ఇలాంటి వారితో స్నేహం చేస్తే మీ కెరీర్ నాశనమే..

ప్రతిమనిషి జీవితంలో బంధాలు, అనుబంధాలతో పాటు కెరీర్ గురించి కూడా శ్రద్ద పెడతాడు. నిజానికి బంధాలు అనుబంధాలు అనేవి కాలంతో పాటూ కొత్తగా కూడా పుడతాయి. కానీ కెరీర్ అనేది చాలా ముఖ్యం. ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చెయ్యకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చదువు..  ఉద్యోగం.. ఈ రెండూ జీవితంలో ఎంత బాగా బ్రతకగలం అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఇవి రెండూ బాగుండాలన్నా ఆ తరువాత జీవితం సజావుగా సాగాలన్నా జీవితంలో నమ్మకమైన మనుషులతో స్నేహం అవసరం. ఎందుకంటే జీవితంలో అన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటారు. ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో ఆచార్య చాణక్యుడు  నొక్కి చెప్పాడు. చాణక్యనీతిలో ఎవరిని నమ్మకూడదని చెప్పాడంటే.. ఆయుధాలు ఉపయోగించే వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. కత్తులు, పిస్టల్, ఇతర ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నవారు ఎక్కువ కోపం స్వభావం కలిగినవారై ఉంటారు. వీరికి కోపం వస్తే కొన్నిసార్లు ముందు వెనుక ఆలోచించకుండా ప్రమాదం తలపెడతారు. అందుకే ఆయుధాలు ఉన్నవారితో దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. బలవంతులతో స్నేహం ఎప్పటికైనా ముప్పేనని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే బలవంతులు తమ స్వార్థం కోసం మనుషుల్ని ఉపయోగించుకుంటారు. అది పెద్ద తప్పేం కాదనే వాదనలో ఉంటారు. వారి కారణంగా జీవితంలో ముఖ్యమైన కాలాన్ని నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. బలవంతులు అంటే డబ్బు మదం కలిగినవారు. చెడు అలవాట్లున్న ఆడవారిని నమ్మడం కూడా ఇబ్బందులలో అడుగేసినట్టేనట. తమ సంతోషం కోసం, సుఖాల కోసం, అవసరాల కోసం భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసే మహిళలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనిషిలో ఎలాంటి ఆలోచనలున్నాయో, వారు ఎప్పుడేం చేస్తారో తెలియనప్పుడు వారితో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇలాంటి ఆడవాళ్లు బాగా నాటకీయంగా ఉంటారు. హింస ప్రవృత్తి కలిగిన వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. హింసను చూసి ఆనందపడేవారు చివరికి మిమ్మల్ని కూడా హింసిస్తూ పైశాచికానందం పొందే అవకాశం లేకపోలేదు. ఇతరుల మీద అసూయను, ఇతరుల ఎదుగుదలను చూసి ఎప్పుడూ కుళ్లుకునేవారితో స్నేహం కూడా మంచిది కాదు. అలాంటి వారు ఇతరులు ఎదిగితే చూడలేరు. స్నేహమనే పేరున్నా సరే.. మీరు ఎదిగినా కూడా ఓర్చుకోలేరు.                                          *నిశ్శబ్ద.

మీ ప్రేమ జీవితం సక్సెస్ కావాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించాల్సిందే..!

మానవ జీవితానికి సంబంధించి చాణక్యుడు,  మనకు అనేక విషయాలను బోధించాడు ఇవన్నీ కూడా కౌటిల్యుని శాస్త్రంలో పొందుపరిచారు.  మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చాణక్యనీతి మార్గం చూపిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త, అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన విధానాలు ప్రజల మనోధైర్యాన్ని పెంచేలా పనిచేస్తాయి. చంద్రగుప్త మౌర్యుని గురువుగా ఉన్న చాణక్యుడు కూడా ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పారు. అందుకు సంబంధించిన నాలుగు విషయాలు తెలుసుకుందాం. భాగస్వామి పట్ల గౌరవం: తన ప్రేయసిని లేదా భార్యను గౌరవంగా చూసే వ్యక్తి తన సంబంధాన్ని ఎప్పటికీ విడగొట్టుకోలేడని చాణక్యుడు తన విధానంలో చెప్పాడు. అలాంటి వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. ప్రేమలో నిజాయితీ: తన ప్రేమను పూర్తి నిజాయితీతో నెరవేర్చుకునే వ్యక్తి అంటే మరొక స్త్రీ వైపు చూడని వ్యక్తి, అతని సంబంధం ఎప్పుడూ విచ్ఛిన్నం కాదు. దీనికి విరుద్ధంగా, ఒక వ్యక్తి తన భాగస్వామి కాకుండా మరే ఇతర స్త్రీ గురించి తన మనస్సులో తప్పుగా భావించినా అతని ప్రేమ విజయవంతం కాదు. ఆనందం: చాణక్య నీతి ప్రకారం, తన జీవిత భాగస్వామికి  మానసిక ఆనందాన్ని అందించే వ్యక్తియే శారీరక సంతృప్తిని కూడా అందిస్తాడు. అలాంటి వారికి వైవాహిక జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు లేవు. భాగస్వామికి భద్రత:  తన భార్యను సురక్షితంగా ఉంచే వ్యక్తితో అతడి ప్రేమ జీవితం కూడా చక్కగా సాగుతుంది. ఒక స్త్రీ తన భర్తలో తన తండ్రి రూపాన్ని చూసుకుంటుంది.  అలాగే స్త్రీ  తన భాగస్వామి  ఒక తండ్రి లాగా రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది.  అంతే కాదు తాను ఎక్కడికి వెళ్లినా తనకు ఎలాంటి పరిస్థితి వచ్చిన తన భర్త తోడు ఉండాలని ఆమె ఆశిస్తుంది.

ప్రశాంతమైన జీవితానికి పది సూత్రాలు..

ఈకాలంలో డబ్బు అయితే ఈజీగా సంపాదించగలుగుతున్నారు కానీ ప్రశాంతతను సంపాదించుకోలేకపోతున్నారు. ప్రశాంతత లేనిదే సంతోషాలుండవు.  ఒకవేళ జీవితంలో సంతోష క్షణాలు వచ్చినా అవి దీర్ఘకాలం ఉండవు. సంతోషాలు జీవితంలో ఉన్నా వాటిని అనుభూతి చెందలేరు. అందుకే ఎవరు చూసినా జీవితంలో ప్రశాంతత కరువైందని అంటూ ఉంటారు. కానీ ప్రశాంతత కావాలంటే జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని నిజాలు, కొంత అవగాహన చాలా ముఖ్యం. ప్రశాంతమైన జీవితం సొంతం కావాలంటే ఈ కింది పది సూత్రాలను తూ.చా తప్పకుండా పాటించాలి.  అప్పుడు ప్రశాంతత కరువైందిరా బాబూ.. అని గోడు వెళ్లబోసుకోనక్కర్లేదు. ఇంతకీ ఆ సూత్రాలేంటో చూస్తే.. నేనేదీ ప్లానింగ్ చేసుకోను, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ నిజానికి నేటికాలంలో వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని, చిన్న చిన్న సంతోషాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటే ప్లానింగ్ ముఖ్యం. ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీసు పని నుండి ఇంట్లో పనుల వరకు.. ప్రణాళికా బద్దంగా పూర్తీ చేస్తుంది ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ అయిపోయి మిగిలిన కొద్దో గొప్పో సమయం మీద ప్రభావం ఉండదు.  లోతుగా చేసే శ్వాస వ్యాయామాలు ఒత్తిడి  మీద మంత్రంలా పనిచేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఫాలో అవుతుంటే చాలు ఏ పని చేయాలన్నా కంగారు, హడావిడి లేకుండా చెయ్యగలుగుతారు. శ్వాస వ్యాయామాల పుణ్యం  మంచి ప్రశాంతత చేకూరుతుంది. కేవలం శ్వాస వ్యాయామాలే కాదు శారీరక వ్యాయామాలు కూడా అవసరం. శారీరక వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్పిన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఇప్పట్లో శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు ఏమీ లేవు, దీని కారణంగా చాలా తొందరగా శరీరాలు బలహీనం అవుతున్నాయి. హార్మోన్ల స్థితిలో మార్పు,  అవయవాల సామర్థ్యం తగ్గడం జరుగుతున్నాయి. అందుకే ప్రతిరోజూ కనీసం 30 నుండి 60 నిమిషాల వ్యాయామం చెయ్యాలి. ధ్యానం మనిషిని అంతర్గతంగా రిపేర్ చేస్తుంది. మనసు నుండి శరీర అవయవాల వరకు ధ్యానం చేకూర్చే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యం, మానసిక ఒత్తిడి మొదలైన వాటిపై ప్రభావవంతంగా ఉంటుంది. మనసును నియంత్రిస్తుంది. తద్వారా ప్రశాంతత చేకూరుస్తుంది. మనిషి ప్రశాంతతలో నిద్ర కూడా కీలకమైనది. చక్కని నిద్ర మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  ప్రతిరోజూ కనీసం 7-8 గంటల మంచి నిద్ర బోలెడు రోగాలను దూరం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలామంది ఒత్తిడిగా ఉన్నప్పుడు, పనులు చకచకా జరగాలన్నా కాఫీ, టీ తాగి చురుగ్గా మారతారు. కానీ ఇవి తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గిచ్చినట్టు అనిపిస్తాయి కానీ వీటిలో కెఫిన్ మానసిక సమస్యలు పెంచుతుంది. కాఫీ టీ బదులు, లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం, మరీ ముఖ్యంగా హెర్బల్ టీలు ప్రశాంతతను చేకూరుస్తాయి. చాలామంది ఎమోషన్ గా ఉంటుంటారు. కానీ ఎమోషన్స్ పెంచుకోవడం జీవితంలో దుఃఖానికి కారణం అవుతుంది. ఆర్థిక నష్టాలు అయినా, వ్యక్తిగత విషయాలు అయినా నిరాశ పరిస్తే వాటిని ఒక అనుభవంగా తీసుకోవాలి. ఇలాంటి వారు దాదాపుగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఆఫీస్ లో ఎంతో బాగా పనిచేస్తున్నాం కానీ గుర్తింపు లేదు, ఇంట్లో అందరి విషయంలో బాధ్యతగా ఉంటున్నాం కానీ గౌరవించరు. అందరికీ సాయం చేస్తుంటారు కానీ ఎవరూ పొగడరు. అందరితో మంచిగా ప్రేమగా ఉంటాం కానీ ఎవరూ మనల్ని తిరిగి అలా ట్రీట్ చేయరు. చాలామంది జీవితాల్లో జరిగేవి ఇవి.  జీవితం గురించి  అర్థం చేసుకునేవారు వీటిని పట్టించుకోరు. ఇతరుల నుండి ఏమీ ఆశించరు. కానీ కొందరు మాత్రం ప్రతి పని నుండి గుర్తింపో, ఆర్థిక లాభమో ఆశిస్తారు. ఇలాంటి వారే ప్రశాంతతకు దూరం అవుతారు. ఆఫీసు పనులు, ఇంటి పనులు, ఇతర బాధ్యతలు అన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అనుకుంటున్నారా? ఎప్పుడూ పనులు, బాధ్యతలే కాదు. విశ్రాంతి కూడా కావాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి. ఇంకా ఎక్కువ ప్రశాంతత కావాలంటే ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండాలి. అది మానసికంగా చాలా మంచి ఊరట ఇస్తుంది. వంట, సంగీతం వినడం, డ్యాన్స్, పుస్తకాలు చదవడం, ఆర్ట్స్, విభిన్న కళలుంటే వాటిని కంటిన్యూ చేయడం. కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా ఏదో ఒక అదనపు వ్యాపకం ఉండాలి. ఇవి ఒత్తిడి తగ్గించి ఉల్లాసాన్ని పెంచుతాయి.                                 *నిశ్శబ్ద.  

