Poliset Counseling Schedule Released.. Counseling Starts on 20th June

పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. జూన్ 20న కౌన్సిలింగ్ ప్రారంభం 

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో  తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ ఉండనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్‌ని కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కి అవకాశమిచ్చారు. జులై 24న సీట్లను కేటాయించి... జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు.ఇంజినీరింగ్ కౌన్సిల్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ, జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. జులై 19న రెండో విడత కౌన్సెలింగ్, జులై 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30న ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్, ఆగస్ట్ 5న తుది విడత సీట్లను కేటాయించనున్నారు.

Land grab case in Chevella against former Armoru MLA

ఆర్మూరు మాజీ ఎమ్మెల్యేపై చేవెళ్లలో భూ కబ్జా కేసు 

ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన నేర చరిత్ర ఒక్క ఆర్మూర్ ప్రజలకే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంత వాసులకు కూడా బోధపడింది. ఇప్పటికే ఆర్మూరులో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవన్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలు చేసిన ఆరోపణతో  కొత్త చరిత్ర సృష్టించారు.   బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశాడంటూ బాధితుడు ఒకరు చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2023లో ఫంక్షన్ హాలును కూల్చివేసి దానిని కబ్జా చేశారని బాధితుడు దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా ఉంచారని... తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు. కాగా, జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. అయితే ఆ భూమి తనదేనని... తాను నాలుగేళ్ల క్రితం దానిని కొనుగోలు చేశానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఈ భూమి వ్యవహారంలో జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.

helicoptor accident in kedarnath

హెలికాప్టర్ కూలిపోయేదే... బాబోయ్ గుండె దడ!!

ప్రముఖ పుణ్యక్షత్రం కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం జస్ట్ మిస్సయింది. ఉత్త‌రాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌‌ వెళ్ళే భక్తులు నడిచి వెళ్తారు. కొంతమంది హెలికాప్టర్లలో వెళ్తూ వుంటారు. దానికోసం ప్రైవేట్ ఛాపర్లు అందుబాటులో వుంటాయి. శుక్రవారం నాడు అలాంటి ఒక హెలికాప్టర్ ఏడుగురు భక్తులను కేదార్‌నాథ్‌కి తీసుకొచ్చింది. లాండింగ్ అవుతూ వుండగా ఉన్నట్టుండి ఏమైందోగానీ హెలికాప్టర్ గిరగిరా తిరగడం ప్రారంభించింది. హెలికాప్టర్ ఫ్యాన్ గిరగరా తిరుగుతుంది కదా.. ఇందులో కొత్తేముంది అనుకోకండి.. గిరగిరా తిరిగింది హెలికాప్టర్ చక్రం కాదు.. హెలికాప్టరే. దాంతో హెలీప్యాడ్ దగ్గర వున్నవాళ్ళందరూ భయంతో పరుగులు తీశారు. హెలికాప్టర్లో వున్న ఏడుగురి పరిస్థితి అయితే గుండె అరికాళ్ళలోకి జారిపోయింది. మొత్తానికి పైలట్ హెలికాప్టర్ని కంట్రోల్ చేశాడు. హెలిప్యాడ్‌కి పక్కనే లాండ్ చేశాడు. ఏడుగురు భ‌క్తులు సేఫ్ అయ్యారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ హెలికాప్టర్ గిర్రున తిరిగిందట. పైలెట్ కంట్రోల్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పైలెట్‌తో సహా ఎనిమిది మంది శివార్పణం అయిపోయేవారే.

Chandrababu wrote a letter to UPSC

యుపీఎస్సీకి లేఖ రాసిన చంద్రబాబు 

ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే నెల నాలుగో తేదీన వచ్చే ఫలితాల తర్వాత టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తున్న నేపథ్యంలో తప పరిపాలనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.   టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు.  ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం అని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందున ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎంవోలో ఉన్నవారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు.

jagan hates amaravati

‘అమరావతి’ అనే పదం జగన్‌ని భయపెట్టింది!

ఆ ఒక్క పదం జగన్ని రూటు మార్చుకునేలా చేసింది. ఆ ఒక్క పదం తనకు ఉపయోగపడే విషయాన్ని కూడా వద్దనుకునేలా చేసింది. ఆ ఒక్క పదం జగన్‌కి దడ పుట్టించి దూరంగా పారిపోయేలా చేసింది.. ఆ ఒక్కపదం.. తెలుగువారందరికీ నచ్చుతుంది కానీ, జగన్‌కి మాత్రం ఎంతమాత్రం నచ్చదు.. ఆ ఒక్కపదం మరేదో కాదు... ‘అమరావతి’. 2019 ఎన్నికలలో జగన్ కోసం ఐప్యాక్ సంస్థ ఒక పాటను రూపొందించింది. ఆ పాట ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్’ అంటూ సాగుతుంది. జగన్ పాదయాత్ర చేసిన విజువల్స్.ని, ముసలమ్మల్ని ముద్దుపెట్టుకున్న విజువల్స్ మీద ఆ పాటను ప్లే చేస్తూ జనంలోకి వదిలారు. నిజం చెప్పాలంటే ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించడానికి ఆ పాట కూడా కొంతవరకు ఉపయోగపడింది. నిజంగానే ఆ పాట ఒక సంచలనం. మరి అంత సంచలనంగా నిలిచిన ఆ పాట.. జగన్‌కి విజయాన్ని అందించడంలో తనవంతు భాగస్వామ్యం అందించిన ఆ పాట 2024 ఎలక్షన్ల ప్రచారంలో ఎందుకు వినిపించలేదో తెలుసా? దానికి ఒకే ఒక కారణం.. ఒకే ఒక పదం... ‘అమరావతి’! ‘రావాలి జగన్’ అనే పాటలో ఒక చోట ‘‘అమరావతి అంటున్నది.. ఆంధ్రావని అంటున్నది.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, పలనాడు, అంటున్నవి.. రాయలసీమలో గడపా గడపా అంటున్నవి.. రావాలి జగన్.. కావాలి జగన్’’ అంటూ ఒక చరణం వుంటుంది. అమరావతిని ఎలాగూ జగన్ సర్వనాశనం చేసేశాడు కాబట్టి ఇక ఇంతటి వీరుణ్ణి రావాలని అమరావతి ఎందుకు అంటుంది? అందువల్ల ఆ పాటలో ‘అమరావతి అంటున్నది’ అనే మాట తీసేసి పాటని ప్రచారంలో  ఉపయోగిద్దాం అని ఐప్యాక్ వాళ్ళు సూచించారట. అయితే ఆ పదం తీసేశారని అందరూ ట్రోల్ చేసే ప్రమాదం వుంది కాబట్టి జగన్ అసలు ఆ పాటనే వాడొద్దని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆ పాటలో వాగ్దానాల మీద వాగ్దానాలు వినిపించారు. ఈ ఐదేళ్ళకాలంలో అవేవీ నెరవేరలేదు. ఇప్పుడు ఆ పాట వినిపిస్తే జనం నవ్వుకుంటారని, మొత్తమ్మీద ఆ పాటనే వద్దని అనుకున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద ‘అమరావతి’ రాజధానిగానే కాదు.. ఒక పదంగా కూడా జగన్‌ని భయపెట్టింది.

