education with human values for every one

ఇలాంటి విద్య ప్రతి ఒక్కరికీ అవసరం!

విద్యార్థులు ఆటలు, పాటలు, విహారయాత్రలకు స్వస్తి చెప్పి చదువుల తల్లి చెంతకు చేరే సమయం ఆసన్నమైంది. పాఠశాల చదువులు ముగించి కళాశాలకు పోయే విద్యార్థులు కొందరైతే, కళాశాల చదువులు పూర్తిచేసి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేవారు మరికొందరు. అలాగే విశ్వవిద్యాలయాలకు వీడ్కోలు చెప్పి విదేశాలకెగసే విద్యార్థులు మరెందరో! గదులు మారి తరగతులు పెరిగినా,  గతులు వేరై ఘనకార్యాలు  సాధించినా… మేధావులు సృష్టించిన నేటి మన విద్యావిధానం మహాత్ముల్ని సృజించడంలో  విఫలమవుతుంది. వైజ్ఞానికంగా ఎంత ఎదిగినా వివేకపథంలో వెనుకంజ వేస్తుంది. నేటి సమాజంలో సత్యధర్మాలు, సేవా త్యాగాల్లాంటి... విలువలు మానవతా గగనకుసుమా లయ్యాయి. సంఖ్యలకే ప్రాధాన్యతనిచ్చే విద్యతోపాటు నడవడికలో నాణ్యతను పెంచే విద్య చాలా అవసరం. అక్షరజ్ఞానంతో పాటు విజ్ఞానం తోడైనప్పుడే మానవతా విలువలు భాసిల్లుతాయి. చదువుతో పాటు సంస్కారాన్ని పెంచే విద్యే నిజమైన విద్య. బుద్ధిని వృద్ధిచేసే విద్యే నేటి సమాజంలోని అన్ని రుగ్మతలకు సరైన ఔషధం. విద్యకు భూషణం వినయం... విద్యార్థి గురువు వద్ద ఎలా అణకువతో ప్రవర్తించాలో శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో బోధించాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా । ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః ॥  శిష్యుడు గురువు సన్నిధిలో ఉంటూ భక్తిశ్రద్ధలతో గురువుకు సపర్యలు చేస్తూ తన సందేహ నివృత్తి చేసుకోవాలి. శిష్యుని వినయ విధేయతలకు గురువు ప్రీతి చెంది శిష్యునికి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. పెద్దలయందు, గురువులయందు గౌరవమర్యాదలు లేనివాడు ఎన్నటికీ జీవితంలో ఉన్నతి పొందలేడు. అహంకారి అయిన దుర్యోధనునితో 'నువ్వు గురువులకు, పెద్దలకు వినయంతో సేవ చేయడం నేర్చుకో దాని వల్ల నీలో సత్ప్రవర్తన వృద్ధి చెందుతుంది' అని శ్రీకృష్ణుడు అంటాడు. విద్యార్థి గ్రంథాల ద్వారా నేర్చుకొనే దాని కన్నా గురువు సాంగత్యంలో నేర్చుకొనే విద్య ఎక్కువ ప్రయోజనాన్నిస్తుంది. ఆచరించేవాడే ఆచార్యుడు...  ఆచార్య అంటే సంగ్రహించే వాడు. శాస్త్ర సారాన్ని సంగ్రహించి, విద్యార్థులకు బోధించేవాడు ఆచార్యుడు అని అర్థం. తాను సంగ్రహించిన వేదసారాన్ని శిష్యులకు ఆచరణలో చూపించిన వాడే ‘ఆచార్యుడు' అని మరో అర్థం. ఆచరణాత్మక బోధ నలతో ఆదర్శజీవితాన్ని గడిపి, శిష్యుల్లో మానవతా విలువల్ని పెంపొందించే వాడే నిజమైన ఆచార్యుడు. విలువల్ని పెంచే విద్య...  నేడు మనకు కావలసిన విద్య ఎలా ఉండాలో స్వామి వివేకానంద మాటల్లో…  We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded... శీలనిర్మాణం, మనోబలం, విశాలబుద్ధి ఈ మూడు సుగుణాల్ని పెంపొందించే విద్య నేడు మనకు అవసరం. స్వామి వివేకానంద నిర్వచించిన విద్యలో ఉన్న మూడు లక్షణాలను విద్యార్థి అలవరచుకోవాలంటే తైత్తిరీయో పనిషత్తులో గురువు శిష్యులకిచ్చిన సూచనల్ని ఆచరణాత్మకం చెయ్యాలి.                                          ◆నిశ్శబ్ద.

National Youth Day

జాతీయ యువజన దినోత్సవం.. వివేకానంద జయంతిని యూత్ డేగా ఎందుకు చేస్తారు..

  ప్రపంచం మొత్తంలో యువకులు ఎక్కువమంది ఉన్న దేశం గురించి ప్రస్తావన వస్తే అందులో  మన భారతదేశమే  మొదటిగా నిలుస్తుంది. ఏ దేశ అభివృద్ధికైనా అనుభవం ఉన్న పెద్దవాళ్లతో పాటూ, పనిచేసే యువశక్తి  ఎంతో  అవసరం అని చెప్పాల్సిన అవసరంలేదు. దేశ  యువతంతా క్రమశిక్షణగా ఉండి వారి శక్తి సామర్ధ్యాలు సరిగా వినియోగిస్తే  ఆ దేశం   ప్రపంచ చరిత్రలోనే గొప్పదిగా నిలవగలుగుతుంది. ఈ విషయాన్ని వందేళ్ల కిందటే అర్థం చేసుకుని యువతకు తన మాటలతో దేశ భక్తి నింపడానికి, యువతే నా దేశ భవిష్యత్తు అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి వివేకానందుడు. స్వామి వివేకానందగా పేరు పొందిన నరేంద్రుడు.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాడు.  ప్రపంచాన్ని తన మాటలతో,  తన దేశ భక్తితో.. ముఖ్యంగా హిందుత్వం, ఆధ్యాత్మిక భావనతో ప్రభావితం చేసి ప్రపంచం మొత్తం భారతదేశం వేపు తల తిప్పి చూసేలా చేశాడు. ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం వందేళ్ళ తర్వాత కూడా ఆచరించదగినవి.  మంచి వక్త, తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన స్వామి వివేకానంద  పుట్టినరోజును ప్రతీ సంవత్సరం  జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద.. స్వామి వివేకానందుడు 1863 జనవరి 12న కోల్‌కతలో జన్మించారు. దేశ భవిష్యత్తులో యువత పాత్రను యువతకు గుర్తుచేయడానికి ,  యువత శక్తిని గుర్తుచేయడానికి ఆయన పిలుపు ఇచ్చిన విధానం ఆయనను ప్రసిద్ధుడిగా మార్చింది.  ఈయన రామకృష్ణ పరమహంస బోధనలకు ప్రభావితమై.. సన్మానం స్వీకరించారు.  ధార్మిక బోధకుడిగా, తత్వవేత్తగా,  వేదాలను ఉపనిషత్తులను అవపోషణ పట్టిన వ్యక్తిగా, యోగాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా.. ఇలా చాలా రకాలుగా ప్రసిద్ధి చెందాడు.   1893లో చికాగోలో నిర్వహించిన  ప్రపంచ సర్వమత మహాసభలలో  ఆయన ఇచ్చిన  ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రసంగంలో ఆయన యువశక్తి, విశ్వ సోదర భావం, ఆత్మాన్వేషణలు అనేవి సామాజిక మార్పుకు  ప్రాథమిక సూత్రాలుగా చెప్పారు. స్వామి వివేకానందుడు జాతీయవాదంపై ధృడ విశ్వాసం కలిగి, దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉందని నమ్మారు. ఎటువంటి నీచస్థితిలో ఉన్నవారికైనా గొప్ప ఆలోచనలను కలిగేలా చేయగలమనే ఆయన  నమ్మారు.   "శక్తి నీలోనే  ఉందనే నమ్మకంతో ముందుకు సాగితే, నువ్వు అద్భుతాలను సృష్టించగలవు.", "నువ్వు మేల్కొని , ఉప్పొంగు, కానీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకు",  "యువతే దేశ అభివృద్ధికి పునాదులు." అనే మాటలతో..  తన ప్రసంగాలతో దేశ యువతని, ప్రజలని  నిరంతరం ప్రోత్సహించేవారు. 1984వ సంవత్సరంలో స్వామి వివేకానందుడి ఆలోచనలను, విలువలను వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది.   1985 నుంచి  దేశవ్యాప్తంగా  జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. స్వామి వివేకానందుడి తత్వచింతనలు, ఆదర్శాలు భారత యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని ప్రభుత్వం భావించింది. యువజన దినోత్సవం- యువతకి పిలుపు.... స్వామి వివేకానందుడి బోధనలు యువతకు జీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు స్ఫూర్తినిస్తాయి. వ్యక్తిగతంగా,  సమష్టిగా అభివృద్ధి చెందడానికి విద్య అనేది ముఖ్యమైన సాధనమని ఆయన విశ్వసించారు. యువతలో ఐక్యత, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక  చింతన అభివృద్ధి చేయటం, అందరూ  దేశభక్తి కలిగి ఉండి, మన సంస్కృతి పట్ల గర్వపడాలనే సందేశాన్ని అందిస్తుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురావటంలో  యువత పాత్ర  అవసరమని, ఆ దిశగా యువత తమ నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు ఉపయోగించాలనే పిలుపునిస్తుంది.                                  *రూపశ్రీ.

National Human Trafficking Awareness Day

మనిషి ఆశలతో, ఆశయాలతో ఆటాడుకునే దుర్మార్గమిది.. మానవ అక్రమ రవాణా అవగాహనా దినోత్సవం..!