డబ్బున్నవారు చేసే పెద్ద తప్పులివే.. చాణక్యుడు ఏం చెప్పాడంటే..

చాణక్యుడి గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి గానీ జీవితంలో వైఫల్యం అనేదే ఎదురుకాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తుల మద్య సంబంధాలు.. ఇలా ఒక్కటనేమిటి? ఎన్నో విషయాల గురించి చాణక్యుడు కుండ బద్దలు కొట్టినట్టు విషయాలను స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చినప్పుడు చాలామంది తమకు తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల  వ్యక్తుల దగ్గర డబ్బున్నా  ప్రశాంతత, సంతోషం అనేది మాత్రం అస్సలుండవట. మరికొందరు పతనానికి చేరుకుంటారట. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుంటే.. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చాలామంది తాము ఇబ్బంది పడిన రోజులను, బాధతో గడిపిన రోజులను మరచిపోతాడు. పూర్తీగా చేతిలో డబ్బుందనే మాయలో పడిపోతారు. ఇలా మరచిపోవడం,  కష్ట సమయాలను, బాధల్ని మరచిపోవడం, డబ్బు విషయంలో తప్పు పనులు చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల మళ్లీ డబ్బు లేని స్థితికే చేరుకుంటాడు. సహజంగా ప్రతి ఒక్కరూ డబ్బులేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. డబ్బున్నప్పుడు. డబ్బులోనే సంతోషాన్ని చూస్తున్నప్పుడు దేవుడిని పక్కన పెడతాడు.  ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గంలో కూడా వెళతాడు. ఇలాంటి వారు డబ్బును మధ్యలోనే పోగొట్టుకుంటారు. తిరిగి అశాంతికి, కష్టానికి, బాధలకు దగ్గరవుతారు. కొంతమందికి డబ్బు చేతికి రాగానే అహంకారం వస్తుంది. కుటుంబ సభ్యులతోనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు.  అయితే పొరపాటున కూడా కుటుంబ సభ్యుల ముందు డబ్బు గర్వాన్ని చూపించకూడదు. డబ్బు ఈరోజు ఉండి రేపు పోవచ్చు. కానీ మరణం వరకు తోడుండే ఆత్మీయులు మాత్రం డబ్బు వల్ల దూరం అయితే మళ్లీ దగ్గరకు రావడం కష్టం. డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడమే పరమావధి కాకూడదు. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదించే పనులు ఎప్పుడూ చేయకూడదు.  అలాంటివారితో ఎక్కడా ఎవరూ బ్రతకలేరు. ముఖం మీదనే చెప్పి దూరం వెళ్లిపోతారు. అందుకే డబ్బుకోసం ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడవద్దు. డబ్బు దండిగా ఉన్నప్పుడు అయినా, డబ్బు లేనప్పుడు అయినా ఒకే విధంగా ఉండే వాడే ఎప్పటికైనా జీవితంలో సఫలం అవుతాడు. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు చేస్తే అది చాలా తప్పు. కానీ డబ్బు ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాలలో  వినియోగించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. డబ్బు వృధా కంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. దీని వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూరతాయి. డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం  గొప్పే.. కానీ  ఆ డబ్బును ఇతరులకు హాని తలపెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం పతనానికి చేరుకుంటారు. ఇలాంటి పనులవల్ల ఎంత గొప్ప ధనవంతుడు అయినా పేదవాడిగా మారిపోవడం ఖాయమని చాణక్యుడు చెప్పాడు.                                           *నిశ్శబ్ద.

నమ్మకం విజయానికి తొలి అడుగు అంటారెందుకు?

మనిషికి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యం. అది మనిషి జీవితాన్ని ఎప్పుడూ మెరుగ్గా ఉండేలా, ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఓ చిన్న కథ అదే చెబుతుంది….. పూర్వం ఒక రాజు వుండేవాడు. అతని భార్య గొప్ప అందగత్తె.  ఆమెను చాలా ప్రేమతో చూసుకునేవాడు. ఆమెకు ఎక్కడ లేని నగలను దేశ విదేశాల నుంచి తీసుకువచ్చే వాడు. అరేబియా నుంచి నగల వర్తకులు నేరుగా ఆమె భవనానికి వచ్చి నగలు అమ్మేవారు. ఇలా 25 సంవత్సరాలు గడిచాయి. ఆమె అందం తగ్గింది. రాజు మరో భార్యను చేసుకున్నాడు. క్రమక్రమంగా ఆమె దగ్గరికి రావటం తగ్గించాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పెద్దభార్య భర్త తనదగ్గరకి తిరిగి రాకపోతాడా అని ఎదురు చూస్తుండేది. ఆ రాజ్యంలో జరుగుతున్న విశయలు ఏమీ తెలియని ఒక అరేబియా వర్తకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు తన దగ్గరవున్న అత్యంత ఖరీదైన నగను పెద్ద రాణికి అమ్మడానికి సరాసరి ఆమె భవనానికి వచ్చాడు. ఆ నగను ఆమెకు చూపించాడు. ఆ రాణి ఆ నగ పనితనానికి ముచ్చటపడి కొనాలని ఆసక్తి చూపి, భర్త నిరాదరణ గుర్తుకువచ్చి మానివేసింది.  ఆమె అనాసక్తిని అరేబియా వర్తకుడు మరొక విధంగా తలచి "అమ్మా, ఈ హారానికయ్యే సొమ్మును నాకు వెంటనే ఇవ్వవలసిన అవసరం లేదు. నేను వర్తకం నిమిత్తం మరిన్ని దేశాలు తిరగవలసివస్తుంది. సంవత్సరం తరువాత నేను మీ రాజ్యానికి తిరిగివస్తాను. అప్పుడు నాకు సొమ్ము ఇవ్వవచ్చు" అన్నాడు.  రాణి ఇంకా తటపటాయిస్తూండగా ఆమె కొడుకైన యువరాజు ఆ హారాన్ని తీసుకొని, తల్లి మెడలో అలంకరించాడు. వర్తకుడు ఆనందంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు తల్లితో "ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నావు? సంవత్సరం లోపల ఏమైనా జరగవచ్చు. నాన్నగారు మనసు మారి మళ్లీ నీ దగ్గరకు రావచ్చు, రాజ్యాధికారం అంటే విరక్తి కలిగి నన్నే రాజుగా ప్రకటించవచ్చు. పిన్ని ఆరోగ్యానికి భంగం కలిగి రాజు నిన్నే ఆదరించవచ్చు, రాజు దురదృష్టం కొద్దీ మరణిస్తే నేనే యువరాజును కాబట్టి రాజ్యాధికారం నాకే రావచ్చు. నాన్నగారు అనారోగ్యానికి లోనైనా నాకే రాజ్యాధికారం రావచ్చు. సంవత్సరంలోపు ఏమైనా జరగవచ్చు, నేను పొరుగు రాజ్యాన్ని జయించి రాజును కావచ్చు. గుర్రం ఎగరవచ్చు, కుక్కలు సింహాలను ఎదిరించవచ్చు. సంవత్సరంలో ఈ నగల వ్యాపారి మరణించవచ్చు, ఒక సంవత్సరం తరువాత మన దగ్గరడబ్బు లేకపోతే నగ నచ్చలేదని తిరిగి అతనికే ఇచ్చేయవచ్చు. సంవత్సరం తరువాత మనదే రాజ్యం అన్న నమ్మకాన్ని పెంచుకో అమ్మా మనకి మంచి జరుగుతుంది అన్నాడు.  వర్తకుడు తిరిగివచ్చేగడువు మూడు రోజులలోకి వచ్చింది. పెద్దరాణి ఆందోళన పడసాగింది. యువరాజు ధైర్యంగా ఉన్నాడు. పరిస్థితులలో ఏ మార్పు లేదు. రెండు రోజులలోకి వచ్చింది గడువు, పెద్దరాణి నగను వర్తకుడికి ఇచ్చేయడానికి సిద్ధపడింది ఇంతలో పిడుగులాంటి వార్త. రాజుగారిని హఠాత్తుగా కొంతమంది దొంగలు బంధించటం జరిగింది. యువరాజు ధైర్యంగా అడవికి వెళ్ళి, ఆ దొంగలను బంధించి, రాజును విడిపించాడు. రాజుగారు సంతోషించి యువరాజుకు రాజ్యం అప్పగించడానికి సిద్ధపడ్డాడు. గడువు చివరిరోజు యువరాజుకి రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నది. ఆ సమయానికి అక్కడికి వచ్చిన అరేబియా వర్తకుడిని యువరాజు సాదరంగా ఆహ్వానించి, అతనికి నగకి ఇవ్వలసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉచితరీతిన సత్కరించి పంపాడు. ఏ పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని పొగొట్టుకోకూడదు. నమ్మకమనే విశ్వాసాన్ని మించిన శక్తి లేదు. భవిష్యత్తు మనదేనన్న నమ్మకంతో జీవించాలి. పైన చెప్పుకున్న కథ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏ పరిస్థితులలో అయినా నమ్మకం, ధైర్యం కలిగి ఉన్నపుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలిగేది. ఆ విషయం ఎప్పటికీ మరచిపోకూడాది.                                       ◆నిశ్శబ్ద.

