కెసీఆర్ కు ప్రధాని లేఖ మర్మమేమిటో

ప్రధాని నరేంద్ర మోడీ  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు లేఖ రాశారు.  కెసీఆర్ సోదరి సకలమ్మ ఇటీవలె మృతి చెందడం పట్ల ప్రధాని సంతాపం తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ బిజెపి మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ పరాజయంతో బిజెపి దూరమైంది. కాంగ్రెస్ ను మట్టికరిపించడానికి బిఆర్ ఎస్ బిజెపి బీ టీం అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ తీహార్ జైల్లో  ఉచలు లెక్కబెట్టింది. ఈ సమయంలోనే బిఆర్ఎస్ బిజెపి మధ్య సత్సంబంధాలు బెడిసి కొట్టాయి. బిఆర్ఎస్ ను బిజెపిలో కలిపేయాలన్న ప్రతిపాదన ఫలించలేదు. తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రధాని మోడీ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. 

తిరుపతిలో భూమన ఆధిపత్యం, పలుకుబడి హుష్ కాకీ!

తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పడిందా? ఆయన పలుకుబడి పలుచనయ్యిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఆయన తన సర్వశక్తులూ ఒడ్డి మరీ వైసీపీ అభ్యర్ధి విజయం కోసం పాటుపడ్డారు. అయితే ఆయన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ణి మునికృష్ణ సునాయాస విజయం సాధించారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడంతో భూమనకరుణాకరరెడ్డికి భంగపాటు తప్పలేదు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గత ఎన్నికల ముందు తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలా పోటీ చేయడం కోసం డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. అయితే విజయం సాధించడంలో విఫలమయ్యారు. అప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవికి ఇప్పుడు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో తన కుమారుడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వైసీపీ అభ్యర్థినే గెలిపించడం కోసం భుమన కరుణాకరరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది.  ఈ ఓటమిని జీర్ణించుకోలేని భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, అధికార మదంతో తెలుగుదేశం కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి మరీ తమ వైపునకు తిప్పుకుందనీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో గతంలో అంటే 2021లో అభినయ్ రెడ్డిని డిప్యూటీ మేయర్ గా గెలిపించుకోవడానిక భూమన కరుణాకరరెడ్డి ఓటర్ల జాబితాలోకి నకిలీ ఓటర్లను చేర్చారనీ, తమిళనాడు నుంచి జనాలను తీసుకువచ్చి ఓట్లు వేయించారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయాన్ని ఇక్కడ కన్వీనియెంట్ గా మర్చిపోయారు. ఈ ఆరోపణల విషయాన్ని పక్కన పెడితే ఈ ఓటమి తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తుడా చైర్మన్ గా 2004 నుంచి 2006 వరకూ చేశారు. ఆ తరువాత 2006 నుంచి 2008 వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పని చేశారు.  2009లో తిరుపతి నుంచి అసెబ్లీకి పోటీ చేసి చిరంజీవి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2012లో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి భూమన విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ 2019 ఎన్నికలలో తిరుపతి నుంచి విజయం సాధించారు. 2023లో మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక 2024 ఎన్నికలలో భూమన కరుణాకరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు అభినయ్ రెడ్డిని తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దించారు. అయితే ఆ ఎన్నికలో అభినయ్ రెడ్డి పరాజయం పాలయ్యారు.  అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా 2004 నుండి తిరుపతిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన భూమనకు 2024లో వైసీపీ ఘోర పరాజయంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో విఫలమవ్వడంతో ఆయన ఆధిపత్యం, పలుకుబడి పూర్తిగా దిగజారిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

భారీ టాస్క్ తోనే లోకేష్ హస్తిన పర్యటన!