  మనతో పాటూ ఉన్న మనుషులు   ఉన్నట్టుండి ఏమైపోయారో తెలియకపోయినా లేదా వారు ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నారన్న విషయం తెలిసినా మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా జరిగినప్పుడు ఏం చేయాలో, మనమేం చేయగలమో కూడా అర్ధం కాదు. అందుకే ఇటువంటివి జరిగినప్పుడు ఎదురయ్యే పరిణామాలు గురించి  అందరికీ అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీన మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వం గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాలతో బయటపడిన వారి హక్కుల కోసం వాదించడానికి,  అన్ని రకాల మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి  ఒక అవకాశం ఇస్తుంది. మానవ అక్రమ రవాణా అంటే..... మనుషులని కిడ్నాప్ చేయటమో లేదా ఏమార్చటమో  చేసి తర్వాత వారిని బలవంతంగా  వ్యభిచారం చేయించటానికో, బలవంతపు  వివాహాల కోసమో, అనైతిక కార్యకలాపాలు, కర్మాగారాల్లో పనులు చేయించటానికో ఇలా చాలా రకాలుగా  ఉపయోగించుకుంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ అక్రమ రవాణా  సమస్య నానాటికీ పెరుగుతోంది. అందుకే దీన్ని ఆపటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మానవ అక్రమ రవాణా దినోత్సవం ఎప్పుడు మొదలైంది.. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి,  ఎదుర్కోవడానికి యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన  ‘ట్రాఫికింగ్ బాధితుల రక్షణ చట్టం2000’ చట్టానికి ఆమోదం తెల్పటంతో ఈ దినోత్సవం మొదలైంది. ఆ తర్వాత  ఈ సమస్య ప్రభావం  ప్రపంచమంతటా ఉందని   గుర్తించిన  దేశాలన్నీ  దాన్ని నివారించటానికి తగిన చట్టాలు ఏర్పాటు చేసుకున్నాయి. భారతదేశంలో మానవ అక్రమ రవాణా- తీసుకున్న చర్యలు.. భారతదేశంలో పురుషులు, మహిళలు, పిల్లలు వివిధ కారణాల కోసం అక్రమ రవాణా చేయబడ్డారు, చేయబడుతున్నారు. దేశంలోని  మహిళలు, అమ్మాయిలను లైంగిక దోపిడీ కోసం, బలవంతపు వివాహాల కోసం రవాణా చేస్తున్నారు.   పురుషుల అవసరం ఎక్కువగా ఉన్నచోట  పురుషులు, అబ్బాయిలను  రవాణా చేసి  కార్మికులుగా, మసాజ్ చేసే వారిగా, ఎస్కార్ట్లుగా ఉపయోగించుకుంటున్నారు.  వీరు కొన్ని సార్లు లైంగిక దోపిడీకి కూడా  గురవుతుంటారు.   ఇక పిల్లలు కర్మాగార కార్మికులుగా, ఇంటి పనివారిగా, అడుక్కునేవారిగా, వ్యవసాయ కూలీలుగా మార్చబడతారు.   అలాగే కొన్ని తీవ్రవాద, తిరుగుబాటు గ్రూపుల ద్వారా శిక్షణ ఇవ్వబడి అసాంఘిక కార్యకాలపాల కోసం  ఉపయోగించుకుంటారు.  భారతీయ మహిళలు మిడిల్ ఈస్ట్ దేశాలకి వాణిజ్య లైంగిక దోపిడీ కోసం రవాణా చేయబడుతున్నారట. ప్రతి సంవత్సరం మిడిల్ ఈస్ట్,  యూరప్ దేశాలకు పనివారిగా,  తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులుగా వెళ్లిన భారతీయ వలసదారులు  కొన్నిసార్లు మానవ అక్రమ రవాణా పరిశ్రమలో చిక్కుకుంటున్నారు. కొన్ని సార్లు  కార్మికులు నకిలీ నియామక విధానాల ద్వారా తీసుకెళ్లి అక్కడ బానిసలుగా మార్చబడుతున్నారు. ముఖ్యంగా ఆ దేశాలకి వెళ్తే ఆదాయం పెరిగి కుటుంబం బాగుపడుతుందన్న ఆశతో  అప్పు చేసి ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ డబ్బు చెల్లించలేక, తిరిగి రాలేక క్రూరమైన యాజమానుల చేతుల్లో అష్ట కష్టాలు పడతారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు.   ఇవన్నీ గుర్తించిన భారతదేశం 2011లో "ట్రాఫికింగ్ బాధితుల చట్టం 2000" ప్రోటోకాల్‌ను ఆమోదించింది. మన భారత పౌరులు అలాంటివాటిలో చిక్కుకోకుండా  ఒక పక్క అవగాహన కల్పిస్తూనే, మరో పక్క అలా చిక్కుకున్నవారిని ఆయా దేశాల్లోని ఎంబసీల ద్వారా  కాపాడే ప్రయత్నం చేస్తుంది. వారు స్వదేశం చేరటానికి అన్ని రకాలుగా సాయం అందిస్తుంది. మానవ అక్రమ రవాణాని నివారించేందుకు ఏం చేయాలి...   నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్‌నెస్ డేలో పాల్గొనడం వల్ల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమానికి సహకరించేందుకు అందరికీ అవకాశం లభిస్తుంది. దీని గురించి స్పష్టంగా తెలుసుకనే అవకాశం కూడా లభిస్తుంది. మానవ అక్రమ రవాణాని ఎలా గుర్తించాలి?, ఎలా కంప్లైంట్ చేయాలి?  అనే వాటి గురించి అందరికీ తెలిసేలా  వర్క్‌షాప్‌లు, వెబినార్లు లేదా శిక్షణా సెషన్లను నిర్వహిస్తారు.   ఈ సమస్య గురించి సోషల్ మీడియాలో అవగాహన కల్పించడానికి,  దానికి సంబంధించిన  పోస్ట్‌లు, కథనాలను షేర్ చేయాలి. ఈ  అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహకరించి,  ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం అందించాలి. రాజకీయ నాయకులు, లాయర్లతో పాటూ కలిసి మానవ అక్రమ రవాణాను సమర్థవంతంగా పరిష్కరించే చట్టాలు, విధానాలకు మద్దతు ఇవ్వాలి.  అక్రమ రవాణా నిరోధక చట్టాల కోసం గొంతు విప్పాలి. అవేర్‌నెస్ ఈవెంట్‌లను నిర్వహించాలి. ఈ మానవ అక్రమ రవాణా మీద అందరూ తగిన అవగాహన పొందటం వల్ల  మనవాళ్ళు, మనకి తెలిసినవాళ్ళు ఏ మోసకారుల చేతుల్లోనో, ముఠాల చేతుల్లోనో చిక్కుకుని బలి కాకుండా కాపాడుకోవచ్చు.                                        *రూపశ్రీ.

lal bahadur shastri death anniversary

ఆస్తులు కన్నా ఆదర్శాలే ముఖ్యమనుకున్న గొప్ప వ్యక్తి..... లాల్ బహాదూర్ శాస్త్రి వర్ధంతి..!

  ఈ  రోజుల్లో  రాజకీయ నాయకులు అనగానే డబ్బు, హోదా, ఖరీదైన కార్లు  గుర్తొస్తాయి. ఎందుకంటే రాజకీయం అనగానే డబ్బు ఆర్జించే ఒక మార్గం అయిందిప్పటి కాలంలో. కానీ ఒక జాతీయ స్థాయి నాయకుడై  ఉండి, ఒక దేశ ప్రధానై  ఉండి కూడా  ఒక పాత కారుని ఈఎంఐ పద్ధతిలో  కొనుక్కున్నారొక మహనీయుడు.   వ్యక్తిగత ఆస్తి కూడబెట్టటం కంటే ప్రజా సేవనే ధ్యేయంగా పని చేశారాయన.  ఆయన ఎవరో కాదు..  జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రజలను చైతన్యం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి.  అందరూ ముద్దుగా శాస్త్రిజీ అని పిలుచుకునే లాల్ బహదూర్ శాస్త్రిగారు ఆస్తులకన్నా ఆదర్మాలే ముఖ్యమని నమ్మారు. అదే నేడు ఆయన్ను గొప్ప దేశ నాయకుడిగా నిలబెట్టింది. నిబద్దత, క్రమశిక్షణ, నిస్వార్థ గుణం,నమ్రత, విధేయత  కలిగిన పాతతరపు నాయకుల్లో ఈయన ఒకరు. మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన  లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకంటే.. లాల్ బహాదూర్ శాస్త్రి 1904 అక్టోబర్2న మొగల్‌సరాయ్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. తండ్రి మరణానంతరం లాల్ బహాదూర్ శాస్త్రి  ఆయన చెల్లెల్లు వారి మామయ్య అయిన మున్షీ హజారీలాల్ ఇంట్లో పెరిగారు. 1928లో శాస్త్రి గారెకి  లలితా దేవితో వివాహం జరిగింది. ఆయనకి  నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ సభ్యులు అంతా కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. స్వాతంత్రోద్యమంలో పాత్ర.. లాల్ బహాదూర్ శాస్త్రి హరిశ్చంద్ర హైస్కూల్‌లో ఉన్నప్పుడు దేశభక్తి, ప్రజాదరణ పొందిన ఉపాధ్యాయుడు నిష్కామేశ్వర్ ప్రసాద్ మిశ్రాగారి  ప్రేరణతో స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు.  మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవ్య నిర్వహించిన ఒక సమావేశానికి వెళ్ళిన శాస్త్రి  ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు బయటకు రావాలన్న  పిలుపు మేరకు, ఆ మరుసటి రోజే హరిశ్చంద్ర హైస్కూల్‌ను వదిలేశారు. వాలంటీరుగా చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆయన అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారు. 1925లో కాశీ విద్యాపీఠం నుండి “శాస్త్రి” బిరుదుతో పాటూ తత్వశాస్త్రం, నైతిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆయన లాలాలజపతిరాయ్ స్థాపించిన “లక్ సేవక్ మండల్”లో చేరి మహాత్మా గాంధీ నాయకత్వంలో ముజఫర్‌పూర్‌లో హరిజనుల కోసం పనిచేశారు. 1928లో మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌లో పూర్తి స్థాయి సభ్యుడిగా చేరారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు రెండు సంవత్సరాలపాటు జైలులో ఉన్నారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహానికి మద్దతు తెలపడం వల్ల ఏడాది జైలులో గడిపారు. 1937, 1946లలో ఆయన యునైటెడ్ ప్రావిన్సెస్ శాసనసభకు ఎన్నికయ్యారు. నిర్ణయాలు అద్బుతం.. భారత స్వతంత్రానంతరం శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లో రవాణా, పోలీసుశాఖా మంత్రిగా సేవలందించారు. ఆయన రాజకీయ  పరంగా తీసుకున్న నిర్ణయాలు చాలా అద్బుతమైనవి. ఆయనే మొదటిసారి మహిళా కండక్టర్ల నియామకానికి మార్గం చూపించారు.  నిరసనల సమయంలో లాఠీలకు బదులుగా నీటి గొట్టాలను ఉపయోగించడానికి ఆదేశాలు జారీచేశారు. 1951లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1952లో రైల్వే, రవాణాశాఖ మంత్రిగా, 1961లో హోం మంత్రిగా పని చేశారు. నెహ్రూ మరణానంతరం 1964లో భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధానిగా.. 1965భారత-పాక్ యుద్ధం సమయంలో ‘జై జవాన్ జై కిసాన్’ అనే  నినాదంతో జవాన్లను, రైతులను చైతన్య పరిచారు. పాల ఉత్పత్తిని పెంచడానికి అతి పెద్ద ఉద్యమానికి మద్దతుగా  అమూల్ సహకార సంఘానికి అండగా నిలిచారు. హిందీ భాషకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను శాంతి పూర్వకంగా పరిష్కరించారు. పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో కలిసి తాష్కెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఆయన హయాంలో విధ్యా సంస్థలు, డ్యాములు, పోర్టులు ఎన్నో నిర్మితమయ్యాయి.   దేశ అభివృద్ధిలో ఆయన చేసిన  కృషి అమోఘం. ఆయన  ప్రధానమంత్రి హోదాలో  సోవియట్ యూనియన్, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్ట్, బర్మా వంటి అనేక దేశాలను సందర్శించి విదేశాలతో మన దేశ సంబంధాలు మెరుగుగా ఉండేలా చేశారు. మరణం.. శాస్త్రిగారు  1966వ సంవత్సరం,  జనవరి 11న తాష్కెంట్‌లో మరణించారు. 1965 ఇండో-పాక్ యుద్ధానికి శాంతి ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే ఇలా జరిగింది. ఆయనను ఒక జాతీయ హీరోగా గుర్తించి, ఢిల్లీలో విజయ ఘాట్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. లాల్ బహాదూర్ శాస్త్రి చాలా సాధారణ జీవితం గడిపారు. వ్యక్తిగత ఆస్తిని కూడబెట్టకుండా, ప్రజలకు సేవ చేయడంలో జీవితం గడపాలని ఉద్దేశించిన సేవక్ సొసైటీ సభ్యుడుగా ఉండేవారు.  శాస్త్రిగారి జీవితం నైతిక విలువలు, నమ్రత,  ప్రజా సేవకు ఆదర్శంగా నిలిచింది. తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసి, దేశ అభివృద్ధికి విశేషమైన కృషి చేసి భారతదేశ చరిత్రలో మర్చిపోని నాయకుడిగా నిలిచారు.                                            *రూపశ్రీ.

The Biggest Money Mistakes Rich People Make

డబ్బున్నవారు చేసే పెద్ద తప్పులివే.. చాణక్యుడు ఏం చెప్పాడంటే..