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని మీద ఆధారపడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా  జీవితాల్లో అతిపెద్ద మలుపు తీసుకునేది పెళ్లితోనే. సింపుల్ గా పెళ్లికి ముందు, పెళ్ళి తరువాత అనే  వ్యత్యాసాన్ని చెప్పేయచ్చు. ఉమ్మడి కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సర్కిల్ ఎక్కువగా  ఉంటే ఆటోమేటిక్ గా పెళ్లి వయసొచ్చిన యువతీయువకుల కోసం పెళ్లి సంబంధాలు అంటూ కబుర్లు వస్తూనే ఉంటాయి. కానీ యెవరికి ఎవరే యమునాతీరే అనేట్టు ఉన్న నేటికాలం జీవితాలల్లో సంబంధాల కోసం ముందుకొచ్చి సహాయం చేసే చుట్టారు, స్నేహితులు తక్కువే. పైపెచ్చు మంచి సంబంధాలు కావాలనే కారణంతో చాలామంది  దగ్గరలో ఉన్నవాటిని పట్టించుకోరు. మంచి సంబంధాల కోసం మ్యాట్రిమోనిలో వెతుకుతుంటారు. అయితే మ్యాట్రిమోనిలో సంబంధాలు వెతికేవారు ఈ కింది విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రోపైల్ గూర్చి అవగాహన ఉందా? పెళ్లి సబంధాల కోసం మ్యాట్రిమోనిలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో వరుడు లేదా వధువు ప్రోపైల్ విషయంలో అవగాహన ఉండాలి. వధువు లేదా వరుడి ఫ్రోపైల్స్ రెండు రకాలుంటాయి. ఒకటి ప్రీ ఫ్రోపైల్, రెండు పెయిడ్ ఫ్రోపైల్. ఫ్రీ ప్రోఫైల్ అనేది ముందునుండే ఉన్నది. పెయిడ్ ఫ్రోపైల్ అనేది మ్యాట్రిమోనికి డబ్బు కట్టి క్రియేట్ చేయించుకునేది. దీంట్లో చాలావరకు పేక్ ఉంటాయి. అధికశాతం మంది ఇక్కడే మోసపోతారు. సామాజిక మాద్యమంతో జాగ్రత్త.. సోషల్ మీడియా ఇప్పుడు చాలా భీభత్సంగా  మారింది.  కాస్త మాటలు మొదలైతే చాలు  ఎంతో సులువుగా దగ్గరైపోయేవారు ఉన్నారు. సన్నిహింతంగా మాట్లాడగానే వ్యక్తిగత సమాచారం షేర్ చేసేవారున్నారు. వీటి వల్ల  భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి పొరపాటున కూడా వివరాలు ఎవరికీ ఇవ్వకండి. దూరమే శ్రేయస్కరం.. పెళ్ళి ఖాయం అయినా పెళ్ళి పూర్తయ్యే వరకు కాబోయే భార్యాభర్తలను అస్సలు కలవనిచ్చేవారు కాదు ఒకప్పుటి పెద్దలు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి పిక్స్ అనే మాట వినగానే పెళ్లి జరగడానకి ముందు బోలెడు సార్లు కలుస్తారు. షాపింగ్ చేస్తారు. టూర్లకు కూడా వెళతారు. కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండటం మంచిది. పెళ్లి జరిగే వరకు అమ్మాయిలు తమను తాము సేప్టీగా ఉంచుకోవడం మంచిది. అదే విదంగా సోషల్ మీడియా పరిచయాలు ప్రేమ, పెళ్లికి దారితీస్తే పెద్దల నిర్ణయం తరువాతే వాటి విషయంలో ప్రోసీడ్ అవ్వడం మేలు. మనీ మాటర్స్.. పెళ్లి ఓకే అనగానే కొందరు, పెళ్లి వలలోకి లాగడానికి కొందరు, పెళ్లి పేరుతో మోసం చెయ్యడానికి మరికొందరు డబ్బును, బహుమతులను ఇవ్వడం, ఆశించడం చేస్తారు. అయిచే పెళ్లి  జరిగే వరకు ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిది.  

కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఎలాంటి  లాభాలో తెలుసా!

కొబ్బరినీరు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అనుకోవచ్చు. ఈ సహజసిద్దమైన నీటిలో ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు,  యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్ లు, విటమిన్-బి కాంప్లెక్స్ లు, విటమిన్-సి ఇలా చాలా పోషకాలు ఉంటాయి. అనారోగ్యం చేసినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఎండ కారణంగా అలసిపోయినప్పుడు, వయసు పెరుగుతున్నా యవ్వనంగా ఉండాలని ఇలా చాలా కారణాలుగా కొబ్బరి నీరు తాగుతారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడే కొబ్బరి నీరు అమృతంతో సమానమనడంలో సందేహం లేదు. లేత కొబ్బరి  బొండాంలో ఉండే కొబ్బరి నీరు కాస్త ఉప్పగా ఉంటుంది. ఈ నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. కొబ్బెర పట్టిన కొబ్బరి బొండాంలో నీరు తియ్యగా ఉంటుంది. ఇందులో కేలరీలు కాసింత ఎక్కువ ఉన్నా ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అయితే కొబ్బరి నీరు తాగే సమయాన్ని బట్టి దాన్నుండి కలిగే ప్రయోజనాలు కూడా మారతాయి. ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే.. ఉదయాన్నే పరగడుపున.. ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది ఉదయాన్నే లేత కొబ్బరి బొండాం నీటిని తాగుతారు. అధిక వేడి శరీరం ఉన్నవారికి ఇది భలే ఉపయోగపుడుతుంది. ఎందుకంటే పరగడుపున కొబ్బరినీరు తాగితే శరీరంలో అధిక ఉష్టోగ్రత తగ్గిస్తుంది. భోజనం తరువాత.. భోజనం తరువాత కొబ్బరి బోండాం తాగేవారు తక్కువే. అయితే భోజనం చేసిన కొద్దిసేపటి తరువాత కొబ్బరి బోండాం నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి జీర్ణం కావడం సులువే.  కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడేవారు ఇలా భోజనం తరువాత కొబ్బరినీరు ట్రై చేయవచ్చు. నిద్రపోయే ముందు.. రాత్రి పడుకునేముందు పాలు తాగే వారు అధికం. కానీ పడుకునే ముందు కొబ్బరినీరు తాగితే మానసిక సమస్యలు చాలా దూరం ఉంటాయి. ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో టాక్సిన్ లు తొలగిస్తుంది. వ్యాయామం తరువాత.. అధికంగా వ్యాయామం చేసేవారు, ఆటగాళ్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల కొరత ఏర్పడుతుంది. అలాంటి సందర్బాలలో కొబ్బరి నీరు తాగడం వల్ల కోల్పోయిన  ఎలక్ట్రోలైట్లు భర్తీ అవుతాయి. ఆటలోనూ, వ్యాయామంలోనూ అలసిన శరీరానికి ఇది ఓదార్పును ఇస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.  తల్లి పాలలో లాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇదే పదార్థం కొబ్బరినీళ్లలో కూడా ఉంటుంది. దీని కారణంగా కొబ్బరినీరు తాగితే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మద్యం తాగాలని అనిపించినప్పుడు.. మద్యం తాగే అలవాటున్న చాలామంది తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటారు. కొందరు మద్యం మానేయాలని ప్రయత్నించినా అందులో సఫలం కాలేరు. అయితే మద్యం తాగాలని అనిపించినప్పుడల్లా కొబ్బరినీరు తాగాలి. మద్యానికి బానిసైనవారు మద్యం తాగకపోతే తల తిరిగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొబ్బరినీరు ఈ లక్షణాలు తగ్గిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లను కూడా భర్తీ చేస్తుంది.                                                         *నిశ్శబ్ద.

ఉపన్యాసకులు ఎలా ఉండాలి?

ఓ సభ నిండా శ్రోతలు ఉన్నప్పుడు వారి ముందు మాట్లాడటం, వారిని మెప్పించేలా మాట్లాడటం ఒక గొప్ప కళ. నేటి కాలంలో ఇలా మాట్లాడేవారు చాలా అరుదు. ఒకసారి చరిత్రలోకి చూస్తే…….. చికాగోలో ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు సమయం ఇచ్చేందుకే ఎవ్వరూ ఇష్టపడలేదు. అయిష్టంగా, మొక్కుబడిగా సమయం కేటాయించారు. ఐతే ఆరంభ వాక్యాలతోనే వివేకానంద అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. సంక్లిష్టమైన, మతపరమైన ఉపన్యాసాల నడుమ శ్రోతలను "సోదరసోదరీమణులు" గా సంబోధించటంతోటే శ్రోతల పైమెట్టునున్న వాడిలా కాక, వారిలో తానూ ఒకడైపోయాడు. విశ్వవేదికపై వివేకానందుడు ఓ శక్తిగా అవిర్భవించాడు. ఉపన్యాసాలిచ్చేవారు గమనించాల్సిన అంశం ఇది. వీలైనంత త్వరగా ఎదురుగా ఉన్న శ్రోతలతో సంబంధం ఏర్పరచుకోవాలి. శ్రోతల కన్నా తాను ఒక మెట్టు పైనున్న వాడిలా కాక తానూ శ్రోతలలో ఒకడన్న భావనను శ్రోతలకు కలిగిస్తే తోటే ఉపన్యాసకుడు. సగం విజయం సాధించినట్టే. ఆధునిక సమాజంలో 'వాజ్ పేయి' ఉపన్యాసాలంటే, సభల పేరు చెప్తే ఆమడ దూరం పారిపోయేవారు కూడా సభలకు పరుగెత్తి వస్తారు. ఇతర రాజకీయనాయకులంతా ఓ వైపు, ఉపన్యాసాలలో వాజ్ పేయి ఒక్కడూ ఓ వైపు. గమనిస్తే, వాజ్ పేయి ఉపన్యాసాలలో ఏ నాడూ తాను ఓ మెట్టు పైనున్నాడన్న భావన శ్రోతలకు కలగనివ్వడు. పైగా చమత్కార పూరితమైన సంభాషణలతో సభను అలరిస్తాడు. మామూలుగా మనం మాట్లాడే పదాలనే విరిచి పలకటం, వాటిని పలుకుతున్నప్పుడు తానూ ఆనందం అనుభవిస్తూ పలకటం, వల్ల వాజ్ పేయి మామూలు మాటలు కూడా సభలో ప్రేక్షకులను ఉర్రూతలూపుతాయి. పైగా, తన ఉపన్యాసంలో సమకాలీన సంఘటనలను, ప్రాంతీయఘటనలను వ్యంగ్యంగా ప్రస్తావించటంతో వాజ్ పేయి ఉపన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. వాజ్ పేయి తరువాత శ్రోతలను అంతగా అలరించేవి అబ్దుల్ కలామ్ ఉపన్యాసాలు. వాజ్ పేయి ధోరణికి, వాక్ శైలికి పూర్తిగా భిన్నమైంది అబ్దుల్ కలాం ధోరణి. అయితే ఇద్దరిలో మనం గమనించాల్సిన అంశం, వారు వీలైనంతగా శ్రోతలకు దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తారు. శాస్త్రవేత్తగా తన ఇమేజీని వాడుకుంటూ, ప్రతి ఒక్కరికీ మంచిని బోధించాలన్న నిజాయితీని ప్రదర్శిస్తూ, అబ్దుల్ కలామ్ శ్రోతలను స్ఫూర్తిమంతం చేయగలుగుతున్నాడు. గమనిస్తే రాజకీయ సంబంధిత ఉపన్యాసాలిస్తున్నప్పుడు అబ్దుల్ కలామ్ వ్యవహారశైలి మొక్కుబడిగా ఉంటుంది. అదే పిల్లల నడుమ, విద్యార్థుల నడుమ ఆయన చైతన్యంతో ఉట్టిపడుతూ, చైతన్యాన్ని కలిగిస్తాడు.  దీన్ని బట్టి గ్రహించాల్సిందేమిటంటే, ఉపన్యాసకుడు తనకు ఏ అంశాలపై పట్టు ఉందో, ఏ అంశంపై తాను శక్తిమంతంగా మాట్లాడగలడో తెలుసుకొని ఉండాలి. లేకపోతే వేదికనెక్కి అభాసుపాలు కాక తప్పదు. ప్రస్తుతం మన నాయకులనేకులకు తాము మాట్లాడాల్సిన అంశాలపై పట్టు ఉండదు. ఏదో రొటీన్ గా, మొక్కుబడిగా మాట్లాడతారు. దాంతో సభలంటేనే విసుగు పుడుతుంది. సాహిత్య సభలు కూడా ఇలాగే తయారయ్యాయి. సాహిత్యసభలు తమ పూర్వవైభవాన్ని కోల్పోవటం వెనుక ఉపన్యాసకులలో నిజాయితీ లోపించటం ప్రధానకారణం. పొగడ్తలతో ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేయటం, ఏ సభకు ఆ సభలోని వ్యక్తే కాళిదాసుకు పెద్దన్న అన్నట్టు మాట్లాడటం సర్వసాధారణమై పోయింది. విమర్శలు భరించే సహనం లేకపోవటంతో పొగడ్తలే దివ్యౌషధంగా మారాయి. దాంతో సాహిత్యసభలు విలువను కోల్పోయి పరిహాసాస్పదం అయ్యాయి. సభల్లో మాట్లాడేటప్పుడు ఉపన్యాసకుడు ముందుగా తాను మాట్లాడే అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండటం తప్పనిసరి, చమత్కారపూరిత సంభాషణ లేకున్నా, విభిన్నభావాలు ప్రదర్శించలేకున్నా, శ్రోతల దృష్టిని నిజాయితీగా, విజ్ఞానవంతంగా ఉండే ఉపన్యాసకుడు ఆకర్షించగలుగుతాడు. ఇలాంటి ఉపన్యాసకులే ప్రజల మనసుల్లో కూడా అంతో ఇంతో గుర్తుగా నిలిచిపోతారు.                                       ◆నిశ్శబ్ద.

విజయం సాధించాలంటే ఈ విషయాలను గుర్తంచుకోవాలి..!

మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాలను నేటికీ మనం మన పెద్దలు లేదా తెలిసిన వారి నుండి వినవచ్చు. భగవద్గీత యొక్క ఈ జ్ఞానం నేటి ఆధునిక యుగంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఈ బోధనలను తెలుసుకుని, వాటిని తెలివిగా అనుసరించి, వాటిని మీ జీవితంలో చేర్చుకుంటే, మీ పురోగతిని ఎవరూ ఆపలేరు. భగవద్గీతలో జీవిత సారాంశం ఉందని మన పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు మీ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. ఐతే భగవద్గీతలో మనిషి ప్రగతి సాధించాలంటే ఏం చేయాలి అని చెప్పారు..? మీ కోపాన్ని నియంత్రించుకోండి: కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది, గందరగోళం తెలివిని పాడు చేస్తుంది, బుద్ధి చెడిపోతే, తర్కం నాశనం అవుతుంది, తర్కం నాశనం అయినప్పుడు, వ్యక్తి నాశనం అవుతాడు. అందువల్ల అతను తన అన్ని పనులలో వైఫల్యాన్ని ఎదుర్కొంటాడు. అదే వీక్షణ: జ్ఞానాన్ని,  చర్యను ఒకటిగా చూసే వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎవరైతే జ్ఞాని అయినా లేదా అతను జ్ఞానవంతుడు అయినా, అతని అభిప్రాయం కూడా సరైనదే. ఏ సమస్యను ఏ కోణంలో చూడాలో ఆయనకు అవగాహన ఉంది. మానసిక నియంత్రణ: మన మనస్సు ఎప్పుడూ మన అదుపులో ఉండాలి. మన మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడే అన్ని కార్యాలలో విజయం సాధించగలుగుతాము. మనసును అదుపులో పెట్టుకోని వారికి మనస్సే శత్రువులా ప్రవర్తిస్తుంది. స్వపరీక్ష: పురోగతి సాధించడానికి స్వీయ మూల్యాంకనం చాలా ముఖ్యం. మనం చేస్తున్న పని, ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయం అన్నీ సరైనవేనా.? లేక తప్పా? దాని గురించి ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో మన హృదయాల్లోని అజ్ఞానపు సందేహాలను తొలగించి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంచుకుంటే, మీరు తప్పకుండా అందులో పురోగతి సాధిస్తారు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది: ఈ జీవితంలో మనం ఏమీ కోల్పోలేదు లేదా వృధా చేయలేదు. మీరు ఏమి చేసినా, దాని నుండి మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇది మీ జీవితాన్ని మార్చడానికి మీకు సహాయం చేస్తుంది. సాధన తప్పనిసరి: మనస్సు చంచలంగా ఉంటే లేదా మీ మనస్సును నియంత్రించడం మీకు కష్టంగా అనిపిస్తే, మీరు మంచి అలవాట్ల ద్వారా దానిని నియంత్రించవచ్చు. మీ మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడే మీ చర్యలు, మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి: మనిషి తాను సాధించాలనుకున్నది ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తే ఏదైనా సాధించగలడు. ఏ పని చేసినా అందులో నమ్మకం ఉంటేనే చేయాలి. ఇలా చేయండి: క్రియలో నిష్క్రియతను,  నిష్క్రియంలో చర్యను చూసేవాడు తెలివైనవాడు. ఈ వ్యక్తులు తాము చేసే పనిలో ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే సంతృప్తిని అనుభవిస్తారు.

ప్రాణాలను తీసే COPD మీద అవగాహన కావాలిప్పుడు..

COPD అనే పదం విన్నప్పుడు చాలామంది మహిళలలో ఎదురయ్యే PCOD ని పొరపాటున ఇలా చదివారా ఏమైనా అనే సందేహం వస్తుంది. అయితే అది ఇది వేరు వేరు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 ను ప్రపంచ COPD దినోత్సవంగా జరుపుకుంటున్నారు.   COPD అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది శ్వాస సంబంధ సమస్యల రుగ్మత. శ్వాస నాళాలు కుచించుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శ్వాస సంబంధ సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తాయి. ఎక్కువకాలం బ్రోన్కైటిస్ సమస్య కొనసాగడం, ఎంఫెసెమా వంటి రెండు శ్వాస సంబంధ వ్యాధులు  COPD లో చేర్చబడ్డాయి. అసలు COPD ని ఎందుకంత ప్రమాదకరమైన సమస్యగా చెబుతున్నారు? దీని ప్రభావమెంత? దీని కారణాలు, దీని నివారణా మార్గాలేంటి? తెలుసుకుంటే.. COPD అనేది ప్రపంచంలో ఎక్కువ మొత్తం  ప్రజల మరణాలకు కారణం అవుతున్న జబ్బులో మూడవది.  ఈ సమస్యలో రోగనిర్థారణ ఎంత త్వరగా జరిగితే అంత  తొందరగా చికిత్స తీసుకోగలుగుతారు.  ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు.  అయితే గత ముప్పై సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే COPD సమస్య ప్రభావం చాలా పెరిగింది. మరీ ఎక్కువగా గత 10 సంవత్సరాల నుండి COPD తీవ్రంగా ఉంది. కరోనా తరువాత ఇది ప్రాణాంతకంగా రూపొంతరం చెందింది. మనిషి శ్వాసించాలంటే ఊపిరితిత్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  అయితే COPD సమస్యలో ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. ఈ COPD లక్షణాలు కింది విధంగా ఉంటాయి. COPD సమస్య ఉన్నవారిలో ఛాతీ నుండి కఫం, శ్లేష్మంతో కూడిన దగ్గు వస్తుంది. ఛాతీ, ఊపిరితిత్తులలో తరచుగా ఇన్ఫెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఛాతీ చాలా బిగుతుగా ఉంటుంది. తుమ్ములు, ముక్కు కారడం, అలసట, బలహీనత వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఊపిరి తీసుకునేటప్పుడు గురక  వస్తుంటుంది. సాధారణంగా జలుబు వస్తే రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. లేదంటే నాలుగైదు రోజులు వేధిస్తుంది. మెడిసిడ్ వాడితే తగ్గిపోతుంది. కానీ COPD సమస్యలో జలుబు దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది. ఈ లక్షణాలు అన్నీ ఉన్నట్టైతే  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇది చాలామందిలో ధూమపానం, మద్యపానం కారణంగా వస్తుంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉండే వదిలేయాలి.                                                        *నిశ్శబ్ద.  