ttd cancel vip break darshan

జూన్ 30 వరకూ ఆ మూడు రోజులూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో వేసవి రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేశస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. వచ్చే నెల 30వ తేదీ వరకూ శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వేసవి రద్దీ తగ్గిన తరువాత యథావిధిగా ఈ రోజులలో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని పేర్కొంది. వేసవి సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల దేవుని దర్శనానికి తరలి వస్తున్నారు. దీంతో వారాంతాలలోనే కాకుండా మామూలు రోజులలో కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. భక్తులు గంటల తరబడి క్యూలైన్ లో నిలుచోవలసి వస్తున్నది. టోకెన్లే లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొండపై బస దొరకడం కూడా భక్తులకు కష్టతరంగా మారింది. దీంతో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో కనీసం వారాంతాలలోనైనా సామాన్య భక్తులకు ఒకింత వేగంగా శ్రీవారి దర్శనం దొరికేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది. 

narayana set up fund worth 10 crores

నెల్లూరు తెలుగుదేశం కార్యకర్తల కోసం రూ. 10 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి నారాయణ

సాధారణంగా నాయకులు ఎన్నికలు పూర్తయిన తరువాత కౌంటింగ్ కు మధ్య ఉన్న సమయంలో విదేశాలకు వెళ్లి సేదతీరుతూంటారు. నిర్విరామంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న అలసట నుంచి తేరుకోవడానికి విదేశీ పర్యటనలు పెట్టుకుంటారు. అయితే తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాత్రం అటువంటి వారికి భిన్నం.   నారాయణ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.  ఎన్నికలైన తరువాత విరామం తీసుకోవడానికి బదులుగా ఆయన నియోజకవర్గంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఉన్నారు కూడా. ఎన్నికల తరువాత కూడా ఆయన పార్టీ నియోజకవర్గ నేతలతో తరచూ భేటీ అవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నేతలు కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. తన విజయం కోసం పని చేసిన వారికి కృతజ్ణతలు చెబుతున్నారు.   అంతటితో ఆగలేదు ఆయన నియోజకవర్గ  తెలుగుదేశం కార్యకర్తల కోసం పది కోట్లతో ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ ఫండ్ ద్వారా కార్యకర్తలకు అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం అందించనున్నారు.  అంతే కాకుండా నియోజకవర్గంలో ఎంపిక చేసిన 3000 మంది పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు జీవిత కాలం ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. దీనిని తన తదననంతరం తన కుటుంబ సభ్యులు   కొనసాగిస్తారని స్పష్టం చేశారు. పార్టీ కోసం కార్యకర్తలను నిర్లక్ష్యంగా చూసే నాయకులున్న ఈ రోజులలో నారాయణ తన నియోజకవర్గ కార్యకర్తల క్షేమం పట్ల శ్రద్ధ తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.

vijayasai started again

విజయసాయి మళ్లీ మెదలెట్టేశారు!

విజయసాయి.. సామాజిక మాధ్యమంలో  ప్రత్యర్థులపై విషం కక్కుతూ, అనుచిత భాషలో పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. విజయసాయి తాజా ఎన్నికలలో తొలి సారిగా పోటీ చేశారు. ఆయన మూడేళ్లకు పైగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పని చేశారు. అక్కడ నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే తానోటి తలిస్తే.. పార్టీ అధినేత మరోటి తలిచి చివరి క్షణంలో ఆయనను నెల్లూరు లోక్ సభ సరిధిలో దింపారు. అయిష్టంగానే అక్కడ నుంచి పోటీకి దిగిన విజయసాయి ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచీ ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.  వాస్తవానికి నెల్లూరు విజయసాయి స్వస్థలమే అయినా అక్కడ ఆయనకు ఎటువంటి ఆదరణా లభించలేదు. ప్రచారం సందర్భంగానే ఫలితమేమిటో స్వయంగా విజయసాయికే అర్ధమైపోయింది. అందుకు తగ్గట్టుగానే ఏ సర్వే కూడా అక్కడ విజయసాయి విజయం సాధిస్తారని పేర్కొనలేదు. ఆయన ఓటమిని ప్రచార సమయంలోనే సర్వేలు, పార్టీ శ్రేణుల స్పందనే ఖరారు చేసేసింది. స్వయంగా విజయసాయి కూడా అందుకు మానసికంగా సిద్ధమైపోయారు. అందుకే మే 13న పోలింగ్ జరిగితే.. నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన ఎక్కడా పెదవి విప్పిన దాఖలాలు లేవు. అయితే ఆ మౌనం నుంచి తాజాగా విజయసాయి బయటకు వచ్చారు. సోషల్ మీడియా వేదికగా తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్ తో చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ ఓ పోస్టు  పెట్టారు.  తాను చెప్పిందే వేదం, తానకు తెలిసిందే తర్కం అన్నట్లుగా ఉన్నాయి  విజయసాయి తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు. ఇంతకీ ఆ పోస్టులో విజయసాయి ఏమన్నారంటే.. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 అసెంబ్లీ  స్థానాలు వచ్చాయనీ, అందుకు కారణం ఆయన తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కోవడమేనని వివరణ ఇచ్చారు. ఈ సారి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాలలోనే విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదేం లాజిక్కో ఆయనకే అర్ధం కావాలి. పోనీ ఆయన లాజిక్ ప్రకారమే చూసుకున్నా.. వైసీపీ ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాక్కొన్నది. కనుక ఈ సారి ఎన్నికలలో ఆ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుంది. ఇదీ లాజిక్కే కదా? మరి ఆ విషయం విజయసాయికి ఎందుకు తట్టలేదో? విషయమేమిటంటే లాజిక్కైనా, న్యాయసూత్రాలైనా తమకు అనుకూలంగానే ఉంటాయనీ, ఉండాలని విజయసాయి భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలా ఉండవని తెలిసే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పడానికి జూన్ 4వ తేదీ ఎంతో దూరంలో లేదు. 

Kavitha bail plea adjourned to Monday

 కవిత బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా 

 మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే సూచనలు కనిపించడం లేదు   ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కౌంటర్ దాఖలు చేయగా... సీబీఐ గడువు కోరింది. కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.తాము మే 27న సీబీఐ కేసులో కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. మరోవైపు, ఈడీ కేసులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈడీ లాయర్లు కోర్టుకు తెలిపారు. అయితే జాబితాలోని కేసుల విచారణ తర్వాత తీసుకుంటామని జడ్జి తెలిపారు.ఈడీ కేసులో, కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్‌కు సంబంధించిన వివరాలు కవిత న్యాయవాదికి ఇవ్వాలని హైకోర్టు ఈడీని ఆదేశించింది. అనంతరం వాదనలను సోమవారానికి వాయిదా వేసింది.

Another shock for Mallareddy.. Demolition of encroachments at Bromasipeta pond site

మల్లారెడ్డికి మరో షాక్.. బ్రోమాసిపేట చెరువు స్థలంలో ఆక్రమణల కూల్చివేత 

షామీర్ పేట మండలం బ్రోమాసిపేట చెరువు ఆక్రమణలకు గురైందని ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో రెవిన్యూ అధికారులు స్పందించారు. తరచుగా భూ వివాదాలతో వార్తల్లోకెక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా బ్రోమాసిపేట ఫుల్ ట్యాంక్ లెవల్ లో అక్రమ నిర్మాణాలను  చేపట్టారు. దీంతో అప్రమత్తమైన రెవిన్యూ అధికారులు చెరువు పక్కనే ప్రహారీ గోడను కూల్చి వేశారు. బిఆర్ఎస్ హాయంలో భూ కబ్జాలు చేసిన మేడ్చెల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రో జుల క్రితం మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకించడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. జెసీబీ సాయంతో ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. 

ycp accept  defeat repeatedly

ఓటమి ఖాయం.. వైసీపీ పదే పదే అంగీకరిస్తున్నది ఇదే!

గెలుపు ఆశలు వదిలేసుకుంది. వస్తేగిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది లేకుంటే అదీ లేదని డిసైడైపోయినట్లు కనిపిస్తోంది. దింపుడు కళ్లెం ఆశతో కొందరు వైసీపీ అభ్యర్థులు మాత్రం రీపోలింగ్ కావాలంటున్నారు. ఇందుకోసం కోర్టును కూడా ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తరువాత రీపోలింగ్ కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.  అసలు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ వైసీపీలో గాభరా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి పోలింగ్ సక్రమంగా జరగలేదంటూ ఆరోపణలు గుప్పించడం ప్రారంభించారు. సాధారణంగా ఓటమి భయంతోనే ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తారు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి ఆరోపణలకు దిగడమంటే.. ఫలితం వెలువడడానికి ముందే చేతులెత్తేసిందని అర్ధం. వైసీపీ నేతలు సరిగ్గా అదే చేశారు. ఆ పార్టీ కీలక నేత, వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మొదలు పెడితే పార్టీలో నోరున్న నాయకులుగా గుర్తింపు పొందిన అందరూ కూడా తెలుగుదేశం తమ అవకాశాలు దెబ్బతీసిందన్న ఆరోపణలు గుప్పించేశారు. పోలీసులు, ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఆ పార్టీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి తమను దెబ్బతీశారని విమర్శలు గుప్పించారు. ఇక అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అయితే తమ నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ బూత్ లలో తెలుగుదేశం యథేచ్ఛగా రిగ్గింగుకు పాల్పడిందని ఆరోపిస్తూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ ను ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో ఏకంగా కోర్టుకు వెళ్లారు. అంబటి రాంబాబు పోటీ చేసిన సత్తెన పల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు పోలింగ్ బూతులలో రిగ్గింగ్ జరిగిందని రీపోలింగ్ నిర్వహించాలంటూ కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే మోహిత్ రెడ్డి పిటిషన్ ను కూడా కొట్టేసింది.  ఈ పిటిషన్ల సంగతి అలా ఉంచితే.. వైసీపీ నేతలు ఎన్నికల అక్రమాల గురించి ఆక్రోశం వెల్లబుచ్చుతూ, రీపోలింగ్ అంటూ గగ్గోలు పెడుతుండటం చూసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అర్ధమైపోయింది. ఓటమి భయాన్ని ఇసుమంతైనా దాచుకోకుండా వైసీపీ కీలక నేతలు చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేశారని ఆరోపణలకు గుప్పించడం చూస్తుంటే ఓటర్లు తమ ఆయుధాన్ని ఎవరివైపు ఎక్కుపెట్టారన్నది అర్ధమైపోతోంది. ఈవీఎంల ధ్వంసం, ఓటర్లను స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం లేకుండా హింసాకాండకు పాల్పడినా.. జనం బెదరకుండా నిలబడి పట్టుదలతో ఓటు వేయడం చూస్తుంటే.. వైసీపీ సర్కార్ పట్ల వారిలో ఎంత ఆగ్రహం గూడుకట్టుకుని ఉందో అవతగతమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదని పోలింగ్ కు ముందే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన బేల ప్రకటనతోనే  తన ఓటమి భయాన్ని వెల్లగక్కారు. ఆయన ప్రకటనతోనే వైసీపీ శ్రేణులు, నేతలూ, చివరాఖరికి అభ్యర్థులు కూడా డీలా పడిపోయారు. ఆయన ప్రకటన తరువాత వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోలేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇక సొమ్ము పంపిణీ విషయంలో కూడా అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపలేదనీ, వారిపై చివరి నిముషంలో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. మొత్తం మీద ఫలితాల వరకూ వేచి చూడనవసరం లేకుండానే తమ ఓటమిని వైసీపీ అంగీకరించేసినట్లుగా కనిపిస్తోంది. 