చాణక్యుడి గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి గానీ జీవితంలో వైఫల్యం అనేదే ఎదురుకాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తుల మద్య సంబంధాలు.. ఇలా ఒక్కటనేమిటి? ఎన్నో విషయాల గురించి చాణక్యుడు కుండ బద్దలు కొట్టినట్టు విషయాలను స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చినప్పుడు చాలామంది తమకు తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల  వ్యక్తుల దగ్గర డబ్బున్నా  ప్రశాంతత, సంతోషం అనేది మాత్రం అస్సలుండవట. మరికొందరు పతనానికి చేరుకుంటారట. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుంటే.. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చాలామంది తాము ఇబ్బంది పడిన రోజులను, బాధతో గడిపిన రోజులను మరచిపోతాడు. పూర్తీగా చేతిలో డబ్బుందనే మాయలో పడిపోతారు. ఇలా మరచిపోవడం,  కష్ట సమయాలను, బాధల్ని మరచిపోవడం, డబ్బు విషయంలో తప్పు పనులు చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల మళ్లీ డబ్బు లేని స్థితికే చేరుకుంటాడు. సహజంగా ప్రతి ఒక్కరూ డబ్బులేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. డబ్బున్నప్పుడు. డబ్బులోనే సంతోషాన్ని చూస్తున్నప్పుడు దేవుడిని పక్కన పెడతాడు.  ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గంలో కూడా వెళతాడు. ఇలాంటి వారు డబ్బును మధ్యలోనే పోగొట్టుకుంటారు. తిరిగి అశాంతికి, కష్టానికి, బాధలకు దగ్గరవుతారు. కొంతమందికి డబ్బు చేతికి రాగానే అహంకారం వస్తుంది. కుటుంబ సభ్యులతోనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు.  అయితే పొరపాటున కూడా కుటుంబ సభ్యుల ముందు డబ్బు గర్వాన్ని చూపించకూడదు. డబ్బు ఈరోజు ఉండి రేపు పోవచ్చు. కానీ మరణం వరకు తోడుండే ఆత్మీయులు మాత్రం డబ్బు వల్ల దూరం అయితే మళ్లీ దగ్గరకు రావడం కష్టం. డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడమే పరమావధి కాకూడదు. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదించే పనులు ఎప్పుడూ చేయకూడదు.  అలాంటివారితో ఎక్కడా ఎవరూ బ్రతకలేరు. ముఖం మీదనే చెప్పి దూరం వెళ్లిపోతారు. అందుకే డబ్బుకోసం ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడవద్దు. డబ్బు దండిగా ఉన్నప్పుడు అయినా, డబ్బు లేనప్పుడు అయినా ఒకే విధంగా ఉండే వాడే ఎప్పటికైనా జీవితంలో సఫలం అవుతాడు. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు చేస్తే అది చాలా తప్పు. కానీ డబ్బు ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాలలో  వినియోగించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. డబ్బు వృధా కంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. దీని వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూరతాయి. డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం  గొప్పే.. కానీ  ఆ డబ్బును ఇతరులకు హాని తలపెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం పతనానికి చేరుకుంటారు. ఇలాంటి పనులవల్ల ఎంత గొప్ప ధనవంతుడు అయినా పేదవాడిగా మారిపోవడం ఖాయమని చాణక్యుడు చెప్పాడు.                                           *నిశ్శబ్ద.

Pravasi Bharatiya Divas 2025

దేశం వదిలినా మూలాలు మరిచిపోము..... ప్రవాస భారతీయుల దినోత్సవం..2025..!

  “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని,  నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అనే గేయాలను చదువుకుంటూ పెరిగినవాళ్లం. దీనికి తగ్గట్టు కొందరు మాతృదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంటారు.  అలాంటి వారిలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద నుండి చాలామంది ప్రముఖులు  ఉన్నారు.  ఈ జాబితాలో ప్రవాస భారతీయుల పాత్ర చాలా ఉంది. ఈ రోజుల్లో పొట్ట కూటి కోసం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళు కొందరైతే, తమ చదువుకి, ప్రతిభకి తగిన అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నవాళ్లు కొందరున్నారు. ఉన్నత విద్య అభ్యసించడానికో.. ఉన్నత విద్య ద్వారా వచ్చిన ఉద్యోగ అవకాశాల కోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏడూ పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్టే విదేశాలలో భారతీయుల హవా సాగుతోంది.     మన భారతదేశం నుంచి ప్రపంచ నలుమూలలకి వెళ్ళిన మన వాళ్ళు భారతీయతను చాటి చెప్పటానికి మన దేశ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు.  అలాంటి  ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు దేశ అభివృద్ధిలో చేసిన, చేస్తున్న సేవలకి గుర్తింపుగా ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే దీనికి ముఖ్యమైన మూలం మహాత్మా గాంధీ..   మహాత్మా గాంధీ విద్యాభ్యాసం కోసం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి  నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజునే ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటున్నారు.   2003 సంవత్సరం నుంచి  ప్రతీ ఏటా జనవరి 9వ తేదీన   ప్రవాస భారతీయుల  దినోత్సవం( ఎన్‌ఆర్‌ఐ డే)  జరుపుకుంటున్నాము. ప్రవాస భారతీయుల దినోత్సవం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుంటే.. 2025 లో జరగబోయే 18వ ఎన్‌ఆర్‌ఐ డే  ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్‌లో జనవరి 8 నుండి 10 వతేదీ వరకు  జరగనుంది. ప్రవాస భారతీయ దినోత్సవం.. మన భారతదేశం  ప్రపంచంలోనే  ఎక్కువ ప్రవాస భారతీయులు ఉన్న దేశంగా పేరుపొందింది. ఈ ప్రవాస భారతీయులు తమ   ఆర్థిక సహకారాలు, పెట్టుబడులు ద్వారా దేశ అభివృద్ధిలో, గ్లోబల్‌గా మన దేశ గుర్తింపుని  పెంచటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్ద పెద్ద కంపెనీల సి‌ఈ‌ఓలు, రాజకీయ నాయకులు ఇలా చాలామంది మన దేశం వారు లేదా మన దేశ మూలాలున్న వారు విదేశాలలో  ఉన్నారు.  అందుకే ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  వ్యాపారం, విద్య, కళలు, శాస్త్రం, సాంకేతికత వంటి రంగాలలో  ప్రవాస భారతీయుల విజయాలను గుర్తించి, ప్రోత్సహించడమే కాకుండా అంతర్జాతీయంగా  భారతదేశ ప్రతిష్టను మరింత బలోపేతం చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. మన దేశంతో వారి సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి,  భారతీయ మూలాలున్న వ్యక్తులు,  భారతీయ సంస్థల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించటానికి ,  అలాగే ఎన్‌ఆర్‌ఐ లను  ప్రభావితం చేసే ప్రభుత్వ విధానాలపై చర్చించటానికి ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  ఒక వేదికగా  నిలుస్తుంది. భవిష్యత్తులో వివిధ రంగాలలో భారతదేశ అభివృద్ధికి వనరులను, నైపుణ్యాలను, సాయాన్ని  సమీకరించడం కోసం ప్రవాస భారతీయుల సహకారం చాలా అవసరం అవుతుంది.  దీనికి గానూ వారు ఎలా సహకరించగలరో చర్చించేందుకు ఒక  ప్రవాస భారతీయుల దినోత్సవం ఒక వేదిక అవుతుంది. ప్రవాసీయుల సహకారం.. భారతదేశ కలకు సాకారం.. ఏదైనా ఒక దినోత్సవం జరపడం మొదలుపెడితే ప్రతి ఏడాది ఒక విశేషమైన అంశాన్ని ఎంచుకుని ఆ అంశం దిశగా కృషి చేయడం, లక్ష్యాలు సాధించడం జరుగుతుంది.  ప్రవాస భారతీయుల దినోత్సవానికి అలాంటి అంశాల ఎంపిక ఉంది.  ఈ ఏడాది..     “అభివృద్ధి చెందిన భారతదేశపు సంకల్పంలో  ప్రవాస భారతీయుల సహకారం”  అనే అంశాన్ని  ఎంపిక చేశారు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశ జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశ జాబితాలో మన దేశం చేరేందుకు గానూ  విదేశాలలో ఉండే భారతీయుల  పాత్రని  ఈ అంశం ప్రతిబింబిస్తుంది.    సేవ..  గుర్తింపు.. ఈ ఎన్‌ఆర్‌ఐ దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా అందరిని ఆకట్టుకునే ప్రధాన విషయం.. సేవలను గుర్తించడం. ఇవే..  ‘ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు’. ఇవి భారతీయ ఎన్‌ఆర్‌ఐ లు  చేసిన అసాధారణ సేవలను గుర్తించి సత్కరించేందుకు ఇచ్చే పురస్కారాలు. ఈ అవార్డులు భారత రాష్ట్రపతి చేతులు మీదుగా అందజేయబడతాయి. ఈ గుర్తింపు  భవిష్యత్తులో భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులకి  మధ్య మరింత సహకారం పెరిగేలా చేస్తుంది. ఈ సారి ప్రవాస భారతీయుల దినోత్సవానికి  వేదిక అయిన భువనేశ్వర్ 50 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చే ప్రవాస భారతీయులను హృదయపూర్వకంగా స్వాగతించనుంది. ఈ సంవత్సరం కార్యక్రమానికి ట్రినిడాడ్ & టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగం ఇవ్వబోతున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు ప్రవాస భారతీయులను ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  మొదటి రోజు యూత్ ప్రవాస భారతీయ దివస్‌కు కేటాయించబడింది. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహించనున్నారు. ఇది యువ నాయకత్వం,  సాధికారతపై దృష్టి సారిస్తుంది. ప్రసిద్ధి చెందిన డెవ్ ప్రగాద్ (సి‌ఈ‌ఓ, న్యూస్వీక్) వంటి ప్రసంగకర్తలు ఇందులో పాల్గొంటారు. ఈ సంధర్బంగా మన దేశ యువత కూడా తమ ప్రతిభా నైపుణ్యాలని సరిగా ఉపయోగించుకుని, దేశం వీడినా దేశ సేవ చేస్తున్న  ప్రముఖ ప్రవాస భారతీయులను ఆదర్శంగా తీసుకుని  తమ జీవితాలని మెరుగుపర్చుకోవటమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా భాగం అయితే భారతదేశం అభివృద్ది చెందిన దేశం అవుతుంది.                                                 *రూపశ్రీ.

sankranti special

మూలాల ముంగిలికి లాక్కెళ్లే పండుగ.. సంక్రాంతి..!

  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.

Scientist Stephen Hawking life story

స్టీఫెన్ హకింగ్.. ఒక్క కదలికతో విశ్వాన్ని శోధించిన వీరుడు..!