భవిష్యత్తును శాసించే బాలలు...

భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన పుట్టిన రోజును బాలల దినోత్సవం పేరిట జరుపుకుంటారు. నిజానికి ఐక్యరాజ్య సమితి బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకోవాల్సిందిగా ప్రకటించింది. కానీ భారతీయులు మాత్రం నవంబర్ 14న జవహార్ లాల్ నెహ్రూ జయంతి రోజునే జరుపుకుంటున్నాం. దీనికి కారణం జవహార్ లాల్ నెహ్రూ బాలబాలికల విద్యను ఎంతగానో ప్రోత్సహించారు.  తమ విద్యకు ఆయన అందించిన ప్రోత్సాహానికి పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకుని తమ ప్రేమను చాటుకున్నారు.  నవంబర్ 14వ తేదీనే బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పిల్లలకూ కొన్ని హక్కులున్నాయని, ఆ హక్కులకు అనుగుణంగా  వారు జీవించాలని బాలల దినోత్సవం నొక్కి చెబుతుంది. అంతే కాదు.. సమాజంలో పిల్లలకు విద్య అందడం నుండి వారి సంక్షేమం వరకు చాలా విషయాల గురించి ప్రభుత్వాలు చర్చిస్తాయి. పసిడి నవ్వుల చాచాజీ.. పుట్టినరోజు ఈ రోజు పిల్లల పండుగ ఈ నాడు ఈ గేయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. జవహార్ లాల్ నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచాజీ అని పిలుస్తారు. దీనివెనుక కారణం.. భారత్  బ్రిటీషర్ల చేతుల్లో నలిగి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఈ దేశాన్ని సరైన మా్ర్గంలో నడిపించే ఉద్దేశ్యంతో నెహ్రూ ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాల అనుగుణంగా ఆయన నిరంతరం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి వచ్చేది. ఆయనకు స్వతహాగా పిల్లలన్నా, గులాబీ పువ్వులన్నా ఎనలేని మక్కువ. ఈ కారణంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పిల్లలను చాలా ఆప్యాయంగా, ప్రేమగా పలకరించేవాడు, వారిని దగ్గరకు తీసుకునేవాడు. దీంతో పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూకు గులాబీలంటే మక్కువ అని తెలిసి గులాబీ పువ్వులతో ఆయన్ను చుట్టుముట్టేవారు. అలా పిల్లలకు ఆయన పట్ల ప్రేమాభిమానాలకు గుర్తుగానూ, పిల్లల విద్య కోసం ఆయన చేసిన కృషి ఫలితంగానూ ఆయన జయంతిని  బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈరోజున ఏం చెయ్యచ్చు.. పిల్లలకు కూడా రాజ్యంగంలో కొన్ని హక్కులున్నాయని చదువుకుంటూనే ఉన్నాం. కానీ నిజానికి పిల్లలకున్న హక్కుల గురించి  తెలిసిన వారు చాలా తక్కువ.  బాలల దినోత్సవం రోజున ఈ హక్కుల గురించి చర్చించి పిల్లలు వాటిని ఉపయోగించుకునేలా చేయాలి. చాలామంది పిల్లలకు విద్య, ఆహారం, స్వేచ్చ లభించడం లేదు. ఇటువంటి పిల్లలను గుర్తించి వారిని వారికి న్యాయం జరిగేలా చేయాలి. పిల్లలలో లింగ సమానత్వం పాటించాలి. మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ అనే చాదస్తపు ఆలోచనలు వదిలి పిల్లలను సమానంగా పెంచాలి. ఉరుకులు పరుగుల ఉద్యోగాల కాలంలో పిల్లలను పట్టించుకోవడం గురించి ఆలోచించాలి. వారికి తగినంత సమయం కేటాయించాలి. వారితో ప్రేమగా మాట్లాడాలి, ఆలోచనలు పంచుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో స్నేహితుల మాదిరిగా ఉండాలి. అలా ఉంటే పిల్లలు ఉత్తమ పౌరులుగా అభివృద్ది పెంచుతారు. తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతారు. బడి వయసు పిల్లలను బడికి వెళ్లేలా చేయడం, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట గుర్తుంచుకుని పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల విషయంలో బాధ్యతగా ఉండాలి.                                                     *నిశ్శబ్ద.

కార్తీక మాసం ఎందుకంత విశిష్టమైనది!

తెలుగు క్యాలెండర్  ప్రకారం ఏడాదిలో ఉన్న 12మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఆశ్వయుజ మాస  అమావాస్య నాడు వచ్చే దీపావళి మరుసటిరోజు నుండి కార్తీకమాసం మొదలవుతుంది.  ఇది తెలుగు క్యాలెండర్ లో ఎెనిమిదవ నెల. కార్తీకమాసంలో చాలామంది శివాలయ దర్శనం, దీపాలు వెలిగించడం, దైవభక్తిలో గడపడం చేస్తారు. అయితే కార్తీకమాసంలో కేవలం ఇవే ప్రధానం కాదు. కార్తీకమాసం ఎందుకంత గొప్పది? ఈ మాసం ప్రత్యేకత ఏమిటి? పురాణాలలో కార్తీకమాసం గురించి ఏం చెప్పబడింది? కార్తీకమాసంలో ఏ పూజ మంచిది?  వివరంగా తెలుసుకుంటే.. హిందూ క్యాలెండర్ లో కార్తీకమాసం చాలా విశిష్టమైనది. ఈ మాసం  విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం అంతా స్నానం, దానం, ధ్యానం, పూజలు మొదలైనవాటితో చాలా భక్తిపూర్వకంగా గడిచిపోతుంది. ఈ మాసం పుణ్యఫలాలను ఇస్తుందని సాక్షాత్తూ ఆ విష్టు భవనానుడే చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అన్ని మాసాలలోకి కార్తీక మాసం చాలా శ్రేష్టమైనదని బ్రహ్మ దేవుడు కూడా చెప్పినట్టు పురాణ కథలున్నాయి.  ఇకపోతే కార్తీకమాసంలో ఎవరైనా తీర్థయాత్రలు చెయ్యాలని అనుకుంటే దానికి నారాయణ తీర్థం లేదా బదరికాశ్రమం చాలా ఉత్తమమైనదని పండితులు, పురాణ కథనాలు చెబుతున్నాయి. కార్తీక మాసం గురించి పురాణ గ్రంథాలలో ..  "న కార్తీకసమో మాసో న కృతేన్ సమం యుగం   న వేదం సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం" అని ఉంది. అంటే.. కార్తీకమాసం లాంటి మాసం లేదు, సత్యయుగం లాంటి శకం లేదు, వేదాల వంటి గ్రంథాలు లేవు, గంగ వంటి తీర్థం లేదు అని అర్థం.  కార్తీక మాసంలో దేవుడి అంశ బలపడుతుంది. ఈ మాసంలో విష్టుభగవానుడిని తులసితో పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు.  ఈ మాసంలో జ్ఞానం, లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. కేవలం ఈ పూజలు మాత్రమే కాకుండా గంగాస్నానం, దీపదానం, యజ్ఞం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. నదీ స్నానం.. దీపాలు వదలడం వెనుక కారణం.. కార్తీక మాసంలో స్నానానికి పెద్ద  పీట వేస్తారు. పారే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతాయని, పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. అయితే నదీ స్నానం వెనుక ఉన్న ముఖ్య కారణం చూస్తే.. "శ్రేష్ఠో దేవాన మధుసూదన్ తీర్థ నారాయణాఖ్యాం హి త్రితాయాం దుర్లభం కలౌ ।"  అని స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ప్రకారం శ్రీమహావిష్ణువు నెలకొని ఉండే విష్టుతీర్థం లాగా కార్తీకమాసం కూడా  గొప్పది అని అర్థం. ఇంకొక కారణం చూస్తే..  కార్తీక పూర్ణిమ రోజున మహదేవుడు లేదా పరమేశ్వరుడు త్రిపురాసుడు అనే రాక్షసుడిని సంహరించాడు. విష్ణుమూర్తి కూడా మత్స్య అవతారం ఎత్తాడు.  కార్తీకమాసం అంతా విష్ణువు మత్స్య అవతారంలో నీటిలో నివసిస్తాడు. అలాంటి పవిత్రమైన సమయంలో ఉదయాన్నే నీటిలో స్నానం చేయడం, నీటిలో దీపాలు వదిలడం చేస్తే పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీకమాసంలో గంగాస్నానం చేయడానికి దేవతలే భూలోకానికి వస్తారని కూడా అంటారు. అందుకే పారే నీటిలో స్నానం చేయడం పుణ్యప్రదం.                                                  *నిశ్శబ్ద.

దీపావళి పండుగ అంతరార్థం!

