వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయం.. ఊహించని కొత్త మలుపులు!!

  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే సీఎం పదవి కోసం పట్టుబడుతున్న శివసేనకు బిజెపి నేతలు కొత్త ఆఫర్ ఇచ్చారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పదమూడు మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. సీఎం పదవితో పాటు ఇరవై ఆరు మంత్రి పదవులను బిజెపి తీసుకుంటోదని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నివాసంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ప్రతిపాదనలు తెచ్చారు. సీఎం పదవిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని బిజెపి నేతలు స్పష్టం చేశారు.  రేపు ఉద్ధవ్ థాక్రే నివాసంలో శివసేన ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్దవ్ థాక్రే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించాలని అనుకుంటోంది. శివసేన హ్యాండ్ ఇస్తే బీజేపీ మరొక ప్లాన్ కి కూడా సిద్ధం అయ్యింది. బీజేపీ టికెట్లు రాక రెబల్స్ గా పోటీ చేసిన పదిహెడు మంది స్వతంత్రులుగా విజయం సాధించారు. ఇప్పుడు వారందరినీ ఫడ్నవీసు మచ్చిక చేసుకుంటున్నారు. అదే సమయంలో నలభై ఐదు మంది శివసేన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బిజెపి ఎంపి సంజయ్ కాకడే ఓ బాంబు పేల్చారు.  కాగా కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు నిజంగానే తమ పార్టీ అధినేత పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన ఆదిత్య థాక్రే కోసం బీజేపీతో కయ్యం పెట్టుకోవటం వారు వ్యతిరేకిస్తున్నారని అందుకే అవసరమైతే జంప్ చెయ్యడానికి కూడా సిద్ధం అవుతారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అయితే శివసేన కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంటే కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతిస్తాయని వార్తలు కూడా ముంబైలో హల్ చల్ చేస్తున్నాయి.ఇక మహారాష్ట్రా రాజకీయాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి.

అధిష్టానం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య నలిగిపోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు...

  ఆర్టీసీ కార్మికుల సమ్మె అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కార్మికులను సమ్మె నుంచి విరమింపజేసి విధుల్లో చేర్చడం ఇబ్బందిగా మారింది. అటు కార్మికులను ఒప్పించ లేక ఇటు పార్టీ అధిష్టానం ఆదేశాలను కాదనలేక నేతలు సతమతమవుతున్నారు. డిపోల స్థాయిలో కొన్ని కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మంతనాలు జరిపిన ఎమ్మెల్యేలు హైకమాండ్ నుంచి కాల్స్ రావడంతో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ డిమాండ్ లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది జెఎసి. డిపోల ముందు నిరసనలు, ర్యాలీలు, మానవహారాలు, కలెక్టరేట్ల ముట్టడి, వంటా వార్పులతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణానూ మెరుగుపరిచామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కార్మికులు ఎవరైనా డ్యూటీలో చేరాలనుకుంటే డిపోలో అప్లికేషన్ పెట్టుకోవాలని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్. దీంతో కార్మికులు డ్యూటీలకు వస్తారని ప్రభుత్వం భావించింది. కానీ కార్మికులు నుంచి స్పందన రాలేదు. దీంతో కార్మికులతో సమ్మె విరమింపజేసి విధుల్లో చేర్పించే బాధ్యతను ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు సీఎం అప్పగించినట్లు తెలుస్తోంది. అధినేత సూచనలతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అయితే కార్మికులు సంఘాల నేతల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో అటు అధిష్టానం ఒత్తిడిని తట్టుకోలేక ఇటు కార్మికులను విధుల్లోకి చేర్పించలేక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. సీఎం చెప్పిన ఎమ్మెల్యేలు మంతనాలు జరిపినా ఇప్పటి వరకు రాష్ట్రం లోని ఏ డిపోలో కూడా కార్మికులు విధుల్లో చేరక పోవడం పై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా కార్మికులను విధుల్లో చేర్చాలని ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మాట్లాడితే రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారేమోనన్న భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. దీంతో కార్మికులతో ఫోన్ లో మాట్లాడేందుకు జంకుతున్నట్లు సమాచారం. కార్మిక సంఘాల నేతలను నేరుగా కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నా వారు అంగీకరించటం లేదని టాక్. ఆర్టీసీ సమ్మెతో తమ నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులున్నాయని కొందరు ఎమ్మెల్యేలు అనుచరుల దగ్గర చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేస్తుండటంతో తమను ఎక్కడ అడ్డుకుంటారోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల లాంటి అధికారిక కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు తమ జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పార్టీ అధిష్టానంతో విషయం చెప్పేందుకు జంకుతున్నట్లు చర్చ జరుగుతోంది.

వేడెక్కిన 'ఉండి' వైసీపీ రాజకీయం.. ఏం జరుగుతోంది?

  అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది. పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.

ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అవుతున్న మంత్రులు...

  వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రులు, రాష్ట్రానికి మంత్రులైనా వాళ్ల నియోజకవర్గాలు దాటి బయట కాలు పెట్టలేకపోతున్నారు. పక్క నియోజక వర్గాల్లో కూడా మంత్రులు తమ ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల రాకను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆధిపత్య పోరుతోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్యాప్ కు కారణంగా తెలుస్తోంది. నియోజక వర్గాల్లో మంత్రుల జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమ నియోజక వర్గాలకు మంత్రులు రావటాన్ని ఇష్టపడని కొంత మంది శంకుస్థాపనను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రికి పొసగడం లేదని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వాళ్లు మంత్రి వస్తే ఎలాంటి హడావుడి చేయొద్దని కార్యకర్తలు అనుచరులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సొంత నియోజక వర్గాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో హల్ చల్ చేసే మంత్రి తలసానికి ఇప్పటికే ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనయుడు ఓటమికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని చర్చ అప్పట్లో జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. వారు కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అటు ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత చెడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో మంత్రులు నియోజకవర్గాలకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అటు వైపు కూడా చూడడం లేదని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు ఎమ్మెల్యేలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితులపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

శ్రీవారి ప్రసాదాలను సామాన్యులకు మరింత చేరువయ్యేలా చేస్తున్న టిటిడి...

  తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న కొలువుదీరిన పవిత్ర పుణ్య క్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు శ్రీనివాసుని దర్శనానికి తిరుమలకు వస్తూ ఉంటారు. వెంకన్నకు మొక్కులు చెల్లించుకుని స్వామి వారి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలను సామాన్యులకు మరింత చేరువ చేయాలని నిర్ణయించింది టిటిడి. సిఫార్సు లేఖలపై మాత్రమే ఇచ్చే పెద్దలడ్డు, వడలను సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది టీటీడీ. నిత్య కల్యాణం, పచ్చతోరణం తిరుమల తిరుపతిలో ఇలా ప్రతి రోజూ జనసందోహమే. ఇక ప్రత్యేక పర్వదినాల్లో కొండకు వచ్చే భక్తుల సంఖ్య కోట్లల్లోనే ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వెంకన్నను దర్శించుకోవటం ఒకెత్తయితే స్వామి వారి ప్రసాదాలను దక్కించుకోవడం మరో ఎత్తు. సామాన్య భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంతో పాటు ఇంకా తెలియని ఎన్నో రకాల ప్రసాదాలను శ్రీవారికి రోజు వారీగా సేవలను బట్టి నివేదిస్తారు అర్చకులు. రోజూ రకరకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు, తర్వాత వాటిలో కొన్నింటిని మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. పూర్వం కేవలం మట్టి కుండలలో మాత్రమే శ్రీనివాసుడి ప్రసాదాలు వండేవారు. కాలక్రమంలో వాటి స్థానంలో ఇత్తడి గంగాళాలు వచ్చాయి, తిరుమల శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణ ఆవరణకు ఎదురుగా ఉన్నదే స్వామి వారి ప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణలో స్వామి వారి గర్భాలయానికి సరిగ్గా ఆగ్నేయ మూలకు శాస్త్రోక్తంగా మూడడుగుల రాతి అధిష్టానంపై అరవై ఒక్క అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పుతో విశాలమైన ఎత్తైన రాతి స్తంభాలతో వంటశాలను నిర్మించారు. అత్యంత ప్రాచీనకాలం నుంచి ఇదొక్కటే వంటశాల, శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాలు, పిండి వంటకాలు ఇలా అన్నీ ఈ వంటశాలలోనే తయారు చేసేవారు. భక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో విమాన ప్రదక్షిణంలోని ప్రాచీన వంటశాలను ప్రస్తుతం ప్రధానంగా ఉన్న ప్రసాదాలకు కూడా వాడుతున్నారు. ఇక పిండి వంటలైన లడ్డూ, వడ, అప్పం, దోసె, పోలి, సుఖియా, మురుకు, జిలేబి తదితర వాటి తయారీకి వెండి వాకిలి బయట సంపంగి ప్రదక్షిణంలో ఉత్తరం వైపు ఉన్న మండపాలను వంటశాలగా మార్చి వాడుతున్నారు. శ్రీవారి ప్రసాదాలు ప్రధానంగా చెప్పుకునేది లడ్డు ఇందులో రెండు రకాల లడ్డూలున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే నూట డెబ్బై ఐదు గ్రాముల లడ్డూ ఒకటి కాగా మరొకటి కల్యాణం లడ్డు ఇది వీఐపీలకు మాత్రమే ఇస్తారు. ఇక ఈ పెద్ద లడ్డూ ధర ఒకటే రెండు వందలు, వడ వంద రూపాయలు శ్రీ వారి సేవలలో దర్శించుకునే భక్తులతో పాటు సిఫార్సు లేఖలపై వచ్చే వారికి మాత్రమే వీటిని ఇస్తుంది టీటీడీ. అయితే ఈ పద్ధతిలో మార్పులు చేయాలని నిర్ణయించింది టీటీడీ. పెద్ద లడ్డూ, వడలు ఉత్పత్తి పెంచి సామాన్య భక్తులకు కూడా వీటిని అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం ఆలయం లోపల తూర్పు వైపున ఉన్న భగపడి అరలో పెద్దలడ్డూ, వడలు ఇస్తుంటారు. త్వరలో ఆలయం బయట పెద్దలడ్డూ వడలు విక్రయించాలని భావిస్తోంది టీటీడీ. భక్తుల రద్దీని బట్టి కల్యాణం లడ్డూలు వడలను తయారు చేయిస్తామంటున్నారు అధికారులు. లడ్డూల ఉత్పత్తి పెంచటానికి బోర్డును విస్తరించనుంది టీటీడీ. ఇప్పుడున్న ప్రాంతాన్ని మరింత పెంచుతాం అంటున్నారు అధికారులు.

ప్రభుత్వంపై సమర శంఖం పూరించనున్న ఆర్టీసి కార్మికులు...

  ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాల్టి సకల జనుల సమరభేరి సభతో తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించింది. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళికను రూపొందించింది, ప్రభుత్వంపై తమ పోరును ప్రత్యక్షంగా చాటుకోవాలని సర్కార్ తో అమీ తుమీకి సిద్ధమైంది ఆర్టీసీ జేఏసీ. ఇందు కోసం పోలీసులు సభకు అనుమతి లేదంటూ అడ్డంకులు సూచించినప్పటికీ కోర్టుకు వెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకుంది. కార్మిక జేఏసీ తలపెట్టిన బహిరంగ సభకు అన్ని పక్షాలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నిన్నటి వరకూ డిమాండ్ల పరిష్కారం కోసం వేర్వేరు తరహాలో నిరసన చేపట్టిన కార్మికులు ఇవాళ బహిరంగ సభ ద్వారా తమ స్వరాన్ని పెంచి ప్రభుత్వ ధోరణిని ప్రజలకు తెలియజెప్పాలని భావించారు. అయితే అనుకున్నట్లుగానే ఈ సభను సరూర్ నగర్ మైదానంలో భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్నారు జేఏసి నాయకులు. సభకు ఉద్యోగ విద్యార్థి జేఏసీతో పాటు లక్షలాది మందితో భారీగా నిర్వహించాలని నిర్ణయించారు. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేస్తున్నారు, సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో సభ ద్వారానే తమ సత్తా చాటాలని అనుకున్నారు. కానీ హై కోర్టు సూచనలతో ప్లాన్ అంతా తారు మారైంది. సభావేదిక సరూర్ నగర్ మైదానం నుంచి ఇండోర్ స్టేడియానికి మారింది, దీంతో ఆర్టీసీ జేఏసీ అప్పటి వరకూ వేసుకున్న అంఛనాలు పూర్తిగా మారిపోయాయి. కేవలం ఐదు వేల మంది పట్టే సామర్థ్యం కలిగిన స్టేడియంలో సభను ఏర్పాటు చేసుకోమనడంతో అంతర్మధనంలో పడ్డారు జేఏసీ నేతలు. అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలో సభ నిర్వహించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది. ఆర్టీసీ బకాయిలపై హై కోర్టు వ్యాఖ్యలు కార్మికుల ఉత్సాహం పెంచినప్పటికీ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించుకునేందుకు కుదరకపోవడంతో ఒకింత నైరాశ్యానికి లోనైనట్లుగా తెలుస్తోంది. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జేఏసీ చూస్తోంది. ఈ సభకు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారు, ఈ సభ నుంచే తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు ఆర్టీసీ కార్మికులు. సభకు పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ.. వైఎస్ కూడా ఇలా చేయలేదంటూ రేవంత్ పై ఫైర్!!

  తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. హుజూర్ నగర్ లో పార్టీ ఓటమిపై చర్చకు జరగగా  ఓటమికి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. ఇక పార్టీలో రేవంత్ దూకుడుపై సీనియర్ నేత వీహెచ్ ఇండైరెక్ట్ గా అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో కట్టు దాటిన వారి పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇచ్చేందుకు కోర్ కమిటీ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం గాంధీ భవనలో జరిగింది. కోర్ కమిటీ ఎజెండా అంశాలు ఆర్టీసీ కార్మికుల సమ్మె, మున్సిపల్ ఎన్నికలు అయినప్పటికీ మరి కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. సమావేశం ప్రారంభమవ్వగానే హుజూర్ నగర్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో కోర్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కు అండగా నిలిచినట్లు సమాచారం. నేతలెవ్వరూ ప్రకటించకుండానే ఓటమికి బాధ్యత తనదే అని ఉత్తమ్ తెలివిగా ప్రకటించారని మరో నేతకు నిలదీసే అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పార్టీలో క్రమశిక్షణపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం, కొంతమంది నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారట. ప్రగతి భవన్ ముట్టడి విషయంలో ముగ్గురు నేతలే నిర్ణయం తీసుకున్నారని గతంలోనే బాహాటం గానే విమర్శించిన వీహెచ్ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా క్రమశిక్షణ పేరుతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. వైయస్ కూడా ఎప్పుడూ సీఎం కాకముందు తన కార్యకర్తలతో సీఎం అనిపించలేదని కానీ పార్టీలో ఒక నేత సభలు సమావేశాల సమయంలో సీఎం అని తన కార్యకర్తలతో అనిపించుకుంటారని ఇది మంచి పద్ధతి కాదని నేత పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శించారని సమాచారం. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని సూచించారట. కుంతియా సైతం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు చెబుతున్నారు. ఇక కోర్ కమిటీ ఎజెండా ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్ ఏం చేయాలనే దానిపై నేతలు చర్చించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే మైనారిటీలకు, బీసీలకు యాభై శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ బాధ్యతలను నియోజక వర్గ ఇన్ చార్జిలకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఇక నియోజక వర్గ ఇన్ చార్జిలు లేని చోట వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తూ వారి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక కోర్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మోదీ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోందంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరు వల్లభ్ పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కేంద్ర వైఫల్యాలపై పోరు బాట పట్టాలని తీర్మానించారు. అందులో భాగంగా నవంబర్ ఐదున అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నవంబర్ పదిహేను న గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాద యాత్ర నిర్వహించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆర్టీసీ జేఏసీ తల పెట్టిన సభకు కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని కోర్ కమిటీ పిలుపు నిచ్చింది. సభకు పార్టీ పక్షాన నేతలు హాజరు కావాలని నిర్ణయించారు. మొత్తంగా కోర్ కమిటీ సమావేశం వాడి వేడిగానే జరిగినట్లు తెలుస్తోంది.

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఈయూ ఎంపీల బృందం

  జమ్ము కశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ ఎంపీలు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. స్థానికులు అధికారులతో పలు అంశాలపై చర్చించారు ఈయూ ప్రతి నిధి బృందం సభ్యులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో తొలిసారి విదేశీ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. బుధవారం కూడా కాశ్మీర్ లో ఈయూ బృందం పర్యటన కొనసాగనుంది. శ్రీనగర్ లోని చారిత్రక దాల్ లేక్ ను యూరోపియన్ల బృందం సందర్శించింది. దాల్ సరస్సు అందాలను చూసి ముగ్ధులయ్యారు యూరోపియన్లు. బోట్లలో కూడా వాళ్లు విహరించారు, స్థానిక వ్యాపారులతో కూడా బృందం పలు అంశాల పై చర్చించింది. శ్రీనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయన్న అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకు ఈయూ బృందం పర్యటనకు అనుమతి నిచ్చినట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. ఆర్మీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కూడా ఈయూ బృందం భేటీ అయ్యింది. కశ్మీర్ లో పాకిస్థాన్ చొరబాట్లను ఎలా ప్రోత్సహిస్తుందో, కుట్రలు చేస్తుందో కళ్ళకు కట్టినట్లు ఈయూ బృందానికి వివరించారు ఆర్మీ అధికారులు. అయితే ఈయూ ఎంపీల బృందం కశ్మీర్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ తో సహా విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్ష ఎంపీలు శ్రీనగర్ లో అడుగు పెట్టగానే అరెస్టు చేసిన కేంద్రం ఈయూ ఎంపీ బృందానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కశ్మీర్ లో విదేశీ ఎంపీలకు అనుమతులు ఇచ్చి తమను అడ్డుకోవడంపై పార్లమెంటులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి. రైట్ వింగ్ ఎంపీలకు ఎలా అనుమతిస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈయూ బృందం ఇప్పటికే ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఈయూ బృందానికి కేంద్రం వివరించింది. అంత వరకూ కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ల కోసం టీఆర్ఎస్ నేతల వేట...

  గులాబీ పార్టీ లో జోరు పెరిగి టిక్కెట్ల వేట మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు వారి నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వార్డ్ మెంబర్ నుంచి మేయర్ కుర్చీ దాకా ఎవరి లాబీయింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు బంపర్ మెజార్టీ రావడంతో మునిసిపాలిటీల్లో కూడా గులాబీ జెండాదే హవా అనే అంచనా అందరిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సమయం ముంచుకొచ్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ తో నవంబరు నెలాఖరు కల్లా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. దీంతో గులాబిదళంలో టిక్కెట్ల కోసం వేట మొదలైంది.  మున్సిపాటీలో వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొదలు మేయర్ కుర్చీ కోసం ఎదురు చూస్తున్న వారంతా వారి సీనియర్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు షురూ చేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు మొదలైంది. దీంతో మున్సిపాల్టీల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమనే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో పార్టీ టికెట్ దొరికితే చాలు పదవి వచ్చినట్లే అని భావిస్తున్న నేతలంతా పైరవీలు మొదలు పెట్టారు. ఒక్కో వార్డ్ నుంఛి దాదాపు డజను మందికి పైగా టీఆర్ఎస్ స్థానిక నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆశావహులంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతల అనుచరులే కావటంతో వచ్చిన దరఖాస్తులనూ ఫిల్టర్ చేస్తున్నారు. అయితే నూతన మున్సిపల్ యాక్టుపై అవగాహన ఉండి ప్రజల కోసం కష్టపడే వారికి ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెబుతున్నారు ఎమ్మెల్యేలు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్ లతో సహా అన్నింటికీ అన్నీ టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని విశ్వాసముంది. చాలా ఉత్సాహం తో ప్రజలందరూ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరు కూడా ఎదురు చుస్తునారు.  ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నాయకుల నియోజక వర్గాల్లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ పాత నేతలు కొత్త నేతల మధ్య టికెట్ ల కోసం పోటీ పెరిగిపోయింది. టికెట్ దొరికితే చాలు గెలుపు పక్కా అనే ధీమాతో ఉన్నారు. దీంతో తమ నాయకులపై ఒత్తిడి పెంచి ఎలాగైనా టికెట్లనూ దక్కించుకోవాలని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించాకే టికెట్లు దక్కుతాయి అని చెబుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కొత్తవి పాతవి కలుపుకొని వందకు పైగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే కొత్త మున్సిపల్ చట్టం పై అవగాహన ఉన్నవాళ్లు పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్లకు మాత్రమే టికెట్లు దక్కుతాయని అధిష్టానం సంకేతాలిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరికి టికెట్లు దొరుకుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో  'మొబైల్ టైలరింగ్'... పొట్టకూటి కోసం వీధుల్లో టైలరింగ్

  ఫోన్ లోనే అన్ని పనులూ అయిపోతున్నాయి. ఇలాంటి కాలంలో టైలర్ వద్దకు వెళ్లి బట్టలు కుట్టించుకొనే వాళ్ల సంఖ్య తక్కువే. అయితే టైలరింగ్ నే నమ్ముకున్న వాళ్లు మాత్రం అందులోనే జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. కొత్త బట్టలు కుట్టించుకోవాలంటే ఒకప్పుడు టైలర్ వద్దకే క్యూ కట్టేవారు. ఆ తర్వాత రెడిమేడ్ దుస్తుల హవా మొదలైంది. దీంతో షాపులకు నేరుగా వెళ్లి కొనుక్కునేందుకు అలవాటు పడ్డారు. ఇప్పుడేమో ఆన్ లైన్ జమానా నడుస్తోంది. మొబైల్ ఫోన్ లోనే షాపింగ్ చేసేస్తున్నారు. దీంతో టైలరింగ్ వృత్తిని నమ్ముకున్న వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. షాపుల్లోనే బట్టలు కుడదామంటే రోజు గడిచేలా లేదు. దీంతో టైలరింగ్ ను నమ్ముకున్న వాళ్లు రోడ్డెక్కుతున్నారు. బతుకు బండిని నడిపించేందుకు కష్టపడుతున్నారు. కొంత మంది రోడ్డు మీదనే కుట్టుమిషన్ పెట్టేశారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా తామూ మారక తప్పలేదని బతుకు జీవనం సాగిస్తున్నారు.  టైలరింగ్ వృత్తిని బతికించుకోవడమే కాదు పొట్టకూటి కోసం వీధుల్లో టైలరింగ్ చేసేస్తున్నారు. పొద్దున లేవగానే వాళ్ళు కుట్టు మిషన్ ను తీసుకొని రోడ్డు మీదకు వస్తారు. ఎక్కడైనా బట్టలు కుట్టేలా ఏర్పాట్లు చేసుకున్నారు. చౌరస్తాలో చెట్ల కింద బండిని ఆపుతారు. టైలరింగ్ సేవలని అందిస్తారు. అంటే ఇంటి వద్దకే టైలరింగ్ అన్నమాట. వీధిలలో టైలరింగ్ చేస్తున్న వారిలో శ్రీకాకుళం, విజయనగరం వాసులు ఎక్కువగా కనిపిస్తారు. అనాదిగా వీళ్ళది టైలరింగే ప్రధాన వృత్తి. దీంతో టైలరింగ్ ను వదులుకోలేకపోతున్నారు. పోటీ ప్రపంచంలో బతికేందుకు ఇలా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖలో అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు. మొబైల్ టైలరింగ్ చేసే కుటుంబాలు వైజాగ్ లో చాలా వరకు ఉన్నాయి. ఎదొరకంగా ప్రభుత్వమే ఆదుకోవాలని ఆర్థికంగా సాయం అందించాలని కోరుతున్నారు దర్జీలు. మారుతున్న కాలచక్రంలో మనం కూడా మారాలంటారు. అందుకే ఆదరణ కోల్పోతున్న ఈ టైలరింగ్ వ్యవస్థని బతికించుకోవడం కోసం వాళ్ళ బతుకు బండి లాగించడం కోసం ఈ మొబైల్ టైలరింగ్ విధానాన్ని కొత్తగా తీసుకువచ్చారు టైలరింగ్ వృత్తి దారులు.