  వైకల్యం.. మనిషి కొనితెచ్చుకునే సమస్య కాదు. కొందరు పుట్టుకతో వైకల్యంతో పుడతారు.  మరికొందరు ప్రమాదవశాత్తు వైకల్యానికి లోనవుతారు.  అయితే వైకల్యం ఉంది కదా మన వల్ల ఏం అవుతుందిలే అని కొందరు జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు.  ఏదో ఒక విధంగా జీవితాన్ని అలా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం తమ వైకల్యం తమ లక్ష్యాలకు అడ్డు కాదని భావిస్తారు.  జీవితంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఫలితంగా ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.  అలాంటి వారిలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు.  కేవలం ఒకే ఒక కదలికతో ఏకంగా విశ్వాన్ని శోధించిన ఘనుడు ఆయన.  జనవరి 8వ తేదీ స్టీఫెన్ హాకింగ్ జననం.  ఈ సందర్భంగా ఆయన కృషిని గుర్తు చేసుకుంటే జీవితానికి కావలసినంత చైతన్యం లభిస్తుంది. స్టీఫన్ విలియం హాకింగ్..  1942, జనవరి 8వ తేదీన జన్మించారు.  ఈయన ప్రసిద్ధ బ్రిటీష్ సైద్దాంతిక శాస్త్రవేత్త. ముఖ్యంగా విశ్వనిర్మాణ శాస్త్రవేత్త.  ఈయన మరణించే సమయానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు. వైకల్యం.. విధి మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది.  ఆడుతూ పాడుతూ సాగుతున్న సాఫీ జీవితంలో పెద్ద సునామీలా సమస్యలు విరుచుకుపడేలా చేస్తుంది.  స్టీఫెన్ హాకింగ్ జీవితంలో కూడా అంతే.. ఆయనకు 21ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వచ్చింది.  ఇది కాలంతో పాటు పెరుగుతూ పోయింది. క్రమంగా స్టీఫెన్ హాకింగ్ శరీరంలో ప్రతి అవయవాన్ని కబళించింది.  ఆయన శరీరం చచ్చుబడిపోయేలా చేసింది. స్టీఫెన్ హాకింగ్ తన 20 ఏళ్ల వయసులో కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కు వెళ్ళాడు. అక్కడి వెళ్ళిన తరువాతే ఆయన జీవితం మలుపు  తిరిగింది.  భోజనం చెయ్యాలన్నా, బూట్లు లేసులు వేసుకోవాలన్నా, ఇతర పనులు చెయ్యాలన్నా కూడా శరీరం సహకరించేది కాదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పరిస్థితి ఆయన కుటుంబం ఆందోళన చెందింది.  వైద్య పరీక్షలు నిర్వహించగా మోటార్ న్యూరాన్ వ్యాధి అనే భయంకరమైన జబ్బు ఉన్నట్టు తేలింది. నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. దీని కారణంగానే తొందరలోనే ఆయన శరీరం చచ్చుబడిపోయింది. అయితే ఆయన మెదడు మాత్రం అద్భుతంగా పనిచేసేది. అంతేకాదు ఆయన ముఖంలో ఒక దవడ ఎముక మాత్రం కదిలేది. ఆ ఒక్క దవడ ఎముక కదలికలే.. స్టీఫెన్ హాకింగ్ ప్రయోగానికి  మూలాధారం.  ఆ దవడ ఎముకకు ఒక పరికరాన్ని అమర్చారు. స్టీఫెన్ హాకింగ్  ఆలోచనలు అన్నింటిని ఆ పరికరం సంభాషణ రూపంలో వ్యక్తం చేసేది.  ఇలా ఆయన శరీరం కదలని స్థితిలో కూడా విశ్వాన్నిశోధిస్తూ తన పరిశోధనలు సాగించాడు. అలాంటి స్థితిలోనే కృష్ణబిలాలకు సంబంధించిన అనేక విషయాలు కనుగొన్నాడు.  1985లో ఆయనకు నిమోనియా వచ్చింది.అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు.  తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో  ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందించేవాడు. చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో తెరపై ప్రదర్శిస్తుంది. ఆయన కృషికి కొందరు మిత్రుల సహకారం కూడా తోడైంది.  కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ ఆయన ఆలోచనను మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది.  స్టీఫెన్ హకింగ్ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన గొంతునే  సింథసైజర్ కు అమర్చారు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ నేరుగా మాట్లాడినట్టే ఉండేది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా.. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.                                           *రూపశ్రీ. 

Tips for Healthy Marriage

 వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకోవాలి..!

  వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కీలకమైన దశ.  ఈ దశలో చాలామంది జీవితాలు మారిపోతుంటాయి. ఈ కాలంలో వివాహం తర్వాత జీవితం ప్రశాంతంగా లేదని చెప్పేవారే ఎక్కువ.  కొందరైతే ఏకంగా విడాకుల వరకు గొడవలను తీసుకువెళుతుంటారు.  మరికొందరు కేసులు, కోర్టులు అంటూ సమస్యలు పెద్దవి చేసుకుంటారు. ఇలాంటి వాటికి ఆచార్య చాణక్యుడు సరైన సలహాలు, సూచనలు ఇచ్చారు. చాణక్యుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని వాటిని పాటిస్తుంటే వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుందట. ఇంతకీ ఇందుకోసం ఏం చేయాలంటే.. ప్రేమ, నిజాయితీ.. ఒక బంధం విజయవంతంగా ఉండాలన్నా,  ఆ బంధం బలంగా మారాలన్నా ఆ బంధంలో ఉన్న వ్యక్తుల మధ్య ప్రేమ, నిజాయితీ ఉండాలి. నిజమైన ప్రేమ, నిజాయితీతో కూడిన ప్రవర్తన బంధాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.  వివాహ బంధంలో ఉన్ వ్యక్తి తన జీవిత భాగస్వామితో ప్రేమగా, నిజాయితీగా ఉంటూ.. జరిగే తప్పొప్పులు,  వచ్చే సమస్యలను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటే జీవితంలో ఒకరిమీద ఒకరికి నమ్మకం బలపడుతుంది.   అహం.. మనిషి జీవితంలో ఏ బంధంలో అయినా అహం అనేది పెద్ద శత్రువుగా మారుతుంది.  ఇది భార్యాభర్తల మధ్య సంబంధం అయితే ఈ అహం అనేది చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది.  బంధంలో చీలికలు సృష్టించడానికి కారణం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం అనేవి లేకుండా చేయడంలో అహం ప్రధాన శత్రువు అవుతుంది. వైవాహిక బంధంలో అహంను పక్కన పెట్టి ఒకరి పట్ల మరొకరు ప్రేమతో, గౌరవంతో ఉండాలి.  ఇలా ఉంటే ఇద్దరు దూరమయ్యే పరిస్థితులే రావు. నిజం.. వైవాహిక బంధంలో నిజం మాట్లాడటం, నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తలు నిజంగా, నిజాయితీగా మాట్లాడితే వారిద్దరూ ఒకరి మీద మరొకరు  గౌరవం కలిగి ఉంటారు. వారి అపార్థాలు కూడా తలెత్తవు. ఎప్పుడూ నిజం మాట్లాడే వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  ఎలాంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కుంటారు. గౌరవం.. నేటి కాలంలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకోవడం, పురుషహంకారం చూపించడం వంటివి చేయడం వల్ల బంధం చెడిపోతుంది.  భార్యాభర్తలు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవాలి.  భర్త భార్యను బానిసలాను, పని మనిషిలాను ట్రీట్ చేయడం,  తన అధికారాన్ని భార్య మీద చూపడం వంటివి చేయకూడదు. భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ పదిమంది ముందు దోషిగా నిలబెట్టి అవమానించడం మానుకోవాలి.  ఇలా అవమానిస్తే అది సంబంధంలో చీలిక ఏర్పడటానికి దారితీస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇద్దరూ ఎదురుగా  ఉన్నప్పుడు కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోవాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ  సమస్యలను,  తమ ఆలోచనలను, భావాలను, తాము చేయాలనుకున్న పనులను  స్నేహపూరితంగా వివరించి చెప్పాలి.  మాటల్లో ఎలాంటి అపార్థాలు లేకుండా వివరించాలి.  అదే విధంగా భాగస్వామి ప్రతిస్పందనను కూడా అంతే స్నేహపూరితంగా తీసుకోవాలి.  ఇలా ఉంటే భార్యాభర్తలు మాట్లాడుకునే సందర్భాలలో ఎప్పుడూ గొడవలు రావు.                                             *రూపశ్రీ.

world day of war orphans 2025 theme history

యుద్ధం మార్చిన జీవిత కథలు... ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం2025..!

  ఈ ప్రపంచం ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలని చూసింది. అధికారం కోసమో, అస్థిత్వం కోసమో లేక నాయకుల అహంకారపు విధానాల వల్లనో రోజూ ఏదో మూలన చిన్నదో, పెద్దదో యుద్ధం జరుగుతూనే ఉంటుంది.. మనం వింటూనే ఉంటాము. కానీ  మనలో చాలామంది ఆలోచనలు యుద్ధంలో  ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ సైనికులు, ప్రజలు ఎంతెంతమంది  చనిపోయారు? అనే ప్రశ్నల దగ్గరే ఆగిపోతాయి.. కానీ, ఆ యుద్ధాలవల్ల కొందరి బ్రతుకులు ఒక్క రోజులోనే చీకట్లోకి నెట్టివేయబడుతున్నాయన్న విషయం  మనమంతా మర్చిపోతుంటాము. ఎవరివి ఆ జీవితాలు అనుకుంటున్నారా... ఇంకెవరివి!! దేశ రక్షణ కోసం ప్రాణాలు ధారబోయటంతో  అనాథలైన   సైనికుల పిల్లలవి..  అలాగే జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ బాంబో వచ్చిపడి అందరూ చనిపోయి అనాథలుగా మిగిలిపోయిన సామాన్య ప్రజల పిల్లలవి.... ఇటువంటి వారి పరిస్థితి ఏమిటా అని ఎప్పుడైనా ఆలోచించారా?.. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదా..!  మరి వారి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు?. ఇలా ప్రపంచ యుద్దం కారణంగా అనాథలైన పిల్లల గురించి అనాథల గురించి ఆలోచించే దిశగా ప్రజలను చైతన్యం చేసేదే ప్రపంచ యుద్ద అనాథల దినోత్సవం.  దీని గురించి తెలుసుకుంటే.. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఎప్పుడు మొదలైంది.... యుద్ధం వల్ల అనాథలైన  సైనికుల పిల్లల గురించి ఆలోచించి వారి కోసం మొదటగా అనాథాశ్రమాలు ఏర్పాటు చేసిన  ఘనత రోమన్లకి దక్కుతుందని చరిత్ర చెబుతుంది. అయితే   ఆధునిక ప్రపంచంలో  ప్రస్తుత   యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం,  అనాథలైన  పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక,  శారీరక ఆటంకాలను గుర్తు చేయడం కోసం   ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసెస్’ అనే ఫ్రెంచ్ సంస్థ ఈ ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి6 న జరపడం మొదలుపెట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు వేదికను అందించడం, వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ, ప్రభుత్వాల దాకా అందరినీ  ఇందులో భాగం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథల హక్కులు, సమస్యలు గురించి పోరాడేలా చేయటం, వారి భవిష్యత్తుకి మంచి పునాది వేయటమే దీని ఉద్దేశ్యం.    ఎందుకు జరుపుకోవాలి.... యూనిసెఫ్ ప్రకారం, 1990 నుంచి 2001సంవత్సరాల మధ్య జరిగిన యుద్ధాల కారణంగా  అనాథల సంఖ్య విపరీతంగా పెరిగింది.  ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్లకుపైగా అనాథలు ఉన్నారు.  2001 నుంచి ప్రతి సంవత్సరం 0.7 శాతం అనాథల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అది చెప్పుకోతగ్గ  మార్పెమీ  కాదు. పైగా  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,  ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం,  కొత్తగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రగులుతున్న చిచ్చు వంటి   ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తే  అనేక మంది పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందని అనిపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంత మంది అనాథ పిల్లలు  నిర్లక్ష్యం చేయబడకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జరుపుకోవాలి. అటువంటి అనాథ  పిల్లలు జీవితంలో ఎదుర్కునే అన్ని సమస్యలను  గుర్తు చేసుకోవడం కోసం, అలాగే ఈ ప్రపంచంలో ఎవరూ ఇలా అనాథలుగా మిగలకుండా, యుద్ధం లేని ప్రపంచ స్థాపన కోసం కృషి చేయటంలో అందరి బాధ్యతని  గుర్తు చేయటం కోసం  ఈ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధాలవల్ల పిల్లలకి జరుగుతున్న అన్యాయం.. యుద్ధ కాలంలో పిల్లలపై జరుగుతున్న అన్యాయాలని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గుర్తించి, వాటిని నివారించాలని ప్రపంచ దేశాలకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. పిల్లలకు మానవతా సహాయం అందకుండా చేయటం  పిల్లలను కిడ్నాప్ చేయటం,  చంపేయడం,  బలాత్కారం లేదా ఇతర తీవ్రమైన లైంగిక హింసకి పాల్పడటం.  స్కూల్ల్స్, హాస్పిటల్ల మీద దాడులు చేయడం వంటి ఎన్నో  అన్యాయాలు జరుగుతున్నాయి. ఇంకా దారుణంగా పిల్లలని సాయుధ దళాల్లో  లేదా రెబల్ గ్యాంగుల్లో చేర్పించి వాళ్ళని  అక్రమ కార్యాలకి ఉపయోగించుకోవటం కూడా చేస్తున్నారు.  ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే  ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవ వేదికగా ప్రజలందరూ ప్రశ్నించి, నిలదీయాలి. ఒకవేళ వ్యవస్థలు, ప్రభుత్వాలు ఇటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తే, వారు మన సమాజంలో ఉన్న అసాంఘిక, ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి చిక్కి, తప్పుడు దారిలో నడుస్తారు. అది మన సమాజానికి, ప్రపంచానికి మంచిది కాదు. మన సమాజంలో ఏ ఒక్క వ్యక్తీ నిర్లక్ష్యం చేయబడకూడదు, పైగా సర్వస్వం కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు అస్సలు నిర్లక్ష్యం చేయబడకూడదు.                                             *రూపశ్రీ.