మన దేశంలో జరుపుకుంటున్నన్ని పండుగలు ఏ ఇతర దేశాల్లోనూ జరుపుకోరు. అయితే ఇన్ని పండుగలనూ, పర్వ దినాలనూ ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? పండుగ రోజున అభ్యంగనస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకుని తినడం, బంధు మిత్రులతో సంతోషంగా గడపడం… పండుగలు జరుపుకోవడంలో ఇంతకన్నా వేరే ప్రయోజనాలు లేవా? అని తరచి చూస్తే.. సత్ప్రవర్తన, సదాచారాలను అలవరచు కోవడానికీ. సంస్కృతీ, సంప్రదాయాలను ఇనుమడింపజేసుకోవడానికీ ఉద్దేశించినవే పండుగలు. జీవితం అనే నదికి సంస్కృతీ సంప్రదాయాలు రెండు తీరాల లాంటివి. అందులో ప్రవహించే నీరే ధర్మం. మోక్షానికి ఆధారమైన ధర్మాన్ని ఆచరించినప్పుడే అనంతమయిన సముద్రంలో నది సంగమించినట్లు మానవుడు మాధవునిలో ఐక్యం చెందుతాడు. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇదే మానవ జన్మ పరమార్థమైన 'మోక్షం'. దేశమంతటా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగల్లో 'దీపావళి' ఒకటి. మన జీవితాల్లో దుఃఖమనే చీకటి పోయి సంతోషమనే వెలుగు వెల్లివిరియాలని, అజ్ఞానమనే చీకటి పోయి జ్ఞానకాంతులు విరాజిల్లాలనీ ఆకాంక్షిస్తూ జరుపుకొనే పండుగ 'దీపావళి'. మన జీవితాలు శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలంటే మనలో సత్యధర్మాలు, త్యాగం, సేవాభావాలనే సుగుణాలు వికసించాలి. అలాగే అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధన చేయాలి. దీపావళి పండుగకు సంబంధించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటిలో నరకాసురుని సంహారం ఒకటి. ప్రాగ్జ్యోతిష పురాన్ని నరకాసురుడు పాలించేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని హింసించేవాడు. నరకాసురుని బారి నుండి తమను రక్షించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధం చేసి, నరకాసురుణ్ణి సంహరించాడు. అసురులు పెట్టే బాధల నుండి విముక్తి కలిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం 'దీపావళి' పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది..  శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు  దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెందాడ నీ ప్రావీణ్యంబులు సూడఁగోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి నన్నీ వెంటం గొనిపొమ్ము.. అని సత్యభామ అడుగుతుంది.   'ప్రభూ! నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ ప్రావీణ్యం చూడాలని కోరికగా ఉంది. ప్రాణనాథా! నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని పొమ్ము” అని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది.  అప్పుడు శ్రీకృష్ణుడు రణరంగం విహార స్థలం కాదనీ అక్కడ వినిపించేవి తుమ్మెదల ఝంకారాలు కావనీ.. భయంకరమైన ఏనుగుల ఘీంకారాలనీ.. అక్కడ ఉన్నవి రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షస సైన్య సమూహాలు అనీ సత్యభామను నిరుత్సాహపరుస్తాడు. అప్పుడు సత్యభామ దానవులైన నేమి? మఱి దైత్య సమూహము లైన నేమి? నీ మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక?.. అని అంటుంది.  "ప్రభూ! దుర్గాల్లాంటి నీ బాహువులు నాకు అండగా ఉండగా రాక్షస సైన్యం వల్ల నాకేం భయం?”. అని శ్రీకృష్ణునిపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి సత్యభామను తనతోపాటు యుద్ధ రంగానికి తీసుకువెళ్ళాడు. వీణను కూడా పట్టుకోవడం చేతకాని సత్యభామ విల్లును ఎలా పట్టుకుంటుందీ, దారానికి ముత్యాలు గుచ్చలేని కోమలి వాడి అయిన బాణాలను ఎలా సంధిస్తుందీ అని అందరూ సందేహించారు. అందరి సందేహాలూ పటాపంచలయ్యేలా సత్యభామ బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని యుద్ధ రంగం నుండి పారిపోయేలా చేసింది. అప్పుడు 'విజయం నిన్నే వరించింది' అంటూ సత్యభామ ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి వరకూ యుద్ధమంటే తెలియని సత్యభామ అంతటి పరాక్రమాన్ని ఎలా ప్రదర్శించగలిగింది? ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చింది? సత్యభామకు ధైర్యసాహసాల్ని ప్రదర్శించే శక్తి శ్రీకృష్ణుని నుండి వచ్చింది. ఓ భార్యకు భర్త అండ ఉంటే దక్కిన విజయమది. స్త్రీలో అంతర్లీనంగా ఉన్న శక్తి బయటకు వచ్చి చేకూర్చిన విజయమది. ప్రతి మహిళకు ఇలాంటి సహకారం తప్పనిసరిగా అవసరం.                                   *నిశ్శబ్ద.

పిల్లలు హోం వర్క్ చేయడానికి అయిష్టంగా ఉంటారా? ఇలా చేస్తే..

చిన్నపిల్లలకు స్కూలుకు వెళ్లడమన్నా, ట్యూషన్లకు వెళ్ళడమన్నా, హోం వర్క్ చెయ్యడమన్నా అస్సలు ఇష్టముండదు. పిల్లలు ఎప్పుడూ ఆడుకోవడానికి, కార్టూన్స్ చూడడానికి ఇష్టపడతారు. కానీ పిల్లలను స్కూలుకు పంపడం మొదలుపెట్టిన తరువాత వారు ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవరకు కూడా తల్లిదండ్రులు పిల్లలతో హోం వర్క్ చేయించాల్సి ఉంటుంది.  కానీ పిల్లలు హోం వర్క్ చేయడానికి ససేమీరా ఒప్పుకోరు. మొండి చేస్తారు. అలాకాకుండా పిల్లలు హ్యాపీగా హోం వర్క్ చేయాలంటే ఈ కింది టిప్స్ పాటించాలి.. పిల్లలకు హోంవర్క్‌ని సులభతరం చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచాలి. పిల్లలు చదువుకునే ప్రదేశంలో ప్రశాంతత,  తగినంత వెలుతురు ఉండాలి. పిల్లల దృష్టిని మరల్చేది ఏమీ ఉండకూడదు. పిల్లలకి పెన్ను, కాగితం, రిఫరెన్స్ మెటీరియల్ ఉండాలి. కేవలం చదువులకే ప్రత్యేక స్థానం కల్పించడం వల్ల పిల్లల ఏకాగ్రత, ఉత్పాదకత రెండూ పెరుగుతాయి.  పిల్లలకు సమయ నిర్వహణ నేర్పాలి..  పిల్లలకు సమయ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను నేర్పాలి. ఉదాహరణకు టైమర్‌ను 25 నిమిషాలు సెట్ చేసి, ఆపై చిన్న విరామం తీసుకోమనాలి. పోమోడోరో టెక్నిక్ అని పిలిచే ఈ టెక్నిక్ ఉత్పాదకతను పెంచుతుంది.  మానసిక అలసటను తగ్గిస్తుంది. చిన్న చిన్న బ్రేక్ ల వల్ల పిల్లలకు విసుగు రాదు. ఇది మాత్రమే కాకుండా  పిల్లల చదువులో వారికి సహాయం చేయడానికి పుస్తకాలు లేదా విద్యా వెబ్‌సైట్‌ల వంటి వాటిని  యాక్సెస్ చేయడానికి వారిని అనుమతించాలి. ఎక్కువ వనరులు అందుబాటులో ఉంటే పిల్లలు స్వతంత్రంగా పనిని పూర్తి చేయడం సులభం అవుతుంది. తల్లిదండ్రులు తమ దృష్టిని గ్రేడ్‌ల  మీద కాకుండా పిల్లల చదువు మీదనే ఉంచాలి. గ్రేడ్లు, ర్యాంకులు పిల్లలమీద ఒత్తిడి కలిగిస్తాయి.  ప్రశ్నలు అడగడానికి, విషయాలను లోతుగా అన్వేషించడానికి,  వాటిని  పూర్తిగా అర్థం చేసుకోవడానికి  పిల్లలను ప్రోత్సహించాలి.  జ్ఞానం,  వ్యక్తిగత అభివృద్ధి   ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి. మైక్రోమేనేజింగ్‌ను నివారించాలి..  పిల్లల హోంవర్క్‌ను మైక్రోమేనేజింగ్ పద్ధతిలో నిర్వహించకూడదు. చాలామంది  దీనివల్ల  నిరాశ,  ప్రతిఘటనకు లోనవుతారు. దీనికి బదులుగా పిల్లలకు హోంవర్క్ చేయడంలో  మద్దతు ఇవ్వడం,  మార్గదర్శకత్వం అందించండం చేయాలి. దీనివల్ల   పిల్లవాడు తన స్వంత పనులను  సులువుగా పూర్తీ చేస్తాడు.                                                         *నిశ్శబ్ద  

ఈ వ్యక్తులతో స్నేహం చేయండి, వారు చాలా దయగలవారు!

మంచి హృదయం ఉన్న వ్యక్తులు అని చెప్పినప్పుడు, మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి కరుణ, నిజాయితీ, వినయం. ఒక్క మాటలో చెప్పాలంటే, వీరు ఇతరుల కంటే మృదువైన,  సున్నితమైన లక్షణాలను కలిగి ఉన్నారని చెప్పడం తప్పు కాదు. అలాంటి మంచి మనసున్న వారిని ఎలా గుర్తించాలి అని మీరు ఒక సారి ఒక ప్రశ్న అడగవచ్చు. కొంతమంది చాలా కూల్‌గా ఉంటారు. మరికొందరు చాలా వినయంగా ఉంటారు.  కానీ ఇతరులపై కనికరం చూపే వారు చాలా అరుదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూపుతున్న కనికరాన్ని కూడా అనుమానించేవాళ్లు ఉన్నారు. నేటి ప్రపంచంలో జరుగుతున్న మోసాల కారణంగా ప్రజలు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను అంత సులభంగా విశ్వసించడం లేదని అర్థం. కొన్ని రాశిచక్రాల వ్యక్తులు మొదటి నుండి అత్యంత అందమైన హృదయాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. మీరు స్నేహం చేయడానికి మంచి వ్యక్తి కోసం చూస్తున్నట్లయితే, ఈ మూడు రాశులను ముందుగా పరిగణించవచ్చు. 1. కర్కాటకం: కర్కాటకం చంద్రునిచే పాలించబడుతుంది, అంటే ఇది ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మరొక వ్యక్తి ముందు వారు తమ భావాలను ఎలా వ్యక్తం చేస్తారో వారి హృదయాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. దానితో పాటు, ఇది ఈ రాశిచక్రాన్ని చాలా భావోద్వేగ గుర్తుగా చేస్తుంది. ఈ సంకేతం యొక్క వ్యక్తులు గొప్ప సున్నితత్వం కలిగి ఉంటారు, వారు ప్రతిదీ హృదయపూర్వకంగా తీసుకుంటారు. వారు తమ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని.. వారి కోసం తమ సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటారు. వారు చాలా సానుభూతి కలిగి ఉంటారుజ వారి అవసరాల కంటే ఇతరుల అవసరాలకు విలువ ఇస్తారు. 2. కన్య: బాహ్యంగా, కన్యలు ఆచరణాత్మక, విమర్శనాత్మక, విరక్త జీవులు. ఈ రాశి వారి మనసులోని భావాలపై చాలా ఆధారపడి ఉంటుంది. కన్య రాశి వారు రహస్యంగా చాలా సెన్సిటివ్, మృదుహృదయం కలిగి ఉంటారని చాలా మందికి తెలియదు. అతని గురించి విమర్శలు ప్రియమైనవారి నుండి,  తిరస్కరణ భయం నుండి వస్తాయి. వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.  వారు ఎల్లప్పుడూ వారి నిజాయితీ మరియు సహాయానికి అంకితమై ఉంటారు. 3. మీనం: మీనం రాశి వారు చాలా సున్నితమైన జీవులు. నిజానికి, అవి రాశిచక్రం యొక్క అత్యంత సున్నితమైన సంకేతాలలో ఒకటి. వారు దయ, నిస్వార్థ,  సానుభూతి గలవారు. అతను తన దయ,  దాతృత్వానికి కూడా ప్రసిద్ది చెందారు, ఎల్లప్పుడూ అవసరమైన వారి కోసం చూస్తున్నాడు. అతని మనసు, హృదయం చాలా అందంగా ఉన్నాయి. ఈ మూడు రాశుల వారికి మంచి హృదయం ఉన్నందున, ఇతర రాశుల వారికి మంచి హృదయం లేదని కాదు. అన్ని రాశుల కంటే ఈ మూడు రాశులు హృదయాన్ని తాకుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

మనిషి డబ్బు విషయంలో ఎలా  ఉండాలంటే..

   ధనం మూలం ఇదం జగత్.. అని ఓ గొప్ప మాట చెప్పారు. ఈ ప్రపంచం ధనంతోనే నడుస్తోందన్నది ఆ మాటకు అర్థం. ధనమేరా అన్నిటికీ మూలం.. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని ఓ పాట కూడా ఉంది. డబ్బు విలువ తెలుసుకోవడం మనిషి ధర్మం అన్నది  ఆ పాట వాక్యాలలో అర్థం. ప్రస్తుతకాలంలో మనిషి జీవితాన్ని డబ్బు ఎంతగా ప్రభావితం చేస్తోందో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న మొత్తానికే దారుణాలకు పాల్పడుతున్నవారు ఉన్నారు. డబ్బు సులువుగా సంపాదించడానికి టెక్నాలజీని  ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు రాజ్యాల కోసం తోడబుట్టినవారిని రాజులు బలితీసుకుంటే ఇప్పటికాలంలో ఆస్తుల కోసం, పదవులకోసం రక్తం పంచుకుపుట్టిన వారి ప్రాణాలనే తీస్తున్నారు. మొత్తానికి డబ్బు ఈ ప్రపంచాన్ని ఆడిస్తోందన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మనిషి చేతిలోనే రూపొందిన డబ్బు మనిషినే శాసించడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అందుకే మనిషి డబ్బు గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. డబ్బు విషయంలో మనిషి ఎలా ఉండాలో  నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డబ్బు అవసరం.. ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరమే. చేతిలో రూపాయి లేకుండా ఎక్కడా బ్రతకలేడు నేటికాలం మనిషి. కష్టపడటం, సంపాదించుకోవడం, చదువులు, జీవనం, ఆహారం,  వసతి.. ఇలా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి డబ్బుకు విలువ ఇవ్వడం మంచిదే. మనిషి డబ్బుకు ఇచ్చే విలువ అంతా తను సంపాదించే విధానంలోనే ఉంటుందని కొందరు అంటారు. కష్టపడి సంపాదించే వాడు ఒక్క రూపాయి వృధాగా ఖర్చు చేయాలన్నా చాలా బాధపడతాడు. ఒక్క  రూపాయి ఇతరుల చేతిలో మోసపోయినా తనను తాను సంభాళించుకోలేడు.  అయితే కష్టానికి. డబ్బుకు మధ్య ఉన్న కోణాన్ని వదిలేస్తే డబ్బును  కేవలం అవసరమైన వస్తువుగా చూడటం వల్ల అది మనిషి మీద చూపించే ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకే బ్రతకడం కోసం డబ్బు సంపాదించుకోవాలి అంతే కానీ డబ్బు కోసమే బ్రతకకూడదు అని అన్నారు విజ్ఞులు. ఈజీ మనీ.. ఈ కాలంలో చాలామంది కుర్రాళ్లు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కష్టపడకుండా ఇతరుల సొమ్మును సులువుగా చేజిక్కించుకోవడం, దానితో జల్సా జీవితాలు గడపడం ఎక్కువైపోయింది. కానీ ఇలాంటి మార్గాలలో వచ్చే సొమ్ము దీర్ఘకాలం జీవితాలను నిలబెట్టదనే విషయం తెలుసుకోవాలి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసినా వారి మీద ఉన్న ప్రేమ కొద్దీ వారిని ఏమీ అనకుండా నిమ్మకు నీరెత్తినట్టు  ఉంటారు. ఇలాంటి వారు చేజేతులా తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని గ్రహించాలి. ప్రాధాన్యత.. డబ్బుకు గుణం అంటూ ఏమీ లేదు. దాన్ని మనిషి ఎలా   ఉపయోగిస్తే అది దానికి అనుగుణమైన ఫలితాలను మనిషికి అంటిస్తుంది. మంచి, చెడు, కోపం, అసూయ, ద్వేషం.. ఇలా పాజిటివ్.. నెగిటివ్ గుణాలను డబ్బు మనిషిలో నింపుతుంది. అందుకే డబ్బును తటస్థ వస్తువుగా చూడాలి. దాన్ని  ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడాలి తప్ప డబ్బే పరమావధిగా  ఎప్పుడూ బ్రతకకూడదు. డబ్బు మనిషికి అవసరమైనదే అయినా దానికోసం అస్తమానూ ఆరాటపడే మనిషికి జీవితంలో సుఖం అనేది ఎప్పటికీ దక్కదు. అందుకే డబ్బును దానిలాగే చూడాలి. మనుషులతో కంపేర్ చేయకూడదు.                                                                              నిశ్శబ్ద.         

తప్పు చేసినవారిని తిట్టడం మంచిదేనా?

జరిగిపోయిన తప్పుల కన్నా, వాటి తాలూకు జ్ఞాపకాలే మనల్ని చాలా నిరాశకు గురిచేస్తాయి. నిస్సత్తువను ఆవహింపజేస్తాయి. ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో? అనే ఆలోచనలు ఆందోళనకు గురిచేస్తాయి. కానీ ప్రపంచానికి మన పొరపాట్లను పట్టించుకునే తీరిక ఉండదు. ఒకవేళ ఆ క్షణాలకు అది చర్చనీయాంశమైనా, మరుక్షణం లోకం మనల్నీ, మన తప్పులనూ మరచిపోతుంది. వారి నిందలతో మనం నిరాశకు గురి కావలసిన అవసరం లేదు. 'అవును! తప్పు జరిగిపోయింది దాన్ని దిద్దుకునే అవకాశం కూడా నాకే ఉంది' అని మనకు మనమే ధైర్యం నూరిపోసుకోవాలి.  నీకు నీవే తోడూనీడ! తప్పుకు తలదించుకోవలసిన పని లేదు. తలబిరుసుగా, అహంకారంగా తప్పిదాన్ని సమర్థించు కోవడమూ సరి కాదు. కానీ తప్పు ఎందుకు జరిగిందో విశ్లేషించుకొని, సమీక్షించుకొని సవరించుకోవాలి. అలా కాకుండా బేలగా విలవిల లాడిపోతే మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే ఆంగ్ల మేధావి మార్క్ ట్వెయిన్ 'మనం తప్పిదాల అనుభవం నుంచి అది నేర్పిన విజ్ఞతను మాత్రమే స్వీకరించాలి. లేకపోతే మనం వేడిపొయ్యి మీద కూర్చోబోయిన పిల్లిలా అయిపోతాం. ఆ పిల్లి భవిష్యత్తులో వేడిపొయ్యి మీద కూర్చోవడం అటుంచి, భయంతో ఆరిన పొయ్యి మీద కూడా కూర్చోదు' అంటారు. పొరపాట్లు జరుగుతాయేమో, నిందలు పడాల్సి వస్తుందేమోనన్న అపోహలతో అసలు ప్రయత్నమే మానుకుంటే మనం ఎందుకూ కొరగాకుండా పోతాం!   మన సహచరుల్లో, సహోద్యోగుల్లో, మన కుటుంబసభ్యుల్లో కానీ ఎవరి వల్లనైనా పొరపాట్లు జరిగితే వాటిని భూతద్దంలో చూస్తూ రాద్దాంతం చేయకూడదు. ఆ వ్యక్తి అపరాధభావంతో కుమిలిపోయేలా ప్రవర్తించకూడదు. ముద్దాయిలా బోను ఎక్కించి, నిందలు, ప్రశ్నలు గుప్పించ కూడదు. ఆ వ్యక్తి స్థానంలో మనం ఉండి ఆలోచించాలి. సంయమనంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నాయకుడిగా నలుగురినీ ముందుకు నడిపించాల్సిన వ్యక్తి, తండ్రిగా తన వారికి మార్గదర్శకత్వం వహించి తను ముందు నడవాల్సిన వ్యక్తి తన వారి తప్పులను సహృదయంతో మన్నించగలగాలి. మాటతో కన్నా మౌనంతో వారి మనస్సును మార్చగలగాలి. తాము పొరపాట్లు చేస్తే శ్రీరాముడు ఒక మాట అంటాడని కాకుండా, అన్నయ్య తనే మనస్సులో బాధపడుతూ తమతో మాట్లాడకుండా ఉంటాడేమోనని ఆ తమ్ముళ్ళు ఆలోచించేవాళ్ళట. అంత విశాలహృదయం రఘురాముడిది. అలా తమ వెంట నడిచే వారి తప్పులను సహృదయంతో సరిదిద్దగలిగి ఉండాలి. ఎదుటివ్యక్తి చేసిన పొరపాటును నలుగురి ముందూ ఎత్తి చూపి, విమర్శిస్తే అతని పరిస్థితి మరింత దిగజార్చినవాళ్ళమవుతాము. వారు తమ తప్పును సవరించుకోవడం వదిలేసి, ఆ అవమానంతో మరింత కుంగిపోతారు. ఇలా మనతో కలసి పనిచేసే వారి తప్పిదాలను పరుషవాక్యాలతో చెణకుతూ ఉత్తమ ఫలితాలను రాబట్టలేం.                                           *నిశ్శబ్ద.