ap bjp jakal plans

ఏపీ బీజేపీ నక్క జిత్తులు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో దోస్తీ చేయడం, బీజేపీని కూటమిలో భాగస్వామిని చేయడం టీడీపీ వర్గాలకు మొదట్లో ఉత్సాహం కలిగించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే బీజేపీతో చేతులు కలపడం మెడకు రోలు తగిలించుకున్నట్టే అయిందని అర్థమైంది. బీజేపీ వల్ల నష్టమే తప్ప లాభం వుండదనే పాయింట్‌లో టీడీపీ, జనసేన వర్గాలకు క్లారిటీ వచ్చేసింది. అయినప్పటికీ స్నేహ ధర్మాన్ని పాటిస్తూ వచ్చాయి. పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో అభ్యర్థులు గెలవటం కోసం టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తమ శాయశక్తులా కృషి చేశారు. బీజేపీని తమ భుజాల మీద మోసుకెళ్ళడానికి శ్రమించారు. అయితే బీజేపీ లీడర్లు, కేడర్ మాత్రం తమ పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల మీద మాత్రమే తమ దృష్టిని నిలిపారు. టీడీపీ, జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల జెండాలతోపాటు బీజేపీ జెండా కూడా రెపరెపలాడిందే తప్ప బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించింది సున్నా. సహకరించకపోగా, ఒకపక్క ప్రచారం జరుగుతున్న సమయంలోనే బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు టీడీపీ, జనసేన స్నేహధర్మం పాటించడం లేదని, తమకు సహకరించలేదని ఆరోపణ చేశారు. వైసీపీ దృష్టిలో కూటమి చులకనైపోయేలా చేశారు. బీజేపీది మొదటి నుంచి ఒకటే సీక్రెట్ ఎజెండా. టీడీపీ, జనసేనతో కూటమి కట్టాలి. ఎలక్షన్లలో కూటమి విజయం సాధిస్తే మావల్లే విజయం సాధించిందని బిల్డప్పు ఇచ్చుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం నెత్తిన కూర్చుని వేధించి సాధించాలి. చంద్రబాబును అడుగు ముందుకు వేయకుండా చేసేలా కాళ్ళకు అడ్డుపడాలి. తద్వారా చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి రాష్ట్రంలో రెండో స్థానానికి చేరుకోవాలి. 2014లో బీజేపీ ఈ వ్యూహాన్నే పాటించింది. కాకపోతే చంద్రబాబును దెబ్బతీయ గలిగిందిగానీ, తాను రెండో స్థానంలోకి రాలేకపోయింది. 2024 ఎన్నికలలో కూడా బీజేపీ ఇదే వ్యూహంతో కొనసాగుతోంది. ఈ ఎన్నికలలో కూటమి గెలవాలని అందరూ కోరుకుంటున్నారు గానీ, బీజేపీ మాత్రం నిన్నమొన్నటి వరకు  ‘నాకు ఎవరు గెలిచినా ఒకటే’ అన్నట్టుగా వుంది. కూటమి తెలిస్తే, అధికారంలో భాగస్వామ్యం... వైసీపీ గెలిస్తే ఆ పార్టీతో స్నేహం కొనసాగింపు అన్నట్టే అన్నట్టుగా, గోడమీద పిల్లిలాగా వుంది.  ఈసారి ఎన్నికలలో ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమేనని గత కొద్ది రోజులుగా అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది. చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నారని అనధికారికంగా వెల్లడవుతున్న సర్వేలన్నీ చెబుతున్నాయి. నేషనల్ మీడియా కూడా ఏపీలో ప్రభుత్వం మారబోతోందని స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రాబోతోంది కదా అని ఆనందించాల్సిన బీజేపీ ఆ పని చేయకుండా గుంటనక్క జిత్తులు ప్రదర్శించడం ప్రారంభించింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇక వైసీపీ ఖేల్ ఖతం అయిపోతుంది. ఐదేళ్ళుగా బెయిల్ మీద వున్న జగన్ జైలుకు వెళ్ళక తప్పదు. అప్పుడు వైసీపీ నాయకుడు లేనీ పార్టీ అయిపోతుంది. ఆ పార్టీలో వున్న నాయకులకు ఇప్పటికే దడ ప్రారంభమైంది. చంద్రబాబు పవర్లోకి వచ్చాక వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కాకుండా వుంది. మారుమనసు పొందిన వాళ్ళలాగా యాక్టింగ్ చేసి టీడీపీలో చేరే అవకాశం కూడా లేదు. అలాంటి వాళ్ళని ఆకర్షించే పనిలో ఇప్పుడు ఏపీ బీజేపీ వుంది. తన ప్రయత్నాలను వల్లభనేని వంశీతో ప్రారంభించింది. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా ప్రవర్తించిన నాయకులు చాలామంది వున్నారు. వాళ్ళందర్నీ చేర్చుకునే ప్లాన్‌లో బీజేపీ నాయకులు వున్నారు. జూన్ 4 తర్వాత ఎఫ్పుడైతే వైసీపీ ఓడిపోతుందో వెంటనే కార్యాచరణలోకి దిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇలా వైసీపీ నాయకులను చేర్చుకోవడం ద్వారా, రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయం స్థాయికి ఎదగాలన్నది ఏపీ బీజేపీ గుంటనక్క ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేయడం తప్పేమీ కాదు.. కాకపోతే, తెలుగుదేశం, జనసేన పార్టీలతో స్నేహం కొనసాగిస్తూనే ఇలాంటి ప్లాన్లు వేయడం మాత్రం బీజేపీ లాంటి పార్టీకే చేతనైన విద్య.

Suspicious death of Shad Nagar youth in Australia

ఆస్ట్రేలియాలో షాద్ నగర్ యువకుడు అనుమానాస్పద మృతి

ఉన్నత విద్య, ఉద్యోగాల  కోసం విదేశాలకు వెళ్లి అర్థాంతరంగా తనువు చాలిస్తున్న భారత విద్యార్థుల ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 403 మంది భారత విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం  ఇటీవల వెల్లడించింది.  ఆస్ట్రేలియాలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరవింద్ ఉద్యోగరీత్యా భార్యతో కలిసి సిడ్నీలో స్థిరపడ్డాడు. అరవింద్ ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు సిడ్నీలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతని శవమై సముద్రతీరంలో లభ్యమైంది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆ శవం అరవింద్‌దే అని తేలింది. సముద్రతీరంలో పోలీసులు అతని కారును కూడా గుర్తించారు. అరవింద్‌ది హత్యనా? ఆత్మహత్యనా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అరవింద్... షాద్ నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ తనయుడు. 12 ఏళ్లుగా ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. 18 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆస్ట్రేలియా వాతావరణం పడకపోవడంతో ఆరు రోజుల క్రితమే తల్లి షాద్ నగర్ తిరిగి వచ్చింది. కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు అరవింద్ కూడా సోమవారానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. అరవింద్ భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకొని వస్తానని చెప్పిన అరవింద్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో పోలీసులు సముద్రంలో అరవింద్ మృతదేహాన్ని గుర్తించారు.

like a fire Palnadu politics! Did you know the result?

నివురు గప్పిన నిప్పులా ప‌ల్నాడు రాజ‌కీయం! ఫలితం తెలిసిపోయిందా?

వైసీపీ అరాచ‌కాల‌కు ప‌ల్నాడు ద‌ద్ద‌రిల్లిపోతోంది. నివురు గప్పిన నిప్పులా ప‌ల్నాడు రాజ‌కీయం అట్టుడుకుతోంది.  ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ లో పోలీసులు ఉన్నారు.  రాజకీయ నాయ‌కులు తమ ప్రయోజనాల కోసం జనాన్ని రెచ్చగొడుతున్నారు. తగలబడిన కార్లు, దగ్దమైన బైకులు, ధ్వంసమైన సామాన్లు.. పల్నాడు ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస మిగిల్చిన దృశ్యాలు ఎన్నిక‌ల సంఘానికి స‌వాల్‌ను విసురుతున్నాయి. పేదరికం, పగలు, ప్రతీకారాలకు పల్నాడు గతంలో పేరుమోసినప్పటికీ, గడిచిన నాలుగు ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు తక్కువే నమోదయ్యాయి. కానీ గత ఐదేళ్లుగా జ‌గ‌న్ సిఎం అయిన త‌రువాత‌ హింసాత్మక వాతావరణం పెరుగుతూ వస్తోంది.  పూర్వం పల్నాడులో  కత్తులు, నాటు బాంబులతో దాడులు చేసుకునేవారు.  ఫ్యాక్షన్ కలహాలుండేవి. ప్రత్యర్థుల మీద దాడులు, హత్యలు చాలా జరిగాయి.  ఏడు హత్యల కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మాచర్ల నుంచి టీడీపీ తరుపున బరిలో ఉన్న జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.   అలాగే కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబులు పేలిన ఘటనలో ఆయన అనుచరులు ప్రాణాలు కోల్పోవడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  కోడెల హయాంలో ప్రత్యర్థుల నోరు నొక్కారని, కోడెల కుటుంబం ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయించిందనే ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి.   అయితే 2019 ఎన్నికలతో దృశ్యం మారింది. ఆధిపత్యం చేతులు మారింది.  పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది.  ఏడు అసెంబ్లీ స్థానాలు (మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట), నరసరావుపేట పార్లమెంటును గెలుచుకుంది.  2019 ఎన్నికల సందర్భంగా కోడెలపై దాడి చేశారు.  ఎన్నికల తర్వాత టీడీపీ కోడెల శివప్రసాదరావు లాంటి నాయకుడిని టీడీపీ కోల్పోయింది. అప్పటి నుంచి టీడీపీ కేడర్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలకు పడటం లేదు. 2021 మునిసిపల్ ఎన్నికల సమయంలోనూ టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్న మీద మాచర్లలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారు.  ఇలాంటి అనేక ఘటనలతో పల్నాడు సమస్యాత్మక ప్రాంతంగా మారింది.  అసెంబ్లీ పోలింగ్ రోజున పల్నాడులో టీడీపీ క్యాడర్ హోరాహోరీగా పోరాడింది.  పోలింగ్ తర్వాత కూడా టీడీపీ క్యాడర్ గట్టిగానే నిల‌బ‌డింది.  వైసీపీ నేత‌లు చేస్తున్న అరాచ‌కాలు చూస్తుంటే ఓడి పోతామ‌న్న భ‌యంతోనే దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని స్థానికంగా జ‌నం మాట్లాడుకుంటున్నారు.  ఏపీలో ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చెల‌రేగిన హింస‌పై జాతీయ స్థాయిలో చ‌ర్చ‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. దీనిలో కీల‌క‌మైన అత్యంత స‌మ‌స్యాత్మ‌క‌మైన జిల్లాలు, న‌గ‌రాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. క‌ర‌డుగ‌ట్టిన మావోయిస్టుల అడ్డాల్లోనూ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. అదే విధంగా జ‌మ్ము క‌శ్మీర్‌లోని శ్రీన‌గ‌ర్‌(అత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతం)లోనూ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగో ద‌శ‌లో జ‌రిగిన పోలింగ్లో 3 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాల‌ను అత్యంత స‌మస్యాత్మ‌క కేంద్రాలుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అయితే.. అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. ఎక్క‌డా చిన్న బొట్టు ర‌క్తం కూడా కార‌లేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసుల‌ను కూడా కొట్ట‌లేదు. క‌నీసం లాఠీ చార్జి ఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూడ‌లేదు. మ‌రి అంత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లోనే అంత ప్ర‌శాంతంగా ఎన్నిక‌లుజ‌రిగిన‌ప్పుడు.. ఏపీలో ఎందుకు.. నాలుగోద‌శ పోలింగ్ త‌ర్వాత‌.. ఇంత హింస చెల‌రేగింది? అనేది జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ప‌ల్నాడు ప్రాంతంలోని మూడు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో(మాచ‌ర్ల‌, పెద‌కూర‌పాడు, స‌త్తెన‌పల్లి) ఎందుకు విధ్వంసాలు జ‌రుగుతున్నాయ‌నేది ప్ర‌శ్న‌. ఇదే విష‌యం జాతీయ స్థాయిలోనూ చ‌ర్చించుకుంటున్నారు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