These are important for life to be happy

జీవితం సంతోషంగా సాగాలంటే ఇవి ముఖ్యం..!

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు.  సంతోషంగా ఉంటే జీవితంలో చాలా సమస్యలు జయించవచ్చు. కానీ సంతోషంగా ఉండనీయకుండా చేసే సందర్బాలు,  సమస్యలు చాలా ఉంటాయి. మరీ  ముఖ్యంగా సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని ఆలోచనతో, తెలివిగా ఎదుర్కోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు గందరగోళంలో, ఒత్తిడిలో ఉంటే సంతోషం అనే మాట దూరంలోనే ఉండిపోతుంది.  జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనసును, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే.. శ్వాస.. శ్వాస అనేది ప్రతి క్షణం, ప్రతి మనిషిలో జరిగే అసంకల్పిత చర్య.  అయితే శ్వాస వ్యాయామాలు మనిషిని సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేస్తుంటే.. ముఖ్యంగా లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తే ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది.  మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం.. ఆహారం శరీరానికి శక్తి వనరు. అయితే ఆహారం తినే విధానం మనసును ప్రభావితం చేస్తుంది. మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది. అంటే మనసు పెట్టి ఆహారాన్ని శ్రద్దగా తినడం.  తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించడం.  ఆహారం వాసన,  ఆహారం ఎలా ఉంది అని దాన్ని మనసుతో పరిశీలించి తినడం.  ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా తృప్తిని ఇస్తుంది. నడక.. నడక చాలామంది చేసే వ్యాయామంలో భాగం. అయితే నడిచేటప్పుడు నడకను కూడా పరిశీలించాలి. నడిచేటప్పుడు పాదాల కదలిక, అడుగులలో లయ మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు వాకింగ్ చేయడంలో లవ్ లో పడతారు. ఇది మనసుకు చాలా తృప్తిని ఇస్తుంది. శ్రద్ద.. శ్రద్దగా ఏ పనిని అయినా చేస్తే ఎంత పరిపూర్ణ ఫలితాలు వస్తాయో.. ఇతరులు ఏదైనా చెప్పేటప్పుడు అంతే శ్రద్దగా వెంటే వ్యక్తులతో బంధాలు బాగుంటాయి.  శత్రుత్వం లేకుండా స్నేహభావంతో కూడిన బంధాలు ఉంటే మనసుకు ప్రశాంతత, జీవితంలో సంతోషం లభిస్తాయి. పని.. నేటి కాలంలో చాలామంది మల్టీ టాస్కర్లే.. ఇది మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది.  జీవితంలో సంతోషం కావాలంటే మల్టీ టాస్కింగ్ ను పక్కన పెట్టి సింగిల్ టాస్క్ లను చేస్తూ ఉండాలి. పైగా మల్టీ టాస్క్ చేసేటప్పటితో పోలిస్తే.. సింగిల్ టాస్క్ చేసేటప్పుడు పని మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం, పనిని చాలా బాధ్యతగా ఆసక్తిగా పూర్తీ చేయడం దాని ఫలితాలు కూడా మెరుగ్గా ఉండటం గమనించవచ్చు.  ఇవి జీవితంలో సంతోషాన్ని మెరుగు పరుస్తాయి. కమ్యూనికేషన్.. ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటే  చాలా వరకు ప్రశాంతంగా ఉండవచ్చు.  వ్యక్తిగతంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కమ్యునికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తులతో బంధాలు మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. అలసట.. అలసట మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది. అందుకే ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని ఒకే పని చేయకూడదు.  పని నుండి అప్పుడప్పుడు కాస్త దృష్టి మరల్చడం,  రిలాక్స్ అవ్వడం మనిషిని అలసటకు లోను కానీయవు.                                                *రూపశ్రీ.  

History of World Braille Day

అంధత్వపు అడ్డుగోడలని కూల్చేసిన ఘనుడు.... ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం2025

  ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న సామెత అందరికీ తెలిసిందే. దీనర్ధం ఇంద్రియాలన్నింటిలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని. అలా ఎందుకన్నారంటే  మనిషి తన జ్ఞానంలో  80 శాతందాకా కళ్ల ద్వారా చూసి నేర్చుకోవటంవల్లనే పొందుతాడు. కంటిచూపున్నవారు కళ్ళతో చూసి, చదివి విద్యావంతులై జీవితంలో స్థిర పడతారు. మరి రోజువారీ జీవితంలోనే ఎన్నో ఇబ్బందులు పడే అంధులెలా చదువుతారు? చదవాలనే తపన వాళ్ళలో ఉన్నా కూడా వారికున్న వైకల్యమే వారిని వెక్కిరిస్తుంది. కానీ, అంధుల  భవిష్యత్తుని పూర్తిగా మార్చేసే  తన ఆవిష్కరణతో వారికి ఒక ఆశాకిరణంలా నిలిచాడు ఫ్రెంచ్ విద్యావేత్త, ఆవిష్కర్త అయిన లూయీ బ్రెయిలీ. ఆయన  చేసిన సేవలకి గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటారు. చీకటికి అక్షరాలతో చూపును ఇచ్చి.. ప్రపంచంలో ఉన్న అంధుల జీవితాలలో వెలుగులు నింపిన లూయీ బ్రెయలీ గురించి తెలుసుకుంటే.. లూయీ బ్రెయిలీ ఎవరు…. లూయీ బ్రెయిలీ  1809,  జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి సైమన్-రెనె బ్రెయిల్ రాచరిక గుర్రాలకు పగ్గాలు, సాడిల్స్ తయారు చేసే పని చేస్తుండేవారు. అయితే, మూడు సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదంలో పాక్షికంగా దెబ్బతిన్న బ్రెయిలీ చూపు, తర్వాత అయిదేళ్లలోపే అతన్ని పూర్తిగా అంధుడిగా మార్చేసింది. అయినాసరే ధైర్యం కోల్పోని ఆయన పారిస్ లోని ఒక అంధుల పాఠశాలకి వెళ్ళి చదువుకుని అసాధారణ ప్రతిభావంతుడుగా గుర్తించబడ్డాడు. అప్పటివరకూ అంధులకి అందుబాటులో ఉన్న ‘’లైన్ టైప్’’ పద్ధతిలోనే కష్టపడి చదువుకుని 17ఏళ్లకే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. అక్కడున్నప్పుడే అంధులకి సులువుగా ఉండే లిపి తయారుచేయాలన్న తపన  మొదలైంది.   బ్రెయిలీ లిపి ఆవిష్కరణ ఇలా జరిగింది..... అప్పటి వరకు అంధుల కోసం ఉన్న పుస్తకాల ప్రింటింగ్ విధానాలు సరైనవి కాదనిపించేవి. అందుకే  ప్రొఫెసర్గా పగలు విధ్యార్ధులకి  బోధిస్తూ, రాత్రిళ్ళు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారు చేయటానికి లూయీ బ్రెయిలీ కృషి చేశాడు.  చీకట్లో కూడా  సందేశాలను చదవడానికి అనువుగా 12 ఉబ్బెత్తు చుక్కలతో రూపొందించబడిన ప్రత్యేకమైన సైనిక గూఢచార పద్ధతి గురించి తెలుసుకున్నాడు. దీని ప్రేరణతో ఆరు ఉబ్బెత్తు చుక్కలని  అవసరమైన రీతిలో పేర్చుతూ అక్షరాలను, అంకెలని, సంగీత చిహ్నాలని సూచించే బ్రెయిలీ లిపిని తయారుచేశారు. అప్పటినుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక సాధనంగా నిలిచింది. బ్రెయిలీ లిపి అంటే..... బ్రెయిలీ లిపి  ఒక స్పర్శ ఆధారిత వ్రాతపద్ధతి. ఇందులో ఉబ్బెత్తుగా ఉండే ఆరు చుక్కల  ద్వారా అక్షరాలు, సంఖ్యలు, విరామ చిహ్నాలను సూచిస్తారు. ఉబ్బెత్తు చుక్కల  సమూహాన్ని 'సెల్' అని అంటారు. ప్రతీ సెల్లోనూ భిన్నంగా అమర్చిన  చుక్కల  ఆధారంగా  అంధులు అక్షరాలు, అంకెలని గుర్తించి చదవగలుగుతారు. ఈ విధానం దృష్టిలోపం ఉన్నవారికి వ్రాతపూర్వక సమాచారం పొందడానికి సహాయపడుతుంది. బ్రెయిలీ  వివిధ భాషలతో పాటు గణితం, సంగీతం వంటి సాంకేతిక నోటేషన్లకు అనుకూలంగా తయారు చేయబడింది. బ్రెయిలీ  వ్రాయడానికి బ్రెయిలీ  రైటర్ యంత్రం లేదా స్టైలస్, స్లేట్ వంటి సాధనాలని  ఉపయోగిస్తారు.  ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది పూర్తి అంధులుగా ఉన్నారు. 253 మిలియన్ల మంది ఏదో ఒక విధమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వీరందరికీ బ్రెయిలీ లిపి ఒక చేయూతలా పనిచేస్తుంది. అలా ఇంతమంది అంధులకి  సహాయపడుతున్న  బ్రెయిలీ లిపి  ప్రాముఖ్యతను గుర్తించిన  ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, 2018 నవంబర్ 6న  ఒక తీర్మానాన్ని ఆమోదించింది. లూయీ బ్రెయిలీ  జయంతిని పురస్కరించుకుని   ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. అంధుల కోసం ఏం చేయాలి? దృష్టి లోపం ఉన్నవారికి సాధికారత కల్పించడం, వారికి విద్యా, వృత్తి అవకాశాలు అందించడం, సమాజంలో వారి  భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సగటు పౌరులుగా అందరి బాధ్యత.  పెరుగుతున్న టెక్నాలజీవల్ల బ్రెయిలీ  కూడా అభివృద్ధి చెందుతోంది. రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లేలు, స్మార్ట్‌ఫోన్లు వంటి ఆధునిక పరికరాలు దృష్టి లోపం ఉన్నవారికి డిజిటల్ కంటెంట్‌ను చేరువ చేయడంలో పెద్ద మార్పును తెచ్చాయి. అయితే, బ్రెయిలీ  పుస్తకాలు, ఇతర వనరులు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేయడం, దాని ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన పెంపొందించడం అవసరం. ప్రపంచ బ్రెయిలీ  దినోత్సవం  లూయీ బ్రెయిలీ చేసిన అమూల్యమైన సేవలకు నివాళి . దృష్టి లోపం ఉన్నవారి హక్కులు, గౌరవానికి గుర్తింపు.   దృష్టి లోపం ఉన్నవారిని తక్కువ చేసి చూడకుండా, జాలి పడి వదిలేయకుండా మనలో ఒకరిగా, వారికి కాస్త  ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు కూడా అద్భుతాలు సాధిస్తారు.                               *రూపశ్రీ.

life partner choosing mistakes

లైఫ్ పార్ట్నర్ ను ఉపయోగించుకునే వాళ్లు ఎలా ఉంటారంటే..!

ప్రతి వ్యక్తి జీవితంలో భాగస్వాముల పాత్ర చాలా ప్రత్యేకమైనది. జీవితంలో ఒక దశ వచ్చాక బయటి నుండి ఒక వ్యక్తి జీవితంలోకి వస్తారు.  వారితోనే ఇక జీవితం అనుకోవాల్సి ఉంటుంది. కష్టం, నష్టం, సుఖం,  బాధ.. ఇలా అన్నీ వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలాంటి సమస్యలు లేకుండా సాగడం చాలా అరుదు.  ఎందుకంటే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు,  వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలలో పెరిగిన వ్యక్తులు ఒకచోట కలసి ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమే.. కానీ ఇద్దరూ నిజాయితీగా ఉండే వ్యక్తులు అయితే సమస్య ఎక్కువ ఉండదు. కానీ ఒకరు కుటిల మనస్తత్వం కలిగిన వారు అయితే వారితో బంధం సాగడం కష్టమే కాదు.. అలాంటి వారు తమ భాగస్వామిని వాడుకోవాలని చూస్తారు. అలాంటి వారు ఎలా ఉంటారో.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుంటే.. అపరాధ భావం.. లైఫ్ పార్ట్నర్ తప్పు చేసిన భావనను వ్యక్తం చేయడం ద్వారా తన పార్ట్నర్ ను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో ఎమోషనల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది.  లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారంటే.. తన అవసరాలను,  తన సంతోషానికి తగిన విధంగానూ తన పార్ట్నర్ లేరు అనే విధంగా బిహేవ్ చేస్తారు. దీనికి తగిన కారణాలను కూడా వ్యక్తం చేస్తారు. దీంతో పార్ట్నర్ కోసం మారిపోయే అమాయకులు ఉంటారు. ఇలా మారిపోగానే తమ అవసరాల కోసం వాడేసుకుంటూ ఉంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనేది చాలా దారుణమైన చర్య.  ఇది మనిషిని నేరుగా ఏమీ అనకుండా తమకు నచ్చినట్టు మార్చుకునే మార్గం.  తన భాగస్వామిని తన అవసరాల కోసం ఉపయోగించుకోవాలి అనుకునే లైఫ్ పార్ట్నర్ కూడా అలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. వారు చెప్పిన మాట వినకపోతే కోపంగా ఉండటం, విచారంగా ఉండటం, అదే పనిగా బాధపడటం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వారికోసం మారిపోతారని వారికి తెలుసు. అబద్దాలు.. అబద్దాలు జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా ముఖ్యం. ఇవి చాలా సహాయపడతాయి.  జీవితాలను నిలబెడతాయి.  కొన్ని పనులను సులభతరం చేస్తాయి.  ఎదుటివారికి నష్టం జరగనంతవరకు  అబద్దం చెప్పడం తప్పేమీ కాదు.. కానీ భాగస్వామి అబద్దాలు చెప్పడం ద్వారా తన పార్ట్నర్ ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయంలో ఎప్పుడూ అబద్దాలు చెబుతుంటారు. తప్పు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా తప్పు దారిలో పార్ట్నర్ ను తీసుకెళతారు.  దీనివల్ల వారు లాభపడి,  పార్ట్నర్ ను వాడుకుంటారు. గ్యాస్ లైటింగ్.. గ్యాస్ లైటింగ్ చాలామందికి తెలియదు కానీ.. ఇది మనిషిని మానసికంగా గందరగోళానికి గురి చేసే చర్య. ఏదైనా మర్చిపోయినట్టు,  ఏదైనా గుర్తులేనట్టు,  మతి భ్రమించిందని నమ్మించేట్టు, జ్ఞాపకశక్తి క్షీణించిందని చెప్పడం,  పిచ్చి పట్టిందని నమ్మేలా చేయడం.. అబద్దాలు చెబుతున్నారని నిందలు వేయడం, అనుమానించడం, మనుషులలో కలవనీయకుండా ఒంటరిగా ఉంచడం, కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరం చేయడం..   ఇలాంటివి చేసి మనిషిని మానసికంగా ఆలోచలు లేకుండా, వారు ఎప్పుడూ ఇతరుల ముందు మాట్లాడకుండా చేస్తారు.  ఇలాంటివి చేసే వారు తమ భాగస్వామిని చాలా దారుణంగా ఉపయోగించుకుంటూ ఉంటారు.                                           *రూపశ్రీ.

International Mind Body Wellness Day

మన ఆరోగ్యమే మనకున్న  గొప్ప సంపద.... ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డే 2025..!

  మనం స్కూలులోనో, కాలేజీలోనో చదివేటప్పుడు క్లాస్ రూంలో టీచర్స్ పాఠాలు చెప్పేటప్పుడు  సరిగా వినకుంటే ఓ మాట అనేవారు.. మనిషివి ఇక్కడే ఉన్నావ్ కానీ ఎక్కడ ఆలోచిస్తున్నావ్ అని.  దీన్నే “బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్” అని అంటుంటారు.  అప్పట్లో దీని గురించి పెద్దగా అర్థమయ్యేది కాదు కానీ రాన్రానూ వయసు పెరిగేకొద్ది ఇందులో ఉన్న నిజం, దీని వల్ల మనిషికి ఏర్పడిన పరిస్థితి  స్పష్టంగా అర్థమవుతోంది అన్నది నిజం.  ఎలాంటి  పనినైనా  ఏకాగ్రతతతో చక్కగా చేయాలంటే దానికి మన శరీరం, మనస్సు రెండూ ఆ పని మీదనే ధ్యాస పెట్టాలి. ఆ రెండూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనం చేసే పనికి సరైన ఫలితం దక్కుతుంది. రెండూ ఒక పనిమీద ఏకాగ్రత కాలేదంటే దాని అర్థం మనిషి శరీరం, మనసు రెండూ సమన్వయంలో లేవని.  మనిషి  శరీరం, మనస్సులు ఆరోగ్యంగా ఉండటం  ఎంత ముఖ్యమో అందరూ అర్ధం చేసుకోవాలన్న లక్ష్యంతో  ప్రతీ సంవత్సరం జనవరి3 వ తేదీన ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకునే మైండ్ హెల్త్,  బాడీ హెల్త్.. ఈ రెండింటిని సంపాదించుకునే మార్గం.. మొదలైన విషయాలు తెలుసుకుంటే.. మైండ్-బాడీ వెల్నెస్ అంటే.. మైండ్-బాడీ వెల్నెస్ అనేది శారీరక, మానసిక ఆరోగ్యాల మధ్య సమతుల్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం శారీరక ఆరోగ్యం ఉంటే సరిపోదు.  మానసికంగా ప్రశాంతత, సంతృప్తిగా ఉండటం   కూడా అవసరం. ఎందుకంటే మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ విషయాన్ని స్వయానా వైద్యులు, పరిశోధకులు వెల్లడిస్తున్నారు.  గుండె జబ్బులు,  తలనొప్పి వంటి సమస్యలకు మానసిక ఒత్తిడి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు..  సానుకూల ఆలోచనల ప్రభావంతో  రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని, దేని నుంచైనా త్వరగా కోలుకునే  శక్తి  కలుగుతుందని  తేలింది. మైండ్-బాడీ ఆరోగ్యం ఇప్పుడు చాలా అవసరం.. ప్రస్తుత పరిస్థితుల్లో  బిజీ లైఫ్, పనిలో ఒత్తిడి, అనారోగ్య అలవాట్లు తదితర కారణాల వల్ల  ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ చూపిస్తున్నారనే మాట వాస్తవం. దానివల్ల  ఇప్పటి తరం వారు శారీరకంగా, మానసికంగా చాలా బలహీనమైపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డే ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు అర్థం కావాలి.  శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడు చాలా ఆరోగ్యకరంగా ఉండటం చాలా ముఖ్యమని మైండ్-బాడీ వెల్నెస్ డే అందరికి అర్థమయ్యేలా చేస్తుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను చర్చించేందుకు, అవగాహన పెంచేందుకు వారధిగా నిలుస్తుంది.  ఈ రోజు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేలా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించవచ్చు.  మంచి  ఆహారపు అలవాట్లను, వ్యాయామ పద్ధతులని  అందరికీ తెలియజేయవచ్చు..  యోగా, మెడిటేషన్ క్యాంపులు పెట్టి,  మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్, యోగా వంటివి చేయడం ఎంత అవసరమో తెలియజేస్తారు. మానసిక ఆరోగ్యంపై సెమినార్స్ పెట్టి సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తారు. మనమేం చేయాలి.... మైండ్-బాడీ వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎందుకంటే ఒకరు చెప్పడం వల్ల ఎవరి శరీరంలోనూ మార్పు రాదు. మానసిక, శారీరక ఆరగ్యం బాగుండాలంటే ప్రతి ఒకరు తమ గురించి తాము కేర్ తీసుకుని తమ ఆరోగ్యాన్ని తాము రక్షించుకోవాలి.  జీవనశైలి సరిచేసుకుని సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నీరు త్రాగటం,  నిత్యం వ్యాయామం చేయడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా చేయడం,  తగినంత నిద్రపోవటం వంటివి ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనుషుల  ఆలోచనా విధానం మంచిగా ఉంటుంది.  ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి శారీరక, మానసిక శ్రేయస్సు సాధించడంలో అందరూ  కలసి పనిచేయాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని సిరి సంపదలున్నా ఈ రోజుల్లో  ఆరోగ్యమే   చేతిలో ఉండే నిజమైన సంపద.. అందుకే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.                                                                  *రూపశ్రీ.

Business Ideas

డబ్బు సంపాదించే భలే మార్గం.. ఇంట్లోనే ఇలా కరెంట్ ఉత్పత్తి చేసి అమ్మవచ్చు..!

ప్రపంచం మొత్తం ఇప్పుడు విద్యుత్ గుప్పెట్లో చిక్కుకుంది.  ఒక్క నిమిషం విద్యుత్తు లేకపోతే చాలా సతమతం అయిపోతారు. ఇంట్లో వంట వండే రైస్ కుక్కర్ల నుండి, స్నానం చేయడానికి వాడే గీజర్.. ట్యాంక్ లో నీళ్లు నింపే మోటర్, ఇంట్లో ఫిడ్జ్, టీవీ,  ఫ్యాన్,  మొబైల్ ఫోన్.. ఇలా ప్రతి ఒక్కటి కరెంట్ ఆధారంగా పనిచేసే  వస్తువులే ఉంటున్నాయి. దీని వల్ల విద్యుత్ వినియోగం పెరిగింది. సాధారణంగా చలికాలం కంటే వేసవి కాలంలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. వందలు, వేల కొద్ది విద్యుత్ ఛార్జీలు భరించలేక ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటారు. అయితే ఇంటి వద్దనే విద్యుత్ ఉత్పత్తి చేసి అటు కరెంట్ బిల్ తప్పించుకోవడమే కాకుండా.. ఎంచక్కా విద్యుత్ అమ్మి డబ్బు సంపాదించవచ్చు.  దీనికోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ప్రభుత్వ మద్దతు.. ఇంటి పట్టునే విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024,  ఫిబ్రవరి 13వ తేదీన సూర్యఘర్ యోజన ను ప్రారంభించారు.  ఈ పథకం కింద ఇంట్లోనే విద్యుత్ వినియోగానికి ప్రభుత్వం నుండి సబ్సీడీ కూడా లభిస్తుంది. ఈ పథకం కింద రూఫ్ టాఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పటు చేసుకోవచ్చు.  ఇలా ఏర్పాటు చేసుకునేందుకు కోటి కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.15వేలు లభిస్తుంది. సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి పథకానికి సంబంధించిన పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.  యూజర్ ఐడీ,  పేరు,  అడ్రస్,  ప్లాంట్ సామర్థ్యం వంటి వివరాలు అన్నీ అందులో పూరించాలి. దీని తర్వాత డిస్కమ్ కంపెనీలు పోర్టల్ లో పొందుపరిచిన వివరాలు అన్నీ దృవీకరించి ప్రాసెస్ ను ముందుకు తీసుకెళ్తాయి.  సౌలభ్యాన్ని బట్టి కొనుగోలు దారులను ఎంచుకోవచ్చు. ప్యానెల్ లు ఇన్ స్టాల్ చేసిన తర్వాత డిస్కామ్ నెట్ మీటరింగ్ ను ఇన్స్టాల్ ఇస్తుంది.  అప్పుడు సర్టిఫికెేట్ పోర్టల్ లో అప్ లోడ్ చేయబడుతుంది. దీని తర్వాత ప్రభుత్వం  సబ్సీడీ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఇన్వర్టర్ బ్యాటరీలలో నిల్వచేసి విద్యుత్ ను విక్రయించవచ్చు. ప్రభుత్వం సబ్సీడీ రావడమే కాకుండా విద్యుత్ ను యూనిట్ చెప్పున ధర చెల్లించి కంపెనీలు కొనుగోలు చేస్తాయి.  దీనివల్ల ఆదాయం బాగుంటుంది.                                               *రూపశ్రీ.  

తెరవని పుస్తకాల్లాంటివారు... ఈ అంతర్ముఖులు... వరల్డ్ ఇంట్రోవర్ట్ డే.. 2025..!

మన చుట్టూ మనుషులందరూ  ఒకేలా ఉండరు, ఒకేలా ఆలోచించరు  అనే విషయం మనకి తెలిసిందే. కొందరు ఎప్పుడూ సరదా సరదాగా ఉంటూ, చుట్టుపక్కల మనుషులందరితో  సులువుగా కలిసిపోతారు. ఇంకొందరు ఎక్కడున్నా నలుగురిలో అంత సులువుగా కలవలేక కొంచెం మొహమాటంగా, నెమ్మదిగా ఉండాలనుకుంటారు. ఇంకొందరు తనకి అలవాటున్న చోట  ఫ్రీగా ఉండగలుగుతారు, అలవాటు లేనిచోట మౌనంగా ఉండిపోతారు. సైకాలజిస్టులు మనుషుల స్వభావాలను బట్టి వివిధ రకాలుగా విభజించారు. వీరిలో ఒక్కొక్కళ్ల ప్రవర్తనను బట్టి ఒక్కో విధమైన రకమైన గుణాన్ని ఆపాదిస్తూ ఉంటారు.  తప్పు చేయకపోయినా సరే సమాజంలో తప్పుగా అర్ధం చేసుకోబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లలో ఇంట్రోవర్స్ ప్రథమ స్థానంలో ఉంటారు. ఒంటరితనాన్ని ఇష్టపడే ఇంట్రోవర్ట్ లు చాలా వరకు తమ చుట్టు ప్రక్కల ఉన్నవారి నుండి విమర్శలే ఎక్కువగా ఎదుర్కొంటు ఉంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంట్రోవర్టులని అర్థం చేసుకోవడానికి, వారిని గౌరవించడానికి, వారి ప్రత్యేకతను  వెలుగులోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక రోజును ఏర్పాటు చేశారు.  ప్రతీ సంవత్సరం జనవరి 2ను ‘వరల్డ్ ఇంట్రోవర్ట్ డే’గా జరుపుకుంటున్నారు. కొందరు ఇంట్రోర్ట్ లు అనే విషయం వారికి కూడా తెలియదు. ఈ సందర్బంగా ఇంట్రోవర్ట్ ల గురించి కాస్త వివరంగా తెలుసుకంటే.. ఇంట్రోవర్ట్స్ అంటే .. ఇంట్రోవర్ట్స్  అంటే ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తులు.  వీరు ప్రశాంతమైన, నెమ్మదిగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడతారు. సామాజిక కార్యకలాపాల్లో  ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ ఆ తర్వాత అలసిపోయిన ఫీలింగ్లో ఉంటారు.  తమను తాము తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.  ఇంట్రోవర్ట్స్  మెదడు డోపమైన్ అనే రసాయనానికి భిన్నంగా ప్రతిస్పందిస్తుందని సైకాలజీ తెలుపుతుంది. సైకాలజీ ఏం చెప్తోందంటే.. ఇంట్రోవర్ట్స్  గురించి సైకాలజీ చాలా చెబుతుంది.  ఇంట్రోవర్ట్ గురించి మాట్లాడిన  తొలి ప్రముఖులలో స్విస్ సైకాలజిస్టు కార్ల్ గుస్తావ్ జంగ్ ఒకరు. 1921లో ఆయన రాసిన "సైకాలజికల్ టైప్స్" అనే పుస్తకంలో ప్రతి మనిషిని అంతర్ముఖులు లేదా బహిర్ముఖులుగా విభజించవచ్చని ప్రతిపాదించారు. అంతర్ముఖులను గ్రీస్ దేవుడు అపోలోతో పోల్చి వారు లోతైన ఆలోచనలతో ఉంటారని చెప్పారు. అప్పటినుంచి, మరెన్నో సైకాలజీ సిద్ధాంతాలు ఇంట్రోవర్ట్స్  గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడ్డాయి. ఇంట్రోవర్ట్స్ గురించి తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ఇంట్రోవర్ట్స్  కొత్త విషయాలకు  త్వరగా స్పందించగలుగుతారు.  కానీ మార్పును గమనించడంలో కొంచెం సమయం తీసుకుంటారు.  వీరు ఏదైనా సమస్య, ప్రమాదం,  ఇబ్బంది మొదలైన విషయాలకు అస్సలు భయపడరు. కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు లోతుగా ఆలోచిస్తుంటారు. సృజనాత్మకంగా కూడా ఉంటారు. వీరు బహిర్ముఖుల్లా నటించే ప్రయత్నం చేస్తే వారి పనితీరు మీద ప్రభావం పడుతుంది.  వీరికీ సంతోషం అత్యంత ప్రాధాన్యతగల విషయంగా అనిపించదు. ఇంట్రోవర్ట్స్ డే  ఇలా మొదలైంది.. "హాపిలీ ఇంట్రోవర్టెడ్ ఎవర్ ఆఫ్టర్" అనే ఉచిత ఈ-బుక్ రచించిన జర్మనీకి చెందిన ప్రసిద్ధ సైకాలజిస్టు ఫెలిసిటాస్ హైన్ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవాన్ని సృష్టించినట్టు చెబుతున్నారు. 2011 సెప్టెంబర్ 20న ఆమె తన "ఐపర్సానిక్" వెబ్‌సైట్‌లో " ఇందుకే మనకు ప్రపంచ ఇంట్రోవర్ట్ డే  అవసరం" అనే శీర్షికతో బ్లాగ్‌ను ప్రచురించారు. ఈ వ్యాసం వరల్డ్ ఇంట్రోవర్ట్ డేకి ప్రేరణగా నిలిచింది. అంతర్ముఖులను అర్థం చేసుకోవాలి.. వరల్ట్ ఇంట్రోవర్ట్ డే అనేది ఇంట్రోవర్ట్ లను అర్థం చేసుకోవడం కోసం చేయూత ఇస్తుంది.  ఇంట్రోవర్ట్ డే రోజు వారి స్వభావం  వారి సామర్థ్యాన్ని  ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇంట్రోవర్ట్ లు చాలా వరకు గొప్ప వ్యక్తులుగా ఉంటారని,  గొప్ప స్థాయికి చేరతారని అంటుంటారు.  చరిత్రలో చార్లెస్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ వంటి  చాలామంది తెలివైన మనుషులు ఇంట్రోవర్ట్స్ అనే విషయం ఇంట్రోవర్ట్ ల శక్తి,  సామర్థ్యాలను తెలుపుతుంది. సమాజంలో చాలామటుకు ఇంట్రోవర్ట్స్ గురించి చెడు అభిప్రాయం ఉంది.  నలుగురిలో కలవరని,  నలుగురితో ఫ్రీగా మాట్లాడరని,  పొగరుగా ఉంటారని,  సర్దుకుపోయే స్వభావం కలిగి ఉండరని.. ఇలా చాలా అంటుంటారు.   కానీ ఇది వారిలో ఉండే పొగరుతోనో.. వారు నలుగురిలో కలవడం ఇష్టపడకో జరిగేది కాదు. ఒంటరితనంగా ఉండటం,  గంటల కొద్ది  ఆలోచనలలో మునిగిపోయి ఉండటం అనేది ఇంట్రోవర్ట్ లకు ఇష్టమైన అంశం. నిజం చెప్పాలంటే ఒంటరిగా ఉండటం, ఆలోచించడం అనే విషయాలే ఇంట్రోవర్ట్ లు జీవితంలో ఎదగడానికి చాలా సహాయపడతాయి.  కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వెయ్యాల్సిన పని లేదు.  ఏది ఎలా ఉన్నా..  మనుషులంతా  స్వాభావికంగా వేరేగా ఉన్నప్పటికీ ఒకరికొకరం సరిగా అర్ధం చేసుకుని, సమిష్టిగా నడవటం చాలా ముఖ్యమని అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో,  సమాజంలో,   చుట్టుపక్కల ఉన్నవాళ్ళని సరిగా అర్ధం చేసుకొనే ప్రయత్నం మొదలుపెడితే  అందరూ సంతోషంగా ఉండవచ్చు.                                                       *రూపశ్రీ.                                                          

న్యూ ఇయర్ రిజల్యూషన్.. కొత్త ఏడాది నిర్ణయాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన విషయమిదే..!

  కొత్త.. అనే పేరులోనే చాలా గొప్ప ఆశావాదం ఉంటుంది.  కొత్త దనం ఎప్పుడూ మంచే చేస్తుందనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది.  ఈ పాజిటివ్ ఆలోచన వల్లనే చాలామంది కొత్తదనం అంటే ఆసక్తిగా ఉంటారు. కొత్తదనం అంటే జీవితానికి బోనస్ లాంటిది.   అయితే కొత్తగా మొదలు పెట్టేది ఏదైనా సరే జీవితానికి మేలు చేసేది అయి ఉండాలి. ఏ పని చేయాలన్నా దానికి ఓ పద్దతి, పాడు ఉంటుంది.  ముఖ్యంగా ఏ పని చేయాలన్నా దానికి తగిన ఆలోచనా విధానం,  శరీర ఆరోగ్యం సహకరించాలి. ఇవి రెండూ లేకపోతే ఏ పని అయినా సమర్థవంతంగా చేయలేరు.  అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.  కొత్త ఏడాది తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానివ్వండి.. అది ఎంత గొప్పది అయినా కానివ్వండి.. వాటిలో ముందు వరుసలో.. మొట్టమొదటగా ఉండాల్సినది ఆరోగ్య రక్షణ.  కొత్త ఏడాది చాలా మంది తీసుకునే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లో ఆరోగ్యం కు సంబంధించి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.  ఇంతకీ ఈ కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలను గూర్చి తెలుసుకుంటే..  మంచి ఆరోగ్యం సంపాదించానే నిర్ణయం తీసుకోవడం  భవిష్యత్తులో అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యం ఉంటేనే జీవితంలో ఏదైనా చేయగలం అని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో  కనిపించే అన్ని వ్యాధులలో ఒక విషయం సర్వసాధారణంగా చెబుతున్నారు. అదే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం.  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో తీవ్రమైన జబ్బులు  వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. బరువు.. బరువు తగ్గడం  మెరుగైన ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దశల్లో ఒకటి.  శరీర బరువులో కేవలం ఐదు నుండి పది శాతం తగ్గడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం,  అధిక రక్తపోటు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. బరువు తగ్గాలంటే రోజూ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు ఇందులో చాలా ముఖ్యమైనది.  బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా అనేక  వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే కొన్ని ప్రత్యేక ఆహారాలను కూడా అనుసరించవచ్చు. కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఆహారాన్ని మెరుగుపరచడంపై శ్రద్ధ పెట్టాలి . ఆరోగ్యకరమైన ఆహారం అంటే  ఏమి తింటారు,  ఎలా తింటారని అర్థం. ప్రతి రోజు  ఆహారంలో పండ్లు,  కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు,  కూరగాయలలో తక్కువ కేలరీలు,  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటాయి.  కొత్త ఏడాది సందర్భంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పకుండా ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటామని ఎవరికి వారు వాగ్దానం చేసుకోవాలి.  పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్,  షుగర్ పెరగకుండా నిరోధిస్తాయి. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే ఆకుపచ్చ కూరగాయలతో పాటు నట్స్,  విత్తనాలను ఆహారంలో చేర్చడం ద్వారా యాంటీఆక్సిడెంట్లను పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధులకు శారీరక నిష్క్రియాత్మకత ప్రధాన కారణమని చాలా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి . రోజులో ఎక్కువ సమయం కూర్చొని లేదా విశ్రాంతి తీసుకునే వ్యక్తులు నడుస్తూ ఉండే వ్యక్తుల కంటే రక్తపోటు, కొలెస్ట్రాల్,  మధుమేహం మొదలైన అనేక ఆరోగ్య రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, 2025 సంవత్సరంలో మీ దినచర్యలో - తక్కువగా కూర్చోవడం -ఎక్కువగా నడవడం అనే విషయాన్ని చేర్చుకోవాలి. దీన్ని ఆచరణలో ఉంచాలి కూడా. రోజువారీ జీవితంలో శారీరక శ్రమను పెంచడం లక్ష్యంగా పెట్టుకోవాలి. లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించడం, దగ్గరగా ఉన్న ప్రదేశాలకు డ్రైవింగ్ చేయడానికి బదులుగా నడుచుకుంటూ వెళ్లడం. మీరు రోజంతా ఆఫీసులో ఉంటే అప్పుడప్పుడు సీట్ నుండి లేచి నడవడం వంటివి చేయాలి. ఈ అలవాటు  ఆరోగ్యంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది. ఆరోగ్య పరీక్షలు.. చాలా ఆరోగ్యం బానే ఉందిగా మళ్ళీ పరీక్షలకు డబ్బులు దండగ అనే ఆలోచనలో ఉంటారు. అయితే ఆరోగ్య పరీక్షలు జబ్బుల ఉనికిని ముందుగానే గుర్తిస్తాయి.  దీనివల్ల ఒకరిగేది ఏంటంటే.. శరీరం ఎక్కువ బాధపడకుండా.. ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడం.  సమస్య పెద్దది అయ్యాక వైద్యం కోసం చేయాల్సిన ఖర్చులో కనీసం 10శాతం ఖర్చులు పెట్టి ముందుగానే పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో షుగర్,  రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవచ్చు.  దీని కోసం ఇంట్లో సదరు పరికరాలు ఇంట్లోనే ఉంచుకోవచ్చు. శరీర స్థితికి తగ్గట్టు ఏ పరీక్షలు అవసరమో   ఆరోగ్యానికి అనుగుణంగా ఏ పరీక్షలు చేయించుకోవాలో అనే విషయాన్నివైద్యుల సలహాతో తెలుసుకోవాలి.  ఆరోగ్యాన్ని సంపాదించుకునే పనిలో ఈ కొత్త ఏడాది మరింత మెరుగ్గా ఉండాలి.                                            *రూపశ్రీ.

మీక్కూడా ఆఫీసులో చిరాకు పెరుగుతుందా? ఇలా జరగచ్చు జాగ్రత్త..!

  జీవితంలో ప్రతి ఒక్కరికీ నిర్వర్తించే వృత్తి చాలా కీలకమైనది.  జీవితం గడవడానికి ఆ వృత్తే సంపాదనను అందిస్తుంది. ప్రతి వ్యక్తి రోజులో సింహభాగం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలోనే గడుస్తుంది.  అయితే ఆఫీసులో ఒత్తిడి,  చిరాకు వంటి సaమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి.  వీటిని కొందరు తేలికగా తీసుకుని చాలా ఈజీగా డీల్ చేస్తే.. మరికొందరు ఒత్తిడి,  చిరాకు వంటి విషయాలకు చాలా అతిగా రియాక్ట్ అవుతుంటారు. ఇలా ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి కలగడం వల్ల ఉద్యోగులకు మనోబలం తగ్గుతుంది. ఆఫీసులలో చాలా అనుకువగా పనిచేసే ఉద్యోగులు,  పై అధికారులు ఎక్కువగా అధిపత్యం చెలాయించే ఉద్యోగులు కొందరు ఉంటారు. ఇలాంటి వారికి ఆఫీసులో ఉద్యోగపరంగా ఆసక్తి కోల్పోతుంటారు.  ఈ ఆసక్తి తగ్గడం కారణంగా ఉద్యోగుల పని నాణ్యత,  వారి పని చేసే తీరు మారిపోతుంది. సాధారణంగా చేసే పనిని నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుని పని చేస్తుంటారు. నిరుత్సాహం వల్ల తమ పని మీద ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతుంటారు.   ఉద్యోగస్థులు తమ పని మీద నిర్లక్ష్యంగా ఉండటం,  వారి పనిలో ప్రతి కూల ప్రభావం పడటం వంటివి జరగడం వల్ల వారు ఉత్తమ ఉద్యోగులు అనే ట్యాగ్ ను కోల్పోతారు. ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటే అక్కడ సరైన వాతావరణం,  ఉద్యోగులను ట్రీట్ చేస్తున్న తీరు సరిగా లేదని అర్థం.  దీని వల్ల ఉద్యోగులు పని  చేస్తున్న చోటు నుండి వెళ్లిపోయే ఆలోచనలో ఉంటారు.  ఇది సంస్థలకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది. ఆఫీసులో ఎదురయ్యే చిరాకులు,  ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో తప్పుగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  దీని వల్ల పని చేసే వాతావరణం  అనారోగ్యకరంగా మారుతుంది. చాలా కాలం పాటు ఉద్యోగుల మద్య గొడవలు,  నిరాశ,   ఒత్తిడి, చిరాకు వంటివి కొనసాగుతుంటే..  అవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగులలో కోపం,  రక్తపోటు సమస్యలు,  మధుమేహం వంటివి కూడా ఇలాంటి సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కంపెనీలు ఉద్యోగులను పని యంత్రాలుగా చూస్తుంటాయి.  అలాంటి చోట్ల ఉద్యోగస్థులు చాలా ఎక్కువ వైఫల్యం అవుతుంటారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగస్థుల మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. కంపెనీలు ఉద్యోగుల మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే కార్యాకలాపాలను కూడా చేపడుతుండాలి. అపుడే ఉద్యోగస్థులు మానసికంగా బలంగా ఉండి సంస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా చేయగలుగుతారు.                                       *రూపశ్రీ

తప్పటడుగులకి సరిహద్దు.. భవిష్యత్తుకి సరికొత్త ఆరంభం... ఈ కొత్త సంవత్సర రాత్రి వేడుక..

  కొత్త సంవత్సరం రాబోతుందన్నప్పుడు ముందు రోజు నుంచే చాలామందిలో ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది. ఫ్రెండ్సుతో పార్టీలు, ఫ్యామిలీతో  షోలు  ఇలా ఏవేవో చేసుకోవాలనే ప్లాన్స్ వేసేసుకుంటారు. ఈ రాత్రిని ఒక ఎంజాయ్ మెంట్ టైముగా చూసే వారు కొందరుంటే, తమ జీవితాల్లో నుంచి ఇంకో సంవత్సరం జారిపోతుంది, ఇకనైనా భవిష్యత్తు బాగుపడే రోజులు వస్తాయా అనే ఆలోచనలో మరికొందరు ఉంటారు. ఈ రోజులో ఏముంది ప్రత్యేకం? సంవత్సరంలో మిగతా రోజుల్లానే ఇది కూడా ఒకటే కదా..  ఆలోచించి చూస్తే దేనికయినా ఒక ఆరంభం,  ఒక హద్దు, ఒక ముగింపు ఉంటాయి. చాలామంది ఒక పనిని ఆరంబించటానికో,  ఆ హద్దు వరకు చేయటానికో.. ఆ హద్దు దాటి  ముందుకు వెళ్లడానికో చూస్తుంటారు కదా... అలాంటప్పుడు రెండు సంవత్సరాల మద్య సరిహద్దుగా ఉన్న ఈ రోజు కొందరికి ఒక హద్దుగా, ఇంకొందరికి ఒక కొత్త ఆరంభంగా కనిపించి ఒక నూతన ఉత్తేజం కలిగిస్తుంది. చెడ్డ అలవాట్లు, తప్పుడు నిర్ణయాలు, చేసిన  పొరపాట్లు ఇలా మనల్ని జీవితంలో వెనక్కి లాగే విషయాలని దూరం చేసుకోవాలనే  సంకల్పం చేసుకోనే దిశగా.. భవిష్యత్తుని బాగు చేసే కొత్త ఐడియాలు, మంచి అలవాట్లు వంటి వాటికి ఆరంభంగా ఉన్న ఈ రోజు ఎందరో జీవితాలకి మలుపు అవుతుంది. పాత సంవత్సరం చివరి రోజున, మనం గత సంవత్సరంలో జరిగిన సంఘటనలను అన్నీ గుర్తు చేసుకుంటూ, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తించి, కొత్త  ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాము. ఈ రాత్రి మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది - "ఎప్పుడూ ముందుకు పోతూ ఉండు, పాత బాధలను మర్చిపోయి, అవి నేర్పిన పాఠాలు మాత్రం గుర్తుంచుకుని విజయం వైపు కొత్త అడుగులు వేయి, లేదంటే కాలం కథలో వెనకబడిపోతావు” అని. ఎందుకంటే కాలం ఎవరికోసమూ  ఆగదు. కొత్త సంవత్సరం పలకరించబోతున్న ఈ సమయంలో    పాత బాధలను, త్యాగాలను, తప్పులను వదిలిపెట్టి ఒక సరికొత్త ఆరంభంలా  భావించి ప్రతి ఒక్కరూ  ఒక కొత్త దిశగా అడుగులు వెయ్యాలనుకుంటారు.  తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త లక్ష్యాలను పెట్టుకొంటారు. ఇప్పటి యువత ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్’ అని  తమ జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు ఈ రోజే చేస్తారు.  ఒక కొత్త అవకాశంగా మారే ప్రతీ రోజుని  అందుకోవటానికి సిద్ధమవుతారు. గ్రెగోరియన్  క్యాలెండర్‌ ప్రకారం  ప్రపంచమంతటా డిసెంబర్ 31వ తేదీన వివిధ సంప్రదాయాల్లో  నూతన సంవత్సర ఉత్సవం జరుపుకుంటారు. మన దేశంలో కూడా ఈ రోజున జరుపుకుంటారు. కానీ  భారత దేశం చుట్టు ఉన్న దేశాల భోగోళిక స్థితి, సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు మార్చ్ చివరి రెండువారాల్లోనో లేదా ఏప్రిల్ మొదటి రెండు వారాల్లోనో జరుపుకుంటుంటారు. ప్రతి ప్రాంతం వారి సంస్కృతి, నమ్మకాలు, ఆచారాల ప్రకారం ఈ సంప్రదాయాలు విభిన్నం గా ఉంటాయి. అయితే ఏ ప్రాంతమైనా, ఏ సమయమైనా,   ఏ సాంప్రదాయం ప్రకారం చూసినా అన్నింటిలోనూ ప్రజలకి ఉండే కోరిక, ఉద్దేశ్యం ఒక్కటే.. “తమ జీవితాల్లో అంతవరకు ఉన్న పాత సమస్యలు, బాధలు తొలగిపోయి కొత్త అవకాశాలు, ఆనంద క్షణాలు రావాలని. ఈ కొత్త సంవత్సర రాత్రిన  చాలామంది  పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుంటారు. అందరూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొత్తగా   పరిచయమైనవాళ్లతో కలిసి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఎంజాయ్మెంట్లో తమ పాత భాధలు మర్చిపోయి, కొత్త ఆశలు, కోరికలు, కొత్త ప్రయత్నాలు అనుకుంటూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం చెప్తారు.  దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి, విందు  వినోదాలలో మునిగి, ప్రేమాభిమానాలు, సుఖసంతోషాలు  పంచుకుంటారు. ప్రతి ఏడాది వస్తుంది.. తనతో బోలెడు కాలాన్ని ప్రతి వ్యక్తి చేతిలో పెడుతుంది.  ఏడాది పొడుగునా బోలెడు అనుభవాలు, బోలెడు పాఠాలు అందరికీ చెబుతుంది.  ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మూలమవుతుంది. ఈ కొత్త ఏడాది కూడా అందరికీ మంచి చేకూర్చాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం.  ప్రపంచ దేశాలన్నీ ఒక కుటుంబంలా భావిస్తే, కుటుంబ కలహాలు తొలగిపోయి, మన భూమాత ఇంట అంతా ఆనందమే తాండవమాడుతుంది.  పాత ఏడాదికి వీడ్కోలు చెప్తూ.. కొత్త ఏడాదిని ఆశతో ఆహ్వానిద్దాం.                                           *రూపశ్రీ.