ఈ విషయాలు ఎవరితోనైనా చెప్పారో..జీవితాంతం పశ్చాత్తాపడాల్సిందే..!

ఆచార్య చాణక్యుడు తన జ్ఞానం, బోధనలు, నైతికతకు నేటికీ ప్రసిద్ధి చెందాడు. మన జీవితంలో చాణక్యుడి సూత్రాలను పాటించడం ద్వారా మనం విజయవంతమైన జీవితాన్ని పొందవచ్చు. డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం మొదలైన అనేక అంశాలపై చాణక్యుడు తన నీతిలో చాలా ఆలోచనలను వివరించాడు. ఆయన సూత్రాలకు నేటికీ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి తన జినాలోని కొన్ని ఆలోచనలను ఇతరులతో పంచుకోకూడదని చెప్పాడు. ఈ విషయాలు ఎల్లప్పుడూ దాచుకోవాలి.  ఎందుకంటే ఇది మనకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఇతరుల నుండి ఎప్పుడూ దాచవలసిన ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాం. మీ వయస్సు గురించి: ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి తన వయస్సు గురించి ఎవరికీ చెప్పకూడదని.. అతని వయస్సును ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలని చెప్పాడు. ఎందుకంటే మీ శత్రువులు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. బహుమతిని రహస్యంగా ఉంచండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, గురువు ఏదైనా ప్రత్యేక మంత్రాన్ని లేదా జ్ఞానాన్ని ఒక వ్యక్తికి అప్పగిస్తే, అతను దానిని మరెవరికీ చెప్పకూడదు. దానధర్మం చేయడం పుణ్య కార్యంగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇతరుల ముందు దానధర్మం చెప్పకూడదు.  మీరు మతపరమైన కార్యకలాపాల కోసం ఇచ్చిన విరాళాల గురించి ఎవరితోనూ పంచుకోకూడదు. ఎందుకంటే మీరు దీని నుండి ఎటువంటి పుణ్యాన్ని పొందలేరు. వైవాహిక జీవితం గురించి: వైవాహిక జీవితం అనేది భార్యాభర్తల మధ్య ప్రేమ, సంరక్షణ నుండి కలహాల వరకు అనేక అంశాలను కలిగి ఉంటుంది. చాలా విషయాలు  రహస్యంగా ఉంటాయి, అటువంటి పరిస్థితిలో, మీరు మీ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను మూడవ వ్యక్తితో పంచుకుంటే, మీ ఇద్దరికీ నష్టం జరగవచ్చు. మీ వైవాహిక జీవితం గురించి చాలా మంది ఆడుకోవచ్చు. సంపద గురించి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, తన సంపద, సంపాదన గురించి ఎవరికీ చెప్పకూడదు. మీరు ఎల్లప్పుడూ మీ ఆదాయాలను గోప్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రజలు దానితో మిమ్మల్ని బాధపెడతారు. పై ఆచార్య చాణక్యుడి ఆలోచనలను మనం ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. లేకపోతే, అది మీకు మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఇది మిమ్మల్ని కోపం..అసంతృప్తికి గురి చేస్తుందని గుర్తుంచుకోండి.  

ప్రకృతి గర్జిస్తే.. సునామీ ప్రళయం..

పంచభూతాలలో ప్రతి దానికి ప్రత్యేకత ఉంది. సకల జీవులకు దాహం వేస్తే నీరు తాగుతారు. ఆ నీరు ఉగ్రరూపం దాలిస్తే కల్లోలమే.  ఈ కల్లోలానికి కేరాఫ్ అడ్రస్ గా సునామీని చెప్పుకోవచ్చు. ప్రకృతీ వైపరీత్యంలో భాగమని చెప్పుకున్నా ఈ సునామీలకు కారణం ప్రజల చర్యలే అన్నది అంగీకరిచాల్సిన సత్యం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ సునామీ బారిన పడి తీవ్ర నష్టాన్ని రుచిచూసే  ఉన్నాయి.  సునామీలు ఊళ్లను, పట్టణాలను కూడా తుడిచిపెట్టేస్తుంటాయి. ఇవి చాలా అరుదే అయినా వీటి వల్ల కలిగే నష్టం మాత్రం  మాటల్లో వర్ణించలేనిది. ఈ సునామీల గురించి అవగాహన కలిగించే ఉద్దేశ్యంతో మొట్టమొదటిసారిగా జపాన్ దేశం ప్రపంచ సునామీ దినోత్సవాన్ని నిర్వహించింది. అసలింతకూ ఈ రోజు మొదలు పెట్టడం వెనుక కారణం ఏంటి? ప్రపంచ సునామీ దినోత్సవం రోజున ఏం చేస్తారు? వివరంగా తెలుసుకుంటే.. నిర్ణయం..  డిసెంబర్ 22, 2015న ఐక్యరాజ్యసమితి తీర్మాణం ద్వారా ప్రతి ఏడాది నవంబర్ 5వ తేదీన ప్రపంచ సునామీ  దినోత్సపం జరుపుకోవాలని నిర్ణయించారు.  సునామీలు ప్రపంచంలో అత్యంత విశానకాన్ని కలిగించే  ప్రకృతి విపత్తులు. వీటికి ఎలాంటి సరిహద్దులు, నియమాలు అంటూ లేవు. తన ఉగ్రరూపంలో, ఉదృతంగా ప్రవహిస్తూ తనలో సమస్తాన్ని కలిపేసుకుంటూ సముద్రం సాగిపోవడమే సునామీ.  ఈ సునామీల వల్ల చాలావరకు నష్టం తీరప్రాంతాలకే పొంచి ఉంటుంది. ఇవి చాలా ప్రమాదకరమైనవి అయినా ఇవి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. కారణాలు.. సునామీలు రావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో భూమి బలంగా కదలడం అంటే భూకంపం, సముద్రంలో అగ్నిపర్వత పిస్పోటనాలు సంభవించడం మొదలైన కారణాల వల్ల నీరు చాలా దూరం ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గ్రహించి నష్టాన్నినివారించడానికి  ప్రయత్నాలు చేయడం, అందరికీ అవగాహాన కలిగించడం, సునామీ సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో  ప్రణాళికలు రచించడం ఈ ప్రపంచ సునామీ అవగాహనా దినోత్సవం ప్రత్యేకత. చరిత్రలో ఏముంది? గత 100సంవత్సరాల కాలాన్ని గమనిస్తే దాదాపు 58 సునామీలు సంభవించాయి. ఈ సునామీలలో సుమారు 2,60వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇది ప్రకృతి వైపరీత్యాల కంటే చాలా ఎక్కువ నష్టమని, ఇది అవగాహనా లోపం, నియంత్రిణా లోపమని అంటున్నారు.  ఈ 100 ఏళ్లలో సంభవించిన సునామీలలో 2004, డిసెంబర్ లో హిందూమహాసముద్రం సునామీలో అదిక మరణాలు సంభవించాయి.  ఇండోనేషియా, శ్రీలంక, బారతదేసం, థాయ్ లాండ్ సహా 14దేశాలలో సుమారు 2,27వేల మంది మరణించారు. ఆ తరువాత కేవలం మూడు వారాల తరువాత జపాన్లోని కోబ్ లో అతర్జాతీయ దేశాలు సమావేశమయ్యాయి. హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ ను ఆమోదించాయి.  ఈ ఒప్పందమే విపత్తు ప్రమాదాలను తగ్గించే దిశగా రూపొందిన మొట్టమొదటి ప్రపంచ ఒప్పందం. ప్రపంచంలో సునామీలు.. తేదీలు.. మరణాలు.. ప్యూర్టో రికోలో సునామీ.. ప్యూర్టో రికో పశ్చిమ తీరంలో భూకంపం,  సునామీ కారణంగా 118 మంది మరణించారు. ఇది 1918లో జరిగింది. అలాస్కా సునామీ..  కాలిఫోనియాలోని క్రెసెంట్ సిటీ వరకు అలస్కా సునామీ సంభవించింది. ఇది  110 మరణాలకు కారణమైంది. ఇది  1964లో జరిగింది. 2004 హిందూ మహాసముద్రం సునామీ..  ఈ సునామీ సమయంలో హిందూ మహాసముద్రం సుమత్రాలో 65 నుండి 100 అడుగుల ఎత్తుకు చేరుకుంది.   ఇండోనేషియా నుండి తూర్పు ఆఫ్రికా వరకు 2లక్షల కంటే ఎక్కువ మరణాలకు కారణమైంది.                                                   *నిశ్శబ్ద.