తెలంగాణలో  భూ పంపిణీ పథకం కనుమరుగు అవ్వబోతోందా?

  తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయటం లేదు. ఎకరాకు సర్కారు ఇస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు రాష్ట్రంలో ఎక్కడా భూముల దొరక్క పోవడమే ఇందుకు కారణం. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సర్కారు దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను ఒకట్రెండు ఎకరాలున్న వారికీ మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్ సౌకర్యం, విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది. గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆరు వేల యాభై ఒకటి మంది దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రెండు వందల యాభై మూడు మందికి ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.  2014-15, 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాల కావడం, సాగు నీటి వసతి పెరగటం, రియలెస్టేటుతో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారని ఎస్సీ సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు పది లక్షలు వెచ్చించిన రాష్ట్రంలో ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేకపోవటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తాజాగా సర్కార్ కు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోళ్లు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. అయితే భూములు దొరికే పరిస్థితి లేకపోవటంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తోంది. టీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి మంగళం పాడినట్టే అనేలా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇలా అంటుంటే అధికారులు ప్రభుత్వం ఈ పథకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.దీని పై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి.

ఉత్తమ్ కి సోనియా గాంధీ ఇచ్చిన సూచనలు ఏమిటి?

  హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, ఢిల్లీలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది ఏం జరగబోతోంది అన్న దానిపై పార్టీ క్యాడర్ కూడా కొంత ఆసక్తి తోనే చూస్తోంది. ఢిల్లీ టూర్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల అంశంపై చర్చించారు. ఓటమికి గల కారణాలు సోనియా గాంధీకి వివరించారు ఉత్తమ్. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తా అని మేడమ్ కు చెప్పినట్టు సమాచారం. సోనియా గాంధీ వద్ద రాజీనామాపై చర్చ జరిగిన సందర్భంగా తొందరపడకుండా ఎదురు చూద్దాం, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని సోనియా గాంధీ చెప్పినట్లు సమాచారం. రాజీనామా అనే అంశంను  వాయిదా వేసుకోమని, ఇప్పుడెందుకు తర్వాత చూద్దాంలే అని సోనియా సూచించారట. ఆమె ఎంత చెప్పినా పార్టీకి కొత్త నాయకత్వం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అది ఇప్పటికిప్పుడు కాదనేది పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఉప ఎన్నికల ఫలితాలపై కొంత ఒత్తిడితో ఉన్నారు ఉత్తమ్. ఓ పది రోజుల పాటు బయటకు వెళ్లే ఆలోచనతో ఇదే అంశంపై సోనియా గాంధీ అనుమతి కూడా తీసుకున్నారట. చికిత్స కోసం పది రోజుల పాటు బెంగళూరు వెళుతున్నారని సమాచారం.ఇక ఉత్తమ్ తన తరవాత అడుగులు ఏం వేయాబోతున్నారు అనేది ఆశక్తికరంగా  మారిన అంశం.

వైసీపీ వ్యూహం నెరవేరబోతోందా..  చంద్రబాబుకి తిప్పలు తప్పవా?

  పోలీసులపై చంద్రబాబు బెదిరింపుల ధోరణి తో మాట్లాడుతున్నారని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనీ.. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో వైసిపి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఏమయిందో ఏమో అప్పటికప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు హడావిడిగా అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖిత పూర్వకంగా సంతకాలతో ఫిర్యాదు చేసి పోలీసులకు ఇచ్చి వెళ్లి పోయారు. ఆ తరువాత ఈ వ్యవహారంపై ఏం చేయాలి అనే అంశంపై అటు పోలీసులు ఇటు వైసిపి నేతలు తర్జన భర్జన అవుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి అందిన ఫిర్యాదు కావటంతో ఇదంతా రాష్ట్ర స్థాయి వ్యవహారమంటూ ఫిర్యాదు అందుకున్న అరండల్ పేట పోలీసులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కాపీని పంపి ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వైసిపి నేతలు కూడా ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు.  పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు ముస్తఫా, శ్రీదేవి, విడదల రజినీ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారు అన్న అంశంపై వైసీపీ నేతలు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు అటు వైసిపి నేతలు కూడా ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే విషయాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు తీసుకునే చర్యలు ఒకెత్తైతే రాజకీయంగా చంద్రబాబు పై ఇచ్చిన ఫిర్యాదు అంశం ఆ పార్టీ పెద్దల వద్ద చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని ముందుండి ఎలా నడిపించాలి అనే విషయాన్ని కూడా వైసీపీ నేతలు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి గుంటూరు శాసన సభ్యుడు ముస్తఫాకు పూర్తి బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు.మరో వైపున హోంమంత్రి కూడా జిల్లాకు చెందిన వారే కావడంతో పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాలను కూడా పోలీసులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఇందు కోసం పోలీసులు చట్ట పరంగా ఉన్న వ్యవహారాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ కు సంబంధించి రికార్డులను కూడా పూర్తి ఆధారాలతో సేకరించి వాటిని సాంకేతికంగా నిర్థారణ చేసిన తరువాతే ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. అటు రాజకీయంగా కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా తమదే పైచేయని చాటుకోవాలని చూస్తోంది అధికార పక్షం. మరోవైపు టిడిపి శ్రేణులు కూడా చంద్రబాబుపై పెట్టిన కేసు వ్యవహారంలో అధికార పక్షం కదలికలతో పాటుగా పోలీసుల చర్యలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. వైసీపీతో పాటు పోలీసు చర్యలను కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల మార్గాలను కూడా టిడిపి అన్వేషిస్తోంది. మొత్తం మీద చంద్రబాబుపై అధికార పక్షం చేసిన ఫిర్యాదు వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ రెండు పార్టీలతో పాటుగా పోలీసు శాఖలో కూడా కనపడుతోంది.ఇక ఈ అంశం ముందు ముందు ఎలాంటి చర్యలకు తావునిస్తుందో వేచి చూడాలి.

అసలైన నాయకుడిగా మన్నలను పొందుతున్న హరీశ్ రావు...

  తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాటలు విని అందరు నివ్వెరపోతున్నారు. సిద్ధిపేట అంటే హరీశ్ రావు, హరీశ్ రావు అంటే సిద్దిపేట. అంతగా ఆయన పేరు పక్కన ఈ ఊరు చేరింది. ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు అలవాటు. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా ఆయన దృష్టంతా తన నియోజక వర్గ ప్రజలు పైనే ఉంటుంది. అయితే ఆయనను కలిసేందుకు భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్యా ఎక్కువ గానే ఉంటుంది. ఈ విషయంలోనే హరీశ్ రావు కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చు పెట్టుకొని తనను కలవడానికి రావద్దని ఆదివారం తనను కలిసిన కార్యకర్తలకు సూచించారు హరీష్. ఏదైనా సమస్య ఉంటే సిద్ధిపేట్ లోనే తనను కలవాలని వారంలో నాలుగు రోజులు అక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు. పొద్దున్నే ఐదు గంటలకి లేచి ఏదో ఒక బండి పట్టుకొచ్చి పని కాకపోతే చాలా వరకు నష్టపోతారు.దీంతో పైసలు వేస్ట్ పని కాకపోతే టైం వేస్ట్ మనసు నొచ్చుకుంటారు. మీరు బాధపడితే నేను బాధపడతా ఎందుకు ఇవన్నీ అంటూ కార్యకర్తలకు హరీశ్ రావు సముదాయించి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోపై నెటిజన్ లు పెద్దయెత్తున స్పందిస్తున్నారు. నాయకుడు అంటే ఇలాగే ఉండాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. హరీశ్ రావు వైఖరికి అందరు అసలైన నాయకుడని ప్రశంశిస్తున్నారు.  

వైసీపీ నేతలకు కృష్ణా జలాల టెన్షన్ ఎప్పటికీ తీరుతుందో

  రాష్ట్రంలో వానలు సరిగా లేకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఒక వైపు ఎగువన కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఇప్పటివరకు ఏడుసార్లు గేట్లు తెరిచి నీరు విడుదల చేస్తున్నా.. ఆ ప్రాజెక్టు ఆధారంగా చేపట్టిన హంద్రీ నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఈ విషయం జిల్లా అధికార పార్టీ నేతల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే ఏడు సార్లు శ్రీశైలం గేట్లు ఎత్తి భారీగా నీరు సముద్రం పాలవుతున్న నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే  సాధారణ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉందా అనిపిస్తోంది. అక్టోబరు రెండో తేదీ నాటికి పుంగనూరు బ్రాంచి కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు ఇవ్వాలని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వద్ద జరిగిన సమీక్ష సందర్భంగా నిర్ణయించారు. అయినా అది ఇప్పటివరకు అమలు కాకపోవటంతో చిత్తూరు జిల్లా రైతాంగంలో ఆందోళన మొదలైంది. దానిపై ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి అమరనాథరెడ్డి సైతం అధికార పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నీళ్లు లేని సమయంలో నీళ్లు అందించామని నీళ్లు పుష్కలంగా ఉన్న ఇవ్వటానికి చేతకాలేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి పక్ష పార్టీ విమర్శలు పక్కనబెడితే జిల్లాలోని పడమటి మండలాల రైతులు నీళ్లు విడుదలలో జాప్యం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల్లోన్ని రైతులు స్థానిక ఎమ్మెల్యే నేతల వద్దకు వెళ్లి పలుమార్లు నీటి విడుదల అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఆ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలపై కృష్ణా జలాల ఎఫెక్ట్ బాగానే ఉన్నట్టుగా చెబుతున్నారు స్ధానికులు. ఎక్కడ కనిపించినా ఉన్న సమస్యలతో పాటు హంద్రీ నీవా నీటి విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావటాన్ని ఎమ్మెల్యేలు ఇబ్బందికరంగా ఫీలవుతున్నారనే టాక్ నడుస్తోంది. దాంతో కొందరు నేతలు నీటి విషయాన్ని జిల్లా మంత్రి పెద్దిరెడ్డి వద్దకు తీసుకువెళ్ళారు. ఈ నేపధ్యంలో దాదాపు వారం క్రితం జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ సమక్షంలో అనంతపురం చిత్తూరు జిల్లాల ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రెండు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ భరత్ గుప్తా పాల్గొని చిత్తూరుకు నవంబర్ పదిహేనున అనంతపురం జిల్లాలోని చెర్లోపల్లి జలాశయం నుంచి పుంగనూరు బ్రాంచి కాలువకు నీటిని వదలాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో నవంబరు పదిహేను నుంచి హంద్రీ నీవా జలాలు విడుదలకు రంగం సిద్ధం చేస్తామని చెబుతున్నా ఇప్పటికే పలుమార్లు నీటి విడుదల తేదీని మార్చడంతో ఈ సారైనా నీళ్లు వస్తాయా లేదా అన్న సందేహాలు జిల్లా రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇదే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఎలాగైనా ఈ సారి చిత్తూరు జిల్లాకు అందాల్సిన పన్నెండు టీఎంసీల వాటాను విడుదల చేస్తామని ధీమాగా ఉన్నారు అధికార పార్టీ నేతలు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం టైం దొరికినప్పుడల్లా హంద్రీ నీవా నీటి ఆలస్యంపై విమర్శల వర్షం కురిపిస్తోంది.

దర్శిలో మొదలైన కొత్త తరహ పాలన...

  సాధారణంగా నియోజకవర్గాల్లో పెత్తనమంతా ఎమ్మెల్యేలు చేస్తుంటారు. మండల స్థాయిలో అయితే స్థానిక ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులు హడావుడి చేస్తుంటారు. వీరితో పాటు అధికార పార్టీ మండల అధ్యక్షులు పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ పని భారం మనకెందుకులే అనుకున్నారో ఏమో మండలానికొక ఇన్ చార్జిగా తన అనుచరులను నియమించుకున్నారట. దర్శి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఎవరికి ఏ పని కావాలన్నా నేరుగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ ని కలవాల్సిన అవసరం లేదు. మండలాలకు నియమించిన ఐదుగురు ఇన్ చార్జ్ లను ఆయా మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ప్రజలు కలిసి తమ పని చేయించుకోవచ్చని ఎమ్మెల్యే చెబుతున్నారట. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ ప్రవేశ పెట్టిన ఈ కొత్త సాంప్రదాయానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అవాక్కవుతున్నారట. ఆ విధంగా మండలాలకు ఇన్ చార్జిల నియామకం నియోజకవర్గంలో చర్చనియాంశమైంది. దీనికి తోడు మండలాలకు ఇంచార్జిలుగా నియమించిన వాళ్లు దర్శి నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లు కావడంతో వైసిపి నాయకులు కార్యకర్తలు రగిలిపోతున్నారు.  2019 ఎన్నికల సమయంలో మద్దిశెట్టి వేణు గోపాల్ వైసీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపొందిన తరువాత కొద్ది రోజులు నియోజకవర్గంలో పర్యటించిన వేణుగోపాల్ మండలానికొకరిని ఇన్ ఛార్జిలుగా నియమించారట. ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా ఎవరికి కావాలన్నా మండల ఇన్ చార్జిలు ముందుగా ఆమోద ముద్ర వేయాలి. వైసీపీ ఆవిర్భావం నాటి నుండి పార్టీలో ఉంటున్న తమను కాదని బయట నియోజక వర్గాలకు చెందిన వారిని బండలకు ఇన్ చార్జులుగా నియమించడంతో పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. ఎన్నికల్లో గెలిపించిన తమను కాదని ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఇన్ ఛార్జిలుగా పెట్టి పెత్తనం చేయిస్తున్నారంటూ కొంత మంది నాయకులు నేరుగా వైసిపి ముఖ్యనేతలకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఉన్న వైసిపి నాయకులను పక్కన బెట్టి పక్క నియోజకవర్గానికి చెందిన వారిని ఇన్ ఛార్జిలుగా నియమించడం స్థానికంగా వివాదాస్పదమవుతోంది. మండల ఇన్ ఛార్జిల పెత్తనం వివాదం నియోజక వర్గ వైసిపిలో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.  

కోర్ కమిటీ భేటీలోనూ రేవంతే టార్గెట్... వైఫల్యాన్ని ముందే ఒప్పుకున్న ఉత్తమ్

హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఘోర పరాజయం తర్వాత తొలిసారి జరిగిన తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. సీనియర్ల హాట్ కామెంట్స్ తో సమావేశం ఫుల్ హీటెక్కింది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైనా... నేతలు మాత్రం తమ మనసులోని మాటను కుండబద్ధలుకొట్టినట్టు బయటిపెట్టారు. ప్రధానంగా పార్టీలో లోపిస్తున్న క్రమశిక్షణపై వీహెచ్ తదితరులు ఘాటుగా రియాక్టయ్యారు. పలువురు నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారని వీహెచ్ మండిపడ్డారు. ముఖ్యంగా రేవంత్ టార్గెట్ గానే వీహెచ్ కామెంట్స్ సాగాయి. ప్రగతిభవన్ ముట్టడి పిలుపును ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ ప్రశ్నించారు. గతంలో సీనియర్లు ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాకముందే.... కార్యకర్తల చేత సీఎం అని అనిపించుకోలేదంటూ రేవంత్ ను నేరుగా టార్గెట్ చేశారు. సభలు, సమావేశాల్లో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకుంటున్నారని వీహెచ్ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి కాకముందే... కార్యకర్తల చేత సీఎం అని పిలుపించుకోలేదని వీహెచ్ గుర్తుచేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలన్న వీహెచ్.... రేవంత్ ను మరోసారి టార్గెట్ చేశారు. ఇదిలాఉంటే, హుజూర్ నగర్ లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సమావేశం ప్రారంభమైన వెంటనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. దాంతో మిగతా నేతలంతా విస్మయానికి గురయ్యారు. అయితే, తనను ఎవరూ ప్రశ్నించే అవకాశం ఇవ్వొద్దనే ఉత్తమ్ ముందుగానే ఆ ప్రకటన చేశారని తెలుస్తోంది. ఇక, మున్సిపల్ వ్యూహంపై చర్చించిన కోర్ కమిటీ లీడర్లు... ముఖ్యనేతలకు మున్సిపాలిటీల వారీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు అండగా మరింత గట్టిగా పోరాటం చేయాలని, ప్రభుత్వ తప్పుడు లెక్కలను, నియంతృత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించారు.

బీజేపీ-శివసేన మధ్య పెరుగుతోన్న దూరం... మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్న కాంగ్రెస్-ఎన్సీపీ

మహారాష్ట్రలో ప్రభుత్వ ‎ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి కొనసాగుతోంది.  అధికారం చెరిసగమంటోన్న శివసేన... తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతోంది. బీజేపీతో అమీతుమీకి సిద్ధమైన శివసేన.... 50-50 ఫార్ములాపై వెనక్కి తగ్గేది లేదంటోంది. ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చిందని, మాటను నిలబెట్టుకోవాల్సిందేనని తన వాదనలకు మరింత పదునుపెట్టింది. అయితే, మరోసారి సీఎం పీఠాన్ని పంచుకునే ప్రసక్తే లేదంటోన్న బీజేపీ నేతలు... శివసేనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. 50-50 ఫార్ములాకు అసలు ఒప్పందమే జరగలేదంటోన్న బీజేపీ.... శివసేనపై ఎదురుదాడి చేస్తోంది. అంతేకాదు తమతో 45మంది శివసేన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు కలకలం రేపారు. అయితే, బీజేపీ నేతల కామెంట్స్‌కు అంతే ఘాటుగా రియాక్టయిన శివసేన....  ఇతర పార్టీలతో కలిసేలా తమతో పాపం చేయించొద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది. ఏదిఏమైనాసరే బీజేపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తేల్చిచెప్పారు. 50-50 ఫార్ములాకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్న ఫడ్నవిస్.... బీజేపీకి 10మంది ఇండిపెండెంట్స్ తోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపికి అనుకూలంగానే ప్రజా తీర్పు వచ్చిందని, అందుకు అనుగుణంగా త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. అయినా, ఎక్కువ సీట్లు సాధించే పార్టీకే సీఎం పదవి దక్కుతుందన్న ఫడ్నవిస్‌.... వచ్చే ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానంటా వ్యాఖ్యానించారు. ఇక. శివసేన సామ్నా పత్రికలో బీజేపీ వ్యతిరేక కథనాలు రాస్తున్నారని మండిపడ్డ ఫడ్నవిస్.... కాంగ్రెస్, ఎన్సీపీపై కూడా అలా రాయగలరా? ప్రశ్నించారు. ఫడ్నవిస్, ఇతర బీజేపీ నేతల కామెంట్స్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా అంతే ఘాటుగా రియాక్టయ్యారు. 50-50 ఫార్ములాకు ఎన్నికలకు ముందే బీజేపీ ఒప్పుకుందని, దాన్ని అమలుచేసి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. అంతేకాదు హర్యానా తరహా మోడల్ మహారాష్ట్రలో కుదరదని, ఇక్కడెవరూ దుష్యంత్‌లు లేరని శివసేన ఘాటు వ్యా‌ఖ్యలు చేశారు. 50-50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకుందని, ఆ మాట నిలుపుకోవాల్సిందేనని శివసేన అంటుంటే... అసలు తాము అలాంటి ఒప్పందమేమీ చేసుకోలేదంటూ బీజేపీ చెబుతోంది. దాంతో బీజేపీ, శివసేన మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది. అయితే, రెండూ పార్టీలూ ఇండిపెండెంట్లకు గాలమేస్తూ బలం పెంచుకునేందుకు పావులు కుదుపుతున్నాయి. ఇక, బీజేపీతో మైత్రికే శివసేన ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలను మాత్రం తోసిపుచ్చడం లేదు. దాంతో, మహారాష్ట్రలో ఏమైనా జరగొచ్చనే సంకేతాలను శివసేన పంపుతోంది. అదే సమయంలో, 45మంది శివసేన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు బాంబు పేల్చారు. దాంతో, మహారాష్ట్ర సీఎంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న కాంగ్రెస్-ఎన్సీపీ... అవసరమైతే శివసేనకు మద్దతు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నాయి.

కేసీఆర్ సర్కారుకు హైకోర్టు చీవాట్లు... గుక్కతిప్పుకోనివ్వకుండా వరుస పంచ్‌లు

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. గుక్కతిప్పుకోనివ్వకుండా మాటల తూటాలు పేల్చింది. వరుస పంచ్ డైలాగులతో ప్రభుత్వాన్ని దాదాపు షేక్ చేసింది. సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేమన్న హైకోర్టు.... బ్యూరోక్రాట్లు అతితెలివి ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తంచేసింది. సమస్యను తేల్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కార్మికుల డిమాండ్లలో కనీసం నాలుగింటిని పరిష్కరించి 47కోట్లు ఇస్తారా లేదా అంటూ సూటిగా ప్రశ్నించింది. అయితే, 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని, గడువిస్తే ప్రయత్నిస్తామన్న ప్రభుత్వ సమాధానంతో... హూజుర్ నగర్ కి వంద కోట్ల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. కేవలం ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులు వాస్తవాలను మరుగున పెడుతున్నారని, నిజాలను తెలివిగా దాస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లవుతున్నా, ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు పూర్తి కాలేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆర్టీసీ తొమ్మితో షెడ్యూల్ లో ఉండటం కారణంగా సాధ్యంకాలేదని ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఇక, తెలంగాణలో మొత్తం ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయో.... ప్రస్తుతం ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, 75శాతం బస్సులు తిరుగుతున్నాయంటూ ప్రభుత్వం సమాధానం చెప్పడంతో... అలాగైతే ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రశ్నించింది. ఇప్పటికీ మూడో వంతు బస్సులు తిరగడం లేదని, అందుకే ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పమనలేదన్న హైకోర్టు... ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ఆదేశించింది. ఇప్పటికే ఆర్టీసీకి 4వేల 253కోట్ల ఇచ్చామని ప్రభుత్వం చెప్పడంతో.... అయితే, మిగతా బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అంటూ హైకోర్టు నిలదీసింది. అలాగే, ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా కేటగిరైజ్ చేశారన్న హైకోర్టు..... బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధులకు డీఫాల్టర్ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు 335 కోట్లు చెల్లించారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పూర్తి వివరాలతో శుక్రవారం మరోసారి రావాలని ఆదేశించింది. ఇప్పటికే 15మది ఆర్టీసీ కార్మికులు మరణించారని, సమ్మె వల్ల ప్రజలు మాత్రమే కాకుండా 50వేల మంది కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇరువర్గాలకు సూచించింది.