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంద్రి నారా లోకేష్ మంగళవారం (ఫిబ్రవరి 4) ఢిల్లీ వెడుతున్నారు. ఆయన పర్యటన వెనుక పెద్ద టాస్కే ఉంది. ఈ పర్యటనలో ఆయన కేంద్ర ఐటీ మంత్రి   అశ్విని వైష్ణవ్‌తో  భేటీ కానున్నారు.  లోకేష్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం కేంద్ర మంత్రితో భేటీ అవుతారు. మళ్లీ  అదే రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు. ఈ భేటీ అజెండా ఏమిటి? ఇంత హఠాత్తుగా హడావుడిగా ఆయన కేంద్ర మంత్రితో భేటీ అవ్వడానికి కారణమేంటి? ఈ పర్యటనలో ఆయన సాధించుకు వచ్చేదేమిటి? అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదేదో ఆషామాషీ భేటీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ (ఏఐ)రంగంలో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నది. మరీ ముఖ్యంగా వైజాగ్ ను ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలన్నది లోకేష్ లక్ష్యం. ఇందులో  భాగంగానే విశాఖపట్నంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుపైనే లోకేష్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించనున్నట్లు సమాచారం.  ఏఐ యూనివర్సిటీకి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు ఏఐ  సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించే ఉద్దేశంలో ఉంది. ఈ ఎక్సలెన్స్ సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తారు. ఇందుకోసం విశాఖలో డేటా సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కోరేం దుకే నారా లోకేష్ కేంద్ర మంత్రితో భేటీ కానున్నట్లు సమాచారం.  వైజాగ్‌ను టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చాలన్న లోకేష్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రితో నారా లోకేష్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం    ఈ నెల 5న(బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.  ప్రచార పర్వం నిన్నటితో ముగియడంతో పోలింగ్ మిగిలింది.  ఆప్, ప్రతిపక్ష బిజెపి మధ్య హోరా హోరి పోరు జరుగనుంది.  ఎన్నికల ప్రచార అంశాల్లో కాలుష్యం,  తాగునీటి సమస్య  ప్రధాన అంశాలుగా చేరాయి. యమునా నది కాలుష్యం ఎన్నికల ప్రచారం అస్త్రంగా నిలిచింది. ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.   బుధవారం జరుగనున్న పోలింగ్ లో కోటి 56 లక్షల మంది ఓటేయనున్నారు.  పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ మూడోసారి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటే 25 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న బిజెపి అధికారంలో రావాలని చూస్తుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ ఉనికి కోసం తహతహలాడుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొన్నారు. మేనిఫెస్టోను విడుదల చేశారు.  జాతీయ స్థాయిలో అగ్రనేతలు  మల్లి ఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాందీలు ఢిల్లీ చుట్టేశారు.  బిజెపి తరపున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.  ఢిల్లీలోని తెలుగువారందరూ బిజెపికే వోటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.  మోదీ నేతృత్వంలో భారత దేశం వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. బడ్జెట్ లో టెక్నాలజీ, వ్యవసాయరంగాలకు ప్రోత్సహించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఫిబ్రవరి 8న  ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది.   

తాడేపల్లి ప్యాలెస్ లో జగన్.. జిల్లా పర్యటనల ఊసేదీ?