why not escape ycp new slogan

వైనాట్ పరార్? వైసీపీ కొత్త నినాదం

వైసీపీ ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి బాగా అలవాటైన వైనాట్ తోనే ఈ నినాదం కూడా మొదలౌతోంది. ఔను జగన్ ఎప్పుడో ఆరు నెలల కిందటే వైనాట్ 175 అంటూ ఓ నినాదం ఇచ్చి.. పార్టీ శ్రేణుల్లో వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ప్రోది చేయాలని భావించారు. అప్పట్లోనే ఆ నినాదం నవ్వుల పాలైంది. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల వద్దకు పంపిన జగన్ కు వైనాట్ 175 నినాదం ఎంత హాస్యాస్పదంగా ఉందో అప్పుడే తెలిసిపోయింది. గడపగడపకూ నిరసన సెగలను ఎదుర్కొన్న పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ఆ తరువాత గడపగడపకు కార్యక్రమాన్ని ఎలాగోలా మమ అనిపించేశారు. ఆ తరువాత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై జగన్ దృష్టి పడింది. దీంతో ఆయన మరో నినాదం ఇచ్చారు. అదే వైనాట్ కుప్పం. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ ను ప్రకటించి.. ఆయనను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ నియోజకవర్గ ప్రజలకు పెద్ద తాయిలం ఇస్తున్నట్లుగా మాట్లాడారు. అయితే వారు మాత్రం భరత్ ను గెలిపిస్తే మంత్రి మాత్రమే ఔతారు.. అదే చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా? అని ఎగతాళి చేశారు. సరే వైనాట్ కుప్పం నినాదం కూడా విఫలమయ్యాకా.. ఇక జగన్ తో పని లేకుండా ఆయన పార్టీ ఎమ్మెల్యేలే కొత్త నినాదాన్ని అందుకున్నారు. అదే వైనాట్ పరారీ. అని. ఆ నినాదాన్ని మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కూడా అయిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆచరించి చూపారు. అది ఆయనకు సత్ఫలితాన్నే ఇచ్చింది. అరెస్టును తప్పించుకోగలిగారు. ముందస్తు బెయిలూ పొందగలిగారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంతి ఆ నినాదాన్నే ఇప్పుడు నమ్ముకున్నారు. ఒక వేళ ఏదైనా తేడా కొడితే వైనాట్ పరార్ అనడానికి సిద్ధంగా ఉన్నారు.  రాష్ట్రంలో ఎన్నికలు అయిన తరువాత వైసీపీ నేతలకు వాస్తవం బోధపడింది. గెలుపు ఆశలు ఇసుమంతైనా లేవన్నవిషయం ధృవపడింది. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా రెచ్చిపోయి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు పరార్ మంత్రాన్ని పఠించడానికి రెడీ అయిపోతున్నారని వైసీపీ వర్గాల్లోనే పెద్దగా వినిపిస్తోంది. తెలుగుదేశం నాయకులు అజ్ణాతంలోకి వెడుతున్న సంఘటనలు కానీ, వార్తలు కానీ వినిపించడం లేదు కానీ,  వైసీపీ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు దేశ విడిచిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనీ, ప్రణాళికలు రచించుకుంటున్నారనీ సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కౌంటింగ్ కు ముందే బిచాణా ఎత్తివేయడం మేలని భావిస్తున్నారని అంటున్నారు.   పిన్నెల్లి పోలీసులను తప్పించుకునేందుకు ఇల్లూ వాకిలీ వదిలేసి పారారైపోవడం వైసీపీ నేతలకు దారి చూపినట్లైంది. సరే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందారనుకోండి అది వేరే విషయం. ఆ ముందస్తు బెయిలు కూడా జూన్ 5 వరకూ మాత్రమే లభించింది.  అది పక్కన పెడితే పిన్నెల్లి అండ చూసుకుని ఎన్నికల రోజు, ఆ తరువాత హింసాకాండతో చెలరేగిపోయి, రాడ్లు, కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసిన ఆయన అనుచరులంతా ఇప్పుడు భయంతో వణికి పోతున్నారు.   ఇక గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎంత మంది పరారీలో ఉన్నారో లెక్కేలేదు. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న వార్తలు వినవస్తున్నా.. జనం వాటిని పెద్దగా విశ్వసించడం లేదు. ఈబీ5 విసా సంపాదించి శాశ్వతంగా విదేశంలో సెటిల్ అయిపోయే అవకాశాలే ఎక్కవ ఉన్నాయని నమ్ముతున్నారు.  అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. పిన్నెల్లి అరెస్టుపై అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్ నుంచి ఒక వీడియో విడుదల చేశారు.   పోలింగ్ తరువాత పుంగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చెన్నై పోర్టు ద్వారా తన కంపెనీకి సంబంధించిన పరికరాలు, యంత్రాలను ఆఫ్రికా పంపించేశారు. కౌంటింగ్ కు ముందే ఆయన కూడా ఆఫ్రికాకు పలాయనం చిత్తగించే అవకాశాలున్నాయన్న చర్చ పుంగనూరుగా జోరుగా సాగుతోంది.   ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి విసయానికి వస్తే ఆయన తన కుమారుడు మోహిత్ రెడ్డిని దేశం దాటించడం ఎలా అన్న విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన అనుయాయులే చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ రోజు హింస నేపథ్యంలో మోహిత్ రెడ్డి మెడపై అరెస్టు కత్తి వేళాడుతోందని అంటున్నారు.   

తలైవాకు గోల్డెన్ విసాతో యుఏఇ సత్కారం 

వయసుతో పాటు అభిమానుల సంఖ్యనూ, సినిమా సినిమాకీ స్టార్‌డమ్‌నీ పెంచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రజినీకాంత్.. 'ద నేమ్ ఈజ్ రజనీకాంత్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు రచయిత్రి గాయత్రీ శ్రీకాంత్. రజనీకాంత్ పుట్టింది కర్ణాటక,  పెరిగింది మహరాష్ట్ర,  సెటిలైంది మాత్రం తమిళనాడు. రజనీకాంత్ మేనరిజం అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. జపాన్ లో రజనీకాంత్ కోసం అభిమానులు  ఏకంగా గుడి కూడా కట్టేసారు. తెలుగు ప్రజలన్నా, తెలుగు దేశం పార్టీ అన్నా రజనీకాంత్ కు ఎనలేని గౌరవం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ ఉత్సవాల సమయంలోనే ఆయన టిడిపి అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కొనియాడటం ఎపిలో వైసీపీ నేతలకు నచ్చలేదు. గుడివాడ  వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని అయితే  రజనీపై నోరుపారేసుకుని అభాసుపాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ కు అరుదైన గుర్తింపు, గౌరవం లభించింది.  యూఏఈ సాంస్కృతిక, పర్యాటక శాఖ (డీటీసీ) రజనీని గోల్డెన్ వీసాతో సత్కరించింది. అబుదాబీలో జరిగిన కార్యక్రమంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ గోల్డెన్ వీసా కార్డును రజినీకి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ వ్యాపారవేత్త, లులు మాల్ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజినీ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘అబుధాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకోవడాన్నిగౌరవంగా భావిస్తున్నా. ఇందుకుగాను అబుధాబీ ప్రభుత్వానికి, దాన్ని పొందడంలో సహకరించిన నా స్నేహితుడు, లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని రజినీ పేర్కొన్నారు. ఈ వీడియో కాస్తా వెంటనే వైరల్ అయింది. ‘తలైవా’కు లభించిన గౌరవానికి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇటీవల యూఏఈ సందర్శన సందర్భంగా రజినీకాంత్ లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీతోపాటు ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. ఆయనతో కలసి రోల్స్ రాయస్ కార్లో తిరుగుతూ సందడి చేశారు. ఏమిటీ గోల్డెన్ వీసా ప్రత్యేకత.. యూఏఈలో విదేశీయులు పనిచేసేందుకు, నివసించేందుకు, చదువుకొనేందుకు జారీ చేసేదే గోల్డెన్ వీసా. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతోపాటు వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి వాటిని మంజూరు చేస్తారు. దీర్ఘకాలంపాటు యూఏఈలో ఉండాలనుకొనే వారికి అందిస్తారు. ఈ వీసా కాలవ్యవధి ఐదు నుంచి పదేళ్ల మధ్య ఉంటుంది. కాలవ్యవధి ముగిశాక మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. గోల్డెన్ వీసాదారులకు యూఏఈలో చేసే వ్యాపారాలపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఇది 6 నెలల ఎంట్రీ వీసాగా పనిచేయడంతోపాటు యూఏఈని ఎన్నిసార్లయినా సందర్శించే వెసులుబాటు అందిస్తుంది. కుటుంబ సభ్యులందరితోపాటు ఎంత మంది పనిమనుషులనైనా స్పాన్సర్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

పిన్నెల్లికి ముందస్తు బెయిలుపై సుప్రీంకు వెళతారా?

ఈ ఎమ్మెల్యే చాలా మంచోడు  ముఖ్యమంత్రి జగన్ సర్టిఫికెట్ ఇచ్చిన మాచర్ల ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ  ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఆయనపై చర్యలకు ఆదేశించింది. దాదాపు ఏడేళ్లు జైలు శిక్ష పడేలా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసలు ఆయనను అరెస్టు చేయడానికి బయలు దేరారు. హౌస్ అరెస్టులో ఉండగా తప్పించుకు పారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ఏపీ పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి మరీ ఆయన కోసం హైదరాబాద్ వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చంద్రంగా ఆయన కారును, అందులోని ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాత్రం తప్పించుకున్నారని చెప్పారు. ఆ తరువాత కూడా అరెస్టు చేస్తామంటూ గంభీర ప్రకటనలు అయితే ఇచ్చారు కానీ, ఆ పని మాత్రం చేయలేకపోయారు. ఈ లోగా నరసరావు పేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోతున్నారంటూ వార్తలు. మన పోలీసులేమో పెద్ద సంఖ్యలో కోర్టు వద్ద మోహరింపు. ఈ లోగా పిన్నెల్లి  ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిలు పొందడం జరిగిపోయాయి. జగనన్న దృష్టిలో చాలా మంచోడు అయిన పిన్నెల్లిపై జూన్ 5వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.   ఇలాంటి మంచోల్లు వైసీపీలో చాలా మంది ఉన్నారు. అంతా తామే చేసి.. ఎదుటివారిపై నెపం నెట్టడంలో సిద్ధహస్తులు. అలాంటి వారి కోవలోకే మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి వచ్చి చేరారు. అతి మంచివాడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పెలా అవుతుందని అమాయకంగా ప్రశ్నిస్తూ, ఈవీఎం ధ్వంసం చేస్తేనేం.. అందులో డేటా భద్రంగా ఉందిగా అంటూ ఓ లాజిక్ ను కూడా తెరమీదకు తెచ్చారు. డేటా భ్రదంగా ఉన్నప్పుడు విలవ లేని ఈవీఎంను ధ్వంసం చేస్తే తప్పేమిటని సమర్ధించారు.  వైసీపీ వాళ్ల సమర్ధింపులు అన్నీ పక్కన పెడితే.. ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిని నిలువరించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు పిన్నెల్లి విషయంలో ఏం చేస్తారు? ఏం చేయగలరు? కనీసం ఆనవాయితీ ప్రకారం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయిస్తారా?  అందరి మనస్సుల్లోనూ తలెత్తుతున్న అనుమానాలు, సందేహాలు ఇవే. పిన్నెల్లికి జూన్ 5 వరకూ ముందస్తు బెయిలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం సహజం. విధాయకం కూడా. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ చేసిన పని ఇదే.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రఘురామకృష్ణంరాజు కేసులతోపాటు.. రాజధాని కేసులు, సీఐడీ కేసుల్లో హైకోర్టులో దెబ్బతిన్న ప్రతిసారీ జగన్ సర్కార్ సుప్రీం తలుపు తట్టింది.  అంతెందుకు  సీనియర్ ఐపిఎస్, డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై విధించిన సస్పెన్షన్ చెల్లదు  తిరిగి విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశంపై కూడా హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు ఒకసారి హైకోర్టు, ఇంకోసారి సుప్రీంకోర్టు కూడా ఏబీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి.  ఇప్పుడు సీఎస్ జవహర్‌రెడ్డి..సీఈసీ చెప్పినట్లు, ఈవీఎం పగులకొట్టి సిగ్గుమాలిన పనిచేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి.. బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా?  లేదా జగన్ పై భక్తిని చాటుకుంటూ ఆయనే మంచోడని సర్టిఫికెట్ ఇచ్చారు కదా.. ఇక సుప్రీంకు ఎందుకులే అని ఊరుకుంటారా చూడాలి. 

ఎవరెస్ట్ మీద టీడీపీ పతాకం రెపరెప!

ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పతాకం రెపరెపలాడనుంది. దీనికి సింబాలిక్‌గా టీడీపీ ఫ్లాగ్ గ్రేట్ ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది. అనంతపురం జిల్లాకి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన ఉపేంద్ర ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. ఎవరెస్ట్ శిఖరం అంచులకు చేరుకున్న తర్వాత ఆయన అక్కడ మన భారత జాతీయ పతాకాన్ని ఎగరేశాడు. ఆ తర్వాత తెలుగుజాతి పతాకం అయిన తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేశారు. ఈ ఫొటోలను టీడీపీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తమ ఎక్స్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఎంతో పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఉపేంద్ర నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగుదేశం పతాకం ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడటం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో చాలాసార్లు తెలుగుదేశం పతాకం ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు యువకులు భారత జాతీయ పతాకం తర్వాత తెలుగుదేశం పతాకాన్నే ఎగురవేస్తూ వచ్చారు. తెలుగుజాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలిపింది, తెలుగుజాతికి జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థాయిని ఏర్పరచింది ఎన్టీఆర్ అయితే, ఆ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నికల సమరంలో జయాపజయాలు సాధారణం. అయితే తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడంలోగానీ, యువతకు అత్యుత్తమమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో గానీ చంద్రబాబు చేసిన కృషిని ఎవరూ విస్మరించరు. ముఖ్యంగా తెలుగు యువతరం పురోగతిని ఒక పెద్ద మలుపు తిప్పిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచారు. ఆ గౌరవంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు యువతీ యువకులు అక్కడ టీడీపీ పతాకాన్ని కూడా ఎగరేస్తూ వుంటారు. అయితే, ఇప్పుడు అనంతపురానికి చెందిన మత్యకార యువకుడు ఉపేంద్ర ఎవరెస్ట్ మీద టీడీపీ పతాకాన్ని ఎగురవేయడం అనేది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళలో, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాబోతోందని అందరిలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్న వేళలో... ఎవరెస్ట్ శిఖరం మీద మరోసారి తెలుగుదేశం పతాకం రెపరెపలాడటం ఒక శుభసూచకంగా భావించవచ్చు. ఎవరెస్ట్ శిఖరం మీద టీడీపీ పతాకం రెపరెపలాడించిన అనంతరం ఉపేంద్ర ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే మాట్లాడారు. తనకు ఎవరెస్ట్ ఎక్కే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థాంక్యూ సోమచ్ అని ఉపేంద్ర అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

విదేశాలలో సేదతీరుతున్న నాయకులు.. అద్వానంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. హోరాహోరీ ప్రచార యుద్ధం ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత చెలరేగిన హింసాకాండతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆ ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు. అయితే నెలల తరబడి ప్రచార పర్వంలో నిర్విరామంగా తిరిగిన పార్టీల నేతలు విశ్రాంతి మూడ్ లోకి వెళ్లి విదేశీ పర్యటనలలో సేదతీరుతున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం వేసవి వేడి ఒకింత చల్లబడినా, ఎన్నికల హింస మాత్రం రోహిణీకార్తె ఎండలను మించిపోయింది,   ఇక నేతల విదేశీ పర్యటనల విషయానికి వస్తే కోర్టు అనుమతి తీసుకుని మరీ ఈ నెల 17న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సమేతంగా  ఐరోపా పర్యటనకు వెళ్లారు.  వారంపాటు ప్రముఖ దేవాలయాలు సందర్శించి తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు.ఆయన ఆరోగ్య పరిక్షలు చేయించుకోవడంతో పాటు అక్కడ ఒకింత విరామం తీసుకుని రిలాక్స్ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  జనసేన సేనాని పవన్ కళ్యాణ్ కూడా రష్యా పర్యటనకు వెళ్లారు.  లోకేష్ కూడా అమెరికాలోనే ఉన్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా అమెరికా పర్యటనకు వెళ్లారు.  పార్టీ అధినేతల బాటలో ఇతర నాయకులు  పలువురు కూడా  విదేశీయానం చేస్తున్నారు.  పోలింగ్ పూర్తయిన తరువాత ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాల ప్రకటనకు మధ్య 22 రోజులు గడువు ఉండడంతో నాయకులు రిలాక్సేషన్ కోసం విదేశీ  పర్యటనలకు వెళ్లారు. అయితే నేతల విదేశీ పర్యటనలపై సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఎన్నికల అనంతర హింసతో  అట్టుడుకుతుంటే నాయకులు విశ్రాంతి అంటూ విదేశాలకు వెళ్లడమేంటని నిలదీశారు.   ఇక అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. ఆ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింస ట్రయల్ మాత్రమేననీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా మరింత హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందనీ ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అదనపు బలగాలను కౌంటింగ్ అయిన తరువాత కూడా పక్షం రోజుల పాటు రాష్ట్రంలో ఉంచాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ సందర్భంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అయినా కూడా ప్రజలలో మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది.