరు ఈ సూత్రాలను పాటించినట్లయితే మిమ్మల్ని విజయాల మెట్లు ఎక్కకుండా ఎవరూ ఆపలేరు. అంతే కాదు, వారి సూత్రాలను అవలంబించడం ద్వారా మనం రోజువారీ జీవితంలో జరుగుతున్న అన్ని కష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనల్ని మనం రక్షించుకోవడానికి చాణక్యుడి ఎలాంటి సూత్రాలు పాటించాలి..? మీ ప్రసంగం మధురంగా ఉండాలి: చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, ప్రసంగం మధురంగా ఉండే వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు. కఠినమైన మాటలు మాట్లాడే వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టమే అంటాడు చాణక్యుడు. డబ్బును ఎప్పుడూ విస్మరించవద్దు: చాణక్యుడి విధానం ప్రకారం, ఏ వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెప్పకూడదు. మీరు చాలా డబ్బు సంపాదించి ఉంటే లేదా ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అలాంటి ఆలోచనలను మీలో ఉంచుకోండి. పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు. ఇది మీకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈ తప్పు చేయవద్దు: మీరనుకున్న విజయాలను సాధించాలంటే...మీ ప్రణాళికల గురించి ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలని చెబుతాడు చాణక్యుడు.  ఎందుకంటే మీరు మీ ప్లాన్ గురించి ఎవరికైనా చెబితే, వారు మీ నుండి ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల మీరు విజయవంతం కాకపోవచ్చు. ఎల్లప్పుడూ ఓపికతో పని చేయండి: ఏది జరిగినా సహనం కోల్పోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, వారు ఎల్లప్పుడూ తమ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. మనం ఏమీ చేయలేము అని అనుకుంటే అది మన వల్ల జరగదు. ఈ పనిని మనం చేయగలమనే పాజిటివ్ ఆలోచనతో మొదలు పెడితే...ఈ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎక్కువ ఖర్చు పెట్టకండి: చాణక్య విధానం ప్రకారం, ప్రతి వ్యక్తి డబ్బును పొదుపు చేయాలి. ఎందుకంటే సంక్షోభ సమయాల్లో, డబ్బు మీ గొప్ప మిత్రుడిగా పనిచేస్తుంది. చేతిలో డబ్బు ఉందని ఫిర్యాదు చేసే బదులు వీలైనంత ఎక్కువ పొదుపు చేసేందుకు ప్రయత్నించండి.

శాంతికి మనమే సోపానాలు..

యుద్దం ఓ భయానక దృశ్యమైతే.. శాంతి ఓ స్వేచ్చా శ్వాస తరంగం అని చెప్పవచ్చు.  ఏ దేశం అయినా శాంతితో ఉన్నప్పుడే అది  అన్నివిధాలుగా అభివృద్ది సాధించగలుగుతుంది. ఆ దేశ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ శాంతి ఎక్కడా?  ప్రశాంతత ఎక్కడా?  ప్రపంచంలో చాలా దేశాలు, చాలా ప్రాంతాలు అశాంతితో, హింసాకాండలో మండిపోతున్నాయి. ఈ అశాంతిని తగ్గించి, హింసాకాండలు రూపుమారి ప్రజలకు భయరహిత జీవితాన్ని ప్రసాదించడానికి ప్రపంచమంతా శాంతి మార్గంలో ప్రయాణించే దిశగా కృషి చేయడానికి  ప్రతి యేడు సెప్టెంబర్ మూడవ మంగళవారాన్ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు.  ఈ రోజు ప్రాముఖ్యత, దీని చరిత్ర గురించి తెలుసుకుని అందుకోసం సగటు పౌరులుగా పాటుపడటం ప్రతి ఒక్కరి ధర్మం. 1981లో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ మూడో మంగళవారాన్ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించింది. ఇది స్థాపించిన రెండు దశాబ్దాల తర్వాత 2001లోసెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా  ప్రకటించింది.   ప్రపంచవ్యాప్తంగా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడం ఆ రోజు ముఖ్య  ఉద్దేశ్యం. ఆనాడు ప్రారంభించబడిన ఈ శాంతి దినోత్సవాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు.  వివిధ దేశాల మధ్య యుద్దాలు ఉన్నా వాటిని 24గంటలపాటు కాల్పుల విరమణ కూడా ఇందులో భాగంగా ఉంది.  చరిత్రలో, చాలా సమాజాలు ఎక్కువ సమయం శాంతితో జీయి. నిజానికి సాధారణ సమాజంలో నివసించే పౌరులకంటే యుద్దంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నవారికి  ప్రాణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ రూపొందించినప్పటి నుండి  ప్రభుత్వాలు ఇతరులపై బలవంతంగా ఎలాంటి  నియమాలు ఉపయోగించకూడదు. ఒక ప్రాంతంలో వ్యక్తుల మధ్య గొడవ జరిగితే అది  వారినే కాకుండా ఆ ప్రాంత ప్రజలను అందరినీ ఇబ్బందికి గురిచేస్తుంది. అదే విధంగా రెండు దేశాల మధ్య లేదా పలు దేశాల మద్య ఏదైనా యుద్దం చోటు చేసుకుంటే అది  దేశంలో ఉన్న ప్రజలను అందిరనీ కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సాంకేతికత అభివృద్ది చెందిన నేటికాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంది. దీని నష్టం చాలా ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ అర్థం కావాలంటే శాంతి ప్రాముఖ్యత కేవలం దేశాల మధ్య ఉండే అధికారులకే కాదు, దేశంలో ఉండే ప్రతి పౌరుడికి అర్థం కావాలి. అప్పుడు సహజంగానే పౌరులు శాంతి మార్గంలో వెళతారు. భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటాన్నే అహింస, శాంతి మార్గంలో నడిపించిన జాతిపిత గాంధీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. యుద్దంలో కల్లోలం ద్వారా జరిగే ప్రాణ నష్టం కంటే శాంతి ద్వారా సాధించుకునే పోరాటం ఎక్కువ బలమైనదని గాంధీ నమ్మారు. మనిషి కోపం తెచ్చుకుని ఎదుటి వ్యక్తిని కొట్టడం సులువే.. కానీ ఓపికగా ఉండటం మాత్రం చాలా కష్టతరమైన విషయం.  అలాంటి ఓపిక గాంధీ గారు దేశ ప్రజలకు భోదించారు. ఆ మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే ప్రయత్నం చేశారు.  అహింస, శాంతి, మౌనం చాలా గొప్ప ఆయుధాలు. వీటి గురించి పిల్లలకు వివరించాలి. వీటి విలువ పిల్లలకు తెలిస్తే ఈ సమాజం గొప్పగా ఎదుగుతుంది. విలువలతో కూడీన పౌరులతో తులతూగుతుంది. కోపాన్ని జయించాలి. ప్రతి విషయానికి కోపం చేసుకోవడం కంట్రోల్ చేసుకోవాలి. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు. అహింసను పాటించాలి. ఎవరినీ కొట్టడం, తిట్టడం, హింసించడం చేయకూడదు.  అందరినీ సమాన దృష్టితో చూడాలి. శాంతి అంటే కేవలం ఒక వ్యక్తి  వ్యక్తిత్వం మారడం కాదు. సమాజ స్వరూపాన్ని శాంతియుతంగా మార్చడం. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.                                         *నిశ్శబ్గ.  

చదువుకోవడం ఎందుకు ముఖ్యం?

విద్య నేర్చుకో విలువ పెంచుకో అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే మనం విద్యావంతులం అయితేనే ఇతరులు మనలను గౌరవిస్తారు. విద్యను నేర్చుకోవడం వల్ల సమాజంలో మంచి స్థాయిని సంపాదించుకోవచ్చు. విద్యను బాగా నేర్చుకోవడం వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. విద్యను నేర్చుకోవడం వల్ల డబ్బును బాగా సంపాదించవచ్చు. ప్రస్తుత సమాజంలో విద్య అనేది చాలా అవసరం. ఎందుకంటే మనిషి బ్రతకాలంటే డబ్బు చాలా అవసరం. డబ్బు కావాలంటే చదువు ఉండాల్సిందే! విద్యలేనివాడు వింత పశువు అంటారు. ఇది నిజం! ప్రస్తుత సమాజంలో విద్యలేని వాళ్ళని వింత పశువులకింద భావిస్తారు. వాళ్ళని విలువ లేని వాళ్ళుగా భావిస్తారు. సమాజంలో విద్యలేనివారు గౌరవ మర్యాదలు కోల్పోతారు. అలాగే విలాసవంతంగా జీవితాన్ని గడపలేరు. తగినంత డబ్బును సంపాదించుకోలేరు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోలేరు. డబ్బు లేకపోయినా సమాజంలో జీవించవచ్చేమో కాని విద్య లేకపోతే జీవించడం అనేది కష్టం అవుతుంది. విద్యను నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు దానిని సద్వినియోగపరచు కోవాలి. మనం మన విద్యను సద్వినియోగ పరచు కోలేకపోతున్నామంటే అది నిర్లక్ష్యం అవుతుంది. అలా చెయ్యలేకపోతే ఆ విద్యకు అర్థం, పరమార్ధం రెండూ ఉండవు. విద్యను ఎంతవరకు నేర్చుకున్నా మన్నది ముఖ్యం కాదు, అలాగే ఎన్ని డిగ్రీలు సంపాదించామన్నది ముఖ్యం కాదు దానిని ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నది ముఖ్యం. బాగా విద్యావంతులైన వారి జీవితాలు డబ్బు, గౌరవ మర్యాదలు, సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. ఒక తోటలో పువ్వులు లేకపోతే ఆ తోట ఎంత శూన్యంగా కనిపిస్తుందో అలాగే మనిషి జీవితంలో విద్య అనేది లేనప్పుడు జీవితం కూడా అంతే శూన్యంగా కనిపిస్తుంది. విద్యార్ధులు తమ విద్యార్ధి దశలోనే కష్టించి చదివి ఉన్నత ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. ఆ సమయాన్ని వృధా చేసుకొంటే జీవితాంతం విచారించే పరిస్థితి రావచ్చు. మన లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకోవాలి. లక్ష్యాలను బట్టి ప్రతి పనీ నెరవేర్చుకోవడానికి సులభమవుతుంది. మనం ఎంచుకున్న లక్ష్యం మన మనస్సుకు నచ్చినదై ఉండాలి. నచ్చినపని అయితే అందరూ మెచ్చేవిధంగా చేస్తాము. లక్ష్యాలను ఎదుర్కోవడంలో వచ్చే అవరోధాలను ధైర్యంగా, సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. మన మనస్సులో సాధించాలనుకునే విషయం తప్ప మరొక విషయం ఉండకూడదు. మనసా వాచా ఆ విషయమే ఆలోచించాలి.  అర్జునుడు చెట్టుమీద పక్షిని గురి చూసి కొట్టడం అనే ఒక కథ ఉంటుంది. ఆ కథలో అర్జునుడు చెట్టును, చెట్టుమీద కొమ్మను చూడడు. కేవలం పక్షిని మాత్రమే చూస్తాడు, దాన్ని మాత్రమే చూడటం వల్ల అర్జునుడికి గురి కుదురుతుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవారు ఆ కథను గుర్తు చేసుకోవాలి. యువకులు లక్ష్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకు కాలేజీలో చేరాము అనే విషయం మర్చిపోకూడదు. పరీక్షలలో ఉన్నత ఫలితాలను సాధించడానికి ప్రయత్నం చేయాలి. అందరూ అంటారు అంత మార్కులు, ర్యాంకుల మాయం అని. చదువుతున్న విఆహాయలు గురించి పరీక్షలు రాసి తెచ్చుకునే మార్కుల గురించి, ర్యాంకుల గురించి ఎందుకు బాధ. ప్రతి విద్యార్ధి కాలేజికి ఎందుకు వెళుతున్నారో ప్రతి రోజూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే కాలేజీలో వారి సమయాన్ని వ్యర్ధం చేసుకోరు. మనలోని కాంక్ష తీవ్రతే మనల్ని లక్ష్యం వైపునకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని సాధించడానికి విజువలైజేష్ చేయటం మరొక మంచి పద్ధతి. కాబట్టి లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి, దాన్ని సాధించుకోవాలి.                                         ◆నిశ్శబ్ద.

ప్రతి మనిషి వినాయకుడి నుండి నేర్చుకోవలసిన విషయాలు

ఏకార్యాన్నైనా ప్రారంభించే ముందు ప్రథమంగా వినాయకుణ్ణి పూజించడం మన సంప్రదాయం. విఘ్నాలను తొలగించమని మానవులే కాదు దేవతలు కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారని పురాణాలు పేర్కొన్నాయి. వినాయకుణ్ణి పూజించడం వల్ల 'మహా' విఘ్నాత్ ప్రముచ్యతే మహా దోషాత్ ప్రముచ్యతే...' 'మహా విఘ్నాలన్నీ తొలగిపోతాయి, మహా దోషాలన్నీ అంతమై పోతాయి' అని 'గణపతి అథర్వశీర్ణోపనిషత్తు' వివరిస్తోంది. మదిలో తలచిన వెంటనే విఘ్నాలను తొలగించే దేవుడు. వినాయకుడు. అందువల్ల 'తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా దలచితినే హేరంబుని, తలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్' అంటూ వినాయకుణ్ణి ప్రార్థిస్తాం. ఎవరు ఏది కావాలని కోరుకుంటారో వారికి దాన్ని ప్రసాదించే సులభ ప్రసన్నుడు వినాయకుడు. సకల ఐశ్వర్యాలను కోరుకునేవారికి 'లక్ష్మీగణపతి'గా, సిద్ధులను  కోరుకునేవారికి 'సిద్ధగణపతి'గా విద్యలను కోరుకునే వారికి 'అక్షర గణపతి'గా... ఇలా గణపతిని ఏయే రూపాల్లో ఉపాసిస్తే  ఆయా ఫలితాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులకు ప్రియతముడు వినాయకుడు.  అందుకే జ్ఞానప్రదాత అయిన వినాయకుడు విద్యార్థులకు అత్యంత ప్రియతముడయ్యాడు. విద్యార్థులు వినాయక చవితి రోజున వినాయకుని ప్రతిమ ముందు పుస్తకాలను ఉంచి, తమకు విద్యాబుద్ధులను ప్రసాదించమని  'కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి. గణాధిప నీకు మ్రొక్కెదన్' అంటూ భక్తి శ్రద్ధలతో గణనాథుణ్ణి ప్రార్థిస్తారు. అయితే మనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని అక్షర గణపతిని ప్రార్థిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. కానీ ఆ జ్ఞాననిధిని వృద్ధి చేయడానికి మన వంతు కృషి చేయాలి. ఏకాగ్ర చిత్తం..  ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆ జ్ఞానాన్ని శీఘ్రంగా పొందాలంటే ఏకాగ్ర చిత్తంతో అధ్యయనం చేయాలి. ఏకాగ్రత లేని మనస్సుతో ఎన్ని గంటలు శ్రమించినా, ఎన్ని రోజులు కృషి చేసినా అది వేడి పెనం మీద పడిన నీటి చుక్కలా వెంటనే ఆవిరైపోతుందే కానీ ఎంతోకాలం నిలవదు.  మనస్సును ఒక విషయంపై ఒక్క క్షణమైనా ఏకాగ్రం చేయలేకపోతున్నవారు ఏకాగ్రత అంటే ఎలా ఉండాలో వినాయకుని జీవితంలోని ఓ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. మహాభారత కథను ప్రపంచానికి అందించాలన్న ఆలోచన వ్యాసుడికి కలిగింది. 'నేను చెబుతుంటే ఈ మహాగ్రంథాన్ని వ్రాయగల సమర్థులెవరైనా ఉన్నారా?' అని బ్రహ్మను అడిగాడు. 'నీ సంకల్పాన్ని నెరవేర్చగల సమర్థుడు వినాయకుడు ఒక్కడే' అని బ్రహ్మ సలహా ఇచ్చాడు. వెంటనే వ్యాసుడు వినాయకుణ్ణి ప్రత్యక్షం చేసుకొని తన విన్నపాన్ని తెలిపాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. కానీ వ్యాసుడు, 'గణనాథా! నేను భారత కథను చెబుతూ ఉంటాను. మీరు ఆగకుండా వ్రాస్తూ ఉండాలి' అని షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు కూడా "నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే నా ఘంటం ఆగదు. కాబట్టి అలా ఆగకుండా కథను చెప్పాలి" అని షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, 'నేను చెప్పినదాన్ని అర్థం చేసుకుంటూ 'వ్రాయాలి' అని వినాయకునికి మరో షరతు పెట్టాడు. ఒకరి షరతులకు మరొకరు అంగీకరించిన తరువాత వ్యాసుడు మహాభారత కథను చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాశాడు. ఆ విధంగా 'పంచమ వేదం'గా ప్రఖ్యాతి గాంచిన మహాభారతం మనకు లభించింది. వ్యాసుడు నిర్విరామంగా చెప్పిన భారత కథను అర్థం చేసుకుంటూ, నిరాటంకంగా వ్రాసిన వినాయకుని ఏకాగ్రతాశక్తి అనితర సాధ్యమైనది. ప్రశాంత చిత్తం.. జ్ఞాన సముపార్జనకు ఏకాగ్రచిత్తం అవసరమే..  అయితే  మనస్సును ఏ విషయంపైన అయినా ఏకాగ్రం చేయాలంటే ప్రశాంతత అవసరం. అలజడితో అల్లకల్లోలమైన చిత్తాన్ని ఏ విషయం పైనా నిమగ్నం చేయలేం. చంచలమైన మనస్సుతో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేం. దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి.. వీరిద్దరిలో ఎవరు సమర్థులో తెలుసుకోవాలని 'ముల్లోకాలలోని పుణ్యతీర్థాలను సందర్శించి, ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తాను' అని శివుడు ఓ పోటీ పెట్టాడు. ఈ విషయాన్ని విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై పయనమయ్యాడు. కానీ మూషిక వాహనంపై ముల్లోకాలను సందర్శించి రావడం వినాయకునికి అసాధ్యం. వినాయకుడు తన అసహాయతకు అలజడి చెందకుండా, మనోనిశ్చలతను కోల్పోకుండా ప్రశాంతంగా పరిష్కారాన్ని ఆలోచించాడు. 'తల్లితండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాల్లోని పుణ్యతీర్థాలను సందర్శించిన ఫలితం లభిస్తుంది. అన్న ధర్మసూక్ష్మాన్ని గ్రహించిన వినాయకుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేశాడు. ఆదిదంపతులు వినాయకుని బుద్ధి కుశలతకు సంతసించి, గణాధిపతిగా నియమించారు. పరిశుద్ధ చిత్తం..  మనస్సు ఏకాగ్రతను సాధించాలంటే ప్రశాంతచిత్తంతో పాటు  పరిశుద్ధచిత్తం అవసరం. అందుకు మనస్సులో ఎలాంటి వికారభావాలూ కలగకుండా జాగ్రత్త వహించాలి. అది బ్రహ్మచర్యాన్ని అభ్యసించడం వల్లనే సాధ్యమవుతుంది. ఒకసారి వినాయకుడు చిన్నప్పుడు ఆడుకుంటూ పిల్లిని కొట్టాడు. పిల్లికి ముఖంపై గాయమైంది. ఆట ముగించుకొని వినాయకుడు తన తల్లి పార్వతి దగ్గరకి వెళ్ళాడు. ఆమె ముఖంపై గాయాన్ని చూసి ఆశ్చర్యంతో 'అమ్మా! నీ ముఖంపై ఈ గాయం ఎలా అయ్యింది?' అని అడిగాడు. అందుకు పార్వతీదేవి, 'నాయనా! సర్వజీవుల్లో ఉన్నది నేనే. నువ్వు పిల్లి ముఖాన్ని గాయపరచడం వల్ల నా ముఖానికి కూడా గాయమైంది' అని చెప్పింది. సర్వజీవుల్లోనూ తల్లి పరమేశ్వరి కొలువై ఉందని తెలుసుకొన్నాడు వినాయకుడు. అలా సర్వజీవుల్లోనూ తల్లినే దర్శించిన వినాయకుని మనస్సులో ఎలాంటి అపవిత్ర భావాలూ కలిగేందుకు తావే లేదు. జ్ఞానసముపార్జనకు ముఖ్య సాధనాలైన ఏకాగ్ర చిత్తం, ప్రశాంత చిత్తం, పరిశుద్ధ చిత్రాలను ఆ వినాయకుడే ప్రసాదించగలడు. కాబట్టి ఆయన్ను శరణు వేడాలి.                                          *నిశ్శబ్ద.

ఈ మంచి అలవాట్లు మహిళలను విజయతీరాలవైపు నడిపిస్తాయి..!!

నేటికాలం మహిళలు ఇంటితోపాటు వృత్తిపరమైన పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇళ్లు, ఉద్యోగం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో రాణిస్తున్నారు. అలాంటి ప్రతిభావంతులైన మహిళలు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మరోవైపు  వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వరిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి జీవితాల్లో విజయాలతోపాటు అపజయాలు కూడా ఎదురైనా...వాటిని ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. వారు పెట్టుకున్న లక్ష్యంలో విజయం సాధిస్తున్నారు. నేటి మహిళ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒక మహిళ విజయం సాధించిందంటే ఆమెలో ఖచ్చితంగా ఈ పది మంచి అలవాట్లు ఉంటాయి. అవేంటో చూద్దాం. 1. విజయవంతమైన మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దీని కారణంగా, వారి మనస్సు,మెదడు మధ్య సామరస్యం ఉంటుంది. దీని కోసం, అటువంటి మహిళలు తమ లక్ష్యాల నుండి తప్పుకోరు. 2.విజయవంతమైన మహిళలు సమయపాలన పాటిస్తారు. ప్రతి పనిని సమయానికి చేస్తారు. అలాగే ఆమె రోజూ ఉదయాన్నే నిద్రలేస్తారు.  విజయవంతమైన ప్రతి వ్యక్తి ఉదయాన్నే మేల్కొనే అలవాటు ఉంటుంది.  ఇది సమయాన్ని నిర్వహించడంలో వారికి సహాయపడుతుంది. 3. విజయవంతమైన స్త్రీకి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఎలా సరిగ్గా నిర్వహించాలో తెలుసు . దీని కోసం మహిళలు తమ కుటుంబానికి పనితో పాటు సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి స్త్రీలు తమ జీవితంలో ఉన్నత స్థితిని సాధిస్తారు. 4. జీవితంలో విజయం అకస్మాత్తుగా రాదు. దీని కోసం చాలాసార్లు విఫలం కావాల్సి వస్తుంది. చాలా మంది విఫలమైనప్పుడు తమ దిశను మార్చుకుంటారు. అయితే, విజయం సాధించిన మహిళలు విఫలమైనా తమ నిర్ణయాలను మార్చుకోరు. దీని కోసం, అలాంటి మహిళలు కూడా వారి జీవితంలో విజయం సాధిస్తారు. 5. విజయవంతమైన మహిళలు తమ జీవితంలో అన్ని సమయాలలో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తెలివిగా కూడా పని చేయగలరు . 6. విజయవంతమైన మహిళలు కూడా పిల్లల మాదిరిగానే ఎప్పటికప్పుడు ప్రశ్నలు అడుగుతారు. ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించి ఆమె మనస్సులో ఏదైనా ప్రశ్న ఉంటే, ఆమె ఖచ్చితంగా అడుగుతుంది. అలాంటి మహిళల పాదాలను విజయం ముద్దాడుతుంది.   7.  విజయవంతమైన మహిళలు జట్టుకృషిని విశ్వసిస్తారు. దీని కోసం ఆమె ప్రజలతో మమేకమవుతుంది. టీమ్‌తో కలిసి పని చేయడం వల్ల త్వరగా విజయం సాధిస్తారు. అదనంగా, పని కూడా సులభం అవుతుంది. 8. విజయవంతమైన లేదా తెలివైన మహిళలు సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహిళలు పట్టు వదలరు. అలాగే, ఆమె రిస్క్ తీసుకోవడానికి భయపడదు. 9. తెలివైన మహిళలు దూరదృష్టి గలవారు. వారు ఎక్కువగా ఆలోచిస్తారు. దీని కోసం మహిళలు యోగా, ధ్యానం యొక్క సహాయం తీసుకుంటారు. దార్శనిక ఆలోచనలు జీవితంలో ముందుకు సాగడానికి వారిని ప్రేరేపిస్తాయి. 10. విజయవంతమైన మహిళలు కష్ట సమయాలను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. జీవితంలో సానుకూలంగా ఉండే వ్యక్తులతో కూడా ఉండేందుకు ఇష్టపడుతుంది. ఇది వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది

గూగుల్ మొదటి అడుగుకు 27వసంతాలు పూర్తీ!

గూగుల్ మనిషి రోజువారీ ఎక్కువగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్. హిస్టరీ గురించి వెతకాలా?  గూగుల్ లో సెర్చ్ చేస్తే వికీపీడియా వొస్తుంది. సినిమా సమాచారం కావాలా? గూగుల్ లో సెర్చ్ చేస్తే బోలెడు అప్డేట్స్ ఉంటాయి. అనారోగ్యానికి ఏవైనా చిట్కాలు కావాలా? గూగుల్ తల్లి మంచి మందులేవో చక్కగా చూపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, సినిమా, జోకులు, ప్రత్యేక దినాలు, చరిత్ర, చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు, గొప్ప వ్యక్తులు.. ఆఖరికి ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చేయాలి?  వంటి ప్రశ్నల నుండి.. ఎలా చచ్చిపోవాలి అనే పిచ్చి సమాధానాల వరకు అన్ని గూగులమ్మ చెబుతుంది. అయితే ఈ రోజు ప్రజలు ఇంతగా గూగులమ్మ మీద ఆధారపడటం అనేది ఒక ఏడాది, ఒక ప్రయత్నంతో జరిగింది కాదు. గూగులమ్మ ఇప్పుడు 27ఏళ్లు పూర్తీ చేసుకుంది. అసలు గూగుల్ ప్రయాణం ఏంటి? ఇది ఎలా మొదలైంది? వివరంగా తెలుసుకుంటే.. Google.com దినోత్సవం సెప్టెంబర్ 15న జరుపుకుంటారు.  గూగుల్ డాట్ కామ్ ను   ప్రారంభించిన మాతృ సంస్థ గురించి తెలుసుకుంటే గూగుల్ ప్రయాణం బాగా అర్థమవుతుంది.  గూగుల్ ప్రజల జీవితంలో పెద్ద భాగం. మొదట్లో ఇది  కేవలం సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందించే బహుళజాతి సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందింది. 'గూగుల్' అనే పదం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. గూగుల్ డాట్ కామ్ జనవరి 1996లో ప్రారంభమైంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని Ph.D విద్యార్థులైన  లారీ పేజ్,  సెర్గీ బ్రిన్ మెరుగైన సెర్చ్  ఇంజిన్‌ను రూపొందించడానికి పరిశోధన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వారు వెబ్‌సైట్‌ల మధ్య సంబంధాలను విశ్లేషించే పేజ్‌ర్యాంక్ అనే అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఇతర సైట్‌లకు లింక్‌ల సంఖ్య ఆధారంగా వాటి ఔచిత్యాన్ని నిర్ణయించింది. సెర్చ్  ఇంజిన్ మొదట డవలప్  చేయబడినప్పుడు దాని పేరు  “బ్యాక్‌రబ్”. ఈ పేరు ఆ తరువాత  Google గా మార్చబడింది, నిజానికి గూగుల్ అనేది  'గూగోల్' అనే పదాన్ని అక్షరదోషంలో పలకడం ద్వారా ఆవిష్కారమైంది.   గూగోల్ అనేది అతిపెద్ద సంఖ్య. ఒకటి తరువాత   100 సున్నాలను రాస్తే అది గూగోల్ అవుతుంది. ఇక Google చాలా సమాచారాన్ని అందిస్తుంది, ప్రస్తుతం   ఇంటర్నెట్‌లోని సమాచారం అంతులేనిదని. సెప్టెంబర్ 15, 1997న, పేజ్,  బ్రిన్ “ google.com ” డొమైన్‌ను నమోదు చేసుకున్నారు . 1998లో, పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించిన తర్వాత పేజ్,  బ్రిన్ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లోని స్నేహితుని గ్యారేజీకి అనుబంధంగా ఉన్న గదిలో అధికారికంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. డిసెంబరు 1999 నాటికి Google బీటా మోడ్‌లో ఉంది.  రోజుకు దాదాపు 10,000 సెర్చింగ్  ప్రశ్నలకు సమాధానాలు లభించేవి.  2003లో, గూగుల్ తన ప్రధాన కార్యాలయాన్ని ఇప్పుడు గూగుల్‌ప్లెక్స్ అని పిలవబడే చోటుకు మార్చబడింది. వాస్తవానికి ఇది కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో 40 ఎకరాల క్యాంపస్. కాలక్రమేణా వారు సైట్‌లో అనేక భవనాలను కొనుగోలు చేశారు,  వాటికి అనధికారిక పేర్లను ఇచ్చారు. క్యాంపస్‌లో క్యూబికల్స్ లేకుండా ఓపెన్ కాన్సెప్ట్ ఉంది,  ఇక్కడ  బంతులను కుర్చీలుగా ఉపయోగించారు. మెరియం-వెబ్‌స్టర్ 2006లో దాని కాలేజియేట్ డిక్షనరీకి 'గూగుల్' అనే పదాన్ని జోడించారు.  "ఇంటర్నెట్‌లో సమాచారాన్ని పొందడానికి Google సెర్చ్  ఇంజిన్‌ను ఉపయోగించడం." అని ఈ డిక్షనరీలో ప్రస్థావించారు.  కంపెనీ సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందిస్తుంది. 2015లో కంపెనీ పునర్నిర్మించబడింది.  ఆల్ఫాబెట్ ఇంక్.గా మారింది.  గూగుల్ దాని అతిపెద్ద అనుబంధ సంస్థగా మారింది. ఇదీ గూగుల్ తల్లి చరిత్ర.                                                      *నిశ్శబ్ద.

అంకెలతో మాయాజాలం.. సుడోకు పుట్టుక,చరిత్ర తెలుసా..

ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.