రెండు వారాల విదేశీ పర్యటన అనంతరం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ కు రాలేదు. బెంగళూరు ప్యాలెస్ లో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని సోమవారం(ఫిబ్రవరి 3) ఏపీలో ఎంటరయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత ఆయన తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. అక్కడ కూడా కొద్ది సేపు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.   ఆయన ఏపీలో అడుగు పెట్టిన తరువాత ఇక పార్టీ కార్యక్రమాలు జోరందుకుంటాయనీ, తమ అధినేత ప్రజలలోకి వస్తారనీ ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అసలు పార్టీ వ్యవహారాల ఊసే లేకపోవడం చూస్తుంటే.. ఆయన ఏపీ పర్యటన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అన్నట్లుగా ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ముందుగా నిర్ణయించిన మేరకు ఆయన జిల్లాల పర్యటన చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూశాయి. అయితే జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఇక ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఫీజు పోరు నిరసన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో గడపడం వినా ఎటువంటి కార్యక్రమాలనూ చేపట్టరన్నది రూఢీ అయిపోయింది.   గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడిచిపోయింది. ఈ ఎనిమిది నెలల కాలంలో వైసీపీ అధినేతగా జగన్ ఓటమిపై సమీక్ష నిర్వహించడం కానీ, ఓటమితో నిరాశ చెందిన నేతలు, క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి చేసిన ప్రయత్నం కానీ లేదు. అసలు ఆయన ఈ ఎనిమిది నెలల కాలంలో ఏపీలో ఉన్నదే తక్కువ. ఆ ఉన్న తక్కువ సమయంలో కూడా అత్యధిక సమయం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించ లేదు.   అసలు వైసీపీ ఓటమి తరువాత ఒక రాజకీయ పార్టీలా వ్యవహరించిన సందర్భమే లేదు. 2014లో వైసీపీ పరాజయం పాలై ప్రతిపక్షానికే పరిమితమైన సమయంలో జగన్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసి కనిపించింది. దాంతో ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఆయన సుందరముదనష్ట పాలనను జనం చూశారు. సో ఇప్పుడు ఆయన మాటలను విశ్వసించడానికి కానీ, వినడానికి కానీ వారు సిద్ధంగా లేరు. ఆ కారణంగానే జగన్  జిల్లాల పర్యటనకు పార్టీ నేతలే ఉత్సాహం చూపలేదు. ఏర్పాట్లు చేయలేమనీ, జనాలను తరలించలేమనీ చేతులెత్తేశారు. దీంతో జనంలోకి వెళ్లి భంగపడటం కంటే.. ప్రెస్ మీట్లకు పరిమితమై నిరసన వ్యక్తం చేయడమే మేలన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. 

అసెంబ్లీకి జగన్.. నిజమేనా?.. అహం చంపుకున్నట్లేనా?

పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాట పట్టనున్నారా?.. తన అహాన్ని చంపుకుని  ప్రతిపక్ష హోదా లేకున్నా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరౌతారా? ఈ నెలలో  జరుగుతాయని భావిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆయనతో సహా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ పాల్గొంటారా? అంటే వైసీపీ సోషల్ మీడియా  ఔననే అంటున్నది. ఇంత కాలం ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ఆయన చెబుతున్న కారణం ప్రతిపక్ష హోదా లేదనే. అర్హత లేకున్నా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలనీ, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ కోరుతూ కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామనీ, వారి మేండేట్ కు విరుద్ధంగా జగన్ పార్టీకి విపక్ష హోదా ఇవ్వలేమనీ విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు జగన్ తన అహాన్ని వీడి  సాధారణ సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ తెలుగుదేశం, జనసేనల తరువాత మూడో పెద్ద పార్టీగా ఉంటుంది. హౌస్ లో ఆ పార్టీ కంటే బీజేపీకి మాత్రమే తక్కువ సభ్యులు ఉన్నారు. ఆ నిష్పత్తి ప్రకారమే సభలో మైక్ దొరికే సమయం కూడా ఉంటుంది.  ఇక విషయానికి వస్తే.. జగన్ అసెంబ్లీకి రావడమంటూ జరిగితే.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సభాధ్యక్ష స్థానంలో ఉండటం ఖాయం. ఆయనను జగన్ ఎలా ఫేస్ చేస్తారన్నది చూడాలి.  అయితే ఇప్పటి వరకూ వైసీపీ నుంచి అధికారికంగా అసెంబ్లీకి హాజరుపై ఎలాంటి సమాచారం లేదు. గత అసెంబ్లీ సెషన్ ను జగన్, ఆయన పార్టీ సభ్యులు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ జరిగినన్నాళ్లు ప్రతి రెండు మూడు రోజులకు ఒక సారి జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలను జనం ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు లేవు.   ఇప్పుడు జగన్ తన ప్రతిజ్ణను అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ చేసిన ప్రతిజ్ణను పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరవ్వడమంటే ఆయనలో అహం చచ్చిందనే భావించాల్సి ఉంటుంది. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన పలు వాగ్దానాలను భంగం చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు సాధారణ సభ్యుడిలా అసెంబ్లీకి హాజరు కావడానికి సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆయన పార్టీకి చెందిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకూ పెద్ద ఊరట అనే చెప్పాలి. జగన్ మాట పట్టుకుని అసెంబ్లీకి డుమ్మా కొట్టడం ద్వారా వారు తమతమ నియోజకవర్గాలలో ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  కనీసం వారినైనా కాపాడుకోవాలంటే జగన్ తన అహాన్ని వీడి వాస్తవం గ్రహించి మెసులుకోని తీరాలి.  

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు.   సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ పై ఈ నెల 10న విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాగా వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోరారు.  

తెలుగుదేశం ఖాతాలోనే తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో తెలుగుదేశం జయభేరి మోగించింది. తెలుగుదేశం కార్పొరేటర్, టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు  26 మంది కార్పొరేటర్లు మద్దతు పలుకుతూ ఓటు వేయగా,  వైసీపీ అభ్యర్థికి కేవలం 21 ఓట్లు వచ్చాయి.  చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నిక జరిగింది.  తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.  తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో మూడు ఖాళీగా ఉన్నాయి. దీంతో డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావాలంటే 26 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో  మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు ఓటు వేయగా, వైసీపీ అభ్యర్థి భాస్కరరెడ్డికి 21 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. దీంతో టీడీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.  

ఇలా మొదలై అలా వాయిదా పడిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు  ఇలా ప్రారంభమై అలా వాయిదా పడ్డాయి. ప్రారంభమయ్యాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించే లక్ష్యంగా మంగళవారం (ఫిబ్రవరి 4) తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సభలో ప్రవేశ పెట్టడానికి ముందు కేబినెట్ సమావేశమై ఈ నివేదికను ఆమోదించాల్సి ఉంది. అయితే కేబినెట్ భేటీ జాప్యం కావడంతో అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభం కాగానే  కేబినెట్ భేటీ కారణంగా సమావేశాలను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేయాలని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ కు కోరారు.  సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రివర్గ సభ్యులందరూ కేబినెట్ భేటీలో ఉన్నారనీ అది ముగియడానికి కొంత సమయం పడుతుందనీ, అందుకే అసెంబ్లీని మధ్యాహ్నానికి వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు.  అలాగే శాసన మండలి కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది. 

ప్రతిపక్ష నేతగా తొలగాలి.. కేసీఆర్ కు లీగల్ నోటీసు

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది. 2023 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాలలో ఏమంత క్రియాశీలంగా ఉండటం లేదు. పార్టీ విపక్షానికి పరిమితమై ఏడాది దాటినా ఇప్పటి వరకూ ఆయన ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అంతే ఆయన పూర్తిగా పామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లోనే తనను కలిసిన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలి.. లేదా విపక్ష నేత పదవి నుంచి వైదొలగాలి అంటూ లీగల్ నోటీసు అందింది. ఈ నోటీసు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ పంపింది. ఆ అసోసియేషన్ తరఫున అడ్వకేట్   పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా  కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. అసెంబ్లీకి గైర్హాజరౌతున్న కేసీఆర్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వాలని కాంగ్రెస్ నేతలు సైతం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ నుంచి లీగల్ నోటీసులు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నోటీసుపై కేసీఆర్ ఎలా స్పిందిస్తారన్నది ఆసక్తిగా మారింది.  

ఎమ్మెల్సీ పోరుకు బీఆర్ఎస్ దూరం?.. ఓటమి భయమే కారణమా?

 తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మాటలు కోటలు దాటుతున్నాయి. అయితే చేతలు మాత్రం ఫామ్ హౌస్ గడప కూడా దాటని పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలలో పోటీకి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఇప్పటికింకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఆ పార్టీ తీరు చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టమౌతోంది. పార్టీ క్యాడర్ కు అదే సంకేతాలను పంపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీకీ మద్దతు ఇచ్చేది లేదని చెబుతుండటమే స్వయంగా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపడం లేదని చెప్పేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉండనుంది.  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇరువురూ కూడా రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు అధికారం అప్పగించామా అని వగస్తున్నారనీ, అవకాశం ఉంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ను అధికార పీఠంపై కూర్చోపెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితే కనుక ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగితే తాము చెప్పే మాటలలో వాస్తవం ఎంత ఉందో ఫలితాలలో తేలిపోతుంది. అయితే ఆలా తేల్చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు.   ఇప్పటికిప్పుడు కేసీఆర్ ను సీఎంను చేయడానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని ఢంకా బజా యించి చెబుతున్న కేటీఆర్ కానీ, కాంగ్రెస్ కు అధికారపగ్గాలు ఇచ్చినందుకు జనం బాధపడుతు న్నారని చెప్పుకుంటున్న కేసీఆర్ కానీ తాము చెబుతున్న మాటలను తామే విశ్వసించడం లేదనడానికి నిదర్శనం ఎమ్మెల్సీ బరిలోకి దిగకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు. వారు చెబుతున్న విధంగా  రేవంత్ సర్కార్ పై నిజంగానే ప్రజలలో వ్యతిరేకత ఉంటే.. దానిని బీఆర్ఎస్ కు అనుకూలంగా మలచుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అందివచ్చిన అవకాశంగా భావించాల్సిన బీఆర్ఎస్ ఆ ఎన్నికలకు దూరం అవ్వడం అంటే.. ప్రజలలో తమ పార్టీ పట్ల సానుకూలత లేదని అంగీకరించడమేనని చెప్పాలి. వాస్తవంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ప్రజల మూడ్ ను చాటి చెబుతుంది. ఎందుకంటే ఆ రెండు వర్గాలూ కూడా ప్రజలపై ప్రభావం చూపగలిగే వర్గాలే.  అటువంటి టీచర్, గ్యాడ్యుయేట్   ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ వెనుకాడటం చూస్తుంటే.. ప్రజలలో తమ పార్టీకి ఏమంత పలుకుబడి లేదని బీఆర్ఎస్ అంగీకరిం చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి రూటు మార్చకుంటే కష్టమేనా?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అంశం ఏదైనా మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌లు జరగనున్నాయా అన్నట్లుగా అధికార‌, విప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ట్విట‌ర్ ఖాతాలో పోల్ వ్య‌వ‌హారం, ఎమ్మెల్యేల ర‌హ‌స్య మీటింగ్, సీఎంకు తెలియ‌కుండానే కులగ‌ణ‌న వివ‌రాలను మీడియాకు లీకవ్వడం, మ‌ధ్య మ‌ధ్య‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పార్టీ సీనియ‌ర్ నేత‌ల వ్యాఖ్య‌లు.. ఇలా..  రేవంత్ ప్ర‌భుత్వంలో ఏదో జ‌రుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  వాస్త‌వానికి.. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి క్యాబినెట్ లోని సీనియ‌ర్ మంత్రుల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఎవ‌రినీ నొప్పించ‌కుండా అంద‌రినీ క‌లుపుకొనిపోతూ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా సీనియ‌ర్ మంత్రుల‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయినా.. ప్ర‌భుత్వంలో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ తీరు ప‌ట్ల కాస్త అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనంత‌టికీ రేవంత్ రెడ్డి అతి మంచిత‌న‌మే కార‌ణ‌మ‌న్న‌ వాద‌న పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది.  సీఎం హోదాలో రేవంత్ రెడ్డి.. కొంద‌రు మంత్రుల‌కు అతి మ‌ర్యాద ఇస్తుండ‌టంతో దాన్ని వారు అలుసుగా తీసుకొని ప్ర‌భుత్వంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నార‌న్న వాద‌నను కాంగ్రెస్ లోని ఓ వ‌ర్గం నేత‌లు వినిపిస్తున్నారు.  రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌జ‌ల‌కు మేలుచేసేలా కృషి చేస్తున్నారు. ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు. అయితే, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో పార్టీ క్యాడ‌ర్   విఫ‌ల‌మ‌వుతోంది. రైతు రుణ‌మాఫీకి స‌రైన ప్ర‌చారం క‌ల్పించ‌క‌పోవ‌టంతో ప్ర‌భుత్వంపై విప‌క్ష పార్టీల నేత‌లకు విమర్శలు చేసే అవకాశం చిక్కిందని అంటున్నారు.  ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కొత్త ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ ప‌థ‌కాల అమ‌లుపైనా.. ఎవ‌రికి ల‌బ్ధిచేకూరుతుంద‌నే విష‌యాల‌పైన స్ప‌ష్టంగా గ్రామ‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న ఉంది. దీనికి తోడు ప్ర‌భుత్వంలో మంత్రుల మ‌ధ్య స‌ఖ్య‌త‌ లేద‌ని.. కొంద‌రు మంత్రులు రేవంత్ కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్నాయి.  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ స‌ర్కార్‌కు ఇటీవ‌ల వ‌రుస‌గా దెబ్బ‌ మీద దెబ్బ‌  త‌గులుతోంది.   వారం రోజుల కిందట మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ స‌ర్కార్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఫాంహౌస్ కే ప‌రిమితం అయిన కేసీఆర్ ఒక్క‌సారిగా  అదే ఫామ్ హౌస్ నుంచి సమర గ‌ర్జ‌న చేశారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని చెబుతూనే.. రేవంత్ స‌ర్కార్ కు ఇక ద‌బిడిదిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల త‌రువాత‌ ప‌ది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ర‌హ‌స్యంగా భేటీ కావ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాల‌మూరు జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే త‌న ఫాంహౌస్ లో ప‌ది మంది ఎమ్మెల్యేల‌కు విందు ఇచ్చారు. ఈ విందు భేటీలో వారి ఇబ్బందుల‌ను ఒక‌రికొక‌రు చెప్పుకున్న‌ట్లు స‌మాచారం. కొంద‌రు మంత్రులు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేదని,  ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు స‌రియైన స‌హ‌కారం అంద‌డం లేద‌నీ ఈ భేటీలో వారు చర్చించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే  ఈ రహస్య విందు భేటీ వెనుక కేసీఆర్ హ‌స్తం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ట్విట‌ర్ ఖాతాలో పెట్టిన పోల్‌కు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఫామ్‌హౌస్ పాల‌న కావాలా.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ కావాలా..? అంటూ పోల్ పెట్ట‌గా.. ఫామ్ హౌస్ పాల‌నే కావాలంటూ అధిక శాతం మంది  ఓటు వేశారు. ఈ ప‌రిణామం కాంగ్రెస్ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంది అనే చ‌ర్చ‌కు దారితీసింది. కులగ‌ణ‌న వివ‌రాల విష‌యంలో కొంద‌రు మంత్రులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారింది. కుల గణన నివేదికపై తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఈ నివేదికను ఆమోదించాలని భావించారు. అయితే ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా కొందరు అధికారులు, మంత్రులు ఆ నివేదికను ముందుగానే మీడియాకు లీక్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంలో సమన్వయం లేదని ప్రజలు భావించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. మ‌రో వైపు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల విష‌యంలో అన‌వ‌స‌ర‌పు వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది.  కాంగ్రెస్ నేత‌ జ‌గ్గారెడ్డి ఇటీవల మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేరు మ‌ర్చిపోవ‌టంపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ్గారెడ్డి కావాల‌నే రేవంత్ పేరు మ‌ర్చిపోయారా అన్న అనుమానాల‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లే వ్య‌క్తం చేస్తున్నారు. చూసేందుకు అది చిన్న‌విష‌య‌మే అయినా, సీఎం రేవంత్ ప‌ట్ల కాంగ్రెస్ నేత‌ల్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతుంద‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లుతుంద‌న్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టి ప్ర‌భుత్వాన్ని సీరియ‌స్ గా న‌డిపించాలంటే రేవంత్ రెడ్డి  రూటు మార్చాల‌న్న వాద‌న‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు గట్టిగా వినిపిస్తున్నారు.   వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హార‌లో   లైన్ దాటిని వారిపై కొర‌డాఝుళిపించాల‌న్న డిమాండ్ కాంగ్రెస్ నేతల నుంచి గట్టిగా వినిపిస్తోంది. 

తిరుమలలో అంగరంగ వైభవంగా మినీ బ్రహ్మోత్సవాలు

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన తరువాత శుద్ధ దశమిని   రథసప్తమిగా భావిస్తారు.  తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని మినీ బ్రహ్మోత్సవంగా పరిగణిస్తారు. తిరుమలేశుడు సప్తవాహనాలపై మాడ వీధులలో విహరిస్తారు. సూర్యోదయం నుంచి ఈ వాహన సేవ ప్రారంభమౌతుంది. అందులో భాగంగానే  మంగళవారం (ఫిబ్రవరి 4) తిరుమలేశుడు తిరుమల మాడ వీధులలో సూర్య ప్రభ వాహనంపై విహరించారు. రాత్రి 9 గంటలకు చంద్ర ప్రభ వాహన సేవతో రథ సప్తమి ఉత్సవాలు ముగుస్తాయి.  రథ సప్తమి ఉత్సవాలు ఒక తిరుమలలోనే కాకుండా   టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు తొమ్మిది ఆలయాలు, దేవుని కడప, ఒంటిమిట్ట కోదండరామాలయాల్లో కూడా ఘనంగా జరుగుతున్నాయి.  ఇక తిరుమలలో వేంకటేశ్వరస్వామి వాహన సేవల సమయం ఇలా ఉంది. సూర్యోదయం నుంచి ఎనిమిది గంటల వరకూ సూర్యప్రభ వాహన సేవ, ఉదయం 9 గంటల నుంచి చిన్న శేష వాహన సేవ, 11 గంటల నుంచి 12 గంటల వరకూ గరుడ వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ హనుమంత వాహన సేవ, రెండు గంటల నుంచి మూడు గంటల వరకూ చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ కల్ప వృక్ష వాహన సేవ, ఆరు గంటల నుంచి 7 గంటల వరకూ సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. ఇక చివరిగా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకూ శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. దాంతో తిరుమలలో రథ సప్తమి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ రథ సప్తమి ఉత్సవాలు ఒక్క తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే కాదు.. శ్రీవైష్ణవ ఆలయాలన్నిటిలోనూ ఘనంగా జరుగుతున్నాయి. రథ సప్తమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.   

ఎమ్మెల్సీ కిడ్నాప్? టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. డిప్యూటీ మేయర్ పీఠం కోసం తెలుగుదేశం కూటమి,వైసీపీలు సర్వం ఒడ్డి మరీ ప్రయత్నిస్తున్నాయి. ఇరు పక్షాలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోమవారం (ఫిబ్రవరి 3)జరగాల్సిన ఈ ఎన్నిక కోరం లేకపోవడంతో  మంగళవారం (ఫిబ్రవరి 4)కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్సీని తెలుగుదేశం కిడ్నాప్ చేసిందంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ను తెలుగుదేశం వారు సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయన నివాసం నుంచి తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ ఓటు కీలకం అయిన నేపథ్యంలో వైసీపీ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరో వైపు ఈ ఆరోపణలను తెలుగుదేశం ఖండించింది.   తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నికల్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమికి మద్దతు తెలిపారని, మరో ఆరుగురు కూడా కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా  ఉన్నారని తెలుగుదేశం చెబుతోంది.  తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 3) ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలను ఉటంకించిన తెలుగుదేశం  కార్పొరేటర్లను వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయించుకొని కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నించారని విమర్శించింది. 

ఏపీ సర్కార్ కు సోనూ సూద్ అంబులెన్సుల వితరణ

సోనూ సూద్ పరిచయం అక్కర్లేని పేరు. కరోనా సమయంలో ఆయన బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా వలస కార్మికులు తన సొంత ఊర్లకు వెళ్లడానికి ఆయన ఎంతో సహాయం చేశారు. అలాగే కరోనా కష్టకాలంలో ఆయన ఎందరికో అండగా నిలిచారు. ఆర్థిక భరోసా ఇచ్చారు. సొంత ఆస్తులను అమ్మి మరీ తన సేవలు కొనసాగించారు. కరోనా సమయంలోనే కాదు, ఆ తరువాత కూడా ఎవరైనా కష్టంలో ఉన్నారని తన దృష్టికి వచ్చిన వెంటనే తానున్నానంటూ సహాయ హస్తం అందించారు. అటువంటి సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన ట్రస్ట్ తరఫున అంబులెన్సులను అందించారు. సచివాలయంలో సోమవారం (ఫిబ్రవరి 3) ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకు అంబులెన్సులను రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా అందించారు. తన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సోనూ సూద్ ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు సాయంగా అంబులెన్సులను విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.  

టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో ఒక సారి డ్రగ్స్ కేసులో అరెస్టయిన సుంకర కృష్ణ ప్రసాద్ ఇటీవలి కాలంలో తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.   గోవాలో  ఓ హోటల్ గదిలో విగత జీవిగా ఉన్న ఆయనను చూసిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఇలా ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రీబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.  

సోషల్ మీడియాలో మోనాలిసా.. నెటిజన్లు ఫిదా!

మహా కుంబమేళాలో  తళుక్కుమని ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయిన తేనెకళ్ల సుందరి అలియాస్ మోనాలిసా భోస్లే ఇప్పుడు సినిమా హీరోయిన్ కూడా కాబోతున్నది. రాత్రికి రాత్రి వచ్చిన పాపులారిటీతో ఉక్కిరిబిక్కిరై మహా కుంభమేళా నుంచి వెళ్లిపోయిన ఆమెను బాలీవుడ్ వదల లేదు. కళ్లుతిప్పుకోలేని అందంతో మెరిసిపోయే ఆమెను వెండి తెరకు పరిచయం చేయడానికి బాలీవుడ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. త్వరలో ఆమె నటించబోయే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోయిన్  అయిన రేఖ పొలికలు ఒకింత ఉన్న ఆమెకు ఆమె తేనెకళ్లు ఎక్స్ట్రా ఎట్రాక్షన్ గా మారాయి. అందుకే ఆమెను బాలీవుడ్ వెతుక్కుంటూ వెళ్లి మరీ సినిమా చాన్స్ ఇచ్చింది. తన తొలి సినిమాతోనే పాపులర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కుమార్తెగా నటించే చాన్స్ కొట్టేసింది. ఇక విషయానికి వస్తే.. మోనాలిసా ఇప్పుడు తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు ఆమెను పాపులర్ చేసిన సోషల్ మీడియానే ఆశ్రయిస్తోంది. అంతే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ కు తగినట్లుగా సోషల్ మీడియాను వినియోగించుకుంటోంది.  తాజాగా సోమవారం ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. నెటిజనులను విపరీతంగా ఆకర్షించేసింది. ఇంతకీ ఆమె పోస్టు ఏమిటంటే.. అల్లు అర్జున్ నటించిన పుష్పా2 సినిమా పోస్టర్ పక్కన నుంచి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోనాలిసా భోస్లే..ఆ పోస్టుకు ఇప్పుడు పోస్టర్ పక్కన ఉన్నాను .. రేపు పోస్టర్ పై ఉంటాను అన్న క్యాప్షన్ ఇచ్చింది.  సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సృష్టించిన పుష్ప సినిమా2 క్రేజ్ ను తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు మోనాలిసా భోస్లే చక్కగా వాడుకుందని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు.